Thursday, April 9, 2026

Chapter 4 Sri Vyasa Maharshi's longing for a son - అధ్యాయము 4 శ్రీ వ్యాసమహర్షి పుత్త్ర సంతతికై పరితపించుట

శ్రీ దేవీ భాగవతం ప్రథమస్కంధము - అధ్యాయము 4

శ్రీ వ్యాసమహర్షి పుత్త్ర సంతతికై పరితపించుట


ఋషు లిట్లనిరి: ఓ సౌమ్యా! ఈ పురాణసంహితను వ్యాసునివలన పఠించిన శుకుడెట్టివాడు? వ్యాసుని యే భార్యయందీతడు జన్మించెను. నీవు శుకు డయోనిజుడని యరణి సంజాతుడని వచించితివి. ఈ విషయమై మాకు సందియము గల్గుచున్నది. కనుక శుకుని జన్మవృత్తాంతము వివరించి మా సందేహము బాపుము. మహాతపస్వియగు శుకుడు గర్భయోగియని మేము వింటిమి. అత డీ విస్తృతమగు పురాణమెట్లు వినగలిగెను? 

సూతు డిట్లనియె: ఒకానొకప్పుడు సత్యవతి సుతుడగు వ్యాసుడు సరస్వతీ నదీ తీర మందొక యాశ్రమమున నివసించుచుండెను. అచ్చటనున్న రెండు గోరువంకలను చూచి వ్యాసుడు విస్మయమొందెను. ఆ పక్షులు గ్రుడ్డునుండి యప్పుడే వెడలిన తమ ఱక్కలురాని పిల్లను గూటిలోనే వదలినవి. దాని ముక్కెఱ్ఱగ నున్నది. దానికింకను తోక యీకలు రానేలేదు. అది యెంతయో చూడ ముచ్చట గొల్పుచున్నది. ఆ పిట్టల జంట తమ సంతానమునకు భక్ష్య మందించుట కాసక్తితో పూనుకొనెను. అవి తమ ముక్కుపుటములతో మెతుకులు దెచ్చి దెచ్చి తమ పిల్లనోటిలో మాటిమాటికి పెట్టుచుండెను. అవి తమ యంగములతో దాని యంగములు తాకుచు దాని యెఱ్ఱని ముద్దులు గారు మోమును పలుమారు ప్రేముడితో ముద్దిడుకొనుచు సంబరము పడుచుండెను. ఇట్లా పక్షులు రెండును తమబిడ్డపై చూపు ప్రేమను గని వ్యాసుడు చింతాతురుడై నెమ్మది నిట్లు తలపోయసాగెను: 

'ఆహా! తిర్యగ్జంతువులు సైతము తమ పుత్త్రులపై గుండెనిండిన ప్రేమను గురియునుగదా! ఇంక సేవాఫలమాశించి తమ పుత్రులను ప్రేమించు మానవులలో నిదియుండు ననుటలో వింత యేమున్నది? ఈ పక్షులు తమ పుత్త్రునకు సుఖసాధనమగు పెండ్లి జరిపి తమ కోడలి యందాల మోముగాంచి సంతసించునా?

ఈ పక్షి శాబకము ధర్మమతితో పున్నెము బడయగోరి తన ముదుసలి తల్లిదండ్రులను పూలలోబెట్టి పూజించి వారిని ప్రసన్నులను చేయజాలునా? డబ్బు గడించిన తన తల్లిదండ్రులను తృప్తిపఱచునా? అవి చనిపోవగా వానికిది యుత్తర క్రియలు నెరవేర్చునా? గయకేగి గయాశ్రాద్ధ మాచరించునా? తన పితరుల నుద్దేశించి సక్రమమున నీల వృషోత్సర్జనము జరుపునా? పుత్త్రునంగములు నిమిరి ముద్దిడి లాలించి బుజ్జగించి పుత్త్రగాత్ర పరిష్వంగ సుఖంబు సేకొనుటయే తల్లిదండ్రుల కీ ప్రపంచమం దుత్తమోత్తమ సుఖము సేకొనుటని పెద్దలు నొక్కి వక్కాణింతురు. పుత్త్రులు లేనివారికి సద్గతులు గలుగ నేరవు. స్వర్గము లభించదు. కనుక పరలోకము జేరుటకు పుత్త్రుల బడయుట కంటె వేరొండు సాధనము గనిపించదు. పుత్త్రవంతుడే స్వర్గసీమ నలంకరించగలడు. పుత్త్రహీనుడు దానిని జేరజాలడని ఎల్ల ధర్మశాస్త్రములయు మన్వాదిమునులయు వచనము. పుత్త్రవంతుడే సకల దురిత బంధములనుండి విముక్తుడగు ననుటకు శాశ్వతమైన యాప్తవచనమగు వేదమును సాక్ష్యముగ నున్నది. ఈ విషయము సందేహించుట కెంతమాత్రము వీలులేదు. చావు మొగముతో నున్నవాడు భూశయనము సేయబడియు తానపుత్త్రకుడగుటను గూర్చి చింతాకులుడై లోలోన వగచి వగచి కుమిలి కుమిలి యిట్లు పొగులు చుండును. ''నేడు నా యీ గృహము ధనధాన్య రాసులతో పెక్కు విధములగు పాత్ర పుంజములతో కలకల లాడుచున్నది. దీని కికముందు ఎవడు స్వామి కాగలడో గదా!'' అని యిట్టు లా పుత్త్రహీనుని మనస్సు దుఃఖమున పరిపరి విధముల పరిభ్రమించు చుండును. అత్తఱి నట్టి వ్యాకుల చిత్తునకు దుర్గతులు గా కింకేమి గల్గును!

ఇటుల సత్యవతీ సుతు డనేక విధముల చింతించి వేడినిట్టూర్పులు నిగుడించెను. విమనస్కుడయ్యెను. వ్యాసుడట్లు కొంతతడవాలోచించి తుదకు మేరుగిరిపై నుగ్రతప మాచరించుటకు నెమ్మదిలో గట్టిగ నిశ్చయించుకొనెను. నే నిపు డేదేవత నుపాసించవలయును? వరములు గురియుటలో నే దేవత సమర్థురాలు? ఏ దేవి త్వరితగతిని వాంఛితార్థము లీడేర్చగలదు? అని వ్యాసుడు విత్కరించుకొనుచుండెను. శ్రీ గణపతి బ్రహ్మ విష్ణువు మహేశుడు రవి వరుణుడు సురేంద్రుడు సుబ్రహ్మణ్యుడు అగ్ని-వీరలలో నే నెవ్వరి నారాధించవలయును? అని వ్యాసుడు తలంచుచుండు నంతలోనే నిర్మలాత్ముడు మునిసత్తముడునగు నారదుడు చేత మహతిబూని యాదృచ్ఛికముగ నట కరుగుదెంచెను. అంత వ్యాస మహర్షి దేవర్షిని సందర్శించి ప్రసన్నుడై యతనిని గూర్చుండ నియోగించి అర్ఘ్యపాద్యాది విధుల సత్కరించి కుశల మడిగెను. కుశల ప్రశ్నములైన పిమ్మట నారదుడు వ్యాసున కిట్లనియెను: ఓ ద్వైపాయనా! నీవేల చింతాకులుడవై కనిపించుచున్నావు? నాకంతయు వేగమే తెలుపుము.

వ్యాసుడిట్లనెను: సంతానము లేనివానికి సద్గతులు గలుగవు. వాని యాత్మకు శాంతియును గలుగదు. అందులకే నేనును చింతించుచు పలుమారు విలపించుచున్నాను. సంతతి బడయుటకు నే నేదేవతను ప్రసన్ననుగా చేసికొనవలయును? సకలార్థము లొసగు దేవి యెవ్వరనునది తెలియక విచారించుచున్నాను. ఆ విషయము తెలుపుమని నిన్నే శరణు వేడుచున్నాను. మహర్షీ! నీవు దయగలవాడవు. సర్వజ్ఞుడవు. నే నేదేవతను శరణువేడిన ఆమె సుప్రసన్నయై త్వరగ నాకు పుత్రుని ప్రసాదించగలదో తెలుపుము. 

సూతుడిట్లనియె: అటుల వ్యాసుడడుగగా వేదవిదుడు నారదుడు పరమప్రీతితో నతని కీ ప్రకారముగ సమాధానము నొసగెను. 

నారదుడిట్లనియె: ఓ మహాభాగా! పారాశర్యా! నీవు నన్నడిగిన ప్రశ్ననే నా తండ్రి బ్రహ్మ తొల్లి మధుసూదను నడిగెను. నా తండ్రియగు బ్రహ్మ ధ్యానమున మునింగి శ్రీనాథుడు జగత్పతి దేవేశుడునగు శ్రీహరిని సందర్శించి విస్మయమంది యతని నుతించుచు నిట్లనియెను. ఆ హరి చతుర్భుజుడు. శంఖ చక్ర గదా పద్మధరుడు. పీతాంబరుడు. కౌస్తుభ మణి ప్రభలు దీపిల్లువాడు. దివ్య శ్రీవత్సాంకితమైన వెడదఱొమ్మువాడు. సకలలోక శరణ్యుడు దేవదేవుడు జగన్నాథుడు విశ్వగురుడు మహాతపుడునగు శ్రీహరియు తపమొనర్చుచుండగా జూచి యతనిని నా తండ్రి శరణు వేడెను. 

బ్రహ్మ యిట్లనెను: ఓ జగన్నాథా! నీవు దేవేశుడవు. భూత భావి వర్తమానములపై నధికారముగల ప్రభువవు. నీవేరిని గూర్చి తపించుచున్నావు? ఏ పరతత్త్వమును ధ్యానించుచున్నావు ? అఖిల జగత్ప్రభుడవగు నీవే ధ్యానము చేయుచున్నావే. దీనిని మించిన యాశ్చర్యకర మేమున్నది? నాకిదంతయు వింతగ దోచుచున్నది. నీ బొడ్డుతమ్మినుండి పుట్టిన నేనే యీ విశ్వమునకు సృష్టికర్తను. ఇంక నీకంటె నధికుడెవడైన నున్నచో వానిని గూర్చి నాకు తెలుపుము. నీవే యీ లోకముల కన్నిటికిని కర్తవు భర్తవు హర్తవు. సర్వకారణములకు నీవు మూలకందము. సర్వ కార్యదక్షుడవు నీవే యని నేను బాగుగ నెఱుగుదును. నీ సంకల్ప బలముననే నే నీ జగములు రచింప శక్తుడనైతిని. ఆ హరుడును లయకాలమున నీ కోరికమేరకే లోకములనెల్ల సమయింపజాలును. నీ యాజ్ఞ చేతనే నింగిపై వేవెలుగు భ్రమించుచున్నాడు. వాయువు చల్లగా వెచ్చగా వీచును. అగ్ని ప్రజ్వలించును. మేఘము వర్షించును. నిన్ను మించిన పరదైవతమును నేనీ ముల్లోకములందింతకు ముందు చూచి యెఱుగను. అట్టి నీవును ధ్యానమున నుండుట జూడగ నాకు గొప్ప సందియము గలుగుచున్నది. నేను నీకు పరమ భక్తుడను. నాపై దయదలచి నాకంతయును తేటతెల్లముగ దెలుపుము. మహాత్ములకు తఱచుగ తెలుపరాని రహస్యములుండవని స్మృతి పలుకును.

అను బ్రహ్మ వినయవాక్కులు విని హరి యతనికిట్లు పలికెను: వత్సా! ఏకాగ్ర చిత్తమున నాలకింపుము. నా మనోగతమును వెల్లడించుచున్నాను. నీవీ యెల్లలోకములను పుట్టించువాడవని నేను పోషకుడనని రుద్రుడు సంహారకుడని నీవు దలంచుచున్నావు. సకల సురాసురులు మనుజులు నట్లే తలంతురు. నీవీ యెల్ల భువనములు పుట్టించుటకును నేను పెంచుటకును హరుడు ద్రుంచుటకును కారకులము. ఐనను వేదపారగులగు మహాశయులీ సర్వ మొకేమూలప్రకృతి - పరాశక్తి - మూలమున జరుగుచున్నదని భావింతురు. ఈ లోకములెల్ల పుట్టించుటకు నీయందు రాజసశక్తియు పెంచుటకు నాలోన సత్త్వశక్తియు త్రుంచుటకు హరునియందు తామస శక్తియు గలదని శాస్త్రమున చెప్పబడియున్నది.

ఆ మహత్తరశక్తియే లోపించినచో నీవు సృష్టి కృత్యమును జేయజాలవు. నేను పరిరక్షింపనోపను. హరుడు దెగటార్ప నశక్తుడు. మనమెల్లరమా దివ్యపరశక్తికి పరతంత్రులమై వర్తింతుము. దీనినిగూర్చి ప్రత్యక్ష పరోక్ష ప్రమాణములును గలవు, వినుము. నేను ప్రళయకాలమునందు పరతంత్రుడనై శేషశయ్యపై యోగనిద్రంజెందుదును. మరల కాలవశుండనై తగిన సమయము వచ్చినపుడు మేల్కాంతును. ఆ దేవికి వశుడనై నే నెల్లకాలమును తపమాచరించుచుందును. ఒక్కొక్కప్పుడు శ్రీ లక్ష్మితోడ యథా సుఖముగ విహార మొనర్చుచుందును. ఒక్కొక్కతఱి క్రూరదానవులతో దారుణము సర్వలోకభీకరమునై దేహములను నింద్రియములను బాధించు సమరము జరుపుదును. మున్ను నేను మహాజలరాశిపై నైదు వేలేండ్లు ఘోర బాహుయుద్ధము సలిపితిని. అది నీకు ప్రత్యక్ష విదితమేగద! నా చెవులమలమునుండి పుట్టి మదమున విఱ్ఱవీగిన మధుకైటభులను దుష్టదానవులా దేవదేవి దయవలననే నాచే దనుమబడిరి. ఆనాటి నా విజయశ్రీకి కారణము నీ వెఱుంగవా? ఓ మహాభాగా! ఆ పరాత్పర శక్తియే దానికి మూలకారణము. అట్టి శక్తిగూర్చి పదేపదే ఏల యడుగుదువు? ఆమె ఇచ్ఛ చేతనే నేను మొదట మణి ద్వీపమున స్త్రీరూపమునుండి అనంతరము సముద్రమున పుం రూపమున విష్ణుడనై విహరించుచున్నాను. ఆ తల్లి దయవలననే గదా యుగయుగమున కూర్మ వరాహ నరసింహాద్యవతారములు దాల్చుచుందును. ఈ తిర్యగ్యోనులందు పుట్టుట కెవ్వడిచ్చగించును? నాకే స్వేచ్ఛయున్నచో వరాహాది యోనులందు నేనేల జన్మింతును? లక్ష్మితోడి వినోదవిహారములు వదలి చేప మున్నగు నీచయోనులందు బుట్టుట కెవ్వనికి మనసొప్పును? పాపఱని సెజ్జవదలి గరుత్మంతుని మూపుపైనెక్కి స్వతంత్రేచ్ఛతో ఏవాడు బవరమొనర్ప నుత్సహించును? మునుపొకప్పుడు నీవు చూచుచుండగనే వింటి యల్లెత్రాటిచేత నా తల తెగిపడినదిగదా! శిల్పనిపుణుడగు త్వష్ట వెనువెంటనే గుఱ్ఱముతలదెచ్చి నా మొండెమున కతికించెను. ఆనాటి నుండి నన్ను హయగ్రీవుడనుచున్నారు. ఇదంతయును లోకవిడంబనమేసుమా! నా కాత్మ స్వాతంత్య్రమే యున్నచో నిట్లెట్లు జరుగును? కాన నేను స్వతంత్రుడనుగాను. సర్వవిధముల శక్తి పరతంత్రుడను. అందుచేత నేనా శక్తినే రేయింబవళ్లెడతెగక ధ్యానించుచుందును. ఇంతకుమించి నాకేమియు తెలియదు. 

నారదుడిట్లనియె: ఈ ప్రకారముగ విష్ణువు బ్రహ్మతో బలికెను. ఓ వ్యాసమునీ! నేనా బ్రహ్మవలన సర్వము వింటిని. కనుక నీవును నిత్యకల్యాణ ప్రదమగు పురుషార్థ ప్రాప్తికి బూనుకొని ఆ దేవీ పదకమలములను నీ హృదయారవిందమున నిరంతరము భజింపుము. నీవు కోరినదెల్ల ఆ తల్లియే ప్రసాదించుచుండును. ఇందు సందియ మావంతయును లేదు. 

సూతు డిట్లనియె: నారదుడీవిధముగ దెలుపగా వ్యాసుడా దేవి దివ్యచరణారవిందములను లోనిడెందమున దలంచుచు తపము చేయుటకు పర్వతము జేరెను.

అధ్యాయము 5 శ్రీ హయగ్రీవావతారవర్ణనము

No comments:

Post a Comment

Chapter 19 Sri Sukuni's married life - అధ్యాయము 19 శ్రీ శుకుని వైవాహికజీవనము

శ్రీ దేవీ భాగవతం ప్రథమస్కంధము - అధ్యాయము 19 శ్రీ శుకుని వైవాహికజీవనము శ్రీ శుకుడిట్లనియె: "ఓ మహాశయా! ఈ మాయామోహములో కొట్టుమిట్టాడు నరుడ...