Thursday, April 9, 2026

Chapter 4 Sri Vyasa Maharshi's longing for a son - అధ్యాయము 4 శ్రీ వ్యాసమహర్షి పుత్త్ర సంతతికై పరితపించుట

శ్రీ దేవీ భాగవతం ప్రథమస్కంధము - అధ్యాయము 4

శ్రీ వ్యాసమహర్షి పుత్త్ర సంతతికై పరితపించుట


ఋషు లిట్లనిరి: ఓ సౌమ్యా! ఈ పురాణసంహితను వ్యాసునివలన పఠించిన శుకుడెట్టివాడు? వ్యాసుని యే భార్యయందీతడు జన్మించెను. నీవు శుకు డయోనిజుడని యరణి సంజాతుడని వచించితివి. ఈ విషయమై మాకు సందియము గల్గుచున్నది. కనుక శుకుని జన్మవృత్తాంతము వివరించి మా సందేహము బాపుము. మహాతపస్వియగు శుకుడు గర్భయోగియని మేము వింటిమి. అత డీ విస్తృతమగు పురాణమెట్లు వినగలిగెను? 

సూతు డిట్లనియె: ఒకానొకప్పుడు సత్యవతి సుతుడగు వ్యాసుడు సరస్వతీ నదీ తీర మందొక యాశ్రమమున నివసించుచుండెను. అచ్చటనున్న రెండు గోరువంకలను చూచి వ్యాసుడు విస్మయమొందెను. ఆ పక్షులు గ్రుడ్డునుండి యప్పుడే వెడలిన తమ ఱక్కలురాని పిల్లను గూటిలోనే వదలినవి. దాని ముక్కెఱ్ఱగ నున్నది. దానికింకను తోక యీకలు రానేలేదు. అది యెంతయో చూడ ముచ్చట గొల్పుచున్నది. ఆ పిట్టల జంట తమ సంతానమునకు భక్ష్య మందించుట కాసక్తితో పూనుకొనెను. అవి తమ ముక్కుపుటములతో మెతుకులు దెచ్చి దెచ్చి తమ పిల్లనోటిలో మాటిమాటికి పెట్టుచుండెను. అవి తమ యంగములతో దాని యంగములు తాకుచు దాని యెఱ్ఱని ముద్దులు గారు మోమును పలుమారు ప్రేముడితో ముద్దిడుకొనుచు సంబరము పడుచుండెను. ఇట్లా పక్షులు రెండును తమబిడ్డపై చూపు ప్రేమను గని వ్యాసుడు చింతాతురుడై నెమ్మది నిట్లు తలపోయసాగెను: 

'ఆహా! తిర్యగ్జంతువులు సైతము తమ పుత్త్రులపై గుండెనిండిన ప్రేమను గురియునుగదా! ఇంక సేవాఫలమాశించి తమ పుత్రులను ప్రేమించు మానవులలో నిదియుండు ననుటలో వింత యేమున్నది? ఈ పక్షులు తమ పుత్త్రునకు సుఖసాధనమగు పెండ్లి జరిపి తమ కోడలి యందాల మోముగాంచి సంతసించునా?

ఈ పక్షి శాబకము ధర్మమతితో పున్నెము బడయగోరి తన ముదుసలి తల్లిదండ్రులను పూలలోబెట్టి పూజించి వారిని ప్రసన్నులను చేయజాలునా? డబ్బు గడించిన తన తల్లిదండ్రులను తృప్తిపఱచునా? అవి చనిపోవగా వానికిది యుత్తర క్రియలు నెరవేర్చునా? గయకేగి గయాశ్రాద్ధ మాచరించునా? తన పితరుల నుద్దేశించి సక్రమమున నీల వృషోత్సర్జనము జరుపునా? పుత్త్రునంగములు నిమిరి ముద్దిడి లాలించి బుజ్జగించి పుత్త్రగాత్ర పరిష్వంగ సుఖంబు సేకొనుటయే తల్లిదండ్రుల కీ ప్రపంచమం దుత్తమోత్తమ సుఖము సేకొనుటని పెద్దలు నొక్కి వక్కాణింతురు. పుత్త్రులు లేనివారికి సద్గతులు గలుగ నేరవు. స్వర్గము లభించదు. కనుక పరలోకము జేరుటకు పుత్త్రుల బడయుట కంటె వేరొండు సాధనము గనిపించదు. పుత్త్రవంతుడే స్వర్గసీమ నలంకరించగలడు. పుత్త్రహీనుడు దానిని జేరజాలడని ఎల్ల ధర్మశాస్త్రములయు మన్వాదిమునులయు వచనము. పుత్త్రవంతుడే సకల దురిత బంధములనుండి విముక్తుడగు ననుటకు శాశ్వతమైన యాప్తవచనమగు వేదమును సాక్ష్యముగ నున్నది. ఈ విషయము సందేహించుట కెంతమాత్రము వీలులేదు. చావు మొగముతో నున్నవాడు భూశయనము సేయబడియు తానపుత్త్రకుడగుటను గూర్చి చింతాకులుడై లోలోన వగచి వగచి కుమిలి కుమిలి యిట్లు పొగులు చుండును. ''నేడు నా యీ గృహము ధనధాన్య రాసులతో పెక్కు విధములగు పాత్ర పుంజములతో కలకల లాడుచున్నది. దీని కికముందు ఎవడు స్వామి కాగలడో గదా!'' అని యిట్టు లా పుత్త్రహీనుని మనస్సు దుఃఖమున పరిపరి విధముల పరిభ్రమించు చుండును. అత్తఱి నట్టి వ్యాకుల చిత్తునకు దుర్గతులు గా కింకేమి గల్గును!

ఇటుల సత్యవతీ సుతు డనేక విధముల చింతించి వేడినిట్టూర్పులు నిగుడించెను. విమనస్కుడయ్యెను. వ్యాసుడట్లు కొంతతడవాలోచించి తుదకు మేరుగిరిపై నుగ్రతప మాచరించుటకు నెమ్మదిలో గట్టిగ నిశ్చయించుకొనెను. నే నిపు డేదేవత నుపాసించవలయును? వరములు గురియుటలో నే దేవత సమర్థురాలు? ఏ దేవి త్వరితగతిని వాంఛితార్థము లీడేర్చగలదు? అని వ్యాసుడు విత్కరించుకొనుచుండెను. శ్రీ గణపతి బ్రహ్మ విష్ణువు మహేశుడు రవి వరుణుడు సురేంద్రుడు సుబ్రహ్మణ్యుడు అగ్ని-వీరలలో నే నెవ్వరి నారాధించవలయును? అని వ్యాసుడు తలంచుచుండు నంతలోనే నిర్మలాత్ముడు మునిసత్తముడునగు నారదుడు చేత మహతిబూని యాదృచ్ఛికముగ నట కరుగుదెంచెను. అంత వ్యాస మహర్షి దేవర్షిని సందర్శించి ప్రసన్నుడై యతనిని గూర్చుండ నియోగించి అర్ఘ్యపాద్యాది విధుల సత్కరించి కుశల మడిగెను. కుశల ప్రశ్నములైన పిమ్మట నారదుడు వ్యాసున కిట్లనియెను: ఓ ద్వైపాయనా! నీవేల చింతాకులుడవై కనిపించుచున్నావు? నాకంతయు వేగమే తెలుపుము.

వ్యాసుడిట్లనెను: సంతానము లేనివానికి సద్గతులు గలుగవు. వాని యాత్మకు శాంతియును గలుగదు. అందులకే నేనును చింతించుచు పలుమారు విలపించుచున్నాను. సంతతి బడయుటకు నే నేదేవతను ప్రసన్ననుగా చేసికొనవలయును? సకలార్థము లొసగు దేవి యెవ్వరనునది తెలియక విచారించుచున్నాను. ఆ విషయము తెలుపుమని నిన్నే శరణు వేడుచున్నాను. మహర్షీ! నీవు దయగలవాడవు. సర్వజ్ఞుడవు. నే నేదేవతను శరణువేడిన ఆమె సుప్రసన్నయై త్వరగ నాకు పుత్రుని ప్రసాదించగలదో తెలుపుము. 

సూతుడిట్లనియె: అటుల వ్యాసుడడుగగా వేదవిదుడు నారదుడు పరమప్రీతితో నతని కీ ప్రకారముగ సమాధానము నొసగెను. 

నారదుడిట్లనియె: ఓ మహాభాగా! పారాశర్యా! నీవు నన్నడిగిన ప్రశ్ననే నా తండ్రి బ్రహ్మ తొల్లి మధుసూదను నడిగెను. నా తండ్రియగు బ్రహ్మ ధ్యానమున మునింగి శ్రీనాథుడు జగత్పతి దేవేశుడునగు శ్రీహరిని సందర్శించి విస్మయమంది యతని నుతించుచు నిట్లనియెను. ఆ హరి చతుర్భుజుడు. శంఖ చక్ర గదా పద్మధరుడు. పీతాంబరుడు. కౌస్తుభ మణి ప్రభలు దీపిల్లువాడు. దివ్య శ్రీవత్సాంకితమైన వెడదఱొమ్మువాడు. సకలలోక శరణ్యుడు దేవదేవుడు జగన్నాథుడు విశ్వగురుడు మహాతపుడునగు శ్రీహరియు తపమొనర్చుచుండగా జూచి యతనిని నా తండ్రి శరణు వేడెను. 

బ్రహ్మ యిట్లనెను: ఓ జగన్నాథా! నీవు దేవేశుడవు. భూత భావి వర్తమానములపై నధికారముగల ప్రభువవు. నీవేరిని గూర్చి తపించుచున్నావు? ఏ పరతత్త్వమును ధ్యానించుచున్నావు ? అఖిల జగత్ప్రభుడవగు నీవే ధ్యానము చేయుచున్నావే. దీనిని మించిన యాశ్చర్యకర మేమున్నది? నాకిదంతయు వింతగ దోచుచున్నది. నీ బొడ్డుతమ్మినుండి పుట్టిన నేనే యీ విశ్వమునకు సృష్టికర్తను. ఇంక నీకంటె నధికుడెవడైన నున్నచో వానిని గూర్చి నాకు తెలుపుము. నీవే యీ లోకముల కన్నిటికిని కర్తవు భర్తవు హర్తవు. సర్వకారణములకు నీవు మూలకందము. సర్వ కార్యదక్షుడవు నీవే యని నేను బాగుగ నెఱుగుదును. నీ సంకల్ప బలముననే నే నీ జగములు రచింప శక్తుడనైతిని. ఆ హరుడును లయకాలమున నీ కోరికమేరకే లోకములనెల్ల సమయింపజాలును. నీ యాజ్ఞ చేతనే నింగిపై వేవెలుగు భ్రమించుచున్నాడు. వాయువు చల్లగా వెచ్చగా వీచును. అగ్ని ప్రజ్వలించును. మేఘము వర్షించును. నిన్ను మించిన పరదైవతమును నేనీ ముల్లోకములందింతకు ముందు చూచి యెఱుగను. అట్టి నీవును ధ్యానమున నుండుట జూడగ నాకు గొప్ప సందియము గలుగుచున్నది. నేను నీకు పరమ భక్తుడను. నాపై దయదలచి నాకంతయును తేటతెల్లముగ దెలుపుము. మహాత్ములకు తఱచుగ తెలుపరాని రహస్యములుండవని స్మృతి పలుకును.

అను బ్రహ్మ వినయవాక్కులు విని హరి యతనికిట్లు పలికెను: వత్సా! ఏకాగ్ర చిత్తమున నాలకింపుము. నా మనోగతమును వెల్లడించుచున్నాను. నీవీ యెల్లలోకములను పుట్టించువాడవని నేను పోషకుడనని రుద్రుడు సంహారకుడని నీవు దలంచుచున్నావు. సకల సురాసురులు మనుజులు నట్లే తలంతురు. నీవీ యెల్ల భువనములు పుట్టించుటకును నేను పెంచుటకును హరుడు ద్రుంచుటకును కారకులము. ఐనను వేదపారగులగు మహాశయులీ సర్వ మొకేమూలప్రకృతి - పరాశక్తి - మూలమున జరుగుచున్నదని భావింతురు. ఈ లోకములెల్ల పుట్టించుటకు నీయందు రాజసశక్తియు పెంచుటకు నాలోన సత్త్వశక్తియు త్రుంచుటకు హరునియందు తామస శక్తియు గలదని శాస్త్రమున చెప్పబడియున్నది.

ఆ మహత్తరశక్తియే లోపించినచో నీవు సృష్టి కృత్యమును జేయజాలవు. నేను పరిరక్షింపనోపను. హరుడు దెగటార్ప నశక్తుడు. మనమెల్లరమా దివ్యపరశక్తికి పరతంత్రులమై వర్తింతుము. దీనినిగూర్చి ప్రత్యక్ష పరోక్ష ప్రమాణములును గలవు, వినుము. నేను ప్రళయకాలమునందు పరతంత్రుడనై శేషశయ్యపై యోగనిద్రంజెందుదును. మరల కాలవశుండనై తగిన సమయము వచ్చినపుడు మేల్కాంతును. ఆ దేవికి వశుడనై నే నెల్లకాలమును తపమాచరించుచుందును. ఒక్కొక్కప్పుడు శ్రీ లక్ష్మితోడ యథా సుఖముగ విహార మొనర్చుచుందును. ఒక్కొక్కతఱి క్రూరదానవులతో దారుణము సర్వలోకభీకరమునై దేహములను నింద్రియములను బాధించు సమరము జరుపుదును. మున్ను నేను మహాజలరాశిపై నైదు వేలేండ్లు ఘోర బాహుయుద్ధము సలిపితిని. అది నీకు ప్రత్యక్ష విదితమేగద! నా చెవులమలమునుండి పుట్టి మదమున విఱ్ఱవీగిన మధుకైటభులను దుష్టదానవులా దేవదేవి దయవలననే నాచే దనుమబడిరి. ఆనాటి నా విజయశ్రీకి కారణము నీ వెఱుంగవా? ఓ మహాభాగా! ఆ పరాత్పర శక్తియే దానికి మూలకారణము. అట్టి శక్తిగూర్చి పదేపదే ఏల యడుగుదువు? ఆమె ఇచ్ఛ చేతనే నేను మొదట మణి ద్వీపమున స్త్రీరూపమునుండి అనంతరము సముద్రమున పుం రూపమున విష్ణుడనై విహరించుచున్నాను. ఆ తల్లి దయవలననే గదా యుగయుగమున కూర్మ వరాహ నరసింహాద్యవతారములు దాల్చుచుందును. ఈ తిర్యగ్యోనులందు పుట్టుట కెవ్వడిచ్చగించును? నాకే స్వేచ్ఛయున్నచో వరాహాది యోనులందు నేనేల జన్మింతును? లక్ష్మితోడి వినోదవిహారములు వదలి చేప మున్నగు నీచయోనులందు బుట్టుట కెవ్వనికి మనసొప్పును? పాపఱని సెజ్జవదలి గరుత్మంతుని మూపుపైనెక్కి స్వతంత్రేచ్ఛతో ఏవాడు బవరమొనర్ప నుత్సహించును? మునుపొకప్పుడు నీవు చూచుచుండగనే వింటి యల్లెత్రాటిచేత నా తల తెగిపడినదిగదా! శిల్పనిపుణుడగు త్వష్ట వెనువెంటనే గుఱ్ఱముతలదెచ్చి నా మొండెమున కతికించెను. ఆనాటి నుండి నన్ను హయగ్రీవుడనుచున్నారు. ఇదంతయును లోకవిడంబనమేసుమా! నా కాత్మ స్వాతంత్య్రమే యున్నచో నిట్లెట్లు జరుగును? కాన నేను స్వతంత్రుడనుగాను. సర్వవిధముల శక్తి పరతంత్రుడను. అందుచేత నేనా శక్తినే రేయింబవళ్లెడతెగక ధ్యానించుచుందును. ఇంతకుమించి నాకేమియు తెలియదు. 

నారదుడిట్లనియె: ఈ ప్రకారముగ విష్ణువు బ్రహ్మతో బలికెను. ఓ వ్యాసమునీ! నేనా బ్రహ్మవలన సర్వము వింటిని. కనుక నీవును నిత్యకల్యాణ ప్రదమగు పురుషార్థ ప్రాప్తికి బూనుకొని ఆ దేవీ పదకమలములను నీ హృదయారవిందమున నిరంతరము భజింపుము. నీవు కోరినదెల్ల ఆ తల్లియే ప్రసాదించుచుండును. ఇందు సందియ మావంతయును లేదు. 

సూతు డిట్లనియె: నారదుడీవిధముగ దెలుపగా వ్యాసుడా దేవి దివ్యచరణారవిందములను లోనిడెందమున దలంచుచు తపము చేయుటకు పర్వతము జేరెను.

అధ్యాయము 5 శ్రీ హయగ్రీవావతారవర్ణనము

Chapter 3 Details about the Puranas and Vyasas - అధ్యాయము 3 పురాణములను-వ్యాసులను గుఱించిన వివరములు

శ్రీ దేవీ భాగవతం ప్రథమస్కంధము - అధ్యాయము 3

పురాణములను-వ్యాసులను గుఱించిన వివరములు

సూతుండిట్లనియె :
ఓ మునులారా! సత్యవతీ తనయుడగు వ్యాసమహర్షి వలన నేను సకలపురాణములను వింటిని. వానిని మీకు చెప్పుదును. మీ రెల్లరును కడు శ్రద్ధగా నాలకింపుడు. మకారము మొదటి యక్షరముగా గల పురాణములు రెండు. భకారము తొలుత గలవి రెండు. బ్రకారము మొదట గలవి మూడు. వకారము ముందుగలవి నాలుగు. ఇవికాక అ-నా-ప-లిం-గ-కూ-స్క అను నక్షరములు ముందుగల వేరువేరు పురాణములు గలవు. వీనిలో మొదటిది మత్స్యపురాణము. ఇది పదునాలుగు వేల శ్లోకములలో వ్రాయబడినది రెండవది మార్కండేయ పురాణము. ఇది అత్యద్భుతమైనది. ఇందు తొమ్మిదివేల శ్లోకములు గలవు. భవిష్య పురాణమునందు పదునాల్గువేల యైదువందల శ్లోకములు గలవు. శ్రీ మహాభాగవతము పదునెనిమిదివేల శ్లోకములతోను బ్రహ్మపురాణము పదివేల శ్లోకములతోను విలసిల్లుచున్నవి. బ్రహ్మాండ పురాణ మందలి శ్లోకసంఖ్య పండ్రెండు వేల యొకవంద. బ్రహ్మవైవర్త పురాణమందలి శ్లోక సంఖ్య పదునెనిమిదివేలు. వామన పురాణమందు పదివేల శ్లోకములును వాయు పురాణమునందు నిరువది నాలుగువేల యారువందల శ్లోకములును గలవు. శ్రీ విష్ణు పురాణము మహాద్భుతమైనది. అది యిరువది మూడువేల శ్లోకములతో నొప్పారుచున్నది. పరమాశ్చర్యకరమైన వరాహ పురాణమందు శ్లోకము లిరువదినాల్గువేలు గలవు. అగ్ని పురాణమున మొత్తము శ్లోకములు పదారు వేలును నారద పురాణమున నిరువదైదువేల శ్లోకములు నలరుచున్నవి. శ్రీ పద్మపురాణ మేబది యైదువేల శ్లోకములతో విస్తృతమైయున్నది. లింగ పురాణమునందు పదునొకండువేల శ్లోకములు గలవు. శ్రీహరి గరుడ పురాణమును పందొమ్మిదివేల శ్లోకములలో వెల్లడించెను. కూర్మ పురాణమందు పదునేడువేల శ్లోకములు గలవు. స్కంద పురాణ మెనుబది యొక్క వేల శ్లోకములతో తనరారు చున్నది. ఇది పురాణములయు వానియందలి శ్లోకసంఖ్యలయు వివరణము.

ఇపుడు ఉప పురాణముల గూర్చి వినుడు. సనత్కుమారము నారసింహము నారదీయము శైవము దౌర్వాసము కాపిలము మానవము ఔశనసము వారుణము కాలికము సాంబము నందికృతము పారాశరుడు విపులముగ చెప్పిన యాదిత్యపురాణము మాహేశ్వరము భాగవతము వాసిష్ఠము ననుపేరులతో నుపపురాణములు పదునెనిమిది గలవని మహాత్ములు వాక్రుచ్చుచున్నారు. ఈ విధముగ సత్యవతీ తనయుడగు శ్రీ వ్యాసభగవానుడు పదునెనిమిది మహాపురాణములను వివరించెను. ఆ పిదప వానినన్నిటి సారమును గైకొని శ్రీ మహాభారతమను పేర ప్రసిద్ధమైన గ్రంథమును విరచించెను. ప్రతి మన్వంతరమునందును ద్వాపర యుగములు వచ్చుచుండును. ద్వాపరము వచ్చినపుడెల్ల ధర్మాద్వైతమతితో వ్యాసుడు యథావిధిగా పురాణములను ప్రపంచించు చుండును. ప్రతి ద్వాపరమందును శ్రీ హరియే వ్యాసుడుగ నవతరించి జనులకు మేలుబాట చూపుటకు ప్రతియొక వేదమును అనేకములగు ఉప భాగములుగ విభజించును. ప్రతి కలియుగమునను బ్రాహ్మణులల్పాయువులు నల్పమతులునై యుందురు. వ్యాసుడు వారి కందరికిని మేలు వెలుగు చూపగోరి యుగయుగమునందును పావన పురాణ సంహితలను ప్రకటించును. స్త్రీలకును శూద్రులకును ద్విజబంధువులకును వేదము వినుట కధికారము లేదు. అట్టివారి హితము గోరి పురాణములు రచింపబడినవి. ఇపుడేడవ వైవస్వత మన్వంతరము జరుగుచున్నది. ఈ మన్వంతరమందలి యిరువదెనిమిదవ ద్వాపరము ప్రాప్తించగా నా గురుడు ధర్మవిదుడు నగు సత్యవతీ సుతుడు వ్యాసుడు వ్యాసపీఠమలంకరించి యున్నాడు. ఇక మీదట ఇరువది తొమ్మిదవ ద్వాపరమున ద్రోణపుత్రుడగు అశ్వత్థామ వ్యాసపదము నలంకరించును. ఇట్లిప్పటికిరువదేడుగురు వ్యాసులు వచ్చి వెళ్ళిరి. వీరు ప్రతి ద్వాపరమందును పురాణ సంహితలు వ్రాసిరి.

ఋషులిట్లనిరి: మహాభాగుడవగు సూతమునిచంద్రా! ప్రతి ద్వాపరయుగమునందును పురాణ సంహితలు వెలయించిన వ్యాసమహర్షుల పేరులు దయతో మాకు తెలుపుము. సూతుడిట్లనియె: మొదటి ద్వాపరమున బ్రహ్మయే స్వయముగ వ్యాసుడై వేద విభజన గావించెను. రెండవ ద్వాపరమునందు ప్రజాపతి వ్యాస కృత్యము నెఱపెను. మూడవ ద్వాపరమందు శుక్రుడును నాలవ యైదవ యాఱవ ద్వాపరములందు వరుసగ గురు రవి మృత్యులును వ్యాసపదవులందు శోభిల్లిరి. ఇంద్రు డేడవ ద్వాపరమున వసిష్ఠు డెనిమిదవ ద్వాపరమున సారస్వతుడు తొమ్మిదవ ద్వాపరమున త్రిధాముడు పదవ ద్వాపరమున వ్యాసకార్యములు నిర్వహించిరి. పదునొకండవ ద్వాపరమున త్రివృషుడు పండ్రెండవ ద్వాపరమందు భరద్వాజుడు పదుమూడవ ద్వాపరంబున నంతరిక్షుడు పదునాల్గవ ద్వాపరమున ధర్ముడు పదునైదవదానిలో త్రైయారుణి పదునారవ దానిలో ధనంజయుడు పదునేడవ ద్వాపరమునందు మేధాతిథి పదునెనిమిదవ ద్వాపరమున వ్రతియును పందొమ్మిదవ ద్వాపరమున అత్రియు నిరువదవ ద్వాపరమున గౌతముడును నిరువది యొకటవ ద్వాపరమున నుత్తముడగు హర్యాత్ముడును ఇరువది రెండవ ద్వాపరమునందు వేనుడు వాజశ్రవుడు నిరువది మూడవ దానిలో సోముడాముష్యాయణుడును నిరువది నాలుగవ ద్వాపరములో తృణబిందువు నిరువది యైదవ ద్వాపరమున భార్గవుడును ఇరువదియారవ ద్వాపరములో శక్తియు ఇరువదేడవ ద్వాపరములో జాతుకర్ణియు ఇరువదెనిమిదవ ద్వాపరమునందు కృష్ణద్వైపాయనుడగు వ్యాసుడును వ్యాసపీఠమలంకరించిరి. ఇట్లు మీకిరువదియెనిమిది ద్వాపరములందును వచ్చిన ఇరువది యెనిమిదిమంది వ్యాసులను గుఱించి తెలిపితిని.

వారిలో శ్రీకృష్ణ ద్వైపాయనుడగు వ్యాసుడు శ్రీదేవీభాగవతపురాణము ప్రవచించగా నేను వింటిని. ఆ పురాణము పుణ్యకరమైనది. ఈ కలి సంసార పాతకములను బాపజాలినది. ఆ పురాణము కామదము ముక్తిదము. అది సకలాగమ సారముతో నవరసములతో చమత్కారముతో వెలయుచున్నది. ముముక్షులకది యెంతేని ప్రీతికరమైనది. శ్రీవేదవ్యాసుడు అతి శుభకరమగు ఆ పురాణమును రచించి దానిని మహాత్ముడు వైరాగ్యసంపన్నుడు అరణి సంజాతుడు శుకనామధేయుడు అగు తన పుత్రునిచే అధ్యయనము చేయించెను. అయోనిజుడు అద్భుతధీశాలి తన పుత్రుడనగు శుకునకు వ్యాసుడు మహా మహిమాన్వితమైన యీ పురాణ రాజమును బోధించు నపుడు నే నచ్చోటనే యుంటిని. కావున ఆ వ్యాసగురుని యనుగ్రహమున నాదేవీ పురాణ రహస్యము సర్వము నేనును విను భాగ్యము పొందితిని. ఈ శ్రీమద్దేవీభాగవతము వేదకల్ప వృక్షమున ఫలించిన దివ్యఫలము. దుర్గమ సంసార సాగరమును దాటించు నావ. ఈ పురాణామృతసారము పెక్కు లాఖ్యానములతో నొప్పుచున్నది. దానిని శుకుడు ప్రేమభక్తి నిండార తన కర్ణపుటములు తనివార గ్రోలెను. అట్టి యద్భుత దివ్యకథలు వినిన ప్రతివాడును కలి భయమునుండి ముక్తుడగును. ఇది ముమ్మాటికిని సత్యము. పాపులలో నతిపాపియైనను వేదధర్మ రహితుడైనను స్వధర్మముల బాటించని వాడైనను ఎట్టివాడైన నేనెపముతో నైనను ఈ పరమోత్తమ శ్రీదేవీ పురాణమును భక్తిప్రపత్తులతో వినినచో నట్టివా డిచ్చోటనే విపుల భోగభాగ్యము లనుభవించి పిదప పరమపావని యగు భగవతి సుప్రసాదమున యోగులనుభవించు నక్షయ దేవీ లోకము లందగలడు. ఏ మానవు డీ పరమమగు శ్రీదేవీ పురాణమును నిరంతరమును చక్కగ వినుచుండునో వాని హృదయకమలమందు ధ్యానగమ్యయు సత్పురుషులకు ప్రియతమయు నిర్గుణయు శ్రీవిద్యారూపయు హరిహరాదులకు నలభ్యయు నగు సర్వకారణ కారణ భగవతి ప్రత్యక్షమగుచుండును. ఇతర ప్రాణులవలె కాక సర్వావయవములతో నొప్పు ఈ దేహమును ధరించిన యీ నరజన్మ కడు దుర్లభమైనది. ఇంతటి ఉత్తమ జన్మమునెత్తియు మంచి వాక్కులు గల్గియు మూఢుడీ సంసారసాగరమును దాటించగలిగి ముక్తి నొసగజాలినట్టి యీ దేవీ భాగవతమను నావనుగాంచియు దాని నుపయోగించుకొనజూడనిచో వాడు విధివంచితుడు. ఎవ్వడు మానవజన్మము పొంది వినుటకు సమర్థములగు రెండు చెవులుండియు రాగియై పరనిందలే వినగోరునో - పురుషార్థము లొసంగునదియు నవరసభరితమును నిర్మలమును నగు నీ శ్రీదేవీ భాగవతమును చెవులార వినగోరడో వాడు మందమతి-తనకుతాను నాశము కలిగించుకొనువాడు; కానిచో ముక్తిశ్రీ నొసంగు దీని నేలవినడు?

అధ్యాయము 4 శ్రీ వ్యాసమహర్షి పుత్త్ర సంతతికై పరితపించుట

శ్రీ దేవీ భాగవతం ప్రథమ స్కంధము

Chapter 2 Explanation of the Skandhas - అధ్యాయము 2 స్కంధముల వివరణము

శ్రీ దేవీ భాగవతం ప్రథమస్కంధము - అధ్యాయము 2 స్కంధముల వివరణము

శ్రీ సూతుడిట్లనియెను : ఇచ్చట నున్న మహాత్ములు వేదమువలె ప్రసిద్ధమును మహా పుణ్యప్రదమునైన శ్రీ దేవీభాగవత పురాణము విషయమన నన్ను ప్రశ్నించిరి. అందుచే నేనెంతయు ధన్యుడను సదృష్టవంతుడను పవిత్రుడను నైతిని. కావున నేనిపుడు సర్వ వేదార్థ సమ్మితమును సకల శాస్త్రములందు నాగమములందు నుత్తమమైనదియు రహస్యమైనదియు నగు దేవీ పురాణమును చెప్పుదును, ఓ ద్విజోత్తములారా! పరమ యోగులకు ముక్తి నొసంగునదియు బ్రహ్మాదులచేత సేవింపబడునదియు స్తుతిపరులగు ముని ప్రవరులచే నెల్లపుడు ధ్యానింపబడ దగినదియు సుకుమారమునగు శ్రీ మదఖిలాండేశ్వరియగు శ్రీ లలితాదేవి పద పద్మముల కభివందనం బాచరించి నవరసభరితము పురాణ శ్రేష్ఠమును శ్రీదేవి పేరుతో ప్రసిద్ధమునగు శ్రీ మద్దేవీ భాగవత మహాపురాణమును పరమభక్తితో నిపుడు రసోదంచితముగ మీకు చక్కగ వివరింతును. ఎల్ల వేదమార్గములందు ఆదిశక్తిగా ఆత్మవిద్యగా పరాశక్తిగా సంసారపాశ విచ్ఛేదినిగా సకలహృదయనివాసినిగా దుష్టుల కలవిగానిదై శిష్టమునుల నిశ్చల ధ్యానమున దెలియబడునది కామదాయిని యై తనరారు శ్రీ రాజరాజేశ్వరి మాకు ప్రత్యక్షమై సిద్ధులను చేకూర్చుగాత! తన త్రిగుణాత్మకమైన మాయాశక్తిచేత నీ సకల చరాచర ప్రపంచములను సృజించి పెంచి ప్రళయ కాలమున సంహరించుచు లీలావినోదము సలుపుచున్న సర్వవిశ్వమాతను మనసార నెదలో సంస్మరింతును. ఈ కనంబడు జగంబునెల్ల బ్రహ్మయే సృజించెనను నుడి లోకమున వ్యాప్తిలో నున్నది. వేదవిదులు పురాణవేత్తలు నీ విషయము నిట్లే చెప్పుచున్నారు. కాని యా బ్రహ్మయు విష్ణుని నాభికమలమునుండియే జన్మించెను. అతడా విష్ణుని ప్రేరణ చేతనే విశ్వసృష్టికి గడంగెను. కనుక బ్రహ్మయును స్వష్టికార్యమున పరాధీనుడే. ప్రళయకాలమున విష్ణువు శేషశయ్యపై పవ్వళించగా నతని బొడ్డుతమ్మినుండి నలువ యుద్భవించెను. ఆ విష్ణువున కాధారము వేయిపడగల శేషఫణియని మన మెఱుగుదుము. కనుక విష్ణువే విశ్వసృష్టి కాధారమని యెట్లు చెప్పగలము? ఆ మహాసాగర మందలి జలము రసమయమైనది. ఆ రస మేయాధారమును లేక నిలువజాలదు. మాయాశక్తి స్వరూపిణియగు విశ్వజననియే యా జలముల కాధారభూతురాలు. నేనా విశ్వకారణయగు తల్లినే శరణు వేడుకొనుచున్నాను. యోగనిద్రలోనున్న విష్ణునిగాంచి నలువ యే దయామయిని ప్రస్తుతించి యామెను ప్రసన్నురాలినిగ జేసికొనెనో యా దయామృత తరంగిణిని నేను శరణు పొందుచున్నాను. ఆ సగుణ నిర్గుణ స్వరూపిణి మాయామయి ముక్తిప్రదాయిని యగు తల్లినే ధ్యానించి సంపూర్ణ దేవీభాగవత మహాపురాణమును మీకు వచింతును. మునులారా! మీర లది కడుశ్రద్ధగ వినుడుః

ఈ శ్రీదేవీభాగవత మహాపురాణము పుణ్యకరమైనది. ఉత్తమోత్తమమైనది. ఇందు పదునెనిమిదివేల శ్లోకములు గలవు. పండ్రెండు స్కంధములు మూడువందల పదునెనిమిది యధ్యాయములు గలవు. దీనిని శ్రీ వ్యాసభగవానుడు ప్రవచించి ప్రకాశింపచేసెను. ఈ శ్రీదేవీభాగవత పురాణము నందు ప్రథమ స్కంధమున ఇరువది రెండవస్కంధమున పండ్రెండు మూడవస్కంధమున ముప్పది నాల్గవస్కంధమున నిరువదియైదు ఐదవస్కంధమున ముప్పదియైదు ఆఱవస్కంధమున ముప్పదియొకటి ఏడవస్కంధమున నలువది ఎనిమిదవస్కంధమున నిరువదినాలుగు తొమ్మిదవస్కంధమున నేబది పదియవస్కంధమున పదుమూడు పదునొకండవస్కంధమున నిరువదినాలుగు ద్వాదశస్కంధమందు పదునాలుగు అధ్యాయములు గలవు. ఈ మహాపురాణము పదునెనిమిదివేల శ్లోకములు గలదిగా శ్రీవ్యాసమహామునిచే రచింపబడెను. ఇది సర్గము ప్రతిసర్గము వంశము మన్వంతరము వంశానుచరితమునను నైదు లక్షణములతో తనరారుచున్నది. ఆ పరాభట్టారికయే నిత్య నిర్గుణ నిర్వికల్ప శివస్వరూపిణి విశ్వాధార యోగగమ్య తురీయ. అనగా సాత్త్విక రాజస తామస శక్తిత్రయము కంటె విశిష్టమగు పరబ్రహ్మరూపిణి. ఆ విశ్వవ్యాపిని యొక్క సాత్త్వికరాజస తామస శక్తులే శ్రీమహాలక్ష్మి శ్రీమహా సరస్వతి శ్రీమహాకాళి యను స్త్రీ త్రితయ స్వరూపమున చెన్నొందు చున్నవి. ఆ మూడు శక్తులే యీ సృష్టికి నిమిత్తమై దివ్యదేహములు దాల్చును. అట్టి రూపములు దాల్చు లక్షణమునే శాస్త్రకోవిదులు సర్గమని పేర్కొందురు. ఆ ముత్తెఱంగులగు శక్తుల కారణముననే విష్ణు బ్రహ్మ మహేశు లుద్భవించిరి. వీరివలననే సృష్టి పాలన లయములు నిరంతరముగ జరుగు చుండును. ఈ మూర్తి త్రయోద్భవ వృత్తాంతమునే ప్రతిసర్గ మందురు. సూర్య చంద్రవంశజులైన రాజుల వంశచరితమును హిరణ్యకశ్యపాదుల చరిత్రమును దెలుపు లక్షణమునకు వంశమనిపేరు. స్వాయంభువుడు మొదలగు మనువుల వంశములను వారి జీవితకాల పరిమాణములను అభివర్ణించుట మన్వంతరమనంబడును. ఆ మనువేల వంశకథల గూర్చి తెలుపుట వంశానుచరిత మనంబరగును. ఇవియే పురాణములయందుండవలసిన పంచలక్షణములు. తొల్లి శ్రీ వ్యాస మహాముని శ్రీ మహాభారతేతిహాసమును విరచించెను. అది వేదసారము పంచమ వేదము నని ప్రసిద్ధిగాంచినది. అందు నూటయిరువది యైదువేల శ్లోకము లొప్పుచుండును.

శౌనకు లిట్లనిరి: ఓ సూత మహామునీ! నీవు సర్వజ్ఞుడవు. ఆ పురాణములన్నియునెన్ని? వాని పేరులేమి? వాని నన్నిటిని వినగోరుచున్నారము. మాకు వానిని వివరించి తెల్పుము. కలికాలమువలని భయమున మేమీ నైమిశారణ్యమందు నివసించుచున్నాము. ఇది పావనక్షేత్రము. మునుపు బ్రహ్మ తన మనోమయ చక్రమును మా కొసంగి యిట్లనియెను: మీరీ చక్రము వెంట నరుగుడు. ఈ చక్రపునేమి - బండి కంటికమ్మి - యెచ్చోట జారిపడునో యచ్చోటు పవిత్రమైనదని యెఱుంగుడు. ఆ చోట కలిప్రవేశము జరుగనేరదని తెలిసికొనుడు. సత్యయుగము మరల వచ్చువఱకు మీరలా పవిత్ర క్షేత్రమందే యుండుడు. మేమా బ్రహ్మవాక్కులు విని సకల లోకములు చూడ ఆ చక్రము త్రిప్పుచు దాని వెంటనే యరిగితిమి. అది తిరిగి తిరిగి యిచ్చోటికి వచ్చెను. వెంటనే ఆ బండి కంటికమ్మి చూచుచుండగనే యిచ్చోట పడెను. చక్రనేమి శీర్ణమై పడిన స్థలమగుటచే నీ క్షేత్రము నైమిశమని ప్రసిద్ధి కాంచినది. ఇది పరమపావనమైన పుణ్యక్షేత్రము. ఈ పావన స్థలమున కలిప్రవేశము జరుగజాలదు. ఈ కారణముననే మహాత్ములు సిద్ధులు మునులు మేమును కలిభయపీడితులమై యిచ్చోటనే నివాసమేర్పరచుకొంటిమి. సత్యయుగము సమీపించు వరకు మేమిచ్చోటనే పశుహింస లేని పురోడాశాది యాగము లొనరించుచు మా జీవితకాలము గడపుకొందుము. సూతముని సత్తమా ! మా పూర్వ పుణ్యవిశేషమున నీవిచ్చటి కరుగుదెంచితివి. మాకు బ్రహ్మ సమ్మితము పరమపావనము నగు పురాణము నీవు వినిపింపుము. నీవు ధీశాలివి. మహావక్తవు. మేము ఇతర విషయ చింతమాని యేకాగ్ర చిత్తమున పురాణము విన నుత్సహించుచున్నవారము. పవిత్రము నిత్య కళ్యాణప్రదము వేదసమ్మతమునగు ఆ దేవీ భాగవత పురాణము మాకు వినిపించి నీవు తాపత్రయములు లేక దీర్ఘాయుష్కుడవై జీవింపుము. ఆ వ్యాసమహర్షి ధర్మార్థకామ మోక్షములగూర్చియును మహావిద్యను గుఱించియు నా పురాణమందు పరి వర్ణించెను. అట్టిదానిని మాకు వినిపింపుము. ఆ మునీంద్రుడు చెప్పిన సుమనోహరము పరమ పావనము రసభరితమునగు కథలెంతవిన్నను మాకు తనవితీరుటలేదు. సకల సద్గుణములకు పాత్రమైనదియు పవిత్రమైనదియు శ్రీ జగన్మాతయొక్క లీలానాట్యములతో విచిత్రమైనదియు సమస్త పాపరాసులను పటాపంచలు చేయునదియు నెల్లకోర్కులీడేర్చునదియునైన శ్రీభగవతి యను దేవి పేరబరగు శ్రీ దేవీమహాభాగవతమును మాకు దయతో వివరింపుము.

అధ్యాయము 3 పురాణములను-వ్యాసులను గుఱించిన వివరములు


SRI DEVI BHAGAVATHAM PART 1 - శ్రీ దేవీ భాగవతం ప్రథమ స్కంధము

మా బుద్ధుల నాత్మచింతనమునకై ప్రేరించు దేవియు సర్వ చైతన్యరూపయు ఆద్యయు మహావిద్యయు నగు శ్రీ భగవతిని ధ్యానింతుము.

శ్రీ దేవీ రూప పరిణామమే సకల చిదచిదాత్మక చరాచరాత్మక జగత్తులగుటచే నామె సర్వరూప. ఆమె చిద్రూపయగుటం జేసి చైతన్య రూప. చైతన్యాత్మికయగు నామెయొక్క పరిణామమగు నీ జగములు నందలి సకలభూతములును చిద్రూపములే కావలయును. కావున నామె సర్వభూతములయందలి చైతన్యమును నై యున్నది. ఆ దేవి సర్వమునకును ఆద్యయును పరతత్త్వ సాక్షాత్కారమునకు సాధనమగు విద్యయును. అట్టి విద్య యొక్క రూపములలో సర్వ శ్రేష్ఠ మగుటచే నాద్య యగునది ప్రణవము. అది ఆద్య. అ+ఆద్య. అకార ఉకార మకారములు ఓమ్‌. అకారము ఆది వర్ణముగా గలది. ఆ ప్రణవ విద్య యొక్క విస్తృత రూపమే గాయత్రీ మంత్రము. ఆ రూపమున శ్రీదేవీ తత్త్వమును ప్రతిపాదించుటయే శ్రీదేవీభాగవతమునందలి ప్రధాన తత్త్వము. 

శ్రీ గాయత్రీ మంత్రముయొక్క రూపాంతరమే శ్రీ పంచదశీ మహావిద్య. ఆ విద్యయొక్క 'కాదివిద్యా' రూపమునకు ఆది విద్య యని శాస్త్ర సంకేతము. విద్యకును విద్యా ప్రతిపాద్య తత్త్వమునకును అభేదమే కావున ఆ దేవి 'ఆది విద్యా' యగును. శ్రీపంచదశీ మహావిద్యయొక్క సునిష్కృష్ట రూపమగు శ్రీ షోడశాక్షరీ విద్యయు నంతే. శ్రీదేవి శబ్ద బ్రహ్మాత్మిక. అట్టి పరాది వాగాత్మక శక్తి మాతృకారూప. అవి అకారాదికములు గదా! అందుచేత నామె 'ఆద్యా విద్యా' అ-ఆద్యా=అకారము ఆదిగా గలది. ఆ దేవి మనయందర బుద్ధి తత్త్వములను ప్రేరించును. ఆ ప్రేరణకు మూలము సంకల్పము - అనగా - ఇచ్ఛ. బుద్ధి అనగా ఆయా కృత్యముల గూర్చిన జ్ఞానము. జ్ఞానము ననుసరించి సృష్ట్యాది కృత్యములు జరుగును. ఇచ్ఛా జ్ఞాన క్రియా శక్తులు మూడును ఆ దేవి రూపములే. ఇట్లు ఆమె శక్తిత్రయరూప త్రిగుణాత్మక మాయారూప, మాయా పరిణామ జగద్రూప. మాయా పాశమోచన సాధన విద్యారూప అని యీ గాయత్రీ ఛందోరూపమగు శ్రీదేవీ ప్రార్థనము సూచించుచున్నది.

ఇట్లు సర్వజ్ఞత్వ సర్వశక్తిమత్త్వాది లక్షితమైన శ్రీదేవీ రూప మాయా శబలిత బ్రహ్మ మీ మంగళ శ్లోకమున ప్రార్థింపబడుచు న్నది. మాయా శబల బ్రహ్మను ఇచట ధ్యాన విషయమగుటచే నట్టి తత్త్వము నిష్క్రియము కాదు కావున మా బుద్ధి వృత్తులను ప్రేరించుగాక! అని శ్రీదేవిని ప్రార్థించుట సముచితము.

అధ్యాయము 1 - శౌనక కృత ప్రశ్న




















పంచాంగం

Chapter 1 - The Question of Shaunaka Krita - అధ్యాయము 1 - శౌనక కృత ప్రశ్న

శ్రీ దేవీ భాగవతం ప్రథమస్కంధము - అధ్యాయము 1 - శౌనక కృత ప్రశ్న 

శౌనకముని సూతుని పురాణములగూర్చి ప్రశ్నించుట
శౌనకముని యిట్లనెను: ఓ పురుషర్షభా మహాభాగా సూతమహామునీ! మేలు చేకూర్చు పురాణ సంహితలన్నియును నీచే చక్కగ నధ్యయనము చేయబడినవి. నీవు కడు ధన్యుడవు. ఓ సుకృతీ! వేద వ్యాసమహర్షి దివ్యములగు పదునెనిమిది పురాణములను ప్రపంచించగా వానిని నీవు చక్కగ చదివితివి. ఆ పురాణములు సర్గము ప్రతిసర్గము వంశము మన్వంతరము వంశానుచరితము నను నైదు లక్షణములతో నొప్పారుచు రహస్య విషయములతో గూడియున్నవి. అట్టివాని నెల్ల నీవు సత్యవతీ పుత్రుడగు వ్యాసుని వలన నెఱింగితివి. అట్టి నీవు మా పుణ్యవశమున నీ యుత్తమ పుణ్యక్షేత్రమున కరుదెంచితివి. ఈ క్షేత్రము ఉత్తమమును దివ్యమును మునులకు విశ్రామ ప్రదేశమును పుణ్యకరమును కలిదోష శూన్యమునునై యున్నది. ఈ మా మునిగణము పుణ్యప్రదమగు పురాణ సంహితను వినగోరుచున్నది. కనుక మాకు దానిని సమాహితచిత్తుడవై వివరింపుము. నీవు సర్వజ్ఞుడవును మహానుభావుడవును. నీవు ఆధిభౌతిక ఆధ్యాత్మిక ఆధిదైవికములను తాపత్రయములు లేనివాడవు. మాకిపుడు వేద తుల్యమగు పురాణ సంహితను వివరించి చిరకాలము చల్లగ వర్ధిల్లుము. రసాస్వాదన సమర్థులై చెవి మున్నగు నింద్రియములు కలవారైనను పురాణములు వినని మనుజులు దైవ వంచితులే కదా! ఈ నాలుక షడ్రసములచే నాహ్లాద మొందినట్లు మహాత్ముల వచనములు వినుటవలన చెవి ఆహ్లాదము చెందును. చెవులులేని పాములును ఆకాశగుణ మగు శబ్దములచే మోహితములగును. చెవులుండియు సత్కథలు వినని నరులు చెవులు లేనివారేల కారు? ఈ కారణమువలన మా ద్విజులెల్లరము కలిభయ పీడితులమై పవిత్రమైన ఈ నైమిశారణ్య క్షేత్రమును జేరి సావధానముగ సత్కథలు వినగోరుచున్నారము.

ఈ కాలచక్ర మేదోవిధముగ గడచి పోవుచునే యుండును. కాని యది మూర్ఖులకు వ్యసనములతోను పండితులకు శాస్త్ర చింతనములతోను గడచుచుండును. ఈ శాస్త్రములును విచిత్రములైనవి. అవి నానార్థవాదములతో తర్కముతో జల్పముతో వితండ వాదముతో యుక్తిప్రయుక్తులతో రోషగర్వములను కలిగించును.

ఆ శాస్త్రములలో వేదాంతము సాత్త్వికము మీమాంస రాజసము న్యాయశాస్త్రము హేతువాద యుక్తము అగుటచే తామసము నై యొప్పుచుండును. పురాణములు త్రిగుణములతో త్రివిధములై కథలతో కూడియుండును. పంచలక్షణములతో వెలయు ఆ పురాణములు నీవు చెప్పితివి. వానిలో శ్రీ దేవీభాగవత మైదవది. పుణ్యప్రదమైనది. వేదసదృశము. సర్వ లక్షణ సంయుతము. అన్నిటి కంటె శ్రీ భాగవతము ముముక్షువులకు ముక్తిని ధర్మాత్ములకు ధర్మఫలమును సకాములకు కామఫలమును నొసంగగల దగుటచే పరమాద్భుతమైనది. అట్టి దానిని నీవు నామగ్రహణ మాత్రమున చెప్పితివి. ఇపుడా దివ్యమై శుభకరమైన శ్రీ దేవీ భాగవత పురాణోత్తమమును ఆదరముతో మాకు విశదముగ నభివర్ణింపుము. దాని నిచటి ద్విజులెల్లరము విన వేడుకపడుచున్నారము. ధర్మజ్ఞుడవగు సూతా! గురుభక్తి సత్త్వగుణము గలిగిన వాడవగుటచే నీవే వ్యాసముని ప్రోక్తమైన పురాణ వాఙ్మయమును బాగుగ నెఱింగియున్నావు అనునది నీయందలి విశేషము. పురాణతత్త్వ సర్వస్వము నెఱిగిన వాడవు. నీ నోట నెన్నియో పురాణములను వింటిమి. కాని మా కిపుడు అమృత పానముచే నమరులకు వలె మాకు అంత మాత్రమున తృప్తి గలుగుటలేదు. ఎన్నటికిని ముక్తి నీయజాలని యమృతము గ్రోలుట వ్యర్థమే గదా! ఎందువలన ననగా, భాగవతామృతమును త్రాగినచో నరుడు బంధమునుండి వెంటనే విముక్తు డగును. మే మమృతపానము గోరి యెన్నెన్నో జన్మము లొనరించితిమి. కాని యీనాటికిని మాకు పూర్తిగ శాంతి చేకూరలేదు. యాగములకు ఫలితముగ సర్వ ప్రాప్తిగలుగును. కాని యా స్వర్గమునుండి తిరిగి పతనము గలుగును. ఈ విధముగ నీ సంసార చక్రమునందు నిరంతరముగ భ్రమణము గలుగుచునేయుండును. సత్త్వ రజస్తమోరూపమగు నీ కాల చక్రమునబడి తిరుగుచున్న నరులకు తత్త్వజ్ఞానము లేకుండ నెన్నటికిని ముక్తి కలుగదు. కనుక ముముక్షువులకు ప్రియమై రహస్యమై ముక్తిప్రదమై పవిత్రమై సర్వరస భరితమై యొప్పారు శ్రీ దేవీభాగవత మహాపురాణమును మాకు తేటతెల్ల మొనరించుము.

ఇది పదునెనిమిదివేల శ్లోకములుగల శ్రీ దేవీభాగవత మహాపురాణమందలి

అధ్యాయము 2 స్కంధముల వివరణము

శ్రీ దేవీ భాగవతం ప్రథమ స్కంధము

Wednesday, April 8, 2026

Lord Krishna lifting Govardhana Mountain - శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతము నెత్తుట

శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతము నెత్తుట

శ్వేతవరాహావతారమెత్తి భూమిని సముద్రం నుండి పైకి ఎత్తి తెచ్చిన శ్రీమహావిష్ణువు, ఏనుగు సునాయాసంగా తామరమొగ్గను ఎత్తే విధంగా ముల్లోకాలకు శుభం కలిగించే శ్రీకృష్ణుడు విలాసంగా ఒక చేతితోనే గోవర్ధన పర్వతాన్ని పైకెత్తాడు.

ఎన్నో బ్రహ్మాండాలను చెండులవలె ఎగురవేసి పట్టుకొనే శ్రీమహావిష్ణువుకు గోవర్థనపర్వతం అనే కొండను పెల్లగించి ఎత్తడం సులువైన పనేకానీ బరువైనపని కాదు.

ఇలా కొండనెత్తి

బాలుడు ఆడుకుంటూ పూలగుత్తిని గొడుగుగా భావించి అందమైన తన అరుణహస్తంతో పూలగుత్తిని ధరించినట్లుగా, కృష్ణుడు చిరునవ్వుతో ఆ గోవర్ధన మహాపర్వతాన్ని పైకెత్తి కుడిచేత ధరించి, ఆకాశంనుండి వర్షించే కఠినమైన రాళ్లతో చీకాకుపడుతూ ఉండిన యాదవస్త్రీలు, పురుషులు, గోవులపంక్తులకు విశాలమైన గొడుగుగా పట్టుకొన్నాడు.

ఈ విధంగా యాదవకులాగ్రణి అయిన శ్రీకృష్ణుడు గోవర్దనగిరిని గొడుగులాగా పట్టుకొని ఇలా అన్నాడు.

శ్రీకృష్ణుడు అందరినీ ఇలా పిలుస్తున్నాడు. అమ్మా రా! నాన్నా రండి! గోపస్త్రీపురుషులారా! ఇలా రండి! వినండి! మీ గోవులమందతోకూడా ఈ దిగుడు ప్రదేశంలో ఇష్టంవచ్చిన స్థలంలో ఉండండి.

చుట్టాలయిన ఓ గోపకులారా! ఇతడు (నేను) పసివాడు. కొండ ఏమో గొప్పది. దానిబరువు భరించగలడో లేదో అని దీనికింద నిలవడానికి సంశయించవలసిన పనిలేదు. కొండలు, సముద్రాలు, నానాజంతువులతో కూడిన భూమి అంతా వచ్చి ఈ కొండమీద పడినా సరే నాచేయి అటూ ఇటూ కదలదు. మీరందరూ సంతోషంగా వచ్చి, ఈ కొండ కింద నిలవండి అని శ్రీకృష్ణుడు పలికాడు.

ఇలా తమను చూచి చెపుతున్న కృష్ణునిమాటలు విని, నమ్మి, అందరూ కొండకింద తమకు ఇష్టమైన ప్రదేశాల్లో కొడుకులు, మిత్రులు, భార్యలు మొదలైనవారితోను, గోవులతోను, కృష్ణునికరుణగలిగిన చూపులు అమృతవర్షంలా సోకడంవల్ల ఆకలిదప్పులు మరిచిపోయి, కృష్ణసంబంధమైన కథలు చెప్పుకుంటూ వినోదంగా ఉండిపోయారు.

శ్రీకృష్ణుడు ఎత్తిపట్టిన గోవర్థనపర్వతం గొడుగువలె విలసిల్లింది. ఎలాగంటే ఆ గొడుగుకు శ్రీకృష్ణుని బాహుదండమే కాడ. కొండశిఖరమే గొడుగు గుబ్బ. కృష్ణుడు ధరించిన రత్నాలహారాలు జారిపడుతున్న వర్షప్రనీటి బిందువులు. గోపస్త్రీల కడగంటి చూపులతో కూడిన నవ్వులకాంతులు గోవర్ధన పర్వతంలోని రత్న సమూహం. ఆ గొడుగు దేవేంద్రుని దుర్గర్వాన్ని అణచేది, మేఘాలనుండి కురిసే వర్షంలో తడుస్తున్న గోపకులను స్థిరంగా ఆనందపరచేది అయింది.

ఓ పరీక్షిన్మహారాజా! కమలాక్షుడైన శ్రీకృష్ణునిచేతిలో ఆ గోవర్ధనగిరి ఒక కమలంవలె విలసిల్లింది. ఆ కొండమీదనున్న మేఘాలగుంపు తుమ్మెదల గుంపులాగా శోభిల్లింది.

అధిపా! దేవేంద్రుని ఆజ్ఞచే మిక్కిలి వేగంతో ఏడు పగళ్లూ, రాత్రుళ్లూ జడివాన నిరంతరాయంగా కురిసింది. ఆ సమయంలో గోపీగోపకులు గోవర్ధనగిరి అనే గొడుగుకింద వానలో తడవకుండా బతికారు.

ఈ విధంగా శ్రీకృష్ణుడు ఏడుపగళ్లు, ఏడురాత్రులు గోవర్ధనగిరిని ఎత్తి పట్టుకోగా దేవేంద్రుడు విసిగివేసారి, కృష్ణుని కథలువిని ఆశ్చర్యపడి, తనకోరిక ఫలించనివాడై, మేఘాలను మరలించుకొని వెళ్లిపోయాడు. అప్పుడు ఆకాశమండలంలో సూర్యమండలం ప్రకాశించడం తెలుసుకొని గోవర్థనధరుడైన కృష్ణుడు గోపాలకులతో ఇలా అన్నాడు.

గాలీ వానా ఆగిపోయాయి. నదుల వేగం తగ్గింది. వరదలు తగ్గుముఖంపట్టాయి. ఇక కొండకింద ఉండకుండా గోపజనులారా! మీ కొడుకులు, కోడండ్రు, భార్యలు, గోవులతో వెలుపలికి రండి. (అని కృష్ణుడు అన్నాడు)

శ్రీకృష్ణుడు ఇలా చెప్పగానే, గోపాలకులు అందరూ బండ్లు మొదలైన తమ పనిముట్లతో కూడి గోవులు, తామూ కొండ అడుగును విడిచివచ్చారు. శ్రీకృష్ణుడు కూడా వెంటనే గోవర్ధనగిరిని దాని స్వస్థానంలో ఉంచాడు. అపుడు గోపాలకులందరూ కృష్ణుణ్ణి కౌగిలించుకొని, ఉచితవిధంగా సత్కరించి, దీవించారు. గోపికలు అక్షతలువేసి, పెరుగన్నంముద్దలు చేసి ఇచ్చి, ఆశీర్వదించారు. నందుడు, బలరాముడు, రోహిణి, యశోద కృష్ణుణ్ణి కౌగిలించుకొని క్షేమ శుభవాక్యాలు పలికారు. సిద్దులు, సాధ్యులు, గంధర్వులు పువ్వులు కురిపించారు. దేవతలు శంఖాలు, దుందుభులు మోగించారు; తుంబురుడు మొదలగు ముఖ్యులైన గంధర్వులు గానంచేశారు. అప్పుడు.

గోపస్త్రీలు తనకథలు పాడుతూ ఉండగా, కమలనేత్రుడైన శ్రీకృష్ణుడు గోపకులతో కలిసి, గోకులం చేరాడు.

ఆ సమయంలో కృష్ణునిచరితలు తలచుకొని, నివ్వెరపోతూ గోపకులు నందునితో ఇలా అన్నారు.

కన్నులు తెరవని చిన్ని పాపడుగా ఉండగానే రాక్షసియైన పూతనయొక్క చనుబాలు తాగి ఆ పూతనను చంపాడు. ముద్దుల బాలుడుగా ఉంటూ మూడోనెలలోనే బండిరూపంలో వచ్చిన శకటాసురుణ్ణి కాలితో తన్ని చంపేశాడు. ఏడాది కుర్రవాడై ఉండగానే తృణావర్తుడు అనే రాక్షసుణ్ణి మెడబట్టుకొని కూల్చివేసి పరిమార్చాడు. వెన్నలకోసం ఇతరుల ఇండ్లకు వెళ్తున్నాడని తల్లి యశోదమ్మ రోలుకు కట్టివేయగా, కృష్ణుడు రెండు మద్దిచెట్ల మధ్య దూరి, రోలును ఈడ్చుకుంటూ వెళ్లి వాటిని పడిపోయేట్లు లాగాడు. గోవులను, దూడలను మేపడానికి వెళ్లి బకుడు అనే రాక్షసుణ్ణి చంపాడు. వత్సుడు అనే రాక్షసుణ్ణి వెలగచెట్టుతో కొట్టి సంహరించాడు. బలరామునితో కలసి ఖరుడు అనే రాక్షసుణ్ణి చంపేశాడు. ఈ సాహసకృత్యాలు అన్నీ భావించి చూస్తే బాలకృష్ణుడు మనుష్య మాత్రుడా? అనిపిస్తుంది. (కాదని భావం)

(పూతన, శకటాసురుడు, తృణావర్తుడు, బకుడు, వత్సుడు అనే వాళ్లందరూ రాక్షసులు. కంసుడు పంపగా కృష్ణుణ్ణి చంపడానికి వచ్చారు. బాలకృష్ణునిచేతిలో హతులయ్యారు.)

బాలకృష్ణుడు సాహసియై అన్న బలరామునిచేత ప్రలంబాసురుణ్ణి చంపించాడు. ఘోరదావాగ్నిని మింగాడు. కాళీయుని ప్రాభవం చెడేటట్లు కాళీయుణ్ణి పాదాలతో తొక్కి చంపకుండా, కాళింది మడుగునుండి బయటికి తరిమేశాడు.

ఏడేండ్ల బాలు డెక్కడ? వేడుకగా ఆటవలె ఏనుగు తామరపువ్వును ఎత్తినట్లు, ఒక చేత్తోనే విలాసంగా గోవర్ధన గిరిఎత్తడం ఎక్కడ? ఆశ్చర్యం గదా!

ఓ తండ్రీ! గోపవల్లభుడవైన నందుడా! నీ కొడుకు కృష్ణుడు చేసే నేర్పరిపనులు మనుష్యులకు శక్యమైనవేనా? అతడు అందరిలాంటి సాధారణ మానవుడా?

ఇలా గోపకులు అనగానే నందుడు తనకు పూర్వం గర్గమహాముని చెప్పిన రహస్యాన్ని గుర్తుకు తెచ్చుకొన్నాడు. సందేహం లేదు. కృష్ణుడు పద్మాక్షుడైన శ్రీహరి అంశే అని అంతరంగంలో భావిస్తుంటాను అన్నాడు. అది విన్న గోపాలకులు ఆశ్చర్యంతో కృష్ణుడు శ్రీమహావిష్ణువే అని పూజించారు. ఆ తర్వాత

హరి ఒక చేతో గోవర్ధనగిరిని ఎత్తి వర్షజలంవల్ల బాధపడుతున్న యాదవులకు, గోవులకు శరణుగా నిలిచాడు. అపుడు ముల్లోకరాజ్యం ఏలుతున్నాననే పొగరు తొలగిపోగా దేవేంద్రుడు గర్వం వదిలి, తన ప్రాభవం చెడి, కామధేనువుతో కూడా వచ్చి, దుష్టరాజుల దుర్గర్వాన్ని నిరాకరించేవాడు, కరుణతో వర్ధిల్లే వాడూ అయిన శ్రీకృష్ణుణ్ణి దర్శించాడు.

కృష్ణుణ్ణి దర్శించి, మునుల హృదయాలకు అలంకారాలుగా ఉండేవి, అణకువగలవారిని ఉద్ధరించేవి అయిన శ్రీకృష్ణుణ్ణి చరణాలను, సూర్యకాంతితో సమానమైన తన కిరీట కాంతులతో దేవేంద్రుడు పూజించాడు.

దేవేంద్రుడు హరికి నమస్కరించి, హస్తపద్మాలు జోడించి ఇలా అన్నాడు.

కృష్ణా! నీ స్వరూపం సత్త్వగుణోపేతం. శాంతగుణంకలది. రజస్తమోగుణాలను అణచివేసేది. నిత్యమూ అధికతపోమయం. మాయతో వర్ధిల్లే గుణాలు నీకు లేవు. నీవు గుణరహితుడవు కాబట్టి గుణాలవలన పుట్టె లోభం మొదలైన దుర్గుణాలు నీలో చేరవు. అయినా, దుష్టశిక్షణం, శిష్టరక్షణంకోసం లోకాధిపతులు భీతిల్లేటట్లు దండధారివై లోకహితం చేస్తావు. ఓ లోకేశ్వరేశ్వరా! నీవు జగత్పతివి, గురుడివి, తండ్రివి.

(శ్రీహరి గుణరహితుడు కాబట్టి ఆయనకు ఎవరిమీదా కోపమూ, ఎవరిమీదా ప్రేమా ఉండవు. కానీ, లోకకల్యాణార్థం దుష్టశిక్షణలో కోపం, భక్తులమీద ప్రేమ చూపించడం ఆయన లీలలే!)

లక్ష్మీవల్లభా! ఈశా! నావంటి జ్ఞానశూన్యులను నీవు శిక్షిస్తే తక్కినవారు గర్వం వీడి, బుద్దితెచ్చుకొని, సజ్జనుల మార్గాలను అనుసరిస్తారు.

ఓ శ్రీహరీ! ఒక్కొక్క లోకాన్ని రక్షిస్తూ ఎంతో గర్వంతో; 'మేమే ఈశ్వరులం' అనుకుంటూ ఆనందించే నాబోటి అజ్ఞానులు నీ మహిమ నెరుగలేరు! ఇది నిజం.

(ఒక్కొక్కలోకానికి ప్రభువు దేవేంద్రునివంటివాళ్లు. సర్వలోకాలకు ప్రభువు శ్రీమహావిష్ణువు. ఇది తెలుసుకోలేనివారు అజ్ఞానులేగదా!)

వసుదేవా! కృష్ణా! నీవు స్వతంత్రుడవు! జ్ఞానస్వరూపుడవు! మహాత్ముడవు! సర్వపుణ్యపురుషుడవు! సర్వభూతాల్లోను భీజరూపంలో ఉన్న పరబ్రహ్మవు! నిష్కలంకుడవు! నీకు వందనం.

మాధవా! సర్వేశ్వరా! నీ సామర్థ్యం తెలుసుకోలేక, గోపకులు నన్ను ఉద్దేశించి యాగం చేయడం లేదని, నీ గోకులాన్ని భయంకరమైన, తీవ్రమైన జడివానతో ముంచెత్తాను. నీ మహిమవల్ల నా ప్రయత్నం ఇలా వృథా అయింది. నేను నీ సేవకుణి! అపరాధం చేసినవాణ్ణి! నన్ను దయతోచూడు.

దేవా! సర్వాంతర్యామీ! నిన్ను బ్రహ్మాది దేవతలే తెలుసుకోలేరు. నేను జడుణ్ణి! ముల్లోకాలను రక్షిస్తున్నాననే దురభిమానగరిష్ఠుణ్ణి చెడ్డ పాండిత్యం కలవాళ్లలో మేటిని. వినయాన్ని త్యజించినవాళ్లలో శ్రేష్ఠుణ్ణి! దుర్జనులలో, గర్వులలో, శ్రేష్ఠుణ్ణి, నీ ఘనలీలా వైభవాతిశయాన్ని తెలియడానికి నేనెంతటివాణ్ణి?

(నిష్ఠుండు, గరిష్ఠుడు, భూయిష్ఠుడు, వరిష్ఠుడు, శ్రేష్ఠుడు అనేవి శ్రేష్ఠతా వాచకాలు. వీటిని సాధారణంగా మంచివాటికి విశేషణాలుగా వాడుతుంటారు. ఇక్కడ దుర్గుణాలకు విశేషణాలుగా వాడడం విశేషం.)

ఇలా అనగా విని, నవ్వుతూ మేఘగంభీరమైన కంఠధ్వనితో ఇంద్రునితో శ్రీకృష్ణుడు ఇలా పలికాడు.

జంభారీ! దేవేంద్రా! రాజ్యసంపదచే అంధుడవై ఉన్ననీ మదోద్రేకాన్ని అణచివేయడానికి, ఈయజ్ఞం నేనే తప్పించాను. సిరిసంపదలతో మదించినవారు నన్ను తెలుసుకోలేరు. ఎవరిని నేను నిజంగా రక్షించాలనుకుంటానో, వారిని నిర్ధనులుగా చేస్తాను.

ఐరావతగమనా! దేవేంద్రా! నా ఆనతిని శిరసావహించు! నీ పదవిని నిలుపుకో! రాజ్యలక్ష్మీయుతుడి వయ్యావని గర్వించకు! నీకు శుభాలు కలుగుతాయి! వెళ్లు!

అని ఇలా ఇంద్రునితో పలుకుతున్న కృష్ణునికి మ్రొక్కి గోవుల మందతో వచ్చిన కామధేనువు భక్తజన సురభి అయిన శ్రీకృష్ణునితో ఇలా పలికింది.

విశ్వేశ్వరా! విశ్వభావనా! విశ్వాకారా! మునులకు వందనీయా! వినండి! నీవల్ల మేం శాశ్వతులం అయ్యాము. ఇప్పుడు శాశ్వతానందాన్ని పొందగలిగాము.

దేవా! నీవు మాకు పరమదైవానివి, ఇంద్రుడివు, బ్రాహ్మణుల, గోవుల, దేవతల, సజ్జనుల సుఖాలకోసం నిన్ను ఇంద్రునిగా చేసి పట్టం కట్టుమని బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించి పంపించాడు. నీవు భూమండలం యొక్క గొప్పదైన బరువు నివారించడానికి అవతరించిన శ్రీమహావిష్ణుడివి అని పలికి తర్వాత.

కామధేనువు క్షీరంతోను, ఐరావతం తన తొండంతో తెచ్చిన సురగంగాజలంతోను, దేవేంద్రుడు దేవమాత అయిన అదితితోను, మహర్షులతోను కలిసి పద్మాక్షుడు, సాధుసంరక్షకుడు, యుద్దాల్లో శత్రువులను జయించేవాడు అయిన పద్మాక్షుడైన కృష్ణుని అభిషిక్తుని చేసి 'నీవు గోవిందుడివి' అని విశేషంగా ప్రశంసించాడు.

వసుదేవసుతుడైన శ్రీకృష్ణునిఅభిషకసమయంలో తుంబురుడు నారదుడు మొదలైనవారు, దేవజాతులైన సిద్ధులు, చారణులు, గంధర్వులు కృష్ణలీలలను గానంచేశారు. అప్సరసలు నాట్యం చేశారు. గొప్పదైన కుసుమ వృష్టిని దేవతలు కురిపించారు. ముల్లోకాలు సంతోషం పొందాయి. తొలిచూలు ఆవుల పొదుగులనుండి వాటంతట అవే పాలు ధారాపాతంగా స్రవించాయి. చెట్లన్నీ తేనెలు వర్షించాయి. తీగెలు పూలు, పండ్లతో విరాజిల్లాయి. పర్వతాలు మణులకాంతులతో ఒప్పాయి. ప్రాణులకన్నింటికి తమలోని వైరాలు అంతరించాయి.

(జగతికి మేలు జరిగే సందర్భంలో కనిపించే శుభచిహ్నాలనన్నింటిని కవి వర్ణించాడు. శ్రీకృష్ణుడు సర్వలోక రక్షకుడు. అతని అభిషేక సమయం అందరికీ శుభసమయమే. అందుకే నారదుడు, తుంబురుడు, సిద్దులు, చారణులు, గంధర్వులు పాడడం. అప్సరసలు ఆడడం. అప్రాణులైన చెట్లు లతలు కూడా సంతోషించాయి. స్వామికి ప్రాణి అప్రాణి భేదం లేదు. గోవులను రక్షించేవాని అభిషేక సమయం కాబట్టి తొలిచూలు ఆవులు క్షీరం స్రవించాయి. పర్వతాలు రత్నాలతో తళుక్కున మెరిశాయి. నదులు ఉప్పాంగాయి. ప్రాణులు తమ జాతి వైరాన్ని మరిచాయి.)

దేవేంద్రుడు ఇలా శ్రీకృష్ణుని గోపకులకు, గోవులకు అధినేతగా అభిషిక్తుని చేసి, వీడ్కొలు తీసుకొని, తన దేవగణాలతో స్వర్గానికి తిరిగి వెళ్ళాడు. ఆ తర్వాత

శ్రీకృష్ణమూర్తినందుని వరుణనగరమునుండి కొనితెచ్చుట

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

పంచాంగం

Nanda's discussing with sri krishna about Indrayagam - నందాదు లింద్రయాగము సేయ శ్రీకృష్ణునితో నాలోచించుట

నందాదు లింద్రయాగము సేయ శ్రీకృష్ణునితో నాలోచించుట

ఈ విధంగా బ్రాహ్మణులు అనేక విధాలుగా అనుతాపం అనుభవించారు. తమ తప్పులు మన్నించమని మనస్సులోనే మాధవుణ్ణి ధ్యానించి నమస్కరించారు. అయినా కంసునిభయంవల్ల సమీపంలో ఉన్న బలరామకృష్ణులను సందర్శించడానికి వెళ్లలేదు. ఆ తర్వాత యమునాతీరంలో ఉన్న సర్వసాక్షి అయిన శ్రీకృష్ణుడు, ఇంద్రయాగం చెయ్యాలనే సంకల్పంతో తనవద్దకు వచ్చిన నందుడు మొదలగు పెద్దలైన యాదవులకు నమస్కరించి, నందునితో ఈ విధంగా అన్నాడు.

తండ్రీ! మీరేదో యాగం చెయ్యాలనే తలంపుతో ఇక్కడికి వచ్చారు. దీనివల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? ఈ యాగానికి అధిదేవత ఎవరు? అధికారి (యజమానుడు) ఎవరు? దీనికి కావలసిన సాధన సంపత్తి ఎంత? ఈ యాగం శాస్త్రవిహితమా? లౌకికమా? శత్రువులకు ఇటువంటి కార్యాల విషయాలు చెప్పకూడదు గాని, హితులకు, మిత్రులకు కావలసిన వారికి చెప్పవచ్చును. కర్మతత్త్వం తెలిసి చేస్తే ఫలం బాగా సిద్ధిస్తుంది. పగ, స్నేహం అనే ద్వంద్వం లేకుండా సమభావంతో మెలగే మీవంటి మంచివారికి దాచవలసిన రహస్యాలు ఏమి ఉంటాయి? అమృతతుల్యమైన మాటలతో మీ అభిప్రాయా లేమిటో చెప్పండి.

ప్రౌఢుడైన శ్రీకృష్ణుడు ఈ విధంగా ప్రశ్నించగా, తండ్రి అయిన నందుడు ఈ విధంగా సమాధానం చెబుతున్నాడు.

వర్షానికి వరుణుడూ, షడ్గుణైశ్వర్యసంపన్నుడూ అయిన దేవేంద్రుడు ఈ యాగానికి అధిపతి. ఇంద్రుడికి ప్రియమైన మేఘాలు, అతని ఆజ్ఞచేత నేలమీద వానలు కురిపిస్తాయి. సర్వజీవులకూ ఆప్యాయనం కలిగిస్తాయి. ఆ నీటివల్ల పంటలు పండి ప్రజలకు ధర్మార్ధకామాలు సిద్ధిస్థాయి. ఈ సంగతి అంతా ఎరిగిన రాజులు, లోకంలో ఇంద్రయాగం చేస్తూ ఉంటారు. ఒకవేళ ఎవరైనా కామ లోభ భయద్వేషాలకు లోబడి చేయడం మానేస్తే వారికి తప్పకుండా కీడు మూడుతుంది.

అంతమాత్రమేకాక, ఇంకా ఇంద్రయాగం చేస్తే దేవేంద్రుడు సంతోషించి వానలు కురిపిస్తాడు. వానలు కురిస్తే భూమిమీద గడ్డి పెరుగుతుంది. ఆ గడ్డిని మేసి ఆలమందలు బతుకుతాయి.

కుమారా! ఆవులు బదికితే గొప్ప పాడి కలుగుతుంది. ఆవుల గుంపులవలన చక్కగా పాడి కలుగుతుంది. పాడి కలిగితే మానవులు దేవతలను తృప్తిపరచి జీవిస్తారు.

అని ఇలా నందుడు చెప్పిన మాటలు విని రాక్షససంహారకుడయిన శ్రీకృష్ణుడు, దేవేంద్రుడికి కోపం పెరిగే విధంగా, తన తండ్రితో ఈ విధంగా అన్నాడు.

ఓ నందరాజా! లోకంలో ప్రాణి తాను చేసిన కర్మకు తగిన జన్మనే ఎత్తుతోంది. కర్మచేతనే పెరుగుతోంది. కర్మచేతనే నశిస్తోంది. కాబట్టి ఆ కర్మమే మనుష్యులకు దేవత. ప్రాణుల సుఖదుఃఖాలకుకూడా ఆ కర్మమే మూలం.

మహాత్మా! కర్మాచరణం చేసేవాని కర్మలకు తగిన ఫలాన్ని ఇవ్వడానికి ఈశ్వరుని అవసరం ఉందనుకుంటే అతడుకూడా కర్మలుచేసిన వానికే ఫలం కలిగిస్తాడు. వాస్తవానికి కర్మసంబంధం లేని యీశ్వరుడు కూడా కర్మ చేయనివానికి ఫలమీయలేడు.

కాబట్టి జీవులు తాము పూర్వజన్మలలో చేసుకొన్న కర్మలనుబట్టి సుఖదుఃఖాలు అనుభవిస్తూ ఉంటారు. అలాంటివారు ఇంద్రుడికి భయపడవలసిన అవసరంలేదు. పూర్వ పర్వజన్మలలో చేసిన కర్మలఫలాలు కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయి. వాటి ప్రభావంవల్ల ప్రస్తుత జన్మలలో తగిన కర్మలు చేస్తున్నారు. ఆ కర్మఫలాలనుండి తప్పించడం పరమేశ్వరునికి కూడా సాధ్యం కాదంటే ఇంక ఇతరుల సంగతి చెప్పేదేమిటి? దేవ దానవ మానవ సముదాయాలతో నిండిన ప్రపంచమంతా పూర్వకర్మకు లోబడే ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇందులో సందేహం లేదు. జీవుడు తాను చేసిన కర్మలకు తగిన విధంగానే పెద్దవో, చిన్నవో దేహాలు ధరిస్తూ ఉంటాడు. విడిచి పెడుతూ ఉంటాడు. కర్మఫలాన్ని అనుసరించియే గురువు, దేవత, మిత్రుడు, శత్రువు, చుట్టము మనకు లభిస్తూ ఉంటారు. ఎన్నిజన్మ లెత్తినా జీవుడు కర్మఫలాన్ని అనుసరించే ప్రవర్తిస్తూ ఉంటాడు. జీవునికి కర్మమే దేవత. ఇంతటికీ ముఖ్యకారణం కర్మమే అయినప్పుడు ఆ కర్మను విడిచిపెట్టి ఇతరుల్ని ఆశ్రయించడం భార్య భర్తను విడిచిపెట్టి జారపురుషుణ్ణి ఆశ్రయించడం వంటిది. బ్రాహ్మణుడు వేదవిహితమైన కర్మను ఆచరిస్తూ జీవిస్తాడు. రాజు - ప్రజాపాలన చేస్తాడు. వైశ్యుడు - సేద్యం, వడ్డీకి ఇవ్వడం, పశువులను పోషించడం ద్వారా జీవిక గడుపుకొంటాడు. శూద్రుడు - పైవారిని సేవిస్తూ జీవిస్తాడు. సత్త్వం, రజస్సు, తమస్సు అనే గుణాలు ప్రపంచంయొక్క ఉత్పత్తి, స్థితి, నాశాలకు కారణాలు. వానిలో రజోగుణంవల్ల విశ్వం పుడుతుంది. రజోగుణప్రేరణవల్ల మబ్బులు వానలు కురుస్తూ ఉంటాయి, వానలవల్ల ప్రజలు వృద్ధిపొందుతూ ఉంటారు. ఇందులో ఇంద్రుని అవసరం ఏమి ఉంది? అంతమాత్రమేగాక,

ఈ సందర్భంలో ఇంద్రుడు కోపగించవలసిన అవసరం లేదు. ఒకవేళ కోపగించుకొన్నాడే అనుకొందాం. అందువల్ల మనకు వచ్చే లోటు ఏమీ లేదు. మనకుండే నగరాలు, రాజ్యాలు, ఇళ్లు, వ్యాపారాలు పోతాయేమోనని భయమా? మనం వాటితో నిమిత్తం లేకుండా కొండలలో, అడవులలో పశువులను కాచుకొంటూ, బ్రదుకుతున్నవాళ్లు. మనకు జంకు ఎందుకు?

మనకు జీవనాధారమైన ఆవులను, ఆ ఆవులకు కడుపునిండుగా తినడానికి, త్రాగడానికి, గడ్డిని, నీటిని ఇచ్చే ఈ కొండను, ఎల్లప్పుడు మనహితం కోరే బ్రాహ్మణులను గురించి యజ్ఞం చేయడం మంచిపని. అంతేకాని ఇప్పుడు ఇంద్రయాగం చేయవలసిన అవసరం లేదు. ఇంద్రయాగం గురించి ఏ యే ద్రవ్యాలు తెప్పించాలనుకొన్నారో వానినన్నిటిని తెప్పించండి. పరమాన్నాలు, అప్పాలు, గోధుమపిండివంటలు, పప్పులు, పండ్లు, ఆకుకూరలతో వండదగిన పదార్దాలు వండించండి. అగ్నికి ఆహుతులు సమర్పించండి. షడ్రసోపేతంగా బ్రాహ్మణులకు సంతర్పణ చేసి, పాడిఆవులను, అధికంగా దక్షిణలను సమర్పించండి. స్థిరచిత్తంతో పర్వతాన్ని పూజించండి. పతితులకు, చండాలురకు భోజనాలు పెట్టండి. కుక్కలకు తగిన వంటకాలు పెట్టండి. ఆవులకు కడుపు నిండుగా గడ్డిని పెట్టండి.

ఓ తండ్రీ! చందనం పునుగు జవ్వాజివంటి సుగంధద్రవ్యాలు పూసుకోండి. అలంకారాలు వేసుకోండి. కొత్తబట్టలు కట్టుకోండి. మీరుమీ చుట్టాలతో కలిసి నోరూరించే తినుబండారాలు తినండి. నా మాటమీద గురి ఉంచి, ఈ పర్వతానికి, బ్రాహ్మణులకు, ఆవులకు, అగ్నికి మొక్కండి. మీ పుట్టుక సార్ధకం అవుతుంది.

శ్రీకృష్ణుడు ఇంద్రునిగర్వం అణచడానికి ఈ నూతనయాగం తనకు సమ్మతమని చెప్పాడు. దీన్ని విన్న నందాదులు బాగు బాగని బ్రాహ్మణులచేత పుణ్యాహవాచనమంత్రాలు చదివించారు. వారికి తృప్తిగా భోజనాలు పెట్టారు. ఆవులకు కడుపునిండుగా మేతలు పెట్టారు.

శ్రీకృష్ణుడు ఎప్పటిలాగా తన నిజమయినరూపంతో గొల్లలమధ్య ఉంటూనే 'ఇదిగో పర్వతం. మీరంతా వచ్చి పూజించండి' అని చెప్పి, తాను పర్వతరూపం ధరించి, వారి యెదుట నిలిచాడు. తాను నందాదులతో కలిసి పర్వతరూపంలో ప్రత్యక్షమైన తననే పూజించుకొన్నాడు. ఆ గొల్లలు భక్తితో సమర్పించిన అన్నాదులన్నీ ఆరగించాడు.

తనను ఆశ్రయించిన వారికి కల్పవృక్షమై, కోరిన కోర్కెలు తీర్చే శ్రీకృష్ణుడు గోపాలురతో ఈ విధంగా అన్నాడు. మీరు బాగా వినండి. ఈ పర్వతం తన యిచ్చ వచ్చిన రూపం ధరించగలదు. దుష్టుల్ని శిక్షిస్తుంది. మనం పెట్టిన నెతి బువ్వలన్నీ తిన్నది. మనల్ని ఆదరించింది. మనమీద దయ చూపించింది. ఈ విధంగా పలికి శ్రీకృష్ణుడు కొండకు నమస్కరించాడు.

ఈ విధంగా గొల్లలందరు శ్రీకృష్ణునితో కలిసి కొండకు పూజలు చేసి నైవేద్యాలు పెట్టారు. ఆవులమందల్ని ముందుంచుకొని, బ్రాహ్మణులు ఆశీర్వదిస్తూ ఉండగా, పర్వతానికి ప్రదక్షిణ చేశారు. అప్పుడు,

ఓ పరీక్షిన్మహారాజా! నందాదులు గుర్రాలకంటె వేగంగా పరుగెత్తే ఎడ్లతో బండి కట్టుకొని, గొల్లపిల్లలు కేరింతలు కొడుతూ ఉండగా ఆలమందల్ని వెన్నంటి తరిమి ముందుకు పరుగెత్తించారు.

కలిగొట్టు పూలవాసనవంటి శరీర వాసనగల గోపికలు రథాలమీద వెళ్లుతూ తమ గాన విద్యానైపుణ్యం తేటతెల్లం అయ్యేలా, ఆరోహణావరోహణల క్రమంతో శత్రుసంహారం చేసేవాడు శ్రీకృష్ణుడు - అంటూ అతని లీలలను పాటలుగా పాడారు.

పెద్ద కుండలవంటి పొదుగులతో, మెరుగుగొలుపే పలురంగులతో, బహువిధాలైన ఆకారాలతో, నిండుగా ఉన్న పొట్టలతో ఒప్పే పాడి ఆవులమందలు నేత్రానందం గొల్పుతూ ముందుకు కదిలాయి.

బలిసిన మూపులు, పొడవైన తోకలు, కొండలవంటి పెద్ద శరీరాలు, నింగి నేల నిండేలా వేసే రంకెలుగల ఎడ్లగుంపు నెమ్మదిగా నడచింది.

ఈ విధంగా పర్వతానికి ప్రదక్షిణం చేసిన గొల్లవారు శ్రీకృష్ణునితో కలిసి గొల్లపల్లెకు వెళ్లిపోయారు. అపుడు తనను కాదని కొండను పూజించిన వృత్తాంతం తెలుసుకొన్న దేవేంద్రుడు మహాకోపంతో ప్రళయం కలిగించే సంవర్తకాదిమేఘాలతో ఈ విధంగా అన్నాడు.

(ప్రళయకాల మేఘాలు తొమ్మిది 1.సంవర్తకం 2.ఆవర్తకం 3.పుష్కరం 4.ద్రోణం 5.కాలం 6.నీలం 7.ఆరుణం 8.తమస్సు 9.వారుణం.)

భూలోకంలో నందగోకులంలో ఉన్న గొల్లలు పెరుగులు నేతులు తాగి బాగా పొగరెక్కిపోయారు. వారికి భయం భక్తి కూడా లేకుండా పోయాయి. కొండల గుంపుల కఠినమైన రెక్కల్ని తెగనరకిన వజ్రాయుధం ధరించిన దేవేంద్రుణ్ణి నన్ను లక్ష్యపెట్టక, నా గురించి యాగం చెయ్యక, ఆ శ్రీకృష్ణుని మాట పట్టుకొని ఆ కొండకు పూజచేసి, ఇండ్లకు వెళ్లిపోయారు. చూశారా?

భూలోకంలోని నందగోకులంలో ఉన్న గొల్లలు కృష్ణునిమాట విని, నన్ను విడిచిపెట్టారు. ఆ కృష్ణుడు గురువు, దేవత లేనివాడు, లోకానుభవం లేని పసివాడు. కొండలలోను చెట్లతోపులలోను తిరిగేవాడు, ఎవరిమాట విననివాడు, నిలకడలేనివాడు, మంచికులం, మంచిగుణం లేనివాడు.

ఈ గొల్లవాళ్లు చాల తెలివి తక్కువవాళ్లు. బ్రహ్మవిద్య అనే ఓడతో దాటలేక ఈ పెద్ద సంసార సముద్రాన్ని యజ్ఞాలు, యాగాలు అనే తెప్పలతో దాటాలని వీళ్లు కోరుతున్నారు.

ఓ మేఘములారా! మానవులయిన ఈ గొల్లవారు మరణించే స్వభావం కలవారు. తమ గోసంపద శాశ్వతం అనుకొని, కృష్ణుని ప్రేరణచేత నన్ను గురించిన యాగం చెయ్యడం మానివేశారు. కాబట్టి మీరు వెంటనే వెళ్లి, మెరుపులు మెరయించి, ఉరుములు మొరయించి, వారూ వారితోబాటు వారిఆవులూ ప్రాణాలు వదలేటట్లు అప్రతిహతంగా రాళ్లవాన కురిపించండి;

ఆ కృష్ణుని ఆల మందల్ని బాధించడానికి, నేనునా వాహనమైన ఐరావతాన్ని ఎక్కి దేవసైన్యంతో కలిసి, మీ వెనుకనే వస్తాను, నడవండి.

జంభాసురుణ్ణి జయించిన దేవేంద్రుడు ఈ రీతిగా పలికిఆటోపంతో వజ్రాయుధం అటూ ఇటూ ఝళిపించాడు. జంకు గాంకులు లేకుండా క్రోధంతో పుష్కలావర్తకాది మేఘాల సంకెలలు విడిపించి వ్రేపల్లెమీదికి ఉసిగొలిపాడు. పెనుగాలులు ప్రేరేపింపగా గుంపులుగూడి రేపల్లె మీది ఆకాశమండలాన్ని కారుమొయిళ్లు కమ్ముకొన్నాయి. సూర్యమండలాన్ని కప్పేశాయి. నింగికి నేలకు నడుమ కారుచీకట్లు కమ్మి కన్ను కానరావడం లేదు. త్రివిక్రముడైన వామనుని రెండవ అడుగుతాకిడికి పగిలిన బ్రహ్మాండభాండంచిల్లులనుండది కారే బాహ్యసముద్రజలప్రవాహాలవలె పెద్ద పెద్ద వర్షధారలు కురిశాయి. ఎడతెరిపి లేకుండా వడగళ్లు, పిడుగులు పడ్డాయి. ఎత్తుపల్లాలు ఏకమయ్యేలా వర్షజలం ప్రళయకాల సముద్రాన్ని తలపించింది. ఆ జలప్రవాహంలో దుడుకు తగ్గిన లేగదూడలు ఈదుతూ ప్రళయాగ్ని జ్వాలలవలె విజ్బంభించే విద్యుల్లతలను చూచి, కళ్లు బైరులు కమ్మి సొమ్మసిల్లి పోయాయి. ఆ లేగలకు తమ మోరలు అడ్డంగా ఉంచిన పాడిఆవులు ప్రళయకాల భయంకర భేరీ భాంకారాలవలె వినబడే మేఘగర్జనలకు తమ చెవులు చిల్లుపడగా, గుండెలు పగిలి సాగిలి పడసాగాయి. ఆ గోవులముందు ఆబోతులు నిలబడి, ప్రళయకాలరుద్రునిచేతిలోని పెనుగదాప్రహారాలనుండి పుట్టినవా అన్నట్లుగా ఎడతెగకుండా పడే పిడుగులపాట్లకు అంబా అంబా అని అరుస్తున్నాయి. ఆ అరుపులు శ్రీకృష్ణుణ్ణి రక్షించమని మొర పెట్టుకుంటున్నాయా అన్నట్లుగా ఉన్నాయి. లేగలను, ఆవులను, ఆబోతులను రక్షించుకునే ప్రయత్నంలో ఉన్న గొల్లవాళ్లు వడివడిగా కురిసే వడగళ్ల తాకిడికి సత్తువ తప్పి కొయ్యబారిపోయారు. దట్టమయిన వానతాకిడికి తాళలేక తమ మగలను పట్టుకొని, బలహీనమైన నడుములు వణుకుతూ ఉండగా, రక్షించుమని గోపికలు శ్రీకృష్ణుణ్ణి గురించి మొరపెడుతున్నారు. భయపడిన శిశువులు గట్టివి, పెద్దవి అయిన తమ తల్లుల చన్నులమాటున తలలు దాచుకొంటున్నారు. ఈ విధంగా అల్లకల్లోలమయి, ఆక్రందనలతో నిండిన వ్రేపల్లెను చూచి, ముదుసలి గొల్లలు కొందరు దుష్టశిక్షకుడు శిక్షరక్షకుడు అయిన శ్రీ కృష్ణుణ్ణి సమీపించి, నమస్కరించి ఈ విధంగా ప్రార్థించారు.

దయగలవారిలో మేటివయిన కృష్ణా! ఎక్కడ ఉన్నావయ్యా! అయ్యో, గోకులమంతా జడివానలో తడిసి ముద్దయిపోయింది. మనవారంతా ఆకులపాటుతో అలమటించిపోతున్నారు. నువ్వే దిక్కని నిన్నే నమ్ముకొని ఉన్నమన వారందరినీ కాపాడకుండా ఇంతదాకా ఉపేక్షించడం నీకు తగునా?

గుణమణులకు గనివంటి వాడవయిన కృష్ణా! నీమీద ఒట్టు పెట్టి మరీ చెబుతున్నాము. ఇంతటి తీవ్రమైన ఉరుములు, మెరుపులు, పిడుగుల చప్పుళ్లు, వానధారలు ఇంతకు ముందెప్పుడూ కనీ, వినీ ఎరుగము. మా మొర వినవయ్యా!

తామరపూలవంటి కన్నులు గల ఓ శ్రీకృష్ణా! గొల్లపల్లెలోని మనవారికి ఈ వర్షపునీటిబాధ భరింపరానిదయింది. నీవు తప్ప రక్షించేవారు ఇంకెవరూ లేరు. వెంటనే ఈ మేఘాల బాధ పోగొట్టవయ్యా!

సర్వజ్ఞుడయిన శ్రీకృష్ణుడు మందలోని వారు చెప్పిన మాటలన్నీ విని, జరగిందంతా తెలుసుకొని మనస్సులో ఈ విధంగా భావించాడు.

ఈ గొల్లలు తనంటే లక్ష్యం లేకుండా, క్రమానుగతంగా చేయవలసిన ఇంద్రయాగం చెయ్యకుండా, కొత్త పర్వతయాగం అంటూ మొదలు పెట్టారు అనే కోపంతో దేవేంద్రుడు గొల్లవారిమీద రాళ్లవాన కురిపిస్తున్నాడు. దేవేంద్ర వైభవంవల్ల కలిగిన గర్వం అనే గొప్ప పర్వతంమీద కూర్చుండి, తరతమభావం లేకుండా ఉన్నాడు. గర్వాంధుడయినవాడు ఇతరుల్ని లక్ష్యపెట్టడు గదా!

దేవతలంతా నన్ను సేవిస్తూ ఉంటారు. వారికి దేవపదవి వచ్చిందనే గర్వం లేదు. ఇంద్రునికి కీడు కల్గించకుండా గర్వభంగంమాత్రం చేయాలి.

అని ఆలోచించి రాళ్లవానవల్ల దెబ్బలు తిని, తన్ను శరణు జొచ్చిన వ్రేపల్లెలో గొల్లవారిని కాపాడడం ధర్మమని లోకరక్షకుడు, వివేకశాలి అయిన శ్రీకృష్ణుడు భావించి

వనితలారా! కలతపడకుండి, గొల్లపెద్దలారా! భయంతో వణకిపోకండి. బాలురూ! ఇటూ అటూ పారిపోకండి. మిగిలినవారుకూడా రాళ్లవాన చూచి కంగారు పడకండి. ఆలమందల్ని చెల్లాచెదరుగా గాకుండా ఒకచోట నిలపండి. పరమేశ్వరుడు జాగరూకతతో దయగలవాడై తప్పక మీకు మేలు చేస్తాడు.

శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతము నెత్తుట

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

పంచాంగం

Srikrishnaastami - sri krishna janmastami - శ్రీకృష్ణాష్టమి - శ్రీ కృష్ణ జన్మాష్టమి

శ్రీకృష్ణాష్టమి - శ్రీ కృష్ణ జన్మాష్టమి లోకంలో అధర్మం ప్రబలినందున భూదేవి, బ్రహ్మదేవుల ప్రార్ధన మేరకు నారాయణుడు దేవకీ వసుదేవులకు జన్మిస్తాను ...