Sunday, April 12, 2026

Chapter 46 History of Dhruvasandhi - అధ్యాయము 46 ధ్రువసంధి చరిత్ర

శ్రీ దేవీ భాగవతం తృతీయస్కంధము - అధ్యాయము 46

ధ్రువసంధి చరిత్ర

'విప్రవర్యా! నీవు శ్రీమహావిష్ణుయాగము గుఱించి సవిస్తరముగ నాకర్ణించితిని. ఇపుడు శ్రీవిశ్వమాతయొక్క మాహాత్మ్యము విపులముగ విశదపఱచుము. నీ యనుగ్రహభాగ్యమున శ్రీదేవీ దివ్యచరిత్ర మహత్త్వము నాలకించి పవిత్రుడనై శ్రీభగవతీ యజ్ఞ మాచరింతును.' అని జనమేజయుడడుగ. 

వ్యాసు డిట్లనెను: రాజా! శ్రీ మాతృదేవియొక్క సనాతన పవిత్ర చరిత్ర నీకు వినిపింతును. తదేకచిత్తమున నాలకింపుము. పూర్వము కోసలదేశమందు సూర్యవంశమున జన్మించిన మహాతేజస్వియగు ధ్రువసంధి యను మహారాజుండెను. ఆతడు పుష్పరాజునకు కుమారుడు. ఆ ధ్రువసంధి ధర్మాత్ముడు-సత్యసంధుడు-శుచివ్రతుడు-వర్ణాశ్రమ ధర్మపాలకుడునై సకల సంపత్సమృద్ధమగు నయోధ్యను రాజధానిగ చేసికొని ఏలుచుండెను. ఆతని యేలుబడిలో బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు తమ తమ వృత్తులందేమఱుపాటులేక వర్తించుచు ధర్మయుక్తులై యుండిరి. ఆ రాజ్యమందు దొంగలు పిసినిగొట్టులు మూర్ఖులు ధూర్తులు డంబాచారులు కృతఘ్నులు మచ్చునకైన కనబడరు. ఆ రీతిగ రాజ్య మేలు ధ్రువసంధి కిరువురు భార్యలుండిరి. వారిరువురును సురూపసంపదలు గలవారు. రాజును సకల కామభోగములతో దనుపువారు. వారిలో మొదటి ధర్మపత్ని మనోరమ. ఆ యమ సురూపవతి. విచక్షణురాలు. చతుర. సుగుణముల కాలవాలము. రెండవ భార్య లీలావతి రూపవతి-గుణవతి.

ఆ రాజు తన భార్యలంగూడి గృహములందు వివిధ సౌధములందును వనోపవనములందును క్రీడాపర్వతము లందును డిగ్గియలందును విహరించుచుండెను. అంతనొక శుభసమయమున మనోరమ సర్వరాజలక్షణ లక్షితుడగు నొక పుత్త్రుని గనెను. ఆతని పేరు సుదర్శనుడు. లీలావతియు నదే మాసమున శుభపక్షమున శుభదినమున నొక కుమారుని గనెను. రాజు తన యిరువురు తనయులకు యథావిధిగ జాతకర్మాదు లొనరించెను. పుత్రోత్సాహమున విప్రులకు భూరిదాన దక్షిణ లొసంగెను. రాజు తన కొమరులందు భేదభావము పాటింపక సమభావమున నుండెను. వారును సోదరప్రేమతో నుండునట్లు చేసెను. ఆ రాజు ప్రీతితో వారికి యథావిభవముగ చూడాకర్మ జరిపించెను. చూడాకర్మలు జరిగిన పిమ్మట ఆ బాలురు లోకానురంజకులై పితృమనోహరులై క్రీడించుచుండిరి. వారిలో మనోరమ పుత్రుడగు సుదర్శనుడు జేష్ఠుడు. రెండవ కుమారుడు శత్రుజిత్తు. అతడు చాటు వాక్యములు చతుర భాషణము లాడుటలో నేర్పరి. ఆ శత్రుజిత్తు మంచి రూపము కలవాడు. మంజుభాషి. రాజునకు మంత్రులకు ప్రజలకు ప్రీతిపాత్రుడై వర్తించువాడు. రాజునకు శత్రుజిత్తునందున్నంత ప్రేమయు మమకారమును మందభాగ్యుడగు సుదర్శనునందు లేకుండెను. అట్లు కొంతకాలము గడచిన పిమ్మట ధ్రువసంధి వేటతమకమున వనముల కేగెను. ఆతడు వనములందు మృగ-రురు-గజ-కంబు-సూకర-గవయ-శశ-మహిష - శరభ-ఖడ్గమృగాదులను వేటాడుచు క్రీడించుచుండెను.

రాజు భీకరమైన కాఱడవిలో వేటాడుచుండగ నొక క్రోధోద్రిక్తమైన మృగరాజు యమునిబోలె పొదరిల్లు వెడలి వచ్చెను. రాజు దానిని బాణముతో గొట్టెను. కాని యా సింహము దెబ్బతిని యెట్టయెదుట రాజునుగని మరింత కోపముతో మేఘ గంభీరముగ గర్జించి తోకపైకెత్తి సటలు విదళించి మహాక్రోధమున నింగికెగసి రాజుపై దుమికెను. అదికని రాజు వెంటనే చేత ఖడ్గముదాల్చి యెడమచేత డాలు బూని మరొక సింహమోయన నొప్పెను రాజభటులును కుపితులై వేర్వేరుగ పుంఖానుపుంఖములుగ సింహముపై బాణములు వేసిరి. ఆ క్రూరసింహము రాజుపై తీవ్రముగ దాడిచేసెను. ఆ ఘోరప్రహారముల వలన నచట హాహాకారములు చెలరేగెను. అట్లు తనపై క్రూరముగ దుముకు సింహమునుగని రాజు తన ఖడ్గముచేత వ్రేటువేసెను. అదియు నతనిని తన కఱకు గోటికొనలచే చీల్చివేసెను. ఆ సింహపు వాడి గోళ్ళచే దారుణముగ జీల్చబడి రాజు నేలగఱచెను. సైనికులెల్లరు దానిపై నొక్కుమ్మడిగ బాణాలు ప్రయోగించిరి. ఆ దెబ్బలకదియు నేలగూలెను. సైనికులు రాజు మరణవార్తను మంత్రులకెఱగించిరి. మంత్రులావనమునకేగి పరలోకగతుడైన రాజున కంత్యక్రియలొనర్చిరి. రాజూర్ధ్వలోకములకేగుటకు వసిష్ఠమహర్షి విధివిధానముగ నంత్యక్రియలు జరిపించెను.

అంత వసిష్ఠ మహర్షియు ప్రజలను గలిసి సుదర్శనుని రాజుగ నాలోచించిరి. సుదర్శనుడు ధర్మపత్నీ తనయుడు శుభలక్షణ లక్షితుడు పరమశాంతుడు కాననితడే రాజ్యర్హుడగునని మంత్రిసత్తములు నిర్ణయించిరి. ఈ రాజపుత్త్రుడు బాలుడైనను ధర్మాత్ముడు. కనుక నితడే సింహాసనమునకు యోగ్యుడని వసిష్ఠుడు వక్కాణించెను. ఇట్లు వృద్ధామాత్యులాలోచించుచుండ లీలావతి తండ్రియగు నుజ్జయినీపతి యుధాజిత్తు తన యల్లుని చావు విని తన మనుమనికి ప్రియము చేకూర్పదలచి త్వరితగతి నచటికరుదెంచెను. ఆట్లే మనోరమ తండ్రి గళింగాధిపతి వీరసేనుడును తన మనుమడగు సుదర్శనునకు హితము గూర్పదలంచి క్రన్నన నచటికి వచ్చిచేరెను. సైన్యసమేతులగు నా యిరువురు రాజులును కాబోవు రాజును గూర్చి మంత్రి ముఖ్యులతోడ మంతనములాడదొడగిరి.

ఈ యిరువురు రాకుమారులలో జ్యేష్ఠుడెవడు? రాజ్యమునకు జ్యేష్ఠుడు తగినవాడు. కనిష్ఠుడెన్నటికిని రాజ్యార్హుడు గాడని యుధాజిత్తు పలికెను. ధర్మపత్నికి బుట్టినవాడే యెల్ల విధముల రాజ్యమునకు దగినవాడని శాస్త్రజ్ఞులవలన వింటినని వీరసేనుడు వాదించెను. రాజులో నెట్టి రాజలక్షణములుండవలయునో యట్టివి సుదర్శనునందులేవని యుధాజిత్తనియెను. ఇట్లు రాజ్యలుబ్ధులగు నిరువురు రాజుల మధ్య తీవ్ర వాద వివాదములు చెలరేగును. వారి పోరాటమెవ్వడు నాపజాలకుండెను. ''మీరెల్లరును స్వార్థపరులు. సుదర్శనుని రాజుగజేసి ధనము సంపాదింప దలంచుచున్నాను. మీ రహస్యసమాలోచనముల వలన మీలోని యుద్దేశ్యమెఱింగితిని. కాని నిజమునకు శత్రుజిత్తు సబలుడు. నృపాసనమునకు యోగ్యుడు. సేనాసమేతుడు. సుగుణఖనియగు జ్యేష్ఠుని వదలి నేను బ్రతికియుండగనే చిన్నవానినెట్లు రాజుగ చేయుదురు? నేనిపుడు యుద్ధము చేయుదును. అందు నా వాడి ఖడ్గధారచే నేల వ్రయ్యలగును. ఇక మీరొక లెక్కయా?'' అని యుధాజిత్తు మంత్రులతో ననెను. ''ఇరువురు కుమారులును సమ ప్రజ్ఞులు. వారిలో నెట్టియంతరమును గోచరింపదు'' అని వీరసేనుడు యుధాజిత్తుతో వాదించెను. ఇట్లాపుడమి పతులిద్దఱును వాదించుకొనుచుండగ ఋషులను జనులును వ్యగ్రమనస్కులైరి. అంత సేనాసమేతులగు సామంతులు విచారించి చేయునదిలేక యుద్ధసన్నద్ధులైరి. అదే సమయమునందు రాజు మరణవార్త విని శృంగివేర పురవాసులగు నిషాదులు రాజద్రవ్యమపహరింప నచ్చటికి వచ్చిరి. బాలురగు రాకొమరులు పరస్పరము కలహించుకొనుట విని దేశదేశాంతరమందలి చోరులచ్చటికి వచ్చిరి. ఇట్లు కలహము చెలరేగగ జనసమ్మర్ద మెక్కువయ్యెను. యుధాజిద్వీర సేనులు యుద్ధకాములై నిలుచుండిరి.

అధ్యాయము 47 మనోరమ సుదర్శనునితో మునుల శరణు వేడుట

శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము

పంచాంగం

No comments:

Post a Comment

Chapter 51 Sudarshana Came to Swayamvara - అధ్యాయము 51 సుదర్శనుడు స్వయంవరమున కేగుదెంచుట

శ్రీ దేవీ భాగవతం తృ తీయ స్కంధము - అధ్యాయము 51 సుదర్శనుడు స్వయంవరమున కేగుదెంచుట వ్యాసముని యిట్లనియె : ఆ విధముగ సుబాహువు పలుకగ రాణి పవిత్రమగు...