Sunday, December 29, 2024

KIM KARISHYAAMI కిం కరిష్యామి కిం కరోమి బహుళ

 కిం కరిష్యామి కిం కరోమి బహుళ


తాళం: ఆది
రాగంశుద్ధవసంతం (మేళకర్త 21, కీరవాణి జన్యరాగ )
రూపకర్త: అన్నమాచార్య

ఆరోహణ: స గ2 మ1 ద1 ని3 స
అవరోహణ: స ని3 ద1 ప మ1 గ2 రి2 స

పల్లవి
కిం కరిష్యామి కిం కరోమి బహుళ
శంకాసమాధానజాడ్యం వహామి ||

చరణము
నారాయాణం జగన్నాథం త్రిలోకైక
పారాయణం భక్తపావనం |
దూరీకరోమ్యహం దురితదూరేణ సం
సారసాగరమగ్నచంచలత్వేన ||

తిరువేంకటాచలాధీశ్వరం కరిరాజ
వరదం శరణాగతవత్సలం |
పరమపురుషం కృపాభరణం న భజామి
మరణభవదేహాభిమానం వహామి||

KAMADHENUVIDE కామధేను విదే కల్పవృక్ష మిదే

 కామధేను విదే కల్పవృక్ష మిదే



కామధేను విదే కల్పవృక్ష మిదే
ప్రామాణ్యము గల ప్రపన్నులకు ||

హరినామజపమే ఆభరణంబులు
పరమాత్మునినుతి పరిమళము |
దరణిదరు పాదసేవే భోగము
పరమంబెరిగిన ప్రపన్నులకు ||

దేవుని ధ్యానము దివ్యాన్నంబులు
శ్రీవిభు భక్తే జీవనము |
ఆవిష్ణు కైంకర్యమే సంసారము
పావనులగు యీ ప్రపన్నులకు ||

యేపున శ్రీవేంకటేశుడే సర్వము
దాపై యితని వందనమే విధి |
కాపుగ శరణాగతులే చుట్టాలు
పై పయి గెలిచిన ప్రపన్నులకు ||

ARRI MURRI HANUMANTHUDATTI BANTU అఱి ముఱి హనుమంతుడట్టిబంటు

 అఱి ముఱి హనుమంతుడట్టిబంటు


తాళం : ఆది
రాగం : శ్యామ (మేళకర్త 28, హరి కాంభోజి   జన్యరాగ )
రూపకర్త : అన్నమాచార్య


ఆరోహణ : స రి2 మ1 ప ద2 స
అవరోహణ: స ద2 ప మ1 గ3 రి2 స


పల్లవి:
అఱి ముఱి హనుమంతుడట్టిబంటు
వెఱుపు లేని రఘువీరునికి బంటు ||

చరణము:
యేలికను దైవముగా నెంచి కాల్చేవాడే బంటు
తాలిమిగలిగిన యాతడే బంటు
పాలు మాలకయే పోద్దుపని సేయువాడే బంటు
వేళగాచుకవుండేటి వెరవరే బంటు||

చెప్పినట్లనే నడచిన యాతడే బంటు
తప్పులేక హితుడై నాతడే బంటు
మెప్పించుక విశ్వాసాన మెలుగువాడే బంటు
యెప్పుడును ద్రోహిగాని హితుడే బంటు||

కాని పనులకు లోనుగాని వాడే బంటు
అనాజ్ఞ మీరనియాతడే బంటు
నానాగతి శ్రీ వేంకటోన్నతుడైన యతనికి
తానిన్నిటా దాసుడైన ధన్యుడే బంటు

ARASINANNU GACHINATHANIKI SARANU అరసినన్ను గాచినాతనికి శరణు

 అరసినన్ను గాచినాతనికి శరణు


తాళం: ఆది
రాగం: మళహరి  (మేళకర్త 15, మాయ మాళవ గౌళ  జన్యరాగ )
రూపకర్త: అన్నమాచార్య

ఆరోహణ: స రి1 మ1 ప ద1 స
అవరోహణ: స ద1 ప మ1 గ3 రి1 స

పల్లవి
అరసినన్ను గాచినాతనికి శరణు
పరము నిహము నేలే పతికిని శరణు||

చరణము
వేదములు దెచ్చినట్టివిభునికి శరణు
ఆదిమూలమంటే వచ్చినతనికి శరణు
యేదెసా తానైయున్న యీతనికి శరణు
శ్రీదేవి మగడైన శ్రీపతికి శరణు||

అందరికి ప్రాణమైన అతనికి శరణు
ముందు మూడు మూర్తుల మూర్తికి శరణు
దిందుపడి దేవతల దేవునికి శరణు
అంది మిన్ను నేలనేకమైన తనికి శరణు||

తానే చైతన్యమైన దైవానకు శరణు
నానాబ్రహ్మాండాలనాథునికి శరణు
అనుక శ్రీ వేంకటాద్రి యందునుండి వరములు
దీనుల కిందరి కిచ్చే దేవునికి శరణు||

Saturday, December 28, 2024

తిరుప్పావై - పద్నాల్గవ పాశురము

తిరుప్పావై - పద్నాల్గవ పాశురము


శ్రీ గురుభ్యోనమః

జై శ్రీ కృష్ణ

జై శ్రీమన్నారాయణ

నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం
పారార్థ్యం స్వం శ్రుతి శత శిర స్సిద్ధ మధ్యాపయంతీ!
స్వోచ్ఛిష్టాయామ్ స్రజినిగళితమ్ యా బలాత్కృత్య భుంక్తే
గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః


ప్రియ భగవత్ బంధువులారా! 

ఈ రోజు 14.వ. పాశురం

ఉంగళ్ పుళక్కడై తోట్టత్తు వావియళ్
శెంగళు నీర్ వాయ్ నెగిళిందు ఆమ్బల్ వాయ్ కూంబినగాణ్
శెంగల్ పొడిక్కూరై వెణ్పల్ తవత్తవర్
తంగళ్ తిరుక్కోయిల్ శంగిడువాన్ పోగిన్రార్
ఎంగళై మున్నమ్ ఎళుప్పువాన్ వాయ్ పేశుమ్
నంగాయ్! ఏళుందిరాయ్! నాణాదాయ్ నావుడైయాయ్!
శంగొడు శక్కరమ్ ఏందుం తడక్కైయన్
పంగయక్కణ్ణానై ప్పాడేలోరెంబావాయ్ || 14 || 

ఒక గోపిక! ముందుగా వచ్చి మమ్మల్ని లేపుతాను అని మాట ఇచ్చిన పరిపూర్ణమైన వనితా! నిద్రపోతున్నావా నువ్వు. మీ పెరట్లోని దిగుడుబావిలోని ఎర్రకలువలు వికసించేయి. నీలికలువలు ముడుచుకున్నాయి. అంటే తెల్లవారింది అనడానికి సంకేతం. కాషాయవస్త్రములు ధరించిన, తెల్లని పలువరుస గల వారు తమ తమ ఆలయములకు తలుపులు తెరిచి భగవంతుని ఆరాధన కోసం కుంచెకోలను తాళములు తీసుకుని వెళుతున్నారు. ఇవన్నీ తెల్లవారింది అనడానికి సంకేతాలు. ఓ తీయగా మాట్లాడేదానా! శంఖం, చక్రం ధరించిన వాడు, విశాలమైన హస్తములు కలవాడు, పుండరీకాక్షుడు అయిన శ్రీ కృష్ణుని కీర్తించుటకు లేచి రావమ్మా!ఈవిధంగా గోష్ఠిగా సంకీర్తనము చేసిన మన వ్రతము ఫలించగలదు. కాబట్టి వెంటనే మేలుకో!

ఎవరికిష్టమైన రీతిగా వారు శ్రీరాముని, శ్రీకృష్ణుని గుణగణాలను కీర్తించారు గోపికలు. తన నేత్ర సౌందర్యానికే అబ్బురపడి శ్రీకృష్ణుడే తన వద్దకు రాగలడని తలచిన సౌందర్యవతియైన గోపికను మేల్కొలిపారు క్రిందటి (పాశురంలో) ఇప్పుడు ఊరినంతటిని ఒకే త్రాటిపై నడిపించగలిగే సమర్ధత కలిగిన నాయకురాలైన ఒక గోపికను ఆండాళ్ తల్లి (యీ పాశురంలో) లేపుతున్నది. తానే వచ్చి అందరినీ మేల్కొల్పుతానని బీరాలు పల్కి, ఇంకా నిద్రపోతుంది ఈ గోపిక. తన పెరట్లోని దిగుడుబావిలోని కలువలూ, తామరలనూ చూచుకొని మురిసిపోతున్నదీమె. ఈ మధురానందంలో మునిగి తాను చేసిన బాసలను మరిచిపోయినది. ఈమె భగవదనుభవానంద సాగరంలో మునిగి ఇతర విషయాలను మరిచి, ఆ ఆనందానుభూతిలోనే నిమగ్నయైన యిట్టి గోపికను (యీ పాశురంలో) మేల్కొలుపుతున్నది మన ఆండాళమ్మగారు.

ఈ తిరుప్పావై పాసురం యొక్క అంతర్గత, అంతర్లీన అర్ధం

చెరువులో సూచించిన పువ్వులు జ్ఞాన నివాసాల వైపు చూపుతాయి. ఒకడు తన గురువును చేరుకోగానే, అతని హృదయంలోని అజ్ఞానం నశించి, అత్యున్నతమైన జ్ఞానాన్ని గురించిన అవగాహన వికసిస్తుంది.

అజ్ఞానాన్ని నీలిరంగు కలువతోనూ, ప్రకాశాన్ని ఎర్ర కమలంతోనూ పోల్చారు.

ఆచార్యుడు జ్ఞానానికి నిలయం. ప్రకాశించే దుస్తులను ధరించి, వారు పరమాత్మ గురించి తమ అంతర్గత అవగాహనపై దృష్టి పెడతారు. శంఖం ఊదడం వారి శిష్యులకు (విద్యార్థులకు) జ్ఞానాన్ని వ్యాప్తి చేసే చర్య.

గోదా దేవి మరియు గోపికలు నిద్రపోతున్న బాలికకు (ఆధ్యాత్మికంగా వారి కంటే ఉన్నతమైన) తన భగవంతుని అనుభవాలను వారికి అందజేస్తానని వాగ్దానం చేసినట్లు గుర్తు చేశారు.

ఇక్కడ "నా నాదాయ్" మరియు "నావుడయ్యాయ్" అనే పదాల సాహిత్యపరమైన అర్థం తీసుకోరాదు. నంగై నిరాడంబరమైన వ్యక్తిని సూచిస్తుంది కాబట్టి నిరాడంబరమైన వ్యక్తి స్వార్థపూరితంగా లేదా మోసపూరితంగా ఉండలేడు. వారు చెడు లక్షణాల నుండి విముక్తి కలిగి ఉంటారు మరియు వారి అవగాహనా మరియు ఆహ్లాదకరమైన స్వరంతో ఇతరులపై విపరీతమైన ప్రభావాన్ని కలిగి ఉంటారు.

శ్రీకృష్ణుడు మనలను అజ్ఞానం నుండి వెలుగులోకి తీసుకెళ్తాడని గోదా దేవి ఇక్కడ చెబుతుంది, అతను జ్ఞానం ద్వారా ప్రజలను రక్షించడానికి మరియు ఆశీర్వదించడానికి చేతిలో శంఖం మరియు చక్రం పట్టుకున్న పరమాత్మ. 


ఆండాల్ తిరువడిగళే శరణం


LAKSHMI NRUSIMHA HOMAM - లక్ష్మీ నృసింహ హోమం

లక్ష్మీ నృసింహ హోమం

శ్రీ లక్ష్మీ నరసింహ హోమం అనేది హిందూ ఆచారం, ఇది విష్ణువు యొక్క అవతారమైన నరసింహునికి, లక్ష్మీ దేవితో పాటుగా, రక్షణ మరియు శ్రేయస్సు యొక్క మిశ్రమ శక్తిని సూచిస్తుంది. అడ్డంకులను తొలగించడానికి, సవాళ్లను అధిగమించడానికి, శత్రువుల నుండి రక్షించడానికి మరియు సంపద మరియు అదృష్టాన్ని ఆకర్షించడానికి ఇది చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది మరియు తరచుగా నిర్వహించబడుతుంది ఆర్థిక ఇబ్బందుల సమయంలో లేదా ప్రతికూల శక్తుల నుండి రక్షణ కోరుకునే సమయంలో.నారాయణుని నాల్గవ అవతారం అయిన శ్రీ నరసింహ భగవానుడు స్వాతి నక్షత్రం రోజున ప్రత్యక్షమయ్యాడు. 

శ్రీ లక్ష్మీ నరసింహ హోమం గురించిన ప్రాముఖ్యత:

ఈ హోమం రక్షణ మరియు బలాన్ని అందించే నరసింహ స్వామిని మరియు సంపద, శ్రేయస్సును ప్రసాదించే లక్ష్మీ దేవి అనుగ్రహం కోసం ఈ హోమం చేస్తారు.

శ్రీ లక్ష్మీ నరసింహ హోమం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు:

దుష్ట శక్తుల నుండి రక్షణ, ప్రతికూల శక్తులు మరియు దుర్మార్గపు ప్రభావాలకు వ్యతిరేకంగా శక్తివంతమైన కవచంగా పరిగణించబడుతుంది.

ఆర్థిక స్థిరత్వం, ఆర్థిక ఇబ్బందులను అధిగమించి సమృద్ధిని ఆకర్షించడంలో సహాయపడుతుంది

చట్టపరమైన రక్షణ మరియు సవాళ్లను ఎదుర్కొంటున్న వారికి ప్రయోజనకరంగా ఉండవచ్చు

జీవితంలోని అడ్డంకులను అధిగమించడానికి శక్తిని మరియు దృఢనిశ్చయాన్ని అందించగలదు

కొంతమంది హోమం మంచి ఆరోగ్యాన్ని మరియు మొత్తం శ్రేయస్సును ప్రోత్సహిస్తుందని నమ్ముతారు.

నరసింహ పూజ వలన కలిగే లాభాలు ఏమిటి?

నరసింహ స్వామికి పూజ చేయడం వలన దుష్ట శక్తుల నుండి రక్షణ, అడ్డంకుల తొలగింపు, మెరుగైన ఆరోగ్యం, శ్రేయస్సు, ప్రయత్నాలలో విజయం మరియు చివరికి ఆధ్యాత్మిక జ్ఞానోదయం మరియు విముక్తి వంటి అనేక ఆధ్యాత్మిక మరియు భౌతిక ప్రయోజనాలు లభిస్తాయని నమ్ముతారు.

ఏ నరసింహ మంత్రం శక్తివంతమైనది?

ఓం ఉగ్ర సింహాయ నమః 

ఈ మంత్రం రక్షణ, ధైర్యం మరియు బలం కోసం భగవంతుడు నరసింహుని అనుగ్రహాన్ని కలుగుతుంది. ఇది ప్రతికూల శక్తులను పోగొట్టడంలో సహాయపడుతుంది. మరియు దైవిక దయను అందిస్తుంది.

నరసింహ ఎందుకు అంత శక్తిమంతుడు?

హిరణ్యకశిపుని చంపడానికి మరియు బ్రహ్మ ఇచ్చిన వరాన్ని భంగపరచకుండా ఉండటానికి, నరసింహ రూపాన్ని ఎంచుకున్నారు. హిరణ్యకశిపుని మానవుడు, దేవత లేదా జంతువు చంపలేడు. నరసింహుడు వీరిలో ఎవరూ కాదు, ఎందుకంటే అతను విష్ణువు యొక్క స్వరూపుడు-మానవుడు మరియు పాక్షిక-సింహం వలె అవతరించాడు.

నరసింహుడిని పూజిస్తే ఏం జరుగుతుంది?

ప్రదోష కాలంలో నరసింహ స్వామిని పూజించడం అత్యంత శ్రేయస్కరం. నరసింహ ప్రపత్తి అనే శ్లోకాన్ని పఠించడం వలన అన్ని రకాల చెడులు మరియు సమస్యల నుండి మనల్ని రక్షణ కవచంలా చేస్తుంది మరియు శాంతి మరియు శ్రేయస్సును ఇస్తుంది. ప్రజలు ఇంట్లో లక్ష్మీ నరసింహ మరియు యోగ నరసింహుడిని పూజించవచ్చు, కానీ దేవాలయాలలో మాత్రమే ఉగ్ర నరసింహుని పూజించవచ్చు.


Friday, December 27, 2024

తిరుప్పావై - పదమూడవ పాశురము

తిరుప్పావై - పదమూడవ పాశురము


శ్రీ గురుభ్యోనమః

జై శ్రీ కృష్ణ

జై శ్రీమన్నారాయణ

నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం
పారార్థ్యం స్వం శ్రుతి శత శిర స్సిద్ధ మధ్యాపయంతీ!
స్వోచ్ఛిష్టాయామ్ స్రజినిగళితమ్ యా బలాత్కృత్య భుంక్తే
గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః


ప్రియ భగవత్ బంధువులారా! 
పరమపవిత్రమైన, దివ్యమైనటు వంటి తిరుప్పావై శ్రీ వ్రతాన్ని మనం ఎంతో ఘనంగా, భక్తి ప్రపత్తులతో ఆనందంగా జరుపుకుంటున్నాం. ధనుర్మాసంలో తిరుప్పావై శ్రీ వ్రతాన్ని ప్రారంభించినప్పుడు ముందుగా పరాశర భట్ఠార్యులవారు మనకు అందించినటువంటి ఒక తనియన్, ఒక శ్లోకాన్ని ముందుగా అనుసంధానం చేయటం ఒక సాంప్రదాయంగా ఉంది. ఇదే సంప్రదాయాన్ని మనం కూడా పాటిస్తూ ఈ శ్లోకంలో ఆండాల్ తల్లి అనుభవించినటువంటి ఆనందాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకొని ముందుకు వెళ్దాం.

ప్రియ భక్తులారా!

నిన్న 12వ పాశురంలో ఒక గోపికను లేపారు. కృష్ణుడు గుణగణాలను మాని, రాముడి గుణగణాలను పాడారు. ఈరోజుఈ 13వ పాశురంలో ఒక అద్భుతమైన విశేషం ఉంది. ఇప్పటివరకు నందవ్రజంలో ఉన్న గోపికలందరూ ఐకమత్యంతో ఉంటూ ఈ వ్రతాన్ని ప్రారంభించారు. కానీ మధ్యలోనే రెండు వర్గాలుగా విడిపోయారు. ఎందుచేత? వ్రతం చేయవలసిన స్థలానికి వెళ్ళి వారందరూ రాముడి యొక్క విధానాన్ని కీర్తించడం మొదలుపెట్టారు. అందరూ వెళ్ళినప్పుడు మనం వెళ్లకపోతే బాగుంటుందా! అందుకే మనం కూడా వెళదాం పదండి….

కొందరు రాముడు వర్గం. మరి కొందరు కృష్ణుడు వర్గం.

తెన్ని లంగై క్కోమానై శెట్ర
మనత్తుక్కు ఇనియానై పాడవుం

ఒకనాడు దక్షిణ దిక్కున ఉన్న లంకకు రాజైనరావణాసురుడుని రాముడు కోపంతో సంహరించాడు. అలాంటి రాముడి నామాన్ని, ఆ శ్రీరామచంద్రుడు నామాన్ని మేము కీర్తిస్తున్నాం. అని బయటి గోపికలు లోపల గోపికలతో అంటున్నారు. అప్పుడు కొంతమంది గోపికలు అంటున్నారు ఏమర్రా! మీకు బుద్ధి లేదా! విశ్వాసం లేదా! మనం ఉంటున్నది ద్వాపరయుగంలో శ్రీ కృష్ణుడు అవతరించినటువంటి యుగంలో. శ్రీకృష్ణుడు పెరుగుతున్న రేపల్లెలో. తెల్లవారి లేస్తే శ్రీకృష్ణుడితో ఆడుకుంటున్నాం, పాడుకుంటున్నాం. ఆపద నుంచి శ్రీకృష్ణుడు మనల్ని రక్షిస్తున్నాడు. అలాంటి శ్రీకృష్ణుడి గురించి మానేసి ఎప్పుడో త్రేతాయుగంలో ఉన్నటువంటి రాముడు గురించి పాడతారా? ఏం త్రేతాయుగంలో ఎవరైనా కృష్ణుడి గురించి పాడేరా? రామ నామం తప్ప ఇంకేమైనా ఉందా!

(వాళ్ల అమాయకత్వం గాని మనలో మన మాట... త్రేతాయుగంలో కృష్ణుడేంటండీ! )

అంటూ గోపికలు అందులో రెండు వర్గాలుగా విడిపోయారు. కాకపోతే ఇక్కడ భగవంతుని కోసం రెండుగా విడిపోయి దెబ్బలాడుకుంటున్నారు. నా కృష్ణుడు గొప్ప అంటే నా రాముడు గొప్ప అని. రాముడు గొప్ప ఏంటమ్మా అని ఒక గోపిక అడిగినదానికి ఇంకొక గోపిక సమాధానం చెబుతుంది.

రామ గోపిక : రాముడు తండ్రి మాట జవదాట లేదు. పితృవాక్య పరిపాలకుడు. దశరథుడు తన కొడుకైన రాముని పిలిచి రేపు నీకు పట్టాభిషేకం చేస్తామని చెప్పాడు. సరే మీ ఆజ్ఞ అన్నాడు రాముడు. మర్నాడు ఉదయం లేచి పట్టాభిషేకం నీకు కాదు నువ్వు అడవికి వెళ్ళి పోవాలి అన్నాడు. దానికి కూడా సరే అన్నాడు రాముడు. అది రాముడు గొప్పతనం. రాజ్యాధికారం వస్తే సంతోషించ లేదు. అరణ్యవాసానికి వెళ్ళమంటే విచారించలేదు.

రాముడు పితృవాక్య పరిపాలకుడు. మరి మీ కృష్ణుడో;

కృష్ణ గోపిక : మా కృష్ణుడు పుట్టినప్పుడే తండ్రి మాట విన్నవాడు. తను పుట్టినప్పుడే శంఖ చక్రాలతో పుట్టాడు. అది చూసి వసుదేవుడు భయపడ్డాడు. ఎక్కడ ఈ విధంగా ఈ శంఖ చక్రాలతో వున్నవాడిని చూస్తే.. కంసుడు ఎక్కడ చంపేస్తాడో అన్న భయంతో వసుదేవుడు విష్ణువుని ప్రార్థించాడు సామాన్య రూపం ధరించమని. అప్పుడు శ్రీకృష్ణుడు మామూలు బాలుడు లాగా అయిపోయాడు. చూసావా! మీ రాముడు 16 సంవత్సరాల వయసులో తండ్రి మాట విన్నాడు. కానీ మా కృష్ణుడు పుట్టీ పుట్టగానే తండ్రి మాట విన్నాడమ్మా!

ఇలా ఎవరికి వారు మా రాముడు గొప్ప అని కొందరు, మా కృష్ణుడు గొప్ప అని కొందరు.అంతలో ఒక ముసలి గోపిక (ముసలి గోపిక అంటే అనుభవజ్ఞురాలు). ఏమిటమ్మా మీ ఇద్దరి గోల? రాముడు కృష్ణుడు ఇద్దరూ ఒకటే కదర్రా ! ఇద్దరూ విష్ణుమూర్తి అవతారమే కదా! మీకు దీనికి ఒక ఉదాహరణ కూడా చెబుతాను వినండి. ఒకసారి చిన్ని కృష్ణుడు..బాలకృష్ణుడు నిద్ర పోవడానికి యశోద ఉయ్యాలలో పడుకోబెట్టింది. ఇప్పుడు చిన్నపిల్లలు పడుకోవాలంటే తల్లి ఏదో కథ చెప్తే ఊ కొడుతూ నిద్రపోతారు. అలాగే యశోద కృష్ణుడికి రాముడు కథ చెప్తుంది.

కృష్ణుడు ఊ కొడుతున్నాడు.

రాముడు మంచి బాలుడు

ఊ…

రాముడు భార్య సీత

ఊ….

రాముడు, లక్ష్మణుడు, సీత అడవికి వెళ్ళారు.

ఊ….

రావణుడు మారు వేషంలో వచ్చి సీతను ఎత్తుకుపోయాడు.

ఇప్పుడు కృష్ణుడు ఉలిక్కిపడి లక్ష్మణా! నా ధనుర్భాణాలు తీసుకురా! ఆ రావణాసురుణ్ణి చంపేస్తాను. అని ఉద్రేకపడ్డాడు. చిన్నతనంలోనే, బాలుడిగా ఉన్నప్పుడే, పసిబిడ్డగా ఉన్నప్పుడే. దీన్నిబట్టి మనకు తెలుస్తుంది కదా ఇద్దరూ ఒకటే అని. అలా సర్ది చెప్పగా అప్పుడు గోపికలు అందరూ కలిసి రామున్నీ, కృష్ణున్నీ కలిసి కీర్తిస్తూ ఈ గోపికను లేపుతున్నారు.

పుళ్ళిన్ వాయ్ కీండానై ప్పొల్లా అరక్కనై
క్కిళ్ళక్కళైన్దానై క్కీర్తి మై పాడిప్పోయ్
పిళ్లైగళెల్లారుం పావైక్కళం పుక్కార్
వెళ్లి యెళుందు - వియాళ మురంగిట్రు
పుళ్ళుం శిలమ్బిన కాణ్ పోదరిక్కణ్ణినాయ్
కుళ్ళక్కుళిర క్కుడైన్దు నీరాడాదే
పళ్ళిక్కిడత్తియో పావాయ్! నీనన్నాళాల్
కళ్ళం తవిరుందు కలన్దేలో రెంబావాయ్ || 13 || 

ఇప్పుడు ఈ పాశురం యొక్క అర్థాన్ని చూద్దాం.

ఇప్పుడు ఇక్కడ ఒక గోపికను లేపుతున్నారు. ఈ గోపిక చాలా అందగత్తెట. ఆమెకి ఈ అందం ఎలా వచ్చిందిట. ఆమె కళ్ళలో ఉందట అందమంతా. ఆమె కళ్ళు ఎలా ఉంటాయి?

పోదు ఇక్కణ్ణినాయ్

తామరల్లా ఉంటాయట ఆమె కళ్ళు. ఆ గోపిక ఎంత అందంగా ఉందో.. కొంచెం గర్వం కూడా అంతే ఉందట. ఇంత అందంగా ఉన్న నన్ను, ఇంత అందమైన కళ్ళు వున్న నన్ను.. శ్రీకృష్ణుడు చూడ్డానికి రాకుండా పోతాడా. కళ్లల్లో కళ్లు పెట్టి చూస్తే చాలు నేను ఎందుకు అతను కోసం వెళ్ళాలి. అతనే నాకోసం వస్తాడు. అని కొంచెం ధీమాగా పడుకుందట నిద్ర లేవకుండా.

ఇక్కడ కళ్ళ యొక్క అందాన్ని వర్ణించడం అంటే జ్ఞానం కలగడం. జ్ఞానం ఉన్న చోట కృష్ణుడు ఉంటాడు. జ్ఞానం ఉన్న వాళ్ళ దగ్గిరికి కృష్ణుడు వెతుక్కుంటూ వస్తాడు.

ఇప్పుడు మన గోపికలు అందరూ కూడా కలిసొచ్చి ఈ గోపికను లేపుతున్నారు ఏమని లేపుతున్నారట. ఓ! తామరపువ్వులో ఉన్న తుమ్మెద ఎంత అందంగా ఉంటుందో అటువంటి కన్నులు గల దానా!

పుళ్ళిన్ వాయ్ కీణ్డానై

కొంగ నోటిని చీల్చాడు

ఎవరి నోటిని చీల్చాడట. బకాసురుడి నోటిని చీల్చాడట.

అక్కడ యమునా నదిలో ఒక కొంగ ఒంటి కాలి మీద ఉండి తపస్సు చేస్తుందట. దొంగ తపస్సు. కదలకుండా, మెదలకుండా ఒంటికాలిపై ఉంటే ఓహో ఇది మనల్నేం చేస్తుందని చేపలు ఆ పక్క నుంచి వెళ్తుంటాయట భయపడకుండా. అలా చూస్తూ చూస్తూ టపక్ మని ఒక్కసారిగా నోటితో చేపని పట్టుకొని తినేస్తుంది. కృష్ణుని చంపడానికి కంసుడు పంపించినటువంటి ఒక రాక్షసుడు ఈ బకము లో ప్రవేశించాడు. బకము అంటే కొంగ కదా! ఆ కొంగలో ప్రవేశించాడు. అంటే పరకాయప్రవేశం అంటాం కదా!

అలా! అప్పుడే చిన్ని కృష్ణుడు యమునా నదిలో ఈత కొడుతుండగా, ఆ కొంగ రూపంలో ఉన్న రాక్షసుడు బకాసురుడు కృష్ణున్ని తన ముక్కుతో పట్టుకుందాం అని అనుకున్నాడట. అప్పుడు కృష్ణుడు ఏం చేశాడట ఆ కొంగ నోట్లో తన చేయి పెట్టి తన చేతిని పెద్దదిగా చేసి ఆ నోటిని చీల్చి వేశాడు. అందుకని ఈ గోపికలు బకాసురుని నోటిని చీల్చిన కృష్ణుని యొక్క దివ్యచరితాన్నీ,

ప్పొల్లా అరక్కనై క్కిళ్ళక్క

నీచుడైన రావణాసురుడి తలలను గిల్లీసేడు,దుష్టుడైన రావణాసురుడి తలలను మొగ్గను తుంచినట్లు తుంచేశాడు శ్రీరాముడు. రావణాసురున్ని చంపిన అలాంటి రాముని చరితమును పాడుతూ

క్కీర్తి మై పాడిప్పోయ్

పిళ్లైగళెల్లారుం పావైక్కళం పుక్కార్

రాముడు యొక్క కీర్తిని, కృష్ణుడి యొక్క కీర్తిని పాడుకుంటూ పిల్లలందరూ, గోపికలందరూ పోయి వ్రతం చేద్దామనుకున్న స్థలానికి చేరుకున్నారు. అయినా నువ్వు ఇంకా లేవలేదా? లేకపోతే ఏమైనా నాటకమా? కృష్ణుడు ఒకవేళ మీ ఇంటికొస్తే నువ్వు కృష్ణుడితో ఉంటావు. మేము కృష్ణుడికోసం ఊరంతా వెతుకుతాం. నీ బుద్ధి మాకు తెలుసుగాని లే అమ్మా! లే. నిద్ర లే. నిద్రలేపడమంటే పడుకున్న వాడిని మేలుకొలుపడం. అంటే చీకటిలో ఉన్న వాళ్ళని వెలుగులోకి తీసుకు రావడం. అంటే అజ్ఞానం లో ఉన్న వారిని జ్ఞానంలోకి తీసుకురావడం. మా అందరితో కలిసి రా.. అందరం కలిసి వెళ్దాం కృష్ణ దర్శనానికి. కృష్ణుడు ఎప్పుడూ నీ వాడే కదా! అని అంటూ,

వెళ్లి యెళుందు - వియాళ మురంగిట్రు

శుక్రుడు ఉదయించాడు. బృహస్పతి అస్తమించాడు.


సూర్యోదయానికి ముందు తూర్పుదిక్కున శుక్ర నక్షత్రం కనిపిస్తుంది. తెల్లగా పెద్ద నక్షత్రం కనిపిస్తుంది. దాన్నే పల్లెల్లో చుక్క పొడుపు అంటారు. చుక్క పొడిచింది అంటారు. అంటే ఇంకా తెల్లవారబోతుంది. సూర్యుడు మరి కాసేపట్లో ఉదయిస్తాడు. శుక్రుడు అంటే శుక్రాచార్యుడు రాక్షసులకు గురువు, గురువు అంటే బృహస్పతి-దేవతలకు గురువు. శుక్రుడు ఉదయిస్తున్నాడు అంటే శుక్రుడు రాక్షసుల గురువు కాబట్టి మనం ఇంకా పడుకుందామా? అంటే ఇంకా మనం అజ్ఞానం లోనే ఉందామా? అని అర్థం

పుళ్ళుం = పక్షులు

శిలమ్బిన కాణ్ = కూయుచున్నవి /పాడుచున్నవి

పక్షులు కూస్తున్నాయి. కలవడానికి సంకేతం కదా! ఓ చిన్నదానా! కృష్ణుడు తో కలిసిమెలిసి ఉండడం వలన ఇవి చాలా శుభ దినాలు. నీవు ఒంటరిగా కృష్ణుని చేష్టలను తలచుకోవటం మాని మాతో కలిసి కృష్ణుని విరహం వలన కలిగిన తాపము పోవునట్లు, చల్లగా అగునట్లు స్నానము చేయకుండా ఇంకా పడుకున్నావేమి ?. బయట ఉన్న గోపికలు ఎన్ని విధాలుగా చెప్పినా ఈమె నిర్లక్ష్యంగా పడుకునే ఉంది. 

కుళ్ళక్కుళిర = చల్లబడినట్లుగా

క్కుడైన్దు = అవగాహన

నీరాడాదే = స్నానం చేయక

పళ్ళిక్కిడత్తియో?= పక్క మీద పడుకున్నావా?

కృష్ణుని యొక్క ఎడబాటును సహించలేక విరహ తాపంతో బాధపడుతున్నావు. ఇంకా కృష్ణుడు వస్తాడు అని, నిన్ను లేపుతాడు అని పడుకున్నావు.

పళ్ళిక్కిడత్తియో?

పక్క మీద పడుకున్నావా? విరహ తాపంతో నీ ఒళ్ళు వేడెక్కింది. అందుకే వెళ్లి చల్లగా ఉండే నీళ్లలో స్నానం చేద్దాం. సూర్యోదయం అయితే నీళ్లు వేడెక్కిపోతాయి. పద! లేచి చల్లటి నీళ్లలో స్నానం చేద్దాం.

పావాయ్ = ఓ సుకుమారీ

నీ = నీవు

ఓ సుకుమారీ

సుకుమారమైన మనస్తత్వం కలదానా! నీవు స్నానం చేసి కృష్ణుడ్ని చేరి మమ్మల్ని కూడా అనుగ్రహించు.

నన్నాళాల్ = ఈ మంచి రోజు

ఇవి చాలా మంచి రోజులు కదా!

మనమందరం ఎక్కడ కృష్ణుడి వలలో పడిపోతానేమోనని మన పెద్దలు మనల్ని దాచేశారు కృష్ణుని కలవకుండా. మళ్లీ ఆ కృష్ణపరమాత్మ దయవల్ల మంచిరోజులు వచ్చాయి. అందుకే పెద్దలు మనల్ని అనుమతించారు కృష్ణుని కలవడానికి.


కళ్ళం = కపటమును

తవిరుందు = విడచి

కలన్దు = కలియుటకు

ఇప్పుడైనా శ్రీకృష్ణుడు నీ ఒక్కదానికే సొంతం అనేకపటాన్ని, మాయని వదిలి బయటికి రా! కృష్ణుడు నీ ఒక్కదానికే సొంతం కాదు. ఆయనే సృష్టి అంతటికీ మూలం. ఇది నీకు ధర్మం కాదు లేచి రావమ్మా!

ఈ పాశురంలో కూడా ఒక ఆళ్వార్ ని లేపుతున్నారు. ఆయనే పెరియాళ్వార్, విష్ణుచిత్తుడు, భట్ట నాధుడు, ఆండాళ్ దేవి తండ్రి. ఈయన ఆ దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించి ఎక్కడ ఆ పరమాత్ముడికి దిష్టి తగులుతుందేమో అని పల్లాండు మంగళాశాసనం పాడారు.

ఆండాల్ తిరువడిగళే శరణం


Gayatri Stotram - గాయత్రీ స్తోత్రం

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - గాయత్రీ స్తోత్రం గాయత్రీస్తోత్రం నారదా! గాయత్రీ హృదయం చెప్పానుగదా, ఇక గాయత్రీస్తోత్రం చెబుతున్నాను - విను....