Saturday, April 11, 2026

Chapter 32 The birth Story of Astikamahamuni - అధ్యాయము 32 ఆస్తీకమహాముని జన్మవృత్తాంతము

శ్రీ దేవీ భాగవతం ద్వితీయస్కంధము - అధ్యాయము 32

ఆస్తీకమహాముని జన్మవృత్తాంతము

సూతుడిట్లనెను : జనమేజయుని మాటలు విని వ్యాసుడు పేరోలగమునందు రాజుతో నిట్లనెను : రాజా ! పుణ్యము శివము రహస్యమునైన శ్రీదేవీ భాగవత పురాణమును తొల్లి నా కుమారుడగు శుకునిచే చదివించితిని. నేను రచించిన ఆ పరమరహస్య రచన మిపుడు నీకు వినిపింతును, వినుము. అది పెక్కు కథలతో రసభరితమై యలరారుచున్నది. ధర్మార్థ కామమోక్షములకు కాణాచి. సకల వేదముల రసాయనము. దానిని వినుటవలన నిత్యశుభములు సుఖములు చేకూరును. ఆంత జనమేజయుడు ఈ యాస్తీకు డెవరి పుత్త్రుడు ? ఇతడు యాగవిఘ్నము చేయుట కేలవచ్చెను? సర్పరక్షణమున నీతని కేమి లాభము గల్గును? అదియంతయు దెలిపి పిదప శ్రీదేవీ పురాణ కథానకమంతయు నాకు విశదముగ దెలుపుము అనెను. 

వ్యాసుడిట్లనెను: 'తొలుత జరత్కారుడను శాంతుడగుముని గార్హస్థ్యము స్వీకరింపలేదు. అందువలన నతని పూర్వజులు పెద్దగుంటలో వ్రేలాడుచుండిరి. వారిని గాంచి జరత్కారువు దానికి కారణ మడుగగ 'పుత్త్రా ! నీవు పెండ్లి యాడినచో మే మీ యిక్కటులబాసి తృప్తిజెంది స్వర్గమేగుదుము. నీవు సదాచారివి గమ్ము' అని వారనిరి. పూర్వజులారా! నాతో సమానమైన నామము గలిగి యనుకూలయైన కన్య నేను కోరకయే లభించినచో నామెను తప్పక పెండ్లియాడి గృహస్థ జీవితము సాగింతును' అని వారితో పలికి జరత్కారుడు తీర్థాటనమున కేగెను.

అదే సమయమున నాగము నగ్నిలో బడుడని వారి తల్లి శపించెను. అదెట్లన - కశ్యప మహర్షికి కద్రూవినతలను నిర్వురు భార్యలుండిరి. వారొకమారు సూర్యుని రథాశ్వమును చూచి పరస్పర మిట్లు భాషించుకొనిరి: 

మొదట 

కద్రువ : 'ఆ గుఱ్ఱము తోక వర్ణమేమో త్వరగ దెలుపుము' 

వినత : ఆ గుఱ్ఱము తోక తెల్లగనున్నది. నీవే రంగుగలదని తలతువో తెలుపుము. అపు డిద్దఱము పందెము వేసికొందము. 

కద్రువ : శుచిస్మితా! అది నల్లని వర్ణము గలది. మనలో నెవరిమాట తప్పగునో వారు రెండవవారిని దాస్యము చేయవలయును. 

పిమ్మట కద్రువ తన మాట జవదాటని పాములతో 'మీరు గుఱ్ఱము తోకకు చుట్టుకొని దానిని నల్లనిదిగ జేయుడు' అనెను. కొన్ని పాములు తమ తల్లికి ప్రియము సేయు తలంపుతో తమ నల్ల పడగలతో గుఱ్ఱముతోక చుట్టును చుట్టుకొని దానిని నల్లగ జేసినవి. తన మాట విననివారిని జనమేజయుని సర్పయాగమున కాహుతి గండని కద్రువ శపించెను. అపుడక్కసెల్లెండ్రిద్దఱును గలిసి వెళ్ళి మఱల గుఱ్ఱమును గాంచిరి. వారి కపుడది నల్లగ దోచెను. అపుడు వినత మిక్కిలి పరితపించినది. 

వినత కుమారుడు గరుత్మంతుడు. మహాసత్త్వుడు. అతడు తన తల్లి దైన్యమును గని 'జననీ! ఆ సూర్యసారథి - నేను - మే విర్వుర మింకను బ్రతికియుండగ నీ వింతగ దీనముగ నుండగనేల? ఓ తల్లీ! మా కనులముందు మము కడుపు పంటగ కన్న నీవు కంటతడిబెట్టుకొన్న మా జీవితాలు వ్యర్థములు గద! తల్లి కడగండ్ల పాలయినచో నామె సుతుడు బ్రతికి యేమి లాభము? కావున నీ దైన్యకారణము దెల్పుము. వెంటనే నీ దుఃఖము తొలగింపజేతును' అని పలికెను. 

అన వినత 'కుమారా! నేను నా సవతికి దాసినై బాధ పడుచున్నాను. ఇంకేమి చెప్పవలయును? ఇంతేకాక తన నచ్చినచోటి కామె తన్ను నన్ను మోసికొని పొమ్మనుచున్నది' అనెను. గరుడుడును 'అమ్మా! ఆమె యెటు పోదలచిన నే నామెను గొనిపోవుదును. నీవు శోక ముడుగుము. నిన్ను నిశ్చింతురాలిని జేతునని వినతను కద్రువ చెంత కంపెను.

గరుత్మంతుండు తన తల్లికి దాస్యముక్తి గల్గించదలచి కద్రువను నామె పుత్త్రులను సముద్రతీరమునకు మోసికొని పోయి కద్రువకు నమస్కరించి 'ఓయమ్మా! మాయమ్మ దాసత్వమునుండి యెట్లు విమోచనము బొందునో నిజము తెలుపు' మనెను. 

కద్రువ 'నీవు దేవలోకమేగి నీ బలము చూపి యమృతము తెచ్చి మా కర్పించుము. నీ తల్లిని దాస్యమునుండి విడిపించుకొనుము' అనెను. ఆ మాటలు విని గరుత్మంతుడు వేగముగ నింద్రలోక మేగి యచ్చటివారితో బోరి యమృతకలశము గ్రహించి తెచ్చి తన తల్లి కీయగా వినత తన బానిసతనమునుండి విడుదల బొందెను. ఇట్లు వినత తన బిడ్డ యగు పక్షిరాజు సమర్థతచే దాస్యముక్తయై దుఃఖభారము దించుకొనెను. ఇట్లు గరుడుడును తల్లి గౌరవము నిలువబెట్టెను. నాగములు స్నానము చేయుట కేగిన యదను గనిపెట్టి యింద్రు డమృతభాండ మెత్తుకొనిపోయెను. పాములు వచ్చి దర్భలకంటుకొన్న సుధ నాస్వాదించుటకు కుశాగ్రములు నాకినందున వాని నాల్కలు రెండుగ చీలి నాటినుండి అవి ద్విజిహ్వములైనవి. మున్ను తల్లిచే శపింపబడిన వాసుకి మున్నగు పన్నగములు హిరణ్యగర్భుని శరణువేడి తమ శాపభీతి చెప్పుకొన –

ధాత వానితో 'జరత్కారు డను ముని గలడు. మీ రతని పేరుగల నాగకన్య నా ముని కుమారున కర్పింపుడు. వారికి బుట్టినవాడు మీ క్లేశములు గట్టెక్కించగలడు. అతడాస్తీక నామమున బరగును. ఇది నిజము' అని పలికి వారికి ధైర్యము చెప్పెను. బ్రహ్మివాక్కులు విని వాసుకి వనమునకు తిరిగి వచ్చి తన జరత్కారువను సోదరి నా జరత్కారు మునికి వినయముగ నప్పగించెను. అతడు తనతో సమనామరూపములుగల దానిగ జరత్కారువు ఎఱిగెను. ఆమె తన కప్రియము చేసినచో నామెను విడిచిపుత్తునని పలికి ఆ యొడంబడికతో ముని యామెను చేపట్టెను. వాసుకి యామె నతని కప్పగించి తన యింటి కేగెను. అంత జరత్కారుడా మహావనమందు పర్ణకుటీర మేర్పరచుకొని అందు జరత్కారువను పత్నితో నానందించసాగెను. ఒకనా డా ముని భోజనము చేసి నిద్రించెను. అపుడు జరత్కారు వతని చెంతనే యుండెను. ముని 'తన్నెట్టి పరిస్థితిలోను మేలుకొలుపవద్ద'ని భార్యతో జెప్పి నిదురించెను. అంతలో సూర్యు డస్తగిరి కేగెను. సంధ్యా వందన సమయ మయ్యెను.

అపుడామె తనలో 'ఇపుడు లేపినచో నన్ను తప్పక విడిచిపెట్టును. ఇపుడేమి చేతును? నాకిక శాంతి లేదు. మేల్కొల్పనిచో సంధ్యాకాలము దాటిపోవును' అని యామె ధర్మలోపమునకు భీతి జెందినది. ధర్మచ్యుతికంటె నతడు త్యజించుట మేలు. దానికంటె నా చావు మేలు. నరులకు ధర్మహానిచేత నరకము గల్గును, అని తలచి తుద కామె 'సువ్రతా! సంధ్యా సమయము సమీపించినది. ఇక మేలుకొను' మని తన పతిని మేలుకొలిపెను. అతడు లేచి కోపనుడై' ఇక నీవు నీ సోదరునింటి కేగుము. నా నిద్రాభంగ మొనర్చితివి. నా దారిని నేను పోదు'ననెను. అంతనామె భయపడుచు మునితో 'ఓమహామతీ! నా సోదరుడు నన్ను నీకు దేనికై సమర్పించెనో యదెట్లు సంభవించు'నన నత డామెతో (ఆస్తి) ఉన్నదిలెమ్మని పలికెను. ఆమె మునిచే వదలబడి వాసుకి యిల్లుజేరి తన సోదరుడుగగ నామె తన పతి (ఆస్తి) కలదని తన్ను వీడి తావెళ్ళెనని చెప్పెను. ఆమె మాటలు విని యా ముని సత్యవాది యని తలచి వాసుకి తన సోదరి నాశ్రయించియుండెను.

కొంతకాలము తరువాత నామె కొక బాలుడు జన్మించెను. అతడే ఆస్తీకనామమున వన్నె కెక్కెను. అట్టి యితనిచే నిపుడీ యాగము నిలిపివేయబడుచున్నది. విజ్ఞానియగు ఆ ముని తన తల్లి పక్షము వారి నిట్లు సంరక్షించెను. వాసుకి సోదరికి బుట్టిన యాస్తీకుని నీవు చక్కగ సత్కరించితివి. ఓ మహారాజా! నీవు చాల గణనీయమైన పని చేసితివి. నీకు మేలు గలుగుత! సకల భారతము వింటిని. మునులను బూజించి వారికి భూరిదానము లొసంగితివి. 

జనమేజయనరపతీ! ఇంతటి పుణ్యమునగూడ నీకు శాంతి నీ తండ్రికి స్వర్గతి లభించలేదు. నీ వంశమంతయును పావనము గాలేదు. కావున శ్రీజగదంబికాదేవికి వేవేగభక్తి శ్రద్ధలతో దివ్యమందిరము నిర్మింపజేయుము. నీవు సకల శివ ప్రదాయినిని మహాదేవిని నిండు భక్తితో బూజింపుము. దానిచే నీకు సమస్తము సిద్ధించగలదు. ఆ విశ్వమాత నీకు రాజ్యసంపదలిచ్చి ధ్రువముగ నిన్నభి''వర్ధిల్ల జేయును.

శ్రీదేవీ యజ్ఞము విధివిధానముగ నాచరించి శ్రీదేవీ భాగవత పురాణ సంశ్రవణ మొనరింపుము. అది-ఆకథ పరమపావనము-సంసారోత్తారకము-దివ్యము-నానారస సమాహారరూపము-వినిపింతును. తత్పరభావమున నాలకింపుము. ఈ పరమ దేవీపురాణముగాక వినదగినది మరొక్కటి లేదు. ఆమె పావనచరణకమలములు దప్ప భజింపదగినవి మరేవియు లేవు. ఎవరి ప్రేమసంకుల హృదయముల నాదేవి ఎల్లపుడును వసించునో వారే ధన్యజీవులు. వారే సౌభాగ్యవంతులు. వారే స్థితప్రజ్ఞులు. ఓ భారతా! ఈ పవిత్రభారత కర్మభూమిలో నా జగదంబికను సమారాధింపని మూఢులే కడగండ్లకు గురియగుదురు. బ్రహ్మాదిదేవత లెల్లరే త్రిమూర్తిరూపయగు దేవిని సంసేవించుటలో తత్పరులై నిత్యము వర్తింతురో - ఆ తల్లిని తెలిసిన వాడెవ్వడు భక్తిమీర సేవింపకుండును! పూర్వ మా భగవతి శ్రీమహావిష్ణువున కీ భాగవతము వినిపించినది. అట్టి దీని నెవడు వినునో వాని యభీష్టములు తీరును. ఈ పుణ్యపురాణ శ్రవణ పుణ్యమున నీకు చిత్తశాంతి గలిగి తీరును. నీ పితరు లక్షయ పుణ్యలోకములు జేరుదురు.

అధ్యాయము 33 త్రిభువనేశ్వరి విషయమున జనమేజయ కృతప్రశ్నము

శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము

శ్రీ దేవీ భాగవతం ద్వితీయ స్కంధము

పంచాంగం

No comments:

Post a Comment

Chapter 37 Shiva and Brahma worshipping Sridevi - అధ్యాయము 37 శ్రీదేవిని శివబ్రహ్మలు ప్రస్తుతించుట

శ్రీ దేవీ భాగవతం తృ తీయ స్కంధము - అధ్యాయము 37 శ్రీదేవిని శివబ్రహ్మలు ప్రస్తుతించుట బ్రహ్మ యిట్లనియె: అని యీ ప్రకారముగ దేవదేవుడగు విష్ణువు జ...