Monday, December 23, 2024

తిరుప్పావై తొమ్మిదవ వ పాశురం

తిరుప్పావై తొమ్మిదవ వ పాశురం

జై శ్రీ కృష్ణ

ప్రియ భగవత్ బంధువులారా!


నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం
పారార్థ్యం స్వం శ్రుతి శత శిర స్సిద్ధ మధ్యాపయంతీ!
స్వోచ్ఛిష్టాయామ్ స్రజినిగళితమ్ యా బలాత్కృత్య భుంక్తే
గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః


మనం ఇప్పటి వరకు 6.వ.పాశురంలో మొదటి గోపికను, 7 వ.పాశురం లో రెండవ గోపికను, 8వ పాశురంలో మూడవ గోపికను నిద్ర లేపడం జరిగింది. వీళ్లందరూ కలిసి ఈ రోజు 9 వ పాశురంలో నాలుగో గోపికను మేల్కొల్పడానికి బయలుదేరారు.
ఈ నాలుగవ గోపిక ఎలాంటిదట!

గొప్ప భక్తురాలు. వీళ్లందరూ కలిసి ఆ శ్రీకృష్ణుడి దర్శనానికి బయలుదేరితే, శ్రీకృష్ణుడేమో ఈ నాలుగవ గోపిక చుట్టూ తిరుగుతున్నాడు. చూడండి ఈ గోపిక.. శ్రీకృష్ణ ప్రేమని ఎంత పొందిందో. "ఆత్మన్యే వాత్మనా తుష్టఃఆ పరమాత్మ యందే వారి మనస్సు ఎప్పుడూ తలుస్తుతూ ఉంటుంది. ఈ అవస్థను 'వశీకారావస్థ' అంటారు. ఇది చాలా గొప్ప స్థితి. దీనిలో.. అంటే ఈ స్థితిలో ఉన్న యోగి.. సర్వ భోగాలు అనుభవిస్తు ఉంటాడు. ఈరోజు గోపిక ఆ స్థితిలోనే ఉంది. మొదటి రెండు పాశురాలలో శ్రవణము గురించి చెప్పబడింది. తర్వాత పాశురాలలో మననం గురించి చెప్పబడింది. ఈ 9 వ పాశురం నుంచి 12వ పాశురం వరకు ధ్యాన దశ వివరించబడుతుంది.
అలాంటి ధ్యానంలో.. పరాకాష్ట లో ఉన్న గోపిక ఈనాడు మేల్కొల్పబడుతుంది. పరాకాష్ట అంటే ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగిపోయింది.

ఇప్పుడు ఈ తొమ్మిదవ పాశురం చూద్దాం.

తూమణి మాడత్తు శుట్రుం విళక్కెరియ
తూపం కమళత్తుయిల్ అణైమేల్ కణ్ వళరుమ్
మామాన్ మగళే! మణిక్కదవం తాళ్ తిఱవాయ్
మామీర్, అవళై ఎళుప్పీరో? ఉన్ మగళ్ తాన్
ఊమయ్యో? అన్రిచ్చెవిడో? అనన్దలో?
ఏమప్పెరున్దుయిల్ మందిరప్పట్టాళో
మామాయన్ మాదవన్ వైకుందన్ ఎన్ఱెన్ఱు
నామం పలవున్ నవిన్రేలో రెమ్బావాయ్  || 9 || 

ఇప్పుడు ఈ పాశురం యొక్క భావాన్ని చూద్దాం.

తూమణి మాడత్తు శుట్రుం విళక్కెరియ

ఈ గోపిక అద్దాల భవనంలో ఉంటుందట. ఆ భవనం ఎలాంటిదట! చుట్టూ నవరత్నాలతో, మణులతో కట్టబడిందట ఆ భవనం. ఈ గోపిక చూడండి ఎలాంటి భవనంలో ఉంటుందో.
పరమాత్మట.. భక్తులకు.. అంటే ఈరోజు గోపిక ఉన్న స్థితిలో ఉన్నటువంటి భక్తులకు మాత్రమే, అంటే మోక్షాన్ని పొందడానికి అర్హత వున్న భక్తులకు (జీవులకు), నవరత్నాలతో, మణులతో అందమైన భవనాలని కట్టిస్తాడట. కానీ ఆయన మాత్రం రాళ్లతో కట్టిన ఇంటిలో (భవనంలో కూడా కాదు) ఉంటాడట. భక్తుల సుఖాన్నే కోరుకుంటాడు భగవంతుడు.అర్జునుడుకీ రథసారధిగా అవలేదా! యశోద కి కొడుకు గా ఉండి యశోద ముద్దులు తీర్చలేదా!


శుట్రుం విళక్కెరియ
ఆ భవనం చుట్టూ దీపాలు ప్రకాశిస్తూ ఉన్నాయట. ఆ భవనం అద్దాలతో నిర్మించడం వలన.. ఆ దీపాల యొక్క కాంతి.. బయట ఉన్న గోపికలకు కూడా కనిపిస్తుందట. ఈ గోపిక జ్ఞానవంతురాలు కాబట్టి.. ఈ గోపికతో స్నేహం చేస్తే వారికి కూడా కొంత జ్ఞానము అంటుంతుంది. ఇక్కడ దీపం అంటే జ్ఞానం.

తూపం కమళ
మంచి అగరవత్తులు వాసన వస్తుందట. మంచి సువాసనలు వస్తున్నాయట. అయినా ఆ సువాసనలు ఆమెకు తెలియట్లేదట. ఎందుకంటే ఆమె పూర్తిగా భగవంతునితో ఉన్నను అన్నా భ్రమలో నిద్రిస్తుంది. ప్రజాహాతి యదా కామాన్ అని భగవద్గీతలో చెప్పినట్లు పరమాత్మ మీదే మనసు నిలిపినట్లయితే వేరే కోరికల మీద ధ్యాస ఉండదు. అలాంటి స్థితిలోనే ఉన్నది ఈ గోపిక.

త్తుయిల్ అణైమేల్ కణ్ వళరుమ్
ఆమె హంసతూలికా తల్పం మీద పడుకొంటుందిట. ఇలాంటివి గుత్తి దీపంతో పాటు.. క్రింద పెట్టుకునే కుందు దీపాలు కూడా ఆమె చుట్టూ ఉన్నాయట. లోపల మంచి అగర్బత్తిలు వెలుగుతున్నాయి. ఆ భవనం అంతా పరిమళం వస్తుంది. మంచి వాసన వస్తుంది. బాగా మత్తుగా నిద్ర పోయిందట. మత్తుగా అంటే ఆ భగవంతుని కోసం ఆ శ్రీకృష్ణుడు కోసం కలలు కంటూ నిద్రపోతుంది. అటువంటి హంసతూలికా తల్పం పై అంటే ఇలా నడుం వాల్చగానే నిద్ర పట్టెంస్తుందట. నీ దగ్గర కృష్ణుడు లేదంటావా! ఖచ్చితంగా ఉండే ఉంటాడు. అని బయట గోపికలు అంటున్నారట.

మామాన్ మగళే!
మా మామయ్య కూతురా! చూడండి నిజానికి గోదాదేవికి - తన స్నేహితులకి ఎలాంటి చుట్టరికం లేదు. అయినా సరే తనకు తాను గోపికగా భావిస్తుంది కాబట్టి.. ఆధ్యాత్మిక సంబంధం కాకుండా భౌతిక సంబంధం పెట్టుకుంటుంది వారి స్నేహితులతో. మనకు ఎవరి మీదైనా ఇష్టం ఉందనుకోండి వాళ్లని ఏదో ఒక వరుస పెట్టి పిలుస్తాం అన్నా అనో, తమ్ముడనో, అక్కఅనో, వదిననో పిలుస్తాం కదా! అలా అన్న మాట.

మణిక్కదవం తాళ్ తిఱవాయ్
మణులతో పొదగబడిన తలుపుల గడియను తీయమ్మా! లోపల గోపికకు బయట గోపికలు కనిపిస్తున్నారు. బయట గోపికలకు లోపల గోపిక కనిపిస్తుంది. లోపల వున్న గోపిక తల్లి తన కూతురుతో అంటుందట. ఇకనైనా నీ పరిహాసాలు ఆపి చూడు. బయట నీ స్నేహితులందరూ మంచులో వణికిపోతూ నీ గురించి ఎలా చేస్తున్నారో! వెళ్లి తలుపు తియ్యి! ఆ తల్లి కూతురు తో మాట్లాడటం గోపికలకు వినబడక పోయినా కనిపిస్తున్నది కాబట్టి ఈ విధంగా ఊహించుకున్నారు. కూతుర్ని తలుపు తెరవమన్నట్లుగా! 

మామీర్! ఓ అత్తా! చూసారా! వరస కలిపేశారు. అవళై ఎళుప్పీరో? నువ్వైనా లేపవమ్మా నీ కూతురిని. చూసారా కోపంతో వరుస మర్చిపోయారు నీ కూతుర్ని అన్నారు. మనం కూడా కోపంలో వరసలు మర్చిపోతుంటాం. ఇలాంటి వరుసలు కోపంలో ఉన్నపుడు మన కుటుంబాలలో కూడా జరుగుతూ ఉంటాయి.తల్లికి కూతురి మీద కోపం వచ్చిందనుకోండి అప్పుడు భర్తను చూసి.. చూడండి! మీ కూతురి ఎలా తయారైందో అంటుంది భర్తతో.. భర్తకే కూతురు అయిన్నట్టు… తనకు కూతురు కానట్లు.


ఉన్ మగళ్ తాన్ ఊమయ్యో? అన్రిచ్చెవిడో?
నీ కూతురు ఏమైనా మూగదా! లేక చెవిటిదా! అవునులే భగవంతునితో సంబంధం పెట్టుకుంది కదా! ఇక మా మాటలేం వినబడతాయి.అనందలో ఇంతసేపూ కృష్ణుడితో ఉంది కదా! అలిసిపోయి పడుకుందా!


ఏమప్ పెరున్దుయిల్
ఈమెను ఎవరూ లేపకుండా కాపలా ఉంచారా! మనుషుల్ని. మందిరప్పట్టాళో లేకపోతే ఎవరైనా మంత్రం వేశారా! లేవకుండా! అంత మొద్దుగా నిద్రపోతుందేమిటి! పిలిచినా లేవట్లేదు. మామాయన్ మహా మాయావిని, మాయదారి కృష్ణుడిని మాదవన్ మాధవుడు అంటే లక్ష్మీదేవి భర్తని వైకుందన్ ఆ వైకుంఠవాసుని 

ఎన్ఱెన్ఱు నామం పవన్ నవిన్రు
ఎన్నో నామాలు చదువుతూ వస్తున్నాం కదా! నామ సంకీర్తన చేస్తూ వస్తున్నాం కదా! అయినా వినబడ లేదా! లేపవమ్మా!అప్పుడు ఆ గోపిక లేచి వీరితో పాటు పాటలు పాడుకుంటూ బయలుదేరింది.

ఏలోరెమ్బావాయ్
ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాలి. ఈ గోపిక కృష్ణుడు భక్తురాలు అనుకున్నాం కదా! ఈమె స్థితప్రజ్ఞురాలు కూడా! స్థితప్రజ్ఞురాలు అంటే మనకి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు. రెండో అధ్యాయం 55 వ శ్లోకంలోశ్రీ భగవాన్ ఉవాచ:

ప్రజహాతి యదా కామాన్
సర్వాన్ పార్ధ మనోగతాన్
ఆత్మన్యే వాత్మనా తుష్టః
స్థితప్రజ్ఞస్త దోచ్యతే

అర్జునా! ఎవరైతే మనసులో ఉన్న సమస్తమైన కోరికలను పూర్తిగా వదిలేసి, ఆ మనసును ఆత్మ, పరమాత్మల యందే నిలిపి సంతృప్తి చెందుతారోవారిని స్థితప్రజ్ఞులు అంటారు. ఈ గోపిక ఆ కోవకు చెందింది. ఆమె నిద్రలో కూడా భగవంతున్నే ధ్యానం చేస్తుంది. అందుచేత వినబడలేదు. వినబడలేకపోతే ఇంక సమాధానం ఏం చెబుతుంది. ఏం మాట్లాడుతుంది.లోపల దీపాలు వెలుగుతున్నాయి అనుకున్నాం. అంటే దీపము జ్ఞానం లాంటిది. ఇక ఊదొత్తుల వాసన అనుష్టానం లాంటిది. ఈ రెండు ఉన్నవారికి భగవదనుగ్రహం లభిస్తుంది.

ఈ గోపికని భక్తిసారులు అనే ఆళ్వార్ తో పోల్చారట. భక్తిసారుడు మహాజ్ఞాని, సిద్ధపురుషుడు, స్థితప్రజ్ఞుడు కూడా. వారికి అష్టసిద్ధులు తెలుసట. అయినా సరే ఆయన అవి ప్రదర్శించడానికి ఏమాత్రం ఇష్టపడరు. అలాంటి వాళ్లకి గర్వం ఎందుకుంటుంది. ఒకసారి పార్వతీ పరమేశ్వరులు ఆయన భక్తిని పరీక్షిద్దామని వచ్చారట. భక్తిసారున్ని ఏదైనా వరం కోరుకోమన్నారట. అప్పుడు ఆయన అన్నారట నాకు శ్రీమన్నారాయణుడి కైంకర్యం కావాలి ఆన్నారట. అంతకంటే ఇంకేం అక్కరలేదు అన్నారట.అప్పుడు పరమేశ్వరుడు ఇంకేదైనా వరం కోరుకోమని అడిగారట. ఆ సమయంలో భక్తిసారుడు తన ఇంట్లో ఉన్న చిరిగిపోయిన పాత బొంతని కుడదామని కూర్చున్నారట. ఆయన పరమ శివుడు తో నేను చిరిగిపోయిన ఈ బొంతని కుట్టుకోవాలి. ఈ సూదిలోకి దారం ఎక్కించి ఇవ్వు అని అన్నారట. చూడండి భగవంతుడు ప్రత్యక్షమైతే ఆయన ఎలాంటి కోరిక కోరుకున్నాడో. గొప్ప వాళ్ళు అలాగే ఉంటారు. ఒకసారి ఈ భక్తిసారుడు అనే ఈ ఆళ్వార్ దగ్గరికి ఒక సిద్ధుడు వచ్చి ఒక చిన్న గుళిక లాంటిది ఇచ్చి ఇది బంగారంగా మారుతుంది నువ్వు తీసుకో అన్నాడట. అప్పుడు ఆల్వార్ అన్నారట. నా శరీరాన్ని ఇలా పామితే వచ్చే మట్టి కూడా బంగారం అవుతుంది. ఇదిగో మీరు తీసుకోండి అన్నారట. అప్పుడు ఆ సిద్ధుడు ఆ మట్టిని పరీక్షిస్తే ఆ మట్టిముద్ద బంగారం అయిందట. 

ఒక వృద్ధురాలు ఆ ఆళ్వారు కి సేవ చేస్తుంటే కొన్నాళ్ళకి ఆమెకు వృద్ధాప్యం పోయి యవ్వనం వచ్చిందట. 18 ఏళ్ల అమ్మాయిగా తయారైందట. ఆమెను చూసి ఆ ఊరి రాజు వివాహం చేసుకున్నాడు. అప్పుడు తనకి కూడా యవ్వనాన్ని తెప్పించమని ఆ ఆళ్వారును కోరారు ఆ రాజు గారు. భక్తిసారుడు దానికి తిరస్కరించారట. అప్పుడు ఆ రాజు ఆయన్ని రాజ్య బహిష్కారం చేశారు. భక్తి సారులు ఆ ఊరు విడిచి వెళ్తుంటే.. ఆయన నిత్యం సేవించే ఆ ఆలయంలో మూర్తి కూడా ఆయనతో పాటు కదలి వెళ్లిపోవడం ప్రారంభించిందట. దాంతో ఆ ఊరి వాళ్ళు అందరూ కూడా ఆ ఆళ్వార్ వెనుక నడుస్తున్నారట. అప్పుడు రాజు కి జ్ఞానోదయం కలిగి ఆళ్వారుల వారిని ప్రార్థించగా.. ఆయనతోపాటు ఆ దేవతా మూర్తి కూడా (కంచి) ఆలయంలో ప్రవేశించారట. ఆళ్వార్లు చెప్పినట్టు చేసిన పెరుమాళ్ళు కనుక ఆయనకు యథోక్తకారి అనే పేరు వచ్చిందట. ఇప్పటికీ ఆ ఆలయం కంచిలో ఉంది. అలాగే ఒకసారి భక్తిసారుడు కుంభకోణం వెళ్లి ఆ వీధిలో నడుస్తుంటే ఆ ఆలయంలోని అర్చామూర్తి సారంగపాణి తన భక్తుడైన భక్తిసారుని చూసి పడుకున్న అయన పైకి లేస్తూ ఉన్నాడట. అప్పుడు ఆ అద్భుతాన్ని చూసిన భక్తులు అందరూ కూడా ఆ భక్తిసారుడ్నీ, సారంగపాణిని ఇద్దరినీ ప్రార్థించారట. ఇలాంటి మహిమలు ఎన్నో వున్న భక్తిసారుడు ఏమీ తెలియని వాడిలాగా మౌనంగా ఆ భగవంతున్ని కొలుస్తూ ఉంటారట.


ఆండాల్ తిరువడిగళే శరణం


No comments:

Post a Comment

Magha Nakshatra - మఖ నక్షత్రం

మఖ నక్షత్రం రాశి : సింహ రాశి గ్రహాధిపతి : సూర్యుడు నక్షత్ర దేవత : పితృదేవతలు (పితృగణాలు – అనునాయక పితృమూర్తులు) శక్తి : "పదవులు, సన్మాన...