Monday, February 9, 2026

Maitreya Maharshi - మైత్రేయుడు మైత్రేయ మహర్షి

మైత్రేయుడు

మైత్రేయమహర్షి కాశీరాజు దివోదాసుని కుమారుడు. వీరు చంద్రవంశమునకు చెందినవారు. వీరి మూలపురుషుడు ధన్వంతరి క్షీరసాగరమధనంలో పుట్టినవాడు. ఆయన తన సహపాటి భరద్వాజుని కూడి ఆయుర్వేదశాస్త్రము కనిపెట్టి లోకమునకు మేలుచేశారు.

మైత్రేయుడు తండ్రి వద్ద విద్యాభ్యాసం పూర్తి అయ్యాక ఆయన ఆజ్ఞ తీసుకొని హిమాలయాలకువెళ్లి 
న్యాయ, ధర్మకోవిదుడు. సకల శాస్త్రాలు, వేదాలు,జ్ఞానం, ధర్మం అధ్యయనం పట్ల ఆసక్తి కలిగిన ఆయన పరాశర మహర్షిని ఆశ్రయించాడు. 

‌అప్పటికే తన వద్ద అనేకమంది శిష్యులు ఉన్నప్పటికీ మైత్రేయుడి విద్యాతృష్ణ, గ్రహణశక్తిని గ్రహించిన మహర్షి ఆతనిని శిష్యునిగా స్వీకరించాడు. సదా పన్నెండేళ్ల బాలుడిలా గోచరించే మైత్రేయుడికి, ఆ మహర్షి తనకున్న విజ్ఞానమంతటిని ప్రసాదించాడు. తనను మించినవాడిగా చేశానన్న తృప్తితో ‘నీవు సమస్త విద్యలను అభ్యసించావు. నీకు నేర్పించ వలసిన విద్యలు ఇంకలేవు’ అని ఆశీర్వదించాడు. అయితే అంతటితో సంతప్తి చెందని మైత్రేయుడు ‘సృష్టి పరిణామం, జీవులు మోక్షసాధనకు సులభమైన మార్గం, యోగం- వైరాగ్యం- తపస్సులలో ఉత్తమ వైదిక కర్మల ఫలం దక్క డానికి మార్గం ఏమిటి?’వంటి అంశాలను తెలుసుకో కోరుతున్నానని బదులిచ్చాడు.శిష్యుడి జిజ్ఞాసకు అబ్బురపడిన మహర్షి, ‘ఈ సమస్త సృష్టి విష్ణుమయం. సమస్త దేవతలలో విష్ణువే కొలువై ఉన్నాడు. ఆయన ప్రకృతి, పురుషుడు, జీవుడు, ముక్తి ’ అంటూ విష్ణుపురాణంలోని విశేషాలను విశదీకరించాడు.

విష్ణుపురాణము అధ్యయనం మైత్రేయునకి యాబైఏళ్లు పట్టింది. మొదటి పది ఏళ్లు రావిచెట్టు క్రింద జరిగింది. తరువాత పది ఏళ్లు బరదికాశ్రమంలో జరిగింది. తర్వాత ముప్పై సంవత్సరాలు ప్రయాగలోని కృష్ణద్వీపంలో జరిగింది. ఒక పురాణము ఇన్ని ఏళ్లు చెప్పటం, వినటం ఆ గురుశిష్యులకే చెల్లింది. వారికి వారేసాటి.

తన సందేహ నివృత్తికి సహకరించిన పరాశరుడికి కృతజ్ఞతలు తెలిపినప్పుడు, శిష్యుని ఆసక్తి జిజ్ఞాసలను గ్రహించిన గురువుకు ఆతడు కోరిన విషయాలను వివరించడం శ్రమ అనిపించదని, శిష్యుని సందేహాలను తీర్చి సంతుష్టులను చేయడం గురువు బాధ్యతే కాదు, ఆనందకర అంశమని పరాశరుడు దీవించాడు. 

పరాశరమహర్షికి శిష్యుడై దేహమునకు తనకుగల బంధమును శాశ్వతంగా తెంచుకొని, దివ్య దేహములందు సంచరించటం అభ్యాసం చేశాడు.

గురువు వద్ద సెలవు తీసుకున్న మైత్రేయుడు తీర్థయాత్రలకు బయలుదేరాడు. తీర్థాలు, క్షేత్రాల గురించి ముందుగానే అవగాహన పెంచుకున్న ఆయన వాటిని విజయవంతంగా సందర్శించాడు.ఆ సందర్భంగా పాండవులను సందర్శించినప్పుడు, కురుపాండవుల మధ్య యుద్ధం అనివార్యతపై ధర్మరాజు ఆయనతో ప్రస్తావించాడు. ఆయన మనోవేదన,చిత్తక్షోభను గమనించిన మైత్రేయ మహర్షి, మరోమారు సంధి యత్నానికి నిర్ణ యించాడు. దానిని దివ్యదృష్టితో గ్రహించిన వ్యాసమహర్షి, ‘ న్యాయ.ధర్మ కోవిదుడు, పక్షపాత రహితుడు మైత్రేయుడు సంధికోసం వస్తున్నాడు. ఎంతటి వారి ఆహ్వాన్నైనా మన్నించని ఆయన నీ సమక్షానికి వస్తున్నాడు. సాదరంగా ఆహ్వానించు’ అని ధృతరాష్రుడికి సూచించాడు. ఆయనా పాటించాడు. యుద్ధం వినాశహేతువని, ఆ ప్రయత్నం విరమించుకోవాలని మైత్రేయ మహర్షి ఎన్నో విధాలుగా చేసిన హితవు దుర్యోధనుడికి మాత్రం రుచించలేదు.

శ్రీ కృషునిచే కలియుగాంతం వరకూ జగద్గురువుగా నియమింపపడ్డ సిద్ధ పురుషుడు. ధర్మం అతని స్వరూపం కాబట్టి సమస్త జీవులకు ప్రేమ, కరుణ నిత్యమూ తన హస్తములనుండి ప్రసరింప చేయుచుండును. ఆయన సంచరించిన ప్రదేశములు పుణ్యతీర్థములై ఉన్నాయి. ఆయన కలాపగుహలలో ఉంటూ దైవకార్యములు చిరకాలం చేయుటకు నిశ్చయించుకున్నాడు. హిమవత్ పర్వత గర్భమున లీనమై పోయిన “శంబల” గ్రామము మరువు, దేవాపి మహర్షుల సాయంతో పునరుద్ధరించారు. 

మైత్రేయ పరాశర సంవాదమే విష్ణు పురాణము. దీనినే పరాశరుని కుమారుడు వ్యాసమహర్షి తరువాత కాలంలో పదునెనిమిది పురాణాలుగా వ్రాశారు. కలియుగంలో మైత్రేయ, విదుర సంవాదముగా భాగవతం ఏర్పడింది. రాబోవుతరం వారిని పుణ్య పురుషులుగా తయారుచేసిన వారిలో మైత్రేయుడు ముఖ్యుడు.

సూర్యవంశమువాడగు “మరువు” చంద్రవంశమువాడగు “దేవాపి” అక్రూరుడు, సాందీపుడు, బృహస్పతి మొదలైన వారిని శ్రీకృష్ణుడు ఎన్నుకున్నాడు. శ్రీకృష్ణుడు సకల జీవుల హృదయాలలో నెమ్మదిగా నిద్రాణమైన చైతన్యాన్ని మేల్కోలిపి వారిని వెలుగుదారిలో దివ్య స్పర్శ నిచ్చి నడిపించదలిచాడు.

అట్టి జీవులకు ఎన్ని జన్మలెత్తినా కలిప్రభావం ఉండదు. ఈ విషయంలో ఒక సిద్ధ పురుషుని సూక్ష్మ శరీరమును వినియోగించదలచి అందుకు మైత్రేయ మహర్షిని తన సాధనముగా ఎన్నుకున్నారు.

శ్రీ కృష్ణుడు వేణునాదం జీవులను చైతన్య పరచుట అనగా మానవుల వెన్నుపూస దండమై మురళిగా, మురళికి క్రింద ఉన్న ఆరు రంధ్రములు సాధకునిలో నిద్రాణమైన ఆరుచక్రములుగా, పైన ఉన్న రంధ్రము సహస్రారముగా చేసి వేణునాదమును జీవులలోని జడమైన కుండలినీ శక్తిని చైతన్య పరచి, క్రిందనున్న ఆరుచక్రాలు దాటి సహస్రారమును చేరే యోగసాధకులుగా మనలని మార్చే నాదమే శ్రీ కృష్ణుని వేణునాదము. ఆ స్థితిని చేరిన సాధకుని కలి ప్రభావం ఏమి చెయ్యలేదు.

ఈ కలియుగమున యోగసాధకులుగా మార్చు వేణునాదముతో చైతన్యము కలిగేవారుగా మార్చుటకు మైత్రేయ మహర్షి నిర్విరామంగా కృషి చేస్తున్నారు.

ఈ మార్గములో తనకు తోడుగా దేవాపి, మరువు మహర్షులను ఎన్నుకున్నారు మైత్రేయమహర్షి. వీరి ముగ్గురి మహర్షుల భుజస్కందము ఆధారంగా అద్భుతమైన తేజోమయ త్రిభుజమును ఏర్పరిచారు. మైత్రేయమహర్షి కలియుగాంతం వరకూ భూమిని కాపాడుచున్నాడు. ఈ యుగములో దివ్యప్రణాళికలో జగద్గురువై నిలచారు.


మైత్రేయ మహర్షి భూమిపై నిలిచిన గొప్ప యోగీశ్వరుడు. ఆయన దివ్య శరీర ధారి, నిర్మలమూర్తి, దర్శనమాత్రంతో సకల మోహములనుండి విముక్తికలిగించు మోహనమూర్తి. సాటి యొగులకు పూర్ణానంద స్థితిని నిలిపి భూమిపై జీవులకు యోగమార్గము ఉపదేశించుటకు వచ్చిన పూర్ణస్వరూపుడు. 

సిద్ధి, బుద్ధి, జ్ఞానము ఆయనకు కరతలామలకము. జ్ఞానము బోధించి యోగమును అభ్యసింపచేసి మనలను ముక్తులను చేసే యోగేశ్వరుడాయన. భక్తి, జ్ఞాన, వైరాగ్యములను యోగం ద్వారా పటిష్టముచేసి నిష్కామకర్మమార్గమున వేలాది జీవులను ఉద్ధరించిన కర్మనిష్టుడు. నిరంతరం పద్మాసనం న కూర్చుండి అష్టాంగ యోగమును అభ్యసించుచుండును. మనస్సు ఎప్పుడూ శ్రీ కృష్ణుని పాదపద్మములందు లీనమై ఉండును. ఆయన శరీరము పలుచనిదై కాంతికిరణములను ప్రసరిస్తూ ఉంటుంది.

No comments:

Post a Comment

The vows and worships of the Goddess as prescribed by the Goddess - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు ఓ సువ్రతా! ఇపుడు నీకు దేవీ వ్రతములగూర్చి తెల్పుదును వినము. ఈ దేవీవ్రతముల నెల...