మత్స్యవురాణం ఫలశ్రుతి
ఈ మత్స్య పురాణం పరమపవిత్రమైనది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే స్వయంగా మత్స్యరూపాన్ని ధరించి మనువుకి ప్రబోధించింది. ఈ పురాణ శ్రవణం వల్ల పాపాలన్నీ నశిస్తాయి. అనేక తీర్థాలు, క్షేత్రాలు, పుణ్య నదుల్లో స్నానం చేయటం వల్ల సమస్త ధర్మాలన్నీ శ్రద్ధగా ఆచరించటం వల్ల కలిగే
ఫలితాలన్నీ ఈ పురాణ శ్రవణం వల్ల పఠనం వల్ల మానవులకి లభిస్తాయి.
అస్మాత్పురాణాత్సుకృతం నరాణాం తీర్ధావలీనామహాఫలానామ్ ।
సమస్త ధర్మాచారణోద్భవానామ్ సదైవ లాభాశ్చ మహాఫలానామ్ ॥
అస్మాత్పురాణాదపి పాదమేకమ్ పఠేత్ యఃసోஉపి విముక్తపాపః ।
నారాయణ స్యాత్ పదమేతి నూనం అనంగవద్దిన్య వపుః సుఖీస్యాత్ ॥
అత్యంత ప్రాచీనమైన ఈ మత్స్యపురాణంలో ఒక్క శ్లోకాన్ని పఠించిన వాడుకూడా సకల పాపాలనుంచీ విముక్తుడై శ్రీమన్నారాయణుడి దివ్య ధామానికి చేరుకుంటాడు. అతడికి మన్మధుడు లాంటి దివ్యమైన శరీరం లభిస్తుంది. ఎన్నో రహస్య తత్త్వల్ని ప్రతిపాదించిన ఈ పురాణాన్ని శ్రద్ధతో వినేవాడికి, చదివే వాడికి అశ్వమేధయాగం ఆచరించిన ఫలం లభిస్తుంది.
మానవులు నిత్యం శివుణ్ణి, విష్ణువుని, బ్రహ్మని, సూర్యుణ్ణి అర్చించిన తరువాత ప్రతిరోజూ శ్రద్ధతో ఈ పురాణంలోని ఒక శ్లోకాన్నిగానీ తాత్పర్యాన్ని గానీ, కనీసం శ్లోక పాదాన్ని గానీ తాను పఠించి, ఇతరులకి వినిపిస్తే బ్రాహ్మణుడికి-విద్య, క్షత్రియుడికి -భూమి, వైశ్యుడికి -ధనం, శూద్రుడికి -సుఖం సంప్రాప్తిస్తాయి. ఇక ఈ పురాణాన్ని ఆసాంతం పఠించినవాడు ధనధాన్యవస్తువాహనాల్ని సమృద్ధిగా పొందుతాడు.
॥ సర్వేజనాః సుఖినోభవంతు ॥
No comments:
Post a Comment