తిరుప్పావై ఐదవ పాశురము
నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం
పారార్థ్యం స్వం శ్రుతి శత శిర స్సిద్ధ మధ్యాపయంతీ!
స్వోచ్ఛిష్టాయామ్ స్రజినిగళితమ్ యా బలాత్కృత్య భుంక్తే
గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః
తూయ పెరునీర్ యమునై తురైవనై
ఆయర్ కులత్తునిల్ తోన్రుమ్ మణి విళక్కై
తాయై క్కుడల్ విళక్కమ్ శెయిద దామోదరనై
తూయోమాయ్ వందునామ్ తూమలర్ తూవిత్తొళుదు
వాయినాల్ పాడి మనత్తినాల్ శిన్దిక్క
పోయ పిళై యుమ్ పుగుదరువా నిన్రనవుమ్
తీయినిల్ తూశాగుమ్ శెప్పేలో రెంబావాయ్
ఇప్పుడు ఈ పాశురం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం
పరమాత్మ యొక్క ఐదు స్వరూపాలను మొదటి 5 పాశురములలో ఆండాల్ తల్లి చెప్తుంది. అసలు తిరుప్పావై లో ఎంత గంభీరమైన, లోతైన అర్థాలున్నాయో చూడండి….
మయిన్దుం అరియాద మానిడరై
వైయం శుమప్పుదుమ్ వమ్బు (కోదై తమిళ్)
అంటే అనంతమైన వేదములు వున్పప్పటికీ; బీజం ఎలాగైతే ఉంటుందో.. అలాగే పెద్ద వృక్షం ఉందనుకోండి.. దానికి మూలం ఏమిటి.. బీజం అంటే విత్తనం. ఆ మహా వృక్షానికి కాయలుంటాయి, పళ్ళుంటాయి, కొమ్మలుంటాయి. ఆకులుంటాయి. ఇన్ని ఉండడానికి కారణం ఏమిటి?.. ఆ చిన్న విత్తనం. ఆ మహా వృక్షానికి మూలం.. చిన్న విత్తనం మాత్రమే. అదేవిధంగా అంత గొప్పదైన వేదమనే మహా వృక్షానికి బీజం అనే విత్తనమే ఈ తిరుప్పావై. అంటే చూడండి ఈ తిరుప్పావైలో ఎంత గొప్పవైన రహస్యాలు, అర్థాలు ఉన్నాయో.
గోదా గోపిక పిలుపును అందుకున్న గోపికలు అందరూ కూడా ఒక చోట చేరారు.ఒక గోపిక అంటుందట ఇలా.
భవంతి మహతామపి
ఎంతవారికైనా ఒక మంచి పని చేద్దాం అనుకున్నప్పుడు ఎంత పెద్ద వారికైనా, గొప్పవారికైనా కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. అదే భగవంతుడు వారికి పెట్టిన పరీక్ష. మన వ్రతానికి మొదటి ఆటకం మనం తెలిసీ తెలియక చేసిన ఎన్నో జన్మల పాపాలే. చేసిన పాపములకు ప్రాయశ్చిత్తం చేసుకుని మరల ఆ పాప కర్మల జోలికి పోకుండా ఉంటేనే ఈ వ్రతానికి ఫలితం దక్కుతుంది. ఆ భగవంతుని అనుగ్రహం కలుగుతుంది అని ఒక గోపిక చెప్పింది. ఇంకొక గోపిక అంటుందట, అవునర్రా! నిజమే, అది చెప్పింది నిజమే. శ్రీరామ పట్టాభిషేకానికే విఘ్నం వచ్చింది. ఇక ఆ విధి ముందు మనం ఎంతటివారం.
కృతం కర్మ శుభా శుభం
పుణ్యం చేసిన వారు కానీ, ఆ పని చేసినవారు కానీ ఆ కర్మల యొక్క ఫలితాలను తప్పకుండా అనుభవించి తీరవలసిందే. అసలు కర్మ అంటే ఏమిటి? అని అడిగిందిట ఒక గోపిక.
అందులో ఒక గోపిక ఇలా అన్నిందంట. ఏమిన్ని? కర్మ అంటే మనం చేసే పనే కాదు, ఆలోచన కూడా ఒక కర్మే.
1. సంచిత కర్మ 2. ప్రారబ్ధ కర్మ 4. ఆగామి కర్మ.
1. సంచిత కర్మ:- ఎన్నో జన్మలలో చేసింది. ఇది ఒక వేటగాడు తన అమ్ముల పొదిలో భద్రపరిచిన బాణం లాంటిది. అంటే మనకు అవసరమైనప్పుడు తీసుకోవచ్చు.
2. ప్రారబ్ద కర్మ:- ఈ జన్మలో ఈ శరీరంతో మనం మేల్కొని ఉన్నప్పుడు గాని, నిద్రించినప్పుడు గాని, కలగంటున్నప్పుడు గానీ అంటే మూడు అవస్థలు, (జాగ్రతావస్థ, సుషుప్తావస్థ, స్వప్నావస్థ) ఈ మూడూ కూడా మనం అనుభవించడానికని కేటాయించిన పుణ్య, పాప కర్మలు. ఇది వేటగాడు వేసిన బాణం లాంటిది. ఫలితం అనుభవించక తప్పదు.
3. ఆగామి కర్మ:- అంటే ఏమిటి. ఈ జన్మలో చేసుకున్నది, వచ్చే జన్మలో అనుభవించాల్సి ఉంటుంది. ఇది వేటగాడి చేతిలో వేయడానికి సిద్ధంగా ఉన్న బాణం లాంటిది. బాగా పండిన కర్మలను తీసి భగవంతుడు ఏడు జన్మలకు కేటాయిస్తాడు. పోనీ పుణ్యం ఎక్కువ చేస్తే పాపం నశిస్తుందా? అబ్బే అదేం కుదరదు, దేని లెక్క దానిదే. పాప కర్మ, పుణ్య కర్మ రెండూ దేనికది పోవాల్సిందే. అబ్బా ఎంత చిక్కో చూడండి.
ఇప్పుడు ఇంకో తెలివిగల గోపిక చూడండి ఎలా చెబుతుందో. (ఇదంతా నేను చెప్తున్నది కాదండి.)
ఆ గోదా గోపిక.. ఆ గోపికలందరినీ ఒక దగ్గర చేర్చి స్నానానికి వెళ్ళాలని అంటే ఆ శ్రీ కృష్ణ పరమాత్మ దర్శనం చేద్దామని బయలుదేరే ముందు జరిగిన సంభాషణ.
తస్మిన్ దృష్టే పరావరే
అంటే ఆ పరమాత్మను దర్శించగానే కర్మలన్నీ విడిపోతాయట. ఈ విషయం ఉపనిషత్తులు చెప్తున్నాయని మన పెద్దవాళ్ళు చెప్పడం వల్ల తెలుసుకున్నాం కదా. ఆ మాటలను విని మన ప్రవర్తనను తీర్చిదిద్దుకుని భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులు అవుదాం. అప్పుడు సంచిత కర్మలు నిప్పులో వేసిన దూది లాగ నశిస్తాయి. ఆగామి కర్మలు తామరాకుమీద నీటిబొట్టులాగా మనకంటవు. అయితే ప్రారబ్ధకర్మ మాత్రం అనుభవించి తీరవలసిందేనా? అని ఒక గోపిక నిరాశ చెందింది. అప్పుడు గోదాగోపిక అంటుందట, శరణాగతి పొందిన వాళ్లు నిరాశ పడనవసరం లేదు.
శ్రీమన్నారాయణుడే దిక్కు అని పూర్తిగా నమ్మిన వాళ్ళం. ప్రారబ్ధాన్ని కూడా భగవంతుడు మన చేత సుఖంగా అనుభవించినట్లు చేస్తాడు. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఇక్కడ మనకు ఒక అనుమానం రావచ్చు. గోపికలు అమాయకులు, చదువు లేని వారు కదా! మరి వారికి అంత జ్ఞానం ఎక్కడ వచ్చింది అని. నంద వ్రజంలో గర్గుడు, సాందీపుడు మొదలైన పెద్దలు, గురువులు ధర్మశాస్త్రాలను చెబుతున్నప్పుడు వాళ్ళు వినడంచేత అంత పాండిత్యం వచ్చింది.ఇప్పుడు గోదాగోపిక అంటుంది. ఈ వ్రతం సాగడానికి కర్మలు తొలగి, వారు కోరిన ఫలితాన్ని పొందడానికి సులభంగా ఒక ఉపాయాన్ని ఈ పాశురములో చెబుతుంది.
మాయనై మన్ను వడమదురై మయిందనై
మాయనై ఆయన మాయావి అట. ఎవరూ! మన చిన్ని కృష్ణుడు, గోపాలకృష్ణుడు, ఆ శ్రీకృష్ణపరమాత్మ. మన్ను వడమదురై మన ఉత్తర భారతదేశంలో గల మధురలో జన్మించిన మయిందనై ధీశాలి, ధైర్యవంతుడు, వీరుడు, శూరుడూనట.
తూయ పెరునీర్ యమునై తురైవనై
నిర్మలమైన, పరిశుద్ధమైన నీటితో కూడుకున్న యమునా తీరంలో ఆయన విహరించేవాడు. ఈత కొట్టేవాడు. యమునా తరంగాల మీద జలక్రీడలాడే ప్రభువట.
అయర్ కులత్తునిల్ తోన్రుం మణి విళక్కై
యదువంశంలో, గోపాల కులంలో మణిదీపం వంటి వాడట.
తాయై క్కుడల్ విళక్కం శెయిద దామోదరనై
యశోదాదేవి గర్భాన్న జన్మించి ఆమెకు కీర్తి తెచ్చాడు. ఆయన సమస్త గుణాలు పరిపూర్ణంగా ప్రకాశించింది శ్రీకృష్ణావతారంలోనే. యశోదదేవి ఆయన్ని రోటికి కట్టి వేసింది. ఈ పాశురంలో గోదాదేవి శ్రీకృష్ణుడి లీలల్ని ఊహించుకుని ఆనందిస్తుంది. తన్మయం చెందుతుంది. ఈ పాశురంలో కృష్ణ మాయ దోబూచులాడుతుంది. పసిబిడ్డగా ఉన్నప్పుడే పూతన వంటి రాక్షసుని మట్టుపెట్టాడు. ఆయన్ని మట్టుబెట్టడానికి వచ్చిన రాక్షసుల అంతు చూశాడు. అలాంటి బాలగోపాలుడి అల్లరి, గోపకాంతల గగ్గోలు భరించలేక ఆయన నడుముకి తాడు కట్టి రోటికి కట్టి వేసింది. యశోద తల్లి మాత్రమే కాదు, భక్తురాలు కూడా. ఆమె భక్తికి ఆ కృష్ణుడు బందీ అయిపోయాడు. దామం అంటే తాడు. నడుము చుట్టూ కట్టడం వల్ల ఆయన దామోదరుడు అయ్యాడు.
వాయినాల్ పాడి మనత్తినాల్ శిన్దిక్క
పోయ పిళై యుమ్ పుగుదరువా నిన్రనవుమ్
తీయినిల్ తూశాగుమ్ శెప్పేలో రెంబావాయ్
అలాంటి దామోదరుడి దగ్గరికి మనం ఏకాగ్రతతో, పరిశుద్ధంగా, పవిత్రమైన హృదయంతో వెళ్ళి పువ్వులను సమర్పించి పూజ చేయాలి. అప్పుడు మన బంధాలు, సంసారబంధాలు కూడా తొలగిపోతాయి. ఇంతవరకు మొదటి 5 పాశురాలలో గోపికలను శ్రీ గోదా గోపిక వ్రతానికి సిద్ధం చేసింది. ఇక రేపటి నుంచి శ్రీ వ్రతం ప్రారంభమవుతుంది.
No comments:
Post a Comment