ఆ కపట బాలుడైన కృష్ణుడు మద్దిచెట్లను కూల్చి, నలకూబర మణిగ్రీవులను శాపంనుండి విముక్తులను చేసేలా, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ మద్దిచెట్లున్న చోటికి రోటిని ఈడ్చుకుంటూ ఒక ప్రయత్నంగా వెళ్లాడు.
సహజ సిద్ధంగా మహాబల సంపన్నుడైన ఆ బాలకృష్ణుడు తన పొట్టకు కట్టిన తాడును లాగడంవల్ల అడ్డంగా తిరిగిన రోటితో ఆ రెండు మద్దిచెట్లమధ్యలో ప్రవేశించి ముందుకు సాగుతూ
ఎప్పుడైతే శ్రీకృష్ణుడు చెట్లకు అడ్డంగా తిరిగిన రోటిని ముందుకు ఈడ్చుకుంటూ వెళ్తున్నాడో, నారదుడు చెప్పిన ప్రకారం శ్రీకృష్ణునిపాదారవిందస్పర్శ కలగడంతో, శాపావసానాన్ని పొందిన ఆ జంటమద్దిచెట్లు మూలం పెల్లగిలి కొమ్మలు విరిగిపడుతూండగా గొప్ప భయంకరధ్వని చేస్తూ నేల కూలాయి.
ఈ విధంగా వేళ్ళతో సహా పెకలింపబడిన ఆ మద్దిచెట్లు నేలకూలగా, ఆ చెట్లలో నుండి అగ్నిశిఖలు వెలువడినట్లు మిక్కిలి ప్రకాశంతో దిక్కులు పిక్కటిల్లేలా ప్రసిద్ధులైన ఇద్దరు దేవజాతికి చెందిన సిద్దులు బయటకు వచ్చారు. అలా వచ్చి, ముందటి జ్ఞానంతో భక్తుల పాలిట రక్షకుండైన ఆ బాలకృష్ణమూర్తికి నమస్కరించి, లేచి, హస్తపద్మాలను జోడించి, అంజలి ఘటిస్తూ ఇలా అన్నారు.
నారదశాపంనుండి విముక్తిపొందిన వారిద్దరూ, శ్రీకృష్ణుణ్ణి ఇలా స్తూతిస్తున్నారు. ఓ కృష్ణా! నీవు బాలుడివి కావు. అణువుకంటె అణువుగా, మహత్తుకంటె మహత్తుగా ఉండే పరబ్రహ్మవు. నీకు నీవే కాని వేరే ఆధారం అక్కరలేనివాడివి. విశ్వస్థితికి నీవే మూలపురుషుడివి. ఈ సూక్ష్మస్థూల రూపమైన, చరాచరమైన ఈ జగత్తు నీ విలాసరూపమని జ్ఞానులైనవారు భావిస్తారు.
ఓ కృష్ణా! ఈ సృష్టిలో అన్ని జీవరాసులకూ, సర్వేంద్రియ, అహంకార, ప్రాణాలకూ అధిపతివి నీవే! ప్రకృతి స్వరూపుడవు నీవే! దానినుండి పుట్టిన మహత్తత్త్వానివీ నీవే! వీటన్నిటికీ అధిపతివీ నీవే! ప్రకృతి సంబంధ గుణాలవల్ల ఏ వికారాన్నీ పొందక వాటి కన్నింటికీ ముందే ఉన్నవాడివి నీవు. ప్రాకృతగుణాలతో కూడినవాడు వాటికతీతుడవైన నిన్నేవిధంగా ధ్యానం చేయగలడు? నీవు గుణాతీతుడవు. నీలో ఉన్న గుణాలతో నీవు కప్పబడి రహస్యంగా వుంటావు. శరీరాలు ధరించిన ఎవరూ నీ మత్స్యకూర్మాది అవతారవైభవాలకు సాటిరారు. ఈ జీవులంతా నీ తేజస్సుతో పుడతారు. కనుక నీవు వాళ్లకు అంతు చిక్కవు. సాటిలేని ప్రభావం కలవాడవగుటచే వారిలా చిక్కులలోపడి, సంకటపడక చరించే సర్వోత్కృష్టుడవైన నీకు నమస్కరిస్తున్నాము.
ఈ లోకాలన్నింటిని స్పష్టించడానికి, రక్షించడానికి అవతరించావు. నీవు అంతటికీ ఈశ్వరుడవు. యోగిగణాలలో శ్రేష్ఠుడవు. లోకకల్యాణకారకుడివి. కవీశ్వరులచే సన్నుతింపబడేవాడివి. సకలలోకాలూ నీలో, సకల లోకాల్లో నీవూ ఉన్నావు. జగత్కల్యాణకారక గుణాలకు ఆధారభూతుడివి.
భుక్తులపాలిట మిత్రుడా! ఓ శ్రీకృష్ణా! నారదమహాముని మాటలు (శాపవాక్యాలు) తప్పకుండా నిజమే అయ్యాయి. ఆ శాపం నిమిత్తంగానే నిన్ను దర్శింపగలిగాం. మేము నీ కోసం చేసిన తపస్సు ఫలించింది. మా యిద్దరినీ నీయందు ప్రపత్తి గల భక్తులుగా అనుగ్రహించు.
ఓ కృష్ణమూర్తీ! నీవు మాయందు కరుణతో - మా చెవులెప్పుడూ నీ స్తోత్రాలే వినెేటట్లుగా, మా వాక్కులు నీకు సంబంధించిన మాటలే మాట్లాడేటట్లుగా, చేతులు రెండూ నీకు సంబంధించిన కైంకర్యాదులే పనులే చేసేటట్లుగా, నీ దివ్యమంగళ మూర్తిపైనే మా చూపులుండేటట్లుగా, నీ చరణాల చెంతనే మా శిరస్సులెప్పుడూ మొక్కేలా, మా మనస్సులు నిన్నే సేవించేలా, నీపైనే మా బుద్ధులుండేలా, మమ్ములను అనుగ్రహించు.
పై రీతిగా తనను సోత్రం చేసిన ఆ నలకూబరమణిగ్రీవులతో రోటికి కట్టబడే ఉన్న శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు.
లోకంలో తమ తమ వర్ణాశ్రమాలకు విధింపబడిన ధర్మాన్ని వీడకుండా అందరియందునూ, సమదృష్టి కలిగి నన్నే నమ్మివుండే యోగ్యతగలవారికి, సూర్యోదయంకాగానే ఎంత దట్టమైన చీకటైనా ఎలా పటాపంచలవుతుందో అలాగే నన్ను దర్శించగానే వారి బంధాలన్నీ తొలగిపోతాయి. అంటే ముక్తులవుతారు.
ఓ నలకూబరమణిగ్రీవులారా! దయామయుడైన నారదుడు శపించినా, మీయందు అనుగ్రహించిన కారణంగా, మీరు నన్ను చూడడంతో శాపంనుండి తొలగినవారయ్యారు. నన్ను భావించే బుద్ధికూడా మీకు లభించింది. ఇది యథార్థం.
పై రీతిగా చెప్పిన పిమ్మట శ్రీకృష్ణుడు నలకూబర మణీి(గ్రీవులతో మీరు మీస్థానాలకు వెళ్ళండి అని ఆజ్ఞాపించగా, గొప్ప అనుగ్రహం అంటూ, వారిరువురూ స్వామికి ప్రదక్షిణం చేసి, ఎన్నో నమస్కారాలుచేసి, తమ తండ్రి వుండే ఉత్తర దిక్కునగల తమ నివాసస్థానాలకు వెళ్ళిపోయారు. ఇదంతా జరిగిన పిమ్మట నందునితో పాటు అక్కడున్న గొల్లలందరూ మూలంతోసహా పెల్లగిలి పడిన ఆ మద్దిచెట్ల ధ్వనిని విని, పిడుగు పడిన చప్పుడుగా భావించి, అక్కడకి వచ్చి చూశారు.
అక్కడకు వచ్చి చూచి, నందాదులు ఇలా అంటున్నారు. ఈ మద్దిచెట్లు నేలకూలగా, ఈ చిన్ని కృష్ణుడు రోటికి కట్టబడివున్నవాడై ఎలా బ్రతికిపోయాడో! ఇతడెట్టివాడో! ఇంత చిన్నవాడైనా ఈ సంఘటనకు ఏడవలేదు, భయపడలేదు, చూశారా?
కూలిన చెట్లను చూచి వారిలా అనుకుంటున్నారు. పిడుగేమో పడలేదు, పోనీ పెద్దగా గాలి వీచిందా అంటే అదీ లేదు. ఎవరైనా చెట్లను నరికి వేసినట్లూ లేదు. వీడు చూస్తే చిన్న పిల్లవాడు, ఆ చెట్లను పట్టుకొని నేలకూల్చే శక్తి లేనివాడు, మరి ఆ చెట్లు భూమిమీద ఎలా కూలిపడ్డాయి?
పైవిధంగా అక్కడున్న అందరూ తలోరకంగా ఇవేవో అపశకునాలని అనుమానించగా, అక్కడే ఉన్న చిన్న పిల్లలు వాళ్ళతో ఇలా అన్నారు.
ఈ నందకుమారుడైన బాలకృష్ణుడు మద్దిచెట్ల మధ్యలో దూరి, తనకు కట్టిన రోటిని సరిగ్గా ఆ చెట్ల మధ్యలో అడ్డంగా వచ్చేటట్లుచేసి ముందుకు లాగగా ఈ చెట్లు పెద్దధ్వనితో అట్టహాసంగా విరిగిపడ్డాయి. అక్కడ ఇద్దరు మనుష్యులను మేము చూశాం. మామాట వినండి అన్నారు.
చెట్లు కూలిన సమయంలో అక్కడ వున్న బాలకులు అలా చెప్పగా, అక్కడున్నవారిలో కొందరు ఇదంతా అబద్ధం అన్నారు. మరికొందరు అనేక విధాలుగా సందేహించారు. అప్పుడు నందుడు వికసించిన పద్మంలా ముఖాన్ని సంతోషంతో నింపుకొని, కొడుకైన కృష్ణుని నడుముకు, రోటికి కట్టిన ఆ కట్టును విప్పాడు. ఇదంతా చూస్తున్న ఆ మాయాబాలకృష్ణుడు తన ఈ అద్భుతకార్యం సంగతి ఎవరూ తెలుసుకోకూడదని
తన మాయారూపాన్ని ఎవరూ గుర్తించకుండా, ఆ బాలకృష్ణుడు ఏమీ తెలియని అమాయకుడిలా పాటలు పాడతాడు. గోపికలు చప్పట్లు కొడుతూవుంటే కీలుబొమ్మలా ఒళ్ళు తెలియనట్లు తానూ చేతులు తిప్పుతూ ఆడతాడు. చూడడం తెలియనివాడిలా చుట్టూవున్నవాళ్ళను చూస్తాడు. ఊరకే నవ్వుతాడు, తన తోటి బాలకులతో చేరతాడు, పెద్దలు చెప్పిన పనులన్నీ చేయడానికి వెళతాడు, మట్టిలో గంతులువేస్తూ, దాగుకుంటాడు.
సాధారణంగా పిల్లలు పాలు తాగడానికి, అన్నం తినడానికి అల్లరి చేస్తుంటారు. అలాగే కృష్ణుడు పాలుతాగడానికి అల్లరి చేస్తుంటే తల్లి యశోద పాలు నీవు తాగావంటే జుట్టు బాగా పెరుగుతుంది అంది. దాంతో పిల్లవాడు పాలు తాగి 'ఏదీ జుట్టు పెరగలేదే' అంటూ కొంటెగా తన జుట్టు చూపాడు.
బాలకృష్ణుడొక రోజు పశులను తోలే ఒక సెలగోల పట్టుకొని, నీళ్ళకుండలో తన నీడను చూపుతూ, అమ్మా! అవడో బాలుడు సెలగోలపట్టుకొని నన్ను కొడదామనుకుంటున్నాడు అంటూ తల్లికి తన ప్రతిబింబాన్ని చూపి, చెప్పాడు.
ఓ పరీక్షిన్మహారాజా! చిన్ని కృష్ణుడు అల్లరి, మారాంచేస్తూ, ఏడుస్తూ వుంటే ఇలా చేస్తే బిచ్చగాండ్రు వచ్చి నిన్ను వాళ్ళ బిచ్చం పట్టే జోలిలో వేసుకొని భయపెట్టి దండిస్తారు సుమా! అనగానే బిచ్చగాండ్రను, యశోదనూ చూస్తూ బాలుడు భయపడ్డాడు.
No comments:
Post a Comment