Sunday, April 12, 2026

Chapter 41 Brahma explaining the triguna form to Narada - అధ్యాయము 41బ్రహ్మ నారదునకు త్రిగుణ స్వరూపము వివరించుట

శ్రీ దేవీ భాగవతం తృతీయస్కంధము - అధ్యాయము 41

బ్రహ్మ నారదునకు త్రిగుణ స్వరూపము వివరించుట

నారదు డిట్లనియెను: నీవు గుణముల లక్షణములను విస్తరించి చెప్పితివి. నీ ముఖనిర్గతమైన దేవీ వాక్యకథా సుధారస మెంత క్రోలినను నాకు తృప్తి గులగుటలేదు. ఆ త్రిగుణముల స్వరూపములనుగూర్చి నా కింకను కొంచెము తేటగ వివరింపుము. వాని నన్నిటిని సమగ్రముగ వినినగాని నా మదికి శాంతి చేకూరదు.

ఇట్లు నారదుడు తన తండ్రి నడుగ రజోగుణ సముద్భూతుడు విశ్వకర్తయు నగు బ్రహ్మ తన కొడుకున కిట్లు పలికెను: 

"నారదా! నీ కా త్రిగుణముల గుఱించి వర్ణింతును. వినుము: వానిని గూర్చి నాకును పెద్దగ తెలియదు. ఐన నేదో నా మదికి తోచినంతగ దెలుపగలను. కేవలమొకే సత్త్వగుణ మెచటను నిలువజాలదు. అది తక్కిన గుణములతో చేతులు కలిపి మిశ్రభావమున ద్యోతిత మగుచుండును. ఎట్లన నొక చక్కని యువతి పెక్కుసొమ్ములుదాల్చి హావభావ విలాసములతో తన భర్తకు సంతృప్తి గల్గించును. ఆమెయే తన తల్లిదండ్రులకును బంధువులకును ప్రీతి నొడగూర్చును. కాని యామెయే తన సవతుల దుఃఖమోహములకు కారణభూతురాలగును. ఈ రీతిగ నా స్త్రీ సత్త్వరూపమున నున్నప్పటికిని ఆమెలో రజస్తమనస్సుల భిన్నవృత్తులు పెల్లుబుకుచుండును. ఇట్లా స్త్రీలోని రజోగుణముతో తమము జేరి యా రెంటి కూడిక వలననే వేరొక వృత్తి ప్రతిభాసించును. సహజస్వభావమందు నెలకొనియున్నప్పుడితర వృత్తులు తలలెత్తవు. ఒకప్పుడు భిన్నములైన గుణవృత్తులు జేరి విపరీత ప్రవృత్తులుగ పొడసూపును.

ఎట్లనగ, నొక స్త్రీ రూపవతి యువతి లజ్జా మధురిమలు గలది-వినయవతి - ధర్మశాస్త్ర కామశాస్త్ర విధిజ్ఞ. ఆమె తన పతి హృదయమును నలరించును. కాని యామెయే తన సవతులకు దుఃఖమోహములు గల్గించును. ఇట్లే తీరని దుఃఖములో తెలియని మోహము సత్త్వమందు సైతముండునని జనులందురు. అట్లే సత్త్వము నందితర భావములును ప్రకటమగుచుండును. సేన యొక్కటియ చోరులవలని యుపద్రవము నొందిన సాధు జనులకు సుఖకరముగను దొంగలకును దోపిడిగాండ్రకును దుఃఖమోహములను కలిగించుచు దోష సహితముగాను తోచును. ఒక్కొక్కప్పుడీ గుణములవలన సాజముగ విపరీత భావములు వెలువడుచుండును. ఎట్లన పెద్దగ మబ్బులు క్రమ్మిన దుర్దినమున ఉఱుములు మెఱుపులు భయంకరముగ నుండును. చిమ్మచీకట్లు గ్రమ్మును. వర్షములు కురియును. ఆ స్థితిని లోకులు తమోరూపమందురు. ఈ పరిస్థితి పండినపంటగల కృషకులకు దుర్దినమగును. విత్తనములు నాటిన కర్షకునకు సుదినముగ నుండును. ఇదే పై కప్పులేని యింట నివసించుచు తృణకాష్ఠములపై బ్రతుకు గృహస్థుల కతిదుఃఖదాయక మగును.

తన పతి విదేశమందున్న ప్రమద కీ దుర్దినము భరింపరాని మోహమునకు కారణమగును. ఆమె స్వభావములోని గుణవికారములెల్ల విపరీతమై మాటలు చెలరేగుచుండును. వీని లక్షణము లింకను విశదముగ వెల్లడింతును. ఆలింపుము. సత్త్వగుణము నిర్మలమై స్వచ్ఛమై నిత్యమై లఘుప్రకాశముగలదై స్వచ్ఛమగు వెలుగులు జిమ్ముచుండును. కన్ను ముఖము మున్నగు నింద్రియములు సకలాంగము లెప్పుడు స్వచ్ఛముగ వికాసము జెందునో చిత్తము గంగవలె నిర్మలముగ కోర్కులు లేకుండునో యప్పుడు సత్త్వతేజము వెలుగుచున్నదని యెఱుంగవలయును. అట్టి సత్వము విషయములజోలికి పోదు. అప్పుడు శరీరమందు లోనను బైటను నొకే సత్వము తేజరిల్లుచున్నదని భావింపవలయును. చంచలత ఆవులింత స్తంభము తంద్ర యనునవి రజోగుణలక్షణములు. ఇట్టి క్లేశకారకములైన లక్షణము లెవనిలో మూర్తీభవించునో వానిలో రజోగుణము రాజిల్లుచున్నదని యెఱుగవలయును. గ్రామాంతర మేగుట చిత్తచాంచల్యము వివాదములందు దగుల్కొనుట దేహము బద్ధకించుట మున్నగు లక్షణములు దోచినపుడు తమోగుణము నిండియున్నదని యెఱుగవలయును. అపు డొడలంతయు బరువెక్కును. తమము దట్టమై పేరుకొనును. చిత్తము ఇంద్రియములు క్రియాశూన్యము లగును. నిద్ర పట్టకుండును.

ఈ విధముగ గుణముల లక్షణము లెఱుంగవలయును అనగా నారదు డిట్లనియె: 

"పితామహా! నీవు త్రిగుణలక్షణములను వేరువేరుగ వివరించితివి. ఇవన్నియు నొకేచోటజేరి పనులన్నిటి నెట్లొనరింపగలవు? ఇవి పరస్పరము శత్రువులయ్యు నెట్లు కూడాయుండును? ఈ విషయము కొంచెము విడదీసి చెప్పుము. 

బ్రహ్మయిట్లనె: పుత్త్రా! విపులముగ వాక్రుత్తును. చెవి యొగ్గి వినుము. ఆ గుణములు దీపకాంతి లక్షణము గలవి. అది మనము వస్తువులను చూచునట్లు చేయును. వత్తి తైలము జ్వాల - యివి పరస్పర విరుద్ధములు. వత్తి తైలములు-తైలాగ్నులు-వర్త్యగ్నులు పరస్పరము విరుద్ధములు. కాని యివన్నియు నొక్కచోజేరి పదార్థములను దర్శింపజేయును. వ్యాసా! ఇట్లు గుణములన్నియు మూలసహజప్రకృతినుండి కల్గుచుండును. ఇవన్నియును సంసారకారణములు అని తొల్లి నేను బ్రహ్మవలన వింటిని. అని ఇట్లు నేను నారదునివలన నెఱింగిన గుణముల లక్షణములును వాని కార్యములును నీకు విడమరచి చెప్పితిని. గుణములన్నిటిని కల్పించి విభజించి జగన్నాటక మాడించు ప్రకృతి మహాశక్తి యెల్లవారికి నారాధ్యదేవత. ఆ దేవీ గుణకార్యభేదములవలన నిర్గుణయు సగుణయునై విలసిల్లుచుండును. ఆమెయే పూర్ణపురుషుడు-అన్యయుడు నిరీహుడు - అచ్యుతుడునగు పరమపావనుడు.

ఆ మహా మాయాశక్తియే యీ సదసదాత్మకమైన బ్రహ్మాండములందు బ్రహ్మ విష్ణువు రుద్రుడు రవి శశి ఇంద్రుడు వసువులు అశ్వినులు వరుణుడు కుబేరుడు వహ్ని ఆయువు పూషుడు సేనాపతి వినాయకుడు మున్నగు దేవతలను గుణకర్మ విభాగమున సృజించును. వీరెల్ల రా శక్తితో యుక్తులగుటవలననే కార్యకరణదక్షు లగుచున్నారు. ఆ శక్తి తోడు లేనిచో వారు నెంతమాత్రము చలింపజాలరు. ఓ రాజా! ఆ పరమేశ్వరి విశ్వజగత్కారణురాలు. కాన జనమేజయా! దేవీ యజ్ఞ మొనరించి యా తల్లి నారాధించుము. ఆ దేవిని భక్తితో బూజింపవలయును. ఆ తల్లియే శ్రీమహాలక్ష్మీ మహాకాళి మహాసరస్వతి రూపములతో నిత్యపూజలందు కొనుచుండును. ఆమెయే సర్వభూతేశ్వరి సర్వకారణకారణ సర్వకామార్థద శాంత దయామయి సుఖసంసేవ్య. తన పవిత్రశుభనామ ముచ్చరించి నంతమాత్రముననే యా తల్లి తన భక్తుల వాంఛితార్థము లీడేర్చును. ఆ శ్రీమాతృదేవి పూర్వము హరిహరబ్రహ్మలచేత నారాధింపబడినది. ముముక్షులు జితాత్ములు తాపసులునగువా రామెను బూజించి తరించిరి. ఎవ్వడైన ప్రసంగవశముననైన నా దేవతనామ మొకేయొకసారి యుచ్చరించిన చాలును. దేవిదయదలచి వాని కోర్కులెంత దుర్లభములైనను తీర్చివేయును. ఎవడేని భయార్తుడై కాఱడవిలో క్రూరమృగములను గాంచి ''ఐ-ఐ'' యని దలంచినచో ''ఐ-ఐ'' వర్ణములందు బిందువు లేనప్పటికి దయామయియగు దేవి వాని భయముబాపి కోర్కులు కురియును. దీనికి సత్యవ్రతుని చరిత్ర తార్కాణము. అతని చరిత్ర నాకును ప్రత్యక్ష ప్రమాణమే. ఆ సత్యవ్రతుడు మహితాత్ములగు స్వాత్మవిచారులకు బాగుగ తెలియును. బ్రాహ్మణ సమాజమందా సత్యవ్రతుని చరిత్ర కీర్తింపబడుచుండును. నే నాతని చరిత్రయంతయు చక్కగ వింటిని. అదేమన- పూర్వము మహామూర్ఖుడు నిరక్షరకుక్షి యగు సత్యవ్రతుడను బ్రాహ్మణు డుండెను. అతడొకనా డొక కోలము (వరాహము) నోటినుండి ''ఐ'' కారము విని దానినే యుచ్చరించి మహా పండితు డయ్యెను. దయామృత తరంగిణియగు పరమేశ్వరి 'ఐ' కార ముచ్చరించినతనే యతనియెడ సంతుష్టయై యతని నొక కవిరాజుగ నొనరించెను.

అధ్యాయము 42 సత్యవ్రతుని చరితము

శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము

పంచాంగం

No comments:

Post a Comment

Chapter 51 Sudarshana Came to Swayamvara - అధ్యాయము 51 సుదర్శనుడు స్వయంవరమున కేగుదెంచుట

శ్రీ దేవీ భాగవతం తృ తీయ స్కంధము - అధ్యాయము 51 సుదర్శనుడు స్వయంవరమున కేగుదెంచుట వ్యాసముని యిట్లనియె : ఆ విధముగ సుబాహువు పలుకగ రాణి పవిత్రమగు...