Monday, February 2, 2026

Magha Puranam 20 - మాఘ పురాణం 20 భీముడు ఏకాదశి వ్రతము చేయుట

మాఘ పురాణం - 20 వ అధ్యాయం

భీముడు ఏకాదశి వ్రతము చేయుట

పాండవులలో ద్వితీయుడు భీముడు. అతడు మహాబలుడు, భోజనప్రియుడు, ఆకలికి ఏమాత్రము ఆగనివాడు. బండెడన్నము అయినను చాలదు. అటువంటి భీమునకు ఏకాదశి వ్రతము చేయవలయునని కుతుహలము. కాని, ఒక విషయములో బెంగతో నుండెను, అదేమందువా? ఏకాదశినాడు భోజనము చేయకూడదు కదా! భోజనము చేసిన ఫలము దక్కదుకదా! అని విచారించి తమ పురోహితుని వద్దకుపోయి "ఓయీ పురోహితుడా! అన్ని దినముల కంటే ఏకాదశి పరమపుణ్యదినమని అనెదరుగదా! దాని విశిష్టత యేమి అని భీముడు అడిగెను.

“అవును ఆ రోజు అన్ని దినములకంటెను ప్రశస్తమయినది. శ్రీమహావిష్ణువుకు ప్రీతికరమైనది. గనుక అన్ని జాతులవారును 
ఏకాదశి వ్రతము చేయవచ్చును అని పాండవ పురోహితుడగు దౌమ్యుడు పలికెను.

"సరే నేను అటులనే చేయుదును గాని విప్రోత్తమా! నేను భోజనప్రియుడనన్న సంగతి జగద్విదిత మేకదా! ఒక గడియ అలస్యమైన ఆకలికి తాళజాలను గనుక, ఏకాదశినాడు ఉపవాసముండుట ఎటులని విచారించుచున్నాను. ఉపవాసమున్న దినముననే ఆకలి ఎక్కువగా ఉండును. గనుక ఆకలి తీరులాగున ఏకాదశీ వ్రతఫలము దక్కులాగున నాకు వివరింపుము" అని భీముడు పలికెను.

భీమసేనుని పలుకులకు ధౌమ్యుడు చిరునవ్వునవ్వి “రాజా! ఏకాదశీవ్రతమునకు దీక్ష అవసరము. దీక్షతో ఏ కార్యము చేసిననూ కష్టములు కనిపించవు. గాన నీవు దీక్షబూనినచో అకలి కలుగదు. రాబోవు ఏకాదశీ అనగా మాఘశుద్ధ ఏకాదశీ మహాశ్రేష్ఠమయినది. దానికిమించిన పర్వదినము మరియొకటి లేదు. ఒక్కొక్కసమయంలో మాఘఏకాదశీరోజు పుషమీనక్షత్రముతో కూడినదై యుండును అటువంటి ఏకాదశికి సమానమగునది మరియొకటి లేదు. సంవత్సరము నందు వచ్చు ఇరువదినాల్గు ఏకాదశులతో మాఘశుద్ధ ఏకాదశి మహాపర్వదినము గాన ఆ దినము ఏకాదశి వ్రతము చేసిన గొప్పఫలితము కలుగును. ఇందు ఏమాత్రము సంశయము లేదు. గాన ఓ భీమసేనా! నీవు తప్పక మాఘశుద్ధ ఏకాదశీవ్రతము ఆచరింపుము. ఆకలి గురించి దిగులుపడకము. దీక్షతో నున్న యెడల ఆకలి ఏమాత్రమూ కలుగదు. 'నియమము' తప్పకూడదు. అని దౌమ్యుడు భీమునకు వివరించెను.

ధౌమ్యునివలన సంశయము నెరవేరుటచే మాఘశుద్ధ ఏకాదశీనాడు అతినిష్టతో వ్రతముచేసి ఉపవాసముండెను. అందులకే మాఘశుద్ధఏకాదశీ 'భీమఏకాదశి' అని పిలుతురు. అంతియేగాక ఓ దిలీప మహారాజా! పరమేశ్వరునకు అత్యంత ప్రీతికరమగు శివరాత్రికూడ మాఘమాసమందే  వచ్చును. గాన మహాశివరాత్రి మహాత్మ్యమును గురించికూడ వివరించెదను. శ్రద్దాళుడవై ఆలకింపుము" అని వశిష్ఠులవారు దిలీపమహరాజుతో ఇటుల పలికిరి.

శివరాత్రి మహాత్మ్యము
ఏకాదశి మహావిష్ణువునకు ఎటుల ప్రీతికరమైన దినమో అదే విధంగా మాఘచతుర్దశీ అనగా శివచతుర్దశి. దీనినే 'శివరాత్రి'యని అందురు. అత్యంత ప్రీతివంతనుయిన ఇది మాఘమాసము నందు వచ్చు అమావాస్యకు ముందురోజు. దానినే 'మహాశివరాత్రి' యని అందరూ పిలిచెదరు.

ఇది మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశినాడు వచ్చును. ప్రతిమాసంఅందువచ్చు మాసశివరాత్రి కన్నా అత్యంత ప్రీతికరమైనది. ఆరోజు నదిలోగాని, తటాకమందుగాని, లేక నూతివద్దగాని స్నానముచేసి శంకరుని పూజించవలెను. పరమేశ్వరుని అష్టోత్తర శతనామావళీ బిల్హ్వపత్రములతో పూజించవలయిను. అటుల పూజించి, శివప్రసాదము సేవించి, ఆ రాత్రి అంతయు తప్పని సరిగా జాగరణమువుండి మరునాడు అమావాస్య స్నానంకూడా చేసిన యెడల ఎంతటి పాపములు కలిగివున్ననూ అవన్నియు వెంటనే హరించుకుపోయి, కైలాసప్రాప్తి కలుగును. శివపూజా విధానములో శివరాత్రికంటె మించినది మరియొకటిలేదు. గనుక మాఘమాసము కృష్ణ పక్షము లోవచ్చు చతుర్దశి ఉమాపతికి అత్యంత ప్రీతిపాత్రమైనది. శివరాత్రి దినమున ప్రతివారూ అనగా జాతిభేదములతో నిమి త్తం లేక అందరూ శివరాత్రివ్రత మాచరించి జాగరణ చేయవలయును.

"మున్ను శబరి నదీతీరమునందున్న అరణ్యములో కులీనుడను బోయవాడు తన భార్యాబిడ్డలతో నివసించుచుండెను. తనకు వేటతప్ప మరొక ఆలోచన లేదు.కడుమూర్ఖుడు వేటకు పోఫుట, జంతువులను చంపి వాటినికాల్చి తాను తిని తన భార్యాబిడ్డలకు తినిపించుటతప్ప మరేదియు తెలియదు. జంతువులనువేటాడుటలో నేర్పుగలవాడు.క్రూరమృగములు సహితం బోయవానిని చూచి భయపడి పారిపోయెడివి. అందుచేత అతడు వనమంతా నిర్భయంగా తిరిగేవాడు.

ఒకనాడు ప్రతిదినము వేటకు వెళ్ళునట్లే బయలుదేరి వెళ్ళెను.ఆనాడు జంతువు లేమియు కంట పడలేదు. సాయంకాలమగుచున్నది. వట్టి చేతులతో ఇంటికి వెళ్ళుటకు మనస్సంగీకరీంచ నందున పొద్దుగుంకి పోయిననూ అక్కడున్న మా రేడు చెట్టుపైకెక్కి, జంతువుకొఱకు యెదురు చూచుచుండెను. తెల్లవారుతున్న కొలది చలియెక్కువగుచు మంచు కురుస్తున్ననూ కొమ్మలను దగ్గరకులాగి వాటితో తన శరీరాన్ని కప్పుకోనుచుండెను. ఆ కొమ్మలజున ఎండుటాకులు రాలి చెట్టు క్రిందవున్న శివలింగముమీద పడినవి. ఆరోజు మహాశివరాత్రి అందులో బోయవాడు రాత్రాంతట తిండితినక జాగరణ వున్నాడు. తనకు తెలియకపోయిననూ మారేడుపత్రములు శివలింగముమై పడినవి. ఇంకేమున్నది! శివరాత్రి మహిమ బోయవానికి సంప్రాప్తించెను. మాఘమాసములో కృష్ణపక్ష చతుర్ధశిరాత్రి అంతయు జాగరణ, పైగా శివలింగముపై బిల్హ్వపత్రములు పడుట తిండి లేక ఉపవాసము వుండుట ఇవన్ని ఆబోయవానికి మేలుచేసినవి.

జరామరణములకు హెచ్చుతగ్గులుగాని, శిశువృద్ధులుగాని లేవు. పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యములనుబట్టి మనుజుడు తన జీవితమును గడపవలసినదే.

మరికొన్ని సంవత్సరములకు ఆ బోయవానికి వృద్ధాప్యముకలిగి మరణమాసన్నమై ప్రాణములు విడిచెను. వెంటనే  యమభటులొచ్చి వాని ప్రాణములు తీసుకుపోవుచుండగా కైలాసమునుండి శివదూతలు వచ్చి యమదూతల చేతిలోనున్న బోయవాని జీవాత్మను తీసుకొని శివుని దగ్గరకు పోయిరి. యమభటులు చేయునదిలేక యమునితో చెప్పిరి. యముడు కొంతతడవు ఆలోచించి శివుని వద్దకు వెళ్ళెను.

శివుడు పార్వతి, గణవతి,  కుమారస్వామి, నంది, తుంబుర నారదాది గణములతో కొలువు తీర్చి వున్న సమయములో యముడు వచ్చి శివునకు నమస్కరించాడు. ఉమావతి యముని దీవించి ఉచితాసనమిచ్చి కుశలప్రశ్నలడిగి వచ్చిన కారణమేమని ప్రశ్నించెను.

అంతట యముడు మహేశా! చాల దినములకు మీ దర్శన భాగ్యం కలిగినందులకు మిక్కిలి ఆనందించుచున్నాను. నా రాకకు కారణమేమనగా, ఇంతకుముందు మీదూతలు తీసుకు వచ్చిన బోయవాడు మహాపాపి, క్రూరుడు దయాదాక్షిణ్యాలు లేక అనేక జీవహింసలు చేయుచున్నాడు. ఒక దినమున అనగా మహాశివరాత్రినాడు తాను యాదృచ్చికముగా జంతువులు దొరకనందున తిండి తినలేదు. ఆ రాత్రి చలి బాధకు తట్టుకొనలేక బిల్హ్వపత్రములను కప్పుకొన్నాడు. జంతువులను వేటాడుటకు రాత్రి అంతయు మెలకువగా వున్నాడు.కాని చిత్తశుద్ధితో తాను శివలింగమును పూజించలేదు. గనుక అతనిని కైలాసమునకు తీసుకొనివచ్చుట భావ్యమా? అంతమాత్రమున అతనికి కైవల్యము దొరుకునా!” అని యముడు విన్నవించుకున్నాడు.

యమధర్మరాజా! ప్రీతికరమైన మహాశివరాత్రి పర్వదినమున బిల్హ్వపత్రములు నాపైన వేసి, తిండిలేక జాగరణతో నున్న యీబోయవాడుకూడ పాపవిముక్తుడు కాగలడు. ఈ బోయవానికి కూడ ఆ వ్రతఫలం దక్కవలసినదే గనుక ఈ బోయవాడు పాపాత్ముడయినను, ఆనాటి శివరాత్రి  వ్రత మహిమవలన నా సాయుజ్యము ప్రాప్తమయినది. అని పరమేశ్వరుడు యమునికి వివరించెను.  యముడు చేయునది లేక చంద్రశేఖరుని వద్దనుండి వెడలిపోయెను.

No comments:

Post a Comment

The Enmity between Lord Narayana (Vishnu) and the Asuras - రాక్షసులపట్ల నారాయణునికి విరోధభావ మెందుకని పరీక్షిత్తు ప్రశ్నించుట

రాక్షసులపట్ల నారాయణునికి విరోధభావ మెందుకని పరీక్షిత్తు ప్రశ్నించుట ఓ మునిశ్రేష్ఠా! శుకమహర్షీ! వికుంఠలోకాధిపతి విష్ణుమూర్తి. అన్ని ప్రాణుల పట...