Sunday, April 12, 2026

Chapter 57 The worship of Sri Durga Devi - అధ్యాయము 57 శ్రీ దుర్గాదేవి ప్రతిష్ఠ

శ్రీ దేవీ భాగవతం తృతీయస్కంధము - అధ్యాయము 57

శ్రీ దుర్గాదేవి ప్రతిష్ఠ

వ్యాసభగవాను డిట్లనియె: ఆ విధముగ తన మిత్రులతో సుదర్శన రాజవరేణ్యు డయోధ్యకేగి శోక సంతప్తయగు శత్రుజిత్తుని తల్లికి ప్రణమిల్లి యామె కిట్లు పలికెను. తల్లీ! నేను నీ తనయునిగాని తండ్రినిగాని రణరంగమున జంపలేదు. నీ పాదములు సాక్షిగ బలుకుచున్నాను. వారు పోరులో శ్రీ దుర్గాదేవి చేతిలో మడిసిరి. ఇందు నా యపరాధ మిసుమంతయును లేదు తప్పక జరుగవలసి జరుగు కార్యముల విషయమున ప్రతీకారమెన్నడును జరుగదు. 

ఓ మానినీ! ఇంక నీ చచ్చిన కొడుకునకై శోకింపకుము. ప్రాణులు కర్మపరతంత్రులై సుఖ దుఃఖము లనుభవింతురు సుమా! ఓ మాతా! ధర్మజ్ఞులారా! నేను నీకు దాసుడను. నాకు నా తల్లి మనోరమ యెట్లో నీవు నట్టే. మీ యిరువురి పట్ల నాకు భేదభావము లేదు. ప్రాణులు వెనుకటి శుభాశుభము లవశ్య మనుభవించి తీరవలయును. కాన సుఖ దుఃఖములు ప్రాప్తించినపుడు శోకింపదగదు. ఎవ్వడును దుఃఖములందు దుఃఖాదికమును సుఖములందు సుఖాదికమును అనుభవించును కాని దుఃఖము కలిగినపుడు అత్యంత శోకమును సుఖము కలిగినపుడు అధిక హర్షమును పొంది వాటికి లోబడరాదు. 

ఈ సమస్త బ్రహ్మాండమును దైవాధీనము. ఇందాత్మాధీన మైన దేదియును లేదు. కాన మతిమంతుడగు నరుడు శోకములచే తన యాత్మను శోషింపజేసికొనరాదు. ఒక కట్టెబొమ్మ నటుని చేతిలోబడి యభినయించును. అటుల జీవుడు తాను జేసికొన్ని కర్మకు పరతంత్రుడై ప్రవర్తిల్లును. స్వయంకృత కర్మఫలముల ననుభవింపక తప్పదు. అందువలన నేను వనమందున్నను మనస్సునందు బాధపడలేదు. నా తాత చనిపోయెను. నాతల్లి విధవ యయ్యెను. ఆమె భయాతిరేకమున నన్ను వనములకు కొనిపోయెను.

ఆమె తన సర్వస్వమును ముష్కరుల వలన గోలుపోయినది. ఆమె బాలపుత్రయై నిరాశ్రయురాలై పెక్కు వస్త్రములు లేనిదై యుండెను. నా తల్లి నన్ను భారాద్వాజాశ్రమమునకు గొనిపోయినది. మావెంట విదల్లుడును నొక దాదియు నేతెంచిరి. అచ్చట మేము మువ్వురమును మునులును మునిపత్నులు నొసంగిన పండ్లును నీవారాన్నములును దిని వారిచే బోషింపబడితిమి. 

ఆ పవిత్ర స్థలమునందు నా నిర్మల చిత్తమందు ధనము వలని సుఖముగాని లేమి వలని దుఃఖముగాని వైరద్వేషములుగాని లేవు. రాజభోగముల కన్న నీవారాన్న భోజనములు మేలైనవి. రాజభోగి తుదకు నరకమేగును. కాని, నీవారన్నములు దిన్నవాడు జనడు. పండితుడైన పురుషుడు ధర్మాభ్యుదయము గల్గింప వలయును. అతడింద్రియ వర్గమును జయింపవలయును. అట్టివాడు నరకమున పతనము బొందడు. ఎల్ల ప్రాణులకు నాహార విహారముల వలన సౌఖ్యము చేకూరును. 

కాని, యీ పవిత్ర భరత ఖండమునందు మనుజజన్మము లభించుటచే మాత్రము ఇతర జన్మములందు కడుంగడు దుర్లభమగు మోక్షము లభించును. అట్టి సదుర్లభమైన నరజన్మ మెత్తినవాడు తప్పక ధర్మసమాచరణము జరుపవలయును. ఈ నరజన్మము స్వర్గమోక్షములకు చక్కని రాజమార్గము. ఇది యితర జంతువుల కసాధ్యమైనది. ఇట్లు సుదర్శను నోదార్పు మాటలకు లీలావతి లజ్జించి పుత్రశోకము వీడియు కన్నీరు గార్చుచు నతని కిట్లనియెను 

"నా తండ్రీ యుధాజిత్తు. అతడు నీ తాతను జంపెను. నీ రాజ్య మపహరించెను. పుత్రా! నన్నీ దుఃస్థితి పాలుచేసెను. ఆనాడు నేను నా తండ్రిని నా కొడుకును వారింపలేక పోతిని. అతడు చేసిన పనిలో నా దోష మేమియును లేదు. వారు స్వయంకృతాపరాధమున మడిసిరి. అందులకు నీవు కారణము గావు. నా పుత్రుని గూర్చి నేను శోకించుటలేదు. అతని చెడునంతకు కుందుచున్నాను. పుత్త్రా! నీవు నాకు తనయుడవు. మనోరమ నా సోదరి. నీ మీద నాకు కోపతాపము లెంత మాత్రము లేవు. నీవు చక్కగ రాజ్యమేలుము. ప్రజలను కన్నబిడ్డలను వలె బాలింపుము. నీకీ నిష్కంటక రాజ్యము భగవతి కరుణ వలన సంప్రాప్తించినది.''

అను తల్లి మాటలు విని సుదర్శనుడామెకు నమస్కరించెను. ఆ పిదప మనోరమ మునుపు వసించిన రమ్య హర్మ్యమున కేగెను. సుదర్శను డందుండి యెల్ల మంత్రులను దైవజ్ఞులను రావించి వారికొక శుభముహూర్తము చూడుడనెను. నేనొక బంగారు గద్దె చేయింతును. దానిపై శ్రీదేవిని ప్రతిష్ఠ చేతును. మనము నిత్య మా దేవిని బూజింపవలయును. 

పూర్వము శ్రీరామచంద్రులు ధర్మార్థ కామమోక్షదాయిని యగు భగవతి నున్నత పీఠముపై ప్రతిష్ఠించి పూజించిరి. నేను నట్లు చేసి పిదప రాజ్యమేలుదును. ఆ దేవి శివాశక్తి - వాంఛితార్థ సిద్ధిద. అట్టి జగదంబను నాగరికజనులు భక్తి ప్రపత్తులతో ప్రతినిత్యము పూజించవలయుననియు సుదర్శనుడు పలికెను. 

అపుడు మంత్రులు రాజశాసనములను తలదాల్చిరి. వారు శిల్పివరులచేత సుందర దేవీమందిరము నిర్మింపజేసిరి. సుదర్శనుడు చైతన్యముట్టిపడు దేవీ విగ్రహమును సిద్ధము చేసెను. వేదవిదులగు బ్రాహ్మణులను రావించెను. ఒక సుముహూర్తమున శ్రీదేవీ ప్రతిష్ఠ జరిపించెను. 

ఆ మతిమంతుడు యథావిధిగ శ్రీ మద్దేవీ యాగము జరిపించెను. సురలను బూజించెను. దివ్య పీఠముపై పరాశక్తిని ప్రతిష్టించెను. ఆ దేవీ ప్రతిష్ఠామహోత్సముల విప్రుల వేదఘోషలతో దివ్యగానములతో వాద్యనిస్వనములతో కనులకు చెవులకు పండువుగ నుండెను.

ఆ విధముగ సుదర్శనుడు వేదవిదుల వలన శ్రీదేవిని ప్రతిష్ఠించి విధి విధానమున నానావిధ పూజలు జరిపించెను. అట్లు సుదర్శనుడు పూజా విధులు సమాచరించి తన పైతృక రాజ్యము బడసెను. ఇట్లంబికాదేవి కోసల దేశమున విఖ్యాతి నందెను. అట్లు ధర్మవిజయుడగు సుదర్శనుడు రాజ్యము బడసి ధర్మిష్ఠులగు సకల సామంతులను తనకు వశుల జేసికొనెను. శ్రీ దిలీపుడు రఘువు శ్రీరాముడు పరిపాలించిన రాజ్యములోని ప్రజ లెట్లుండిరో సుదర్శనుని పాలనలోని ప్రజలు నట్లు సుఖ సంపన్నులై విలసిల్లిరి. అతని యేలుబడిలో వర్ణాశ్రమాదుల ధర్మము నాలుగు పదములతో ప్రవర్తిల్లెను. ప్రతివాడును ధర్మతత్పరుడై యుండెను. ఆనాటినుండి గ్రామగ్రామమున దేవీమందిరములు వెలసినవి. 

ఇట్లు కోసలదేశమున శ్రీ భగవతీ పూజ విరివిగా జరుగుచుండెను. కాశియందు సుబాహువును భక్తి భావములతో శ్రీ దుర్గా విగ్రహము చేయించెను. దేవీ మందిరము నిర్మింపజేసెను. అందా దేవిని ప్రతిష్ఠించెను. అచటి భక్తులెల్లరును భక్తి పరాయణులై శ్రీ విశ్వేశ్వరుని పూజించు విధముగ శ్రీ దుర్గాదేవిని యథావిధిగ బూజించుచుండిరి. ఈ విధముగ భూమిపై శ్రీ దుర్గాదేవి విలసిల్లినది. 

ఈ రీతిగ దేవీభక్తి దేశదేశముల వ్యాపించెను. ఆనాటినుండి యావద్భారతమున భూలోకమందంతటను నెల్ల వారికెల్ల భంగుల భగవతీ దేవి పూజింపదగినదయ్యెను. కొందఱు భక్తి యుక్తులై యాగమప్రోక్తములైన స్తోత్రములతో జపధ్యాన పరాయణులై దేవిని గొలుచు చుండిరి. దేవీభక్తులెల్లరును శ్రద్ధాభక్తులతో శ్రీ మద్దేవీయాగములును సమారాధనములును జరుపుచుండిరి అని వ్యాసముని జనమేజయునకు తెలిపెను.

అధ్యాయము 58 శ్రీదేవీ నవరాత్ర పూజా విధానము

శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము

పంచాంగం

No comments:

Post a Comment

Chapter 62 Rama Done Navaratri Vratha With the help of Narada - అధ్యాయము 62 నారదుని ద్వారా రాముడు దేవీ నవరాత్రములు ఆచరించుట

శ్రీ దేవీ భాగవతం తృ తీయ స్కంధము - అధ్యాయము 62 నారదుని ద్వారా రాముడు దేవీ నవరాత్రములు ఆచరించుట వ్యాసమునిచంద్రు డిట్లనియె : ఈ ప్రకారముగ రామలక్...