Sunday, April 12, 2026

Chapter 60 The Story Of Sitarama - అధ్యాయము 60 శ్రీసీతారామ చరిత్ర

శ్రీ దేవీ భాగవతం తృతీయస్కంధము - అధ్యాయము 60

శ్రీసీతారామ చరిత్ర

''శ్రీరాముడెట్లు రాజ్యభ్రష్టు డయ్యెను? సీతాపహరణ మెట్లు జరిగెను? రాము డేవిధముగ సుఖప్రదమగు శ్రీదేవీ వ్రత మాచరించెను? అంతయు నాకు తేటతెల్ల మొనరింపుము'' అని జనమేజయు డడుగ. 

వ్యాస భగవాను డిట్లనెను: పూర్వము సూర్యవంశజుడగు దశరథ మహారాజయోధ్యా పురమేలుచుండెను. ఆ రాజు దేవ బ్రాహ్మణులను బూజించువాడు. ఆ పురము సకల సంపదలతో స్వయంసమృద్ధము. ఆ రాజునకు శ్రీరామలక్ష్మణ భరత శత్రుఘ్నులను పేర్లతో త్రిలోక విఖ్యాతి బడసిన నలువురు కొమరు లుద్భవించిరి. సుగుణగణములందు సురూపసంపదలందు వారికి వారే సాటి. వారు తమ తండ్రి కత్యంత ప్రీతిపాత్రులు. శ్రీరాముడు కౌసల్యానందనుడు. భరతుడు కైక కొడుకు. సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులను నిరువురు కొమరులు గలిగిరి. 

వారు బాల్యమునుండియే ధనుర్బాణధరులైయొప్పెసగిరి. వారు నలువురును తమ కులోచిత సంస్కారములు బడసి తమ తల్లిదండ్రులకు ప్రియము సుఖము గూర్చుచుండిరి. 

అంత నొక్కనాడు విశ్వామిత్ర మహర్షి యేతెంచి శ్రీరాముని తనతో బంపుమని దశరథుని కోరెను. దశరథుడు పదారేండ్ల ప్రాయముగల రాముని లక్ష్మణుని యాగ సంరక్షణార్థము విశ్వామిత్రుని వెంట బంపెను. ఆ సుందరాకారులు ముని వెంట బయనించుచు త్రోవలో ఘోరరూపయగు తాటక యను రక్కసిని చంపిరి. ఒక్క రామబాణముననే మునులకు దుఃఖదాయినియగు ఆ రక్కసి మడిసెను. సుబాహు దానవుడు సమసెను. రాముని బాణ వేగమున మారీచుడు చచ్చినంతపనియై దూరముగ చిమ్మివేయబడెను. 

ఇట్లు రామలక్ష్మణులచే కౌశికుని యాగ పరిరక్షణమను సత్కర్మము నెరవేర్చి -

అటనుండి శ్రీరామలక్ష్మణులు కౌశికుని వెంట మిథిలకు జనుచుండిరి. మార్గమధ్యమున పరమపావనమగు శ్రీరామ పాదధూళి సోకినంతనే యహల్య పాపరహితయై శాపవిముక్త యయ్యెను. వారు ముని వెంట విదేహనగర మరిగిరి. 

అట జనకుడు సీతా స్వయంవరమున శివచాపమును పణముగ నుంచెను. దానిని రామభద్రు డవలీలగ దునిమి రమాంశ సంజాతయగు జానికిని వివాహ మయ్యెను. జనకుడు తన మరొక పుత్రియగు నూర్మిళను లక్ష్మణున కొసంగెను. సుశీలురు శుభలక్షణోపేతులు నగు భరతశత్రుఘ్ను లిర్వురును కుశధ్వజుని కూతులను పెండ్లి చేసికొనిరి. ఆ విధముగ నలుగు రన్నదమ్ములకు మిథిలాపురియందు విధి విధానముగ వివాహ మంగళ మహోత్సవము జరిగెను. 

శ్రీరామచంద్రుడు రాజ్యమునకు యోగ్యుడుగాగ దశరథు డతనికి పట్టము గట్టదలచెను. ఆ రామ పట్టాభిషేక మహోత్సవము గని యీసున కైక తన వశవర్తియగు దశరథుని తన వెనుకటి రెండు వరములిమ్మని కోరెను. అందులో మొదటిది తన కొడుకగు భరతునకు రాజ్యమిచ్చుట. రెండవది రాముని బదునాలుగేండ్లడవుల కంపుట. ఆ తల్లి మాట ప్రకారము సత్యధర్మపరాక్రముడగు రాముడు సీతను లక్ష్మణుని వెంటగొని నిశాచరులు తిరుగు దండకాటవి కేగెను. 

దశరథుడు శ్రీరామ వియోగ భారము సైపలేక తన కున్న శాపము దలంచుచు హే రామ! రామ! యనుచు ప్రాణములు వదలెను. భరతుడు తన తల్లి కుతంత్రమును తండ్రి చావును గని రామునకు ప్రియము గూర్చు తలంపుతో రాజ్యము గైకొనకుండెను.

రాముడు పంచవటిలో నివసించుచుండగా రావణుని చెల్లెలు శూర్పణఖ కామాతిరేకమున రాముని సమీపించి లక్ష్మణునిచే వికృతగ జేయబడినది. ఆమె ముక్కు చెవులు తెగుటచూచి రాక్షసులు మహాతేజస్వి యగు రామునితో పోరు సలిపిరి. సత్యపరాక్రముడగు రాము డతిబలులగు ఖరాది రాక్షసులను దునుమాడి మునులకు హితము చేకూర్చెను. 

ఆ దుష్ట శూర్పణఖ లంక కేగి శ్రీరాముని చేతిలో ఖరదూషణాదులు చచ్చుటను రావణునకు దెలిపెను. వారి మరణవార్త విని రావణుడు కోపోద్రేకమున రథమధిరోహించి మారీచాశ్రమమున కేగెను; సీతన ప్రలోభపెట్టులకు మారీచుని అసంభవమైన బంగరు లేడిగ జేసి దానిని సీత కడ కంపెను. మాయావి యగు అతడు బంగరు లేడియై చిత్రవిచిత్ర గతులతో దుముకుచు సమీపమున తిరుగుచు కంటబడెను. దానిని గాంచి దైవ ప్రేరణచేత సీత స్వాధీన పతికవలె తన కా జింక తోలు తెచ్చి యిమ్మని రామునడిగెను. రాముడనాలోచితముగ నచ్చట లక్ష్మణు నుంచి ధనుర్బాణములు దాల్చి ఆ జింకను వెంబడించెను. 

ఆ మాయా చతురమగు లేడి రాముని గని యతనికి గనబడి కనబడక వనాంతరమునకు చేరెను. అది తన చేతి కందుబాటులో నుండు టెరిగి రాముడు మహాక్రోధముతో తీవ్రశరముతో మాయలేడిని గూలనేసెను. ఆ మాయావి యగు దుష్ట మారీచుడు రాముని బాణపు దెబ్బ తిని హే లక్ష్మణా! హతుడ నైతినని రోదించి నేలగూలెను.

ఆ యార్తనాదము విని యది తన రామునిదే యని తలచి సీత దీనయై లక్ష్మణా! నీవు వేగిరమే వెళ్ళుము. రఘునందనుడు హతు డగుచు నిన్ను కేక వేసెను. అతనికి వెంటనే సాయపడుము' అని లక్ష్మణునితో పలుక నత డిట్లనియె: 

"అమ్మా! రాముడు హతుడైనను నాశ్రమమున నిస్సహాయురాలవగు నిన్ను వదలి నేను వెళ్ళను. నన్నిచ్చట నుండుమని రామాజ్ఞ. దానిని మీరి నేను నీ సాన్నిధ్యము వదలను. ఆ మాయామృగము రాఘవుని కడు దూరము గొనిపోయి యుండినను నిన్ను వీడినే నడుగైన ముందుకు వేయను. ధైర్య మవలంబింపుము: ఈ నేలపై మహావీరుడగు రామచంద్రుని చంపగల వాడు లేడు. రామాజ్ఞను త్రోసిపుచ్చి నిన్ను వదలి నేను వెళ్ళను."

ఆ సీత కల్లకపటము లేనిదైనను క్రూరభావమున శుభలక్షణలక్షితుడగు లక్ష్మణుని గని విధి ప్రేరణచే విలపించుచు నిట్లనియెను: 

"సౌమిత్రీ! నీవు నాయం దనురక్తుడ వగుట నే నెఱుగుదును. భరతు డందులకే నిన్ను ప్రేరించి పంపెను. ఓ మోసగాడా! నే నొక మోసగత్తె యగు స్వేచ్ఛాచారను గాను. రాముడు చనిపోయినను కామవశత నిన్ను పతిగా గొనను. ఆ రాముడు తిరిగి రానిచో నేను నా జీవితమునే వదలి పెట్టుదును. 

అతడు లేమి విధవనై వంతలపాలై మనజాలను. నీవుండుము లేక పొమ్ము. నీ యభీష్టము నాకు తెలియదుగాని ధర్మరతుడగు జ్యేష్ఠు నందలి నీ సౌహార్ద మేమయ్యెను?"

అను సీత పలుకులు విని దీనవదనుడు గద్గదకంఠుడునై లక్ష్మణుడు జానకి కిట్లు పలికెను. "ఓ భూమిజా! ఇంత కఠినతరముగ నా విషయమున పలుక నేల? దీనివలన మున్ముందు నీకు ఏదేని అరిష్టము చుట్టుకొనునని నా మదికి దోచుచున్నది'' అని పలికి లక్ష్మణుడు తుట్టతుదకు సీతను బాసి విలపించుచు రామభద్రుని పదచిహ్మములను గనుచు నేగెను. 

వెనువెంటనే రావణుడు కపటభిక్షు వేషమున నాశ్రమమును ప్రవేశించెను. సీత యతనిని యతిగ నెంచి సాదరమున నర్ఘ్యమొసగి యతనికి వన్యభోజ్య పదార్థము లర్పించెను. ఆ దురాత్ముడు మెత్తని కంఠమున మెల్లగ నామె కిట్లనెను. 

"ఓ పద్మదళాక్షీ! ప్రియా! నీ వెవ్వతెవు? ఈ వనమున నొంటిగ నుంటివేల? నీ తండ్రి యెవడు? సోదరు డెవడు? పతి యెవడు? ఏకాకినివై మూఢురాలవువలె నుంటివేల? సౌధము లందుండదగిన నీ వీ యడవులం దొంటిగ నుండలేల? దేవకన్యాసమాన ప్రభగల నీవు ఈ పర్ణశాలలో ముని పత్నిగ నుండదగవు."

ఇట్లు పలికిన తరువాత గూడ ప్రారబ్ధముచే వైదేహి మండోదరిపతి యగు రావణుని దివ్య యతిగనే భావించి యతని కిట్లనెను: 

"శ్రీయుతుడగు దశరథ మహారాజునకు నలువురు కుమారులు. వారిలో పెద్దవాడు నా పతి. అతడు పావన రామ నామమున విఖ్యాతుడు. దశరథు డిచ్చిన వరము కారణమున కైకేయి రాము నడవుల కంపెను. ఇట రాముడు లక్ష్మణునితో పదునాలుగేండ్లు వసించును. నేను జనకుని కూతురను. నన్ను సీత యందురు. శ్రీరాముడు శివధనుస్సు విఱిచి నన్ను వివాహము చేసికొనెను. 

ఆ రఘునాథుని బాహుబలమున మే మిట వనమున నిర్భయముగ మనగలుగుచున్నాము. నా నాథు డొక కాంచనమృగమును గని దానిని వధింప నరిగెను. అన్న పిలుపు విని లక్ష్మణుడు నిపుడే యేగెను. వారి భుజ విక్రమమున నే నిట భీతిలేక వసించుచున్నాను. మా వనవాస వృత్తాంత మంతయును నీ కెఱింగించితిని. వారిపుడే వచ్చి నీకు తగిన సత్కారము లొనరింపగలరు. యతివగు నీవు కేవలము విష్ణు స్వరూపుడవు. కనుక నేను నిన్ను బూజించితిని. ఈ మా యాశ్రమము ఘోర రాక్షస కులముల మధ్య నడవిలో నున్నది. కాని, త్రిదండి రూపమున నీ యడవి కేతెంచిన నీ వెవడవో నా యెదుట నిజము పలుకుము.

అను సీత పలుకులు విని రావణు డిట్లనియె: "శోభనాంగీ! నేను లంకాధిపతిని. మందోదరీపతిని. నీ కొఱకీ రూపు దాల్చి వచ్చితిని. ఈ జనస్థానమున ఖరదూషణులను నిరువురు సోదరులు చచ్చిరని నా సోదరి చెప్పగా నామెచే ప్రేరితుడనై వచ్చితిని. ఆ రాముడు రాజ్యభ్రష్టుడు; వనవాసి; దుర్బలుడు; భాగ్యహీనుడు; మనుజ మాత్రుడు నగుపతి. అతనిని వదలి రాజు నగు నన్ను వరింపుము. నీవే మండోదరికంటె పై స్థానమున పట్టపురాణివి కమ్ము. నేను నీ దాసుడను. ఓ భామినీ! నాకు స్వామినివి గమ్ము. 

ఓ జానకీ! నేను లోకపాలురనే జయించితిని. ఇపుడు నీ పాదాలపై బడుచున్నాను. నన్నను గ్రహించి సనాధుని చేయుము. అబలా! నేను నీ నిమిత్తముగ నీ జనకుని యాచించితిని. కాని, యతడు పణ మేర్పరచితినని నాతో ననెను. నాకారాధ్యుడగు రుద్రుని చాపమును నేను భంగము చేసిన నా దైవమునకు నవమాన మగునను భయముచే నేను స్వయంవరమునకు రాలేదు. కాని, నా మనస్సు మాత్రము విరహాతురమై నీ యందే లగ్నమై యున్నది. నీ వీ వనమందుండుట విని పూర్వానురాగ మోహితుడనై వచ్చితిని. నా శ్రమను సఫల మొనరింపుము."

అధ్యాయము 61 సీతాపహరణము

శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము

పంచాంగం

No comments:

Post a Comment

Chapter 64 Karmic effect - అధ్యాయము 64 కర్మ ప్రభావము

శ్రీ దేవీ భాగవతం చతుర్థ  స్కంధము - అధ్యాయము 64 కర్మ ప్రభావము జనమేజయుడు సత్యవతీ సుతుడును పరాణజ్ఞుడునైన వ్యాసుని ఈ విధముగ ప్రశ్నించగా వాక్యవిశ...