శ్రీకృష్ణుడు ఈ విధంగా గోపికలను అనుగ్రహించి, బృందావనాన్ని దాటి, దూరంగా తోలుకొనిపోయి ఆవుల్ని మేపుతున్నాడు. ఎండ మెండుగా కాస్తోంది. గొల్లవారు ఆ వేడికి తట్టుకోలేక పోతున్నారు. నీరసించి పోతున్నారు. అక్కడ విశాలంగా విస్తరించి గాడుగులవలె నీడనిచ్చే చెట్లు ఉన్నాయి. వాటిల్ని చూచి తక్కిన గొల్లవారు శ్రీకృష్ణుడు, బలరాముడు, శ్రీదాముడు, దేవప్రస్థుడు, విశాలుడు, అర్జునుడు, మొదలయినవారితో ఈ విధంగా అన్నారు.
గోపబాలకులారా! ఈ చెట్లు చూడండి. ఎంత గొప్పవో! తమకు కీడు తలపెడదామని వచ్చినవారికికూడా కీడు చేయవు. ఎవరిసంబంధం లేకుండా ఏకాంతంగా ఉన్నాయి. ఎండ, చలి, వానలనుండి ప్రజల్ని కాపాడుతున్నాయి. వారికి అవసరమైన బెరడు, గంధం, జిగురు, బూడిద, చిగుళ్లు, తేనె, పూలు, పండ్లు, నీడలు ఇచ్చి ఆదుకుంటున్నాయి.
(రాగద్వేషాలు లేని మహాయోగీశ్వరులు ఏకాంతంగా తపస్సు చేసుకొంటూ ఉంటారు. తమను ఆశ్రయించినవారు మంచివారయినా, చెడ్డవారయినా సర్వసమభావంతో ఆదరించి, వారికీడులను తొలగించి మేళ్లు కలిగిస్తారు. అటువంటివి ఈ వృక్షాలు అని సారాంశం.)
అక్కడి చెట్లన్నీ పువ్వులు కాయలు పండ్లు మెండుగా ఉండడంవల్ల వాటి బరువుకు వంగి ఉన్నాయి. వాటి నడుమనుండే దారులగుండా గొల్లవారు ఆలమందలను యమునవద్దకు తోలుకొని పోయారు. ఆ నదిమడుగులలోని చల్లనినీరు త్రాగించి, సమీపంలోని పచ్చికబయళ్లలో మేపుతూ, తమకు ఆకలిగా ఉందని శ్రీకృష్ణునికి విన్నవించారు. బలరామ సహితుడైన శ్రీకృష్ణుడు తనయందు భక్తిగల బ్రాహ్మణభార్యలను అనుగ్రహించాలని సంకల్పించి, గొల్లవారితో ఈ విధంగా అన్నాడు.
ఓ గోపాలకులారా! ఈ అడవిలో వేదాలు వల్లించిన బ్రాహ్మణులు స్వర్గలోకప్రాప్తికయి 'ఆంగిరసము' అనే యజ్ఞం చేస్తున్నారు. మీరు వారివద్దకు వెళ్లి మా అన్నదమ్ముల పేరులు చెప్పి, వారు పంపగా వచ్చామని చెప్పి, అన్నం పెట్టుమని అడగండి. వారు పెడతారు. అలాగే అని గోపబాలకులు బ్రాహ్మణుల వద్దకు వెళ్ళి, నమస్కరించి, అయ్యా! మీరు ధర్మతత్త్వం ఎరిగినవారు. యాచకులు అడిగినవి అనుగ్రహించేవారు! ఆవులను మేపుతూ అలసిపోయిన బలరామకృష్ణులు ఆకలితో అన్నం పెట్టమని మీ వద్దకు పంపారు. కాబట్టి అన్నం పెట్టండి. ఆకలితో నకనకలాడేవారిని పిలిచి మరీ అన్నం పెడతారు కదా మీవంటి పెద్దలు!
ఓ పుణ్యాత్ములారా! యజ్ఞదీక్ష వహించిన యజమానుడు పశువిశసనం జరిగిన పిమ్మట, సౌత్రామణి క్రతువు పూర్తి అయిన పిమ్మట భోజనం చేయవచ్చు. ఇతరులకు పెట్టవచ్చు. అది దోషం కాదు. కావున మాకు అన్నం పెట్టండి.
ఈ విధంగా గొల్లవారు అన్నం పెట్టండి అని బ్రాహ్మణులను యాచిస్తే
అజ్ఞానంతో కూడినవారు, దుర్బుద్ధి కలిగినవారు అగు బ్రాహ్మణులు, సమస్తానికీ ప్రభువయినవాడు శ్రీకృష్ణుడని గ్రహించ లేకపోయారు. వాస్తవానికి యజ్ఞం, మంత్రాలు, దేశకాలధనాలు, యజ్ఞం చెయ్యడంవల్ల కలిగే పుణ్యఫలం (అపూర్వం), అన్నీ కూడ శ్రీవిష్ణుస్పరూపాలే. అటువంటి శ్రీ కృష్ణుణ్ణి సామాన్యమైన గొల్లపిల్లవాడు అని భావించి, అతని మాటలను గౌరవించకుండా, అన్నం లేదు లేదు వెళ్లిపొండి అని తిరస్కరించి పంపించారు.
అపుడు గోపాలకులు నిరాశతో శ్రీకృష్ణుని వద్దకు వచ్చి, జరిగిన విషయం వివరించారు. అంతట శ్రీకృష్ణుడు లోకవ్యవహారాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ గొల్లవారితో మీరు వెళ్లి ఆ బ్రాహ్మణులను గాకుండగా వారిభార్యలను దర్శించి, వారికి మా రాకను చెప్పండి. వారు తప్పక అన్నం పెడతారు, అని పంపించాడు. వారు వెళ్లి యజ్ఞవాటికలో ఉన్న బ్రాహ్మణ భార్యలను దర్శించి, నమస్కరించి వారిచే సత్కారం పొంది, వారితో ఈ విధంగా అన్నారు.
బుద్ధిమతులయిన ఓ అమ్మలారా! శ్రీకృష్ణుడు ఆవులను మేపుతూ, ఆకలి గొన్నవాడయి మిమ్మల్ని అడిగి అన్నం తెమ్మని ఈరోజు మమ్మల్ని పంపించాడు. కావున వెంటనే అన్నం పట్టుకొనిరండి.
గొల్లల మాటలు విన్న బ్రాహ్మణస్త్రీలు శ్రీకృష్ణుణ్ణి చూడాలనే కుతూహలంతో, సంతోషం, తొట్రుపాటు అధికం కాగా, భక్ష్య భోజ్య చోప్య లేహ్య పానీయాలనే భేదాలతో కూడుకొని ఉన్న ఆహారపదార్జాలను పాత్రలలో నింపుకొని, సముద్రం చేరడానికి తొందరపడే నదులవలె (బయలుదేరారు)
పిల్లలు, మగలు, అన్నదమ్ములు అడ్డం వచ్చి వెళ్లవద్దని వారించారు. అయినా ఆ బ్రాహ్మణస్త్రీలు వారిని లక్ష్య పెట్టక, ఎదిరించి, మాదారికి అడ్డురాకండి తొలగిపొండని గద్దించి, ఆహారపదార్థాలు తీసికొని వేగంగా శ్రీకృష్ణుణ్ణి సమీపించారు.
బ్రాహ్మణస్త్రీలు ఈ విధంగా వెళ్లి, యమునకు సమీపంలో కొత్తచిగుళ్లతో కూడిందీ, తన క్రిందికి చేరినవారి బడలికను పోగొట్టేదీ అయిన అశోకవృక్షచ్చాయలో ఒకమంచి చోట
అపుడు శ్రీకృష్ణుడు ఒక స్నేహితుని భుజంమీద ఒక చేయివైచి, రెండచేతితో వేడుకగా తామరపూవును ఇటు అటు త్రిప్పుతున్నాడు. తలమీది ముడికి అందని కొన్ని ముంగురులు చెక్కిళ్లమీద చిందులాడుతున్నాయి. కురుచగా కుచ్చెళ్ళువచ్చేలాగున బంగారు రంగుబట్ట కట్టుకొని ఉన్నాడు. తలచుట్టు గుండ్రంగా అమరి ఉండునట్లుగా దట్టంగా కుట్టిన నెమలీకలదండ ధరించాడు. చెవిసందున కలువపూవు పెట్టుకొన్నాడు. పారవశ్యం కలిగించేటంతటి చక్కటి నటవేషంతో ప్రకాశిస్తున్నాడు. అటువంటి శ్రీకృష్ణుణ్ణి బ్రాహ్మణవనితలు కన్నుల కరువెల్ల తీరేలా కనుగొన్నారు.
సన్ననినడుములు గల ఆ బ్రాహ్మణస్త్రీలు శ్రీకృష్ణుని సుందరమైన రూపాన్ని కన్నులతో హృదయంలోనికి క్రమంగా ఆకర్షించుకొన్నారు. మనస్సులలోని తాపాలు హరించే విధంగా అతణ్ణి తమ మనస్సులతోనే కౌగిలించుకొన్నారు.
ఈరీతిగా ఆ బ్రాహ్మణస్త్రీలు ఐహికమైన అన్నికోరికలను వదలుకొని తనను దర్శించడానికి వచ్చిన సంగతిని గ్రహించిన శ్రీకృష్ణుడు, చిరునవ్వు నవ్వి, నిశ్చలదృష్టితో వారిని చూస్తూ, వారితో ఈ విధంగా అన్నాడు.
గొప్పవారయిన ఓ పడతులారా! నా దగ్గరకు రండి. మీ యిండ్లలో అందరు క్షేమమే కదా! ఏ ప్రయోజనాన్ని కోరి నావద్దకు వచ్చారో చెప్పండి. పతిపుత్రాదులపట్ల ఉన్న ప్రేమనుకూడా కాదని నన్ను చూడాలనే వేడుకతో వచ్చారు. ఏ విధమైన ఫలాసక్తి లేకుండా వచ్చారని నాకు తెలుసు. యోగీశ్వరులుకూడ మీలాగుననే నన్ను ఆశ్రయించి, సేవించి, సమస్త ప్రయోజనాలు పొందుతూ ఉంటారు.
“మీ భర్తలు గృహస్థధర్మాలను పాటించేవారు. వారు మీతో కలిసి యాగం పూర్తి చేస్తారు. కావున మీరు వెంటనే యాగశాలకు వెళ్లండి” అని శ్రీకృష్ణుడు చెప్పగా బ్రాహ్మణస్త్రీలు శ్రీకృష్ణునికి ఈ విధంగా సమాధానం చెప్పారు.
ఓ లక్ష్మీపతీ! మాతో ఇటువంటి తీక్ష్ణమైన మాటలు మాటాడవచ్చునా? ఇది నీకు న్యాయమా! మా భర్తలు, బిడ్డలు, అన్నదమ్ములు, తండ్రులు వద్దని అడ్డగిస్తూ ఉన్నా, వారిని కాదని నీ మీది వ్యామోహంతో నీ దగ్గరకు వచ్చాము. ఇపుడు ఇంటికి తిరిగి వెళితే వారు స్వీకరిస్తారా? కావున ఇపుడు నువ్వు చెప్పినమాటలు మాకు నచ్చవు. మేము నీ వద్దనే ఉంటాము. మమ్మల్ని నీ సేవకురాండ్రుగా భావించి కాపాడు.
అని బ్రాహ్మణస్త్రీలు పలుకగా శ్రీకృష్ణుడు వారికి నచ్చ జెప్పాడు. మీరునా దగ్గర ఉన్నారని మీ చుట్టాలు, అన్నదమ్ములు, మగలు, బిడ్డలు ఎవ్వరూ కోపపడరు, సరికదా - దేవతలయినా మిమ్మలను మెచ్చుకోవలసిందే. నా దేహంతోడి సంబంధం కామసౌఖ్యాన్ని, కామభావాన్ని కలిగించదు. పైగా ముక్తిని ప్రసాదిస్తుంది. నన్ను గూర్చి స్తుతించడం, దర్శించడం, వినడం, ధ్యానం చేయడం, మీ మనస్సులను నా యందే లగ్నం చేయడం అనే వాటివల్ల, కర్మసంబంధంతో ఏర్పడిన ఈ శరీరం విడిచి తగినకాలంలో నాలో ఐక్యమైపోతారు. నా మాటలు నమ్మండి అని పలికిన పిమ్మట శ్రీకృష్ణుడు వారు తెచ్చిన ఆహారహూర్జాలను తన ఆప్తవర్గంవారితో కలిసి ఆరగించాడు.
ఓ పరీక్షిన్మహారాజా! పరమేశ్వరభావంతో సామాన్యజనునికి భిక్ష పెడితే పరమపదం అయిన వైకుంఠం సిద్ధిస్తుంది. మరి, స్వయంగా పరమేశ్వరుడే శ్రీకృష్ణరూపంలో వచ్చి భీక్ష స్వీకరించినందువల్ల కలిగే ఫలం ఎంతటిదో ఎవరు చెప్పగలరు?.
ఈ విధంగా పరమేశ్వరుడయిన శ్రీకృష్ణునికి ఆహారం సమర్పించి, తమ భార్యలు ఆయనచేత ధన్యురాండ్రయిన సంగతి తెలుసుకొని ఆ బ్రాహ్మణులు తమలో తాము పశ్చాత్తాపం పొందారు.
అయ్యయ్యో! మనం ఎంత మోసపోయామో గదా! ఆడవారికున్నవాటి బుద్ధికూడ మనకు లేదు. దగ్గరకు వచ్చిన శ్రీకృష్ణుణ్ణి వెళ్లి దర్శించలేక పోయామే! మన మనస్సులు మంచివి కావు. మనం ఎంతో పాపం చేసుకొన్నాము. విష్ణువును పూజించనివారితెలివితేటలు, తపస్సు, సదాచారం, తీర్ధయాత్రలు, యాగాలు వ్యర్థములే గదా!
ఆడవారు జపాలు, హోమాలు, వేదాధ్యయనాలు, తపస్సులు, వ్రతాలు, ఏమీ ఎరుగరు. అయినప్పటికినీ భక్తి కలిగి శ్రీకృష్ణునిదయకు పాత్రలయ్యారు. జపహోమాదులు అన్నీ చేస్తూ ఉండికూడ భక్తిలేని కారణంగా చాంచల్యానికి లోనయి, శ్రీకృష్ణుని అనుగ్రహానికి నోచుకొనలేక పోయాము గదా!
విష్ణుమాయ దేవతలకు గురువులయిన మహాయోగీశ్వరులనే మోహంలో ముంచేస్తుంది. ఇక సామాన్యమానవులకు గురువులమై అజ్ఞానులమయిన మమ్మల్ని మోహింప జేయడంలో ఆశ్చర్యం ఏమి ఉంది?
యజ్ఞాలు, మంత్రాలు, తంత్రాలు, పుణ్యం, ధనం, కాలం, దేశం, దేవత, త్రేతాగ్నులు, బ్రాహ్మణులు అంతా విష్ణుమయమే! అట్టి పరమేశ్వరుడు భూమిని రక్షించడంకోసం శ్రీకృష్ణుడుగా అవతరించాడు అనే సంగతి తెలుసుకొన లేకపోయాం. లక్ష్మీదేవికి భర్త, సృష్టి స్థితిలయాలకు కర్త భూమండలానికి ఉద్ధర్త, రాక్షసరాజులకు సంహర్త అయిన శ్రీకృష్ణునికి నమస్కరిస్తున్నాము.
శ్రీ మహా భాగవతము
శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము
శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము
శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము
శ్రీ మహా భాగవతము పంచమస్కంధము
శ్రీ మహా భాగవతము షష్టస్కంధము
శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము
శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము
శ్రీ మహా భాగవతము నవమస్కంధము
శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
పంచాంగం
No comments:
Post a Comment