తిరుప్పావై - పదకొండవ పాశురము
శ్రీ గురుభ్యోనమః
జై శ్రీ కృష్ణ
ప్రియ భగవత్ బంధువులారా!
జై శ్రీమన్నారాయణ
నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం
పారార్థ్యం స్వం శ్రుతి శత శిర స్సిద్ధ మధ్యాపయంతీ!
స్వోచ్ఛిష్టాయామ్ స్రజినిగళితమ్ యా బలాత్కృత్య భుంక్తే
గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః
ఈ రోజు 11.వ. పాశురం
ఈరోజు లేపబడే గోపిక ఆరో గోపిక..చాలా భక్తురాలు, చాలా సౌందర్యవతి కూడా. ఈ గోపిక అంటే ఊరి వారందరికీ కూడా చాలా ఇష్టం. వీరి కుటుంబంలో వారందరూ తరతరాల నుంచి కూడా మంచి భక్తులు గానే ఉన్నారు. మనం చేసే ఏ కర్మ అయినా సరే భగవంతుని పొందడానికి అడ్డుకాదు, ప్రతిబంధకం కాదు. భగవంతుడే నాలో ఉండి నా చేత ఆయనకు ప్రీతికరమైన కర్మలను చేయిస్తున్నాడు అని భావించి ప్రపన్నుడు కర్మలను ఆచరిస్తూ ఉంటాడు. ఆ కర్మఫలితాలు మంచైనా, చెడైనా విచారించడం గానీ, దుఃఖించడం గానీ చేయడు. అటువంటి వాడిని కూడా స్థితప్రజ్ఞుడు అని అంటారు.
యః సర్వత్ర అనభిస్నేహః
తత్తత్ ప్రాప్య శుభాశుభం
న అభినందతి న ద్వేష్టి
తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా
ఈ శ్లోకం మీకు తెలిసిందే భగవద్గీతలో రెండవ అధ్యాయం 57.వ.శ్లోకం.దీనర్థం ఏమిటంటే.. ఇది కూడా స్థితప్రజ్ఞత గురించి చెబుతుంది.
యః సర్వత్ర అనభిస్నేహః
ఎవరైతే ఏ విషయంలోనీ ఆసక్తి చూపడో
తత్తత్ ప్రాప్య శుభాశుభం
ఆ కర్మల వల్ల వచ్చిన ఫలితం కష్టమైనా, దుఃఖమైనా అయినా
న అభినందతి న ద్వేష్టి
సంతోషించడం గానీ విచారించడం గానీ చేయడో
తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా
అతనిని స్థితప్రజ్ఞుడు అంటారు. అటువంటి వంశానికి చెందినదే ఈ ఆరో గోపిక.
ఇక పాశురం చూద్దాం
కత్తుక్కఱవై క్కణంగల్ పలకఱన్దు
శెత్తార్ తిరలళియ చెన్రు శెరుచ్చెయ్యుమ్
కుత్త మొన్రిల్లాద కోవలర్ తం పొర్ కొడియే!
పుత్తరవల్ గుల్ పునమయిలే! పోదరాయ్
శుత్తత్తుత్ తోళిమార్ యతఎల్లారుం వందు - నిన్
ముత్తమ్ పుగున్దు ముగిళ్ వణ్ణన్ పేర్ పాడ
శిత్తాదే పేశాదే శెల్వప్ పెణ్ డాట్టి! నీ
ఎత్తుక్కురంగుం పొరుళ్-ఏలోర్ ఎంమ్బావాయ్ || 11 ||
ఇప్పుడు ఈ పాశురం యొక్క అర్థాన్ని చూద్దాం.
కత్తుక్కఱవై క్కణంగల్ పలక ఱన్దు
ఓ బంగారు తీగ వంటి దానా! ఇందాక అనుకున్నాం కదా! ఈ గోపిక చాలా సౌందర్యవతి అని. అందుకే ఓ బంగారు తీగా!అని అంటున్నారు.
నందవ్రజములో ప్రతి ఇంట్లో గోసంపద ఉంటుంది. లేత వయసు దూడలు, లేగదూడలు మంచి బలిష్టంగా ఉంటూ పెద్ద పెద్ద పొదుగులతో చాలా ఎక్కువగా పాలిస్తాయి. కుండల కొద్దీ పాలిస్తాయట. నీ వంశంలో గోపాలురు అందరూ లేత వయస్సుగల పశువుల మందలు కలవారు. అందరూ పాలు పితకుడంలో నైపుణ్యం వున్నవారే.
శెత్తార్ తిరలళియ చెన్రు శెరుచ్చెయ్యుమ్
మీ వంశంలో ఉన్నవాళ్ళు అందరూ శత్రువులను ఎదిరించగలిగిన శౌర్యము, ధైర్యం కలవారే. గొప్ప పరాక్రమం, కండబలం కలవారే. లేకపోతే అంత గొప్ప లక్షల సంఖ్యలో గోసంపద ఉన్నప్పుడు వాటి బరువైన పొదుగులనుండి పాలు పితకటం మమూలు వాళ్లకు సాధ్యం కాదు. అంత భుజబలం ఉందట వాళ్ళకి. ఎంత భుజబలం, ఎంత ధైర్యం ఉన్నా, శత్రువులని ఎదిరించే ధైర్యం ఉన్నా సరే వాళ్లు అనవసరంగా ఎవరి జోలికి వెళ్లకుండా వాళ్ల పనేదో వాళ్లు చేసుకుంటారట.
కుత్త మొన్రిల్లాద కోవలర్ తం పొర్ కొడియే
ఒక దోషము కూడా లేని వారట ఆమె యొక్క వంశస్థులు. అక్కడ గోపికల్లో ఏ ఒక్కరిలో ఎలాంటి దోషం కనిపించదట. వాళ్ళందరూ కృష్ణుడు భక్తులు కదండీ, వాళ్లలో దోషం ఎందుకుంటుంది!అలాంటి వంశంలో పుట్టిన ఓ స్వర్ణలతా! ఓ బంగారు తీగా! చెట్టుకు అల్లుకున్న ఒక తీగ ఒక లత ఎంతో అందంగా ఉంటుంది కదా!. అలాంటిది బంగారు తీగ ఇంకెంత అందంగా ఉంటుంది. అందుకే అంత సౌందర్యవతి కాబట్టి ఆ గోపికని బంగారు తీగా అన్నారు.
పుత్తరవల్ గుల్ పునమయిలే! పోదరాయ్
ఇక్కడ గోపిక యొక్క సౌందర్యాన్ని చెబుతున్నారు. పుట్టలో ప్రవేశిస్తున్నటువంటి పాము యొక్క నితంబ ప్రదేశము కలదానా! అంటే పాము యొక్క శరీరం అంతా సన్నగా ఉండి, పడగ పెద్దగా ఉంటుంది. అలాగే ఆ గోపిక యొక్క నడుము సన్నగా ఉండి ఆ కింద పిరుదుల భాగం పాము పడగలాగ పెద్దగా, లావుగా ఉంటుందట. బంధువులం, స్నేహితురాళ్ళం వచ్చి నీ వాకిట్లో నిలబడ్డామమ్మా! ఎందుకో తెలుసా!
అముగిల్ వణ్ణన్
ఆ నీలమేఘ శ్యాముడైన సర్వేశ్వరుని అనంతమైన కళ్యాణగుణములను పాడుతున్నారు.
శిత్తాదే పేశాదే శెల్వప్ పెట్టాంట్టి! నీ ఎత్తుక్కు ఉరంగుం పొరుళ్-ఏలోర్ ఎంబావాయ్
నీవు కదలకుండా, మాట్లాడకుండా ఉన్నావు. ఓ చిన్నదానా! ఎందుకు అలా నిద్రపోతున్నావు. లేచి రావమ్మా! అని ఆ గోపికని ఎంతోగానో పొగుడుతూ మేల్కొలుపుతున్నారు.
ఈ పాశురంలో మేల్కొన బడుతున్నటువంటి ఆళ్వార్ ఎవరంటే శ్రీ తిరుమంగై ఆళ్వార్లు. ఈయన పేరు నీలుడుఈయన చాలా బలశాలి, పరాక్రమవంతుడు, ధైర్యశాలి.
ఈయన గురించి తెలుసుకొని చోళరాజు వీరికి కొన్ని గ్రామాలు ఇచ్చి, తనకు సామంతరాజుగా చేసుకున్నాడు చోళరాజు. ఈయన (అంటే నీలుడు) ఆ గ్రామంలో పర్యటిస్తున్నప్పుడు ఒక చెరువు దగ్గర ఒక అందమైన యువతిని చూశాడు. చూసి ఆమెను ప్రేమించాడు. ఆమె పేరు కుముదవల్లి. ఒక రెండు షరతుల మీద ఆమె నీలుడిని వివాహం చేసుకోవడానికి అంగీకరించింది. ఏమిటా షరతులు అంటే ఒకటి ఆచార్య సమాశ్రయణం చేయడం, రెండోది ఒక సంవత్సరం పాటు వెయ్యి ఎనిమిది మందికి సమారాధన చేయడం. ఈ 2 నియమాలు కి నీలుడు అంగీకరించి కుముదవల్లిని పెళ్లి చేసుకున్నాడు. అప్పటినుంచి నీలుడు భాగవత తదీయారాధనకి తన రాజ్యంలో వచ్చే రాబడి అంతా ఖర్చు పెడుతూ చోళ రాజుకి కప్పం కట్టడం మానేశాడు. చూసి చూసి చోళరాజు విసిగిపోయి నీలుడి మీదకి దండెత్తాడు. ఆ యుద్ధంలో చోళరాజు ఓడిపోయాడు. నీలుడు గెలిచాడు. నీలుడికి పరకాలుడు అనే బిరుదు వరించింది. కానీ నీలుడు ధర్మానికి కట్టుబడి కప్పం కట్టడానికి తపస్సు చేయగా పరమాత్మ ప్రత్యక్షమై వేగవతి నదీ తీరంలో ఉన్న గుప్త నిధిని చూపించాడు. అతను ఆ నిధిని తవ్వి తీసి రాజుకి కప్పం చెల్లించాడు. తర్వాత రాజ్యాన్ని వదిలేసి దొంగతనమే వృత్తిగా చేసుకొని డబ్బు సంపాదించి, దొంగతనం చేయగా వచ్చిన ఆ డబ్బుతో భగవత్ భాగవత కైంకర్యములు చేస్తుండేవాడు. అతను ఆ వృత్తిలో భగవద్భక్తులను హింసించకుండా, నాస్తికులైన ధనవంతుల్ని దోచి, దాచి శ్రీరంగంలో ప్రాకారాలని, మండపాలని కట్టించాడు. అంతేకాకుండా ఆయన శ్రీ నమ్మాళ్వార్ రచించిన నాలుగు తమిళ వేదాలని, ఆరు వేదాంగ దివ్య ప్రబంధాలను రచించాడు.
పరమాత్మ సొత్తును తమది అనుకొని దుర్వినియోగం చేసే వారి నుంచి దానిని తీసుకుని తిరిగి పరమాత్మకే అర్పించినవారు దొంగలు కారు ధన్యులు. అందుకే పరకాలునికి 'కలివైరి' అని పేరు వచ్చింది.కలివైరి లాగానే ఈ పాశురంలో గోపాలురు, గోపాల వంశం వారు కూడా తమ సంపదనంతా, అంతా అంటే.. కష్టపడి సంపాదించిన సంపద అంతా దానధర్మాలకే వినియోగించారు. అలాంటి వంశంలో పుట్టిన గోపికను ఈ రోజు మేల్కొలుపుతున్నారు.
మనం - ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాలి.
మనకి భగవంతుని పొందడానికిఅవసరమైనటువంటి జ్ఞానం కలిగినా సరే మనం చేయవలసిన కర్మలను విధిగా, తప్పకుండా చేయవలసిందే. కర్మలు చేయకుండా ఎవరూ తప్పించుకోలేరు.
భగవద్గీత 18వ అధ్యాయం లో 46 వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు.
యతః ప్రవృత్తిర్ భూతానాం
యేన సర్వమిదం తతం
స్వకర్మణా తమ భ్యర్ చ్య
సిద్ధం విందతి మానవః
యతః ప్రవృత్తిర్ భూతానాం
ఎవరి వల్ల అయితే సర్వ ప్రాణుల యొక్క సృష్టి జరుగుతుందో, సమస్త జీవులకు ఆయనే ఆధారమైనవాడు. అందుకే మనం ఆ భగవంతుని పట్ల కృతజ్ఞతాభావంతో ఉండాలి. ఎంతో భక్తి శ్రద్ధలతో ఆయన్నే ఆరాధించాలి. భగవంతుడు మనకి పెద్దల ద్వారా ఏ కర్మలు నైతే చేయమని చెప్పారో అటువంటి కర్మలని మనం ఆచరించాలి.
యేన సర్వమిదం తతం
ఎవరు ఈ సమస్త విశ్వమంతా వ్యాపించి ఉన్నారో, అందుకే మనం విష్ణుసహస్రనామాల్లో మొట్టమొదట చెప్తాం,విశ్వం విష్ణుః అని, ఆయనే సర్వవ్యాపి. పాలలో ఉన్న వెన్న లాగా, పాల అంతటిలోనీ వెన్న ఉంటుంది కదా! మనకు కనిపిస్తుందా! వెన్న మనకి కనిపించాలంటే, దాన్ని మనం తినాలి అంటే, దాన్ని మనం అనుభవించాలి అంటే, ఏం చేయాలో మీకు తెలుసు. అదేవిధంగా ఆ పరమాత్మ కూడా మన స్థూల నేత్రానికి కనిపించడు. జ్ఞాన నేత్రానికి మాత్రమే కనిపిస్తాడు. ప్రతి అణువు లోని భగవంతుడు వ్యాపించి ఉంటాడు. అది మనం తెలుసుకోవాలి.
స్వకర్మణా తమ భ్యర్ చ్యస్వకర్మణా - అభ్యర్చ్య - తమ్
మనిషి కర్మని ఆచరించడం ద్వారా మోక్షాన్ని ఎలా పొందగలడో భగవంతుడు సమాధానం కూడా చెప్పాడు.నీవు నీ కర్మ చేస్తూ దైవాన్ని ఆరాధించు, దైవాన్ని స్మరించు, పరమేశ్వరునికి అర్పిస్తున్నట్టుగా భావించి కర్మ చెయ్యమని పరమాత్మ మనకు సూచిస్తున్నాడు.
ఆండాల్ తిరువడిగళే శరణం
No comments:
Post a Comment