Sunday, April 12, 2026

Chapter 53 Subahu worries about Sasikala's marriage - అధ్యాయము 53 సుబాహువు శశికళ వివాహమునుగూర్చి చింతిల్లుట

శ్రీ దేవీ భాగవతం తృతీయస్కంధము - అధ్యాయము 53

సుబాహువు శశికళ వివాహమునుగూర్చి చింతిల్లుట

వ్యాసముని తిలకు డిట్లనియె: ఆ విధముగ శశికళ పలుకగ సుబాహు వాలకించి చింతాకులితుడై తన కర్తవ్యమేమని దిగులొందెను. మహాబలశాలురగు భూపాలురు సేనా పరిగ్రహములతో పోరు సలుపవచ్చి యాసనములందు గూర్చుండిరి. ఇట్టి తరుణమున నా కూతురు సభామధ్యమునకు రానని పల్కినచో దుష్టులగు రాజులందఱును కుపితులై నన్ను వధించి తీరుదురు. ఈ రాజుల నందర నోడింపగల సేనాదుర్గబలము నాకడ లేదు. ఈ సుదర్శనుడు బాలుడు - నిర్ధనుడు - ఏకాకి - నిస్సహాయుడు. ఇక నేనేమి చేయుదును? నేనిపుడు కడు దుఃఖసాగరమున మున్గితిని. ఇట్లు చింతావశుడైన సుబాహుడు రాజుల సన్నిధికేగి సవినయముగ చేతులు జోడించి వారికిట్లనియెను : 

"నృపులారా! నేనిపుడేమి చేయుదును? నా భార్యయు నేను నామెకెంతయో నచ్చచెప్పి చూచితిమి. కాని నా కూతురీ సభామంటపమునకు రాననుచున్నది. నేను మీ పాదాలమీద నా తల యుంతును. నేను మీ దాసుడను. మీరు నేచేయు పూజాదికములు స్వీకరించి మీమీ నెలవులకు జనుడు. మీకు పలువిధములైన తేరులను గజములను వస్త్రములను రత్నరాసులను సమర్పింతును. దయచేసి వానిని స్వీకరించి మీమీ నెలవులకు జనుడు. నా బాలిక నా వశము దాటిపోయినది. ఆమె ఖేదపెట్టబడినయెడల మరణించినచో నాకుగొప్ప దుఃఖము కలుగునని చింతాక్రాంతుడనైనాను. మీరలు మహా తేజోవంతులు. దయామయులు. భాగ్యవంతులు. దుర్వినీతయు మందమతియునగు నా కూతుతో మీకేమి ప్రయోజనము? నే నెల్లభంగుల మీ దాసుడను. నన్ననుగ్రహింపుడు. నా కూతును మీ కూతుగ బావింపుడు" అను సుబాహుని దీనవాక్కులు విని యెవ్వరేమియు బలుకక మిన్నకుండిరి. అపుడు యుధాజిత్తు క్రోధతామ్రాక్షుడై యిట్లనెను:

"ఓ రాజ! నీ వెంతటి మూర్ఖుడవు? ఎంత నింద్య మొనరించితివి? నీకు సందిగ్ధముగనున్న విషయమున మోహము కొలది ఇంత గొప్పగ స్వయంవరము నెందులకు చాటించితివి ? నీవు ఇందఱు రాజుల నాహ్వానించితివి. ఇపుడు వారిని వారివారి యిండ్ల కేగుమనిన వారూళ్లకెట్లేగ గలరు? ఇందఱ రాజులను తృణీకరించి సుదర్శనునకే కన్య నీయదలంచితివి. ఇంతకంటె ననార్య కృత్య మింకేమి యుండును? మేలు గొరు నరుడు మొదటనే చక్కగా విచారించి చేయదలచిన కార్యము నారంభింపవలయును. నీ వెఱుగ కిట్లొనర్చితివేల? నీ విపుడు బలవాహనోపేతులగు నిందఱ రాజులను త్రోసిరాజని సుదర్శను నెట్లు వరునిగ గోరుదువు? ఇపుడు మొట్టమొదట పాపిష్ఠుడవగు నిన్ను హతమూర్తును. పిమ్మట సుదర్శనుని తుద ముట్టింతును. ఆ పిదప నామనుమనికి నీ కన్య నిత్తును. ఇది నా నిశ్చయము. నేనుండగ కన్నియను హరింపగల మగధీరుడెవ్వడు? ఆ సుదర్శనుడు నిర్ధనుడు - బాలుడు. నా ముందడాతడెంత? ఆ నాడు భారద్వాజాశ్రమమున ముని వాక్కులచే నా నుండి యతుడు బ్రతికి బయటపడెను. ఇపుడు మాత్రమతని నెల్లవిధముల బ్రతుక నీయను. కనుక నీవిపుడు వెళ్ళి నీ భార్యతో కూతుతో చక్కగ నాలోచించుకుని వరానన యగు నీ గాదిలి కూతును నా మనుమనికిమ్ము. మనోరమ యగు ఈ నీ పుత్రికను మాకిచ్చి మా వియ్యంకుడవుకమ్ము! శ్రేయము గోరువాడెల్లవేళల మాహదాశ్రయము నాచరింప వలయును జుమా! ప్రాణప్రియ యగు నీ గారాబు పట్టిని రాజ్యములేక దిక్కుమ్రొక్కు లేనివానికిచ్చి యేమి సుఖము బడయగోరుదువు? కన్యను కులబల రూపములు మిత్ర రాజ్యవిత్త దుర్గములు గల వానిని జూచి యీయవలయును. కానిచో కన్య సుఖింపజాలదు. నీవు శాశ్వత ధర్మమును రాజనీతిని బాగుగ పరిశీలించి తగిన కార్య మొనరిపుము. ఊరక బుద్ధిని చెడగొట్టుకొనకుము. నీవు నాకు మిక్కిలి ప్రియమిత్రుడవు. కాన నింతగ హితము చెప్పుచున్నాను. నీవు వెంటనే చెలులతో గూడిన నీ కూతు నీ సభామంటపమునకు రప్పింపుము. ఆమె సుదర్శను దక్కఇతరు నెవ్వరినైన వరించవచ్చును. నాకది సమ్మతమే. అపుడు నీ కోర్కిమేరకు పెండ్లి జరుగును. ఇతర రాజులెల్లరు కులీనులు; బలవంతులు; సములు. వారిలో నెవరి నే నొక్కని వరించిన నింక విరోధ మెక్కడిది? అట్లు కానిచో పగబూనుట మంచిదిగాదు. వెళ్ళి కార్యము చక్కబెట్టుము."

ఇట్లు యుధాజిత్తాదేశింపగ సుబాహువు శోకసంతప్తుడై నిట్టూర్చుచు తన భార్యతో - ఇపుడు మనకు ఘోరవిపత్తు సంభవించెనని మన కూతుతో జెప్పుము. నేనిపుడు నీకు వశుడను. నాకు కర్తవ్యము తోచుటలేదు అనెను. రాణి తన పతిమాట లాలించి కూతుచెంత కేగి యిట్లనియెను : 

"పుత్త్రీ ! నీ మూలమున నీ తండ్రి దుఃఖాలపాలయి యున్నాడు. నీ నిమిత్తముగ రాజుల మధ్య పోరాటము సంఘటిల్లనున్నది. కాన సుదర్శనుని దక్క మఱియొక్కని వరింపుము. ఒకవేళ నీవు నీ మొండిపట్టుదలతో సుదర్శనునే వరించినచో యుధాజిత్తు తన బలము నుపయోగించి మనలనందఱ నూచకోతగ కోసివేయును. ఆ యుధాజిత్తు బలమత్తుడు-ప్రతాపి. అతడు సుదర్శనుని కూడ చంపును. అపుడైన నీకు వేరొకపతి కావలసివచ్చును. కనుక నీవు నామేలు గోరుదువేని ఆ సుదర్శనుని దక్కొరుని నృపతి కుమారుని వరింపుము" అని తల్లి బోధించుచున్నంతలో సుబాహువేతెంచి తానునట్లే ఆమెకు నచ్చచెప్పెను. ఆ తల్లిదండ్రుల మాటలాలకించి శశికళ యిట్లనియెను. "పీసరేశ్వర! నీవు పలికిన దంతయు నిజమే కాని నా వ్రతము గూడ నీకు దెలియనది కాదుకదా? నీవు రాజుల వలన భయపడినప్పటికిని నేను మాత్ర మెట్టి పరిస్థితిలోను సుదర్శనుని గాక యితరుని వరింపజాలను. కనుక నీవు నన్ను సుదర్శనునకు ధారపోసి మమ్ము పురము వెడల సాగనంపుము. అతడు నన్ను రథమెక్కించుకొని స్వేచ్ఛగ పయనించగలడు. అనంతర మేది కానున్నదో యది జరిగి తీరును. భవితవ్యమును గూర్చి యింతగ జింతింపవలదు. కానున్నది కాకమానదు. ఇందు సందియ మెందులకు?''

రాజిట్లనియెను: ఓ పుత్రీ! మతిమంతులెప్పుడైన నతిసాహసముగ ప్రవర్తింపరు. పెక్కుమందితో వైరము తగదని వేదవిదులు వచింతురు. ఆ రాచకొమరునకు నిన్నిచ్చి యెట్లు సాగనంపగలను ? వైరభావముగల రాజులేదైన మూర్ఖించి చేయగలరు. కనుక నీకిష్టమైన నేదైన పణమేర్పరతును. తొల్లి జనకుడు సీతాస్వయంవరమునకు శివధనుర్భంగమును పణముగ నుంచలేదా ! ఇపుడు నేను నేదైన కఠినమగు పణమేర్పరతును. దానివలన రాజుల వివాదమణగి శాంతి యేర్పడును. ఒడ్డిన పణము నెవడు గెల్చునో యతడు నీ పతి కాగలడు. అతడు సుదర్శనుడు గావచ్చు ; లేక మరొక్క బలశాలి కావచ్చును ఆ పణములో గెలుపొందినవాడు నిన్ను తప్పక వరించి తీరును. అట్లు జరిగినపుడు రాజుల వివాదమును శాంతించును. ఆ పిమ్మట నీ వివాహము చక్కగ సుఖపూర్వకముగ నొనర్పగలను.

కన్య యిట్లనెను : నేను సందేహములో బడదలంపను. నీవన్నట్లు చేయుట మూర్ఖులపని. నా యంతరంగములో మొట్టమొదట సుదర్శనుని సురూపమును నిశ్చలమతితో నొల్పుకొంటిని. పుణ్యపాపములకు కారణము మనసేకదా! నా యణువణువున మూర్తీభవించి యున్న వానిని వదలి మరొకరినెట్లు వరింపగలను? పణమేర్పరచినచో నేనందఱకును వశవర్తిని గావలసి వచ్చును. ఒకవేళ మన యొడ్డిన పణము నిద్దరు లేక పెక్కురు గెలిచినచో నప్పుడైన వివాదము తలయెత్తునుగద ! అపుడు మన కర్తవ్యమేమి? నా బుద్ధి సంశయాస్పదమైన పనిలో జిక్కుకొనదు. కాన రాజా ! చింతవదలి నన్ను సుదర్శనునకు ధారపోయుము. నీవు మా వివాహమును విధిగ జరిపింపుము. ఏ దేవదేవి మధుర దివ్యనామ సంకీర్తనమున సకల దుఃఖరాసులు నశించిపోవునో యా చండిక మనకు మేలు చేకూర్చును. ఆమెదీవెన మాకు తోడు. ఆ క్రియాశక్తిని నెమ్మదిలో గట్టిగ నమ్మి యప్రమత్తతతో కార్యమునకు బూనుకొనుము. నీవారాజులకు నమస్కరించి యంతయు నిట్లు దెలుపుము : 

ఱేపు రాజులెల్లరు స్వయంవరమునకు రావలయును అని యాదేశించి వారిని వీడ్కొలుపుము. ఈ రాత్రియే వేదోక్తవిధిగ వివాహము జరిపించి యథాశక్తి కానుకలొసంగి సుదర్శనుని వీడుకొలుపుము. ఆ ధ్రువసంధి సుతుడు నన్నుగైకొని యేగునంతలో నొకవేళ రాజులు రోషాతిరేకమున రణముసలుప నిశ్చయించి వత్తురు. ఐనను ఆ చండికాభగవతి మాకు తోడునీడగ నిలిచి కరుణజూపి సాయమొనర్పగలదు. అపుడు సుదర్శనుడు వైరిరాజసుతులతో యుద్ధ మొనరింపగలడు. దైవ దుర్విపాకమున నతడు మరణించినచో నతడితోడ నేనేను చత్తును. కనుక నన్నతనికొసంగి సేనలతో నిశ్చింతగ నుండుము. అతనితోడ నేనొక్కతేనే క్రీడింపగోరి యేగగలను అను తన కూతు మాటలు విని రాజామెకు వివాహమొనరింప దలంచెను.

అధ్యాయము 54 శశికళా సుదర్శనుల వివాహము

శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము

పంచాంగం

No comments:

Post a Comment

Chapter 62 Rama Done Navaratri Vratha With the help of Narada - అధ్యాయము 62 నారదుని ద్వారా రాముడు దేవీ నవరాత్రములు ఆచరించుట

శ్రీ దేవీ భాగవతం తృ తీయ స్కంధము - అధ్యాయము 62 నారదుని ద్వారా రాముడు దేవీ నవరాత్రములు ఆచరించుట వ్యాసమునిచంద్రు డిట్లనియె : ఈ ప్రకారముగ రామలక్...