తిరుప్పావై ఆరవ పాశురం
పుళ్ళుం శిలుంబినగాణ్ పుళ్ళరైయిన్ కోయిలిల్
వెళ్లై విళిశంగిన్ పేరరవం కేట్టిలైయో?
పిళ్ళాయ్ ఎళుందిరాయ్ పేయ్ ములైనంజుండు
కళ్ళచ్చగడం కలక్కళియాక్కాలోచ్చి
వెళ్ళత్తరవిల్ తుయిలమరంద విత్తినై
ఉళ్ళత్తుక్కొండు మునివర్ గళుం యోగిగళుమ్
మెళ్ళ వెళుందు అరియెన్ర పేరరవమ్
ఉళ్ళం పుగున్దు కుళిరెన్దేలో రెంబావాయ్
ఇప్పుడు ఈ పాశురం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం..
ఈ పాశురం నుండి 10 పాశురముల వరకు అంటే 6 వ పాశురం నుండి 15 పాశురం వరకు కూడా పదిమంది గోపికలను ఆండాళ్ తల్లి మేలుకొలపడం చూస్తాం.
గోదా గోపిక ఇక వ్రతం ప్రారంభంచేద్దామని గోపికలందరితో చెప్పగా, ఇంకా పది మంది గోపికలు నిద్ర లేచి రాలేదని వారి ఇరుగుపొరుగు గోపికలు చెప్పారు. ఆ పదిమంది గోపికలను లేపటానికి గోదాదేవి తన సహ గోపికలు అందరితో కలిసి బయలుదేరింది. వారిలో మొదటి గోపికను ఈరోజు మేల్కొలుపుతున్నారు. ఆ గోపిక కొత్తగా వాళ్లోకి చేరింది. భగవదనుభవం ఆమెకు ఇంకా పూర్తిగా కలగలేదు. నిద్ర లోనే భగవంతున్ని అనుభవిస్తుంది. ఎక్కడ నిద్రలేస్తే భగవంతుడు దూరం అయిపోతాడేమో అన్న భయంతో నిద్ర లేవకుండా అలానే పడుకుంది. వీరు వెళ్లి లేపుతున్నారుఓ చిన్నదానా! ఓ గోపికా!!
పుళ్ళుం శిలుంబినగాణ్
పక్షులు అరుస్తున్నాయి కదా! తెల్లవారింది. వాటి ఆహారం కోసం అవి 'కావ్ కావ్' అంటూ బయలుదేరాయి. ఏం నీకు ఆ శబ్దాలు వినబడటం లేదా? కాకి అరుపులు వినలేదా నీవు?. అని ఆ గోపికను లేపుతున్నారు.
పుళ్ళరైయిన్ కోయిలిల్వెళ్లై విళిశంగిన్ పేరరవం కేట్టిలైయో?
పక్షిరాజు గరుత్మంతుని వాహనంగా కలిగినటువంటి శ్రీమన్నారాయణుడి గుడిలో సుప్రభాత సేవలో ఆ స్వామిని మేల్కొలపడానికి తెల్లని శంఖం పూరిస్తున్నారు కదా! నీకు వినబడలేదా?
పిళ్ళాయ్! ఎళుందిరాయ్ పేయ్ ములైనంజుండు
ఓ పిల్లా! లేవమ్మా! ఆ బాలకృష్ణుడు పూతన యొక్క పాలు తాగి ఆ రాక్షసిని సంహరించాడు కదా!
కళ్ళచ్చగడం కలక్కళియాక్కాలోచ్చి
బండి రూపంలో వచ్చిన శకటాసురుని కాలితో తన్ని ఏ కీలు కాకీలు పీకేసే చంపేశాడు.
వెళ్ళత్తరవిల్ తుయిలమరంద విత్తినై
పాల సముద్రంలో శేషశయ్య మీద యోగ నిద్రలో ఉన్నాడు ఆ పరమాత్మ.
ఉళ్ళత్తుక్కొండు మునివర్ గళుం యోగిగళుమ్
అటువంటి పరమాత్మని మునులు, యోగులు వారి మనసులో ధ్యానం చేస్తూ మెల్లగా నిద్ర నుండి లేస్తున్నారు.
మెళ్ళ వెళుందు అరియెన్ర పేరరవమ్
హరినామస్మరణ చేస్తూ మెల్లగా మేల్కొంటున్నారు.
ఉళ్ళం పుగున్దు కుళిరెన్దేలో రెంబావాయ్
ఆ శంఖనాదం విని మేము లేచాం గానీ.. నీవు ఇంకా లేవలేదు. ఇప్పటికైనా లేచి రావమ్మా!విషాన్ని స్తన్యంగా ఇచ్చిన పూతన సంహారం, బండి రూపంలో ఆ బాలకృష్ణుని చంపడానికి వచ్చిన శకటాసురుణ్ణి తన చిన్ని కాళ్లతో తన్ని చంపడం, శ్రీమద్భాగవతంలో మొట్టమొదటిసారిగా వర్ణించిన కృష్ణ లీలలు. ఆ లీలల్ని తలచుకొని ఉప్పొంగిపోతూ మునులు హరీ హరీ అని గానం చేస్తున్నారు. ఆ శబ్దం విని మేము లేచాం, నువ్వు కూడా లేచిరామ్మా!
ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఇప్పుడు ఈ 10 మంది గోపికలు నిద్ర పోవడం, వారిని మేల్కొల్పడం అనే దానిలో ఉన్న అంతరార్ధం తెలుసుకుందాం. వైష్ణవాలయాల్లో మూలవిరాట్ తోపాటు భగవత్ భక్తులైన పదిమంది ఆళ్వార్లను కూడా ప్రతిష్టిస్తారు. ఆళ్వార్లు లేని ఆలయం దివ్యదేశం కాదు. ఆలయానికి వెళ్ళినప్పుడు ముందు ప్రదక్షిణం చేసి, ఆళ్వార్లను సేవించి తిరిగి వచ్చి ధ్వజస్తంభం దగ్గర నమస్కరించి, అమ్మ వారిని సేవించి ఆ పైన గర్భగుడిలో మూలవిరాట్టుని సేవించటం ఒక ఆచారంగా ఉంది. భూతం సరశ్చ మహదాన్వయ భట్టనాథ అని పదిమంది ఆళ్వార్లను సేవిస్తాం కదా!.ఆ పది మందిని సేవించి వారి కటాక్షం, వారి అనుగ్రహం పొందడమే ఆ పదిమంది గోపికలను మేల్కొల్పడం.
ఈ పాశురం లో ఆండాళ్ తల్లి పెరియాళ్వార్ ని (విష్ణుచిత్తుడు) గుర్తు చేస్తుంది.
ఆండాల్ తిరువడిగళే శరణం
No comments:
Post a Comment