Sunday, April 12, 2026

Chapter 54 Sasikala Sudarshan's wedding - అధ్యాయము 54 శశికళా సుదర్శనుల వివాహము

శ్రీ దేవీ భాగవతం తృతీయస్కంధము - అధ్యాయము 54

శశికళా సుదర్శనుల వివాహము

వ్యాసమునీశుడిట్లనియెను : ఆ యనిందితాత్ముడగు సుబాహువు తన కూతు పలుకు లాలకించి రాజులచెంతకేగి యిట్లనియె : 

"రాజులారా ! నేటికి మీమీ శిబిరముల కేగుడు. రేపు పెండ్లి జరుగగలదు. మీరు నాయందు దయయుంచి నాయొసంగు నన్నపానీయములు గ్రహించి ప్రసన్నులుగండు. రేపు ప్రభాతవేళకెల్లరు పెండ్లి వేదికకు రండు. అన్ని కార్యములును చక్కబడును. నేడు నా కూతురీ మంటపమునకు వచ్చుటలేదు. నేనేమిచేయుదును ? రేపెట్టులో యామె నొప్పించి రప్పింతును. నేటికి మీమీ విడుదుల కేగుడు. మతిమంతులు తమ యాశితులపట్ల నిగ్రహము బూనరు. మీరు నాపై నా సంతుపై దయపూనవలయును. రేపుదయమున నా కూతు నొప్పించి రప్పింతును. నేటికి యథేచ్ఛగ జనుడు. ఏదైన నిచ్ఛాపణ మేర్పరచి రేపు ప్రభాతకాలమున సకల రాజలోకము సమక్షమున నెల్లర యనుమతితో వివాహ మంగళకార్యము జరుపుదును అను సుబాహువు పలుకులాలకించి అవి నిజమని భావించి రాజులు తమతమ విడుదులకేగిరి. నగర రక్షణ జరిపి మాధ్యందిన కృత్యములు నిర్వహించిరి. 

అంత సుబాహు వార్యజనుల రావించి వేదవిదులగు పురోహితులతో రహస్యమందిరమున తన పుత్రికకు వివాహము జరిపించెను. అందరు నా వరునకు మంగళస్నాన మొనరింపజేసిరి. వివాహ భూషాలంకృతు నొనరించిరి. రాజు వరుని పెండ్లిమంటపమునకు గొనివచ్చి యతనికి తగిన పూజాదివిధు లొనరించెను. మహాసత్త్వుడగు సుబాహువు వరున కాసనాచమనములు అర్య పాద్యములు వస్త్రద్వయము కుండలములు గోవు నొసంగి విధిగ కన్యాదానము సంకల్పము చేసెను. వరుడన్నిటిని నిశ్చలముగ స్వీకరించెను. ఆ సమయమున మనోరమ చిత్తము చింతారహితమయ్యెను. నవనిధిశాలియగు కుబేరుని కన్యవలె నలరు రాచకన్నియను గాంచి యామె తన్ను ధన్యగ నెంచుకొనెను. ఆపుడు మంత్రులెల్లరు భయరహితులై ముదము నిండార సలక వస్త్రభూషణ భూషితుడు పూజితుడు నైన వరోత్తముని కౌతుక మంటపమునకు గొనివచ్చిరి.

అపుడలంకరణ నిపుణలగు నెఱజాణలు రాచకన్నియనలంకరింపజేసి వరవాహన మెక్కించుకొని వేదులతో గూడిన మంటపమున నలరుచున్న వరుని సన్నిధానమునకు గొనివచ్చిరి. ఇట్లు వైవాహిక మంగళములతో సంస్కరింపబడిన వధూవరులను వైవాహిక మండపమునకు రావించిరి. పురోహితు లగ్నిని ప్రతిష్ఠించి హోమములు జరపిరి. దంపతులు లాజహోమము జరిపి విధ్యనుసారముగ నగ్నికి ప్రదక్షిణ మొనరించి తమ కులవంశ సంప్రదాయానుసారముగ నచట జరుగదగు యథోచిత క్రియలు నెరవేర్చిరి. సుబాహువు అల్లుడగు సుదర్శనునకు పెండ్లికట్నము క్రింద గుఱ్ఱములపూన్చిన రెండు నూర్ల రథములను బాణములు గల యమ్ముల పొదిని సువర్ణభూషితములై పర్వత శిఖరాలవంటి నూటయిరువదియైదు మత్తగజములను బంగారముతో నలంకృతములైన దాసీశతమును నూఱాడుఏనుగులను భూషణముల నాయుధముల దాల్చిన వేయిమంది దాసజనమును రత్నములను మేలైన చిత్రములైన యున్ని వస్త్రములను రమ్యములు చిత్రములునైన వాసగృహములను సింధుదేశీయములైన రెండువేల మంచి గుఱ్ఱములను బరువులు మోయుటకు మున్నూరొంటెలను ధాన్యముతో నిండిన రెండువందల బండ్లను సమర్పించెను. ఆ పిమ్మట నాతడు రాజసుతయగు మనోరమకు కేలుమోడ్చి "యోవరిష్ఠా! నేను నీ దాసుడను. నీ మదిలోని యభిప్రాయము వెల్లడింపు" మనెను.

అపుడు మనోరమ మధుర వాక్కులతో రాజున కిట్లనెను "నీకు మేలగుత! నీ కులవృద్ధియగుగాక! నీ కన్యారత్నమును నా కుమారున కొసంగి నన్ను సమ్మానించితివి. రాజా! నిన్ను గొప్పగ పొగడుట కేను వందిమాగధుల పుత్త్రినిగాను. స్వజనమైన మీవంటి పెద్దలను నేనేమి స్తుతింపగలను? నీ యుత్తముడు వియ్యంకుడునగు భూపతిచే నా కొడుకు మేరుతుల్యుడుగ చేయబడెను. నీ చరిత్రమెంతయు పవిత్రము! ఎంతయు నుదాత్తము! ఎంతయు విచిత్రము! నేనేమని పలుకుదును? రాజ్యభ్రష్టుడగు నా సుతునకు యోగ్యమగు నీ కన్య నొసంగితివి. వచ్చిన రాజులనెల్లర త్రోసిరాజని వనవాసి నిఱుపేద పితృశూన్యుడు సేనావిహీనుడు ధనరహితుడు నగు నా కొడుకునకు నీ కూతునొసంగితివి. ఏ రాజైన తన కన్యకను సమాన కులబలధనములు గలవానిని చూచి యిచ్చును. అర్థహీనుడగు నా కొమరునకు రూపగుణ సంపన్నయగు కన్నియ నెవడిచ్చును? మహాబలశాలురగు నిందఱ రాజులతో వైరమూనియు సుదర్శనునకు నీ కూతునొసంగితివి. ఆహా! నీ ధైర్యమెంతయు శ్లాఘనీయము.''

అను మనోరమ మాటలు విని రాజు మర్షమున దొసిలి యొగ్గి మరల నామె కిట్లనియె : ఇదిగో నా రాజ్యము గొమ్ము. నే నీకు సేనాపతిగ నుందును. కానిచో నా సగము రాజ్యము గొని నీ సుతునితో రాజ్యఫల మనుభవింపుము. పవిత్రమైన కాశీ నివాసభాగ్యము వదలి మీరు వనముననో పురముననో యుండుటను నా మన సొప్పదు. ఈ రాజులు రోషాగ్నులు గ్రక్కుచున్నారు. తొలుత వీరిని శాంతింపజేయవలయును. కానిచో దానభేదములు నెఱపవలయును. అవియు లాభము లేనిచో చివరకు మిగిలినది పోరుండనే యున్నది. జయాపజయములు దైవాధీనములు. ఐనను ధర్మమునకే విజయము గలుగును గాని యధర్మమునకు గాదు. కాన నధర్మపరులగు రాజులకు విజయ మెట్లు చేకూరును? అను నర్థవంతములైన రాజు మాట లాలకించి మనోరమ సర్వాత్మత్వభావముతో మోదభరితయై యభిమానముతో మరల హితవచనము లిట్లు పలికెను. "ఓ రాజా! నీకు భద్రము గల్గుగాక! నీవు భయము పాసి నీ సుతులతోగూడి రాజ్య మనుభవింపుము. నా పుత్రుడు సాకేతపురికి రాజయి సుఖముగ నుండగలడు. మమ్ము మా నివాసమునకు సాగ నంపుము. శ్రీభవానీదేవి నీకు మంగళ మొనగూర్చుగాత! నేను నిరంతర మా పరమాంబికదేవిని సంస్మరించుచుందును. ఇంక నాకు చింత యెక్కడిది?'' ఈ రీతిగ వారిరువురి మధురిమ లొలుకు సంభాషణ సాగుచుండగ నంతలో రేయి గడచెను. మరునాడుదయమున రాజు లెల్లరును అప్పటికే పెండ్లి జరుగుట విని రోషముతో నగర బహిఃప్రదేశ మేగి యిట్లు పెద్దగ కేకలు వేసిరి: 

"మన మిపుడు నృపకలంకుడు వివాహమున కయోగ్యుడు నగు సుదర్శనుని వధింతుము. ఆ శశికళను గ్రహింతుము. కానిచో నింత సిగ్గుతో మన యిండ్ల కెట్లేగగలము? ఇదిగో వినుడు. తుముల తూర్య వాద్య రవములు. మృదంగ శంఖధ్వనులు వివిధ గీతానినదంబులు వేదఘోషలు వినిపించుచున్నవి. వీనిని బట్టి రాజు వివాహము జరిపించెనని తెలియుచున్నది. ఇతడు మనకు పెక్కు తీయని మాటలు చెప్పి నమ్మించి మోసగించి వైవాహిక విధులతో యథావిధిగా పెండ్లి జరిపించెను. ఇపుడు మన ప్రస్తుత కర్తవ్య మేమో రాజుల మెల్లర మేకమతితో నాలోచించి యుచితమైన దానిని నిర్ణయింతము."

అట్లు రాజులెల్లరు తమలో తామనుకొండుచుండిరి. అంతలో నప్రతిమ ప్రభావుడగు సుబాహువు వివాహవిధి నెరవేర్చి ప్రసిద్ధ ప్రభావులైన తన మంత్రుతో కూడి రాజుల నాహ్వానింప బయలుదేరెను. తమచెంత కేతెంచు కాశీపతిని గాంచి రాజు లేమియు బలుకక మిన్నకుండిరి. సుబాహువు వారిని జేరి దోయిలించి యిట్లనెను. "నృపతు లెల్లరును మా యింటికి భోజనమునకు రండు. నా కన్య సుదర్శనునే వరించినది. ఇక మంచి చెడ్డలకు నేను కర్తను గాను. మీరు కడు మహాత్ములు. దయాళురు. శాంతి వహింపుడు'' అను సుబాహువు మాటలు విని "రాజా! మేము బాగుగనే భుజించితిమి లెమ్ము. ఇక నీ యింటికి నీవు వెళ్లుము. మిగిలిన కార్యము చక్కగ నొనరింపజేయుము. మీరు మిక్కిలి సుకృతము చేసితిరి. ఇక మేమే మా మా యిండ్ల కేగుదు'' మనిరి. ఆ రాజు మాటలు విని సుబాహువు కోపసముద్విగ్నులైన వీరేమి ముప్పు తల పెట్టుదురో కదా యని యనుమానించుచు తన నివాసమున కరిగెను. అట్లు రాజేగిన పిదప రాజు లెల్లరును గూడి మార్గ మడ్డగించి సుదర్శనుని జంపి కన్యను గొన ప్రతినబూనిరి. అందు కొందఱు మంచివారు 'మన కతనితో నేమి పని? పెండ్లి వేడుక కన్నారగని తిరిగి యేగుద'మనిరి. కాని, యది యంగీరింపని రాజు లెల్లరు త్రోవ నడ్డగించి నిలిచిరి. కాశీపతియు తన గృహమున కేగి తరువాతి కార్యములు యథావిధిగ జరిపించెను.

అధ్యాయము 55 శ్రీదేవి ప్రాదుర్భవించి సుదర్శనుని గాపాడుట

శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము

పంచాంగం

No comments:

Post a Comment

Chapter 62 Rama Done Navaratri Vratha With the help of Narada - అధ్యాయము 62 నారదుని ద్వారా రాముడు దేవీ నవరాత్రములు ఆచరించుట

శ్రీ దేవీ భాగవతం తృ తీయ స్కంధము - అధ్యాయము 62 నారదుని ద్వారా రాముడు దేవీ నవరాత్రములు ఆచరించుట వ్యాసమునిచంద్రు డిట్లనియె : ఈ ప్రకారముగ రామలక్...