ప్రయాగ మాహాత్మ్యం
పూర్వం ధర్మరాజుకి మార్మండేయ మహర్షి ప్రయాగ తీర్థ మాహాత్మ్యాన్ని గురించి ప్రబోధించగా, నందీశ్వరుడు నారదమహర్షికి ఆ వృత్తాంతాన్ని ఈ విధంగా చెప్పటం ప్రారంభించాడు.
మహాభారతయుద్ధం ముగిసిన తరువాత యుధిష్టిరుడు రాజ్యాన్ని పొందినప్పటికీ, తనసోదరులు, గురువులు ఎందరో యుద్ధంలో మరణించినందుకు ఎంతో శోకించాడు. "అయ్యో! నాసోదరుడైన దుర్యోధనుడు పదకొండు అక్షౌహిణుల సైన్యానికి నాయకుడుగా వున్నాడు కదా! వారంతా మమ్మల్ని బాధించినప్పటికీ చివరికి అందరూ మరణించారు. ఇక శ్రీకృష్ణుడి దయతో మేము అయిదుగురం మాత్రమే మిగిలాం. భీష్మ, ద్రోణ, కర్ణుల్ని, సోదరుడైన ధుర్యోధనాదుల్ని వధించగా ప్రాప్తించిన ఈ రాజ్యం భోగం ఏమీ సుఖాన్నివ్వటం లేదు. ఛీ! ఇదంతా ఎందుకు? రక్తపు కూడు తింటున్నామే!" అని విచారిస్తూ కాలంగడపసాగాడు.
కొంతకాలం గడిచాక "నేనిలా విచారిస్తే ఏం లాభం? ఏవిధానాన్ని అనుష్టించి, ఏ తీర్థాల్ని సేవిస్తే ఈ మహాపాతకం నుంచి విముక్తి లభిస్తుంది! ఏ క్షేత్రంలో నివసిస్తే సర్వోత్తమమైన విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది? నాకు దుఃఖ నివారణోపాయాన్ని తెలిపేదెవరు? అని ఆలోచిస్తుండగా, ఈ విషయం తన దివ్య దృష్టి ద్వారా గ్రహించిన మార్కండేయుడు వెంటనే వారణాసి నుంచి హస్తినాపురానికి వచ్చాడు.
మార్కండేయుడు వచ్చిన విషయం తెలుసుకున్న యుధిష్టిరుడు, ఆయన్ని సగౌరవంగా స్వాగతించి సింహాసనంమీద కూర్చోబెట్టి భక్తిగా పూజించాడు. యుధిష్టిరుడు పూజకి సంతోషించిన మార్మండేయుడు "రాజా! ఎందుకు నీవు విచారంగా వున్నావు. నీ బాధకి కారణమేమిటి?" అని ప్రశ్నించాడు. యుధిష్టిరుడు తన బాధకి గల కారణాన్నంతా ఆయనకి వివరించాడు. అదివిని "ధర్మజా! క్షాత్రధర్మం ప్రకారం యుద్ధం చేయాలి. యుద్ధంలో పాపపుణ్యాల ప్రసక్తి వుండదు. కనుక నీవు ఎలాంటి పాపాన్నీ చేయలేదు. క్షత్రియుడన్న వాడికి యుద్ధం చేయటమే క్షేతధర్మం. తన రాజ్యాన్ని రక్షించుకోవటం రాజధర్మం. కనుక నీవు పాపం చేసానని ఏమాత్రం చింతించకు"అని ఓదార్చాడు మార్కండేయుడు.
యుద్ధిష్టురుడు ఆయనతో "స్వామీ! తమరు బ్రహ్మవేత్తలు, త్రికాలజ్ఞులు, మహాప్రాజ్జులు ధర్మాధర్మవిషయ పరిజ్ఞానం కలిగినవారు. మీరు చెప్పినట్టు నేను పాపం చేయనప్పటికీ అందరినీ వధించి రాజ్యాన్ని సంపాదించానన్న పాపచింతన నన్ను వదిలిపోవటంలేదు. కనుక నా మనస్సంతృప్తి కోసం ఏ తీర్జానికి వెళితే నాకు దుఃఖవిమోచనం జరిగి మనశ్శాంతి లభిస్తుందో తెలియచేయండి" అని వినయంగా ప్రార్థించాడు.
మార్కండేయుడు ధర్మరాజుతో "రాజా దివ్యతీర్థాలలో, పుణ్యక్షేత్రాల్లో ఎంతో ప్రసిద్ధి పొందిన క్షేత్రం ప్రయాగ. దీనినే తీర్థరాజం అంటారు. ఈ క్షేత్రం పేరు ప్రతిష్ఠానం. ఈ ప్రయాగ క్షేతం పూర్వం దుష్యంతుడు పాలించే కాలంలో పూరువంశీయులకి రాజధానిగా వుండేది. అంతకు ముందు కాలంలో దీన్ని ప్రజాపతిపురమని వ్యవహరించేవారు. ఆ దివ్యక్షేత్రంలో స్నానం చేసిన వారికి పునర్జన్మ లేదు. అక్కడ మరణించిన వారికి ముక్తి లభిస్తుంది. అందుకే బ్రహ్మాది దేవతలు ఈ దివ్య క్షేత్రాన్ని ఎల్లప్పుడూ కాపాడుతుంటారు.
ఈ దివ్యక్షేత్రంలో ఎన్నో ఉపతీర్థాలున్నాయి. అక్కడ వుండే గంగని ఆరువేలమంది ధానుష్కులు రక్షిస్తుంటారు. యమునని సప్తాశ్వరధుడైన ఆదిత్యుడు కాపాడుతుంటాడు. విశేషంగా ఈ క్షేత్రాన్ని ఇంద్రుడు ప్రత్యేకంగా సంరక్షిస్తుంటాడు. ఈ దివ్యక్షేత్రానికి నాయకుడు శ్రీహరి. ఆ క్షేత్రంలో అక్షయ వటవృక్షం వుంది. దాన్ని పరమేశ్వరుడు స్వయంగా రక్షిస్తుంటాడు. లోకంలో ఎంతో పుణ్యం చేసినవాడు మాత్రమే ఆ క్షేత్రానికి వెళ్ళగలడు. తక్కువ పాపాలు చేసినవారు ప్రయాగ క్షేత్రం గురించి కేవలం తలుచుకుంటే చాలు వారి పాపాలు నశిస్తాయి. ఆ దివ్యతీర్థాన్ని దర్శించినా, దాని గురించి ఇతరులకి చెప్పినా, అక్కడి మట్టిని స్పర్శించినా చాలు పాపాల నుంచి విముక్తి కలుగుతుంది.
ధర్మజా! ప్రయాగతీర్థంలో మహిమాన్వితమైన అయిదు కుండాలున్నాయి. ప్రయాగక్షేత్రంలోకి ప్రవేశిస్తే చాలు పాపం నాశనమౌతుంది. వేల యోజనాల దూరం నుంచి ప్రయాగని స్మరించినా చాలు ఘోరపాపాలు తొలగిపోతాయి. అక్కడి గంగా యమునల సంగమంలో స్నానంచేసినా, ఆ నీటిని త్రాగినా అనంతమైన పుణ్యం లభిస్తుంది. మనసారా ఆ దివ్యక్షేత్రాన్ని తలుచుకున్న వాడికి అన్ని కోరికలూ నెరవేరతాయి.
ప్రయాగ క్షేత్రానికి వెళ్ళి ఒక నెలరోజులు అక్కడే నివసించి, బ్రహ్మచర్య వ్రతాన్ని అవలంబిస్తూ పితృదేవతలకి పిండప్రదానం చేసి తర్పణాలు విడవాలి. అది అనంతమైన పుణ్యాన్ని కలిగిస్తుంది. సూర్యుడి పుత్రిక యముడి చెల్లెలైన యమునానది అక్కడే గంగానదితో సంగమిస్తుంది. ఆ క్షేత్రానికి పరమేశ్వరుడు ఎప్పుడూ చాలా సన్నిహితంగా వుంటాడు. ప్రయాగ క్షేత్రాన్ని దర్శిస్తేచాలు మానవులకి సకల శుభమంగళాలూ కలుగుతాయి. ఎందుకంటే? దేవతలు, దానవులు, గంధర్వులు, సిద్దులు, చారణులు, ఋషులు ఆ క్షేత్రాన్ని సదా దర్శిస్తుంటారు.
నైమిశం, పుష్కరతీర్ధం, గోతీర్థం సింధుసాగరం, గయలోని చైత్రధనూకం, గంగా సాగరసంగమం లాంటి ముప్ఫై కోట్ల పదివేల తీర్థాలు సదా ప్రయాగ తీర్థంలో నివసిస్తూంటాయి. ఇక్కడ వున్న గంగా యమునా నదుల మధ్య ప్రదేశాన్ని పృధివీజఘనం అంటారు. ముల్లోకాలలో వున్న మూడున్నరకోట్ల తీర్థాలు కూడా ప్రయాగ తీర్థానికి సరిపోలవు. అది సిద్ధ క్షేత్రం. నిర్మలమైన ఈదివ్య తీర్ధం గురించి విన్నా పఠించినా, ఇతరులకి బోధించినా స్వర్గఫలం లభిస్తుంది.
ఈవిధంగా మార్కండేయుడు చెప్పిన ప్రయాగక్షేత మహాత్మ్యాన్ని విన్న యుధిష్టరుడు తనసోదరులతో ధర్మపత్ని ద్రాపతితో కలిసి ప్రయాగక్షేత్రానికి వెళ్ళి అక్కడి గంగాయమునల సంగమంలో స్నానం చేసాడు. తరువాత నిత్యానుష్టానాన్ని పూర్తి చేసుకుని బ్రాహ్మణులకి, గురువులకి నమస్మరించి తన పూర్వీకులందరికీ తర్పణాలు విడిచాడు. అదే సమయంలో శ్రీకృష్ణుడు అక్కడికి విచ్చేయగా వారంతా ఆయన్ని కూడా భక్తిగా పూజించారు. తరువాత మార్కండేయ మహర్షి ధర్మరాజుని అతడి సోదరుల్ని ఆశీర్వదించి తిరిగి వెళ్ళిపోయాడు. అయితే యుధిష్టరుడు అక్కడే కొన్ని రోజులు నివసించి ఎన్నో దానధర్మాలు చేసాడు.
Friday, March 20, 2026
The Greatness of Prayag - ప్రయాగ మాహాత్మ్యం
Subscribe to:
Post Comments (Atom)
The vows and worships of the Goddess as prescribed by the Goddess - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు
శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు ఓ సువ్రతా! ఇపుడు నీకు దేవీ వ్రతములగూర్చి తెల్పుదును వినము. ఈ దేవీవ్రతముల నెల...
-
సూర్య ద్వాదశ నామాలు ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ నారాయణః సరసిజాసన సన్నివిష్టః । కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ...
-
నిత్య పారాయణ శ్లోకాలు స్తోత్రాలు నవ గ్రహ స్తోత్రం సుబ్రహ్మణ్యాష్టకం ఆదిత్యహృదయం కనకధారా స్త్రొత్రమ్ దుర్గాసప్తశ్లోకీ శ్రీ సరస్వతీ కవచం తోటకా...
-
ఆదిత్యహృదయం తతో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్ | రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ || 01 || దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో ...
No comments:
Post a Comment