Wednesday, March 4, 2026

Sree Maha Bhagavathamu Part 5.2 - శ్రీ మహా భాగవతము పంచమస్కంధము ద్వితీయాశ్వాసము

శ్రీరస్తు శీమహాభాగవతము పంచమస్కంధము - ద్వితీయాశ్వాసము

శ్రీకాంతాహృదయప్రియ!, లోకాలోకప్రచార! లోకేశ్వర! సు
శ్లోక! భవభయనివారక!, గోకులమందార! నందగోపకుమారా!


లక్ష్మీదేవి మనసు మెప్పు పొందినవాడవూ, చక్రవాళపర్యంతం పేరెన్నిక గన్నవాడవూ, లోకాలన్నింటికి ప్రభువయినవాడవూ, మంచి యశస్సు కలవాడవూ, సంసారభయాలను నివారించేవాడవూ, గోకులంలోని వారికి కల్పవృక్షం వంటి వాడవూ, నందగోపుని కుమారుడవూ అయిన శ్రీకృష్ణా! అవధరించు.

(లోకాలోక పర్వతానికే చక్రవాళ పర్వతమని పేరు. ఈ పర్వతం భూమిని చుట్టి ఉంటుంది. ఇక్కడ లోపలి భాగం వెలుతురుతోను వెలుపలి భాగం చీకటితోను నిండి ఉంటుంది.)

సమస్త పురాణ గాథల రహస్యాలను తెలుసుకోవడంలో విఖ్యాతుడయిన సూతుడు శౌనకాది మహామునులతో ఈ విధంగా చెప్పాడు.

మునులార! బాదరాయణుని కుమారుడయిన శ్రీ శుకుడు పుణ్యాత్ముడూ, ఉత్తరానందనుడూ అయిన పరీక్షిత్తుకు భరతునిచరిత్ర చక్కగా వినిపించి ఆ తర్వాత తగినరీతిలో ఇలా అన్నాడు.

(వేదవ్యాసునికే పరాశరాత్మజుడు, కృష్ణద్వైపాయనుడు, బాదరాయణుడు, శుకతాత అనే పేర్లున్నాయి.

శ్లో వ్యాసం, వశిష్ఠ నప్తారం శక్తేః పౌత్ర మకల్మషమ్‌ ।
     పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్‌ ॥

బ్రహ్మ - వశిష్ఠుడు - శక్తి - పరాశరుడు - వ్యాసుడు - శుకుడు. ఇది వ్యాసుని వంశవృక్షం. వ్యాసుడు వశిష్టనికి మునిమనుమడు. శక్తికి మనుమడు. పరాశరునికి పుత్రుడు. తపోనిధి. శుకుని తండ్రి.)

భరతుని కుమారుడయిన సుమతి ధర్మయుక్తంగా పరిపాలన సాగిస్తున్న సమయంలో, దుర్మార్గులయిన పాషండులు తమ మతాన్ని స్థాపించాలని అతని దగ్గరికి వచ్చి ఈ విధంగా పాగడసాగారు.

ఓ రాజా! 'మేము నిత్యమూ బుద్ధభగవానుని కొలిచినట్టుగా నిన్ను కూడా సేవిస్తాము అంటూ ప్రియోక్తులతో తమ ధర్మాలను సుమతికి బోధింపసాగారు.

వేదనిందలయిన పాషండుకులు క్రమంగా సుమతిని ప్రోత్సహిస్తూనే ఉన్నారు. అటువంటి సమయంలోనే సుమతి భార్య అయిన దేవసేనకు దేవతాజిత్తు అనే కొడుకు పుట్టాడు. అతడికి ఆసురి అనే భార్యవల్ల దేవద్యుమ్నుడనే సుపుత్రుడు జన్మించాడు. మహాపురుషుడైన ఆ దేవద్యుమ్నునికి ధేనుమతివల్ల పరమేష్ఠి పుట్టాడు. సత్యసంధుడయిన అతనికి సువర్చలవల్ల ప్రతీహుడు కలిగాడు. అతడు చాల గొప్పవాడు. అందువల్ల జనులకందరికి బ్రహ్మోపదేశం చేశాడు. అతడు పరిశుద్ధమయిన మనస్సుతో హరిస్మరణ చేస్తుండేవాడు. ఆ ప్రతీహుడికి ప్రతిహర్త, ప్రసోత, ఉద్గాత అనే ముగ్గురు కుమారులు పుట్టారు. వారు ముగ్గురూ యజ్ఞాలు చేయడంలో నిపుణులు. వారిలో ప్రతిహర్తకు స్తుతి అనే భార్యవల్ల వ్యోముడు, భూముడు అనే ఇద్దరు కొడుకులు పుట్టారు. వారిలో భూమునికి ఋషికుల్య అనే భార్యవల్ల 'ఉద్గీథుడు' అనే కొడుకు పుట్టాడు. అతనికి దేవకుల్యవల్ల 'ప్రస్తోత' అనే కుమారుడు జనించాడు. ఆ ప్రస్తోతకు 'వరరుత్స' వల్ల విభుడనే కొడుకు పుట్టాడు. అతనికి భారతివల్ల 'పృథుషేణుడు' కలిగాడు. పృథుషేణునికి 'ఆకూతి' వల్ల 'నక్తుడు' జన్మించాడు. ఆ నక్తుని కుమారుడే గయుడు. ఆ గయుడు రాజర్షులలో చాలా గొప్పవాడై ఎంతో కీర్తి గడించాడు.

(ప్రతిహర్త, ప్రస్తోత, ఉద్గాత, ఉద్గీథ అనే పేర్లు వైదికమైన యజ్ఞానికి సంబంధించిన ఋత్విజుల పేర్లు. 
ఋత్విజుడు : యజ్ఞం చేయించేవానిని యాజకుడు అంటారు. అంటే యజ్ఞకర్తయైన యజమానుని వద్ద దక్షిణ పుచ్చుకొని యజ్ఞం చేయించే బ్రాహ్మణుడు.

ఋత్విజులు నలుగురు. 1) హోత 2) ఉద్గాత 3) అధ్వర్యువు 4) బ్రహ్మ - వీరిలో ఒక్కొక్కరికి ముగ్గురు చొప్పున సహాయక ఋత్విజులుంటారు. (4x౩=12) ఆ పన్నెండు ఋత్విజుల పేర్లివి - 1)బ్రాహ్మణాచ్చంసి 2) ప్రస్తోత ౩) మైత్రావరుణుడు 4) ప్రతిప్రస్థాత 5) పోత 6) ప్రతిహర్త 7)అచ్చావాకుడు 8) నేష్ఠ 9) ఆగ్నీధ్రుడు 10) సుబ్రహ్మణ్యుడు 11) గ్రావాస్తుతుడు 12) ఉన్నేత.

అధ్వర్యుడు : యజుర్వేదంలో చెప్పబడిన మంత్రాలను పఠిస్తూ యజ్ఞంలో చేయవలసిన హోమాది ప్రధాన కృత్యాలను ఆచారించే ఋత్విక్కు.

హోత : ఋగ్వేద మంత్రాలతో హోమకాలంలో, ఆయా దేవతలను పిలిచే ఋత్విక్కు అందుకే ఋగ్వేదానికి 'హౌత్రవేద' మని పేరు.

ఉద్గాత : సామవేద మంత్రాలతో హోమాది కాలాలలో ఆయా దేవతా సంతుష్టికోసం గానం చేసే ఋత్విక్కు కాబట్టి సామవేదానికి 'ఉద్గాతృవేద' మని నామాంతరం.

బ్రహ్మ : పై ఋత్విక్కులు చేసేదీ, యజమానుడు చేసే, సకల కృత్యాలను పరీక్షిస్తూ సాక్షీభూతుడై అనుజ్ఞ ఇచ్చే ఋత్విక్కు అధర్వవేదానికి 'బహ్మవేద' మని పేరు.

ఆగ్నీధ్రుడు : దేవతలకు సమర్పించే చరు, పురోడాశాది హవిస్సులు చేయడానికి, తదితర క్రియాకలాపాల్లో సహాయం చేసే ఋత్విక్కు ఆగ్నీధ్రుడు. 'చరువు' అంటే బియ్యంతో వండిన హోమద్రవ్యం. పురోడాశమంటే బియ్యపు పిండితో కపాలంలో/కుండ పెంకుమీదగాని చక్కగా కాచి పక్వం చేయబడిన పిండిముద్ద.

ఉద్గీథ : సామవేదము (ఉద్గాతృవేదము))

సకల జీవరాసులను రక్షించడానికి విష్ణువు సత్త్వ ప్రధానమయిన దేహం ధరించి ఆత్మతత్త్వాన్ని తెలిసినవాడుగా(గయుని రూపంలో) ఉన్నాడు.

గయుడు మహాసద్గుణ సంపన్నుడు. ఆ మహానుభావుని కథలన్నీ పురాణవేత్తలయిన మహాత్ములకు బాగా తెలుసు. వారందరు గయుణ్ణి ఏ విధంగా స్తుతిస్తున్నారో చెబుతాను. నీవు శ్రద్ధగా విను.

పరీక్షిన్నరేంద్రా! గయుడు ధర్మమార్గానుసారంగా ప్రజలను సత్కర్మలలో నియోగిస్తూ మంచిమాటలతో బుజ్జగిస్తూ, మంచి పనులను ప్రోత్సహిస్తూ, అవసరమయినపుడు గట్టిగా మందలిస్తూ ఎంతో సంతోషిస్తూ పరిపాలించాడు. యజ్ఞాలు నియమాలతో నిర్వర్తించేవేళ తన మనస్సులో యజ్ఞపురుషుడయిన ఈశ్వరుని నిలిపి సేవించాడు. హృదయస్థుడైన ఈశ్వరుని సందర్శించాడు. సకల జీవరాశికి ఆనందం కలిగేలాగా స్వాభిమానం లేకుండా భూమిని పరిపాలించాడు. సత్యవిషయంలో, మంచివారిని సేవించడంలో, ధర్మసంబంధంలో, యజ్ఞకర్మల విషయంలో గయుడు సాక్షాత్తు విష్ణుస్వరూపుడేగాని మానవమాత్రుడు కానే కాడు.

మహాపురుషులకు ఎటువంటి గుణాలు ఉండవలెనో అటువంటి గుణాలు కలవాడు గయుడు. ఆ కారణంవల్ల దక్షప్రజాపతి పుత్రికలయిన శ్రద్ధ, మైత్రి, దయ మొదలయిన దేవతలు తమంత తాముగా వచ్చి వరాలు ప్రసాదించారు. భూదేవి ఆయనకు కామధేనువయింది. వేదాలు కోరిన కోరికలు అనుగ్రహిస్తున్నాయి. యుద్ధంలో పరాజయం పొందిన రాజులు కప్పం చెల్లిస్తున్నారు. బ్రాహ్మణులు తమ పుణ్యసంపదలలో ఆరవభాగం పంచియిస్తున్నారు. ఎడతెగని సోమపానంతో, శ్రద్ధాభక్తులతో నిర్వహింపబడే యజ్ఞాలతో ఇంద్రాది దేవతలు సంతృప్తిపడుతూ ఆయా యాగాల ఫలాలను ప్రసాదిస్తున్నారు. బ్రహ్మ మొదలు గడ్డిపరక పర్యంతం అన్నిరకాల ప్రాణులను గయుడు సంతృప్తిపరిచాడు. ఇందువల్ల శ్రీహరికూడా సంతుష్టుడైనాడు. ఈ విధంగా గయుడు చాలకాలం రాజ్యపరిపాలన గావించాడు.

అలాంటి గయునికి జయంతివల్ల మువ్వురు కొడుకులు పుట్టారు. వారే చిత్రరథ, స్వాతి, అవరోధనులు. చిత్రరథునికి ఊర్ణవల్ల సమ్రాట్టు. సమ్రాట్టుకు ఊర్మిళవల్ల మరీచి, మరీచికి బిందుమతివల్ల బిందుమంతుడు జన్మించారు. ఆ బిందుమంతునికి సరఘవల్ల మధువు, మధువుకు సుమనసవల్ల వీరవ్రతుడు, వీరవ్రతునికి భోజవల్ల మన్యుప్రమన్యులనే ఇద్దరు కుమారులు కలిగారు. వారిలో మన్యువుకు సత్యవల్ల భువనుడు, భువనునికి దోషవల్ల త్వష్ట ధర్మాత్ముడయిన త్వష్టకు విరోచనవల్ల విరజుడనేవాడు జన్మించాడు.

(రాజ్యపరిపాలన చేసేవారికి నాలుగు అంశాలు ముఖ్యం. పోషణం మొదటిది. రెండవది ప్రీణనం, మూడవది ఉపలాలనం, నాల్గవది అనుశాసనం. ప్రజలకు తగినంత ఆహారం సమకూర్చడం, సంతృప్తిపరచడానికి ప్రియవస్తువులు ఇవ్వడం, కొన్నిమార్లు సమావేశపరచి ప్రియమయిన వాక్కులతో సంతోషపరచడం, ఉత్తమ పౌరులు కావడానికి తగిన ఉపదేశం ఇవ్వడం.)

ఓ రాజా! ఆ విరజునికి విషూచివల్ల నూరుగురు కుమారులు పుట్టారు. ఆపై ఒక కన్యక కూడా జనించింది. తమ భూపతికి కలిగిన సంతాన సంపత్తికి సకలజనులు సంతోషించారు.

ప్రియవ్రతుని వంశంలో విరజుడు చివరివాడు. ఇంద్రుని తమ్ముడైన ఉపేంద్రుని లాగున అతడు రాజవంశంలో రాణించాడు.

ఈ విధంగా పలికిన శుకమహర్షి మాటలకు అభిమన్యు కుమారుడయిన పరీక్షిత్తు చాల సంతోషించాడు. ఇంకా విష్ణు మహిమలను వినాలనే కుతూహలంతో మరల ఈ విధంగా ప్రశ్నించాడు.

మునీంద్రా! ఎందాక సూర్యరశ్మి ప్రసరిస్తుందో, ఎందాక నక్షత్రాలతో కూడిన చంద్రుని కిరణాలు వ్యాపిస్తుంటాయో, అందాక ప్రియవ్రతుని రథచక్రాల ఒరిపిడులవల్ల సప్తద్వీపాలు, సప్తసముద్రాలు ఏర్పడ్డాయని చెప్పారు గదా! ఆ ద్వీపాల పరిమాణాలనూ, సముద్రాల పరిమాణాలను సవిస్తరంగా తెలియజెప్పు. ఈ లోకమంతా గుణమయమయిన శ్రీహరి స్థూల స్వరూపమే. అందువల్ల అటువంటి భావనను లోకమందు నిలిపినట్లయితే నిర్గుణమూ, సూక్ష్మమూ, స్వయంప్రకాశమూ, బ్రహ్మస్వరూపమూ అయిన వాసుదేవునియందు మనస్సు సుస్థిరంగా లగ్నమవుతుంది. అందుచేత ద్వీపాలకూ, వర్షాలకూ, సముద్రాలకూ సంబంధించిన విశేషాలను సవిస్తరంగా తెలుపవలసింది అని ప్రార్ధించగా శుకయోగి పరీక్షిత్తుతో ఇలా అన్నాడు.

రాజా! నీవడిగిన దానికి సమాధానం చెబుతాను. విను. ఈ సముద్రాలు, ఈ ద్వీపాలు, ఈ భూభాగం అన్నీకూడా శ్రీహరి మాయవల్ల పుట్టిన వైభవాలే. వాటిని సంపూర్ణంగా వర్ణించి చెప్పడం ఎవరికి చేతనవుతుంది?

"నాకు తెలిసినంతవరకు సంక్షిప్తంగా చెబుతాను. నీవు ఏకాగ్రచిత్తంతో వినుము" అని శుకమునీంద్రుడు పరీక్షిత్తుకు చెప్పసాగాడు.

శుకయోగి యుపదేశమునం దెల్పుభూగోళ నిర్ణయము

No comments:

Post a Comment

Ranga Panchami Deva Panchami - రంగ పంచమి దేవ పంచమి

రంగ పంచమి దేవ పంచమి దీపావళిని ఎలా అయితే 5 రోజుల పాటు చేసుకుంటారో. అలానే కొన్ని ప్రాంతాలలో హోలీని కూడా ఐదు రోజులు జరుపుకుంటారు. వాటిల్లో చివర...