Sunday, April 12, 2026

Chapter 45 Lord Vishnu performing the Sridevi Yajna - అధ్యాయము 45 శ్రీమహావిష్ణువు శ్రీదేవీయజ్ఞ మాచరించుట

శ్రీ దేవీ భాగవతం తృతీయస్కంధము - అధ్యాయము 45

శ్రీమహావిష్ణువు శ్రీదేవీయజ్ఞ మాచరించుట

రాజట్లనియె: పితామహా! జగత్కారణభూతుడు ప్రభవిష్ణువు విష్ణువునగు శ్రీహరిచేత పూర్వమీ దేవీయజ్ఞమెట్టు లాచరింపబడెను? దానికి సహాయకులెవరు? ఋత్విజులెవరు? వేదవిదులగు బ్రాహ్మణులుగనెవరెవరు నియమింపబడిరి? నాకిదంతయు విశదమొనరింపుము. శ్రీవిష్ణువు శ్రీదేవీ యాగమొనరించిన విధానమెఱిగిన పిదప నేను విధి ప్రకారమున దేవీయాగము నదే విధముగ నాచరింపగలను. 

వ్యాసుడిట్లనియె: రాజేంద్రా! పూర్వము విష్ణువుచే విధి పూర్వకముగ నాభగవతీ దేవీ యాగమెట్లు పరమాద్భుతముగ సమాచరింపబడెనో దెలుపుదును. సమాహిత మతితో నాలకింపుము. సృష్టికి పూర్వము బ్రహ్మ విష్ణు మహేశ్వరులా పరాదేవతచేత దివ్యశక్తులు బడసి యామె యనుమతితో విమానము మీద బయలుదేరిరి. ఆ మువ్వురు బుధోత్తములును ఘోర మహార్ణవముజేరి తమ తమ నివాసము లేర్పరచుకొనుటకై ముందుగ భూమిని సృష్టించిరి. అంత నాదేవదేవి భూమి కాధారశక్తి నొసంగుటచే నా యాధారమున భూమి అచల అయ్యెను. మధుకైటభుల మేదస్సు కలియుటవలన మేదిని యనియు సర్వమును ధరించుటవలన ధరయనియు విస్తారముగ నుండుటవలన పృథివియనియు భూమి పిలువబడెను. సర్వాధిక్యము నందుటవలన భూమికి మహియనియు పేరుగలదు. ఆమె యాదిశేషుని శిరములపై నుంచబడెను. భూమిని ధరించుట కున్నత విశాలములగు పర్వతములు సృష్టించబడినవి.

ఒక పెద్దకట్టెకు నినుపచీలలు బిగించియున్నట్లు పర్వతములు భూమియందు నెలకొల్పబడినవి. కావున గిరులు బుధులచేత మహీధరము లని పేర్కొనబడును. ఆ గిరులలో మేరుగిరి బహు యోజనముల వైశాల్యముగలిగి మణిదీపశిఖరములతో నలరారుచు మహాద్భుతముగ రంగారుబంగారు కాంతు లీనుచు తనరారుచున్నది. మరీచి నారదుడు పులస్త్యుడు పులహుడు అత్రి క్రతుడు వసిష్ఠుడు దక్షుడు ననువారలు బ్రహ్మ మానసపుత్త్రులు. మరీచికి కశ్యపు డుద్భవించెను. ఆతనికి దక్షుని కూతురుతో వివాహము జరిగెను. వీరిరువురికి పెక్కురు దేవదానవులు సముద్భవించిరి. ఆ కశ్యపునివలన విస్తారమైన కాశ్యపసృష్టి జరిగెను. కాన భూమికి కాశ్యపి యనియు పేరు గలిగె. ఆ కాశ్యపునివలన మనుజులు పశువులు పన్నగములు మున్నగు భేదములతో లోకసృష్టి జరిగెను. బ్రహ్మ కుడిభాగమునుండి స్వాయంభువ మనువు నెడమభాగమునుండి శతరూపయను నామె ఉద్భవిల్లిరి. వీరిరువురకు ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు నను కుమారులును మఱి మువ్వురు వరారోహలగు చక్కని కూతులును జన్మించిరి. ఇట్లు బ్రహ్మ విశ్వరచన సాగించి సుమనోహరమైన మేరుగిరిపై తన లోకము నిర్మించుకొనెను. శ్రీవిష్ణు భగవానుడు సర్వలోకములకు మీద రమారమణమై రమణీయమైన క్రీడాస్థానముగల యకుంఠితమైన వైకుంఠధామ మేర్పరచుకొనెను. భక్తవశంకరుడగు శంకరుడు భూతగణములతో స్వేచ్ఛగ విహరించుట కనువైన కైలాసగిరిని తన నివాసముగ నియమించుకొనెను. మహేంద్రుడు మేరుగిరిపైన స్వర్గసీమ నిర్మించుకొనెను. అది నానారత్న విరాజితమై కామప్రదమై తనరారుచున్నది.

పాలసంద్రమును మధించి నప్పుడందుండి దివ్యవృక్షమగు పారిజాతము చతుర్దంతములుగల యైరావతము కామితములెల్ల వర్షించు కామధేనువు నుద్భవించెను. అశ్వరాజమగు నుచ్చైఃశ్రవము రంభాద్యప్సరోగుణము సకలస్వర్గభూషణములు నింద్రునకు లభించినవి. సముద్రమునుండి పుట్టిన చంద్రుడును ధన్వంతరియు స్వర్గసీమలో దేవతల నడుమ విరాజిల్లు చున్నారు. ఈ తెఱుంగున దేవతలు మనుష్యులు తిర్యక్కులునను ముత్తెఱంగులతో మొదటి సృష్టి జరిగినది. ఎల్లజీవులు తమ తమ కర్మానుసారముగ నండజములు స్వేదజములు ఉద్భిజ్జములు జరాయుజములు నను నాల్గు తెఱంగుల నుత్పన్నములైరి. ఈ విధముగ బ్రహ్మవిష్ణుమహేశ్వరులు విశ్వసృష్టికార్య మారంభించి తమ తమ నెలవులందు యథేచ్ఛగ విహారము సల్పుచుండిరి. ఇట్లు సృష్టిక్రమము జరుగుచుండగ శ్రీమహాలక్ష్మీ సమేతుడై జగన్నాథుడైన యచ్యుతుడు వైకుంఠమున నానందవిలాసముల తేలియాడుచుండెను. ఇట్లు విశ్వుడగు హరి యల వైకుంఠపురంబులో నకుంఠితగతినుండి యొక్కనాడు సుధాసాగరమధ్యమున దీపిల్లు మనిద్వీపమును నెమ్మదిలోన దలంచెను. ఆ శ్రీహరి పూర్వ మాసాగర మధ్యమందే మహామాయను సందర్శించి యా దేవి మాయవలన స్త్రీరూపమంది యా దేవి దయవలన మంత్రరాజము బడసెను.

అట్టి రమారమణుడు శ్రీదేవీ యాగ మొనర్పదలచి తన భవనము వెడలి శంకరు నాహ్వానించెను. శ్రీవిష్ణువు-బ్రహ్మ-ఇంద్రుడు-అగ్ని-యముడు- వరణుడు-కుబేరుడు-వసిష్ఠుడు-కశ్యపుడు-దక్షుడు-బృహస్పతి మొదలుగాగల దేవతల నాహ్వానించెను. వారెల్లరును యజ్ఞార్థము సాత్త్వికములు - మనోహరములు - మహావిభవ సంభరితములు-నగు పెక్కు యాగ సంభారములు సమకూర్చిరి. అంత దివ్యశిల్పులచేత విశాలమైన మండపము నిర్మింపబడెను. ఆ యజ్ఞమునం దిరువదియేడుగురు ఋత్విజులుగ నియమింపబడిరి. బ్రహ్మణులు విశాలమైన యజ్ఞవేదిక నేర్పఱచి యందగ్నిని ప్రతిష్ఠించి శ్రీదేవీ బీజసంభరితములగు దేవీ మంత్రములతో హోమము చేసిరి. వారి విధముగ విధివిధానముగ హోమము జరుపగ నాకాశవాణి సుస్వరముతో మదుర మధురముగ సుధలొలుకబోయుచు నిల్లు పలికెను: 

"ఓ విష్ణూ! నీవు సకల దేవతలలో శ్రేష్ఠతముడవు. నఖిలసురలకు మాన్యుడవు. పూజ్యుడవు. దక్షుడవు. ఇంద్రుడు మున్నగు దేవతలెల్లరు నిన్ను పెక్కురీతుల నర్చింపగలరు. మానవులు నీయందు మధురభక్తిపూరితులై వర్తింతురు. సర్వమానవాళికి నీవు వరదాయకుడవై ప్రఖ్యాతిగాంతువు. అఖిల దేవతలకు కామితార్థప్రదుడవు-పరమేశ్వరుడవు-యజ్ఞముఖ్యుడవు-పరమపూజ్యుడవు నగుదువు. సకల యాజకులు నిన్నే యాజింతురు. సకల జనులు నిన్ను పూజింతురు. దానవ పీడితులైన దేవతలు నిన్ను శరణు జొత్తురు. నీ వెల్లవారి కభయప్రదుడవు-వరదుడవు గాగలవు.

పురుషోత్తమా! నీవు సర్వశరణ్యుడవు. సకల వేదపురాణములందు నీవే పూజనీయుడవు. నీవే పరముడవు-విశ్వమాన్యుడవు. నీ కీర్తిచంద్రికలు దెసలు వ్యాపించును. ఈ భూతలమునం దధర్మము పెచ్చు పెరిగి ధర్మహాని సంభవించును. ఆ సమయములందు నీవు నీ యంశముతో ధర్మసంస్థాపనకు యుగయుగములన నవతరింపగలవు. నీ వీ భూమిపై పెక్కు లవతారములు దాల్చెదవు. భూతభావనా! మాధవా! నీ యవతారము లెల్ల మహాత్ములకు మాననీయము లగును. నీ వనేక యోనులందు పెక్కవతారములు దాల్చెదవు. మధుసూదనా! ఇట్లు నీ దివ్యావతారము లెల్లలోకములందును ప్రసిద్ధి గాంచును. ఈ యెల్ల యవతారములందు నా మహాశక్తి నీకు తోడునీడగ నుండగలదు. ఆ దివ్యశక్తి నా యంశమున జనించి చిత్రవిచిత్ర కార్యములు పెక్కులు మానవాతీతములు సాధించగలదు. శ్రీనారసింహి-వారాహిమున్నగు పలుభేదములతో నా శక్తి యొప్పారుచుండును. నా శక్తిస్వరూపిణులు నానాయుధధారిణులు-శుభకారలు-దివ్యభూషణభూషితలు-నై నెగడుదురు. నీవు నా వరప్రభావమున నట్టి నా శక్తులనుగూడి సర్వాతిశాయులగు దేవకార్యములు నెరవేర్చగలవు. నీ వెన్నడు నెప్పుడు నెంతమాత్రము వారిని కించపఱచరాదు. ఆ శక్తులు కర్మభూమియగు భరతఖండమున సర్వకామములు కురియుదురు. వారెల్లవారికి పూజనీయులు. ప్రయత్నపూర్వకముగ మాననీయులు.

ఆ శక్తి దేవతలు ప్రతిరూపమున మానవులచేత పూజలందుకొందురు. భక్తుల వాంఛితము లీడేర్తురు. వారి మూలమున నీ కీర్తియు నేల నాలుగు చెఱగుల వ్యాపించును. నీవు భూమండలమందు సప్తద్వీపములందు చిరయశము గాంతువు. మహాభాగుడవగు నిన్ను-నా దివ్యశక్తులనుజనులు తమ వాంచాసిద్ధికి పలుభావములతో కానుకలతో సకాములై యర్చింతురు. అచ్యుతా! నీ దివ్యనామజపము వేదోక్త మంత్రములతో జరుగుచుండును. నీ మహోజ్జ్వలశక్తి మహిమము భూమండలమంతయు నిండును. స్వర్గమున వ్యాపించును. అనంతా! నిన్ను పూజించుటవలన నెల్లదేవతలు నరులు పచ్చని బ్రతుకులతో కలకలలాడుదురు. 

వ్యాసుడిట్లనెను: అని యిట్లు గోవిందునకు వరము లొసగి యాకాశవాణి విరమించెను. అమృతము జాలువాఱు శ్రీదేవీ వాక్కు లాలకించి విష్ణు భగవానుడు సంప్రీతుడై విధివిధానముగ శ్రీదేవీ యజ్ఞమును సమాప్తము గావించెను. పిదప వైకుంఠుడు బ్రహ్మపుత్త్రులను మునికుమారులను వీడ్కొలిపి తన యనుచరులతో గరుడునెక్కి వైకుంఠ మేగెను. ఎల్లదేవతలు తమతమ నివాసముల కరిగిరి. మునులు పరమవిస్మితులై తమలో తాము దేవినిగూర్చి తలపోయుచు హర్షము వెలిపుచ్చుచుండిరి. ఆ పిదప మును లెల్లరు తమతమ పిత్రాశ్రమములకు జనిరి. కర్ణపేయము-దివ్య సుందరము-మహిమాన్వితమునైన యాకాశవాణిని చెవులపండువుగ వినినంతనే యెల్లరికి శ్రీదేవియందు భక్తి ఉప్పొంగెను. ఆనాటినుండి సకల మునులు బ్రాహ్మణులు భక్తితో దేవీపూజ సలుపదొడగిరి. మునివరులారా! నిజముగ శ్రీదేవీపూజ ఫలదాయకము. ఆగమోక్తము.

అధ్యాయము 46 ధ్రువసంధి చరిత్ర

శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము

పంచాంగం

No comments:

Post a Comment

Chapter 51 Sudarshana Came to Swayamvara - అధ్యాయము 51 సుదర్శనుడు స్వయంవరమున కేగుదెంచుట

శ్రీ దేవీ భాగవతం తృ తీయ స్కంధము - అధ్యాయము 51 సుదర్శనుడు స్వయంవరమున కేగుదెంచుట వ్యాసముని యిట్లనియె : ఆ విధముగ సుబాహువు పలుకగ రాణి పవిత్రమగు...