ఈ విధంగా కృష్ణుడి దుడుకు చేష్టల రహస్యాలను వ్యంగ్యంగా పేర్కొని, వెన్న దొంగతనం లీలగా చేసేవాడు, చక్కగా మాట్లాడే స్వభావంగలవాడు, తల్లి చేస్తున్న పనులను ఎంతో ఆశ్చర్యంగా చూస్తున్నవాడు, నుదుట ముత్యాల చేర్చుక్క గలవాడు అయిన చిన్ని కృష్ణుణ్ణి యశోద ఒక రోటికి కట్టివేసింది.
శుకమహర్షి పరీక్షిన్మహారాజును సంబోధిస్తూ ఓ రాజా! అలా ఆ చిన్ని కృష్ణుడు రోలుకు కట్టబడినప్పటికీ, భక్తులకు వశమైనవాడు కాబట్టి అతడు స్తంభానికి కట్టుబడి అధికమదంతో ఒప్పే ఒక ఏనుగుగున్నలా ఎంతో కాంతితో ప్రకాశించాడు.
(భద్రజాతి ఏనుగులకు గండస్థలంనుండి పాదాలవరకు ఎనిమిది స్థానాలలో మదజలం ఉంటుందని చెప్పబడింది. మదపుటేనుగులు అంటాం కదా! బాలకృష్ణుడు అటువంటి మదజలంతో కూడిన ఏనుగుగున్నలా వున్నాడట.)
ఓ రాజా! వెలుపల లోపల అనేది లేకుండా, ఆది మధ్యాంతాలు లేని విశ్వానికి తానే తుది, మొదలు, నడుమ, బయట, లోపల అయిన ఆ సర్వేశ్వరుణ్ణి యశోద భక్తురాలు కాకపోతే రోటికి కట్టడం సాధ్యమయ్యేదా?
యశోద తన చిన్ని కుమారుడు అందరి పిల్లల్లాంటి పిల్లవాడే అనే నిశ్చయంతో ఉంది కాబట్టే అతణ్ణి కట్టివేసింది కాని, ఆ చిన్నికృష్ణునిపొట్టలో సకలలోకాలూ ఉన్నాయని తెలిసినట్లయితే ఎందుకు కట్టివేస్తుంది?
భగవంతుడైన విష్ణువు నిత్యానపాయినిగా తననే అంటిపెట్టుకొని ఉన్న లక్ష్మీదేవి కౌగిలిలో చిక్కడు. యోగిగణములపాల కలడందురన్నట్లుగా బ్రహ్మమానసపుత్రులు పరమపవిత్రులు అయిన సనకాదియోగీశ్వరుల హృదయపద్మాల్లోనూ చిక్కడు. వేదపురుషుడంటున్నా ఆ వేదా లనేతీవలలోనూ చిక్కడు. అటువంటి ఆ సర్వేశ్వరుడు లీలగా తన తల్లిచేతికి చిక్కి రోటికి బంధింపబడ్డాడు.
యశోద వెంటనే తన ప్రియపుత్రుడైన శ్రీకృష్ణుణ్ణి రోలుకు కడదామన్న నిర్ణయంతో అతనిపొట్టకు ఒకతాడు తెచ్చి చుట్టగా అది రెండంగుళాలు తక్కువయింది. మరో తాడును చేర్చి చుట్టినా, అదీ రెండంగుళాలు తక్కువ కావడంతో, ఇంకో తాడును తెచ్చి దానితో చేర్చగా, అదికూడా రెండంగుళాలు తక్కువే అయింది. బాలుని కడుపు ఈ విధంగా--
యశోద ఇంట్లో వున్న తాళ్ళనన్నిటినీ కలిపి కృష్ణుని బొజ్జచుట్టూ చుట్టి పెట్టినా చాలలేదు. ఎల్లలోకాలనూ తన కడుపులో ఉంచుకున్న ఆ పరమాత్ముని పొట్టను కట్టడానికి సాధ్యమవుతుందా?
అలా ఎన్ని తాళ్ళు చేర్చినా బాలకృష్ణుని కడుపు చుట్టి రావడానికి చాలకపోవడంతో యశోద, దీన్నంతటినీ చూస్తున్న గోపకాంతలు అందరూ కూడా ఎంతో ఆశ్చర్యపోయారు. తరువాత
కొడుకు కనుక శిక్షించి బాగుచేయాలనే ప్రేమతో ప్రయత్నిస్తోంది - యశోద. ఆమె పడుతున్న శ్రమవల్ల ఒళ్ళంతా చెమట పట్టింది. పైట జారిపోయింది. కొప్పులో తురుముకున్న పూలు జలజల నేలమీద రాలిపోతున్నాయి. కట్ట శక్యం కాని తనను కట్టే ప్రయత్నంతో చింతిస్తున్న తల్లి యశోదమ్మను చూసి, పాపం కన్నయ్య కొంత జాలి చూపించి
రాజా! భగవంతుడు భవబంధాలను పోగొట్టేవాడు. అట్టివాణ్ణి బంధించే ప్రయత్నం శ్రమతో చేస్తున్న తల్లికష్టాన్ని గమనించి, తన ఆప్తులకు తాను బంధువు కాబట్టి, తల్లి కాబట్టి, తల్లి కట్టిన ఆ బంధానికి కట్టుబడ్డాడు.
విష్ణుమూర్తికి శివుడు స్నేహితుడైనా ఆ శివుడుకానీ, నిత్యానపాయినియై దేహన్నే అంటి పెట్టుకుని వక్షఃస్థలంపై అధివసించి ఉండే శ్రీమహాలక్ష్మికానీ, తన నాభికమలంనుండి పుట్టిన కుమారునిగా సంతోషించే ఆ బ్రహ్మకానీ, నందుని ఇల్లాలైన యశోదలా పరమేశ్వరుని దయకు పాత్రులు కాలేదు.
సర్వేశ్వరుడు తన భక్తులకు ఆధీనుడైనట్లు శ్రుతి, స్మృతి పురాణాది విజ్ఞానం కలవారిచేగానీ, మునీశ్వరులచే గానీ, దానగుణముండే దాతలైన ప్రసిద్ధి చెందినవారిచే గానీ, యమనియమాది అష్టాంగయోగమార్గాన్ననుసరించి ఉండేవారిచే గానీ పట్టుబడతాడా? పడడు.
అలా కృష్ణుని పొట్టకూ, రోలుకూ కలిపి కట్టిన తరువాత యశోద ఇంట్లో చేయవలసిన పనులలో మునిగిపోయింది. పూర్వం నారదుడు ఇచ్చిన శాపంవల్ల రెండుమద్దిచెట్లుగా నిలిచిపోయిన యక్షులైన నలకూబర మణిగ్రీవులను చూచి, ఆ చెట్ల సమీపానికి కృష్ణుడు తనకు కట్టబడిన రోటిని లాగుకుంటూ వెళ్లాడు - అని శుకమహర్షి చెప్పగా విని, పరీక్షిన్మహారాజు ఇలా అన్నాడు.
నారదుడు శపించాడన్నారు, నారదుడు ఎందుకు శపించాడు! ఆ నలకూబరమణిగ్రీవులిద్దరూ మద్దిచెట్లుగా రాపొందాల్సిన కారణం ఏమిటి? పరమయోగులకును పూజ్యుడవైన ఓ శుకయోగీంద్రా! నాకు ఈ విషయాన్ని తెలియజేస్తే వింటాను అని అడిగాడు - పరీక్షిన్మహారాజు.
పరీక్షిత్తుతో శుకమహర్షి ఇలా చెపుతున్నాడు. పూర్వం ఒకనాడు కుబేరుని కుమారులైన నలకూబరమణిగ్రీవులనే వారు శివునిసేవకులై సేవిస్తూ ఆ గర్వంతో కైలాసపర్వతంపై ఉన్న ఒక పూలతోటలో గానంచేసే గంధర్వకాంతలతో కలిసి, ఆడేనుగులతో కలిసిన మగఏనుగులవలె చక్కని ఆకాశగంగాతరంగాలలో క్రీడిస్తూ ఉండగా, నారదమహర్షి అక్కడకు వచ్చాడు. అప్పుడు ఆ కాంతలు గబగబా తమ తమ వస్త్రాలను ధరించారు. కానీ మద్యపానంవల్ల కలిగిన మత్తున్న వారు కాబట్టి ఆ ఇద్దరూమాత్రం దిగంబరులుగానే కనిపించారు. నారదమహర్షి వారిద్దరినీ శపించాలనుకొని ఓ ప్రసిద్ధమైన గీతాన్ని గానంచేశాడు. ఆ గీతం విను.
లోకంలో ధనవంతుడైనవాడు ఎదుటివారిని ఏ మాత్రం గుర్తించడు, గౌరవించడు. తన దేహం, తన కుటుంబం అంటూ అవే శాశ్వతమనుకుని, ఎదుటివారిని బాధిస్తాడు. పేదవాడైతే ఎండిన, నీరసించిన శరీరంతో కృశిస్తూ అయినా సరే ఎవరినీ హింసించకుండా ఇతరులందరూ తనతో సమానులే అనే భావంతో చూస్తాడు. కనుక ధన మదాంధులైనవారికి దారిద్య్రమే చక్కని అంజనం అవుతుంది.
పైవిధంగా సంపన్నునికి, పేదవానికీ గల భేదాన్ని తెలిపే పాటను పాడిన తరువాత నారదుడు తన మనస్సులో
ఈ నలకూబరమణిగ్రీవులిద్దరూ ధనపతియైన కుబేరునికొడుకులమనే గర్వంతో, ప్రేయసులతో గూడి స్వప్నంలో సైతం ఎవరినీ లక్ష్యపెట్టడం లేదు. కాబట్టి వీరికేర్పడిన ఈ మదాన్ని పోగొట్టి, ఉత్తములగువారితో కలిసేటట్లు చేయడమే యుక్తమనుకున్నాడు - నారదుడు.
(లోకంలో సాధారణంగా 'మత్తు'కలిగించే వాటిలో ధనం ప్రధానం. అందుకే ధనమదాంధులంటారు.
యౌవనం ధనసంపత్తిః ప్రభుత్వం అవివేకితా ।
ఏకైకమప్యనర్థాయ కిము యత్ర చతుష్టయమ్? ।। అన్నది హితోపదేశం
యౌవనం, ధనం, అధికారం, అవివేకం ఒక్కొక్కటే అనర్థాన్ని కల్గిస్తాయి. ఇక నాల్లూ ఒకేచోట ఉంటే చెప్పేదేముంది? సర్వనాశనం తప్పదు.)
విశేషజ్ఞాని అయిన నారదమహర్షి పైన చెప్పిన విధంగా ఆలోచించినవాడై నలకూబరమణిగ్రీవులతో 'మీరిద్దరూ స్త్రీల సంగమం అనే మత్తుచేత ఏమీ కానలేని గుడ్దివారుగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి మీరు భూలోకంలో మద్దిచెట్ల రూపం పొంది, దేవతల కాలమానంలో ఒక వంద సంవత్సరాలు అలా వుండి, అనంతరం శ్రీకృష్ణపరమాత్మ పాదస్పర్శతో శాపవిమోచనం పొంది, దుర్విషయాలనుండి దూరమై శ్రీమన్నారాయణుని భక్తులుగా, చక్కని స్వభావరూపసంపదకలవారై తిరిగి దేవలోకనివాసులవుతారు'.
వారిద్దరినీ శపించి, శాపావసానవిషయంకూడా చెప్పి, నారదమహర్షి నారాయణాశ్రమానికి వెళ్ళిపోయాడు. ఆ నలకూబరమణిగ్రీవులిద్దరూ రెండుమద్దిచెట్లుగా మారారు. భగవద్భక్తులలో శ్రేష్ఠతముడైన నారదుడన్న మాటలను వ్యర్థమైనవిగా భావించకుండా, వాటినెంతో ఆదరించి
No comments:
Post a Comment