తిరుప్పావై 4వ పాశురం
శ్రీ గురుభ్యోనమః
జై శ్రీ కృష్ణ
ఆండాళ్ తిరువడిగలే శరణం
ప్రియ భగవత్ బంధువులారా!
నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం
పారార్థ్యం స్వం శ్రుతి శత శిర స్సిద్ధ మధ్యాపయంతీ!
స్వోచ్ఛిష్టాయామ్ స్రజినిగళితమ్ యా బలాత్కృత్య భుంక్తే
గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః
తిరుప్పావై 4వ పాశురం
ఆళి మళైక్కణ్ణా! ఒన్రు నీ కైకరవేల్
ఆళియుళ్ పుక్కు ముగన్దు కొడు ఆర్తేరి
ఊళి ముదల్ వన్ ఉరువం బోల్ మెయ్ కరుత్తు
పాళియన్ దోళుడై పర్పనాబన్ కైయిల్
ఆళిపోల్ మిన్ని, వలంబురిపోల్ నిన్ రదిరిందు
తాళాదే శాంగ (శారంగ) ముదైత్త శరమళై పోల్
వాళ వులగనిల్ పెయిదిడాయ్ నాంగళుమ్
మార్గళి నీరాడ మగిళిందేలో రెంబావాయ్
ఇప్పుడు ఈ పాశురం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం
ఆండాళ్ తల్లి గోపికలతో కలసి వ్రత స్నానం ఆచరించడానికి బయలుదేరుతుంది. మరి అందరూ స్నానం చేయాలంటే మంచి నీరు ఉండాలి కదా! దేవతలు ఏ భగవంతుని అయితే ప్రార్థిస్తారో మనం కూడా ఆ భగవంతుడిని ప్రార్థిస్తే అదే దేవతలు మనల్ని కూడా అనుగ్రహస్తారు. ఇక్కడ గోదాదేవి మహా భక్తురాలు. ఈ పాశురంలో గోదాదేవి వరుణ దేవుని ఆజ్ఞాపిస్తుంది ప్రార్ధిస్తుంది. ఏమని....
గంభీరమైన స్వభావం కలిగిన ఆళి మళైక్కణ్ణా!
ఓ వరుణ దేవా! ఓ మేఘమా! వానదేవుడా!
ఓ పర్జన్యదేవా! మా మీద దయతో రావయ్యా!
ఎప్పుడూ కంటే ఎక్కువగా మాకు వర్షాలు కురిపించు. వర్షాలు కురిసినప్పుడు చెరువులు, కాలువలు, నదులు, సముద్రాలు అన్నీ నిండుతాయి. అప్పుడు ఆనందంగా అందరూ స్నానం చేయవచ్చు. పరమాత్ముని అనుగ్రహం వల్ల నీకు ఒక మంచితనం ఉంది ఏమిటది?. నీకు అన్ని సమానమే. అందరూ సమానమే నువ్వు చెరువులోనీ కురుస్తావు. మురికి కాలువలో కురుస్తావు. జంతువుల మీదా, చెట్ల మీదా, పుట్ల మీదా కూడా కురుస్తావు. భక్తుల మీదా, రాజు మీదా, అందరిమీదా కురుస్తావు. నీకు అలాంటి తేడాలేమీ లేవు. నీకు అందరూ ఒకటే, అందరూ సమానమే
ఒన్రు నీ కైకరవేల్
చేతులు ముడుచుకొని కూర్చోవద్దు. నీ యొక్క గొప్పతనం చూపించు.
అళియుళ్ పుక్కు ముగన్దు కొడు ఆర్తేరి
సముద్రంలో మధ్యలో, లోతుగా ఉన్న చోట... ఎక్కువ నీరు ఉంటుంది కదా! ఆ నీరంతా తృప్తిగా, కడుపునిండా తాగేసి మీదకు వెళ్ళిపో. ఎలా వెళ్తావ్ నీరంతా తాగిన తర్వాత చాలా బరువుగా ఉంటావు కదా! మెల్లిగా వెళ్ళాలి (గర్భిణీ స్త్రీ మేడ మెట్లు ఎక్కినప్పుడు ఎంత జాగ్రత్తగా ఎక్కుతుందో) నువ్వు కూడా సముద్రంలో నీరు తాగేసి అలా ఆకాశం పైకి వెళ్ళు. అలా మీదకు వెళ్లి గర్జించు. మెరుపులు మెరిపించు, ఉరుములు గర్జించు. నువ్వేమిటో నిరూపించుకో. వర్షం కురిపించు.
ఊళి ముదల్ వన్ ఉరువం బోల్ మెయ్ కరుత్తు
మనకు తెలుస్తాయి కదా! మేఘాలు చూస్తే నీటి మేఘాలా! మామూలు మేఘాలా! అని.మామూలు మేఘాలు అయితే తెల్లగా, సాధారణంగా ఉంటాయి. కానీ నీటితో ఉన్న మేఘాలు అయితే నల్లగా, బరువుగా, మెల్లగా కలుగుతాయి.పరమాత్మ శరీరం లాగ మేఘాలు నల్ల పడాలి. అప్పుడే మనకి వర్షం కురుస్తుంది.
పాళియన్ దోళుడై పర్పనాబన్ కైయిల్
పరమాత్మ కుడి చేతిలో విష్ణు చక్రం ఏ విధంగా అయితే మెరుస్తుందో... నీ మెరుపుల కాంతి కూడా అలా ఉండాలి. ఆ పరమాత్మ ఎలా ఉంటాడట, విశాలమైన, సుందరమైన బాహువులు కలిగి ఉంటాడట. ఆయన యొక్క విశాలమైన బాహువుల్లాగా నువ్వు కూడా విశాలంగా దేశమంతా వర్షం కురిపించు. కృష్ణుడి యొక్క రంగు లాగా నీలంగా మారిపో. మేఘానికి మెరుపులు, గర్జన సహజమే. కానీ గోపికలు అవి కూడా కృష్ణుడితో పోలుస్తున్నారు. వాళ్ల యొక్క అనుభవం అంతా కృష్ణుడు. కూర్చుంటే కృష్ణుడు. నిల్చుంటే కృష్ణుడు, తింటే కృష్ణుడు, పడుకుంటే కృష్ణుడు. అంతా కృష్ణ మయమే.
ఆళిపోల్ మిన్ని, వలంబురిపోల్ నిన్ రదిరిందు
తాళాదే శాంగ (శారంగ) ముదైత్త శరమళై పోల్
వాళ వులగనిల్ పెయిదిడాయ్ నాంగళుమ్
మార్గళి నీరాడ మగిళిందేలో రెంబావాయ్
ఆయన ఎడమ చేతిలో శంఖం గర్జించినట్లు నువ్వు ఉరుములతో అలా గర్జించాలి. ఒక మనిషి కడుపు నిండా అన్నం తిన్న తర్వాత.. బ్రేవ్ మని ఎలాగైతే త్రేలుస్తాడో… నువ్వు కూడా అలాగే గర్జించాలి.శ్రీ మహా విష్ణువు యొక్క సారంగం అనే విల్లు నుంచి వెలువడిన బాణ వర్షం లాగా నువ్వు వర్షించాలి. కుంభవృష్టి కురిపించాలి. అప్పుడు మేము మార్గశిర స్నానం చేసి సంతోషంగా ఈ వ్రతాన్ని ప్రారంభిస్తాం.
భగవంతుడిని మనం భక్తితో కొలిస్తే మనసా వాచా కర్మణా భగవంతుడిని ఆరాధిస్తే... దేవతలు ఏ విధంగా అయితే భగవంతుని ముందు వినయంగా ఉంటారో... అప్పుడు భక్తులు చెప్పింది దేవతలు కూడా వింటారు. భక్తుల ఆజ్ఞల్ని పాటిస్తారు. గోదాదేవి అంత భక్తురాలు కాబట్టే వాన దేవుని ఆజ్ఞాపిస్తుంది. ఒక విధంగా అర్ధిస్తుంది. మనం భగవంతున్ని మేఘం రంగులా భావించకూడదు. మేఘాన్ని భగవంతుడి రంగుతో పోల్చాలి. పూర్వం కొంత మంది ఆళ్వారులు తమ పాశురాల్లో నారాయణున్ని మేఘంతో పోల్చి స్తుతిస్తారు. కానీ అందుకు విరుద్ధంగా ఆండాళ్ తల్లి మేఘాన్ని నారాయణుడితో పోల్చింది. ఆమె దృష్టిలో భగవంతుడే ఉపమానం. అంటే ఆయన దేనితోనీ పోల్చ లేనివాడు. అంతే కదా భగవంతున్ని దేనితోనూ పోల్చలేము. ఈ పాశురంలో గురువు యొక్క స్వరూపాన్ని, గుణాన్ని మనకి గోదాదేవి చెప్తుంది. ఇప్పుడు మేఘానికి, గురువుకి గల పోలికలు చూద్దాం. మేఘం సముద్రంలో ఉన్న ఉప్పు నీళ్లు తాగుతుంది. మనకి మంచి నీటిని వర్షిస్తుంది. అలాగే సత్ గురువు కూడా కష్టమైనటువంటి వేదం యొక్క అర్ధాన్ని సులభంగా చేసి మనకి వినిపిస్తాడు. మేఘం ఎడారి, పొలము, పల్లం, మెట్టు అన్న తేడా లేకుండా అంతటా సమానంగా వర్షిస్తుంది. అలాగే గురువు కూడా... తక్కువ వాడూ, ఎక్కువ వాడూ, గుణవంతుడు, గుణం లేని వాడు అని ఏమి చూడకుండా అందరికీ సమానంగా జ్ఞానాన్ని అందిస్తారు. దేశాటన చేస్తూ అందరికీ జ్ఞానాన్ని బోధిస్తాడు. మేఘం మనకి వర్షాన్ని ఇచ్చినప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఆశించదు.
అదే విధంగా గురువు కూడా ప్రతిఫలాన్ని ఆశించరు. మేఘం తనలో ఉన్న నీరంతా ఒక్క చుక్కకూడా మిగల్చుకోకుండా మనకు ఇచ్చేసి.. అది వెల వెల పోతుంది. అలాగే గురువు కూడా విద్యనంతా ఇచ్చి.. అయ్యో శిష్యులకి ఇంకా ఏమీ ఇవ్వలేకపోయేనే అని విచారిస్తాడు. అలాగే వర్షం పడినప్పుడు మనం గ్లాస్ పెడితే గ్లాస్ లో పడతాయి. బింది పడితే బిందిలోకి వస్తాయి. మనం పట్టుకున్న పాత్రను బట్టి వస్తాయి. అలాగే గురువు చేసిన బోధ కూడా మన అర్హతను బట్టి వస్తుంది. మేఘం నీటితో నిండుగా ఉన్నప్పుడే మనకు వర్షం వస్తుంది. అలాగే మనకి భగవదనుగ్రహం పూర్తిగా ఉన్ననాడే గురువు శిష్యుణ్ణి తరింపజేస్తాడు. ఈ పాశురంలో మనం నేర్చుకోవాల్సింది ఒకటుంది. అసూయ లేకుండా ఒకరి సంతోషాన్ని చూసి.. మనం కూడా సంతోషించడమే ఈ వ్రత ఉద్దేశ్యం. వర్షం మనకే కాకుండా అందరికీ పడాలి. అంతే కాదు నలుగురితో కలిసే ఏ మంచి పనైనా చేయాలి. సుఖదుఃఖాలు పంచుకోవాలి. అందుకే వ్రత స్నానం చేయడానికి అందరూ కలిశారు. మొదట్లో గోదాదేవి ఈ వ్రతం చేస్తానంటే ఊరి పెద్దలు అంగీకరించలేదు. కానీ తర్వాత భగవంతుని అనుగ్రహం వల్ల పెద్దవాళ్లు అంగీకరించినందు వల్ల గోదాదేవి, మిగతా గోపికలు ఈ వ్రతం చేయడానికి చేయడానికి సిద్ధపడ్డారు. భగవంతుని అనుగ్రహం ఉంటే ఏదైనా జరుగుతుంది. అందుకే భగవత్తత్వం ఐదు విధాలుగా ఉంటుందని చెప్తారు. తిరుప్పావై మొదటి పాశురం నారాయణుడి యొక్క పర తత్వాన్ని బోధిస్తుంది. రెండవ పాశురము వాసుదేవుడు యొక్క వ్యూహ తత్వాన్ని, మూడవ పాశురం వామనావతారం యొక్క విశిష్టతను, నాలుగో పాశురం అంతర్యామి తత్వాన్ని, శ్రీ మహా విష్ణువు యొక్క చిహ్నాలు శంఖం, చక్రం, ధనస్సు వీటిని ఆండాళ్ తల్లి ఆవాహన చేస్తుంది.
ఆండాల్ తిరువడిగళే శరణం
No comments:
Post a Comment