Monday, March 9, 2026

The Hamsa-guhya Stotra is a praise of Lord Vishnu by Prajapati Daksha - దక్షుడు కావించిన హంసగుహ్యం బను స్తవరాజము

దక్షుడు కావించిన హంసగుహ్యం బను స్తవరాజము

సర్వశ్రేష్ఠుడై అనుగ్రహం చూపడానికి చైతన్య శక్తితో సాక్షాత్కరించే ఆ దేవదేవునికి నమస్కారం చేస్తాను. నిత్యం ప్రకాశించే పరమాత్మునికి వందనం చేస్తాను. అద్భుతమైన దివ్యానుభూతే రూపంగా వెలుగొందేవానికి నమస్కరిస్తాను. నిమిత్తమాత్రంగా బంధువైనట్టి సగుణసాకారమూర్తి అయిన పరమాత్మకు స్తుతులు సమర్పిస్తాను.

గుణాలలో చిక్కుకున్నవారికీ, కేవలం తాత్త్విక బుద్ధితో అన్వేషించే వారికీ నీ ఉనికి తెలియరానిది. మొదటినుండి ఉన్నవాడవు నీవు! మోక్షానికి పరమావధివై ప్రకాశించే వాడవు నీవు! అలాంటి అంతర్యామివైన స్వామిని నిన్ను ఆశ్రయిస్తున్నాను.

నీవు సర్వప్రాణుల దేహాలయందు జీవాత్మ రూపంలో ఉంటున్నావు, కానీ త్రిగుణాలచే బద్దుడైన జీవుడు తనలోనే అంతర్యామిగా వున్న నిన్ను గుర్తించలేకున్నాడు. త్రిగుణాలకు లోబడి ఇతరులతో కలసి ఉంటున్నాడు. కాని, ఓ పరమాత్మా! గుణాతీతుడవైన నీతో కలసి ఉండడమే లేదు. అలాంటి ఓ పరమాత్మా నిన్ను సేవిస్తాను.

మనసు, శరీరం, ప్రాణాలు, పంచేంద్రియాలు, పంచప్రాణాలు చక్కని వివేచనతో ప్రయత్నించకపోతే తప్ప జీవుడు తమలో ఉన్న పరమాత్మను చూడలేడు. అటువంటి సర్వగుణ సహితుడైన జీవునిలో అంతర్యామిగా ఉండేవాణ్ణి, సమస్తప్రాణులకూ మేలు కలిగించే వాడినీ, మూలపురుషుడిని ఆశ్రయిస్తాను.

మనస్సు సంకల్ప వికల్పాలకు స్థానం. మనసులో అనేక విరుద్ధ భావాలు సంఘర్షణకు గురై వస్తూ, పోతూ వుంటాయి. ఈ విధమైన మనస్సు ఇంద్రియాల విషయంలో నిగ్రహాన్ని నిలుకడను పొందగల్గితే దానిని నిర్వికల్పసమాధి అంటారు. ఈ విధమైన జ్ఞానానికి మూలమైన అంతరాత్మస్వరూపానికి నమస్కారం. కట్టెలో మిక్కిలి గూఢంగా ఉన్న అగ్నిని రాపిడిశక్తిచేత బయటకు రప్పించినట్టు, బుద్ధిమంతులు తమ మనసనే ఆకాశమందు విహరించే పరమాత్మను తమయొక్క ఇచ్చాజ్ఞానక్రియలనే ఆత్మశక్తులచేత సాక్షాత్కరింపజేస్తారు. అటువంటి ఏకాత్మరూపుడైన నిర్గుణ పరబ్రహ్మ 'ఏకోహం బహూస్యాం' అనే సంకల్పంతో అనేక నామరూపాలను ధరించి విశ్వరూపి అయ్యాడు. అటువంటి సర్వాత్మకుడు నన్ను అనుగ్రహించుగాక. అవాఙ్మానస గోచరుడు, నిర్గుణ పరబ్రహ్మ, సృష్టిస్థితి లయకారణుడు అయిన దేవదేవుణ్ణి ఆశ్రయిస్తాను. ఏ దేవుని మాయాప్రభావం కారణంగా పండితులు, పామరులు, భగవంతుని విషయంలో ఉన్నాడు, లేడు అని వాదించుకుంటారో, వారందరియందు కూడా ఒకే ఆత్మశక్తిగా ఉంటూ, యోగాది ఉపాసనా ధర్మాలు వేరైనా 'నదీనాం సాగరో గతిః' అన్నట్లు వాటన్నిటికి ఒకే గమ్యరూపమైన పరాత్పరుడు నాకు అనుకూలంగా మారునుగాక. నిర్గుణుడు, నిరాకారుడు ఐన పరమాత్మ జగత్తును రక్షించటంకోసం సద్గుణుడు, సాకారుడు అవుతున్నాడో; అటువంటి సర్వవ్యాపకుడు నాకు ప్రసన్నుడు అగుగాక. ఏ భగవానుడు జీవుల పూర్వజన్మ విశేషం కారణంగా ప్రస్తుతజన్మలలో జ్ఞానమనే జ్యోతిగా వెలుగొందుతూ, భూ పదార్థాల వాసనతో కూడుకున్న వాయువు (గాలి) మాదిరిగా అన్నింటిలో ఉంటూ, అన్నింటికి దూరంగా ఉండగలిగే నారాయణుడు నా కోరికను తీర్చుగాక. అని భక్తితో నిండినవాడై తన మాటలతో కీర్తిస్తున్న దక్షునికి, భక్తపాలకుడైన శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమైనాడు. అంత

శ్రీమన్నారాయణుడు గరుత్మంతుని మీద ఆసీనుడై ఉన్నాడు. గరుడుని రెండు భుజాలమీద చాచిన ఆ స్వామి పాదాలు మేరుపర్వతం చరియకు రెండుప్రక్కలా ప్రకాశించే ఇంద్రనీలమణుల గనులవలె ఉన్నాయి. ఆయన అష్టబాహువులూ అందంగా పైకిచాచిన అష్టదిగ్గజాల తొండాలవలె ప్రకాశిస్తున్నాయి. ఎనిమిది చేతులలోనూ చక్రమూ, ధనుస్సూ, కత్తి, శంఖమూ, ఖడ్గమూ, పాశమూ, డాలూ, గదాదండమూ విరాజిల్లుతున్నాయి. నల్లని దేహంతో నగుమోముతో సాధుజనులను సంరక్షించే చల్లనిచూపులతో బంగారురంగు పట్టుపీతాంబరంతో మణిమయకిరీటంతో నలుమూలలా కాంతులు విరజిమ్మే భూషణాలతో, మకరకుండలాలతో పుండరీకాక్షుడు దక్షునిముందు ప్రత్యక్షమైనాడు.

మకర కుండలాల కాంతి చెక్కిళ్ళపై చంద్రకాంతిలా ప్రసరిస్తుండగా, కిరీటం యొక్క శ్రేష్టమైన ప్రకాశం ఆకాశలక్షికి కుంకుమరంగు వస్త్రంగా మారగా, వక్షఃస్థలం మీద వనమాలికల కాంతి శ్రీవత్సం, కాస్తుభమణుల కాంతిలో కలిసి అతిశయిస్తుంటే, నల్లని కొండను చుట్టిన మెఱుపు తీగల మాదిరి స్వామి భుజకీర్తులు శోభిస్తుండగా, సకల లోకాలనూ సమ్మోహింపజేస్తూ, నారదుడు మొదలైన దేవర్షులు, మహర్షులు స్వామిని సేవిస్తుండగా, గంధర్వాది దేవగణాల కీర్తనలు చెవులకు ఆనందం కలిగిస్తుండగా

సర్వశక్తిమంతుడు, సర్వాత్మకుడు, సర్వవ్యాపకుడు, శాశ్వతుడు, సర్వదుడు అయిన ఆ శ్రీహరి తనను సమస్త భక్తజనులు సేవిస్తుండగా దక్షునికి ప్రత్యక్షమయ్యాడు.

ఈ విధంగా సాక్షాత్కరించిన సర్వేశ్వరుని దివ్యరూపం సర్వదిక్కులనూ వెలిగిస్తూ మహాశ్చర్యాన్ని కలిగించింది. అలా ప్రకాశించే ఆ దేవదేవుని తేజోమయమూర్తిని వీక్షించి, దక్షుని హృదయంలో భయమూ, ఆనందమూ, ఆశ్చర్యమూ ముప్పిరి గొన్నాయి. ఎలాగో ఆ తన్మయత్వంనుండి తెప్పరిల్లి తొట్రుపాటుతో దక్షుడు స్వామికి సాష్టాంగదండ ప్రణామం చేశాడు. జోడించి మోడ్చి నిలుచున్నాడు. సెలయేళ్లు కలయికతో దరులొరసి పొంగి మిన్నంటి సముద్రాన్ని దరిసిన మహానదీ ప్రవాహంవలె దక్షప్రజాపతి పులకించిన దేహంతో భగవంతుని ముందు నిలిచాడు. ఆయన పరవశించిన తన హృదయాన్ని ఎలాగో అదుపు చేసుకొని పొంగిపొరలే ఆనందంతో ఆ పరమేశ్వరునితో ఏమేమో పలుకాలి అనుకొన్నాడు. పరమ మంగళదాయకాలైన ఆయన పవిత్రనామాలను ఉచ్చరించాలనుకొన్నాడు. పరమపవిత్రాలైన ఆయన లీలలను అభివర్ణించాలనుకొన్నాడు. విబుధులకు సంతోషాన్ని కలిగించే ఆయనపరాక్రమాన్ని ప్రస్తుతించాలనుకొన్నాడు. తన మనస్సులోని కోరికను వెల్లడించాలనుకొన్నాడు. కానీ పాపం! ఏమీ చేయలేక పోయాడు. ఆ విధంగా మైమరచి నోట మాటరాక మౌనం వహించి ఉన్న ప్రజాకాముడైన ప్రజాపతిని చూచి, సర్వజ్ఞుడూ సర్వప్రాణి హృదయాంతర్యామీ అయిన ఆ స్వామి అతని అభిప్రాయాన్ని గ్రహించి, ఆర్తజనులను రక్షించే లక్షణంగల మాటలతో ఇలా అన్నాడు.

ఓ దక్షా! నీ తపస్సుకు మెచ్చాను. అందుకు ఈ క్షణంలోనే నీకు ఫలసిద్ధిని ప్రసాదిస్తున్నాను. నానుండి వరం పొందడానికి ఈలోకంలో నీకంటె అర్హుడు ఎవడున్నాడు?

ఈ నీ తపస్సు ఇక చాలు. సకల జీవరాశులకు సమస్త సంపదలు సిద్ధిస్తాయి. నీవు సృష్టి చేయాలనే కోరికతో నన్ను గూర్చి తపస్సు చేశావు. నా సంకల్పం కూడా ఇదే. నీ తపస్సు నెరవేరింది.

ఇంకా చెబుతాను విను. బ్రహ్మ, రుద్రుడు, ప్రజాపతులు, మనువులు, ఇంద్రాదులు వీరందరూ నా అంశకు చెందినవారే. వేదచోదితమైన సంధ్యావందనాదులు నా మనస్సు. జపధ్యానాదులు నాశరీరం. ధ్యానధారణాది మానవకార్యాలు నా ఆకారం. యోగాదులు అవయవాలు. ధర్మం నా ఆత్మ. దేవతాగణాలు జీవములు. వేదం నా స్వరూపం. సృష్టిపూర్వం నేను మాత్రమే ఉన్నాను. శాశ్వతుడైన నా నుండి సంకల్ప మాత్రాన ఈ బ్రహ్మాండం, బ్రహ్మ తమకు తాముగా పుట్టారు. నా తేజస్సును కలిగి ఉన్న బ్రహ్మ క్రియారహితుడై ఉన్నప్పుడు నాచే ప్రేరితుడై ఘోరతపస్సు చేశాడు. తదనంతరం నా సంకల్పంతో ప్రజాసృష్టి చేయగల మిమ్మల్ని సృష్టించాడు.

ప్రజాపతులలో ఒకడైన పంచజనుని కుమార్తె ఐన అసిక్నిని నీకు భార్యగా అనుగ్రహించాను. గృహస్థ ధర్మాన్ని పాటించి మీరు అత్యధిక ప్రజలను సృష్టించండి. నీ సంతానం కూడా నాచే ప్రభావితులై సృష్టిని పెంపొందిస్తారు అని ఆదేశించి మాయమయ్యాడు. అప్పుడు దక్షుడు స్వామి ఆజ్ఞమేరకు అసిక్నితో కూడి పదివేలమంది హర్యశ్వులకు జన్మనిచ్చాడు. వారు తండ్రి ఆజ్ఞమేరకు ప్రజాసృష్టికోసం తపస్సు చేయడానికి సింధునది సముద్రసంగమ ప్రాంతమైన విశిష్ట పుణ్యతీర్థమైన నారాయణసరస్సునుచేరి అందు స్నానం చేసి పవిత్ర మనస్కులై తపస్సు ప్రారంభించారు. ఆ సమయంలో వారి వద్దకు నారదుడు వచ్చి ఇలా అన్నాడు.

నారదుండు హర్యశ్వులకు నివృత్తి మార్గంబు నుపదేశించుట

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

పంచాంగం

No comments:

Post a Comment

Daksha cursed Narada to wander the universe forever without a fixed home - దక్షుండు నారదుని శపియించి ప్రజాసర్గం బొనరించుట

దక్షుండు నారదుని శపియించి ప్రజాసర్గం బొనరించుట అది ఎలాగంటే - వీరు బాలురు. దేవఋషి పితృబుణాలు తీర్చుకోలేదు. ఏ కర్మలను చేయలేదు. కర్మల అనిత్యత్వ...