Sunday, April 12, 2026

Chapter 49 Chanting of Kamaraja Bheeja by Sudarshana - అధ్యాయము 49 సుదర్శనుడు కామరాజ బీజము జపించుట

శ్రీ దేవీ భాగవతం తృతీయస్కంధము - అధ్యాయము 49

సుదర్శనుడు కామరాజ బీజము జపించుట

వ్యాసుడిట్లనియె: భరద్వాజుని వాక్కులు విని యుధాజిత్తు వృద్ధామాత్యుని బిలిచి యతనితో నిట్లనియెను. 

''ఓ సుబుద్ధీ! సుభాషిణియు సుపుత్త్రయునగు మనోరమను నేనిప్పుడు నా బలము ప్రయోగించి తెచ్చుట మంచిదా, కాదా? నా కర్తవ్యమేమో నీవే తెలుపుము. తన మేలుగోరుకొనువాడు తన యల్ప శత్రువునైన సుపేక్షించి విడిచిపెట్టరాదు. అట్లొనర్చిన నది రాజయక్ష్మ రోగమువలె పెరిగి పెరిగి తన చావునకు కారణభూతమగును. ఇచ్చట నన్ను కాదని ధిక్కరించు యోధులు లేరు. కనుక నా మనుమని శత్రువగు సుదర్శనుని పట్టి పల్లార్తును. ఇపుడు బలప్రయోగముతోనైన నీపనికి బూనుకొందును. సుదర్శనుడంతమొందినచో నా మనుమడింక కంటినిండ నిద్రపోగలడు. అతని రాజ్యము నిష్కంటకము కాగలదు.'' 

మంత్రి యిట్లనియె : ఓ రాజా! సాహసము తగదు. ఈ మునివచనము పాటించుము. అతడు విశ్వామిత్రునంతటివానినే యుదాహరించి వాక్రుచ్చెను. పూర్వము గాధినందనుడును ప్రఖ్యాతమునియునగు విశ్వామిత్రుడెల్లెడల గ్రుమ్మరుచు వసిష్ఠమున్యాశ్రమము జేరెను. ప్రతాపియగు విశ్వామిత్ర భూపతి బ్రహ్మర్షికి వసిష్ఠునకు ప్రణమిల్లి యతడొసంగిన యాసనమందాసీనుడయ్యెను. అంత విశ్వామిత్రుడు బ్రహ్మర్షిచే నిమంత్రితుడై ససైన్యముగ భోజనమునకు సిద్ధమయ్యెను. వారి భోజనమునకు వలసిన భక్ష్య భోజ్యాదులెల్ల నందినీ ధేనువు సమకూర్చెను. ఆ రాజు ససైన్యముగ తుష్టిగ భుజించెను. అదంతయును నందినీ ప్రభావ మని విశ్వామిత్రుడెఱింగి వసిష్ఠ మునీశ్వరునితో అతడు ఓ పరంతపా! మునీశా! నీకు కడివెళ్ళ పాలిచ్చు గోవుల సహస్ర మిత్తును. నాకా నందినీ ధేనువు నొక్కటిమ్మని ప్రార్థించుచున్నాను అని యాచించెను.

వసిష్ఠు డిట్లనియె: రాజా! ఇది నా హోమ ధేనువు. నీ కీయను. నీ యావులు నీ యొద్దనే యుండనిమ్ము అని వసిష్ఠుడన మునివరేణ్యా! నీవేరికోరుకొన్న యావులను పదివేలైన లక్షయైన నిత్తును. నాకు నీ గోవునిమ్ము. కాదేని నా బలము చూపి దానిని గొనిపోదును అని విశ్వామిత్రుడనెను. 

అది విని వసిష్ఠమహర్షి యిట్లు వాక్రుచ్చెను: మహీశా! నీకు దోచినట్లుగ బలముపయోగించి నందినిని తీసికొనుము. నేను మాత్రము నా యిష్టముతో నా యింటినుండి నాచేతిమీదుగ దీనిని నీకు వదలిపెట్టను. అంత నరపతి మహాబలదర్పితులగు తన భటులను నందినిని గొనిరమ్మని యాజ్ఞాపించెను. వారు హఠాత్తుగా దానిని బట్టుకొనబోగా నందిని వణకుచు కన్నీరు గార్చుచు మునీశునితో మునివల్లభా! నన్నేల త్యజింతువు? కట్టివేసిన నన్ను లాగికొనిపోవుచున్నారు అన ఓ నందినీ! నేను నిన్ను వదలుట లేదు. ఇపుడే పూజించిన నిన్నతడు బలిమితో గొంపోవుచున్నాడు. నేను మదిలోగూడ నిన్ను వదలదలచలేదు. నేనిపుడేమి సేతును? అను మునివరుని పల్కులు విని నందిని కోపోద్రిక్తయై క్రూరముగ హంభారవమొనరించెను. అంత నా గోవు మేనినుండి కవచధారులును సాయుధులైన ఘోర దైత్యులు బయలువెడలి నిలునిలుడని కేకలు పెట్టుచు వారి వెంటబడిరి. ఆ దైత్య సేనలు వైరి సేనలను ఱుమాడి కాకావికలు చేసి నందినిని విడిపించుకొని వచ్చెను. విశ్వామిత్రుడతి దుఃఃతుడై చేయునదిలేక ఒంటిగ వచ్చినబాట పట్టెను. పాపమతడు దీనాత్ముడై తన క్షాత్రమును ధిక్కరించుచు బ్రహ్మతేజోబలమే నిజమైన బలమని యది దుర్గ్రాహ్యమని భావించి తపోనిమగ్నుడయ్యెను. అట్లు గాధేయుడు పెక్కేండ్లు ఘోరముగ ఘోరారణ్యములందు తపమాచరించి క్షత్రియత్వము వదలి ఋషిత్వమందెను.

కనుక నో రాజేంద్రా! ఇపుడు నీవును మునితో పగబూనకుము. తాపసోత్తములతోడి వైరము కులనాశకరము. నీవిపుడే మునివరుడగు తపోనిధిని సంతసింపజేసి యేగుము. సుదర్శను డిచట యథా సుఖముగ మనుగడ సాగించు గావుత. రాజా! ఈ నిఱుపేద బాలుడు నీకేమపకార మొనరింపగలడు? ఈ దిక్కుమాలిన దుర్బలుడగు బాలునిపై నీకు విరోధ భావము తగదు. అందఱియందు కనికరమును జూపవలెను. జగము సర్వము దైవవశము గద! ఈసువలన ప్రయోజనము సున్న. ఏది ప్రాప్తవ్యమో యది తప్పక ప్రాప్తమై తీరును. ఒక్కొక్క సమయమందు దైవయోగమున గడ్డిపోచ వజ్రముగను వజ్రము గడ్డిపోచగను మారును. కుందేలు శార్దూలమును దోమ యేనుగును చంపగలదు. కాన నతిసాహసము వలదు. నా హిత వాలింపుము.

మంత్రి హితము విని యుధాజిత్తు మునికి తలవంచి నమస్కరించి తన నగరి కరిగెను. మనోరమయు స్వస్థయై ఋతవ్రతుడగు తన సుతుని పోషించుచు మున్యాశ్రమందుండెను. ఆ సుదర్శన బాలుడు నెల బాలునివలె దిన దిన ప్రవర్ధమానుడై మునిబాలురతో నిర్భయముగ నాటలాడుచుండెను. అంత నొకనాడు విదల్లుడచ్చటికేతెంచెను. మునిలబాలురతనినిగని క్లీబుడని పిలిచి గేలిచేసిరి. సుదర్శనుడాశబ్దము విని బకారమువదలి యనుస్వారయుతముగ నేకాక్షరమగు ''క్లీం'' కారమును సుస్పష్టముగ మాటామాటికి నుచ్చరింపదొడగెను. అట్లా బాలుడు కామరాజ బీజమును నెమ్మనమందు నెమ్మితోదాల్చి విసుగుసనక లోలోన నిరంతరాయముగ దానినే జపింపసాగెను. ఆ పగిది భావి శుభయోగసూచకముగ సుదర్శనుడు కామరాజ బీజమును సహజముగ గ్రహించి జపము సాగించెను. ఆ యైదేండ్లప్రాయపు రాకుమారుడు ఋషి ఛందము న్యాసము ధ్యానము వదలి యా దివ్యప్రణవమును జపించుచు ధ్యానించుచుండెను. అతడా యేకాక్షర మంత్రమే సర్వ విజ్ఞాన సారమని స్వయముగ నెఱింగి యేమరక మఱువక నాడుచు పాడుచు నిదురించుచు మనసార హృదయమున జపించుచుండెను.

అతడు పదునొకండేండ్ల ప్రాయమున భారద్వాజునిచేత నుపనీతుడై వేదాధ్యయన మొనరించెను. అతడు "క్లీం" మంత్ర ప్రభావమున సాంగధనుర్వేదము నీతి శాస్త్రము తుదకు సకల విద్యలు తేలికగ నభ్యసించెను. పిమ్మట నతడొకనాడు రక్తాంబర రక్తవర్ణ రక్తమండల మండితయగు శ్రీ పరాదేవతను ప్రత్యక్షముగ సందర్శించెను. అతడు గరుడ వాహనమందాసీనయైయున్న పరమాద్భుత కామకళాశక్తియగు శ్రీ మహావైష్ణవిని సంవీక్షించి నిర్మలవదనుడయ్యెను. అట్లా సుదర్శనుడు వనమందు సకలవిద్యార్థ రహస్యములు బడసి తన మాతృమూర్తిని సేవించుచు నదీతటమున విహరించుచుండగా జగన్మాతయగు శ్రీ మాతృదేవి యతనిపై దయతలచి విల్లమ్ములు కవచతూణీరములు నొసంగినది. అదే సమయమున కాశీరాజు ప్రియపుత్త్రిక సర్వసులక్షణసంయుత యగు శశికళయను నామె యెప్పులకుప్పయై యొప్పారుచుండెను. ఆ కన్యకామణి నృపతనయుడును అపరమన్మథుడును సకల సులక్షణ సంయుతుడునగు సుదర్శనుని గుఱించి వందిజనము వలన విని యతనినే తన వరునిగ వరింప మదిలో గాఢ నిశ్చయము చేసికొనెను. అంత నొకనాటి రేయి కలలో జగదంబ ఆమెకు గనంబడి యాకన్నియ నూరడించుచు ఓ సుశ్రోణీ ! సుదర్శనుడు నాకు భక్తుడు. అతనినే వరునిగ వరింపుము. నా వాక్కుల వలన నతడే నీకు సర్వకామప్రదుడగును అనెను. అట్లు శశికళ కలలో జగదంబనుగని యామె యొక్క ప్రియవాక్కులు విని ముదితాంతరంగయై మేల్కనిన తరువాత గూడ సంతసిల్లుచుండెను. ఆమెతల్లి యామె ప్రమోదమునకు కారణమడిగెను. కాని, యామె సిగ్గును మారు మాట పలుకకుండెను.

ఆ బాల ప్రమదము నిండార తేపతేపకు కలను స్మరించుచు స్వప్న వృత్తాంత మంతయును తన చెలికత్తెకు సవిస్తరముగ చెప్పెను. ఒకనాడు విశాలనయనయగు నాబాల తన చెలితో చంపకములు పరిమళించు సుందరోద్యానమునకు వాహ్యాళి కేగెను. ఆమె పూలుగోయుచు నొక సంపెంగ పూలచెట్టు చెంతనుండి అపుడదే మార్గమున తనవైపునకేతెంచుచున్న యొక విప్రునిగనెను. ఆమెయతనికి చేతులు జోడించి తీయని మాటలతో నో మహానుభావా! మీరాక యేదేశమందుండి?' అని యడుగ ఆ విప్రుడును ఓ బాలా! నేను భరద్వాజాశ్రమమునుండి యొక కార్యము నిమిత్త మేతెంచుచున్నాను. నీవేమడుగుదువో యడుగుము' అనెను. ఓ మహాత్మా! ఆ పవిత్రాశ్రమమందు విశేషముగ వర్ణనీయము లోకాతీతము ప్రేక్షణీయమునైన వస్తువేది కలదు?' అని శశికళయడుగ: 

విప్రుడిట్లనియె: ఓ వరోరు! ధ్రువసంధి రాజు తనయుడు సుదర్శనుడు. అతడు శ్రీమంతుడు. సార్థకనామధేయుడు; పురుషోత్తముడు. అతడాయాశ్రమందు గలడు. కమలనయనా! అతని సోయగముజూడని కన్నులు కన్నులుగావని నాకు దోచుచున్నది. సకలసృష్టి సలుపు విధాత గుణనిలయుని చూడగోరియే విశ్వ సుగుణముల నతనిలో రాశిగబోసి సృజించి యుండె గాబోలు! ఆ రాజకుమారుడే నీ కన్నివిధముల తగిన వరుడు - యోగ్యుడు. ఈ మీ యోగము మణికాంచన యోగమట్లు సంఘటిల్లినది.

అధ్యాయము 50 శశికళ విరహ వర్ణనము

శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము

పంచాంగం

No comments:

Post a Comment

Chapter 58 Sridevi Navratri Puja Method - అధ్యాయము 58 శ్రీదేవీ నవరాత్ర పూజా విధానము

శ్రీ దేవీ భాగవతం తృ తీయ స్కంధము - అధ్యాయము 58 శ్రీదేవీ నవరాత్ర పూజా విధానము జనమేజయు డిట్లు వ్యాసుని ప్రశ్నించెను : ఓ ద్విజోత్తమా! నవరాత్రము...