Sunday, April 12, 2026

Chapter 43 Satyavrata was accomplished under the influence of Vagbeeja - అధ్యాయము 43 వాగ్బీజ ప్రభావమున సత్యవ్రతుడు సిద్ధినందుట

శ్రీ దేవీ భాగవతం తృతీయస్కంధము - అధ్యాయము 43

వాగ్బీజ ప్రభావమున సత్యవ్రతుడు సిద్ధినందుట

లోమశుడిట్లనెను : ఆ యుతథ్యుడు వేదాధ్యయనముగాని జపధ్యానములుగాని దేవతార్చనగాని యెఱుగడు. నియమాసనములు ప్రాణాయామ ప్రత్యాహారములు భూతశుద్ధి విధానములు నెఱుంగడు. మంత్రకీలక జపములుగాని శ్రీగాయత్రి గాని శుచిత్వముగాని స్నానవిధిగాని యాచమనాదులుగాని ఆతనికి తెలియవు. ప్రాణాగ్ని హోత్రమున బలిదానము అతిథిసత్కారము సంధ్యోపాసన సమిద్ధోమములు మున్నగువాని గూర్చి బొత్తుగ తెలియదు. అతడు మాత్రము ప్రతి దినము నుదయ కాలమందు మేల్కాంచి పండ్లు తోముకొని శూద్రునివలె స్నానమంత్రము చెప్పకయే గంగలో మునుగుచుండును. ఆ శఠద్విజుడు పట్టపగలు స్వేచ్ఛగ వనమందేగి తినదగినవనిగాని కూడనివనిగాని తలంపక కొన్నిపండ్లు దెచ్చుకొని తినుచుండును. ఆ బాపడు నిత్యము సత్యమే పలుకును. అసత్య మాడకుండుటవలన లోకు లతనికి సత్య తపుడను పేరిడిరి. ఆతడెవ్వరికి గాని హితాహితము లొనర్పక నిర్భయముగ నిశ్చింతగ నేదియో లోన జింతించుచు సుఖనిద్ర చెందుచుండును.

నాకు చావెప్పుడు మూడునో కద! ఈ యడవిలోబడి జీవిత మతి కష్టమున వెళ్ళబుచ్చవలసివచ్చినది. అయ్యో! మూర్ఖుని జీవితము లోకమున నెంతయు పనికి మాలినదే! దీనికంటె చావే నయము. నా దైవమే నన్ను మూర్ఖునిగ జేసినది. అంతేకాని మరింకేదియు దీనికి కారణముగాదు. నే నుత్తమజన్మమెత్తియు వట్టి వ్యర్థుడనై పోతిని గదా! అందాలు విరజిమ్ము గొడ్రాలు ఫలములులేని చెట్టు పాలులేని యావు నెట్లో నేను నట్లే యెందులకును పనికిమాలినవాడనై పోతినే! నన్ను బుట్టించిన దేవుని నిందించి ఫలమేమి? నే చేసికొన్న కర్మ కేడువవలయును. నే నెన్నడైన నొక బ్రాహ్మణునకైన నొక పుస్తకము దాన మీయలేదేమో! నా తొంటి పుట్టువులో నా వెంటబడు విద్యార్థులకు బ్రహ్మవిద్య ధారపోయనైతినొక్కో! ఆ దుష్కర్మయోగమున నే నిపుడీ నికృష్టజన్మ మనుభవించుచున్నాను. పూర్వము నేను పుణ్యతీర్థములందు తపము సేయలేదేమో? సాధులను సేవింపలేదో? ద్విజులను ద్రవ్యములతో బూజింపలేదో? దాని ఫలితముగనే యిపుడీ దుష్టబుద్ధితో బుట్టితినేమో! పెక్కురు నాతోడి మునికుమారులు వేదశాస్త్ర పారగులై యున్నారు. ఏదో తెలియని దైవయోగమున నా కర్మకాలి నే నిట్లు మూఢుడనై పడియున్నాను. నాకు జపతపములు తెలియవు. సాధన లొనర్చు టంతకంటె తెలియదు. నా సంకల్పములన్నియు మిథ్యలు-గాలిమూటలు- తీరనివి. నా యదృష్టము తలక్రిందైనది. మానవున కెంత పౌరుషమున్న నంతయు నిరర్థకము. కార్య పరిశ్రమయు వ్యర్థము. అన్నిటికి దైవబలమే పరమార్థము. అన్నియు దైవమువలననే నెరవేరును. బ్రహ్మ విష్ణువు రుద్రుడు ఇంద్రాది దేవతలు నఖండమైన కాలమునకు కట్టుబడినవారే. కాల మె వారికిని దురతిక్రమణీయము. విచిత్రము.

ఇట్లతడు రేయింబవళ్లు తనలోతాను వితర్కరించుకొనుచు పావన గంగాతటమున కాలము గడపుచుండెను. ఒంటరిగనుండి విరక్తుడై జీవితమును పరమశాంతముగ సాగించుచుండెను. ఇట్లతడు జపమంత్రార్చనల విధాన మెఱుంగక నదీతీరమున వసించుచుండగ పదునైదేడులు నాగిపోయెను. నిత్యము సత్యమే పలుకుచు పొరపాటుననైన నసత్యము బల్కి యెఱుగనందున నతనికి సత్యతపుడను నామము సార్థకమై ఆతని కీరితి నేల నాల్గుచెఱగుల వ్యాపించెను. అంత నొక్కనాడొక బోయవాడు విల్లమ్ములుదాల్చి వేట తమకమున నచ్చటి కేతెంచెను. అతడు యమునివలె భీకరాకారుడు. మహాక్రూరుడు; శఠుడు; ప్రాణాలు బలిగొనుటలో వెనుకాడనివాడు. ఆ కిరాతుడు వింట బాణమును సంధించి యొక పందిని గొట్టెను. అది గడగడలాడుచు ప్రాణాలమీది తీపితో మునిచెంతకు పరుగెత్తెను. నెత్తుటదోగాడు తనువుతో కంపించుచు నాశ్రమ సమీపమున జేరిన దాని దీనస్థితి గనగనే ముని గుండె దయతో నిండెను. అట్లు తన యెదుట నెత్తుట దడిసిన పంది పరుగెత్తుటగాంచి ముని బాలుడు దయాంతరంగితాంతరంగుడై సారస్వత బీజమగు ''ఐ'' కారముతో దాని నదల్చెను. అతడంతకుముందా బీజము వినలేదు. తెలిసికొనలేదు. అది యిప్పుడతని నోటి వెంట దైవయోగమున వెలువడెను కాని, ఆ పంది దైన్యమునకాముని మిక్కిలి బాధపడెను. ఆ పంది కిరాతుని బాణపు దెబ్బకు తాళలేక వడకుచు రొప్పుచు మూల్గుచు నెవ్వరును చొరలేని యాశ్రమపు పొదరింట దూరెను.

ఆ బోయ రెండవ యమునివలె భీకరదేహముతో నారి సారించుచు పందిని వెదకుచు మునిచెంతకువచ్చి దర్భాసనముపై పద్మాసనమున గూర్చున్న సత్యవ్రతుడను మునినిగని సాగిలపడి మ్రొక్కి యిట్లనెను : 

'ఓ మునీ! నా పంది యెటు పరుగిడెను? చెప్పుము. నీవు సత్యవ్రతుడవని వాసిగాంచుట నే నెఱుంగుదును. నా కుటుంబము పేరాకట మలమల మాడుచున్నది. దానిని పోషించుటకు వేటకు వచ్చితిని. నా బాణము దెబ్బతిన్న పంది యెటుపోయెను? తెలుపుము. నేను నిజము పలుకుచున్నాను. నాకు తగిన కులవృత్తి యిదేగాని మరేదియులేదు. నా సంసారమును మంచిదికాని చెడుదికాని అగు ఏదేనుపాయమున పోషించుట నా విధి. ఓ ద్విజవర్యా! నీవు సత్యవాదివి - సత్యవ్రతుడవు. నా కుటుంబ మాకటిమంటతో నకనకలాడుచున్నది. కాన నా బాణము తాకిడి తిన్న పంది యేమయ్యెనో నాకు వెంటనే తెలుపుము.' అను బోయని మాటలు విని ముని యిట్లు తలపోసెను: 

'ఇపుడు నేను చూడలేదనుటచే నాసత్యవ్రతము భంగము కాదా? ఇపుడేమి చేతును? పెద్ద సందేహములో చిక్కుకొంటిని. బాణము దెబ్బతిన్న పంది యిచటికి వచ్చెనని నిజముగాని రాలేదని యసత్యముగాని నే నిపు డెట్లు పలుకగలను? ఇతడాకలిమంటతో నున్నాడు. అది వచ్చెనందునా? ఇతడు వెంటనే దానిని చంపి తీరును. హింసతోగూడిన సత్యము సత్యముగాదు. దయతోగూడిన యతస్యముగూడ సత్యమే యగును. దేనివలన విశ్వహితము చేకూరునో యదే లోకములందు సత్యమనం బరగును. తదితర మట్లు గాదు. ఇట్టి సంకట పరిస్థితులలో పందికి మేలు జరుగుట - నేను నిజము పలుకుట రెండు నొకేసారి యెట్లు పొసగునా, యని యతడు ధర్మసంకటమున వెనుక ముందులాడుచు బ్రాహ్మణుడవగు జమదగ్నీ! వాస్తవము దెలుపలేకుండెను. కాని బాణముదెబ్బ తగిలిన పందినిగాంచి ముని తలవనితలంపుగ దయతో ''ఐ'' యని పల్కెను. ఆ పల్కునకు వాగ్రూపిణియగు సరస్వతీశక్తి సంతసల్లి యతడు తన వాగ్బీజమే పల్కెనని యతనికి పండితుల కందని మహావిద్యను ప్రసాదించెను. తత్ప్రభావమున మున్ను వాల్మీకి ముని కెల్లవిద్యలు స్ఫురించినట్లా ముని బాలున కెల్లవిద్దెలు ప్రస్ఫురించెను. తత్ఫలితముగ నతడు మహాకవి యయ్యెను.

అపుడు తన ముందట విల్లమ్ములుదాల్చి నిలుచున్న బోయనుగని దయాధర్మ కాముడగు సత్యకాముడొక శ్లోకము చదివెను: 

"ఓ వ్యాధా! ఏది చూచునో యది పలుకదు. ఏది పలుకునో యది చూడదు. కాన నీ స్వార్థమునకు నన్నింతగ గ్రుచ్చి గ్రుచ్చి యడుగుదువేల? ముని మాటలు విని పశుఘాతకుడగు వ్యాధుడు పందిమీది యాస వదలి తన యింటి మొగము పట్టెను. పిదప నా బ్రాహ్మణు డపర వాల్మీకివలె మహాకవిశేఖరుడై యెల్లలోకములందు సత్యవ్రత నామమున ఖ్యాతినందెను. పిమ్మట నా బ్రాహ్మణుడు వాగ్బీజము నిరంతరముగ విధిగ జపించుచు భూతలమున పండితోత్తముడై పేరెన్నిక గనెను. ఎల్ల మునులు విప్రులు ప్రతిపర్వమందు సత్యవ్రతుని యశము గానము చేయుదురు. ఆతని మహత్తర చరిత్రమును సంస్తుతింతురు. ఒకప్పుడతని నింటినుండి గెంటినవారే నేడతని కీర్తి ప్రభావము తెలిసికొని మరల నతని నింటికి గొనిపోయిరి.

కావున నో మహారాజా! ఆ యాదిశక్తి జగత్కారణురాలు. పరాదేవి. ఆ తల్లి యెల్లరచే నైకాంతిక పరభక్తితోడి పూజలు సేవలు నందుకొనుచు విరాజిల్లుచుండును. ఓ రాజా! ఆ దేవీ యాగ మొనరింపుము. ఆమె నీ సర్వకామితము లీడేర్చును. ఇందు నలుసంతయు సందేహము లేదు. తన్నెవరు చిత్తశుద్ధితో నభ్యాసయోగ సంస్కృత చిత్తముతో ధ్యానింతురో సంస్మరింతురో పూజింతురో నామ సంకీర్తనము చేయుదరో వారి వాంచితార్థము లొసంగును గాన దేవి కామప్రదాయిని నా బరమగును. ప్రపంచములో రెండు విధముల మనుజులుందరు. వారెవ్వరన దీనులు - ఆర్తులు - దరిద్రులు - శఠులు - ఆకలి దప్పులచే మండి యెండిన గుండెల వారు రోగ పీడితులు - పతితులు - మూర్ఖులు - వైరిపీడితులు - బానిసలు - వ్యాకులచిత్తులు - దిక్కులేనివారు - వికలులు - నీచాత్ములు ననువారొక విధమువారు. భోగములెన్ని భోగించినను తనియనివారు ఇంద్రియా సంభోగ నష్టవీర్యులు వేదవాదులు రాజ్యలక్ష్మీ మత్తులు శూరులు అమాయికులను నెత్తిమీదకొట్టువారు స్వార్థపరులు సకల లక్షణ లక్షితులు ననువారింకొక విధమగువారు. వీరిలో దైవ ధర్మవిరుద్ధమైన గుణములు గల వారినిచూచి సర్వార్థముల నొసంగు సర్వేశ్వరి వీరిచే పూజింపబడలేదు. కావుననే యిట్లు దేవీ పూజాఫలములగు సకల దుఃఖము లననుభవించుచున్నారనియు శుభ లక్షణములుగల రెండవ రీతి వారినిచూచి దేవీ సేవాఫలములు వీరి యొద్ద కనబడుటచే సకల సుఖములకు హేతువగు దేవీ పూజ వీరిచే నొకప్పుడు చేయబడియుండుననియు అన్వయ వ్యతిరేకములచే పండితులూహించ వలయును. ఒకనాడా పరాంబిక నారాధించిన దేవీ భక్తులే నేడీ సంసారమున సుఖ సంతోషములతో నలరుచున్నారు. ఇది ముమ్మాటికి నిజము. జనమేజయా! నేనటులా లోమశ మహామునివలన మునుల సమాజమందు శ్రీదేవీ మాహాత్మ్యము చెవుల పండువుగ వింటిని. కావున నా జగన్మాతృదేవీ దివ్యస్వరూపము నీ హృదయపీఠమందుంచుకొని శ్రీదేవి నర్చింపుము అని వ్యాసుడు జనమేజయునితో పలికెను.

అధ్యాయము 44 శ్రీదేవి యజ్ఞ విధానము

శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము

పంచాంగం

No comments:

Post a Comment

Chapter 52 Controversies about Swayamvara - అధ్యాయము 52 స్వయంవరమును గూర్చిన వాదోపవాదములు

శ్రీ దేవీ భాగవతం తృ తీయ స్కంధము - అధ్యాయము 52 స్వయంవరమును గూర్చిన వాదోపవాదములు వ్యాస సంయమి యిట్లు వాక్రుచ్చెను : ఈ విధముగ కేరళాధిపతి వాదింప...