Sunday, April 12, 2026

Chapter 61 Sita Kidnap - అధ్యాయము 61 సీతాపహరణము

శ్రీ దేవీ భాగవతం తృతీయస్కంధము - అధ్యాయము 61

సీతాపహరణము

వ్యాసభగవాను డిట్లనెను: ఆ దురాత్ముని మాటలు విని సీత భయాకుల చిత్తయై వణకుచు నెట్టకేలకు మది దిట్ట పఱచుకొని యతనితో నిట్టు లనెను: "పౌలస్త్యా! ఏల మదనమోహితుడవై యసద్వాక్యము లాడెదవు? నేను కులటను గాను. జనక కుల సంజాతను. దశముఖా! నీవు లంక కేగుము. కాదేని రాముడు నిన్ను హతమార్పగలడు. నా నిమిత్తమున నీకు చావు వ్రాసియున్నదేమో! అని యిట్లు సీత పలికి లోకరావణుడగు రావణునిగూర్చి పోపొమ్మని పలుకుచు పర్ణశాలలోని యగ్ని సన్నిధి కేగెను. 

అపుడతడు రాక్షస స్వరూపము ధరించి లోని కేగి భయవిహ్వలయై యో రామా! రామా! ఓయి లక్ష్మణా! యని మాటిమాటికి నెలుగెత్తి యేడ్చుచున్న సీతను బలిమితో బట్టుకొనివచ్చి తన తేరి నెక్కించి ఆ పాపాత్ముడు త్వరితగతిని వెడలిపోయెను. అరుణతయుడగు జటాయువు త్రోవలో రావణు నడ్డగించెను. అపుడా వనమందు వారిరువురకు పోరు ఘోరముగ జరిగెను. తుదకు రాక్షసరాజు జటాయువును చంపి కురరి (ఆడ లకుముకిపక్షి) వలె విలపించు సీతను గొని లంక కేగి అచట నశోక వృక్షము క్రింద నుంచెను. మ్రుక్కడిరక్కసుల గుంపు లామె చుట్టు నుండెను. వారెన్ని యో సామదానములు ప్రయోగించిరి. ఐనను నా పరమపావని తన పవిత్ర చరిత్రమును ధ్రువముగ నిలుపుకొనెను.

అట రాముడు జింకను చంపి తీసికొని వచ్చుచుండెను. అంతలో నతని కెదురుగ లక్ష్మణు డేతెంచెను. అతనిని గని రాముడు "ఓ యనుజా! ఎంత ఘోరము చేసితివి? ఆ పాపిష్ఠుని మారుగొంతుకతోడి పిలుపు విని ఒంటరిగ నున్న నా ప్రియురాలిని వదలి యిట కేల వచ్చితివి?" అన అది విని సౌమిత్రి రామునితో "ప్రభూ! నేను సీతా వాగ్చాణముల దెబ్బతిని దైవయోగముననిటకు వచ్చితిని. ఇందు నా దోష మేమియును లేదు" అనెను. 

అంత వారిరువురును పర్ణశాల కేగి చూచిరి. కాని, యట వారికి సీత కనబడలేదు. అపుడు వారు దుఃఖతమతులై సీతను వెదుక సమకట్టిరి. ఆమెకై కలయ వెదకుచు వెదకుచు కొనయూపిరితో పడియున్న జటాయువును గాంచిరి. "సీతను రావణుడు తీసికొనిపోయెను. నేనా పాపాత్మునెదిరించి యిచట పడిపోతిని" అని పలికి జటాయువు ప్రాణములు వదలెను. రాముడు జటాయున కంత్యక్రియలు జరిపెను. వారిరువురందుండి మరల ముందునకు సాగిరి. పిదప కబంధుడు రామబాణములచే చచ్చి శాపమునుండి ముక్తుడయ్యెను. కబంధుని మాట ననుసరించి రాఘవుడు సుగ్రీవునితో మైత్రి చేసికొనెను. వాలిని దునిమి రామ సుగ్రీవులు పరస్పరము సాహాయ్యము చేసికొనుటకు ప్రతినలు చేసికొనిరి. రాముడు సుగ్రీవుని కిష్కింధకు రాజుగ జేసెను. అచట సుగుణధాముడగు రాముడు రావణుడు కొనిపోయిన తన ప్రియయగు జానకిని స్మరించుచు లక్ష్మణునితో వర్షాకాలము నాలుగు నెలలు గడపెను.

రాముడు దుర్భర సీతావియోగముతో తన తమ్మున కిట్లనెను. "లక్ష్మణా! ఇపుడు కైక కోరిక పూర్ణమైనది. నా జానకి లభించనిచో నేను బ్రతుకజాలను. నా సీత లేనిచో నయోధ్యకు రాజాలను. నా రాజ్యము పోయెను. వనవాసము మిగిలెను. తండ్రి గతించెను. ప్రియ హరింపబడెను. దుష్ట దైవము నన్నిట్లు వేధించుచు ఇంక ముందేమి చేయనున్నదో తెలియదు. 

లక్ష్మణా! ప్రాణుల భవితవ్య మెంతటివారికిని తెలియదు. మన కింక నెంతటి దుఃస్థితి పట్టనున్నదో కదా! మనము మనువంశమునందు రాజులమై జన్మించితిమి. కాని, పూర్వ కర్మానుసారముగ నిపుడు వనములందు వెతలతో మనుచున్నాము. సౌమిత్రీ! నీవును రాజభోగములు పరిత్యజించి దైవయోగమున నా వెంట వచ్చితివి. ఇపుడు తీరని దుఃఖములను బాగుగ ననుభవింపుము. 

మన పవిత్ర వంశమందు నావంటి దుఃఖభాగి అకించనుడు అసమర్థుడు క్లిష్టుడు పూర్వము లేడు. ముందుండబోడు. నే నీ దుఃఖసాగరమున మునిగితిని. నిస్సహాయుడనగు నా కింక తరణోపాయ మేదియును లేదు గదా ! నా కిపుడు బలముగాని ధనముగాని లేవు. నీ వొక్కడవే నాకు తోడు - నీడ. నేను నా స్వయంకృత మనుభవించుచున్నాను. ఇతరు నెవని గోపింపగలను? 

ఒక్క త్రుటిలో నింద్రసభా సమానమైన రాజ్యము చేత జిక్కినట్లే చిక్కి మాయ మయ్యెను. వనవాసము ప్రాప్తమయ్యెను. దైవ నిర్మిత మెవ డెఱుంగును? బాల భావమున మన వెంట వచ్చెను. ఆమెయును దైవదుర్విపాకమున దుఃఖతరమైన దుర్దశ ననుభవించుచున్నది. సుశీల పతివ్రత యగు నామె నా పట్ల నత్యంతప్రీతితో వర్తించును. అట్టి యామె నేడు లంకేశు నింట నెన్ని బాధలు పడుచున్నదో కదా! ఆ వైదేహి రావణున కెన్నడును వశవర్తిని గాదు. పావన జనకనందిని స్వైరిణివలె నెటుల గాగలదు? 

ఒకవేళ రావణుడు బలాత్కరించినచో సీత ప్రాణములైన వదలును గాని యతనికి మాత్రము స్వాధీన గాదని నా నిశ్చయము. ఆ యసితాపాంగి యగు జానకి మరణించినచో నేను ప్రాణములు వదలుదును. ఆమె గతించిన పిమ్మట నా కీ తనువుతో నేమి పని?''

అని బిట్టు విలపించుచున్న కమలలోచనుడు ధర్మాత్ముడునగు శ్రీరాముని లక్ష్మణు డూరడించి ప్రియహిత వచనముల నిట్లు పలికెను. "ఓ మహాబాహూ! భయ ముడుగుము. నే నా రాక్షసాధముని హతమార్చి వైదేహిని దెత్తును. 

ధీరులు సంపదలందు నాపదలందును ధైర్యమువలన సమభావమున నుందురు. అల్పమతులు కష్టసుఖములందు మునిగిపోదురు. సంయోగ వియోగములు రెండును దైవాధీనములు. ఈ యనాత్మయగు తనువునుగూర్చి యింతగ శోకింపనేల? రాజ్యమునుండి మనకు వనవాస మెట్లు కలిగెనో వైదేహీహరణ మెట్లు సంభవించెనో అటులే మంచికాలము వచ్చినపుడు మనకు మరల సంయోగము కూడ సంభవించును. సుఖదుఃఖములు మనలను వెన్నాడుచుండును. వాని ననుభవించిన గాని యవి తీరిపోవు. 

కావున నో జానకీరమణా! ఇపుడు శోక ముడుగుము. ఇచట పెక్కురు వానరులు గలరు. వారు నలుదెస లేగి సీత జాడ నరసి రాగలరు. పిమ్మట చక్కని మార్గము గుర్తించి అచటి కేగి మనము పరాక్రమముతో నా పాపకర్ముని రూపుమాపుదము. మైథిలిని గొనివత్తము. కాదేని భరతుని ససైన్యముగ సోదరునితో గలిసి రప్పించుదము. అపుడు మన మెల్లరమును కలిసి శత్రువును (రావణుని) పరిమార్చెదము. ఇంతమాత్రాన కూరక శోకింపనేల? 

పూర్వము రఘుమహారాజొక్క రథముతో నేగి యెల్ల దిక్కులను జయించెను. నీ వా రఘువంశ సంజాతుడవు. ఇంక శోకింపతగవు.

నే నొక్కడనే సకల సురాసురులను గెలువజాలినవాడను. ఇక నీవును తోడు నీడగ నుండగ కులపాంసనుడగు రావణుడొక లెక్కయా? అట్లు కాదేవి జనకుని సాయము బడసి సురకంటకు డగు దుష్ట రావణుని అంతమొందింతము. సుఖము తరువాత దుఃఖము, దుఃఖము తరువాత సుఖము రెండును బండి చక్రము వలె తిరుగుచుండెను. ఒక్క దుఃఖముగాని సుఖముగాని రాదు. సుఖ, దుఃఖములు కలిగినపుడు ఎవని మనస్సు భయగ్రస్తమగునో యతడు శోకసాగరమగ్ను డగును. 

అట్టి వానికి సుఖ మెట్లు గలుగును? మున్నింద్రుడు దుఃఖముల పాలుగాగా దేవత లెల్లరు గలిసి యతని స్థానమున నహుషు నుంచిరి. అపుడు సురపతి యంతవాడే భీతిల్లి తన పదము బాసి యొక పద్మము నడుమ పెక్కేడు లజ్ఞాతవాసమున నుండెను. పిమ్మట కాలము రాగా నింద్రుడు మరల తన పదవి తాను బడసెను. నహుషుడు శాపవశమున నజగరమై నేల గూలెను. నహుషు డింద్రాణిని గోరెను. విప్రులను దిరస్కరించెను. 

అందువలన నగస్త్యునిచే నతడు సర్పము కమ్మని శపింపబడెను. కునుక నో సుగుణాభిరామా! తెలివి గలవాడు కష్ట కాలములందు శోకింపగూడదు. అతడు తన పనిలో చిత్తముంచి వర్తింపవలయును. ఓ మహానుభావా! త్రిజగత్పతీ! నీవు సమర్థుడవు. సర్వజ్ఞుడవు. ఒక ప్రాకృత నరునివలె నాత్మ నింతగ క్షోభ పెట్టుకొందువేల? ఈ రీతిగ బలుకు లక్ష్మణుని వచనములచే ప్రబోధితుడై రఘురాముడు అధిక శోకము వదలి శాంత చిత్తుడయ్యెను అని వ్యాసముని జనమేజయునితో పలికెను.

అధ్యాయము 62 నారదుని ద్వారా రాముడు దేవీ నవరాత్రములు ఆచరించుట

శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము

పంచాంగం

No comments:

Post a Comment

Chapter 64 Karmic effect - అధ్యాయము 64 కర్మ ప్రభావము

శ్రీ దేవీ భాగవతం చతుర్థ  స్కంధము - అధ్యాయము 64 కర్మ ప్రభావము జనమేజయుడు సత్యవతీ సుతుడును పరాణజ్ఞుడునైన వ్యాసుని ఈ విధముగ ప్రశ్నించగా వాక్యవిశ...