Sunday, April 12, 2026

Chapter 58 Sridevi Navratri Puja Method - అధ్యాయము 58 శ్రీదేవీ నవరాత్ర పూజా విధానము

శ్రీ దేవీ భాగవతం తృతీయస్కంధము - అధ్యాయము 58

శ్రీదేవీ నవరాత్ర పూజా విధానము


జనమేజయు డిట్లు వ్యాసుని ప్రశ్నించెను : ఓ ద్విజోత్తమా! నవరాత్రములందు - విశేషించి శరన్నవరాత్రములందు - విధి విధానమున నాచరింపదగిన విధాన మేది? దేవీ నవరాత్రము లాచరించు విధమేది? దాని ఫలితమేమి? నాకు దయతో నంతయు వివరింపుము. 

వ్యాసభగవాను డిట్లనెను : రాజేంద్రా! శ్రీ దేవీ శరన్నవ రాత్రములను గుఱించి విధి పూర్వకముగ వివరింతును. వినుము. శ్రీదేవీ నవరాత్రములు వసంతకాలమున శరత్కాలమున నాచరింప వలయును. ఈ రెండు ఋతువులు జనులకు యముని దంష్ట్రల వంటివి. ఎల్ల ప్రాణులకును వసంత శరదృతువులు రెండును రోగకరములు. నరులకు ఘోర రోగములు గల్గించి ప్రాణనాశనమునకు కారణము లగును. కనుక మేలు వెలుగు గోరు బుధులు ప్రయత్నించి చైత్రాశ్వ యుజమాసములందు భక్తి యుక్తులై నవరాత్ర వ్రతము లాచరించి విదిగ శ్రీ చండీ పూజలు సలుపవయును. అమావాస్యనాడే సకల సంభారములు సమకూర్చుకొని యేకభుక్తముగ హవిష్యాన్నము భుజింపవలయును. ఒక మంచి సమతల ప్రదేశమున పదారు చేతుల ప్రమాణము గల స్తంభములు కల్గి పతాకములతో నలరారు చక్కని దేవీ మండపము. నిర్మింపవలయును. అచ్చోటున నెఱ్ఱమట్టితో గోమయముతో చక్కగ నలుకవలయును. అందు రంగవల్లికలు తీర్చి దిద్దవలయును. దాని మధ్య భాగమందు స్థిరమై యున్నతమైన వేదిక సమర్పింవలయును. ఆ వేదికపై నాల్గుమూరల పొడవు నంతియ వెడల్పును మూరయెత్తును గల్గి యలంకరింపబడిన పీఠము నమర్చవలయును. దాని చుట్టును మామిడి తోరణములును విచిత్రములైన పూలమాలలను గట్టవలయును.

ఆ ముందు రాత్రియే దేవీతత్త్వ విశారదులు సదాచార సంపన్నులు దాంతులు వేదవేదాంగ పారగులు నగు బ్రాహ్మణులను పిలువ వలయును. పాడ్యమి నాడు విధివిధానమున నదీ నదములందుగాని వాపీకూప తటాకములందుగాని గృహమందుగాని ప్రాతఃస్నాన మొనరింపవలయును. మరునాడు ప్రభాత వేళయందు నిత్యకృత్యము లాచరించి విప్రవరణ మొనరించి వారికి మధుపర్క పూర్వకముగ నర్ఘ్యపాద్యాది విధు లాచరింప వలయును. బ్రాహ్మణోత్తములకు యథాశక్తిగ వస్త్రాలంకరణము లీయవలయును. 

సంపన్నుడు దానమొసంగుటలో ద్రవ్యలోప మెంతమాత్రమును జేయగూడదు. బ్రాహ్మణులు సంతృప్తి జెందినచో కార్యము సంపూర్ణ ఫలప్రద మగును. బ్రాహ్మణులు తొమ్మిదిమందిగాని యేవురుగాని మువ్వురుగాని తుదకొక్కడుగాని శ్రీ మద్దేవీ భాగవతాది పారాయణ మొనరింపవలయును. శాంతుడగు ఒక విప్రుని దేవీభాగవత పారాయణమునకు వరింపవలయును. వేదఘోషలతో స్వస్తివాచనము జరుపవలయును. ఆ వేదికపై సింహాసనము స్థాపించవలయును. దానిపై తెల్లని వస్త్రము పరచవలయును. దానిపై దివ్యాంబర ధారిణి చతుర్భుజ దివ్యాయుధ ధారిణి యగు జగదంబికను ప్రతిష్ఠింపవలయును. నానారత్న భూషణ భూషిత - ముక్తాహార విరాజిత - దివ్యాంబర ధర - సౌమ్య - సర్వ లక్షణ సంయుత - శంఖచక్రగదాపద్మధర - సింహోపరిసంస్థిత - శివ - అష్ఠాదశభుజ - సనాతని యగు దేవిని ప్రతిష్ఠింపవలయును. అట్టి దేవీ విగ్రహము లేనిచో నచట నవార్ణ మహామంత్రయుమగు యంత్ర ముంచవలయును. దాని ప్రక్కను కలశస్థాపన మొనరింపవలయును. సుసంస్కృతమై పంచ పల్లవములు (మామిడి - రావి - మఱ్ఱి - మేడి - జువ్వి చిగురులు) బంగారము గల కలశమునందు వేదమంత్రములతో తీర్థ జలము నుంచవలయును. అచట పూజకు శోభన ద్రవ్యములు సమకూర్చుకొనవలయును. తొలుదొలుత మంగళ సూచకముగ గీతవాదిత్రాది మంగళ వాద్యములు మ్రోగింపవలయును.

శ్రీదేవిని హస్తానక్షత్రముతో గూడియున్న నందా (ప్రతిపత్‌) తిథియందు పూజించుట ఉత్తమము. మొదటినాడు చేసిన దేవీపూజ లోకులకు సర్వకామము లీడేర్చును. మొదట సంకల్పము చేసి పిదప దేవీపూజ ప్రారంభించవలయును. దేవి నుపవాసమున గాని నక్తవ్రతమునగాని ఒక్కపూట భోజనముతోగాని భక్తిశ్రద్ధలతో బూజింపవలయును. జగదంబా! మదంబా! నేను నీ యుత్తమ నవరాత్ర వ్రత మాచరింతును. అందులకు వలయు నీ సాహాయ్యము - చేయూత నాకందిమ్మని దేవిని వేడుకొన వలయును. దేవీవ్రత సమాచరణకు యథాశక్తి నియమనిష్ఠలతో నుండవలయును. 

పిమ్మట మంత్రపూర్వకముగ విధిగ పూజలు సలుపవలయును. శ్రీదేవిని చందనాగురు కర్పూరములతో పరిమళములు గుబాళించు పూలదండలతో మందారము - కరజము - అశోకము - చంపకము - కరవీరము - మాలతి - బిల్వదళములు - బ్రాహ్మీసుమములతో ధూపదీపములతో దేవి నర్చించి ఆమె కర్ఘ్య మొసంగవలయును. నారికేళము - కదళి - మాతులుంగము - దానిమ్మ - పనస - నారింజ మున్నగు మధుర రసములు గల ఫలములు నైవేద్యము చేయవలయును. ఆ పిదప ఘనముగ బ్రాహ్మణ సమారాధనము జరుపవలయును. మాంసాశనులగు వారు మహిషము - మేక - వరాహములను బలిదాన మొనరింపవలయును. శ్రీదేవీ సమక్షమున బలిపీఠముపై బలియైన పశువులు అవ్యయ స్వర్గమేగును. ఓ యనఘా! యాగమున పశుహింస హింస యనబడదు. యజ్ఞమున సలుపు హింస యహింసయని సర్వ శాస్త్రముల నిర్ణయము. దేవతలకై బలియైన పశువులకు స్వర్గతి నిశ్చయము. హోమమునకు త్రికోణాకారముగ కుండ మేర్పరుప వలయును. కానిచో త్రికోణాకృతిగ స్థండిల మేర్పరుప వలయును.

మూడు వేళల పెక్కు సుందర పదార్థములతో నిత్యము దేవిపూజ లొనరింపవలయును. గీతవాద్యములతో దేవీ మహోత్సవములు జరుపవలయును. నిత్యము నేలపై పరుండవలయును. కుమారికలను శుభ్ర వస్త్రాలంకరణములతో నమృతాన్నములతో నర్చింపవలయును. ప్రతిదిన మొక కన్యనుగాని యేకవృద్ధిగ గాని ద్విగుణవృద్ధితోగాని త్రిగుణవృద్ధితోగాని ప్రతిదినము తొమ్మండుగురిని గాని కుమారికలను బూజింపవలయును. తన శక్తికి తగినట్లుగ శక్తియాగ మొనరింపవలయును. 

రాజా! శక్తి యాగమున నెప్పుడును ధనలోపము చేయరాదు. కన్నెలను బూజింపు నపు డేడాది పిల్లను బూజింపరాదు. ఏలన, నా శిశువు భోగములను సుగంధములను గ్రహింపజాలదు. రెండేండ్లు గలది కుమారిక. మూడేండ్లు గలది త్రిమూర్తి. నాలుగేండ్లు గలది కళ్యాణి. ఐదేండ్లు గలది కాళిక. ఏడేండ్లు గలది చండిక. ఎనిమిదేండ్లు గలది శాంభవి. తొమ్మిదేండ్లు గలది దుర్గ. పదేండ్లు గలది సుభద్ర అనబడును. ఇంతకన్న నెక్కువ యేండ్లు గల దానిని బూజింపరాదు. అట్టిది సర్వకార్యములందు నింద్య యగును. 

దేవి నీ తొమ్మిది నామములతో విధిగ బూజింపవలయును. ఈ తొమ్మిది విధముల పూజల ఫలితమును వివరింతును : కుమారికను బూజించినచో దుఃఖ దారిద్య్రనాశము - శత్రుక్షయము - ఆయుర్బల ధనముల వృద్ధియు నగును. త్రిమూర్తి పూజ వలన పుత్త్రపౌత్రాభివృద్ధి - యాయుర్వద్ధి - ధనధాన్య సమృద్ధి - త్రివర్గఫల ప్రాప్తియు జరుగును.

కళ్యాణిని విద్యార్థి - విజయార్థి - రాజ్యసుఖార్థి - పూజింపవలయును. కళ్యాణి సకల కామప్రదాయిని. శత్రునాశమునకు కాళికను పూజింపవలయును. ఐశ్వర్య ధనకామనకేకభక్తితో చండికను పరిపూజింపవలయును. శోకదారిద్య్ర నాశమునకు సమర విజయమునకు రాజసమ్మోహమునకు నిత్యమును శాంభవిని గొలువవలయును. క్రూర శత్రువినాశమునకు ఉగ్రకర్మ సాధనమునకు పరలోక సుఖములకు సంతతభక్తితో శ్రీ దుర్గాదేవి నారాధింపవలయును. వాంఛితార్థ సిద్ధికి సుభద్రను - రోగనాశమునకు రోహిణి నర్చింపవలయును. ''శ్రీరస్తు'' అను మంత్రముతోగాని శ్రీయుక్తమైన మంత్రమునగాని బీజమంత్రమునగాని నరుడు భక్తితో దేవిని పూజింపవలయును. ఎవరు లీలామాత్రమున కుమారుని (షణ్ముఖుని) తత్త్వములను (రహస్యములను) బ్రహ్మాది దేవతలను సృజించునో అట్టి కుమారిని నేను పూజించుచున్నాను.

ఏ తల్లి సత్త్వాది గుణములచే నానా స్వరూపిణి మహాలక్ష్మీ మహా సరస్వతీ మహా కళ్యాది త్రిమూర్తియై త్రికాల వ్యాపిని యైనదో యట్టి శక్టియగు త్రిమూర్తిని నేనారాధింతును. నిత్యము నెల్లపుడు పూజింపబడినదై భక్తులకు కళ్యాణి కారిణియగు నా సర్వకామ ప్రదాయిని యగునట్టి కళ్యాణిని నేను దృఢభక్తితో నిత్య మర్చింతును. ఏ దేవి సర్వప్రాణుల జన్మార్జిత (సంచిత)ములగు కర్మబీజముల నంకురింపజేయునో యట్టి రోహిణీ దేవతను నే నర్చింతును. ఈ చరాచర ప్రపంచమును కల్పాంతమున నేకాళి యంతమొందించునో యట్టి కాళికను నేను గొల్తును. చండముండ దైత్య ఖండినియు చండ(భయంకర) రూపిణియు చండపాతకనావనియునగు చండికను నేను పూజింతును. ఏ తల్లి యొక్క సముత్పత్తి తద్రూపములేయగు వేదములచే నకారణముగ కలుగుచున్నట్లు చెప్పబడుచున్నదో సుఖములొసగు నా శాంభవీదేవిని నేనర్చింతును. భక్తుని దుర్గము నుండి రక్షించునదియు వాని దుర్గతి నశింపజేయునదియు సకల దేవతలకును తెలియరానిదియునగు శ్రీ దుర్గాదేవిని నేనారాధింతును. పూజలుగొన్న మాత్రమున భక్తులకు సుభద్రము లొడగూర్చి యభద్రములు తొలగించి విలసిల్లు సుభద్రా దేవిని నేను నిత్యము పూజింతును. ఇట్టి మంత్రములతో బుధులు అనేక వస్త్రాలంకరణ మాల్య సుగంధములతో సంతతము పరాభక్తితో కన్యకలను పూజింపవలయును అని శ్రీ వ్యాసముని శ్రీదేవి నవరాత్ర పూజవిధానమును జనమేజయునకు ప్రవచించుటయందు నిరతుడయ్యెను.

అధ్యాయము 59 శ్రీదేవీ నవరాత్రవ్రత మాహాత్మ్యము

శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము

పంచాంగం

No comments:

Post a Comment

Chapter 62 Rama Done Navaratri Vratha With the help of Narada - అధ్యాయము 62 నారదుని ద్వారా రాముడు దేవీ నవరాత్రములు ఆచరించుట

శ్రీ దేవీ భాగవతం తృ తీయ స్కంధము - అధ్యాయము 62 నారదుని ద్వారా రాముడు దేవీ నవరాత్రములు ఆచరించుట వ్యాసమునిచంద్రు డిట్లనియె : ఈ ప్రకారముగ రామలక్...