Saturday, April 11, 2026

SRI DEVI BHAGAVATHAM PART 3 - శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము

శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము
































శ్రీ దేవీ భాగవతం చతుర్థ స్కంధము

Chapter 35 Trimurthulu Trimurthula is awe-inspiring - అధ్యాయము 35 త్రిమూర్తులు త్రిమూర్తులను గని విస్మయమందుట

శ్రీ దేవీ భాగవతం తృతీయస్కంధము - అధ్యాయము 35

త్రిమూర్తులు త్రిమూర్తులను గని విస్మయమందుట

బ్రహ్మ యిట్లనియె: ఆ దివ్యవిమానము మనోవేగమున మరొక చోటి కేగినది. మా కచట నీరు కనిపింపలేదు. అందులకు మే మాశ్చర్యము జెందితిమి. ఆ ప్రదేశమందంతట పర్వతములు మధుర ఫలభరితములై కోకిలల కుహూకుహు రాగములుగల వృక్షము శోభలతో నొనరు వనోపవనములు-స్త్రీ పురుషులు పశుసంపదలు పసిడిపంటలు నదీనదములు సెలయేళ్లు వాపీకూప తటాకములు నీటి చిలుపలు యాగశాలలు ఎత్తైన ప్రాకారములు పలు సుందరభవనాలు గల్గి కలకలలాడు నగరములు నిండి కన్నులపసండువుగ నుండును. మే మా దివ్యనగరమునుంగాంచి యిది స్వర్గసీమ గాబోలు! ఇంత మహాద్భుతముగ దీని నెవరు నిర్మించిరో కదా? ఆహా! ఏమి వింత! అనుకొని పరమాశ్చర్య మందితిమి. అంతలో నచ్చట వేటాడుచు విహరించుచు ఇంద్రుని బోలు ఆ నగరపు రాజును విమానముపై తేజరిల్లు జగదంబికయు కనబడిరి. ఆ విమాన మొక్క మూర్తమాత్రమున వేగమున మరొక మనోహరప్రదేశమున కరిగెను.

అచట మేము నందనవనమును నందులో చల్లని పారిజాతపు నీడ చలువలో సుఖించు కామదేనువును గాంచితిమి. దానికి సమీపమందు నాల్గుదంతములుగల మహాగజము గలదు. అచ్చట మేనక మున్నగు నచ్చరలు రాగ తాళ మధుర బావములతో నాట్యమాడుచుండిరి. గంధర్వ విద్యాధరులు నందన వన వాటికలో గుమిగూడి గానములతో ఆనందపరవశులై యుండిరి. ఇంద్రాణీ సహితముగ నింద్రుడు మాకు గనబడెను. రవి యమ వరుణ కుబేరులు నచట నుండిరి. మే మచట నటు లాసురలనుగాంచి విస్మయమందితిమి. అంతలో ఆ నగరపు రాజు దేవరాజువలె అక్షోభ్యుడగు నరవాహనముగల పల్లకిలో నెక్కి బయలువెడలెను. మా విమాన మటులు మాతోకూడ మహావేగమున మరల ముందుకు సాగి సర్వదేవ నమస్కృతమగు బ్రహ్మలోకమును జేరెను. అచట కమలాసనుడగు బ్రహ్మనుగని శివకేశవులు చోద్యమందిరి. ఆ బ్రహ్మసభలో వేదములు సాంగములుగ రూపుదాల్చి వెలుగొందుచుండెను. అచ్చో దివ్యసాగరమును నదీపర్వతములును మాకు నయనానందము గల్గించినవి. అంత శివకేశవు లీ క్రొత్త బ్రహ్మ యెవరని నన్నడిగిరి. నేను రెండవ సృష్టికర్త నెరుంగనంటిని. ఇతడెవరో! నేనెవరనో! ఇదంతయు నాకే మాత్రము దోచుటలేదు' అని నేనను నంతలో మా విమానము మనోవేగముగ ముందునకు సాగెను.

అట్లు మా విమానము సాగిసాగి కైలాసగిరి జేరెను. అచట యక్షగణములు జేరి శివుని భక్తిమీర గొల్చుచుండిరి. కీరకోకిలములు మధుర గానముల నలరొందు మందారవనములును నట గలవు. పరమశివుడు వీణామురజ వాద్యములనుండి వెడలు చల్లని మధురరాగములను చెవులపండువుగ వినుచుండెను. ఆ శివుడు మా విమానమునుగని కైలాసమును వదలి పెట్టెను. ఆ రీతిగ నెలతాలుపు పంచాననుడు దశభుజుడు ముక్కంటి వృషవాహనుడునగు శంభుభగవానుడు కైలాసము నుండి బయటికి వెడలెను. ఆ సాంబసదాశివుడు మొలయందు పులితోలును పైని నేనుగు తోలుత్తరీయమును దాల్చియుండెను. ఆ పురాణదంపతుల కిరుప్రక్కల మహావీరులగు గణపతి కుమారు లుండిరి. అట్లు నంది మున్నగు గణశ్రేష్ఠములు తన కూర్మి తనయులు తన్ను గొలువ శివుడు బయలుదేరెను. ఆ శివగణములు శివుని వెంటజేరి హరహర మహాదేవశంభో యని నినాదములు సేయుచుండెను. ఆ యభినవ శంకరుని గాంచి మేము విస్తుపోతిమి. ఆ శివుడు మాతృకలను గూడియుండెను. పిదప మా విమాన రాజము క్షణములో గాలివాలున ముందుకు దూసికొని పోయినది. శ్రీరమారమణుని మందిరమైన వైకుంఠధామము జేరినది. అచట మేమెన్నడును కనివిని యెరుగని పెక్కులు దివ్యవిభూతులు కనులార గాంచితిమి. మే మా రమణీయమైన పురముగాంచి విస్మయానందము లందితిమి. మా విమానము మఱికొంతముందున కేగెను. అచట రాజీవనయనుడు పీతాంబరుడు అగిసె పూశోభనలరువాడు చతుర్భుజుడు గరుడవాహనుడు దివ్యభూషణభూషితుడు చామరములు చేతదాల్చి చల్లగ మెల్లగ వీచుచున్న రమాకాంతతోగూడి రాజిల్లువాడునగు హరిని మేము మా భాగ్యముకొలది సందర్శించితిమి. ఆ సనాతనుని వైకుంఠునిగనిన మా యాశ్చర్యమునకు మేర లేకుండెను.

అపుడు మా యాసనములందు కూర్చుండి మే మొకరి మొగా లొకరము వింతగ జూచుకొంటిమి. అంతలో నొక పెనుగాలి వాలున మా విమానము మఱికొంత ముందునకు సాగెను. అంతలో మేము పలువిధముల జలచరములతో నువ్వెత్తుగ లేచు కెరటములతో డెంద ముప్పొంగజేయు నమృతసాగరము చూచితిమి. దాని నడుమ మందార పారిజాతాది తరువులు చిత్రవిచిత్ర వస్తువులు పెక్కాసనములు-మేలుజాతి ముత్తియముల హారాలు అశోకవకుళకురవక తరువులు - నలుగడల ఘుమఘుమలాడుచు కనులపండువు సేయుచున్న మొగలి సంపెంగ మున్నగు పూలచెట్లు కోయిలల కుహూకుహూరావ మధిరిమలు-గండుతుమ్మెదల ఝంకారములు గల్గి తనరారు నొక్కదీవి గలదు. ఆ దీవియందు శివాకారమున చెలువొందు మంచ మొకటి సుమనోహరముగ నున్నది. అది నవరత్నకాంతులతో పొదుగబడెను. మేము దూరమందుండియే దాని శోభ కన్నులనిండ తిలకించితిమి. దానిపై నాసనములు పెక్కులు గలవు. ఆ పర్యంక మింద్రచాపము భాతిగ చిత్రశోభలతో నలరుచుండెను. అందొక పరమలావణ్యవతి యగు దివ్యాంగన సుఖాసీనయై యొప్పారుచుండెను. ఆ జగదేకసుందరి రక్తమాల్యాంబరధర రక్తగంధానులేపన కోట్ల మెరుపుకాంతులతో మిరుమిట్లు గొల్పుచుండెను. ఎఱ్ఱజీఱల కనుదమ్మలు గలది, కోట్ల పసిండిచాయల మిసిమివన్నె గలది, రవి బింబములను వెన్నుదన్నుకాంతి గలది. చారు వదన రక్తదంత విరాజిత-లావణ్యసీమ. పాశాంకుశములదాల్చి వరదాభయ ముద్రలతో వాత్సల్యము గురియు తల్లి, చిరుతనవ్వు వెన్నెలలు కనుగొలంకుల ముని పెదవుల చిందులాడునది, అపూర్వసుందరి ఐన శ్రీత్రిభువనేశ్వరీదేవి విరాజిల్లుచుండెను.

ఆ నవ¸యవన దివ్యాంగన తన నవ్వు రాజిల్లెడు మోమునుండి దయామృతము గురియుచుండెను. ఆ దేవిచుట్టును జేరి హ్రీంకార జపనిష్ఠలో మేనులు మరచిన పక్షిబృందములు దేవిని జపించుచుండెను. ఎల్ల రసరాజము లామె సింగారములో చోటు చేసికొన్నవి. ఆమె చిగురునవ్వుల మోహనకాంతుల ముఖకమలముతో బలు తమ్మి మొగ్గలను త్రోసిరాజను గబ్బివట్రువ గుబ్బలతో నొప్పుచుండెను. పెక్కు మేలైన జాతిమణుల సొమ్ములతో బంగారపు కేయూరాంగద కిరీటములతో ధగధగలాడుచుండెను. ఆమె ముఖకమలము శ్రీచక్రము విధముగ నున్న తాటంకవిటంకములతో చెన్నొందుచుండెను. 'జయహో! హృల్లేఖ! శ్రీభువనేశి' యని దేవి చెలియలు ఆమెను స్తుతించుచు దేవీజప పరాయణులై యుండిరి. ఆ దేవి భువనేశ్వరి మహేశ్వరి హృల్లేఖ మొదలుగాగల దేవకన్యలతో కొలువు తీర్చియుండెను. ఆ కొలువులో ననంగ కుసుమాది దేవతలును గలరు. ఇట్లా దేవి షట్కోణమధ్యమున నలరు యంత్రరాజమున నలరుచుండెను. మేమా దేవిని దర్శించి, ఈమె యెవరో? ఈమె శుభనామ మెద్దియో తెలియుట లేదేయని పరమ విస్మయమందితిమి. ఈమె వేయికనుల దయామృతలహరి - వేయికేలుదమ్ముల వరదాయిని - వేయివదనాల సుప్రసాదచంద్రిక యని దూరమందుండియే మాకామె దోచుచుండెను. ఈమె యచ్చరగాని గంధర్వకన్యగాని దేవాంగనకాని కాదు. కాని, ఈ పరదైవ మెవ్వరై యుండునోయని తెలిసికొననేరక మేము సంశయములో కొట్టుమిట్టాడుచుంటిమి.

అంతలో విష్ణుభగవానుడు రవిజ్ఞాన శక్తితో నాచారుహాసినిని జగదంబగ మదినెఱింగి యిట్టనియెను: ఈ భగవతి దేవియే మన కందఱకు తరణభూతురాలు. మహావిద్య; మహామాయ; పరిపూర్ణ; మూలప్రకృతి; అవ్యయ. ఈమె కొంచెపు బుద్ధులవారికి మదికెక్కనిది. యోగగమ్య. పరమాత్ముని యిచ్ఛాశక్తి. నిత్యానిత్యస్వరూపిణి. ఈమె శివస్వరూపిణి; భాగ్యహీనులచేత గొలువబడనిది. విశ్వేశ్వరి వేదగర్భ విశాలాక్షి సర్వాది పరమేశ్వరి సనాతని. ఈ మహాశక్తి ప్రళయకాలము నందు సకల విశ్వమును బరిమార్చి యెల్లజీవుల వాసనలను దనలో విలీన మొనరించుకొని క్రీడించుచుండును. సురలారా! సర్వబీజస్వరూపిణి యీమెయే. ఈమె దివ్య సన్నిధానములో ననంత విభూతులు రూపొంది సొంపు పెంపొందుచున్నవి. చూడుడు, ఓ శివబ్రహ్మలారా! చూడుడు. ఇచ్చటివారెల్లరు మేనుల దివ్యచందనములలందుకొని మేలిమిబంగరు సొమ్ములు దాలిచి ప్రేమభక్తులు వెల్లివిరియగ నీ జగన్మాతకు పరిచర్యలు సలుపుచున్నవారు. నేడు మన మిచ్చోట జగద్ధితయగు శ్రీభగవతిని సందర్శించి ధన్యజీవులము కృతకృత్యులము మహాసౌభాగ్యవంతులము నైతిమి. మనము పూనికతో నేనాడే పుణ్యము చేసికొంటిమో యే తప మాచరించితిమో దాని ఫలితముగ మన కీనాడు శ్రీమాతృదేవి దివ్యదర్శనము లభించినది. త్యాగధనులు పుణ్యభాగులు తపస్సంపన్నులు దానరతులునైన మహాత్ములే యీ భవ్యాత్మ నవలోకింపగలరు. కాని, రాగులు మూఢులు ప్రమత్తులు నా శివాభగవతి నేనాటికిని గాంచనేరరు.

ఈమెయే ప్రకృతులకన్నిటికిని మూలప్రకృతి. ఈ ప్రకృతి జనని పురుషసంగతిజేసి పరమేశ్వర ప్రీతికొఱకీ బ్రహ్మాండములను సృజించి వెల్లడించుచుండును. దేవతలారా! ఈ కనబడు బ్రహ్మాండ మంతయును దృశ్యము. ఈ మాయాదేవియే ద్రష్ట్రి. ఈమెయే విశ్వయోని సర్వేశ్వరి సర్వమాయ పరమశివాత్మిక. ఈ విశ్వమాత యెక్కడ? మన మెక్కడ? లక్ష్మి మొదలుగాగల దేవకాంతల యంద మీమె యందములోని లక్షాంశమునకు సరిపోలవు. ఆనాడు మహాసాగరమునందు మనకు దర్శన మొసంగిన జ్యోతిఃస్వరూప మీ విశ్వజననియే. ఆ మహాదేవియే మనలను బాలురనుజేసి యాడించుచు వినోదించుచున్నది. మున్ను నేను వటపత్త్రపు పానుపుపై పరుండి నా పదారవిందమును కరారవిందముతో ముఖారవిందమున నుంచుకొని ఆ వ్రేలిరసము జుబ్బట్లాడగ జీకుచు కోమలాంగుడనై పెక్కులు బాలక్రీడలు సాగించితిని. అట్టి నాలో నీ జగన్మాతయే చేరి నన్నాడించుచు లాలిజోలలు పాడుచునుండెనని నే డీ మేనుగాంచినతోడనే నా మదికి నిశ్చయజ్ఞానము స్ఫురించెను. నా పలుకులు విశ్వసింపుడు. మనల గన్నతల్లి యీమెయే. నేను పూర్వ మనుభవించిన జ్ఞాన మిపుడు తిరిగి గుర్తునకు వచ్చినది.

అధ్యాయము 36 శ్రీదేవిని శ్రీవిష్ణువు సంస్తుతించుట

శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము

పంచాంగం

Chapterr 34 The glory of Sri Tribhuvaneshwari Devi - అధ్యాయము 34 శ్రీ త్రిభువనేశ్వరీదేవీ ప్రాభవము

శ్రీ దేవీ భాగవతం తృతీయస్కంధము - అధ్యాయము 34

శ్రీ త్రిభువనేశ్వరీదేవీ ప్రాభవము

వ్యాసభట్టారకు డిట్లనియె : కురుసత్తమా! నీవు నన్నడిగిన ప్రశ్నమునే నేను తొల్లి నారదమహర్షి నడిగితిని. అతడు నాకిట్లు సమాధానము చెప్పెను: 

"వ్యాసమునీ! నీ కేమని తెల్పుదును? ఒకప్పుడు నా మదిలో నేనుగూడ నీకు గల్గిన తీరని బాధనే పడితిని. అంతట నేనును మహాతేజస్వియు నా తండ్రియు నగు బ్రహ్మకడకేగి అతనిని నీ వడిగినటులే ఇట్లు ప్రశ్నించితిని - విభూ! ఈ బ్రహ్మాండమంతయు నెవరి మహాశక్తివలన సముత్పన్నమైనది? ఇదంతయు నీవే సృజించితివా? కాక విష్ణువు నిర్మించెనా? కానిచో రుద్రుడు కల్పించెనా? నా కారాధనీయుడగు సర్వశ్రేష్ఠ ప్రభువెవరు? నిక్కముగ వచియింపుము. నేను దుఃఖపూరితమైన యీ యసత్యసంసారమున మునిగిపోవుచున్నాను. కనుక నా యీ సందేహము తీర్చి యంతయు నున్న దున్నట్లు యాథార్థ్యము దెలుపుము. ఈ సందియము నా చిత్తమందు గూడుకట్టుకొని యున్నది. దీనివలన నా యెడదకు శాంతి లభించుటలేదు. ఏ దేవతలమీదకు - తీర్థములమీదకుగాని యితర సాధనములపైకిగాని నా మనస్సు పోవుటలేదు. నే నీ పరమతత్త్వ మెఱుగనంతవఱకు నా మదికి శాంతి చేకూరదు. నా మది పలుతావులలో చిక్కుకొని దేనియందును నిలుకడ చెందుటలేదు. నా కా సర్వేశ్వరు డెవరో తెలియుటలేదు. కనుక నే నెవరినని స్మరింతును - స్తుతింతును - యజింతును - అర్చింతును - శరణందుదును? సత్యవతీసుతా! నేనిట్టి కఠినమైన ప్రశ్న వేయగా లోకపితామహుడగు బ్రహ్మ నాకిట్లు ప్రతివచన మొసంగెను"

"వత్సా! నీ కెట్లు దెల్పుదును? నీ వడిగిన ప్రశ్నము కడు దుస్తరమైనది. ఆ విష్ణువు సైతము దీని కిదమిత్థమని సమాధాన మీయజాలడు. విరాగి నిష్కామి విమత్సరుడు స్వాత్మవంతుడునైనవాడే కాని ఈ జగములందు రాగి కామియైన వాడెవ్వడును దీని సమాధాన మెరుగజాలడు. పూర్వ మీ స్థావరజంగమాత్మకమైన సృష్టియంతయు నశించి జలమయమయ్యెను. అంత పంచభూతములు తన్మాత్రలు గల్గినవి. నేనొక కమలమునుండి యుద్భవించితిని. అపుడు నాకు సూర్యుడు కాని చంద్రుడు కాని యొక చెట్టుగాని గుట్టకాని యేమియు కనిపించలేదు. ఆ తమ్మిదుద్దులో నుండి నే నీ రీతిగ నాలోచనలో మునిగితిని, ఈ మహాసాగరజలమందు నే నెవరివలన జన్మించితిని. నాకు కర్త భర్త యుగాంతమందలి సంహర్త యెవరు? ఈ విశాల జలరాశి కాధారమైన భూమియు గనిపించుట లేదు. ఈ మహాపద్మ మెట్లు పుట్టినదో తెలియుటలేదు. నే నిపుడీ కమలము మూలముగందును. అక్కడ ఈ యంతులేని నీటికి మూలమైన భూమి నిస్సందేహముగ గోచరించును. అట్లు తలచి నేను పద్మమునుండి లోనికి దిగి యంతుదెలియని నీటిలోపల వేయేండ్లు వెదకితిని. కాని, నేను భూమిపొడ గాంచలేదు. అంతలో గగనసీమనుండి తప-తపయను నశరీరవాణి నా చెవుల బడెను. అపుడు నేను పద్మమందొక వేయేండ్లు తప మాచరించితిని. పిమ్మట సృష్టి సల్పుమని శబ్దము నా చెవుల బడెను. అది విని నేను మూఢుడనై, యెవని సృష్టింతును? ఏమి చేతునని యాలోచనలలో పడితిని. అపుడు మధుకైటభులను ఘోర రాక్షసులు నాకు కనిపించిరి. వారు నాతో బోరుటకు వచ్చిరని తెలిసికొని నేను భయపడితిని. నేనపుడా కమలనాళము ద్వారమున నీటిలో నడిమికి వచ్చితిని. అచ్చట నొక పరమాద్భుతశక్తిగల దివ్యపురుషుడు నాకు గనిపించెను.

ఆ పురుషోత్తముడు నిర్మల నీలమేఘశ్యామలుడు - సుందరకోమలాంగుడు - పీతాంబరుడు - వనవనమాలికాలంకృతుడు - జగన్నాథుడు. శ్రీ శంఖము-చక్రము-గద-పద్మములతో శోభిల్లు చతుర్భుజుడు. పాపఱని పాన్పున పవ్వళించిన స్వామి. ఇట్టి శ్రీవిష్ణువు నాకు దర్శనభాగ్య మొసంగెను. ఆ మహాత్భుడు యోగనిద్రలో నిశ్చలముగ పరుండియుండెను. అట్లు శేషతల్పముపై శయనించిన యచ్యుతుని నేను కనులకరవుదీర గాంచితిని. నారదా! నే నిపుడేమి చేయవలయునా యను చింత నా కపుడు గల్గినది. నే నపుడు నిద్రా దేవతను స్మరించితిని. అంత నా శివస్వరూప యగు దేవి విష్ణుని శరీరము వదలి లేచి యంతరిక్షమున కెగసెను. ఆ దేవి విశ్వభూషణ కాంతులతో మేని కాంతులు గలియుటచే దివ్యసుందరియై యొప్పారినది. అట్లు నిద్రాదేవి హరి తనువునుండి నింగిపై వెలుగొందినంతనే జనార్దనుడు నిద్దుర చాలించి మేలుకొనెను. అపు డాపరమాత్ముడు మధుకైటభులతో నైదువేలేండ్లు పోరెను. తుదకా యిర్వురు రక్కసులు హరి చేతిలో తుదముట్టిరి. ఆ హరియొక్క విపులమైన తొడలపై వారీల్గిరి. పిమ్మట మే మిరువుర మున్నతావునకు శివు డేగుదెంచెను. అంతలో నా సుమనోహారిణి దివ్యదేవి మా మువ్వురకు తన దివ్యదర్శనభాగ్య మొసంగినది. ఆమెను మేము సంస్తుతింప దొడగితిమి. అందుల కా పరమశక్తి మా యెడల సుప్రసన్నయైనది. ఆ దేవి తన ద్వికటాక్షవీక్షణములతో మమ్ము తరింపజేయుచు నిట్లు పలికెను: 'ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా! మీరు మీ మీ కార్యములు నెరవేర్చుడు. ఇంక మీరు మీ మీ నివాసము లేర్పరచుకొని నిశ్చింతగ చతురతతతో సృష్టి స్థితి సంహారము లొనరింపుడు. మీరు మీ మీ దివ్యవిభూతులతో నేర్పుమీర ప్రజలను నాల్గువిధములుగ సృజింపుడు, అను దేవియొక్క చల్లని సుకము గల్గించు నమృతము లొలుకు పలుకులు వింటిమి.

మేమా దేవి కిట్లంటిమి: 'ఓ తల్లీ! మే మశక్తులము. ప్రజాసృష్టి యెట్లొనర్పగలము? ఇదంతయును నీటిమయమే గదా! నేల కంటికే కనబడుటలేదు. ఇచట మాకు భూతములు తన్మాత్రలు నింద్రియగుణము లేవియు గనబడుటలేదు.' ఈ మా మాటలు విని యాదేవి చల్లని నవ్వులు చిందుమొగముతో తేజరిల్లెను. అంతలో నాకాశమునుండి యొక దివ్య విమానము మా ముందునకు వచ్చెను. అపుడు 'త్రిమూర్తులారా! మీరు నిర్భయముగ దీనిలోని కెక్కుడు. మీ కత్యద్భుతమైన దృశ్యము జూపింతును.' అని దేవి మాతో బలికెను. మే మా దేవి వాక్కులు విని యొప్పుకొని కింకిణీ ఝళంఝళలతో రవళించుచు ముత్యాలహారాలతో నలరుచు దేవేంద్రభవనమువలెనున్న విమాన మెక్కి కూర్చుంటిమి. జితేంద్రియులమగు మేము సుఖాసీనులమగుటగాంచి దేవి స్వశక్తితో విమానము నాకాశవీథిలో నడిపింపసాగెను.

అధ్యాయము 35 త్రిమూర్తులు త్రిమూర్తులను గని విస్మయమందుట

శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము

పంచాంగం

Chapter 33 Janamejaya's gratitude question regarding Tribhuvaneshwari - అధ్యాయము 33 త్రిభువనేశ్వరి విషయమున జనమేజయ కృతప్రశ్నము

శ్రీ దేవీ భాగవతం తృతీయస్కంధము - అధ్యాయము 33

త్రిభువనేశ్వరి విషయమున జనమేజయ కృతప్రశ్నము

జనమేజయు డిట్లనియెను: భగవానుడా! నీవు శ్రీదేవీ యాగ మొనరింపుమని వక్కాణించితివి. ఆ శ్రీదేవీ యెవరు? ఎట్లవతరించెను? ఎవరి వలన జన్మించెను? ఆమె స్వరూపమేమి? ఆమె యందలి గుణ విశేషము లెవ్వి? ఆ దేవి దివ్యాకృతి యెట్టిది? ఆ తల్లి యజ్ఞ మేవిధముగ జరుపవలయును? ఆ యాగ విధానమును సర్వజ్ఞుడవగు నీవు తేట పఱచుము. బ్రాహ్మణోత్తమా! ఈ విశ్వముయొక్క సృష్టి రహస్యము నీవెఱుంగుదువు. బ్రహ్మాండమన ఎట్టిది? దాని యుత్పత్తి ప్రకారమేమి? విస్తరించి చెప్పుము. 

బ్రహ్మ విష్ణు మహేశ్వరులను త్రిమూర్తులుగలరనియు, వారు త్రిగుణమయులనియు, సృష్టిపాలన సంహారము లొనరింతురనియు నేను వింటిని. ఆ త్రిమూర్తులును స్వతంత్రులా? పరతంత్రులా? ఆ మహాత్ములను గుఱించి నాకు వినవేడుక యగుచున్నది. వారికి గూడ చావు సహజమా లేక వారు సచ్చిదానంద స్వరూపులా? వార లాధ్యాత్మికము అధిదైవికము అధి భౌతికము అను తాపత్రయము గలవారా? లేక దుఃఖరహితులా? 

ఇంద్రాదులు మహాబలశాలురు గదా! వారిని కాలము కాటు వేయునా? లేదా? వారలెవరివలన నే తెఱగున ప్రాదుర్భవించిరి? అను సందియము నన్ను పీడించుచున్నది. వారికి సుఖ దుఃఖములు గలవా లేవా? వారు నిద్రాలస్యములకు వశులగుదురా కారా? వారి శరీరములు సప్తధాతుమయములా కావా? వారే యే దివ్యపదార్థములవలన గుణంద్రియముల వలన సృజింపబడిరి? వారి జీవితకాలమునకు ప్రమాణమెంత? మునివరా! ఆయా దేవతల నివాసస్థానములను వారి వారి మహావిభూతుల కథలను నాకు బోధపడునట్లు విప్పి చెప్పుము. ఇట్టి మహాత్ముల కథ లెన్నయినను నేను వినుటకు వెనుకాడను.

వ్యాసుడిట్లనియెను: 'ఓయి జనమేజయ మహారాజా! ఆ బ్రహ్మాదిదేవత లెవ్వరివలన సంభవించిరని నీవు ప్రశ్నించితివి. నీ ప్రశ్నకు సమాధానము కడు దుర్గమము. అది అంత తేలికైనదికాదు. నేను మున్ను నారదు నిదే ప్రశ్ననడిగితిని. దాని కతడు చోద్యమంది నాకు సమాధానించిన విధము నీకు వినిపింతును, ఏకాగ్రతతో నాలింపుము. 

వెనుక నొకప్పుడు నాకు పావనగంగా తీరమున పరమశాంతుడు సర్వజ్ఞుడు వేదవిదుడునగు నారదమహర్షి కనబడెను. నేను ప్రమోదమంది యా ముని సన్నిధికేగి యతని పాదపద్మముల కెఱగి యతని యనుమతితో నొక వరాసనమున గూర్చుంటిని. ఆ గంగాతటమున చల్లని యిసుకతిన్నెలపై సుఖాసీనుడై యున్న నారదుని కుశలమడిగి విని నేనతనితో మరల నిట్లంటిని: 

"మునీశ్వరా! ఈ విశాలవిశ్వమునకు మూలకర్త యెవ్వరు? ఈ బ్రహ్మాండ మే మహాశక్తివలన సముత్పన్నమైనది. ఈ సృష్టి నిత్యమా? అనిత్యమా? విధానము ననుసరించి తెలియబలుకుము. కర్తలేక కార్యము జరుగదు గదా! ఈ యింతటి బ్రహ్మాండము నొకడే నిర్మించెనా? లేక పల్వురు కలిసికట్టుగ చేసిరా? అను సందియము నా కెప్పుడును గల్గుచుండును. ఈ పలువిధములైన తర్కవితర్కములతో సందేహ సందోహములతో నే నీ విపుల సంసార సాగరములోన మునింగితిని. నన్నుద్ధరించి కడతేర్చుము. 

కొందఱు మహాదేవుడు సద్యోజాతుడు రుద్రుడు తత్పురుషుడు మహేశ్వరుడునగు శివుడు ప్రళయోత్పత్తి లేనివాడు నగు శంకరుడు కారణకారణుడని వాక్రుత్తురు. ఆ హరుడు సోముడు రుద్రుడు శంభువు శంకరుడు త్రిగుణుడు సృష్టి స్థిత్యంతకారకుడు సంసారోత్తారకుడు శివుడు శివతరుడని వక్కాణించి పల్కుదురు.

మఱికొందఱు శ్రీహరి హృషీకేశుడు మాధవుడు పద్మనాభుడు సర్వశక్తియుక్తుడు విశ్వుడు సర్వభూతాత్ముడు పరమాత్ముడగు విష్ణుని నుతింతురు. ఆ విష్ణువు భుక్తిముక్తిప్రదుడు పరమశాంతుడు విశ్వతోముఖుడు సర్వవ్యాపకుడు సర్వాద్యుడు విశ్వశరణ్యుడనాదినిధనుడునని వారు సన్నుతింతురు. 

ఇంక కొందఱు బ్రహ్మదేవుని విధాతగ లోకసృష్టి కారకునిగ సర్వవేత్తగ సర్వభూత ప్రవర్తకునిగ చతుర్ముఖునిగ సరేశునిగ కమలసంభవునిగ సత్యలోకవాసిగ సర్వలోక కర్తగా వచింతురు. ఇతరులు కొందఱు వేదవాదులు సర్వేశ్వరుడగు సూర్యుని విశ్వకర్తగ భావించి యతనిని సంధ్యలందు సమాహితమతితో సంస్తుతించి ధ్యానింతురు. వేరొక కొందరు దేవదేవుడు సహస్రాక్షుడు శతక్రతుడు సకలప్రభువగు నింద్రుని కర్తగ దలంచి యింద్రయాగ మొనరింతురు. వారా యింద్రుడు పురుహూతుడు యజ్ఞపతి సురపతి లోకపతి శచీపతి యాగభోక్త సోమపుడు సోమపాయి ప్రియుడు నని వచింతురు. ఇతరులు కొంద ఱగ్నిని యముని వరుణుని వాయుదేవుని సోముని ధనదుడగు కుబేరుని గణపతిని గొప్పగ భావింతురు. ఆ గణపతి హేరంబుడు గజవక్త్రుడు స్మరించినంతనే విఘ్నములు బాపి సిద్ధి చేకూర్చువాడు సర్వకార్యసాధకుడు కామదుడు కామగుడని సర్వభావమున సంభావించి పూజింతురు.

కొంద రాచార్యులు సర్వార్థప్రదాయిని ఆదిమాయ మహాశక్తి పురుషానువర్తిని-బ్రహ్మైక్యస్వరూప జననరక్షాలయకారిణి సర్వభూతదేవతల కడుపుపంటగ గన్నతల్లి - అనాదినిధన - పూర్ణ - సర్వలోకేశ్వరి - సగుణనిర్గుణ - శివస్వరూప సర్వప్రాణివ్యాప్త బ్రాహ్మి వైష్ణవి శాంకరి వాసవి వారుణి వారాహి నారసింహి శ్రీమహాలక్ష్మి అద్భుతరూప-వేదమాత ఏకవిద్యాస్వరూప తారిణి సర్వదుఃఖ నిహంత్రి తలచినంతనే కోర్కులు కురియు దేవి ముముక్షులకు ముక్తిదాయిని ఫలార్థులకు ఫలప్రదాయిని త్రిగుణాతితరూప గుణవిస్తారకారిక నిర్గుణ సగుణ అగు శ్రీదేవిని ఫలార్థులై ధ్యానింతురు. 

కొంతమంది నిత్యము నిరంజనము నిరాకారము నిర్లేపము నిర్గుణము అరూపము శుద్ధబుద్ధముక్తయు ప్రజ్ఞానఘనమునగు బ్రహ్మమే సర్వకారణమని పలుకుదురు. ఆ బ్రహ్మమే వేదోపనిషత్తుల సారమని పరంజ్యోతి యని వచింతురు. ముని పుంగవులా బ్రహ్మతేజమునే సహస్రశీర్షుడు సహస్రాక్షుడు సహస్రపాదుడు సహస్రకరుడు అగు పురుషోత్తమునిగ విశ్వసింతురు.

ఆ శ్రీమహావిష్ణునియొకే పాద మాకాశము అంతటను ప్రకాశించునది పరమము శాంతము విరజము విరాట్టునని మనీషులు వెల్లడింతురు. పూర్వవిదులు పురుషోత్తముడే విశ్వప్రభువని మనసార నమ్ముదురు. ఆ సర్వేశ్వరు డొక్కడేకాదని యనువారును గొందఱుగలరు. ఈ ప్రపంచ మూహింపరానిది. ఈ బ్రహ్మాండ మీశ్వరసృష్టి కాదు. ఇది అనీశ్వరమని వాదించువారును గొందఱు లేకపోలేదు. అదంతయు సన్మాత్రమే. ఇది అనీశ్వరము. ఇది సహజముగనే పరిణతి జెందుచుండును. పురుషుడకర్త. అన్నిటికి ప్రకృతియే కర్త్రియని యెలుగెత్తి చాటువారును గలరు. 

ఈ విధముగ వివ్వసృష్టిని గూర్చి సాంఖ్యులు కాపిలులు మున్నగువారలు తమ భిన్నభిన్న భావములు వ్యక్తీకరింతురు. కావున నా కెంతకు నంతుపట్టని సందియము లిట్టి వెన్నియో కల్గుచుండును. నారదమునీంద్రా! సరియైన ధర్మాధర్మ వివక్ష చేయలేక నా చిత్తము శాంతిబాసి వికల్పములకు పాల్పడుచున్నది. ఇందేది ధర్మమో గుర్తించుటకు సాధ్యము గాకున్నది. ఎల్లదేవతలు సత్త్వగుణ సంపన్నులు సత్యధర్మనిష్ఠులునై యుందురు. ఇట్టి దేవతలే పాపాత్ములగు దానవుల చేతులలో బాధలు పడుచుందురు. ఇక ధర్మస్థితికి గతి యెక్కడిది? ధర్మపరులు సదాచారులు మా వంశజులగు పాండవులే పలువిధాల యిడుమలు పడిరి. ఓ మునీశ్వరా! ఇంక ధర్మమునకు తావెక్కడిది? కాన నిట్టి సంశయములతో నా మనస్సు నిరంతరముగ కలత జెందుచుండును. ఇట్టి నా చిత్తమందలి సంశయములను బాపుటకు నీవే కడు సమర్థుడవు. కాన మోహమను జలముతో కల్లోలితమగు సంసార సాగరమునందు మునుగుచు తేలుచున్న నన్ను నీ విజ్ఞాన నావచేత తరింపజేయుము.

అధ్యాయము 34 శ్రీ త్రిభువనేశ్వరీదేవీ ప్రాభవము

శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము

పంచాంగం

Chapter 32 The birth Story of Astikamahamuni - అధ్యాయము 32 ఆస్తీకమహాముని జన్మవృత్తాంతము

శ్రీ దేవీ భాగవతం ద్వితీయస్కంధము - అధ్యాయము 32

ఆస్తీకమహాముని జన్మవృత్తాంతము

సూతుడిట్లనెను : జనమేజయుని మాటలు విని వ్యాసుడు పేరోలగమునందు రాజుతో నిట్లనెను : రాజా ! పుణ్యము శివము రహస్యమునైన శ్రీదేవీ భాగవత పురాణమును తొల్లి నా కుమారుడగు శుకునిచే చదివించితిని. నేను రచించిన ఆ పరమరహస్య రచన మిపుడు నీకు వినిపింతును, వినుము. అది పెక్కు కథలతో రసభరితమై యలరారుచున్నది. ధర్మార్థ కామమోక్షములకు కాణాచి. సకల వేదముల రసాయనము. దానిని వినుటవలన నిత్యశుభములు సుఖములు చేకూరును. ఆంత జనమేజయుడు ఈ యాస్తీకు డెవరి పుత్త్రుడు ? ఇతడు యాగవిఘ్నము చేయుట కేలవచ్చెను? సర్పరక్షణమున నీతని కేమి లాభము గల్గును? అదియంతయు దెలిపి పిదప శ్రీదేవీ పురాణ కథానకమంతయు నాకు విశదముగ దెలుపుము అనెను. 

వ్యాసుడిట్లనెను: 'తొలుత జరత్కారుడను శాంతుడగుముని గార్హస్థ్యము స్వీకరింపలేదు. అందువలన నతని పూర్వజులు పెద్దగుంటలో వ్రేలాడుచుండిరి. వారిని గాంచి జరత్కారువు దానికి కారణ మడుగగ 'పుత్త్రా ! నీవు పెండ్లి యాడినచో మే మీ యిక్కటులబాసి తృప్తిజెంది స్వర్గమేగుదుము. నీవు సదాచారివి గమ్ము' అని వారనిరి. పూర్వజులారా! నాతో సమానమైన నామము గలిగి యనుకూలయైన కన్య నేను కోరకయే లభించినచో నామెను తప్పక పెండ్లియాడి గృహస్థ జీవితము సాగింతును' అని వారితో పలికి జరత్కారుడు తీర్థాటనమున కేగెను.

అదే సమయమున నాగము నగ్నిలో బడుడని వారి తల్లి శపించెను. అదెట్లన - కశ్యప మహర్షికి కద్రూవినతలను నిర్వురు భార్యలుండిరి. వారొకమారు సూర్యుని రథాశ్వమును చూచి పరస్పర మిట్లు భాషించుకొనిరి: 

మొదట 

కద్రువ : 'ఆ గుఱ్ఱము తోక వర్ణమేమో త్వరగ దెలుపుము' 

వినత : ఆ గుఱ్ఱము తోక తెల్లగనున్నది. నీవే రంగుగలదని తలతువో తెలుపుము. అపు డిద్దఱము పందెము వేసికొందము. 

కద్రువ : శుచిస్మితా! అది నల్లని వర్ణము గలది. మనలో నెవరిమాట తప్పగునో వారు రెండవవారిని దాస్యము చేయవలయును. 

పిమ్మట కద్రువ తన మాట జవదాటని పాములతో 'మీరు గుఱ్ఱము తోకకు చుట్టుకొని దానిని నల్లనిదిగ జేయుడు' అనెను. కొన్ని పాములు తమ తల్లికి ప్రియము సేయు తలంపుతో తమ నల్ల పడగలతో గుఱ్ఱముతోక చుట్టును చుట్టుకొని దానిని నల్లగ జేసినవి. తన మాట విననివారిని జనమేజయుని సర్పయాగమున కాహుతి గండని కద్రువ శపించెను. అపుడక్కసెల్లెండ్రిద్దఱును గలిసి వెళ్ళి మఱల గుఱ్ఱమును గాంచిరి. వారి కపుడది నల్లగ దోచెను. అపుడు వినత మిక్కిలి పరితపించినది. 

వినత కుమారుడు గరుత్మంతుడు. మహాసత్త్వుడు. అతడు తన తల్లి దైన్యమును గని 'జననీ! ఆ సూర్యసారథి - నేను - మే విర్వుర మింకను బ్రతికియుండగ నీ వింతగ దీనముగ నుండగనేల? ఓ తల్లీ! మా కనులముందు మము కడుపు పంటగ కన్న నీవు కంటతడిబెట్టుకొన్న మా జీవితాలు వ్యర్థములు గద! తల్లి కడగండ్ల పాలయినచో నామె సుతుడు బ్రతికి యేమి లాభము? కావున నీ దైన్యకారణము దెల్పుము. వెంటనే నీ దుఃఖము తొలగింపజేతును' అని పలికెను. 

అన వినత 'కుమారా! నేను నా సవతికి దాసినై బాధ పడుచున్నాను. ఇంకేమి చెప్పవలయును? ఇంతేకాక తన నచ్చినచోటి కామె తన్ను నన్ను మోసికొని పొమ్మనుచున్నది' అనెను. గరుడుడును 'అమ్మా! ఆమె యెటు పోదలచిన నే నామెను గొనిపోవుదును. నీవు శోక ముడుగుము. నిన్ను నిశ్చింతురాలిని జేతునని వినతను కద్రువ చెంత కంపెను.

గరుత్మంతుండు తన తల్లికి దాస్యముక్తి గల్గించదలచి కద్రువను నామె పుత్త్రులను సముద్రతీరమునకు మోసికొని పోయి కద్రువకు నమస్కరించి 'ఓయమ్మా! మాయమ్మ దాసత్వమునుండి యెట్లు విమోచనము బొందునో నిజము తెలుపు' మనెను. 

కద్రువ 'నీవు దేవలోకమేగి నీ బలము చూపి యమృతము తెచ్చి మా కర్పించుము. నీ తల్లిని దాస్యమునుండి విడిపించుకొనుము' అనెను. ఆ మాటలు విని గరుత్మంతుడు వేగముగ నింద్రలోక మేగి యచ్చటివారితో బోరి యమృతకలశము గ్రహించి తెచ్చి తన తల్లి కీయగా వినత తన బానిసతనమునుండి విడుదల బొందెను. ఇట్లు వినత తన బిడ్డ యగు పక్షిరాజు సమర్థతచే దాస్యముక్తయై దుఃఖభారము దించుకొనెను. ఇట్లు గరుడుడును తల్లి గౌరవము నిలువబెట్టెను. నాగములు స్నానము చేయుట కేగిన యదను గనిపెట్టి యింద్రు డమృతభాండ మెత్తుకొనిపోయెను. పాములు వచ్చి దర్భలకంటుకొన్న సుధ నాస్వాదించుటకు కుశాగ్రములు నాకినందున వాని నాల్కలు రెండుగ చీలి నాటినుండి అవి ద్విజిహ్వములైనవి. మున్ను తల్లిచే శపింపబడిన వాసుకి మున్నగు పన్నగములు హిరణ్యగర్భుని శరణువేడి తమ శాపభీతి చెప్పుకొన –

ధాత వానితో 'జరత్కారు డను ముని గలడు. మీ రతని పేరుగల నాగకన్య నా ముని కుమారున కర్పింపుడు. వారికి బుట్టినవాడు మీ క్లేశములు గట్టెక్కించగలడు. అతడాస్తీక నామమున బరగును. ఇది నిజము' అని పలికి వారికి ధైర్యము చెప్పెను. బ్రహ్మివాక్కులు విని వాసుకి వనమునకు తిరిగి వచ్చి తన జరత్కారువను సోదరి నా జరత్కారు మునికి వినయముగ నప్పగించెను. అతడు తనతో సమనామరూపములుగల దానిగ జరత్కారువు ఎఱిగెను. ఆమె తన కప్రియము చేసినచో నామెను విడిచిపుత్తునని పలికి ఆ యొడంబడికతో ముని యామెను చేపట్టెను. వాసుకి యామె నతని కప్పగించి తన యింటి కేగెను. అంత జరత్కారుడా మహావనమందు పర్ణకుటీర మేర్పరచుకొని అందు జరత్కారువను పత్నితో నానందించసాగెను. ఒకనా డా ముని భోజనము చేసి నిద్రించెను. అపుడు జరత్కారు వతని చెంతనే యుండెను. ముని 'తన్నెట్టి పరిస్థితిలోను మేలుకొలుపవద్ద'ని భార్యతో జెప్పి నిదురించెను. అంతలో సూర్యు డస్తగిరి కేగెను. సంధ్యా వందన సమయ మయ్యెను.

అపుడామె తనలో 'ఇపుడు లేపినచో నన్ను తప్పక విడిచిపెట్టును. ఇపుడేమి చేతును? నాకిక శాంతి లేదు. మేల్కొల్పనిచో సంధ్యాకాలము దాటిపోవును' అని యామె ధర్మలోపమునకు భీతి జెందినది. ధర్మచ్యుతికంటె నతడు త్యజించుట మేలు. దానికంటె నా చావు మేలు. నరులకు ధర్మహానిచేత నరకము గల్గును, అని తలచి తుద కామె 'సువ్రతా! సంధ్యా సమయము సమీపించినది. ఇక మేలుకొను' మని తన పతిని మేలుకొలిపెను. అతడు లేచి కోపనుడై' ఇక నీవు నీ సోదరునింటి కేగుము. నా నిద్రాభంగ మొనర్చితివి. నా దారిని నేను పోదు'ననెను. అంతనామె భయపడుచు మునితో 'ఓమహామతీ! నా సోదరుడు నన్ను నీకు దేనికై సమర్పించెనో యదెట్లు సంభవించు'నన నత డామెతో (ఆస్తి) ఉన్నదిలెమ్మని పలికెను. ఆమె మునిచే వదలబడి వాసుకి యిల్లుజేరి తన సోదరుడుగగ నామె తన పతి (ఆస్తి) కలదని తన్ను వీడి తావెళ్ళెనని చెప్పెను. ఆమె మాటలు విని యా ముని సత్యవాది యని తలచి వాసుకి తన సోదరి నాశ్రయించియుండెను.

కొంతకాలము తరువాత నామె కొక బాలుడు జన్మించెను. అతడే ఆస్తీకనామమున వన్నె కెక్కెను. అట్టి యితనిచే నిపుడీ యాగము నిలిపివేయబడుచున్నది. విజ్ఞానియగు ఆ ముని తన తల్లి పక్షము వారి నిట్లు సంరక్షించెను. వాసుకి సోదరికి బుట్టిన యాస్తీకుని నీవు చక్కగ సత్కరించితివి. ఓ మహారాజా! నీవు చాల గణనీయమైన పని చేసితివి. నీకు మేలు గలుగుత! సకల భారతము వింటిని. మునులను బూజించి వారికి భూరిదానము లొసంగితివి. 

జనమేజయనరపతీ! ఇంతటి పుణ్యమునగూడ నీకు శాంతి నీ తండ్రికి స్వర్గతి లభించలేదు. నీ వంశమంతయును పావనము గాలేదు. కావున శ్రీజగదంబికాదేవికి వేవేగభక్తి శ్రద్ధలతో దివ్యమందిరము నిర్మింపజేయుము. నీవు సకల శివ ప్రదాయినిని మహాదేవిని నిండు భక్తితో బూజింపుము. దానిచే నీకు సమస్తము సిద్ధించగలదు. ఆ విశ్వమాత నీకు రాజ్యసంపదలిచ్చి ధ్రువముగ నిన్నభి''వర్ధిల్ల జేయును.

శ్రీదేవీ యజ్ఞము విధివిధానముగ నాచరించి శ్రీదేవీ భాగవత పురాణ సంశ్రవణ మొనరింపుము. అది-ఆకథ పరమపావనము-సంసారోత్తారకము-దివ్యము-నానారస సమాహారరూపము-వినిపింతును. తత్పరభావమున నాలకింపుము. ఈ పరమ దేవీపురాణముగాక వినదగినది మరొక్కటి లేదు. ఆమె పావనచరణకమలములు దప్ప భజింపదగినవి మరేవియు లేవు. ఎవరి ప్రేమసంకుల హృదయముల నాదేవి ఎల్లపుడును వసించునో వారే ధన్యజీవులు. వారే సౌభాగ్యవంతులు. వారే స్థితప్రజ్ఞులు. ఓ భారతా! ఈ పవిత్రభారత కర్మభూమిలో నా జగదంబికను సమారాధింపని మూఢులే కడగండ్లకు గురియగుదురు. బ్రహ్మాదిదేవత లెల్లరే త్రిమూర్తిరూపయగు దేవిని సంసేవించుటలో తత్పరులై నిత్యము వర్తింతురో - ఆ తల్లిని తెలిసిన వాడెవ్వడు భక్తిమీర సేవింపకుండును! పూర్వ మా భగవతి శ్రీమహావిష్ణువున కీ భాగవతము వినిపించినది. అట్టి దీని నెవడు వినునో వాని యభీష్టములు తీరును. ఈ పుణ్యపురాణ శ్రవణ పుణ్యమున నీకు చిత్తశాంతి గలిగి తీరును. నీ పితరు లక్షయ పుణ్యలోకములు జేరుదురు.

అధ్యాయము 33 త్రిభువనేశ్వరి విషయమున జనమేజయ కృతప్రశ్నము

శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము

శ్రీ దేవీ భాగవతం ద్వితీయ స్కంధము

పంచాంగం

Chapter 31 Astikamahamuni stopping of the snake sacrifice of Janamejaya - అధ్యాయము 31 ఆస్తీకమహాముని జనమేజయుని సర్పయాగము మాన్పించుట

శ్రీ దేవీ భాగవతం ద్వితీయస్కంధము - అధ్యాయము 31

ఆస్తీకమహాముని జనమేజయుని సర్పయాగము మాన్పించుట

సూతుడిట్లనెను: ఆ తెఱంగున పరీక్షిత్తు ప్రాణములు పాసెను. ఆతని కుమారుడు జనమేజయుడు. కడు పసివాడు. కనుక మంత్రులు రాజునకు పరలోకక్రియలు జరుగునట్లు చేసిరి. వారు దుర్మరణమున ప్రాణాలు వదలిన రాజు శవమును గంగాతీరమందు చందనచితి పేర్చి దానిపై నుంచిరి. రాజ పురోహితులు దుర్మరణము జెందిన ఆ రాజునకు వేద మంత్రములతో పరలోకక్రియలు జరిపిరి. వారు బ్రాహ్మణులకు యథోచితముగా బహువిధముల గోదానసువర్ణదా నాన్న దానవస్త్రదానము లొనర్చిరి. మంత్రులందఱును పౌరజానపదులను నొక సుముహుర్తమున ప్రజా ప్రీతికరుడు బాలకుడునగు రాజసుతుని జనమేజయుని పాలకునిగ నొనరించి సింహాసనమున గూర్చుండబెట్టిరి. ఒక దాది యతనికి రాజచిహ్నములను గూర్చి శిక్షణ గఱపెను. మహామతియగు అతడును దిన దిన క్రమమున ప్రవర్దమానుడయ్యెను. పదునొకండవయేట నతనికి కులపురోహితుడు యథోచిత విద్య గఱపెను. వాని నా బాలకుడు చక్కగ నేర్చుకొనెను. అర్జునునకు ద్రోణుడును కర్ణునకు పరశురాముడునువలె జనమేజయునకు కృపాచార్యుడు చక్కగ ధనుర్వేదమంతయు నేర్పెను. ఆ రాజు విద్యలెల్లబడసి దురతిక్రముగడు బలశాలి యయ్యెను. మఱియు వేద ధనుర్వేదములు తుదముట్ట నెరిగి పరమార్థవేత్త యయ్యెను. అతడు దర్మార్థకుశలుడు - సత్యవాది - జితేంద్రియుడునై జను లితడు ధర్మరాజను నట్లు రాజ్యము చేసెను.

అంతట కాశీరాజగు సువర్ణవర్మాక్షుడు తన వపుష్టమయను కన్య నతని కిచ్చెను. ఆ ధవళాక్షినిబొంది జనమే జయుడు మున్ను కాశీరాజు కూతురును బడసిన విచిత్రవీర్యుడువలెను సుభద్రను పొందిన అర్జునుడువలెను ముదితనుగూడి ప్రమదముతో వనోపవనములందు విహరించెను. ఇంద్రుడు శచిని బడసి ప్రసన్నుడై నట్లే యతడా లేమనుజేరి సుఖముండెను. అతడు ప్రజలు సంతోషించునట్లు వారిని లాలించి పాలించెను. కార్యదక్షులైన మంత్రులెల్లరును తమ తమ విధులు చక్కగ నిర్వహించుచుండి ఆ దినములలో ఉత్తంకుడను ముని యుండెను. అతడు తక్షకునిచేత బాధింపబడెను. ఆ బాధకు ప్రతీకార మెవరు చేయగలరోయని యాలోచించి యుత్తంకుడు జనమేజయుడందులకు తగినవాడనియెంచి హస్తిపురికేగెను. ఆ ముని జనమేజయుని సమీపించి యిట్లు పలికెను : 

'రాజా! నీవు సమయానుకూలముగ మంచిచెడ్డ లెఱుగలేవు. నీవు చేయరాని పని చేయుదువు. చేయవలసినది చేయవు. నీకు కోపముగాని ప్రయత్నముగాని తెలియవు. ఇట్టి నిన్ను నేనేమి కోరగలను? నీవు తంత్ర మెఱుగవు. నీకు దేనియందును పగలేదు. నీవింకను పిల్లచేష్టలు మరువలేదు.' 

జనమేజయు డిట్లనియెను: 'ఇతరులు నాకు చేసిన ఏ అపకారము నాకు తెలియలేదో నేను దేనికి ప్రతీకారము చేయలేదో మహాభాగా ! నాకంతయు వివరముగ దెలుపుము. చేయగలను.'

అనగా 

ఉత్తంకుడిట్లనియెను : ఓ భూపతీ ! నీ తండ్రి తక్షకుని దౌర్మార్గ్యముచే హతుడయ్యెను. నీ మంత్రులను పిలిచి నీ పితృమరణమును గూర్చి యడిగి తెలిసికొనుము. అది విని రాజా విషయము గురించి మంత్రులతో ప్రస్తావించగా 

మంత్రులిట్లనిరి: 'నీ తండ్రి విప్రుని శాపకారణమున పాముచే కాటువేయబడి వెంటనే మరణించెను.' జనమేజయుడు నా తండ్రి చావునకు ముని శాపమెట్లు కారణమయ్యెను? అందులో తక్షకుని తప్పిదమేమి? నాకంతయు దెలుపుడు. అన 

నుత్తంకు డిట్లనియెను: తక్షకుడు కశ్యపునకు ధనమిచ్చి యతనిని చికిత్స చేయనీయక వెనుకకు పంపెను. రాజా ! నీ తండ్రిని చంపిన తక్షకుడు నీకు పగవాడగునా కాడా? మునుపు రురుముని భార్యయు సర్పదష్టయై చనిపోయెను. ఆమె యవివాహితుడగు రురునిచేత మరల బ్రతికింపబడినది. ఆ సమయమున రురుమని 'నా కంటబడిన ప్రతి పామును నా యాయుధముతో చంపగలను' అని దారుణ ప్రతిజ్ఞచేసి యతడు శస్త్రపాణి యయ్యెను. నాటినుండి యతడు నేల నాలుగు చెఱగులు తిరుగుచు కంటబడిన పాములనెల్ల చంపుచుండెను. అంత నతని కొకమారు వనమున నొక ముసలి డుండుభము కంటబడెను. అతడా పెనుబామునుగని దానిని చంపుటకు కోపముతో కఱ్ఱ పైకెత్తి దెబ్బకొట్టగా 

డుండుభ మిట్లనెను: విప్రా! నీకు నేనేమి యపరాధము చేసితిని? నన్నేల చంపదలచితివి? అందులకు రురువు తొల్లి నా యిష్టసఖి సర్పదష్టయై మరణించినది. ఆనాడు నేనెల్ల పాముల జంప ప్రతిన బూనితిని' అన నతనితో డుండుభము 'నేను నిన్ను కాటు వేయను, కాటువేయు పాములు వేరే యుండును. కేవలము పాము రూపముగల నన్ను చంపుట నీకు తగదు. అనెను. ఈ చక్కని మనుజ వాక్కులు పాము నోటవచ్చుట రురువు విని –

'నీవెవరవు?' ఈ డుండుభత్వము నీవెట్లు పొందితివి?' అని దానిని ప్రశ్నించెను. విప్రా ! నేనును పూర్వ మొక బ్రాహ్మణుడను. నా స్నేహితుడు ఖగముడనువాడు గలడు. అతడు ధర్మవిద్వరుడు. జితేంద్రియుడు. సత్యశీలుడు. నేనొక గడ్డిపామునుచేసి అగ్నిశాలలోనున్న యతనిని మూర్ఖత్వమున వంచించితిని. అతడు భయవిహ్వలుడై గడగడలాడుచు' ఓ మందమతీ! నీవు నన్ను వంచించితివి. కాన సర్పముగమ్మని శపించెను. అపుడు నేను పాముగ మారి యతని ప్రసన్నతకతనిని ప్రార్థించితిని. అతని కోపము కొంత శాంతించగ 'నిన్ను ప్రమతిపుత్త్రుడగు రురుపు శాపముక్తుని చేయు'ననెను ఆ పామును నేనే, నీవే యా రురుమునివి. ఇంకనా పరమహితవచన మాలకింపుము. విప్రులకు పరమధర్మ మహింసయే సుమా! విజ్ఞుడైన బ్రాహ్మణుడెల్లచోట్ల దయతో వర్తింపవలయును. ఇది నిజము విప్రేంద్రా ! హింస యాగములందు తప్ప వేరు సందర్భముల తగదు అని డుండుభము పలికెను. ఆ విప్రుడట్లు సర్పయోనినుండి ముక్తిగాంచెను. రురువు అట్లు ఖగముఖుని శాపముక్తిని గావించుటతోపాటు నాటినుండి హింసను మానుకొని, చచ్చి మరల బ్రతికిన బాలికను ప్రమద్వరను పెండ్లి చేసికొనెను.

రురువు అట్లు పాముతోడి పగదీర్చుకొనుటకు సర్పములను హింసించెను. నీవు మాత్రము వైరము మాని వర్తింతువే! ఇపుడు నీ తండ్రి స్నానదానములులేక నంతరిక్షమున దిరుగుచున్నాడు. ఓ రాజా! పాముల నన్నింటిని చంపి నీ తండ్రి నుద్ధరింపుము. తండ్రికి ఇతరుల వలన కలిగిన అపకారము నెఱుగనివాడు బ్రతికియు చచ్చినవాడే. నరనాయకా! ఆ పాములను చంపనంత కాలము నీ తండ్రికి దుర్గతి పాయదు. నీ తండ్రి శత్రువును దలంచి అంబాయజ్ఞమను నామముతో సర్పయాగ మొనరింపుము. ఉత్తంకుని ఈ మాటలు విని జనమేజయుడు కన్నీరొలుక 'నే నభిమానవంతుడను. మందమతిని. పనికిమాలినవాడను. నా తండ్రి సర్పదష్టుడై ఘోరదుర్గతి బొందెను. కాన సర్పయాగ మొనరించి నా తండ్రి నుద్ధరింతును. జ్వాలలు గ్రక్కుచున్న యగ్నిలో పాములను వేల్తును, అని పలికి మంత్రులను రావించి 

రజు యిట్లనియెను: 'మంత్రాలారా! మీరు యాగ సంభారములు సిద్ధము సేయుడు. గంగాతీరమున యాగమునకు దిగినచోటు విప్రులచే గొలిపించి నిర్ణయింపుడు. అచట నూఱు గట్టిస్తంభములతో మనోహరముగ మండలము నిర్మింపజేయుడు. అందు శ్రేష్ఠమైన యజ్ఞ వేదిక నిర్మింపజేయుడు. యజ్ఞాంగముగ సర్పయాగము మహాఘనముగ సాగవలయును. అందు తక్షకుడు పశువుగ ఉత్తంకుడు హోతగా నుండవలయును. సత్వరమే సర్వజ్ఞులు వేదపారగులునగు బ్రాహ్మణోత్తముల నాహ్వానింపుడు.

అపుడు విచక్షణులగు మంత్రులు రాజు నాజ్ఞానుసార మొనరించిరి. బహువిధములైన యాగసంభారములతో యాగము ఆరంభమయ్యెను. సర్పహవనము జరుగుచుండగా తక్షకుడు భయార్తుడై బయలుదేరి ఇంద్రునికడ కరిగి తన్ను బ్రోవుమని వేడుకొనెను. ఇంద్రుడు తక్షకు నూరడించి తన గద్దియపై గూర్చుండబెట్టుకొని 'నాగేశ్వరా ! నిర్భయముగ నుండుము. నీ కభయ మిచ్చురున్నాను' అనెను. తక్షకు డింద్రు నాశ్రయించి యభయము బొందిన విషయ ముత్తంకుడు తెలిసికొని యుద్విగ్నుడై యింద్రునితోడి తక్షకుని వేల్చుచున్నానని నిమంత్రించెను. అట్టితఱి తక్షకుడు యాయావర కులోద్భవుడును జరత్కారు తనయుడునగు ఆస్తీకుని స్మరించగా నాబాలుడు జన్నము జరుగు చోటికేగుదెంచి జనమేజయుని స్తుతించి సంతుష్టుని చేసెను. రాజా పండితుడగు ఆస్తీకబాలుని చూచి యతని నర్చించి యతని వాంఛితములడుగగా బాలుడు 'మహాభాగా! ఇక నీ యజ్ఞము చాలింపుడు. ఇదే నా మనోవాంఛిత'మని పలికెను. సత్యబద్ధుడగు రాజతని ప్రార్థన మన్నించి సర్పయాగము చాలించెను. 

అపుడు వైశంపాయనుడు జనమేజయునకు మహాభారతము వినిపించెను. అది వినినప్పటికిని రాజునకు శాంతి చేకూరలేదు. అతడు వ్యాసమహర్షిని మునివరా! దిగులు నా మనస్సును దహించివేయుచున్నది. నాకు మనశ్శాంతి యెట్లు చేకూరునో - ఇపుడు నా కర్తవ్యమేమో తెలుపుము. దౌర్భాగ్యమున నా తండ్రి సర్పహతుడయ్యెను. క్షత్త్రియులకు సమరమున మరణము శ్రేష్ఠమైనది. రణమందైనను ఇంటియందైనను విధిపూర్వకముగ సహజముగ దైన్యములేని చావు చచ్చు టుత్తతము గదా! కాని, నా తండ్రి చావావిధముగ జరుగలేదు. అతడంతరిక్షమున మరణించెను. కాన నతని యాత్మకు శాంతి గల్గు నుపాయము దెలుపుము. నా తండ్రి దుర్గతినుండి స్వర్గమున కేగునట్లు చేయుము' అని వేడెను.

అధ్యాయము 32 ఆస్తీకమహాముని జన్మవృత్తాంతము

శ్రీ దేవీ భాగవతం ద్వితీయ స్కంధము

పంచాంగం

Chapter 30 Parikshit dies under the curse of Vipra - అధ్యాయము 30 పరీక్షిత్తు విప్రశాపమున మరణించుట

శ్రీ దేవీ భాగవతం ద్వితీయస్కంధము - అధ్యాయము 30

పరీక్షిత్తు విప్రశాపమున మరణించుట

సూతుడిట్లనియెను: కశ్యపుడు అట్లు బయలుదేరిననాడే పురుషోత్తముడగు తక్షకుడును పరీక్షిత్తు శపింపబడెనని విని తన యింటినుండి బయలుదేరి వృద్ధబ్రాహ్మణ వేషమున పోవుకు రాజు సన్నిధి కేగుచుండిన ఆ బ్రాహ్మణునితో త్రోవలో తారసిల్లెను. తక్షకుడు ఆ మంత్రవిదుడగు విప్రుని 'నీ వెవ్వడవు? ఇంత వేగిర మెక్కడి కేగుచున్నావు? నీ పని యేమి? నీ తలంపేమి? అని యడుగగా' తక్షకుడు పరీక్షిత్తును గాటువేయునట. నే నారాజును మరల బ్రతికించుట కింత త్వరతగ్ర వెళ్ళుచున్నాను. విప్రా! నా దగ్గఱ విషహరమగు మంత్రమున్నది. ఆయువు బాగుగ నున్నచో నే నతనిని కచ్చితముగ బ్రతికించగలను' అని కశ్యపు డనెను. 'ద్విజవరా! ఆ తక్షకుడను నేనే. నేనే యా రాజును కాటువేయువాడను. నా విషపు కాటును చికిత్సించి బ్రతికించుట నీ తరముగాదు. అని తక్షకుడన 'ఆ శప్తుడైన రాజును నీవు నీ కోఱలతో కాటు వేయుము. నేను నా మంత్రశక్తితో మరల బ్రతికింతును. ఇందే మాత్రము సందేహములేదు.' అని కశ్యపుడు వచించెను. 'అనఘా! నేను కాటు వేసిన రాజును మరల బ్రతికింపగలవేని తొలుత నీ మంత్రశక్తి చూపుము ఏదీ చూతము. ఇదిగో ఇపుడే యీ మఱ్ఱిచెట్టును నా విసపు కోఱలచే గాటువేతును. దీనిని బ్రతికించుము చూతము' తన తక్షకునితో నీవా చెట్టును కాటువేసి మొత్తము బూది చేసినను సరే; నేను మరల దానికి ప్రాణము పోయగలనని కశ్యపుడు పలికెను.

వెంటనే తక్షకు డాచెట్టును తన విషజ్వాలలతో గాల్చి బూదిసేసి 'ఓ విప్రా! దీనిని బ్రతికించి నీ మంత్ర ప్రభావము చూపు' మని కశ్యపునితో నన బూదినంతటిని ప్రోగుచేసి ' ఓ నాగరాజా! విషదరా! నేనిపు డీ మఱ్ఱిచెట్టును నీకండ్లముందే నా మంత్రశక్తితో మరల బ్రతికింతును. చూతువుగాని నా శక్తి' అని మంత్రవిదుడగు కశ్యపుడు తన చేతిలోనికి జలము తీసి కొని మంత్రించి యా మంత్రజలమును భస్మరాశిపై చల్లెను. మంత్ర పూతమగు జలము తగులగనే బూడిద పచ్చనిచెట్టుగ మారెను. ఆ చెట్టు ఎప్పటియట్టులనుండుట గని తక్షకుడు విస్తుపోయెను. అపుడు తక్షకుడు కశ్యపునితో 'నీ వింత శ్రమ యేల జెందుచున్నావు? నీ మానోవాంఛితమేమి? తెలుపుము. దానిని నేను సమకూర్తును.' అనెను.

అనగా కశ్యపుడు 'ఓ పాపఱడా! నేను ధనార్థిని. రాజు శపింపబడెనని విని వచ్చితిని. నా విద్యను ప్రదర్శించి నృపసత్తముని బ్రదికించి ధనము బడయదలచితిని.' 

తక్షకుడు అనెను : ఓ విప్రేంద్రా ! ఆ రాజు నుండి నీవు కోరునంత ధనము నే నేనిత్తును. తీసికొని నీ యింటి కేగుము. దీనివలన మన యిరువుర కోరికలను దీరును. అని తక్షకుడు విప్రునితో పలికెను. పరమార్ఖ విదుడగు కశ్యపు డతని మాటలు విని యిపుడేమి చేతునా యని మాటి మాటికిట్టు లాలోచించెను: 

'నేనొకవేళ లోభమునకు దాసుడనై డబ్బు తిని నా యింటికేగినచో నాకీ లోకమున కీర్తి గలుగదు. అట్లుగాక నా వలన రాజు జీవించెనేని నాకు శాశ్వతకీర్తిచేకూరును. దీనివలన ధనప్రాప్తి - పుణ్యలాభము - రెండును గల్గును. కనుక కీర్తినే సంపాదించుట మంచిది. కీర్తిలేని ధనమేల? అది వ్యర్థము. మునుపు రఘమహారాజు యశోధనమునకై తన దనమంతయు నొక బ్రాహ్మణునకు సమర్పించెను. హరిశ్చంద్ర కర్ణులును చెడని యశము గడించిరి. విషాగ్నిచే కాలిచచ్చు రాజును గని యెట్లూరకుండను? నా మూలమున రాజు జీవించినచో జనులకందఱకును క్షేమము సమకూరును. కానిచో దేశమున నరాజకము ప్రబలి సర్వనాశమగు ననుటలో సందియములేదు. రాజు చనిపోవగ ప్రజానాశము గల్గును. ఆ పాపము నన్ను చుట్టుకొనును. ఈ ధనలోభమున నాకు తీరని యపకీర్తియు గల్గును.' అని తలంచి ధీశాలియు ధర్మాత్ముడనగు ఆ కశ్యపుడు ధ్యానములో మునింగి రాజు మరణించనున్నట్లు గ్రహించెను. తక్షకునివలన ధనముగొని తన యింటి కేగెను.

ఈ విధముగ తక్షకుడు కశ్యపు నతని యింటి మొగము పట్టించి పిదప రాజును చంపుటకై యత డేడవనాటికి హస్తిపురి కేగెను. తక్షకు డాపురముజేరి పరీక్షిత్తు పై మేడపై మణిమంత్రౌషధులచేత రక్షింపబడుచున్నాడని విని యిట్లాలోచించెను: 

"రాజును చంపకున్నచో నాకు విప్రశాపము గలుగునను భయము గలదు. నే నీ మేడలోని కేయోగమున జేర గలను? ఈ రాజు విప్రశాపహతుడు; ముని పీడాకరుడు; పాపి; శఠుడు. నే నితని నెటుల వంచింపగలను? ఈ నాటివఱకీ పాండవుల కులమున నొక ముని మెడలో చచ్చిన పామును వేసిన వాడు పుట్టనేలేదు. ఈ రాజు నింద్యమైన పని చేసెను. ఇతనికి కాలగతి తెలియనదిగాదు. ఐనను నాత్మరక్షకుల నియోగించి చివరి మేడలో దాగుకొనియున్నాడు. ఇతడు మృత్యువునే మోసగింపదలచుచు నిశ్చింతగనున్నాడు. నేనొక విప్రునిచేత ప్రేరింపబడితిని. ఇప్పుడితనిని కాటువేయు నుపాయమేది? పాప మారాజు మందమతితో చావు తప్పనిదని తెలియక కాబోలు తన చుట్టును రక్షకుల నిలుపుకొని మేడపై ప్రమోదించున్నాడు. ఒకవేళ బలీయమైన దైవమువలన చావు నిశ్చితమైనచో కోటి ప్రయత్నములు చేసినను ఫలితము సున్న. చావు తప్పింపరాదు. ఇతడు పాండవుల గొప్ప వంశములో బుట్టియు చావుగతి నెఱిగియు జీవితాశ వదలుటలేదు. పైగ నెంత నిశ్చింతగ నున్నాడు! ఈ మంచితరుణమున రాజు దానధర్మము లాచరించుకొనుట మంచిది. ధర్మమువలన వ్యాధి తొలగును. చిరాయువును గల్గును. కానిచో చావు తప్పదనుకొని స్నానదానాదిక్రియలు జరిపి స్వర్గ మేగుటకు మేను చాలించుట మఱియు మంచిది. ఇట్లు పున్నెము కూడబెట్టుకొననిచో నరకము తప్పదు. ఒక బ్రాహ్మణుని యూరకే పీడించిన పాపము' విప్రుని ఘోరశాపము అను నీ రెంటివలనను నితనికి మృత్యువు సన్నిహితమైనది. ఇప్పుడితని నోదార్చుట కొక్క విప్రుడైన లేడు. విధి విధించిన చావునకు తిరుగులేదు.

తక్షకుడు ఇట్లాలోచించి తన చెంతనున్న నాగులను తాపసమేషములు ధరింపజేసి రాజుకడ కంపెను. పిమ్మట తక్షకుడు తానును రాజుకొఱకు మంచి ఫలామూలాదులు గొనివచ్చెను. తానందలి ఒక పండులో చిన్న పురుగు రూపున దూరి యుండెను. సత్వరమే నాగులెల్లరు తాపసులై ఫలములుగొని వెడలి రాజభవనముజేరి మేడచెంత నిలుచుండ ఆ తాపసులనుగని 'మీ కార్యమే' మని భటులు వారి నడిగిరి. ''మేము రాజదర్శనార్థము తపోవనమునుండి యరుదెంచితిమి. కులదీపకుడు చారుదర్శనుడునగు పరీక్షిత్తు నాథర్వణమంత్రములతో దీవింపవచ్చినవారము. రాజుతో తమ దర్శనమునకు మును లేతెంచిరని తెలుపుడు. రాజు నభిషేకించి పిదప తీయని ఫలములిచ్చి మేమేగుదుము. భరతకులమున ద్వారపాలకులుండుట తాపసులకు రాజధర్మము లభింపకుండుట మేమింతవఱకు కనివిని యెఱుగము. పరీక్షిత్తున్న చోటికేగి యతని నాశీస్సులతో వర్ధిల్లజేసి, యతనినుండి సెలవు గైకొని వెళ్ళుదుము'' అని తాపసులు వచించిరి.

ఆ మాటలు విని వారిని విప్రులుగ నెఱింగి రక్షకులు విప్రులారా! నేడు రాజదర్శనముగాదు. రేపు ఉదయమున నెల్ల తాపసులు రాజభవనముకు రండు. విప్రశాపభయమున రాజు రక్షితుడై యున్నాడు. ఇపుడీ మేడపై కెక్కుట తగదు. మా మాట నిజము. అని రక్షకులు వారికి రాజాదేశమును వినిపించిరి. భటులారా రక్షకులారా! మా ఫలమూలములు నాశీస్సులు స్వీకరింపవలయునని రాజునకు మా మాటగ జెప్పుడని మునులు మరల రక్షకులతో ననగా భటులేగి రాజునకు తాపసుల రాకను వారి మాటలను తెల్పిరి. 'వారి ఫలమూలాదులు తెండు. వారి రాకకు కారణ మడుగుడు. ఆ తాపసులకు నా ప్రణామములని జెప్పుడు. వారిని రేపుదయమున రమ్మనుడు. నేడు నా దర్శనము గాదని చెప్పు'డని రాజ భటుల నాదేశించెను. వెంటనే భటులు వెళ్ళి మునుల ఫలమూలాదులు తీసికొని సాదారముగ కానుకగ వానిని రాజునకు సమర్పించిరి. విప్రవేషధారులగు నాగులు వెళ్ళిన పిదప ఫలములు తీసికొని రాజు తన మంత్రులతో ఓ సుహృత్తులారా! ఈ పండు మీరు భక్షింపుడు. నేనుగూడ విప్రులొసంగిన వాని నుండి యొక ఫల మారగింతును అని తన ప్రియజనులకు పండ్లొసగి తానొక పండు చీల్చి చూచెను.

దానిలో నల్లనికన్నులు తామ్రవర్ణముగల యొక చిన్నపురుగు రాజు కంటబడెను. దానినిగని మంత్రులును విస్మితులైరి. అపుడు వారితో రాజు 'ఇపుడు సూర్యు డస్తమించును. ఇక తక్షక విషమునకు నేను ధయపడనేల? నేనిపు డమోఘ విప్రశాప మంగీకరింతును. ఈ పురుగు నన్ను కరచుగాక!' అని రాజు దానిని తన కంఠమున నిలుపుకొనెను. రవి యస్తమించువేళకు రాజు తన మెడకు తగిలించుకొనిన కీటకము గ్రక్కున భయంకర కాలరూపడగు తక్షకుడుగానయి రాజు మెడచుట్టును చుట్టుకొని కాటువేసెను. మంత్రులెల్లరును విస్మితులై మిక్కిలి దురపిల్లిరి. ఆ ఘోరరూపముగల నాగరాజునుగని యెల్లరును భయపడి పరుగెత్తిరి. రక్షకులు గొల్లున నేడ్చిరి. పెల్లుగ హాహాకారములు మిన్ను ముట్టెను. పరీక్షిత్తా విధముగ పాము పడగచేత జుట్టబడి పౌరుషముసెడి కదలక మాటాడలేక పడిపోయెను. తక్షకుని విషాగ్ని జ్వాలలు చెలరేగినవి. అవి రాజును గాల్చి నిలువున ప్రాణాలు తీసినవి. తక్షకుడట్లు రాజు ప్రాణములు తీసి వినువీధి కెగిరెను. అతడు తన మాటలచే జగములచే కాల్చునేమో యని చూపఱకు తోచెను. రాజు కాలిపడిన చెట్టువలె ప్రాణాలు వదలి నేలగూలెను. జనులందఱు మృతుడయిన రాజునుగాంచి ఎట్టు విలపించిరి.

అధ్యాయము 31 ఆస్తీకమహాముని జనమేజయుని సర్పయాగము మాన్పించుట

శ్రీ దేవీ భాగవతం ద్వితీయ స్కంధము

పంచాంగం

Numerology - Number 5 - న్యూమరాలజీ - 5వ సంఖ్య

న్యూమరాలజీ - 5వ సంఖ్య గ్రహము : బుధుడు.. జన్మదిన తేదీ సంఖ్య:- 5, 14, 23 జనవరి నుండి డిసెంబరు నెలలలో ఏ నెలలో నైనాసరే 5, 14,23 ఈ తేదీలలో పుట్టి...