శ్రీ గురుభ్యోనమః
జై శ్రీ కృష్ణ
ఆండాళ్ తిరువడిగలే శరణం
ప్రియ భగవత్ బంధువులారా!
నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం
పారార్థ్యం స్వం శ్రుతి శత శిర స్సిద్ధ మధ్యాపయంతీ!
స్వోచ్ఛిష్టాయామ్ స్రజినిగళితమ్ యా బలాత్కృత్య భుంక్తే
గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః
ప్రియ భగవత్ బంధువులారా!
ఇప్పుడు మొదటి పాశురం
1. పాశురం
మార్గళిత్తింగళ్ మదినిఱైంద నన్నాళాల్ ,
నీరాడ ప్పోదువీర్! పోదుమినో నేరిళైయీర్!
శీర్ మల్గుO ఆయ్ ప్పాడి శెల్వచ్ శిరు మీర్ కాళ్!
కూర్వేల్ కొడున్ తొళిలన్ నందగోపన్ కుమరన్ ,
ఏరారందకణ్ణి యశోదై యిళం శింగం ,
కార్మేనిచ్చెఙ్గణ్ కదిర్ మది యంబోల్ ముగత్తాన్,
నారాయణనే నమక్కే పఱై తరువాన్ ,
పారోర్ పుగళప్పడిన్దు ఏలోర్ ఎమ్భావాయ్ ॥ 1 ॥
ఇప్పుడు ఈ పాశురం యొక్క అర్థాన్ని చూద్దాం.
మార్గళిత్తింగళ్ మదినిఱైంద నన్నాళాల్
ఇది ఎంతో పవిత్రమైన మార్గశిర మాసం మది నిఱైంద నన్నాళాల్ అంటే ఎంతో చక్కని చల్లని వెన్నెల రాత్రులు. పండు వెన్నెలట. వెన్నెల రాత్రులు తో కూడుకొని ఉందట ఈ మార్గశిర మాసం.
నీరాడ ప్పోదువీర్! పోదుమినో నేరిళైయీర్!
స్నానం చేద్దాం అనే సంకల్పం ఉన్నవాళ్లు రండి. ఓ చిన్న పిల్లలారా, ఓ కన్నె పిల్లల్లారా! రండర్రా అందరూ స్నానం చేయడానికి వెళదాం. అనిది గోదాదేవి గోపిక తో తన స్నేహితులైన గోపికలను పిలుస్తుందట. గోదాదేవి తన స్నేహితులను స్నానం చేయడానికి పిలిస్తుంది అంట. స్నానం అంటే మనం రోజూ, నిత్యమూ చేసే స్నానం కాదు. మనం చేసేది బాహ్య స్నానం. మన శరీరంపై వున్న మలినాన్ని తొలగించడానికి మాత్రమే.కానీ ఇక్కడ గోదాదేవి చెప్పే స్నానానికి అర్థం వ్రత స్నానం. ఈ వ్రత స్నానము మన అంతఃకరణ శుద్ధి కోసం. మనల్ని పవిత్రులను చేస్తుంది. మన మనసులను శుభ్రపరుస్తుంది.
శీర్ మల్గుం ఆయ్ ప్పాడి శెల్వచ్ శిరు మీర్ కాళ్!
సిరులు పొంగిపొరలే వ్రేపల్లె గోపిక లారా! చక్కని ఆభరణములు ధరించిన పడతులారా!
శెల్వచ్ శిరు మీర్ కాళ్!
అంటే ఆభరణాలు ధరించిన వారు అని అర్థం. రేపల్లెలోనట ధనధాన్యాలకి అంతు లేదట. విళ్లకి రత్నాలు, మణులు, మాణిక్యాలు కుప్పలుగా పోసి అమ్ముతారట. గోదాదేవి అంటుందట రకరకాల ఆభరణాలు ధరించిన రమణులారా! నందగోపుని భవనానికి వెళ్లి ఆ చిలిపి కృష్ణుని, చిన్ని కృష్ణుని కలుసుకుందాం రండి. అంటే రేపల్లెలో సిరులు పొంగిపొర్లుతాయట. అంటే సంపదలు రేపల్లెలో నిండుగా అంట. అలాంటి రేపల్లెలో జన్మించినటువంటి యుక్తవయసులో ఉన్న పడుచు పిల్లల్లారా! ఇప్పుడు వ్రత స్నానం చేయడానికి వచ్చే పిల్లలు అందరూ కూడా గోపికలందరూ కూడా పదహారేళ్ల పడుచుపిల్లలే. అలాంటి యువతుల్లారా, మేలి ఆభరణాలు ధరించిన మేల్బంతులారా! రండి రండి అని పిలుస్తుందట గోదా గోపిక.
అదేంటండీ స్నానానికి వెళుతూ ఆభరణాలు వేసుకోవడం ఏమిటీ ! నగలు వేసుకొని స్నానానికి వెడతారా ఏమిటి! ఎవరైనా మరీ గొప్ప కాకపోతే, అంటే ఇక్కడ నగలు, ఆభరణములు అంటే భక్తి, జ్ఞాన, వైరాగ్యాలే వారికి ఆభరణాలట.
కూర్వేల్ కొడున్ తొళిలన్ నన్దగోపన్ కుమరన్
చిన్ని కృష్ణుడు నందగోపుని భవనంలో ఉన్నాడు. ఆ భవనానికి స్వయంగా నందుడే ఒక వేలాయుధాన్ని అంటే పదునైన బల్లెం పట్టుకొని కాపలాగా ఉన్నాడట. ఎందుకు? ఎవరైనా రాక్షసులు మారువేషాల్లో వచ్చి చిన్ని కృష్ణుడికి హాని తల పడతారేమో అని భయం. గతంలో కూడా పూతన, శకటాసురుడు మొదలైన రాక్షసులు వచ్చి కృష్ణుడికి హాని తలపెట్టబోయి వాళ్లే మరణించారు. వాళ్లే బ్రతికి తిరిగి వస్తారో లేకపోతే కొత్త వాళ్ళు ఎవరైనా హాని తలపెట్టడానికి వస్తారో అని భయంతో తానే స్వయంగా కాపలాగా ఉన్నాడు. అలాంటి భవనంలోకి తామెలా వెళ్లి కృష్ణుని కలుస్తారు?
ఏరారందకణ్ణి యశోదై ఇళమ్ శింగం
శ్రీకృష్ణుడు అతి సుందరమైన కళ్ళతో ఉన్న యశోదా దేవి ఒడిలో పడుకొని సింహం పిల్లలాగా (ముద్దుల బాల సింహం) దుముకుతూ గంతులేస్తూ ఉన్నాడట. యశోదా దేవిని ముప్పుతిప్పలు పెడుతున్నాడట. కానీ అలాంటి అల్లరి కృష్ణుడు అక్కడ నంద భవనంలో నందుడి దగ్గర అయితే బిక్క మొఖం వేసుకొని భయంతో అమాయకంగా ఉంటాడట. ఇక్కడైతేనో యశోదాదేవి దగ్గరైతే చలాకీగా ఉంటాడట.
కార్మేనిచ్చెజ్గణ్ కదిర్ మది యంబోల్ ముగత్తాన్
మన గోపికలు శ్రీకృష్ణుడి రూపాన్ని, స్వభావాన్ని వర్ణిస్తున్నారుఅట. కారు మేఘాల్లాగ ఆయన నీల మేఘ శ్యాముడట.తామరలవంటి ఆయన రెండు కళ్ళు కూడా సూర్యచంద్రులట. అందమైన ముఖమట. అదేమిటండి సూర్యుడు చంద్రుడు కళ్ళు ఏంటండి. మనం ఆ పరమాత్ముని విశ్వరూపాన్ని దర్శిస్తే అప్పుడు మనకు తెలుస్తుంది ఏమిటా సూర్యుడు చంద్రుడు రెండు కళ్ళు ఏమిటన్నది….
భగవద్గీత పదకొండవ అధ్యాయం విశ్వరూపసందర్శనయోగం లో 19 వ శ్లోకంలో చెప్పారు.
అనాదిమధ్యాంత మనంతవీర్యమ్
అనంతబాహుం శశిసూర్య నేత్రం
పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం
స్వతేజసా విశ్వమిదం తపంతమ్
నీవు ఆదిమధ్యాంతరహితుడవు. అంటే నీకు తుది మొదలు లేదు.అపరిమిత శక్తి శాలివి. ఎన్నో భుజాలు కలవాడివి. సూర్య చంద్రులే నేత్రములుగా కలవాడివి.అగ్ని వలె నీ మొఖం వెలుగుతుంది. నీ తేజస్సు వల్లే ఈ లోకాలన్నీ వేడిగా ఉన్నాయి. అన్నీ నేను చూస్తున్నాను. అని అర్జునుడు చెప్తున్నాడు శ్రీకృష్ణుడితో.
ఒక్క మాట ఇక్కడ భగవంతున్ని గోదాదేవి ఎలా వర్ణన చేస్తుందో చూడండి.
నారాయణనే నమక్కే పఱైతరువాన్
ఆ నారాయణుడే, ఆ శ్రీకృష్ణుడే వ్రతం చేయదలచిన మనకి పర అనే వాద్యాన్ని ఇచ్చే వాడట. అంటే ఇక్కడ పర అంటే మోక్షం అని అర్థం చేసుకోవాలి. మనకి ఇహ, పరాలను ఇచ్చేవాడు ఆ శ్రీ కృష్ణుడే. అంటే ఆ నారాయణుడే. మనకి మోక్షాన్నిచ్చే వాడు ఆ పరమాత్మేనె కదా. ఆ పరమాత్మను కలవాలి మోక్షాన్ని పొందాలి అంటే తను ఒక్కర్తే వెళ్లి ఆ శ్రీకృష్ణుడ్ని కలుసుకొని మోక్షాన్ని పొందొచ్చు అన్ని చెప్పుతున్మ్నారు. మరి అందరిని ఎందుకు పిలవడం అంటే ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు ఒకరు వెళ్లి చేసే కంటే పది మందితో కలిసి వెళ్లి చేస్తే ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. అందులో ఆ గోపికలు ఎవరు? ఎన్నో వేల మంది గోపికలు శ్రీ కృష్ణుని దర్శనం కోసం వెళుతున్నారట వారంతా చాలా కృష్ణునికి భక్తులట. వారు వారి గత జన్మలలో యక్షులు, మొదలైన వారు ఆ జన్మలలో భగవంతుని దర్శనం చేసుకోలేక, మోక్షాన్ని పొందలేక ఆ పరమాత్మ దూరంగా ఉండడం చేత మళ్లీ తిరిగి గోపికలుగా ఇప్పుడు జన్మ తీసుకొని అంతా కలిసి ఆ శ్రీకృష్ణుని, ఆ పరమాత్మని చూడటానికి తాపత్రయపడుతున్నారట.
ఆ తల్లి ఆ గోదాదేవి తనను ఒక గోపికగా భావించడమే కాకుండా అలా గోపిక లాగా అంటే ఒక గొల్ల పిల్ల లాగా తయారై, గోపికలు చీర కట్టుకొని కుడి పైట వేసుకుంటారట. అప్పుడు గోదాదేవి కుడి పైట వేసుకొని, తల ముడి వేసి ఎడమ వైపుకు కొప్పు పెట్టుకుంది. ఆ కొప్పుకి పూలదండ పెట్టుకొని ఆ పూల తోటలో గల బావిలో తన నీడను చూసుకొని అబ్బ ఎంత బాగుందీ పూలదండ అనుకొని ఆ పూలదండనే స్వామికి సమర్పించేదట. అప్పుడు స్వామితో ఇలా అన్నిందన్ట నా స్నేహితురాల్లని గోపికలుగా భావించి, ఈ ఆలయాన్ని నందగోపుని భవనం గా భావించి ఈ వ్రతాన్ని ఆచరించిందట.
మొత్తం సుమారుగా 5 లక్షల మంది గోపికలు రేపల్లె నుంచి రేపల్లె చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా బయలుదేరుతున్నారట. ఆ కృష్ణ పరమాత్మ దర్శనం కోసం. గోదాదేవి ఆ వటపత్రసాయిని అడుగుతుందట. నాకు ఎలాగైతే మోక్షాన్ని ప్రసాదించావో అదేవిధంగా నీ భక్తులకు, నిన్ను శరణాగతి పొందిన వారికి కూడా మోక్షాన్ని ప్రసాదించాలి సుమా! అని ఆ పరమాత్మని వేలుపెట్టి చూపించి మరీ అడుగుతుందట.
పారోర్ పుగళప్పడిన్దు ఏలోర్ ఎమ్బావాయ్.
అంటే ఆ పరమాత్మని చూద్దామనుకునే వారందరూ కూడా ఆయన్ని ప్రార్థన చేయడానికి, స్తోత్రం చేయడానికి ఈ వ్రతం చేయడానికి రండి. అందరం కలిసి ఈ వ్రతం చేసి తరిద్దాం అని పిలుస్తుందట ఆ గోదాదేవి.
ఇక్కడ ఇంకో గమ్మత్తయిన విషయం ఏమిటంటే ఏలోర్ ఎంబావాయ్ అన్నది మనకి ప్రతి పాశురం లో కూడా ముప్పై పాశురాల్లో కూడా చివరగా ఒక మకుటం లాగా వస్తుంది. మనకి చూడండి సుమతీ శతకం, వేమన శతకం చూసినట్లయితే ఆఖర్లో ప్రతి పద్యానికి విశ్వదాభిరామ వినురవేమ, లేదంటే -గదరా సుమతీ అని వస్తుంది కదా అలాగన్నమాట.
మీరందరూ వస్తే కలిసి వెళ్లి శ్రీవ్రతాన్ని చేద్దాం అని అర్థం. మరి ప్రతి రోజూ మనం అని 30 రోజులు, 30 పాశురాల్లో కూడా పారాయణం చేద్దాం అని చెప్పిందట. మోక్షాన్ని పొంది ఎప్పుడు వీళ్ళు అనే ప్రశన్న మనకి వచింది కదా? అంటే నిరంతరము కృష్ణుడితో గడపడమే స్నానం గా భావించాలి.
ఆండాల్ తిరువడిగళే శరణం
No comments:
Post a Comment