Thursday, April 9, 2026

Chapter 3 Details about the Puranas and Vyasas - అధ్యాయము 3 పురాణములను-వ్యాసులను గుఱించిన వివరములు

శ్రీ దేవీ భాగవతం ప్రథమస్కంధము - అధ్యాయము 3

పురాణములను-వ్యాసులను గుఱించిన వివరములు

సూతుండిట్లనియె :
ఓ మునులారా! సత్యవతీ తనయుడగు వ్యాసమహర్షి వలన నేను సకలపురాణములను వింటిని. వానిని మీకు చెప్పుదును. మీ రెల్లరును కడు శ్రద్ధగా నాలకింపుడు. మకారము మొదటి యక్షరముగా గల పురాణములు రెండు. భకారము తొలుత గలవి రెండు. బ్రకారము మొదట గలవి మూడు. వకారము ముందుగలవి నాలుగు. ఇవికాక అ-నా-ప-లిం-గ-కూ-స్క అను నక్షరములు ముందుగల వేరువేరు పురాణములు గలవు. వీనిలో మొదటిది మత్స్యపురాణము. ఇది పదునాలుగు వేల శ్లోకములలో వ్రాయబడినది రెండవది మార్కండేయ పురాణము. ఇది అత్యద్భుతమైనది. ఇందు తొమ్మిదివేల శ్లోకములు గలవు. భవిష్య పురాణమునందు పదునాల్గువేల యైదువందల శ్లోకములు గలవు. శ్రీ మహాభాగవతము పదునెనిమిదివేల శ్లోకములతోను బ్రహ్మపురాణము పదివేల శ్లోకములతోను విలసిల్లుచున్నవి. బ్రహ్మాండ పురాణ మందలి శ్లోకసంఖ్య పండ్రెండు వేల యొకవంద. బ్రహ్మవైవర్త పురాణమందలి శ్లోక సంఖ్య పదునెనిమిదివేలు. వామన పురాణమందు పదివేల శ్లోకములును వాయు పురాణమునందు నిరువది నాలుగువేల యారువందల శ్లోకములును గలవు. శ్రీ విష్ణు పురాణము మహాద్భుతమైనది. అది యిరువది మూడువేల శ్లోకములతో నొప్పారుచున్నది. పరమాశ్చర్యకరమైన వరాహ పురాణమందు శ్లోకము లిరువదినాల్గువేలు గలవు. అగ్ని పురాణమున మొత్తము శ్లోకములు పదారు వేలును నారద పురాణమున నిరువదైదువేల శ్లోకములు నలరుచున్నవి. శ్రీ పద్మపురాణ మేబది యైదువేల శ్లోకములతో విస్తృతమైయున్నది. లింగ పురాణమునందు పదునొకండువేల శ్లోకములు గలవు. శ్రీహరి గరుడ పురాణమును పందొమ్మిదివేల శ్లోకములలో వెల్లడించెను. కూర్మ పురాణమందు పదునేడువేల శ్లోకములు గలవు. స్కంద పురాణ మెనుబది యొక్క వేల శ్లోకములతో తనరారు చున్నది. ఇది పురాణములయు వానియందలి శ్లోకసంఖ్యలయు వివరణము.

ఇపుడు ఉప పురాణముల గూర్చి వినుడు. సనత్కుమారము నారసింహము నారదీయము శైవము దౌర్వాసము కాపిలము మానవము ఔశనసము వారుణము కాలికము సాంబము నందికృతము పారాశరుడు విపులముగ చెప్పిన యాదిత్యపురాణము మాహేశ్వరము భాగవతము వాసిష్ఠము ననుపేరులతో నుపపురాణములు పదునెనిమిది గలవని మహాత్ములు వాక్రుచ్చుచున్నారు. ఈ విధముగ సత్యవతీ తనయుడగు శ్రీ వ్యాసభగవానుడు పదునెనిమిది మహాపురాణములను వివరించెను. ఆ పిదప వానినన్నిటి సారమును గైకొని శ్రీ మహాభారతమను పేర ప్రసిద్ధమైన గ్రంథమును విరచించెను. ప్రతి మన్వంతరమునందును ద్వాపర యుగములు వచ్చుచుండును. ద్వాపరము వచ్చినపుడెల్ల ధర్మాద్వైతమతితో వ్యాసుడు యథావిధిగా పురాణములను ప్రపంచించు చుండును. ప్రతి ద్వాపరమందును శ్రీ హరియే వ్యాసుడుగ నవతరించి జనులకు మేలుబాట చూపుటకు ప్రతియొక వేదమును అనేకములగు ఉప భాగములుగ విభజించును. ప్రతి కలియుగమునను బ్రాహ్మణులల్పాయువులు నల్పమతులునై యుందురు. వ్యాసుడు వారి కందరికిని మేలు వెలుగు చూపగోరి యుగయుగమునందును పావన పురాణ సంహితలను ప్రకటించును. స్త్రీలకును శూద్రులకును ద్విజబంధువులకును వేదము వినుట కధికారము లేదు. అట్టివారి హితము గోరి పురాణములు రచింపబడినవి. ఇపుడేడవ వైవస్వత మన్వంతరము జరుగుచున్నది. ఈ మన్వంతరమందలి యిరువదెనిమిదవ ద్వాపరము ప్రాప్తించగా నా గురుడు ధర్మవిదుడు నగు సత్యవతీ సుతుడు వ్యాసుడు వ్యాసపీఠమలంకరించి యున్నాడు. ఇక మీదట ఇరువది తొమ్మిదవ ద్వాపరమున ద్రోణపుత్రుడగు అశ్వత్థామ వ్యాసపదము నలంకరించును. ఇట్లిప్పటికిరువదేడుగురు వ్యాసులు వచ్చి వెళ్ళిరి. వీరు ప్రతి ద్వాపరమందును పురాణ సంహితలు వ్రాసిరి.

ఋషులిట్లనిరి: మహాభాగుడవగు సూతమునిచంద్రా! ప్రతి ద్వాపరయుగమునందును పురాణ సంహితలు వెలయించిన వ్యాసమహర్షుల పేరులు దయతో మాకు తెలుపుము. సూతుడిట్లనియె: మొదటి ద్వాపరమున బ్రహ్మయే స్వయముగ వ్యాసుడై వేద విభజన గావించెను. రెండవ ద్వాపరమునందు ప్రజాపతి వ్యాస కృత్యము నెఱపెను. మూడవ ద్వాపరమందు శుక్రుడును నాలవ యైదవ యాఱవ ద్వాపరములందు వరుసగ గురు రవి మృత్యులును వ్యాసపదవులందు శోభిల్లిరి. ఇంద్రు డేడవ ద్వాపరమున వసిష్ఠు డెనిమిదవ ద్వాపరమున సారస్వతుడు తొమ్మిదవ ద్వాపరమున త్రిధాముడు పదవ ద్వాపరమున వ్యాసకార్యములు నిర్వహించిరి. పదునొకండవ ద్వాపరమున త్రివృషుడు పండ్రెండవ ద్వాపరమందు భరద్వాజుడు పదుమూడవ ద్వాపరంబున నంతరిక్షుడు పదునాల్గవ ద్వాపరమున ధర్ముడు పదునైదవదానిలో త్రైయారుణి పదునారవ దానిలో ధనంజయుడు పదునేడవ ద్వాపరమునందు మేధాతిథి పదునెనిమిదవ ద్వాపరమున వ్రతియును పందొమ్మిదవ ద్వాపరమున అత్రియు నిరువదవ ద్వాపరమున గౌతముడును నిరువది యొకటవ ద్వాపరమున నుత్తముడగు హర్యాత్ముడును ఇరువది రెండవ ద్వాపరమునందు వేనుడు వాజశ్రవుడు నిరువది మూడవ దానిలో సోముడాముష్యాయణుడును నిరువది నాలుగవ ద్వాపరములో తృణబిందువు నిరువది యైదవ ద్వాపరమున భార్గవుడును ఇరువదియారవ ద్వాపరములో శక్తియు ఇరువదేడవ ద్వాపరములో జాతుకర్ణియు ఇరువదెనిమిదవ ద్వాపరమునందు కృష్ణద్వైపాయనుడగు వ్యాసుడును వ్యాసపీఠమలంకరించిరి. ఇట్లు మీకిరువదియెనిమిది ద్వాపరములందును వచ్చిన ఇరువది యెనిమిదిమంది వ్యాసులను గుఱించి తెలిపితిని.

వారిలో శ్రీకృష్ణ ద్వైపాయనుడగు వ్యాసుడు శ్రీదేవీభాగవతపురాణము ప్రవచించగా నేను వింటిని. ఆ పురాణము పుణ్యకరమైనది. ఈ కలి సంసార పాతకములను బాపజాలినది. ఆ పురాణము కామదము ముక్తిదము. అది సకలాగమ సారముతో నవరసములతో చమత్కారముతో వెలయుచున్నది. ముముక్షులకది యెంతేని ప్రీతికరమైనది. శ్రీవేదవ్యాసుడు అతి శుభకరమగు ఆ పురాణమును రచించి దానిని మహాత్ముడు వైరాగ్యసంపన్నుడు అరణి సంజాతుడు శుకనామధేయుడు అగు తన పుత్రునిచే అధ్యయనము చేయించెను. అయోనిజుడు అద్భుతధీశాలి తన పుత్రుడనగు శుకునకు వ్యాసుడు మహా మహిమాన్వితమైన యీ పురాణ రాజమును బోధించు నపుడు నే నచ్చోటనే యుంటిని. కావున ఆ వ్యాసగురుని యనుగ్రహమున నాదేవీ పురాణ రహస్యము సర్వము నేనును విను భాగ్యము పొందితిని. ఈ శ్రీమద్దేవీభాగవతము వేదకల్ప వృక్షమున ఫలించిన దివ్యఫలము. దుర్గమ సంసార సాగరమును దాటించు నావ. ఈ పురాణామృతసారము పెక్కు లాఖ్యానములతో నొప్పుచున్నది. దానిని శుకుడు ప్రేమభక్తి నిండార తన కర్ణపుటములు తనివార గ్రోలెను. అట్టి యద్భుత దివ్యకథలు వినిన ప్రతివాడును కలి భయమునుండి ముక్తుడగును. ఇది ముమ్మాటికిని సత్యము. పాపులలో నతిపాపియైనను వేదధర్మ రహితుడైనను స్వధర్మముల బాటించని వాడైనను ఎట్టివాడైన నేనెపముతో నైనను ఈ పరమోత్తమ శ్రీదేవీ పురాణమును భక్తిప్రపత్తులతో వినినచో నట్టివా డిచ్చోటనే విపుల భోగభాగ్యము లనుభవించి పిదప పరమపావని యగు భగవతి సుప్రసాదమున యోగులనుభవించు నక్షయ దేవీ లోకము లందగలడు. ఏ మానవు డీ పరమమగు శ్రీదేవీ పురాణమును నిరంతరమును చక్కగ వినుచుండునో వాని హృదయకమలమందు ధ్యానగమ్యయు సత్పురుషులకు ప్రియతమయు నిర్గుణయు శ్రీవిద్యారూపయు హరిహరాదులకు నలభ్యయు నగు సర్వకారణ కారణ భగవతి ప్రత్యక్షమగుచుండును. ఇతర ప్రాణులవలె కాక సర్వావయవములతో నొప్పు ఈ దేహమును ధరించిన యీ నరజన్మ కడు దుర్లభమైనది. ఇంతటి ఉత్తమ జన్మమునెత్తియు మంచి వాక్కులు గల్గియు మూఢుడీ సంసారసాగరమును దాటించగలిగి ముక్తి నొసగజాలినట్టి యీ దేవీ భాగవతమను నావనుగాంచియు దాని నుపయోగించుకొనజూడనిచో వాడు విధివంచితుడు. ఎవ్వడు మానవజన్మము పొంది వినుటకు సమర్థములగు రెండు చెవులుండియు రాగియై పరనిందలే వినగోరునో - పురుషార్థము లొసంగునదియు నవరసభరితమును నిర్మలమును నగు నీ శ్రీదేవీ భాగవతమును చెవులార వినగోరడో వాడు మందమతి-తనకుతాను నాశము కలిగించుకొనువాడు; కానిచో ముక్తిశ్రీ నొసంగు దీని నేలవినడు?

అధ్యాయము 4 శ్రీ వ్యాసమహర్షి పుత్త్ర సంతతికై పరితపించుట

శ్రీ దేవీ భాగవతం ప్రథమ స్కంధము

No comments:

Post a Comment

Chapter 19 Sri Sukuni's married life - అధ్యాయము 19 శ్రీ శుకుని వైవాహికజీవనము

శ్రీ దేవీ భాగవతం ప్రథమస్కంధము - అధ్యాయము 19 శ్రీ శుకుని వైవాహికజీవనము శ్రీ శుకుడిట్లనియె: "ఓ మహాశయా! ఈ మాయామోహములో కొట్టుమిట్టాడు నరుడ...