తిరుప్పావై ఎనిమిదవ పాశురము
ప్రియ భగవత్ బంధువులారా!
జై శ్రీమన్నారాయణ
నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం
పారార్థ్యం స్వం శ్రుతి శత శిర స్సిద్ధ మధ్యాపయంతీ!
స్వోచ్ఛిష్టాయామ్ స్రజినిగళితమ్ యా బలాత్కృత్య భుంక్తే
గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః
ఎనిమిదో పాశురం
కీళ్ వానమ్ వెళ్ళెన్రు ఎరుమై శిఱు వీడు
మేయ్ వాన్ పరందన కాణ్! - మిక్కుళ్ళ పిళ్లై గళుమ్
పోవాన్ పోగిన్ఱారై ప్పోగామల్ కాత్తు - ఉన్నై
కూవువాన్ వందు నిన్ఱోం, కోదుగలం ఉడైయ
పావాయ్! ఎళుందిరాయ్! పాడిప్పఱైక్కొండు
మావాయ్ పిళందానై మల్లరై మాట్టియ
దేవాది దేవనై చ్చెన్ఱు నాం శేవిత్తాల్
ఆవా వెన్రారాయన్ అరుళేలోరెంబావాయ్ || 8 ||
ఆకాశము తెల్లవారింది. గేదెలు మంచులో మేత మేయటానికై బయలుదేరాయి. అవి మేతకై స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. తోటి గోపికలందరూ శ్రీకృష్ణుడు చేరక ముందుగనే అతని వద్దకు చేరాలాని అలా చేసినట్లయితే అతడు చాల సంతోషిస్తాడని తలుస్తున్నారు. అందరూ కలిసి గోష్ఠిగ పోవుటే మంచిదని ఆలోచించి వారినందరినీ అచట నిలిపి నీ కొరకు వచ్చితిమి. నీకు కూడా అతనిని చేరుటకు కుతూహలముగనే వున్నదికదా! మరింక ఆలస్యమెందుకు? లెమ్ము! ఆశ్వాసురరూపుడైన కేశిని, చాణూర ముష్టికాదులను చీల్చి చెండాడిన శ్రీకృష్ణుని సన్నిధికి పోయి, మన నోమునకు కావలసిన 'పఱై' అనే సాధనమును పొందుదము. అతని రాకకు ముందే మనమటకు పోయిన అతడు 'అయ్యో! మీరు నాకంటే ముందుగనే వచ్చితిరే!' యని నొచ్చుకొని మన అభీష్టములను వెంటనే నెరవేర్చును.
క్రిందటి పాశురంలో భారద్వాజ పక్షులు చేసే కలకల ధ్వనిని విని అందులోని ధ్వనిని గ్రహించమంటున్నది. ఈమె సాయించిన మొత్తం తిరుప్పావై అంతా ధ్వని కావ్యమే. పైకి సాధారణ భాషగా కనబడినా అందులోని అంతరార్ధం బహు విస్తృతమైనది. వేదోపనిషత్సారమైన యీ గ్రంథ ఆంతర్యాన్ని ప్రతివారు యెరిగి తీరవలసినదే అన్నదే ఆండాళ్ తల్లి చెప్పినది. ఈ ఎనిమిదవ పాశురంలో శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహ విశేషాన్ని సంపాదించిన ఒక పరిపూర్ణురాలైన గోపిక తెల్లవారిపోయిననూ ఇంకా లేవలేదని గమనించి ఆమెను లేచిన వారందరితో కలిసి గోదాదేవి మేల్కొలుపుతున్నది. ఇది ఎనిమిదవ పాశురము.
ఆండాల్ తిరువడిగళే శరణం
No comments:
Post a Comment