ఈ విధంగా బ్రాహ్మణులు అనేక విధాలుగా అనుతాపం అనుభవించారు. తమ తప్పులు మన్నించమని మనస్సులోనే మాధవుణ్ణి ధ్యానించి నమస్కరించారు. అయినా కంసునిభయంవల్ల సమీపంలో ఉన్న బలరామకృష్ణులను సందర్శించడానికి వెళ్లలేదు. ఆ తర్వాత యమునాతీరంలో ఉన్న సర్వసాక్షి అయిన శ్రీకృష్ణుడు, ఇంద్రయాగం చెయ్యాలనే సంకల్పంతో తనవద్దకు వచ్చిన నందుడు మొదలగు పెద్దలైన యాదవులకు నమస్కరించి, నందునితో ఈ విధంగా అన్నాడు.
తండ్రీ! మీరేదో యాగం చెయ్యాలనే తలంపుతో ఇక్కడికి వచ్చారు. దీనివల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? ఈ యాగానికి అధిదేవత ఎవరు? అధికారి (యజమానుడు) ఎవరు? దీనికి కావలసిన సాధన సంపత్తి ఎంత? ఈ యాగం శాస్త్రవిహితమా? లౌకికమా? శత్రువులకు ఇటువంటి కార్యాల విషయాలు చెప్పకూడదు గాని, హితులకు, మిత్రులకు కావలసిన వారికి చెప్పవచ్చును. కర్మతత్త్వం తెలిసి చేస్తే ఫలం బాగా సిద్ధిస్తుంది. పగ, స్నేహం అనే ద్వంద్వం లేకుండా సమభావంతో మెలగే మీవంటి మంచివారికి దాచవలసిన రహస్యాలు ఏమి ఉంటాయి? అమృతతుల్యమైన మాటలతో మీ అభిప్రాయా లేమిటో చెప్పండి.
ప్రౌఢుడైన శ్రీకృష్ణుడు ఈ విధంగా ప్రశ్నించగా, తండ్రి అయిన నందుడు ఈ విధంగా సమాధానం చెబుతున్నాడు.
వర్షానికి వరుణుడూ, షడ్గుణైశ్వర్యసంపన్నుడూ అయిన దేవేంద్రుడు ఈ యాగానికి అధిపతి. ఇంద్రుడికి ప్రియమైన మేఘాలు, అతని ఆజ్ఞచేత నేలమీద వానలు కురిపిస్తాయి. సర్వజీవులకూ ఆప్యాయనం కలిగిస్తాయి. ఆ నీటివల్ల పంటలు పండి ప్రజలకు ధర్మార్ధకామాలు సిద్ధిస్థాయి. ఈ సంగతి అంతా ఎరిగిన రాజులు, లోకంలో ఇంద్రయాగం చేస్తూ ఉంటారు. ఒకవేళ ఎవరైనా కామ లోభ భయద్వేషాలకు లోబడి చేయడం మానేస్తే వారికి తప్పకుండా కీడు మూడుతుంది.
అంతమాత్రమేకాక, ఇంకా ఇంద్రయాగం చేస్తే దేవేంద్రుడు సంతోషించి వానలు కురిపిస్తాడు. వానలు కురిస్తే భూమిమీద గడ్డి పెరుగుతుంది. ఆ గడ్డిని మేసి ఆలమందలు బతుకుతాయి.
కుమారా! ఆవులు బదికితే గొప్ప పాడి కలుగుతుంది. ఆవుల గుంపులవలన చక్కగా పాడి కలుగుతుంది. పాడి కలిగితే మానవులు దేవతలను తృప్తిపరచి జీవిస్తారు.
అని ఇలా నందుడు చెప్పిన మాటలు విని రాక్షససంహారకుడయిన శ్రీకృష్ణుడు, దేవేంద్రుడికి కోపం పెరిగే విధంగా, తన తండ్రితో ఈ విధంగా అన్నాడు.
ఓ నందరాజా! లోకంలో ప్రాణి తాను చేసిన కర్మకు తగిన జన్మనే ఎత్తుతోంది. కర్మచేతనే పెరుగుతోంది. కర్మచేతనే నశిస్తోంది. కాబట్టి ఆ కర్మమే మనుష్యులకు దేవత. ప్రాణుల సుఖదుఃఖాలకుకూడా ఆ కర్మమే మూలం.
మహాత్మా! కర్మాచరణం చేసేవాని కర్మలకు తగిన ఫలాన్ని ఇవ్వడానికి ఈశ్వరుని అవసరం ఉందనుకుంటే అతడుకూడా కర్మలుచేసిన వానికే ఫలం కలిగిస్తాడు. వాస్తవానికి కర్మసంబంధం లేని యీశ్వరుడు కూడా కర్మ చేయనివానికి ఫలమీయలేడు.
కాబట్టి జీవులు తాము పూర్వజన్మలలో చేసుకొన్న కర్మలనుబట్టి సుఖదుఃఖాలు అనుభవిస్తూ ఉంటారు. అలాంటివారు ఇంద్రుడికి భయపడవలసిన అవసరంలేదు. పూర్వ పర్వజన్మలలో చేసిన కర్మలఫలాలు కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయి. వాటి ప్రభావంవల్ల ప్రస్తుత జన్మలలో తగిన కర్మలు చేస్తున్నారు. ఆ కర్మఫలాలనుండి తప్పించడం పరమేశ్వరునికి కూడా సాధ్యం కాదంటే ఇంక ఇతరుల సంగతి చెప్పేదేమిటి? దేవ దానవ మానవ సముదాయాలతో నిండిన ప్రపంచమంతా పూర్వకర్మకు లోబడే ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇందులో సందేహం లేదు. జీవుడు తాను చేసిన కర్మలకు తగిన విధంగానే పెద్దవో, చిన్నవో దేహాలు ధరిస్తూ ఉంటాడు. విడిచి పెడుతూ ఉంటాడు. కర్మఫలాన్ని అనుసరించియే గురువు, దేవత, మిత్రుడు, శత్రువు, చుట్టము మనకు లభిస్తూ ఉంటారు. ఎన్నిజన్మ లెత్తినా జీవుడు కర్మఫలాన్ని అనుసరించే ప్రవర్తిస్తూ ఉంటాడు. జీవునికి కర్మమే దేవత. ఇంతటికీ ముఖ్యకారణం కర్మమే అయినప్పుడు ఆ కర్మను విడిచిపెట్టి ఇతరుల్ని ఆశ్రయించడం భార్య భర్తను విడిచిపెట్టి జారపురుషుణ్ణి ఆశ్రయించడం వంటిది. బ్రాహ్మణుడు వేదవిహితమైన కర్మను ఆచరిస్తూ జీవిస్తాడు. రాజు - ప్రజాపాలన చేస్తాడు. వైశ్యుడు - సేద్యం, వడ్డీకి ఇవ్వడం, పశువులను పోషించడం ద్వారా జీవిక గడుపుకొంటాడు. శూద్రుడు - పైవారిని సేవిస్తూ జీవిస్తాడు. సత్త్వం, రజస్సు, తమస్సు అనే గుణాలు ప్రపంచంయొక్క ఉత్పత్తి, స్థితి, నాశాలకు కారణాలు. వానిలో రజోగుణంవల్ల విశ్వం పుడుతుంది. రజోగుణప్రేరణవల్ల మబ్బులు వానలు కురుస్తూ ఉంటాయి, వానలవల్ల ప్రజలు వృద్ధిపొందుతూ ఉంటారు. ఇందులో ఇంద్రుని అవసరం ఏమి ఉంది? అంతమాత్రమేగాక,
ఈ సందర్భంలో ఇంద్రుడు కోపగించవలసిన అవసరం లేదు. ఒకవేళ కోపగించుకొన్నాడే అనుకొందాం. అందువల్ల మనకు వచ్చే లోటు ఏమీ లేదు. మనకుండే నగరాలు, రాజ్యాలు, ఇళ్లు, వ్యాపారాలు పోతాయేమోనని భయమా? మనం వాటితో నిమిత్తం లేకుండా కొండలలో, అడవులలో పశువులను కాచుకొంటూ, బ్రదుకుతున్నవాళ్లు. మనకు జంకు ఎందుకు?
మనకు జీవనాధారమైన ఆవులను, ఆ ఆవులకు కడుపునిండుగా తినడానికి, త్రాగడానికి, గడ్డిని, నీటిని ఇచ్చే ఈ కొండను, ఎల్లప్పుడు మనహితం కోరే బ్రాహ్మణులను గురించి యజ్ఞం చేయడం మంచిపని. అంతేకాని ఇప్పుడు ఇంద్రయాగం చేయవలసిన అవసరం లేదు. ఇంద్రయాగం గురించి ఏ యే ద్రవ్యాలు తెప్పించాలనుకొన్నారో వానినన్నిటిని తెప్పించండి. పరమాన్నాలు, అప్పాలు, గోధుమపిండివంటలు, పప్పులు, పండ్లు, ఆకుకూరలతో వండదగిన పదార్దాలు వండించండి. అగ్నికి ఆహుతులు సమర్పించండి. షడ్రసోపేతంగా బ్రాహ్మణులకు సంతర్పణ చేసి, పాడిఆవులను, అధికంగా దక్షిణలను సమర్పించండి. స్థిరచిత్తంతో పర్వతాన్ని పూజించండి. పతితులకు, చండాలురకు భోజనాలు పెట్టండి. కుక్కలకు తగిన వంటకాలు పెట్టండి. ఆవులకు కడుపు నిండుగా గడ్డిని పెట్టండి.
ఓ తండ్రీ! చందనం పునుగు జవ్వాజివంటి సుగంధద్రవ్యాలు పూసుకోండి. అలంకారాలు వేసుకోండి. కొత్తబట్టలు కట్టుకోండి. మీరుమీ చుట్టాలతో కలిసి నోరూరించే తినుబండారాలు తినండి. నా మాటమీద గురి ఉంచి, ఈ పర్వతానికి, బ్రాహ్మణులకు, ఆవులకు, అగ్నికి మొక్కండి. మీ పుట్టుక సార్ధకం అవుతుంది.
శ్రీకృష్ణుడు ఇంద్రునిగర్వం అణచడానికి ఈ నూతనయాగం తనకు సమ్మతమని చెప్పాడు. దీన్ని విన్న నందాదులు బాగు బాగని బ్రాహ్మణులచేత పుణ్యాహవాచనమంత్రాలు చదివించారు. వారికి తృప్తిగా భోజనాలు పెట్టారు. ఆవులకు కడుపునిండుగా మేతలు పెట్టారు.
శ్రీకృష్ణుడు ఎప్పటిలాగా తన నిజమయినరూపంతో గొల్లలమధ్య ఉంటూనే 'ఇదిగో పర్వతం. మీరంతా వచ్చి పూజించండి' అని చెప్పి, తాను పర్వతరూపం ధరించి, వారి యెదుట నిలిచాడు. తాను నందాదులతో కలిసి పర్వతరూపంలో ప్రత్యక్షమైన తననే పూజించుకొన్నాడు. ఆ గొల్లలు భక్తితో సమర్పించిన అన్నాదులన్నీ ఆరగించాడు.
తనను ఆశ్రయించిన వారికి కల్పవృక్షమై, కోరిన కోర్కెలు తీర్చే శ్రీకృష్ణుడు గోపాలురతో ఈ విధంగా అన్నాడు. మీరు బాగా వినండి. ఈ పర్వతం తన యిచ్చ వచ్చిన రూపం ధరించగలదు. దుష్టుల్ని శిక్షిస్తుంది. మనం పెట్టిన నెతి బువ్వలన్నీ తిన్నది. మనల్ని ఆదరించింది. మనమీద దయ చూపించింది. ఈ విధంగా పలికి శ్రీకృష్ణుడు కొండకు నమస్కరించాడు.
ఈ విధంగా గొల్లలందరు శ్రీకృష్ణునితో కలిసి కొండకు పూజలు చేసి నైవేద్యాలు పెట్టారు. ఆవులమందల్ని ముందుంచుకొని, బ్రాహ్మణులు ఆశీర్వదిస్తూ ఉండగా, పర్వతానికి ప్రదక్షిణ చేశారు. అప్పుడు,
ఓ పరీక్షిన్మహారాజా! నందాదులు గుర్రాలకంటె వేగంగా పరుగెత్తే ఎడ్లతో బండి కట్టుకొని, గొల్లపిల్లలు కేరింతలు కొడుతూ ఉండగా ఆలమందల్ని వెన్నంటి తరిమి ముందుకు పరుగెత్తించారు.
కలిగొట్టు పూలవాసనవంటి శరీర వాసనగల గోపికలు రథాలమీద వెళ్లుతూ తమ గాన విద్యానైపుణ్యం తేటతెల్లం అయ్యేలా, ఆరోహణావరోహణల క్రమంతో శత్రుసంహారం చేసేవాడు శ్రీకృష్ణుడు - అంటూ అతని లీలలను పాటలుగా పాడారు.
పెద్ద కుండలవంటి పొదుగులతో, మెరుగుగొలుపే పలురంగులతో, బహువిధాలైన ఆకారాలతో, నిండుగా ఉన్న పొట్టలతో ఒప్పే పాడి ఆవులమందలు నేత్రానందం గొల్పుతూ ముందుకు కదిలాయి.
బలిసిన మూపులు, పొడవైన తోకలు, కొండలవంటి పెద్ద శరీరాలు, నింగి నేల నిండేలా వేసే రంకెలుగల ఎడ్లగుంపు నెమ్మదిగా నడచింది.
ఈ విధంగా పర్వతానికి ప్రదక్షిణం చేసిన గొల్లవారు శ్రీకృష్ణునితో కలిసి గొల్లపల్లెకు వెళ్లిపోయారు. అపుడు తనను కాదని కొండను పూజించిన వృత్తాంతం తెలుసుకొన్న దేవేంద్రుడు మహాకోపంతో ప్రళయం కలిగించే సంవర్తకాదిమేఘాలతో ఈ విధంగా అన్నాడు.
(ప్రళయకాల మేఘాలు తొమ్మిది 1.సంవర్తకం 2.ఆవర్తకం 3.పుష్కరం 4.ద్రోణం 5.కాలం 6.నీలం 7.ఆరుణం 8.తమస్సు 9.వారుణం.)
భూలోకంలో నందగోకులంలో ఉన్న గొల్లలు పెరుగులు నేతులు తాగి బాగా పొగరెక్కిపోయారు. వారికి భయం భక్తి కూడా లేకుండా పోయాయి. కొండల గుంపుల కఠినమైన రెక్కల్ని తెగనరకిన వజ్రాయుధం ధరించిన దేవేంద్రుణ్ణి నన్ను లక్ష్యపెట్టక, నా గురించి యాగం చెయ్యక, ఆ శ్రీకృష్ణుని మాట పట్టుకొని ఆ కొండకు పూజచేసి, ఇండ్లకు వెళ్లిపోయారు. చూశారా?
భూలోకంలోని నందగోకులంలో ఉన్న గొల్లలు కృష్ణునిమాట విని, నన్ను విడిచిపెట్టారు. ఆ కృష్ణుడు గురువు, దేవత లేనివాడు, లోకానుభవం లేని పసివాడు. కొండలలోను చెట్లతోపులలోను తిరిగేవాడు, ఎవరిమాట విననివాడు, నిలకడలేనివాడు, మంచికులం, మంచిగుణం లేనివాడు.
ఈ గొల్లవాళ్లు చాల తెలివి తక్కువవాళ్లు. బ్రహ్మవిద్య అనే ఓడతో దాటలేక ఈ పెద్ద సంసార సముద్రాన్ని యజ్ఞాలు, యాగాలు అనే తెప్పలతో దాటాలని వీళ్లు కోరుతున్నారు.
ఓ మేఘములారా! మానవులయిన ఈ గొల్లవారు మరణించే స్వభావం కలవారు. తమ గోసంపద శాశ్వతం అనుకొని, కృష్ణుని ప్రేరణచేత నన్ను గురించిన యాగం చెయ్యడం మానివేశారు. కాబట్టి మీరు వెంటనే వెళ్లి, మెరుపులు మెరయించి, ఉరుములు మొరయించి, వారూ వారితోబాటు వారిఆవులూ ప్రాణాలు వదలేటట్లు అప్రతిహతంగా రాళ్లవాన కురిపించండి;
ఆ కృష్ణుని ఆల మందల్ని బాధించడానికి, నేనునా వాహనమైన ఐరావతాన్ని ఎక్కి దేవసైన్యంతో కలిసి, మీ వెనుకనే వస్తాను, నడవండి.
జంభాసురుణ్ణి జయించిన దేవేంద్రుడు ఈ రీతిగా పలికిఆటోపంతో వజ్రాయుధం అటూ ఇటూ ఝళిపించాడు. జంకు గాంకులు లేకుండా క్రోధంతో పుష్కలావర్తకాది మేఘాల సంకెలలు విడిపించి వ్రేపల్లెమీదికి ఉసిగొలిపాడు. పెనుగాలులు ప్రేరేపింపగా గుంపులుగూడి రేపల్లె మీది ఆకాశమండలాన్ని కారుమొయిళ్లు కమ్ముకొన్నాయి. సూర్యమండలాన్ని కప్పేశాయి. నింగికి నేలకు నడుమ కారుచీకట్లు కమ్మి కన్ను కానరావడం లేదు. త్రివిక్రముడైన వామనుని రెండవ అడుగుతాకిడికి పగిలిన బ్రహ్మాండభాండంచిల్లులనుండది కారే బాహ్యసముద్రజలప్రవాహాలవలె పెద్ద పెద్ద వర్షధారలు కురిశాయి. ఎడతెరిపి లేకుండా వడగళ్లు, పిడుగులు పడ్డాయి. ఎత్తుపల్లాలు ఏకమయ్యేలా వర్షజలం ప్రళయకాల సముద్రాన్ని తలపించింది. ఆ జలప్రవాహంలో దుడుకు తగ్గిన లేగదూడలు ఈదుతూ ప్రళయాగ్ని జ్వాలలవలె విజ్బంభించే విద్యుల్లతలను చూచి, కళ్లు బైరులు కమ్మి సొమ్మసిల్లి పోయాయి. ఆ లేగలకు తమ మోరలు అడ్డంగా ఉంచిన పాడిఆవులు ప్రళయకాల భయంకర భేరీ భాంకారాలవలె వినబడే మేఘగర్జనలకు తమ చెవులు చిల్లుపడగా, గుండెలు పగిలి సాగిలి పడసాగాయి. ఆ గోవులముందు ఆబోతులు నిలబడి, ప్రళయకాలరుద్రునిచేతిలోని పెనుగదాప్రహారాలనుండి పుట్టినవా అన్నట్లుగా ఎడతెగకుండా పడే పిడుగులపాట్లకు అంబా అంబా అని అరుస్తున్నాయి. ఆ అరుపులు శ్రీకృష్ణుణ్ణి రక్షించమని మొర పెట్టుకుంటున్నాయా అన్నట్లుగా ఉన్నాయి. లేగలను, ఆవులను, ఆబోతులను రక్షించుకునే ప్రయత్నంలో ఉన్న గొల్లవాళ్లు వడివడిగా కురిసే వడగళ్ల తాకిడికి సత్తువ తప్పి కొయ్యబారిపోయారు. దట్టమయిన వానతాకిడికి తాళలేక తమ మగలను పట్టుకొని, బలహీనమైన నడుములు వణుకుతూ ఉండగా, రక్షించుమని గోపికలు శ్రీకృష్ణుణ్ణి గురించి మొరపెడుతున్నారు. భయపడిన శిశువులు గట్టివి, పెద్దవి అయిన తమ తల్లుల చన్నులమాటున తలలు దాచుకొంటున్నారు. ఈ విధంగా అల్లకల్లోలమయి, ఆక్రందనలతో నిండిన వ్రేపల్లెను చూచి, ముదుసలి గొల్లలు కొందరు దుష్టశిక్షకుడు శిక్షరక్షకుడు అయిన శ్రీ కృష్ణుణ్ణి సమీపించి, నమస్కరించి ఈ విధంగా ప్రార్థించారు.
దయగలవారిలో మేటివయిన కృష్ణా! ఎక్కడ ఉన్నావయ్యా! అయ్యో, గోకులమంతా జడివానలో తడిసి ముద్దయిపోయింది. మనవారంతా ఆకులపాటుతో అలమటించిపోతున్నారు. నువ్వే దిక్కని నిన్నే నమ్ముకొని ఉన్నమన వారందరినీ కాపాడకుండా ఇంతదాకా ఉపేక్షించడం నీకు తగునా?
గుణమణులకు గనివంటి వాడవయిన కృష్ణా! నీమీద ఒట్టు పెట్టి మరీ చెబుతున్నాము. ఇంతటి తీవ్రమైన ఉరుములు, మెరుపులు, పిడుగుల చప్పుళ్లు, వానధారలు ఇంతకు ముందెప్పుడూ కనీ, వినీ ఎరుగము. మా మొర వినవయ్యా!
తామరపూలవంటి కన్నులు గల ఓ శ్రీకృష్ణా! గొల్లపల్లెలోని మనవారికి ఈ వర్షపునీటిబాధ భరింపరానిదయింది. నీవు తప్ప రక్షించేవారు ఇంకెవరూ లేరు. వెంటనే ఈ మేఘాల బాధ పోగొట్టవయ్యా!
సర్వజ్ఞుడయిన శ్రీకృష్ణుడు మందలోని వారు చెప్పిన మాటలన్నీ విని, జరగిందంతా తెలుసుకొని మనస్సులో ఈ విధంగా భావించాడు.
ఈ గొల్లలు తనంటే లక్ష్యం లేకుండా, క్రమానుగతంగా చేయవలసిన ఇంద్రయాగం చెయ్యకుండా, కొత్త పర్వతయాగం అంటూ మొదలు పెట్టారు అనే కోపంతో దేవేంద్రుడు గొల్లవారిమీద రాళ్లవాన కురిపిస్తున్నాడు. దేవేంద్ర వైభవంవల్ల కలిగిన గర్వం అనే గొప్ప పర్వతంమీద కూర్చుండి, తరతమభావం లేకుండా ఉన్నాడు. గర్వాంధుడయినవాడు ఇతరుల్ని లక్ష్యపెట్టడు గదా!
దేవతలంతా నన్ను సేవిస్తూ ఉంటారు. వారికి దేవపదవి వచ్చిందనే గర్వం లేదు. ఇంద్రునికి కీడు కల్గించకుండా గర్వభంగంమాత్రం చేయాలి.
అని ఆలోచించి రాళ్లవానవల్ల దెబ్బలు తిని, తన్ను శరణు జొచ్చిన వ్రేపల్లెలో గొల్లవారిని కాపాడడం ధర్మమని లోకరక్షకుడు, వివేకశాలి అయిన శ్రీకృష్ణుడు భావించి
వనితలారా! కలతపడకుండి, గొల్లపెద్దలారా! భయంతో వణకిపోకండి. బాలురూ! ఇటూ అటూ పారిపోకండి. మిగిలినవారుకూడా రాళ్లవాన చూచి కంగారు పడకండి. ఆలమందల్ని చెల్లాచెదరుగా గాకుండా ఒకచోట నిలపండి. పరమేశ్వరుడు జాగరూకతతో దయగలవాడై తప్పక మీకు మేలు చేస్తాడు.
No comments:
Post a Comment