తిరుప్పావై రెండవ పాశురము
నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం
పారార్థ్యం స్వం శ్రుతి శత శిర స్సిద్ధ మధ్యాపయంతీ!
స్వోచ్ఛిష్టాయామ్ స్రజినిగళితమ్ యా బలాత్కృత్య భుంక్తే
గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః
ఈ రెండవ రోజు 2వ పాశురం
మనం మొదటి పాశురంలో.. మనకి మోక్షాన్ని ప్రసాదించేవాడు ఆ పరమాత్మ ఒక్కడే అని తెలుసుకున్నాం.
నారాయణే నమక్కే పరై తరువాన్
ఆ నారాయణుడు ఒక్కడే మనకు మోక్షాన్ని ప్రసాదించేవాడు. మనం ఆ పరమాత్మని పొందాలంటే ఆయన నామాన్ని జపిద్దాం. అందరూ కలిసి వెళ్లి ఆయన దర్శనం చేద్దాం. అని చెప్పుకున్నాం. ఇప్పుడు రెండో పాశురం చూద్దాం. రెండో పాశురములో ఈ వ్రతం చేయడానికి కావలసిన విధి విధానాలు, చెయ్యవలసినవి, వదలవలసినవి ఆండాళ్ తల్లి మనకు చెబుతుంది.
చ్చెయ్యుమ్ కిరిశైగళ్ కేళీరో పార్కడలుళ్
పై యత్తు యిన్ర పరమనడిపాడి
నెయ్యుణ్ణోమ్ పాలుణ్ణోమ్ నాట్కాలే నీరాడి
మైయిట్టెళుదోమ్ మలరిట్టు నాముడియోమ్
శెయ్యాదన శెయ్యోమ్ తీక్కురళై చ్చెన్రోదోమ్
ఐయ్యముమ్ పిచ్చైయుమ్ ఆన్దనైయుమ్ కైకాట్టి
ఉయ్యు మారెణ్ణి యుగన్దేలో రెమ్బావాయ్. ! || 2 ||
ఇప్పుడు ఈ పాశురం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం
వైయత్తు వాళ్ వీర్గాళ్ -
ఓ భాగ్యవంతులారా! దుఃఖముతో కూడుకున్నటువంటి ఈ సంసారం లో కూడా ఆనందాన్ని అనుభవిస్తున్న అదృష్టవంతులారా! ఈ లోకం దుఃఖమయం కదా!, ఆనందం ఎక్కడిదీ అంటే.. ఎప్పుడైతే మీ మనసు ఆ పరమాత్మ వైపు మళ్ళిందో.. అప్పుడే మీరు ఆనందంతో ఉన్నట్టు లెక్క. సాక్షాత్తూ ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే భూమ్మీద అవతరించాడు. ఏ విధంగా మీరు మీ పాపములను పోగొట్టుకుని భగవంతుని చేరగలరో ఆ విధానాన్ని తెలుసుకోండి.
నామం నం పావైక్కు
నోము చేయడానికి అంటే ఈ వ్రతం చేయడానికి కావలసినటువంటి విధానాలు చెప్తాను వినండి.
శెయ్యుం కిరిశైగళ్ - కేళీరో
వినండి ఏం చేయాలో చెప్తాను. ఏమర్రా వింటున్నారా! వినండి.
పాఱ్కడలుళ్ పైయత్తు యిన్ర పరమన్ అడిపాడి
పాల సముద్రంలో శేష శయ్యపై యోగ నిద్రలో నిద్రిస్తున్నటువంటి ఆ స్వామి యొక్క, ఆ పురుషోత్తముని యొక్క చరణాలమీద, పాదాలమీద పాడండి. మీకు ఎంత బాగా వస్తే, ఎంత చక్కగా పాడగలిస్తే అంత చక్కగా పాడండి. పాడుతూ వ్రతం చేయడానికి వెళదాం రండి. ఆయన పాల సముద్రం పై ఉండగానే.. ఆయన గురించి పాడితే.. అక్కడే ఆ తల్లి కూడా, ఆ లక్ష్మీదేవి కూడా ఆ స్వామి పాదాలను వత్తుతూ ఉంటుంది. కనుక ఆ సమయంలో చక్కగా పాడితే ఆ తల్లి అనుగ్రహం కూడా మనకి కలుగుతుంది. లక్ష్మీదేవి దగ్గరే ఉంటాడు కాబట్టి అప్పుడే మనకు స్వామి దొరుకుతాడు. ఇప్పుడు మనం అందరం కలిసి ఆ శ్రీ కృష్ణ నామాన్ని పాడుదాం.
నెయ్యుణ్ణోమ్ పాలుణ్ణోమ్ నాట్కాలే నీరాడి
బిడ్డ అడిగింది ఏదైనా సరే తల్లి ఇవ్వకపోతే ఆ పిల్లవాడు ఎలాగైతే మారాం చేస్తాడో, అలుగుతాడో అలాగే మేము నెయ్యి తినము, పాలు తినము అంటుందట ఆ తల్లి. పాలు తినడం ఏమిటండీ! మరీ విడ్డూరం కాకపోతే; గొల్లలు కదండీ. వాళ్ళ మనసు నిండా కూడా కృష్ణ పరమాత్మ నిండి ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడుతారో, ఏమి చేస్తారో కూడా వాళ్ళకు తెలీదు. మనం పండగ వస్తే పాలు, నేతితో కలిపి పిండి వంటలు చేసుకుంటాం కదా! అంచేత స్వామి మాకు కనిపించే వరకు కూడా మేము పిండి వంటలు తినము. నెయ్యి, పాలు, పాల పదార్థాలు ఏవి కూడా వాడము అని చెప్తుందట ఆండాల్ తల్లి.
మైయిట్టు ఎళుదోం మలరిట్టు నామ్ ముడియోమ్
అంటే మేము కళ్లకు కాటుక పెట్టుకోం, తలలో పూలు ముడుచుకోం అని అంటుంది. ఎందుకట భగవంతుడు తనకు దూరంగా ఉన్నప్పుడు, మన మీద అనుగ్రహం లేనప్పుడు, మనకి ఏ విషయాల్లోనీ కూడా ఆసక్తి ఉండదు.
శెయ్యాదన శెయ్యోం తీక్కుఱళై శెన్రు ఓదోమ్
ఏది చేయాలో అది చేస్తాం. ఏది చేయకూడదో అది చెయ్యం. పెద్దలు చెప్తారు కదా మనకు ఏ పని చేస్తే మంచిదో, ఏ పని చేస్తే చెడ్డదో. అందుకే పెద్దలు చెప్పిన దార్లోనే నడుస్తాం. ఎవరి మీద చాడీలు చెప్పం. లేనిపోనివి చెప్పం.
ఆయముం పిచ్చెయుం ఆందనైయుం కైకాట్టి
దానధర్మాలు చేస్తాం. పేదలకు అన్నదానం చేస్తాం. జీవితంలో శక్తికి మించి తోడివారి సుఖానికి పాటుపడదాం. అంతా నాదే, నా కోసమే అన్న భావన పోవాలి. అంతా వాడిదే. వాడి కోసమే మనం.. అన్న భావన పెంచుకోవాలి. సర్వం విష్ణుమయం జగత్ అని అనుకుంటే అప్పుడు ఈ జగత్తులో నీదంటూ ఏమీ ఉండదు. దానధర్మాలు పుచ్చుకునేవారు తృప్తి చెందే వరకు ఇయ్యాలి. (మనకి అవకాశం ఉంటే). పెద్దలను గౌరవిస్తాం. పండితులను సన్మానిస్తాం. ఇలా ఎన్నెన్నో పెద్దలు చెప్పిన అన్ని రకాలయినటువంటి మంచి పనులు చేస్తాం అని చెప్తున్నారు ఈ రెండో పాశురంలో.
ఉయ్యుమాఱ్ ఎణ్ణి ఉగన్దు ఏలోర్ ఎమ్బావాయ
ఈ వ్రత విధానాన్ని తెలుసుకొని వ్రతాన్ని ప్రారంభించండి. ఈ రెండవ పాశురములో మనకి 9 నియమాలు చెప్పారు. అవేంటో ఒక్కసారి పరిశీలిద్దాం.
1. మనం చేయవలసింది పాలసముద్రంలో యోగనిద్రలో ఉన్న ఆ పరమాత్మ యొక్క పాదాలను కీర్తించడం
2. బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేయడం.
3. తిరువారాధన
4. ప్రసాదంలో తప్ప.. పాలు నెయ్యి తీసుకోకుండా ఆహార నియమాలు పాటించడం
5. కంటికి కాటుక పెట్టుకోకుండా ఉండటం
6. తలలో పువ్వులు పెట్టుకోకుండా ఉండడం.
7. పెద్దలు చెప్పిన మంచి పనులు చేస్తాం
8. ఎదుటి వారిపై అదేపనిగా చాడీలు చెప్పం. ఆత్మస్తుతి, పరనింద పనికిరావు. సీతాదేవి కూడా తాను లంకలో పడిన బాధలు రామునికి ఎప్పుడూ చెప్పుకోలేదట.
9. దాన, ధర్మాలు చేయ్యడం.
No comments:
Post a Comment