Thursday, April 9, 2026

Chapter 7 Vishnu's sermon - అధ్యాయము 7 విష్ణుప్రబోధము

శ్రీ దేవీ భాగవతం ప్రథమస్కంధము - అధ్యాయము 7

విష్ణుప్రబోధము

సూతు డిట్లనియె: ఆ బలశాలురగు మధుకైటభ రాక్షసులను జూచి బ్రహ్మ సర్వతంత్రజ్ఞుడగుటవలన సామదానభేదదండో పాయములను గూర్చి యాలోచింపదొడంగెను: 

"వీరికి బలమెంతగలదో నిశ్చయముగ నాకు తెలియదు. కనుక నెదుటివాని బలాబలము లెఱుగక పోరుసలుపుట మేలుగాదు. దుర్మార్గులు మదమత్తులునగు వీరిని నేనిపుడు పొగడినచో నా చేతకానితనము నా చేతనే ప్రకాశింప చేయబడినట్లగును. నా దౌర్బల్యము బట్టబయలైనంతనే వీరిలో నొక్కడే నన్ను దునుమాడగలడు. వీరు దానముచేతను వశముగారు. ఇక వీరిపై భేదోపాయమునెట్లు ప్రయోగింపగలను? కాన నేనిపుడు శేషశయనుడగు భగవంతుని మేలుకొలుపుదును. ఆతడు మహాసత్త్వుడు - జనార్దనుడు - చతుర్భుజుడు - ఆతడే నా వెతలు బాపగలవాడు.'' 

ఈ విధముగ నెమ్మది దలంచి కమలాసనుడగు బ్రహ్మ వేగమే శోకనాశకుడు సర్వము తానయైనవాడు నగు వాసుదేవుని శరణు జొచ్చెను. ఆ జగత్పతి యోగనిద్రలో మునిగి కదలకుండెను. అట్టి నారాయణుని మేలుకొలుపుటకు బ్రహ్మ పలు మేలైన సంబోధనలతో హరి నిట్లు సంస్తుతించెను: 

"ఓ దీననాథా! శ్రీహరీ! మాధవా! వామనా! భక్తత్రాణపరాయణా! జగత్పతీ! మేలుకోగదవయ్యా! సర్వాంతర్యామీ! అమేయాత్మా! వాసుదేవా! విపక్షశిక్షా దక్షా! చక్రగదాధరా! విశ్వాధారా! హృషీకేశా! మేలుకోగదవయ్యా. సర్వజ్ఞా! లోకేశా! సర్వశక్తి సమన్వితా! శోకనాశనా! దీనపరిపాలకా! లేలెమ్ము-మేలుకోగదవయ్యా. ఓ విశ్వంభరా! విశాలాకారా! పుణ్యశ్రవణకీర్తనా! నిరాకారా! లోక సృష్టి స్థిత్యంతకారకా! మేలుకోగదవయ్యా! నీవఖిలాధారుడవే! నీకిదంతయును దెలియుటలేదా! శ్రీ మహావిష్ణో! శరణార్థిని దీనుని దుఃఖితుని నన్నే యుపేక్షించినచో నింకమీదట నీ పాలకత్వమునకు భంగము వాటిల్లదా?" అని పెక్కుభంగుల సన్నుతించినను హరి యోగనిద్రావశుడై మేల్కొనలేదు. అపుడు బ్రహ్మ మరల తన యెదలో నిట్లు తలంచెను:

"ఈ హరియొక మహాశక్తికి లోబడి యుండుటచేత యోగనిద్రకు వశుడయ్యెను. కనుకనే యీ ధర్మాత్ముడెంతకును మేల్కొనుట లేదు. నేను దిక్కు మొక్కు లేని దీనుడను. ఇపుడేమి చేయగలను? ఈ మదమత్తులు దానవులు నన్ను వెన్నాడి చక్కాడ దలచుచున్నారు. ఇపుడేమి చేతును? ఎక్కడికేగుదును? నాకభయమొసంగునాథుడే యింక లేడా?" ఇట్లు బ్రహ్మ తన మదిలో దలపోసిపోసి తుదకేకాగ్ర చిత్తముతో యోగమాయను సంతోషపఱచవలయునని నిశ్చయించుకొనెను. ఏ విశ్వశక్తి మూలమున హరి యచేతనుడై కదలకుండెనో, యా శక్తియే నను బ్రోవ సమర్థురాలగునని నిశ్చయించుకొనెను. ప్రాణము లేనివాడు శబ్దాది విషయము లెఱుగలేనట్లు యోగనిద్రలో నరమోడ్పు గన్నులవాడగు హరియు నేమియు నెఱుగలేకున్నాడు. ఇట్లెన్నెన్ని రీతుల కీర్తించినను హరి తనకూర్కును వదలుటలేదు. అందువలన కునుకితని వశమందులేదు. ఇతడే కున్కునకు వశీభూతుడయ్యెనని తోచుచున్నది. ఎవడెవని వశమున వర్తించుచుండునో వాడు వానికెల్లప్పుడు కింకరుడగును. ఈ కారణమున మాపతియగు హరికి యోగనిద్ర స్వామిని యగును. ఆ జలనిధి కన్యక సైతము హరిని తనవశమందుంచు కొనెను. కనుక నీ బ్రహ్మాండగోళములన్నియును సర్వశక్తుల కాదిశక్తియగు భగవతిచేతి కీలుబొమ్మలే. శ్రీహరి హరుడు రమ పార్వతి భారతి మేమెల్లరము నా శ్రీభగవతికి దాసానుదాసులమే. ఇందేమియు సందియము లేదు. ఆ హరియే సామాన్య మానవుని పగిది నిద్రా దేవతకు వశుడయ్యెను. ఇతర మహాత్ముల గుఱించి వేరుగ జెప్పెడి దేమి గలదు? కనుక నేనిపుడా యోగమాయనే ప్రస్తుతింతును. అపుడుగాని దేవి దయవలన హరి మేల్కాంచి వైరులతో సమరమొనరింపడు.''

అని యిట్లు పద్మాసనుడగు బ్రహ్మతలచి విష్ణునంగములందున్న యోగనిద్ర నిట్లు ప్రస్తుతింపదొడంగెను: 

"ఓ దేవీ ! నీవే యీ యెల్లజగముల కన్నతల్లివని వేదములు పలుకగా చక్కగా నిక్కువ మెఱింగితిని. ఎల్లలోకములను పరమ వివేకమున బాలించు పురుషోత్తముడే నీ ప్రభావమువలన నిపుడు నిద్రావశుడయ్యెను. నీ మోహన విలాసలీల లెవడెరుంగగలడు? హరియును వివశుడై నిదురించుచున్నాడు. నేను మూర్ఖుడను. సకల భూతహృదయములలో నిండియుండు చైతన్యజ్యోతి నీవే. నిర్గుణాత్మికవగు నీ ప్రతిభా ప్రభావములు విబుధకోటులలో నెంత కోవిదుడైన నెఱుగ జాలడు. సాంఖ్యులు నిన్ను పురుష ప్రకృత్యాత్మికగ చైతన్య భావరహితనుగ లోకజనయిత్రిగ భావింతురు. నీవు నిక్కముగ నట్టిదానవా? కావు. నీవు ముమ్మాటికి చైతన్యజ్యోతిఃస్రవింతివే. కనుకనే నేడు విష్ణువు నీ మూలముననే చైతన్యము లేక పడియున్నాడు. నీవు సగుణరూపములతో బహుభంగుల మాయా జగన్నాటక సూత్రధారివై తనర్తువు. నీ కార్యప్రణాళిక నెట్టివాడును గ్రహింపజాలడు. నిన్ను మునులు సంధ్యాదేవతవని పిలుతురు. వారు నీ దివ్యసుగుణములను రేయనక పగలనక నీమముతో ధ్యానించుచు జపించుచుందురు. కనుక నీ విజ్ఞాన వినోదలీల లనంతములు. 

ఓ జననీ! నీవే యెల్లజగములకు తెలివి వెలుగు జూపు జ్ఞానరూపవు. దేవతలకు నిత్యసుఖకారిణియగు శ్రీవి. సకల ప్రాణులందలి శ్రద్ధ-బుద్ధి-మతి-ధృతి-కీర్తి-కాంతి-రతి- యివన్నియు నీవే. ఇంతకు మిక్కిలిగ తర్కవితర్కములతో బనియేమి? లోకముల కన్నిటికి నీవే మూలకారణ శక్తివి. నాకు దుఃఖము గలుగుటకును హరి నిద్రాళుడై యుండుటకును నీవే కారణమని నాకు ప్రత్యక్ష ప్రమాణము గోచరించుచున్నది. వేదమాతా! నీవు వేదవిదులకే తెలియరావు. ఆ వేదములు సకలార్థములను వెల్లడించగలవు. ఐన నవి నిన్నెఱుగజాలవు. ఏలయన, నన్నియును వేదమాతవగు నీ నుండియే యావిర్భవించినవిగదా! ఇట్లు సర్వకార్యములు నాకు ప్రత్యక్షముగ దోచుచున్నవి. నీ చరితమును తుదముట్ట తెలిసినవా డెవ్వడు? ఆ వైకుంఠుడు కైలాసవాసి సురలు నా కొమరులగు మునులు నేను నీ మహోజ్జ్వలమహిమ నర్థము చేసికొననేరము. ఎల్ల లోకములకే నీ మహిమ యందరానిది. ఓ పరాదేవీ! యజ్ఞములందు 'స్వాహా' యని నీ నామధేయమే పలుకబడును. అట్లు పలుకనిచో నమరులకు వారి భాగధేయము వారికి లభించదు. కనుక నెల్లదేవతల బ్రతుకుదెరువులు నీ చేతిలోనే కలవు.

ఓ వరదాయినీ! తల్లీ! తొల్లిటి కల్పమందు నీవు నన్ను గాపాడితివి. ఇపుడీ ఘోర క్రూర దానవులను గన్నంతనే నా గుండె జలదరించుచున్నది. వారి భయమున నిన్నే శరణనుచున్నాను. నన్ను బ్రోవుము. ఈ సమయమున హరి నా మొఱ వినునట్టులేడు. అతని తనువు నీ వశమందే కలదు. కనుక నీవు హరి నిద్రా ప్రమత్తతను వదలింపుము. కాదేని యీ దానవులనైన హతమార్చుము. నే జెప్పనేల? నీ కెట్లు ఇష్టమైన అట్లు చేయుము. నీ యపార పరమప్రబావ మెఱుంగని మందమతులు హరిహరులనే కొలిచెదరు. ఆ విష్ణువే యిట వివశుడై నిద్రించుటచే నీ మహిమ నా కిపుడు ప్రత్యక్షముగ బోధపడినది. ఆ లక్ష్మియును నీ కధీనయే. కనుక నామెయును హరిని మేలుకొలుపజాలదు. ఆ లక్ష్మిని సైతము నీవే నీ శక్తితో నీ వశమందుంచుకొంటివని తలంతును. నీవే విశ్వజననివని కోర్కెలుకురియు కామధేనువవని భక్తిపరులు నిష్కామముగ నీ పదకమలములచే నమ్మి నీయందు లీనమై నిన్నే నిచ్చలు సేవింతురు. అట్టివారితరదేవతలను గొలువరు. అట్టివారే ధన్యులు. బుద్ధి కాంతి కీర్తి శుభవృత్తి మున్నగు దివ్యకల్యాణ గుణములు నీ యందే చోటుచేసికొని యున్నవి. ఆ విష్ణువు నందలి సద్గుణములు నే డేమయ్యెనో తోచుటలేదు. నీవు మానవతులలో వన్కెకెక్కినదానవు. అట్టి నీ నిద్రాశక్తికి హరి నేడు పరతంత్రు డయ్యెను. ఈ యెల్ల జగములందు నఖిల ప్రభావముగల పరాశక్తివి నీవే. నీ సంకల్పమాత్రముననే లోకము లన్నియును నిర్మింపబడినవి. నటుడు నాటకమందు స్వేచ్ఛగ విహరించును. నీవు నట్లే నీచే నిర్మితమగు మోహజాలమందు క్రీడించు చుందువు. మున్ను యుగాదియందు నీవే యీ విష్ణువును సృజించి యతినికి లోక రక్షణకై నీ విమల సత్త్వశక్తి నొసంగితివి. ఆతడే యిపుడిట వివశుడై యున్నాడు. నీవు సర్వపరిపాలన దక్షవు. నీ కేది మేలని తోచిన నదియే చేయును. నన్ను నీవే పుట్టించితివి. నన్ను నలుగురిలో నగుబాటుపాలు చేయుటకా? నీ యభిమతమిదియేనా? భవానీ! నీ యచ్చెరువుగొలుపు కార్యములను నేను కొంతకొంత యెఱిగితిని. ఈ యెల్ల భువనములను నీవే స్వతంత్రించి సృజించి యానందింతువు. తుదకు నీ యందే లయ మొనర్చుకొందువు. అట్లే యిపుడు నీవే నా చావు కోరుచున్నచో మంచిదే. ఇందు వింతలేదు. జగదంబికా! నన్ను నీవే వధించిన నాకు మేలే. నా కిక మరణదుఃఖమే యుండదు. మున్ను నీ చేతనే నేను సృష్టికర్తనుగ ప్రకటింపబడితిని. అట్టి నాకే యొక దానవుని చేతిలో చావుగలిగెననిన యపకీర్తి నీకే కల్గును. నీ కది గలుగకుండుగాక! నీవు వెనువెంటనే లెమ్ము. భీకరమూర్తివి గమ్ము. నీ కిష్టమైనచో రక్కసులనే చక్కాడుము. లేదా నన్ను నుగ్గాడుము. కాక హరిని నిద్దుర నుండి మేలుకొల్పుము. ఈ దనుజులను హరియే దునుమాడగలడు. ఇంతకీ సర్వకార్యములును నీ చేతనే సులభసాధ్యము లగును. 

సూతు డిట్లనియె : అని బ్రహ్మ యిట్లు తామసీదేవిని సంస్తుతించెను. దేవి వెంటనే నారాయణుని దేహమునుండి వెడలి యతనిచెంత నిలుచుండెను. ఇట్లు పరమదేవియగు యోగనిద్ర దనుజుల నాశనమునకై అతుల తేజోనిధియగు విష్ణుని దేహావయవములనుండి తొలగినది. అపుడు జనార్దనునకు స్ఫూర్తిగలిగి మేను మెల్లగ గదలెను. అది గనుంగొని బ్రహ్మ పరమానందభరితుడయ్యెను.

అధ్యాయము 8 సర్వశక్తి స్వరూపిణి యారాధ్య దేవతయనుట

No comments:

Post a Comment

Description of the five forms of Durga - దుర్గాదిపంచరూపవివరణ

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము -  దుర్గాదిపంచరూపవివరణ శ్రీకృష్ణుణ్ణి అవతరింపజెయ్యడంకోసం లోకజనని అయిదు రూపాలు ధరించింది. ఒక్కొక్క రూపానికీ మళ్ళ...