తిరుప్పావై - పదమూడవ పాశురము
శ్రీ గురుభ్యోనమః
జై శ్రీ కృష్ణ
జై శ్రీమన్నారాయణ
నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం
పారార్థ్యం స్వం శ్రుతి శత శిర స్సిద్ధ మధ్యాపయంతీ!
స్వోచ్ఛిష్టాయామ్ స్రజినిగళితమ్ యా బలాత్కృత్య భుంక్తే
గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః
ప్రియ భగవత్ బంధువులారా!
పరమపవిత్రమైన, దివ్యమైనటు వంటి తిరుప్పావై శ్రీ వ్రతాన్ని మనం ఎంతో ఘనంగా, భక్తి ప్రపత్తులతో ఆనందంగా జరుపుకుంటున్నాం. ధనుర్మాసంలో తిరుప్పావై శ్రీ వ్రతాన్ని ప్రారంభించినప్పుడు ముందుగా పరాశర భట్ఠార్యులవారు మనకు అందించినటువంటి ఒక తనియన్, ఒక శ్లోకాన్ని ముందుగా అనుసంధానం చేయటం ఒక సాంప్రదాయంగా ఉంది. ఇదే సంప్రదాయాన్ని మనం కూడా పాటిస్తూ ఈ శ్లోకంలో ఆండాల్ తల్లి అనుభవించినటువంటి ఆనందాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకొని ముందుకు వెళ్దాం.
ప్రియ భక్తులారా!
నిన్న 12వ పాశురంలో ఒక గోపికను లేపారు. కృష్ణుడు గుణగణాలను మాని, రాముడి గుణగణాలను పాడారు. ఈరోజుఈ 13వ పాశురంలో ఒక అద్భుతమైన విశేషం ఉంది. ఇప్పటివరకు నందవ్రజంలో ఉన్న గోపికలందరూ ఐకమత్యంతో ఉంటూ ఈ వ్రతాన్ని ప్రారంభించారు. కానీ మధ్యలోనే రెండు వర్గాలుగా విడిపోయారు. ఎందుచేత? వ్రతం చేయవలసిన స్థలానికి వెళ్ళి వారందరూ రాముడి యొక్క విధానాన్ని కీర్తించడం మొదలుపెట్టారు. అందరూ వెళ్ళినప్పుడు మనం వెళ్లకపోతే బాగుంటుందా! అందుకే మనం కూడా వెళదాం పదండి….
కొందరు రాముడు వర్గం. మరి కొందరు కృష్ణుడు వర్గం.
తెన్ని లంగై క్కోమానై శెట్ర
మనత్తుక్కు ఇనియానై పాడవుం
ఒకనాడు దక్షిణ దిక్కున ఉన్న లంకకు రాజైనరావణాసురుడుని రాముడు కోపంతో సంహరించాడు. అలాంటి రాముడి నామాన్ని, ఆ శ్రీరామచంద్రుడు నామాన్ని మేము కీర్తిస్తున్నాం. అని బయటి గోపికలు లోపల గోపికలతో అంటున్నారు. అప్పుడు కొంతమంది గోపికలు అంటున్నారు ఏమర్రా! మీకు బుద్ధి లేదా! విశ్వాసం లేదా! మనం ఉంటున్నది ద్వాపరయుగంలో శ్రీ కృష్ణుడు అవతరించినటువంటి యుగంలో. శ్రీకృష్ణుడు పెరుగుతున్న రేపల్లెలో. తెల్లవారి లేస్తే శ్రీకృష్ణుడితో ఆడుకుంటున్నాం, పాడుకుంటున్నాం. ఆపద నుంచి శ్రీకృష్ణుడు మనల్ని రక్షిస్తున్నాడు. అలాంటి శ్రీకృష్ణుడి గురించి మానేసి ఎప్పుడో త్రేతాయుగంలో ఉన్నటువంటి రాముడు గురించి పాడతారా? ఏం త్రేతాయుగంలో ఎవరైనా కృష్ణుడి గురించి పాడేరా? రామ నామం తప్ప ఇంకేమైనా ఉందా!
(వాళ్ల అమాయకత్వం గాని మనలో మన మాట... త్రేతాయుగంలో కృష్ణుడేంటండీ! )
అంటూ గోపికలు అందులో రెండు వర్గాలుగా విడిపోయారు. కాకపోతే ఇక్కడ భగవంతుని కోసం రెండుగా విడిపోయి దెబ్బలాడుకుంటున్నారు. నా కృష్ణుడు గొప్ప అంటే నా రాముడు గొప్ప అని. రాముడు గొప్ప ఏంటమ్మా అని ఒక గోపిక అడిగినదానికి ఇంకొక గోపిక సమాధానం చెబుతుంది.
రామ గోపిక : రాముడు తండ్రి మాట జవదాట లేదు. పితృవాక్య పరిపాలకుడు. దశరథుడు తన కొడుకైన రాముని పిలిచి రేపు నీకు పట్టాభిషేకం చేస్తామని చెప్పాడు. సరే మీ ఆజ్ఞ అన్నాడు రాముడు. మర్నాడు ఉదయం లేచి పట్టాభిషేకం నీకు కాదు నువ్వు అడవికి వెళ్ళి పోవాలి అన్నాడు. దానికి కూడా సరే అన్నాడు రాముడు. అది రాముడు గొప్పతనం. రాజ్యాధికారం వస్తే సంతోషించ లేదు. అరణ్యవాసానికి వెళ్ళమంటే విచారించలేదు.
రాముడు పితృవాక్య పరిపాలకుడు. మరి మీ కృష్ణుడో;
కృష్ణ గోపిక : మా కృష్ణుడు పుట్టినప్పుడే తండ్రి మాట విన్నవాడు. తను పుట్టినప్పుడే శంఖ చక్రాలతో పుట్టాడు. అది చూసి వసుదేవుడు భయపడ్డాడు. ఎక్కడ ఈ విధంగా ఈ శంఖ చక్రాలతో వున్నవాడిని చూస్తే.. కంసుడు ఎక్కడ చంపేస్తాడో అన్న భయంతో వసుదేవుడు విష్ణువుని ప్రార్థించాడు సామాన్య రూపం ధరించమని. అప్పుడు శ్రీకృష్ణుడు మామూలు బాలుడు లాగా అయిపోయాడు. చూసావా! మీ రాముడు 16 సంవత్సరాల వయసులో తండ్రి మాట విన్నాడు. కానీ మా కృష్ణుడు పుట్టీ పుట్టగానే తండ్రి మాట విన్నాడమ్మా!
ఇలా ఎవరికి వారు మా రాముడు గొప్ప అని కొందరు, మా కృష్ణుడు గొప్ప అని కొందరు.అంతలో ఒక ముసలి గోపిక (ముసలి గోపిక అంటే అనుభవజ్ఞురాలు). ఏమిటమ్మా మీ ఇద్దరి గోల? రాముడు కృష్ణుడు ఇద్దరూ ఒకటే కదర్రా ! ఇద్దరూ విష్ణుమూర్తి అవతారమే కదా! మీకు దీనికి ఒక ఉదాహరణ కూడా చెబుతాను వినండి. ఒకసారి చిన్ని కృష్ణుడు..బాలకృష్ణుడు నిద్ర పోవడానికి యశోద ఉయ్యాలలో పడుకోబెట్టింది. ఇప్పుడు చిన్నపిల్లలు పడుకోవాలంటే తల్లి ఏదో కథ చెప్తే ఊ కొడుతూ నిద్రపోతారు. అలాగే యశోద కృష్ణుడికి రాముడు కథ చెప్తుంది.
కృష్ణుడు ఊ కొడుతున్నాడు.
రాముడు మంచి బాలుడు
ఊ…
రాముడు భార్య సీత
ఊ….
రాముడు, లక్ష్మణుడు, సీత అడవికి వెళ్ళారు.
ఊ….
రావణుడు మారు వేషంలో వచ్చి సీతను ఎత్తుకుపోయాడు.
ఇప్పుడు కృష్ణుడు ఉలిక్కిపడి లక్ష్మణా! నా ధనుర్భాణాలు తీసుకురా! ఆ రావణాసురుణ్ణి చంపేస్తాను. అని ఉద్రేకపడ్డాడు. చిన్నతనంలోనే, బాలుడిగా ఉన్నప్పుడే, పసిబిడ్డగా ఉన్నప్పుడే. దీన్నిబట్టి మనకు తెలుస్తుంది కదా ఇద్దరూ ఒకటే అని. అలా సర్ది చెప్పగా అప్పుడు గోపికలు అందరూ కలిసి రామున్నీ, కృష్ణున్నీ కలిసి కీర్తిస్తూ ఈ గోపికను లేపుతున్నారు.
పుళ్ళిన్ వాయ్ కీండానై ప్పొల్లా అరక్కనై
క్కిళ్ళక్కళైన్దానై క్కీర్తి మై పాడిప్పోయ్
పిళ్లైగళెల్లారుం పావైక్కళం పుక్కార్
వెళ్లి యెళుందు - వియాళ మురంగిట్రు
పుళ్ళుం శిలమ్బిన కాణ్ పోదరిక్కణ్ణినాయ్
కుళ్ళక్కుళిర క్కుడైన్దు నీరాడాదే
పళ్ళిక్కిడత్తియో పావాయ్! నీనన్నాళాల్
కళ్ళం తవిరుందు కలన్దేలో రెంబావాయ్ || 13 ||
ఇప్పుడు ఈ పాశురం యొక్క అర్థాన్ని చూద్దాం.
ఇప్పుడు ఇక్కడ ఒక గోపికను లేపుతున్నారు. ఈ గోపిక చాలా అందగత్తెట. ఆమెకి ఈ అందం ఎలా వచ్చిందిట. ఆమె కళ్ళలో ఉందట అందమంతా. ఆమె కళ్ళు ఎలా ఉంటాయి?
పోదు ఇక్కణ్ణినాయ్
తామరల్లా ఉంటాయట ఆమె కళ్ళు. ఆ గోపిక ఎంత అందంగా ఉందో.. కొంచెం గర్వం కూడా అంతే ఉందట. ఇంత అందంగా ఉన్న నన్ను, ఇంత అందమైన కళ్ళు వున్న నన్ను.. శ్రీకృష్ణుడు చూడ్డానికి రాకుండా పోతాడా. కళ్లల్లో కళ్లు పెట్టి చూస్తే చాలు నేను ఎందుకు అతను కోసం వెళ్ళాలి. అతనే నాకోసం వస్తాడు. అని కొంచెం ధీమాగా పడుకుందట నిద్ర లేవకుండా.
ఇక్కడ కళ్ళ యొక్క అందాన్ని వర్ణించడం అంటే జ్ఞానం కలగడం. జ్ఞానం ఉన్న చోట కృష్ణుడు ఉంటాడు. జ్ఞానం ఉన్న వాళ్ళ దగ్గిరికి కృష్ణుడు వెతుక్కుంటూ వస్తాడు.
ఇప్పుడు మన గోపికలు అందరూ కూడా కలిసొచ్చి ఈ గోపికను లేపుతున్నారు ఏమని లేపుతున్నారట. ఓ! తామరపువ్వులో ఉన్న తుమ్మెద ఎంత అందంగా ఉంటుందో అటువంటి కన్నులు గల దానా!
పుళ్ళిన్ వాయ్ కీణ్డానై
కొంగ నోటిని చీల్చాడు
ఎవరి నోటిని చీల్చాడట. బకాసురుడి నోటిని చీల్చాడట.
అక్కడ యమునా నదిలో ఒక కొంగ ఒంటి కాలి మీద ఉండి తపస్సు చేస్తుందట. దొంగ తపస్సు. కదలకుండా, మెదలకుండా ఒంటికాలిపై ఉంటే ఓహో ఇది మనల్నేం చేస్తుందని చేపలు ఆ పక్క నుంచి వెళ్తుంటాయట భయపడకుండా. అలా చూస్తూ చూస్తూ టపక్ మని ఒక్కసారిగా నోటితో చేపని పట్టుకొని తినేస్తుంది. కృష్ణుని చంపడానికి కంసుడు పంపించినటువంటి ఒక రాక్షసుడు ఈ బకము లో ప్రవేశించాడు. బకము అంటే కొంగ కదా! ఆ కొంగలో ప్రవేశించాడు. అంటే పరకాయప్రవేశం అంటాం కదా!
అలా! అప్పుడే చిన్ని కృష్ణుడు యమునా నదిలో ఈత కొడుతుండగా, ఆ కొంగ రూపంలో ఉన్న రాక్షసుడు బకాసురుడు కృష్ణున్ని తన ముక్కుతో పట్టుకుందాం అని అనుకున్నాడట. అప్పుడు కృష్ణుడు ఏం చేశాడట ఆ కొంగ నోట్లో తన చేయి పెట్టి తన చేతిని పెద్దదిగా చేసి ఆ నోటిని చీల్చి వేశాడు. అందుకని ఈ గోపికలు బకాసురుని నోటిని చీల్చిన కృష్ణుని యొక్క దివ్యచరితాన్నీ,
ప్పొల్లా అరక్కనై క్కిళ్ళక్క
నీచుడైన రావణాసురుడి తలలను గిల్లీసేడు,దుష్టుడైన రావణాసురుడి తలలను మొగ్గను తుంచినట్లు తుంచేశాడు శ్రీరాముడు. రావణాసురున్ని చంపిన అలాంటి రాముని చరితమును పాడుతూ
క్కీర్తి మై పాడిప్పోయ్
పిళ్లైగళెల్లారుం పావైక్కళం పుక్కార్
రాముడు యొక్క కీర్తిని, కృష్ణుడి యొక్క కీర్తిని పాడుకుంటూ పిల్లలందరూ, గోపికలందరూ పోయి వ్రతం చేద్దామనుకున్న స్థలానికి చేరుకున్నారు. అయినా నువ్వు ఇంకా లేవలేదా? లేకపోతే ఏమైనా నాటకమా? కృష్ణుడు ఒకవేళ మీ ఇంటికొస్తే నువ్వు కృష్ణుడితో ఉంటావు. మేము కృష్ణుడికోసం ఊరంతా వెతుకుతాం. నీ బుద్ధి మాకు తెలుసుగాని లే అమ్మా! లే. నిద్ర లే. నిద్రలేపడమంటే పడుకున్న వాడిని మేలుకొలుపడం. అంటే చీకటిలో ఉన్న వాళ్ళని వెలుగులోకి తీసుకు రావడం. అంటే అజ్ఞానం లో ఉన్న వారిని జ్ఞానంలోకి తీసుకురావడం. మా అందరితో కలిసి రా.. అందరం కలిసి వెళ్దాం కృష్ణ దర్శనానికి. కృష్ణుడు ఎప్పుడూ నీ వాడే కదా! అని అంటూ,
వెళ్లి యెళుందు - వియాళ మురంగిట్రు
శుక్రుడు ఉదయించాడు. బృహస్పతి అస్తమించాడు.
సూర్యోదయానికి ముందు తూర్పుదిక్కున శుక్ర నక్షత్రం కనిపిస్తుంది. తెల్లగా పెద్ద నక్షత్రం కనిపిస్తుంది. దాన్నే పల్లెల్లో చుక్క పొడుపు అంటారు. చుక్క పొడిచింది అంటారు. అంటే ఇంకా తెల్లవారబోతుంది. సూర్యుడు మరి కాసేపట్లో ఉదయిస్తాడు. శుక్రుడు అంటే శుక్రాచార్యుడు రాక్షసులకు గురువు, గురువు అంటే బృహస్పతి-దేవతలకు గురువు. శుక్రుడు ఉదయిస్తున్నాడు అంటే శుక్రుడు రాక్షసుల గురువు కాబట్టి మనం ఇంకా పడుకుందామా? అంటే ఇంకా మనం అజ్ఞానం లోనే ఉందామా? అని అర్థం
పుళ్ళుం = పక్షులు
శిలమ్బిన కాణ్ = కూయుచున్నవి /పాడుచున్నవి
పక్షులు కూస్తున్నాయి. కలవడానికి సంకేతం కదా! ఓ చిన్నదానా! కృష్ణుడు తో కలిసిమెలిసి ఉండడం వలన ఇవి చాలా శుభ దినాలు. నీవు ఒంటరిగా కృష్ణుని చేష్టలను తలచుకోవటం మాని మాతో కలిసి కృష్ణుని విరహం వలన కలిగిన తాపము పోవునట్లు, చల్లగా అగునట్లు స్నానము చేయకుండా ఇంకా పడుకున్నావేమి ?. బయట ఉన్న గోపికలు ఎన్ని విధాలుగా చెప్పినా ఈమె నిర్లక్ష్యంగా పడుకునే ఉంది.
కుళ్ళక్కుళిర = చల్లబడినట్లుగా
క్కుడైన్దు = అవగాహన
నీరాడాదే = స్నానం చేయక
పళ్ళిక్కిడత్తియో?= పక్క మీద పడుకున్నావా?
కృష్ణుని యొక్క ఎడబాటును సహించలేక విరహ తాపంతో బాధపడుతున్నావు. ఇంకా కృష్ణుడు వస్తాడు అని, నిన్ను లేపుతాడు అని పడుకున్నావు.
పళ్ళిక్కిడత్తియో?
పక్క మీద పడుకున్నావా? విరహ తాపంతో నీ ఒళ్ళు వేడెక్కింది. అందుకే వెళ్లి చల్లగా ఉండే నీళ్లలో స్నానం చేద్దాం. సూర్యోదయం అయితే నీళ్లు వేడెక్కిపోతాయి. పద! లేచి చల్లటి నీళ్లలో స్నానం చేద్దాం.
పావాయ్ = ఓ సుకుమారీ
నీ = నీవు
ఓ సుకుమారీ
సుకుమారమైన మనస్తత్వం కలదానా! నీవు స్నానం చేసి కృష్ణుడ్ని చేరి మమ్మల్ని కూడా అనుగ్రహించు.
నన్నాళాల్ = ఈ మంచి రోజు
ఇవి చాలా మంచి రోజులు కదా!
మనమందరం ఎక్కడ కృష్ణుడి వలలో పడిపోతానేమోనని మన పెద్దలు మనల్ని దాచేశారు కృష్ణుని కలవకుండా. మళ్లీ ఆ కృష్ణపరమాత్మ దయవల్ల మంచిరోజులు వచ్చాయి. అందుకే పెద్దలు మనల్ని అనుమతించారు కృష్ణుని కలవడానికి.
కళ్ళం = కపటమును
తవిరుందు = విడచి
కలన్దు = కలియుటకు
ఇప్పుడైనా శ్రీకృష్ణుడు నీ ఒక్కదానికే సొంతం అనేకపటాన్ని, మాయని వదిలి బయటికి రా! కృష్ణుడు నీ ఒక్కదానికే సొంతం కాదు. ఆయనే సృష్టి అంతటికీ మూలం. ఇది నీకు ధర్మం కాదు లేచి రావమ్మా!
ఈ పాశురంలో కూడా ఒక ఆళ్వార్ ని లేపుతున్నారు. ఆయనే పెరియాళ్వార్, విష్ణుచిత్తుడు, భట్ట నాధుడు, ఆండాళ్ దేవి తండ్రి. ఈయన ఆ దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించి ఎక్కడ ఆ పరమాత్ముడికి దిష్టి తగులుతుందేమో అని పల్లాండు మంగళాశాసనం పాడారు.
ఆండాల్ తిరువడిగళే శరణం
No comments:
Post a Comment