Sunday, April 12, 2026

Chapter 56 Sridevi's residence in Kashi - అధ్యాయము 56 శ్రీదేవి కాశిలో నివసించుట

శ్రీ దేవీ భాగవతం తృతీయస్కంధము - అధ్యాయము 56

శ్రీదేవి కాశిలో నివసించుట

వ్యాసు డిట్లనెను : ఆ భవానీదేవి హితవు నాలకించి సుబాహువు భక్తి యుక్తితో శ్రీదేవి కిట్లనియెను. "ఒకవంక దేవలోక భూలోకముల విశాల రాజ్యసంపదలు, మరొకవంక నెనలేని నీ దివ్య సందర్శన భాగ్యము. ఓ బ్రహ్మాండ జననీ! ఈ ముల్లోకములందును నీ దివ్య సందర్శనమునకు సాటివచ్చున దేదియును లేదు. నీ దర్శనముచే నేనీభూమిపై ధన్యుడనైతిని. నేనింకేమి కోరుదును? ఐనను నేనొక వరము గోరుచున్నాను. నీ పాద పద్మములందు నా కైకాంతిక ప్రేమభక్తి కుదురుగ నుండుగాక. ఓ మాతా! ఈ పవిత్ర కాశీనగరిలో నీ శక్తిరూపము దుర్గాదేవి నామమున నెల్లకాలము నెలకొని యుండునుగాక! సుదర్శనుని శత్రు సంఘములనుండి మమ్ము సురక్షితముగ రక్షించితివి. అటులే నీ వీ నగరమును నిత్యము బ్రోచుచుండుము. ఓ జగజ్జననీ! ఈ భూమిపై నెంతకాలము కాశీపురి సుస్థిరమై ప్రసిద్ధినంది యలరారుచుండునో యంతకాలము నీవిట నెలకొనియుండి దానిని నీవు ప్రోచుచుండుము. నాకీయొకేయొక వరమిమ్ము. నేనింతకు మించి యేమియును గోరను. అమ్మా! నాకు సకలవిధకామము లొడగూర్పుము. నా వైరులను దునుమాడుము. లోకమందలి యమంగళమును ప్రతిహత మొనరింపుము. ఈ విధముగ తన్ను సంస్తుతించి వరములు పొంది తన సమక్షమున కేలుమోడ్చి నిలుచున్న సుబాహుని గని దుర్గతినివారిణి యగు దుర్గ సుప్రసన్నయై యతని కిట్లనియెను: 

"రాజా! ఈ భూమి నిలుచునందాక నేనీ యవిముక్త క్షేత్రమునందు విశ్వసంరక్షణకై నివసింతును." ఆపిమ్మట సుదర్శనుడు ప్రమోదసంభరితుడై వచ్చి పరమ భక్తితో మోకరిల్లి జగదంబిక నీ విధముగ కొండాడెను.

"ఓహో దేవీ ! నీ దయ నెంతని వర్ణింతును? నేను భక్తి హీనుడనైనను నీచేత గాపాడబడితిని. ఎల్ల దేవతలు భక్తులపై దయజూపుదురు. కాని, నీవు మాత్రము భక్తి లేనివారిపైగూడ దయ జూపుదువు. ఇది నీ ముఖ్యవ్రతము. మహాదేవీ! నీ వీ బ్రహ్మాండము లన్నిటిని పుట్టించి పెంచి తుదకు సంహారమొనర్తు పని నేను వింటిని. అట్టి నీవు నన్నొక్కని బ్రోచుట వింతగాదు. అమ్మా భవానీ! నేను కార్యమూఢుడను. నేనిపుడేమి చేయవలయును? ఎచటి కేగ వలయును? నన్నాదేశింపుమమ్మా! నీయాన తలదాల్చి వెళ్ళుదును. విహరింతును, మనుదును. అపుడు దేవి దయాంతరంగయై యతని కిట్లనియెను. 

"ఓ మహాభాగా! నీ వయోధ్య కేగి నీ కులోచితముగ రాజ్యమేలుము. నన్ను నియతముగ భక్తితోడ సంస్మరించుచు బూజించుచుండుము. నేను నీ రాజ్యమందు నిత్య సుఖశాంతులు నెలకొలుప గలను. నీవష్టమీ నవమీ చతుర్దశులందు నన్ను గుఱించి ప్రత్యేకముగ బలివిధానముతో నా పూజ లొనర్పవలయును. ఓ యనఘా! నా దుర్గా విగ్రహమును నీ నగరమున సుప్రతిష్ఠితము గావించి నన్ను శ్రద్ధాభక్తులతో మూడువేళల నర్చించు చుండుము. ప్రతి శరత్కాలమున నవరాత్ర విధానముగ పరాభక్తి భావముతో నాకు నిత్యము మహాశక్తిపూజ లొనర్పుము. 

చైత్రము-ఆషాఢము-ఆశ్వయుజము-మాఘము- ఈ మాసములందు నన్ను గూర్చి ప్రేమమీర శ్రీదేవీ మహోత్సవములు జరుపవలయును. విశేషించి నవరాత్రములందు హృదయపూర్వకములగు నివాళులతో నిత్యపూజ లొనరింప వలయును. బుధులు విశేషించి కృష్ణపక్షమందలి యష్టమీ చతుర్దశులందు నిశ్చలభక్తి యుక్తులై న న్నారాధింప వలయును.

ఇట్లు దుర్గతి నాశని శ్రీదేవి దుర్గ పలికి సుదర్శనునిచేత సన్నుతింపబడి అదృశ్యయైన పిమ్మట దేవత లింద్రుని జేరునట్లు రాజులు సుదర్శనుని జేరి ప్రణమిల్లిరి. సుబాహువు సైతమతనికి వందన మాచరించి నిలుచుండెను. రాజులందఱును సుదర్శునితో నిట్లనిరో. నీ వయోధ్యాపతివి కమ్ము. మేము నీ సేవకులము. నీవు మా ప్రభుడవు. శాసకుడవు. నీవయోధ్యారాజ్య మేలుము. మమ్ము బాలింపుము. మహారాజా! ఆదిశక్తి - మహాదేవి - చతుర్వర్గఫలప్రదాయిని-విశ్వేశ్వరి-శివ యగు పరాదేవి నీ మూలమున మాకు గోచరయైనది. ఈ భూమిపై నీవు మిక్కిలి ధన్యుడవు-కృతకృత్యుడవు-పుణ్యతముడవు-కావుననే నీ నిమిత్తమున సనాతని యగు జగదంబిక దర్శనభాగ్య మొసంగినది. 

నృపసత్తమా ! మేము మాయామోహితులము. తామసులము. కాన మేము శ్రీ చండికాప్రభావ మెఱుగ జాలకుంటిమి. మేము ధన దార సుతుల చింతలం దగిలి యుంటిమి. కామక్రోధములను మొసళ్ళుగల ఘోర సంసార సాగరమందు నిర్మగ్నుల మైతిమి. నీవు సర్వజ్ఞుడవు-మహామనీషివి. కనుక ఆ పరమశక్తి యెవరో ఎచ్చటి నుండి వచ్చెనో ఆమె మహా ప్రతిభా ప్రభావ మెట్టిదో నీవు చక్కగ నెఱుగుదువు. కాన నిన్నడుగుచున్నాము-దయతో సెలవిమ్ము. కాకుత్థ్స ! సాధులు సర్వభూతహితులును దయామతులును. కనుక నీవు మా దుస్తర సంసార సాగరము దాటించు నావికుడవుగమ్ము. మాకు శ్రీమద్దేవీమాహాత్మ్యము తెలియ బలుకుము. 

నరవరోత్తమా! ఆ మాయాదేవీ నిజస్వరూపమేది? ఆమె యెట్లవతరించినది? ఆమె విమల ప్రభావ మేతీరుది? ఇవన్నియును మాకు వినవేడుకగుచున్నవి. వినిపింపుము'' అని యిట్లు రాజులడుగగా సుదర్శనుడు ప్రమోద మలర నెమ్మదిలో శ్రీదేవిని సంభావించి వారికిట్లనియెను:

"ఓ భూపతులారా! ఏమని చెప్పుదును? ఎంతని చెప్పుదును? బ్రహ్మ రుద్రుడు దేవతలు సైత మా దేవీతత్త్వము తుదముట్ట నెఱుగజాలరు. అట్టి జగదంబిక దివ్యచరిత్రము వర్ణింప నేనెవడను? ఆ శ్రీదేవి యీ సకలమున కాద్య-పరాశక్తి-వరేణ్య-మహాలక్ష్మి-సత్త్వప్రకాశమూర్తి-జగత్పరిపాలన చతుర. ఆ యంబిక యీరేడు లోకాలను రజోరూపమున పుట్టించి సత్త్వరూపమున పాలించి తమోరూపమున సంహరించి త్రిగుణమయియై విరాజిల్లు చుండును. ఆ నిర్గుణ పరమశక్తి బ్రహ్మ మొదలుగాగల దేవతలకు కారణభూతురాలు. సర్వకామఫలప్రదాయిని. ఆ నిర్గుణశక్తి పరమయోగులకును తెలియరాదు. కావున బహురూపములుగల సగుణశక్తిని విబుధులు సేవించి చింతించి తరింతురు. 

రాజు లిట్లనిరి. నీవు బాల్యము నుండియు భయముతో మనములందు తలదాచుకొంటివిగదా! నీవా యుత్తమ పరమశక్తి నెట్లుఱుగ గల్గితివి? నీవా తల్లి నేతీరున పూజించి యుపాసించితివో కాని యాదేవి దయను త్వరలోనే సంపాదింప గల్గితివి' అన 

సుదర్శను డిట్లనెను: ఓ నరేశులారా! నాకు చిఱుత ప్రాయమందే శ్రీ భగవతియొక్క కామరాజ బీజమంత్రము లభించినది. నేను దానిని రేయింబవళ్ళదే పనిగ జపించు చుంటిని. పరమర్షులు నాకంబికా శివతత్త్వ మెఱింగించిరి. నాటినుండి నేనా దేవి నైకాంతిక భక్తితో నిరంతరముగ స్మరించితిని అనెను. అంత రాజులెల్లరు శ్రీదేవీభక్తి తత్పరులై పరమశక్తిని తమ డెందములందు దలంచుచు నిజనివాసముల కరిగిరి. సుబాహువు సుదర్శనుని వీడ్కొని కాశి కేగెను. 

ధర్మాత్ముడైన సుదర్శనుడును కోసలపురికి వెళ్ళెను. రణమున శత్రుజిత్తు మరణించుట సుదర్శనుడు గెలుపొందుట విని మంత్రులెల్లరును సంపూర్ణహర్షము వెలిపుచ్చిరి. సుదర్శనమహారాజేతెంచుట గాంచి సాకేతనివాసులు విలువైన కానుకలు గొని సాదర సమ్మానములతో నతనికెదురేగిరి. ఇట్లు ప్రజలెల్లరును భూరిగ కానుకలు తీసికొని ధ్రువసంధిసుతుని సన్నిధి కరిగిరి. ఈ విధముగ సుదర్శనుడు తనపత్నితో గూడ నయోధ్య కేగి యెల్లరిని గారవించి రాజమందిరమున కరిగెను. 

అపుడు వందిమాగధులు సుదర్శనుని సన్నుతించిరి. మంత్రులు చేతులు జోడించిరి. కన్నెపడుచులు లాజసుమములు గురిపిరి అని వ్యాసమహాముని జనమేజయునితో పలికెను.

అధ్యాయము 57 శ్రీ దుర్గాదేవి ప్రతిష్ఠ

శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము

పంచాంగం

No comments:

Post a Comment

Chapter 62 Rama Done Navaratri Vratha With the help of Narada - అధ్యాయము 62 నారదుని ద్వారా రాముడు దేవీ నవరాత్రములు ఆచరించుట

శ్రీ దేవీ భాగవతం తృ తీయ స్కంధము - అధ్యాయము 62 నారదుని ద్వారా రాముడు దేవీ నవరాత్రములు ఆచరించుట వ్యాసమునిచంద్రు డిట్లనియె : ఈ ప్రకారముగ రామలక్...