పురాణదాన వ్రతం
మత్స్యరూపంలో వున్న శ్రీమన్నారాయణుడు మనువుకి పురాణాల్ని దానంచేస్తే వచ్చే శుభఫలితాల గురించి ఇలా చెప్పటం ప్రారంభించాడు.పూర్వం బ్రహ్మదేవుడి ఐదు ముఖాల్లో ఊర్ధ్వముఖం నుంచి సకలశాస్తాలకీ మూలమైన పురాణం ఆవిర్భవించింది. తరువాత మిగిలిన నాలుగు ముఖాల నుంచి నాలుగు వేదాలు వెలువడ్డాయి. ఆ కల్పంలో కేవలం పురాణం ఒక్కటిగానే వుండేది. అప్పుడది వందకోట్ల శ్లోకాలతో నిండివుంది. ప్రళయకాలం పూర్తయిన తరువాత నేను హయగ్రీవుడిగా అవతరించి ఒక్కటిగా వున్న పురాణాన్ని
నాలుగువేదాలని, వేదాంగాలని, పద్నాలుగు శాస్త్రాలని స్వాధీనం చేసుకున్నాను. తరువాత కల్పంలో నేను తిరిగి పురాణాన్ని బ్రహ్మదేవుడికి బోధించగా ఆయన దానిని విని దేవతలకి, ఋషులకి తిరిగి బోధించాడు. అయితే అందరూ ఆ మహాగ్రంథాన్ని అర్ధం చేసుకోలేకపోతున్నారని నేను గ్రహించాను. అందుకే ప్రతి ద్వాపర యుగంలో వ్యాసుడుగా అవతరించి ఆ మహాపురాణాన్ని నాలుగు లక్షల శ్లోకాలకి కుదించి వాటిని పద్దెనిమిది మహాపురాణాలుగా విభాగించాను.
దేవలోకంలో మాత్రం ఇది మహాపురాణంగా శతకోటిశ్లోకాలతో ఎలాంటి విభాగాలు లేకుండా ఏక రూపంలోనే వుంది.
విభజించబడ్డ ఈ పురాణాలు ఎన్ని రకాలు వాటి ప్రమాణం ఎంత? వాటిని ఏఏ తిధులలో దానం చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి. అనే విషయాలని నీకు వివరిస్తున్నాను.
1. బ్రహ్మపురాణం : బ్రహ్మదేవుడు మరీచికి ప్రవచించిన పురాణం ఇది. దీని పరిమాణం పదివేలశ్లోకాలు. ఈ పురాణాన్ని లిఖీంచి (వ్రాసి) వైశాఖపూర్ణిమ తిథినాడు నీలు - ఆవు సహితంగా దానం చేస్తే బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది.
2. పద్మపురాణం : ఈ జగత్తు అంతా జలమయంగా మారిపోయి ఒక పద్మంగా రూపొందినప్పుడు బ్రహ్మ దేవుడు ఈ పురాణాన్ని ప్రవచించాడు. దీని పరిమాణం ఏభై అయిదువేల శ్లోకాలు. ఈ పురాణాన్ని వ్రాసి జ్యేష్టమాసం పూర్ణిమ తిథినాడు బంగారు కమలాలతో నువ్వులతో కలిపి దానం చేస్తే అశ్వమేధయాగం చేసిన ఫలితం లభిస్తుంది.
3. విష్ణుపురాణం : పరాశర మహర్షి వారాహకల్పంలోని వృత్తాంతాన్ని ఆశ్రయించి, సకల ధర్మాల్ని ప్రవచించిన పురాణం ఇది. దీని పరిమాణం ఇరవైమూడు వేల శ్లోకాలు. ఈ పురాణాన్ని వ్రాసి ఆషాఢపూర్ణిమనాడు నెయ్యితో ఆవుతో కలిపి సంసారి అయిన బ్రాహ్మణుడికి దానం చేస్తే విష్ణులోకం
ప్రాప్తిస్తుంది.
4. వాయుపురాణం : వాయుదేవుడు శ్వేతవరాహ కల్పవృత్తాంతాన్ని ఆధారంగా చేసుకుని రుద్రుడి మహాత్మ్యాన్ని ప్రబోధించిన పురాణం ఇది. ఈ గ్రంథ పరిమాణం పన్నెండువేల శ్లోకాలు. ఈ పురాణాన్ని లిఖీంచి శ్రావణ పూర్ణిమనాడు పెరుగు, బెల్లం, ధేనువుతో సహా విప్రుడికి దానంచేస్తే ఒక కల్పం వరకూ శివలోకంలో నివసిస్తారు.
5. భాగవతపురాణం : వృత్రాసుర వధతో శ్రీకృష్ణుడి లీలా విలాసాలతో, సారస్వత కల్పంలోని ఇతివృత్తాల్ని ఆధారంగా చేసుకుని ఎన్నో ధార్మిక విషయాల్ని వివరించిన పురాణం ఇది. దీని పరిమాణం పద్దెనిమిదివేల శ్లోకాలు. ఈ పురాణాన్ని లిఖించి బాధ్రపదపూర్ణిమ నాడు బంగారు సింహాసనంతో సహా దానం చేసినవాడు పరమపదాన్ని చేరుకుంటాడు.
6. నారదపురాణం : బృహత్కల్పాన్ని ఆశ్రయంగా చేసుకుని నారదమహర్షి చెప్పిన పురాణం ఇది. దీని పరిమాణం ఇరవై అయిదువేల శ్లోకాలు. ఈ పురాణాన్ని లిఖించి, ఆశ్వయుజపూర్ణిమనాడు ధేనువుతో సహా దానం చేస్తే పునర్జన్మలేని కైవల్యం లభిస్తుంది.
7. మార్మండేయపురాణం : పక్షుల్ని ఆధారంగా చేసుకుని ఎన్నో ధార్మిక విశేషాలనిజైమిని మహర్షికి బోధించిన విధంగా చెప్పబడిన పురాణం ఇది. దీని పరిమాణం తొమ్మిదివేల శ్లోకాలు. ఈ పురాణాన్ని వ్రాసి బంగారు ఏనుగుతో సహా కార్తీక పూర్ణిమనాడు విప్రుడికి దానం చేస్తే యజ్ఞఫలం లభిస్తుంది.
8. అగ్నిపురాణం : ఈశానకల్పాన్ని ఆధారంగా చేసుకుని అగ్నిదేవుడు వసిష్టుడికి ప్రవచించిన పురాణం ఇది. దీని పరిమాణం పదహారువేల శ్లోకాలు. ఈ పురాణాన్ని లిఖించి బంగారు పద్మాలతో నువ్వులు, ధేనువుతో సహా మార్గశీర్ష పౌర్ణమినాడు దానంచేస్తే సర్వక్రతువులు చేసిన ఫలం లభిస్తుంది. స్వర్గ ప్రాప్తి కలుగుతుంది.
9. భవిష్యపురాణం : అఘోర కల్పవృత్తాంతాలని భూతసమూహలక్షణాలని, జగత్తుస్థితిగతుల్ని, భవిష్యవృత్తాంతాలని ఆదిత్య మహాత్యం ఆధారంగా చేసుకుని బ్రహ్మ మనువుకి బోధించిన పురాణం ఇది. దీని పరిమాణం పద్నాలుగువేల ఐదువందల శ్లోకాలు. ఈ పురాణాన్ని లిఖించి పుష్యమాసపౌర్ణమి తిథినాడు ధేనువుతో సహా దానంచేస్తే అగ్నిష్టామయాగం చేసిన ఫలితం లభిస్తుంది.
10. బ్రహ్మవైవర్తపురాణం : రథంతర కల్ప వృత్తాంతాన్ని ఆధారంగా చేసుకుని సౌవర్ణిమనువు నారదుడికి శ్రీకృష్ణ వృత్తాంతాన్ని బ్రహ్మ వరాహచరిత్రని చెప్పిన పురాణం ఇది. దీని పరిమాణం పద్దెనిమిదివేల శ్లోకాలు. ఈ పురాణాన్ని లిఖించి, మాఘమాసం పూర్ణిమ తిథినాడు గృహస్టుడైన బ్రాహ్మణుడికి మంచి ఇంటితో సహాదానం చేస్తే బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది.
11. లింగపురాణం : పరమేశ్వరుడు అగ్ని లింగం మధ్యలో వుండి ఈశాన కల్పవృత్తాంతాన్ని ఆధారంగా చేసుకుని ప్రవచించిన పురాణం ఇది. దీని పరిమాణం పదకొండు వేల శ్లోకాలు. ఈ పురాణాన్ని లిఖించి ఫాల్గుణమాస పూర్ణిమ తిథినాడు నువ్వులతో అర్థనారీశ్వరుడి ప్రతిమతో దానం చేస్తే శివసాయుజ్యం కలుగతుంది.
12. వరాహపురాణం : మానవకల్పాన్ని ఆధారంగా చేసుకుని మహావిష్ణువు భూదేవికి చెప్పిన పురాణం ఇది. దీని పరిమాణం ఇరవైనాలుగు వేల శ్లోకాలు. ఈ పురాణాన్ని లిఖించి చైత్ర మాస పూర్ణిమ తిథినాడు, బంగారుగరుడుడి విగ్రహం, నువ్వులు, ధేనువులతో సంసారి అయిన బ్రాహ్మణుడికి దానం చేస్తే వరాహమూర్తి అనుగ్రహంతో విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది.
13. స్కాందపురాణం : తత్పురుషకల్పాన్ని ఆశ్రయించి స్కందుడు పరమేశ్వర ధర్మాలని ప్రవచించిన పురాణం ఇది. దీని పరిమాణం లక్షా ఒకవేయి శ్లోకాలు. ఈ పురాణాన్ని లిఖీంచి బంగారు శూలంతో సహా దానం చేస్తే అన్ని బంధాలనుంచీ విముక్తులై శివలోకానికి చేరుకుంటారు.
14. వామనపురాణం :త్రివిక్రముడి మహాత్మ్యాన్ని ఆధారంగా చేసుకుని కూర్మకల్పవృత్తాంతాన్ని చతుర్విధ పురుషార్థాలని వర్ణించిన పురాణం ఇది. దీని పరిమాణం పద్నాలుగు వేల శ్లోకాలు. ఈ పురాణాన్ని లిఖించి రాత్రిపగలు సమానంగా వుండే రోజున దానం చేస్తే విష్ణుస్థానాన్ని పొందుతారు.
15. కూర్మపురాణం : కూర్మరూపాన్ని ధరించిన శ్రీహరి ఇంద్రుడి సన్నిధిలో మునులకి లక్ష్మీకల్ప వృత్తాంతంలోని నాలుగు పురుషార్థాల మహాత్యాన్ని ప్రధానంగా వర్ణించిన పురాణం ఇది. దీని పరిమాణం ఆరువేల శ్లోకాలు (పద్దెనిమిది వేల శ్లోకాలని కొందరి అభిప్రాయం) ఈ పురాణాన్ని వ్రాసి ఆయనం ప్రవేశించే కాలంలో బంగారు కూర్మంతో సహా దానం చేయాలి. అలా చేస్తే వేయి గోవుల్ని దానం చేసిన ఫలితం లభిస్తుంది.
16. మత్స్యపురాణం : కల్పం మొదట్లో మత్స్యరూపాన్ని ధరించిన నారాయణుడు మనువుకి సప్తర్షికల్పం ఆధారంగా పురుషోత్తమతత్వాన్ని ప్రధానంగా వర్ణించి చెప్పిన పురాణం ఇది. దీని పరిమాణం పద్నాలుగువేల అయిదువందల శ్లోకాలు. ఈ పురాణాన్ని లిఖించి ఉగాది రోజున బంగారు మత్స్యంతో ధేనువుతో సహా బ్రాహ్మణుడికి సత్కారం చేసి దానం చేస్తే భూమండలాన్నంతా దానం చేసిన ఫలితం లభిస్తుంది.
17. గరుడపురాణం : శ్రీ మహావిష్ణువు గారుడ కల్పంలో బ్రహ్మాండం నుంచి గరుత్మంతుడు ఆవిర్భవించిన వృత్తాంతం ప్రధానంగా ప్రవచించిన పురాణం ఇది. దీని పరిమాణం పంతొమ్మిదివేల శ్లోకాలు. ఈ పురాణాన్ని లిఖించి బంగారు హంస ప్రతిమతో సహా దానం చేస్తే శివలోక ప్రాప్తి కలుగుతుంది.
18. బ్రహ్మాండపురాణం : బ్రహ్మాండ వృత్తాంతాన్ని ఆశ్రయించి బ్రహ్మదేవుడు భవిష్యకల్ప విశేషాలని ప్రధానంగా ప్రవచించిన పురాణం ఇది. దీని పరిమాణం పన్నెండువేల రెండు వందల శ్లోకాలు. ఈ పురాణాన్ని లిఖించి వ్యతీపాతయోగం వున్న రోజు ఉన్ని వస్త్రాలతో, బంగారంతో సహా దానం చేస్తే వేయి రాజసూయ యాగాలు చేసిన ఫలితం లభిస్తుంది.
19. శివుడిపురాణం : నందీశ్వరుడు ఋషులందరికీ శివుడి సంహార కర్తృత్వాన్ని దేవాసురసంగ్రామ వృత్తాంతాలని ప్రధానంగా వర్ణించిన పురాణం ఇది. దీని పరిమాణం ఇరవైనాలుగు వేల శ్లోకాలు. ఈ పురాణాన్ని లిఖించి మాఘకృష్ణ చతుర్దశి (మహాశివరాత్రి) నాడు గంధాదిద్రవ్యాలతో, భోజనంపెట్టి
విప్రుడికి దానం చేస్తే వంద మానవ తరాల దాకా రుద్రలోక నివాసం లభిస్తుంది.
ఇక ఉపపురాణాల విషయానికి వస్తే
1 పద్మపురాణంలో చెప్పబడ్డ నరసింహుడి వర్ణన ప్రధానంగా కలిగింది నృసింహ పురాణం”. దీని పరిమాణం పద్దెనిమిది వేల శ్లోకాలు.
2. కుమారస్వామి నందుడికి శివమహాత్మ్యాన్ని ప్రబోధించిన పురాణం 'నందపురాణం”
3. సాంబుడి గురించి భవిష్యోపాఖ్యానాల రూపంలో చెప్పబడింది సాంబపురాణం. అలాగే ఆదిత్యపురాణం కూడా వున్నది. ఈ అష్టాదశ పురాణాలలో ఇతర అంశాల గురించి చెప్పబడ్డ పురాణాలు ఏవైతే వున్నాయో అవన్నీ ఉపపురాణాలే.
పురాణ లక్షణాలు
మనురాజా! పురాణాలకి ఐదురకాల లక్షణాలుండాలని నిర్దేశించారు. అవి :
పురాణ లక్షణాలు
మనురాజా! పురాణాలకి ఐదురకాల లక్షణాలుండాలని నిర్దేశించారు. అవి :
1.సర్గ (ఆదిసృష్టి)
2. ప్రతిసర్గ (పంచభూతాల సృష్టి
3. వంశం ప్రజాపతుల సృష్టి
4 మన్వంతరం(పద్నాలుగుమంది మనువుల వృత్తాంతం)
5.వంశాను చరితం (మనువుల వారసుల వంశచరిత్ర). ఇలా పంచలక్షణాలతో వున్న పురాణాలలో బ్రహ్మ, విష్ణు, రుద్ర, సూర్యుల మహిమలు, భువనాల సృష్టి సంహారాలు, ధర్మార్థకామ మోక్ష విశేషాలు ప్రవచించబడతాయి.
ప్రధానంగా పురాణాలు సాత్త్వికాలు, రాజసాలు, తామసాలు అని మూడు విధాలుగా వుంటాయి. సాత్త్విక పురాణాలలో విష్ణుమహాత్మ్యం, రాజసపురాణాలలో బ్రహ్మమహాత్మ్యం, తామసపురాణాలలో అగ్ని శివుల మహాత్మ్యం చెప్పబడతాయి. మిగిలిన మిశ్రపురాణాలలో సరస్వతీ, పార్వతీ వంటి శక్తుల మహిమ పితృదేవతల మహాత్మ్యం వర్ణించబడతాయి. ఇక్కడ చెప్పిన ఈ అష్టాదశ పురాణాల అనుక్రమాన్ని దైవ కార్యాలు జరిగే సమయంలో పఠిస్తే విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. పురాణ దాన క్రమం అనే ఈ అధ్యాయాన్ని చదివిన వారికి, విన్నవారికి, బోధించిన వారికి ఆయుషు యశస్సు కలుగుతాయి.
ప్రధానంగా పురాణాలు సాత్త్వికాలు, రాజసాలు, తామసాలు అని మూడు విధాలుగా వుంటాయి. సాత్త్విక పురాణాలలో విష్ణుమహాత్మ్యం, రాజసపురాణాలలో బ్రహ్మమహాత్మ్యం, తామసపురాణాలలో అగ్ని శివుల మహాత్మ్యం చెప్పబడతాయి. మిగిలిన మిశ్రపురాణాలలో సరస్వతీ, పార్వతీ వంటి శక్తుల మహిమ పితృదేవతల మహాత్మ్యం వర్ణించబడతాయి. ఇక్కడ చెప్పిన ఈ అష్టాదశ పురాణాల అనుక్రమాన్ని దైవ కార్యాలు జరిగే సమయంలో పఠిస్తే విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. పురాణ దాన క్రమం అనే ఈ అధ్యాయాన్ని చదివిన వారికి, విన్నవారికి, బోధించిన వారికి ఆయుషు యశస్సు కలుగుతాయి.
No comments:
Post a Comment