Thursday, February 5, 2026

Shuka Maharshi Shukudu - శుకుడు(శుక మహర్షి)

శుకుడు(శుక మహర్షి)

భాగవతమంటే పుణ్యకీర్తనుడైన జగదీశ్వరుని దివ్యచరిత్రం. ఇది పరబ్రహ్మకు ప్రతిరూపమైనట్టిది. సర్వపురాణాలలోను శ్రేష్టమైనట్టిది. దీనిని పూర్వం విశ్వకల్యాణార్థమై భగవంతుందైన వ్యాసమహర్షి అత్యంత పవిత్రంగా, ఆనందమయంగా, అనురాగపూర్వకంగా విరచించాడు. దీనినంతా తన కుమారుడైన శ్రీశుకునిచే పఠింపజేశాడు. ఈ భాగవతం సమస్త వేదాలసారం. సకల పురాణాల సారాంశం. గంగానదీమధ్యభాగంలో సంసారవిరక్తుడై, సకలమునిగణసమేతుదై, ప్రాయోపవిష్టుడైన పరీక్షిన్మహారాజు ప్రశ్నించగా, ఆ శుకమహర్షి దీన్ని ప్రవచించడం జరిగింది. మునీంద్రులారా! సావధానంగా వినండి.

ధర్మజ్ఞానసమేతుడై శ్రీకృష్ణుడు ఆత్మపదానికి వెళ్లిపోయాడు. కలిప్రవేశంతో పాపమనే చీకటిలో కూరుకుపోయి జనులంతా అంధులైపోయారు. అట్టివారికి ఈ భాగవతం సూర్యునిలా ప్రకాశించి వెలుగులను నింపింది. ఆనాడు బ్రహ్మతేజస్సుతో విరాజిల్లుతూ శుకుడు ఈ భాగవతాన్ని కీర్తనం చేశాడు. ఆ సమయంలో నేను ఆకళింపు చేసుకొన్నదానిని స్ఫురించినంతమేరకు క్రమంగా మీకు వినిపిస్తాను అని సూతమహర్షి పలికిన వెంటనే మునిశ్రేష్ఠుడైన శౌనకుడు ఇలా అన్నాడు.

సూతమునీంద్రా! ఏ యుగవేళలో, ఏ ఉద్దేశంతో, ఏ ప్రదేశంలో, ఈ భాగవతాన్ని వినిపించుమని ఏ శ్రోతలు శుకమహాయోగిని కోరారు. ఏ కారణంచే వ్యాసభగవానుడు బాగా పరిశోధించి లోకవిఖ్యాతంగా పూర్వం దీన్ని రచించాడు? ఆయన కుమారుడైన శుకుడు ఎటువంటి ఆదరంతో పరీక్షిన్న్మహారాజునకు ఈ భాగవత కథ వినిపించాడు? నినంతా మాకు సవిస్తరంగా వివరించి వినిపించు.

పండితశేఖరా! వ్యాసతనూజుడైన శుకుడనువాడు మహాయోగి. సమదర్శి. బ్రహ్మజ్ఞుడు. మాయాతీతుడు. గూఢవర్తనుడు. జ్ఞానశూన్యునిలా వ్యవహరించేవాడు. దూరంగా విసరివేయబడ్డ సంసారదుఃఖం కలవాడు. సంసార క్లేశాలకు దూరంగా ఉండేవాడు. అంతేకాదు.

ధీమంతుడా! ఒకనాడు దేవకాంతలు జలకాలాడుతున్నారు. దిగంబరుడై ఆ దారిగుండా శుకుడు వెళ్లడం వారు చూచారు. అయినా వారు ఏమాత్రం చలించలేదు. కదలలేదు. సిగ్గుపడలేదు. ఒడ్డుకు వచ్చి వస్త్రాలు ధరించలేదు. కాని ఇంతలో కొడుకు వెనుక “ఓ శుకా!” అని అరుస్తూ వస్తున్న వ్యాసులవారిని కూడ చూచారు. ఆయనను చూడడంతోనే ఆ దేవకాంతలు సిగ్గుతో కుంచించుకుపోయారు. గబగబా గట్టుకుచేరి వస్త్రాలు ధరించారు. ఇది ఎంత విచిత్రమో కదా!

అంత దిగంబరుడు, యౌవనం పొడసూపినవాడు అయిన తన కొడుకునుచూచి ఆ దేవకాంతలు వస్త్రధారణ చేయకుండా- వల్కలధారి, అతివృద్దుడు అయిన తనను చూచి చీరలు చుట్టుకొన్న వారిని చూచి, దానికి కారణమేమని వ్యాసుడు ప్రశ్నించాడు. అప్పుడు వారు “నీ తనయునికి స్త్రీపురుషులనే భేదభావం ఏ కోశానా లేదు. ఆయన నిర్వికల్పుడు. నీలో ఆ భేదభావం ఇంకా పోలేదు. అందువల్ల నీ కొడుకునకూ, నీకు ఎంతో తేడా ఉంది” అని అన్నారు కదా! అటువంటి శుకయోగి కురుజాంగల దేశాలలో ఎలా అడుగుపెట్టాడు? హస్తినాపుర పౌరులు ఆయనను ఎలా గుర్తించగలిగారు? పిచ్చివానివలె, మూగవానివలె, మందునివలె కనబడే ఆ మహర్షియైన శుకయోగికి, రాజర్షియైన పరీక్షిత్తునకు సంవాదరూప సంభాషణ ఎలా చేకూరింది? ఒక సుదీర్ధ గాథగా చెప్పడానికి వీలైన భాగవత పురాణ ప్రవచనం ఏ రీతిగా సాగింది? ఆ శుకుడు గృహస్థుల ఇండ్లలో ఆవుపాలు పిండేటంతకాలం మాత్రమే నిలుస్తాడని, ఆయన గోదోహనమాత్రకాలం ఎక్కడెక్కడ ఉంటాడో ఆ ప్రదేశాలన్నీ పుణ్యతీర్థాలవుతాయని వచిస్తారు. అట్టి మహర్షి అన్నిరోజులు ఒకేచోట ఎలా ఉండిపోయాడు? భక్తశిఖామణియైన పరీక్షినృపమణి ఎలా జన్మించాడు? ఏయే కృత్యాలు ఆచరించాడు? ఆ విశేషాలన్నీ సవివరంగా తెలియజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను.

ఆ పరీక్షిత్తు సాధారణ మానవుడు కాదు కదా! ఏ రాజు తన పరాక్రమంతో పాండవాన్వయ బలధైర్యాలు, కీర్తిప్రతిష్టలు వర్ధిల్లునట్లుగా పరిపాలన సాగించి జీవించాడో, శత్రురాజేంద్రులు బంగారు ధనరాసులను తీసుకొనివచ్చి కప్పం చెల్లించి ఏ చక్రవర్తి పాదద్వంద్వాన్ని సేవించారో, ఏ వీరుని తండ్రియైన అభిమన్యుడు కర్ణద్రోణాది వీరులచే పరిరక్షితమైన పద్మవ్యూహాన్ని చీల్చి చెండాడినాడో, ఎవని పితామహుడైన అర్జునుడు భీష్మాధిపత్య రక్షితమైన కౌరవ సైన్యాన్ని ఛిన్నాభిన్నంచేసి గోగణాన్ని మళ్లించాడో, అట్టి అఖండ యశస్సంపన్నుడైన పరీక్షిత్తు విడిచి పెట్టరాని సామ్రాజ్యాన్ని వదలివేసి, గంగానదీ తీరంలో ప్రాయోపవేశంచేసి, ప్రాణాలు అరచేత పెట్టుకొని ఏ కారణంచేత క్రుంగి కృశించి ఉన్నాడు.

ఉన్నత ప్రశస్తితో విరాజిల్లే మానవోత్తములు ఎప్పుడూ ఆత్మసుఖాలను అంతరాత్మలో ఏ కోశాన కోరరు. నిత్యం సమస్త జనానికి ధనసంపదలు, ఐశ్వర్యం, సౌఖ్యం, శ్రేయస్సు చేకూరాలని అభిలషిస్తారు. పరీక్షిత్తు లోకోపకార పరాయణుడు కదా! అతడు వైరాగ్యంతో, శరీరాన్ని త్యజించడానికి ఏల సిద్ధపడ్డాడో కదా!

“మహాపురుషా! అన్ని గ్రంథాల సారాంశాలను గ్రహించావు. పెక్కు భాషలలో పారంగతుడవయ్యావు. పలు రీతులలో గాథలు గొప్పగా వివరిస్తావు. మేమంతా జ్ఞానపారగులమయ్యేలా సర్వం స్పష్టంగా తెలియబేయవయ్యా!” అని శౌనకుడు అడిగాడు.

No comments:

Post a Comment

Narada Muni encouraged Prajapati Daksa's second group of sons (the Savalasvas/Shabalashva) by awakening their natural affinity for their brothers (the Haryasvas) - నారదుండు శబళాశ్వులకు నివృత్తి మార్గంబు నుపదేశించుట

నారదుండు శబళాశ్వులకు నివృత్తి మార్గంబు నుపదేశించుట ఈ విధంగా ఘోరతపస్సు చేస్తున్న శబలాశ్వులను మోక్షపథగాములుగా చేయడానికి నారదుడు ఇదివరకటిలాగే వ...