శ్రీ సూతుడిట్లనియెను : ఇచ్చట నున్న మహాత్ములు వేదమువలె ప్రసిద్ధమును మహా పుణ్యప్రదమునైన శ్రీ దేవీభాగవత పురాణము విషయమన నన్ను ప్రశ్నించిరి. అందుచే నేనెంతయు ధన్యుడను సదృష్టవంతుడను పవిత్రుడను నైతిని. కావున నేనిపుడు సర్వ వేదార్థ సమ్మితమును సకల శాస్త్రములందు నాగమములందు నుత్తమమైనదియు రహస్యమైనదియు నగు దేవీ పురాణమును చెప్పుదును, ఓ ద్విజోత్తములారా! పరమ యోగులకు ముక్తి నొసంగునదియు బ్రహ్మాదులచేత సేవింపబడునదియు స్తుతిపరులగు ముని ప్రవరులచే నెల్లపుడు ధ్యానింపబడ దగినదియు సుకుమారమునగు శ్రీ మదఖిలాండేశ్వరియగు శ్రీ లలితాదేవి పద పద్మముల కభివందనం బాచరించి నవరసభరితము పురాణ శ్రేష్ఠమును శ్రీదేవి పేరుతో ప్రసిద్ధమునగు శ్రీ మద్దేవీ భాగవత మహాపురాణమును పరమభక్తితో నిపుడు రసోదంచితముగ మీకు చక్కగ వివరింతును. ఎల్ల వేదమార్గములందు ఆదిశక్తిగా ఆత్మవిద్యగా పరాశక్తిగా సంసారపాశ విచ్ఛేదినిగా సకలహృదయనివాసినిగా దుష్టుల కలవిగానిదై శిష్టమునుల నిశ్చల ధ్యానమున దెలియబడునది కామదాయిని యై తనరారు శ్రీ రాజరాజేశ్వరి మాకు ప్రత్యక్షమై సిద్ధులను చేకూర్చుగాత! తన త్రిగుణాత్మకమైన మాయాశక్తిచేత నీ సకల చరాచర ప్రపంచములను సృజించి పెంచి ప్రళయ కాలమున సంహరించుచు లీలావినోదము సలుపుచున్న సర్వవిశ్వమాతను మనసార నెదలో సంస్మరింతును. ఈ కనంబడు జగంబునెల్ల బ్రహ్మయే సృజించెనను నుడి లోకమున వ్యాప్తిలో నున్నది. వేదవిదులు పురాణవేత్తలు నీ విషయము నిట్లే చెప్పుచున్నారు. కాని యా బ్రహ్మయు విష్ణుని నాభికమలమునుండియే జన్మించెను. అతడా విష్ణుని ప్రేరణ చేతనే విశ్వసృష్టికి గడంగెను. కనుక బ్రహ్మయును స్వష్టికార్యమున పరాధీనుడే. ప్రళయకాలమున విష్ణువు శేషశయ్యపై పవ్వళించగా నతని బొడ్డుతమ్మినుండి నలువ యుద్భవించెను. ఆ విష్ణువున కాధారము వేయిపడగల శేషఫణియని మన మెఱుగుదుము. కనుక విష్ణువే విశ్వసృష్టి కాధారమని యెట్లు చెప్పగలము? ఆ మహాసాగర మందలి జలము రసమయమైనది. ఆ రస మేయాధారమును లేక నిలువజాలదు. మాయాశక్తి స్వరూపిణియగు విశ్వజననియే యా జలముల కాధారభూతురాలు. నేనా విశ్వకారణయగు తల్లినే శరణు వేడుకొనుచున్నాను. యోగనిద్రలోనున్న విష్ణునిగాంచి నలువ యే దయామయిని ప్రస్తుతించి యామెను ప్రసన్నురాలినిగ జేసికొనెనో యా దయామృత తరంగిణిని నేను శరణు పొందుచున్నాను. ఆ సగుణ నిర్గుణ స్వరూపిణి మాయామయి ముక్తిప్రదాయిని యగు తల్లినే ధ్యానించి సంపూర్ణ దేవీభాగవత మహాపురాణమును మీకు వచింతును. మునులారా! మీర లది కడుశ్రద్ధగ వినుడుః
ఈ శ్రీదేవీభాగవత మహాపురాణము పుణ్యకరమైనది. ఉత్తమోత్తమమైనది. ఇందు పదునెనిమిదివేల శ్లోకములు గలవు. పండ్రెండు స్కంధములు మూడువందల పదునెనిమిది యధ్యాయములు గలవు. దీనిని శ్రీ వ్యాసభగవానుడు ప్రవచించి ప్రకాశింపచేసెను. ఈ శ్రీదేవీభాగవత పురాణము నందు ప్రథమ స్కంధమున ఇరువది రెండవస్కంధమున పండ్రెండు మూడవస్కంధమున ముప్పది నాల్గవస్కంధమున నిరువదియైదు ఐదవస్కంధమున ముప్పదియైదు ఆఱవస్కంధమున ముప్పదియొకటి ఏడవస్కంధమున నలువది ఎనిమిదవస్కంధమున నిరువదినాలుగు తొమ్మిదవస్కంధమున నేబది పదియవస్కంధమున పదుమూడు పదునొకండవస్కంధమున నిరువదినాలుగు ద్వాదశస్కంధమందు పదునాలుగు అధ్యాయములు గలవు. ఈ మహాపురాణము పదునెనిమిదివేల శ్లోకములు గలదిగా శ్రీవ్యాసమహామునిచే రచింపబడెను. ఇది సర్గము ప్రతిసర్గము వంశము మన్వంతరము వంశానుచరితమునను నైదు లక్షణములతో తనరారుచున్నది. ఆ పరాభట్టారికయే నిత్య నిర్గుణ నిర్వికల్ప శివస్వరూపిణి విశ్వాధార యోగగమ్య తురీయ. అనగా సాత్త్విక రాజస తామస శక్తిత్రయము కంటె విశిష్టమగు పరబ్రహ్మరూపిణి. ఆ విశ్వవ్యాపిని యొక్క సాత్త్వికరాజస తామస శక్తులే శ్రీమహాలక్ష్మి శ్రీమహా సరస్వతి శ్రీమహాకాళి యను స్త్రీ త్రితయ స్వరూపమున చెన్నొందు చున్నవి. ఆ మూడు శక్తులే యీ సృష్టికి నిమిత్తమై దివ్యదేహములు దాల్చును. అట్టి రూపములు దాల్చు లక్షణమునే శాస్త్రకోవిదులు సర్గమని పేర్కొందురు. ఆ ముత్తెఱంగులగు శక్తుల కారణముననే విష్ణు బ్రహ్మ మహేశు లుద్భవించిరి. వీరివలననే సృష్టి పాలన లయములు నిరంతరముగ జరుగు చుండును. ఈ మూర్తి త్రయోద్భవ వృత్తాంతమునే ప్రతిసర్గ మందురు. సూర్య చంద్రవంశజులైన రాజుల వంశచరితమును హిరణ్యకశ్యపాదుల చరిత్రమును దెలుపు లక్షణమునకు వంశమనిపేరు. స్వాయంభువుడు మొదలగు మనువుల వంశములను వారి జీవితకాల పరిమాణములను అభివర్ణించుట మన్వంతరమనంబడును. ఆ మనువేల వంశకథల గూర్చి తెలుపుట వంశానుచరిత మనంబరగును. ఇవియే పురాణములయందుండవలసిన పంచలక్షణములు. తొల్లి శ్రీ వ్యాస మహాముని శ్రీ మహాభారతేతిహాసమును విరచించెను. అది వేదసారము పంచమ వేదము నని ప్రసిద్ధిగాంచినది. అందు నూటయిరువది యైదువేల శ్లోకము లొప్పుచుండును.
శౌనకు లిట్లనిరి: ఓ సూత మహామునీ! నీవు సర్వజ్ఞుడవు. ఆ పురాణములన్నియునెన్ని? వాని పేరులేమి? వాని నన్నిటిని వినగోరుచున్నారము. మాకు వానిని వివరించి తెల్పుము. కలికాలమువలని భయమున మేమీ నైమిశారణ్యమందు నివసించుచున్నాము. ఇది పావనక్షేత్రము. మునుపు బ్రహ్మ తన మనోమయ చక్రమును మా కొసంగి యిట్లనియెను: మీరీ చక్రము వెంట నరుగుడు. ఈ చక్రపునేమి - బండి కంటికమ్మి - యెచ్చోట జారిపడునో యచ్చోటు పవిత్రమైనదని యెఱుంగుడు. ఆ చోట కలిప్రవేశము జరుగనేరదని తెలిసికొనుడు. సత్యయుగము మరల వచ్చువఱకు మీరలా పవిత్ర క్షేత్రమందే యుండుడు. మేమా బ్రహ్మవాక్కులు విని సకల లోకములు చూడ ఆ చక్రము త్రిప్పుచు దాని వెంటనే యరిగితిమి. అది తిరిగి తిరిగి యిచ్చోటికి వచ్చెను. వెంటనే ఆ బండి కంటికమ్మి చూచుచుండగనే యిచ్చోట పడెను. చక్రనేమి శీర్ణమై పడిన స్థలమగుటచే నీ క్షేత్రము నైమిశమని ప్రసిద్ధి కాంచినది. ఇది పరమపావనమైన పుణ్యక్షేత్రము. ఈ పావన స్థలమున కలిప్రవేశము జరుగజాలదు. ఈ కారణముననే మహాత్ములు సిద్ధులు మునులు మేమును కలిభయపీడితులమై యిచ్చోటనే నివాసమేర్పరచుకొంటిమి. సత్యయుగము సమీపించు వరకు మేమిచ్చోటనే పశుహింస లేని పురోడాశాది యాగము లొనరించుచు మా జీవితకాలము గడపుకొందుము. సూతముని సత్తమా ! మా పూర్వ పుణ్యవిశేషమున నీవిచ్చటి కరుగుదెంచితివి. మాకు బ్రహ్మ సమ్మితము పరమపావనము నగు పురాణము నీవు వినిపింపుము. నీవు ధీశాలివి. మహావక్తవు. మేము ఇతర విషయ చింతమాని యేకాగ్ర చిత్తమున పురాణము విన నుత్సహించుచున్నవారము. పవిత్రము నిత్య కళ్యాణప్రదము వేదసమ్మతమునగు ఆ దేవీ భాగవత పురాణము మాకు వినిపించి నీవు తాపత్రయములు లేక దీర్ఘాయుష్కుడవై జీవింపుము. ఆ వ్యాసమహర్షి ధర్మార్థకామ మోక్షములగూర్చియును మహావిద్యను గుఱించియు నా పురాణమందు పరి వర్ణించెను. అట్టిదానిని మాకు వినిపింపుము. ఆ మునీంద్రుడు చెప్పిన సుమనోహరము పరమ పావనము రసభరితమునగు కథలెంతవిన్నను మాకు తనవితీరుటలేదు. సకల సద్గుణములకు పాత్రమైనదియు పవిత్రమైనదియు శ్రీ జగన్మాతయొక్క లీలానాట్యములతో విచిత్రమైనదియు సమస్త పాపరాసులను పటాపంచలు చేయునదియు నెల్లకోర్కులీడేర్చునదియునైన శ్రీభగవతి యను దేవి పేరబరగు శ్రీ దేవీమహాభాగవతమును మాకు దయతో వివరింపుము.
అధ్యాయము 3 పురాణములను-వ్యాసులను గుఱించిన వివరములు
No comments:
Post a Comment