శుకయోగి యుపదేశమునం దెల్పుభూగోళ నిర్ణయము
నరేంద్రా! భూమి పద్మాకారంగా ఉంది. ఆ పద్మాకారమయిన భూమిలో జంబూద్వీపం తామరాకు లాగున గుండ్రంగా కనిపిస్తుంది. అది లక్షయోజనాల పొడవూ, లక్ష యోజనాల వెడల్పూ కలిగి ఉంటుంది. అందులో గుండ్రటి ఆకారాలతో తొమ్మిదివేల యోజనాల విస్తీర్ణం గల తొమ్మిది వర్షాలున్నాయి. వాటినన్నింటిని విభజించే సరిహద్దులుగా ఎనిమిది పర్వతాలున్నాయి. ఆ తొమ్మిది వర్షాలలో నట్టనడుమ 'ఇలావృతమనే' వర్షం ఉంది. దాని నడుమ బంగారురంగుల పర్వతం ఉంది.
అదే సువర్ణమయమైన సుమేరుపర్వతం. భూమి పద్మమయితే సుమేరు పర్వతం దాని కర్ణిక. సుమేరు పర్వతం కులగిరులకే రాజు. దేవతలందరు ఆ పర్వతాన్ని చూచి ఆశ్చర్యచకితులవుతుంటారు.
(భూమిని పద్మంగా ఊహిస్తే దానిమధ్య జంబూద్వీపమున్నదని భావం. ఇలావృతమంటే భూమిచే ఆవృతమని గ్రహించవలసి ఉంటుంది. మేరువనగా ఇరుసు. భూపరిభ్రమణానికి కేంద్రమని అర్ధం. ఏడు దీవులకు ఏడు కులగిరులున్నాయి. వాటిలో మేరువు ముఖ్యమయినది. జంబూద్వీపం డెబ్భైలక్షల మైళ్ళు.)
ఆ మెరుగిరి లక్ష యోజనాల ఎత్తు కలిగి ఉంటుంది. దాని పాదప్రదేశం పదారువేల యోజనాల విసృతి కలిగి అంతే కొలత గల లోతు కలిగి ఉంటుంది. పైన విసృతి ముప్పది రెండువేల యోజనాలు. దానికి ఉత్తరపు దిక్కులో నీలం, శ్వేతం, శృంగం అనే మూడు పర్వతాలు ఆకాశాన్ని అంటుతూ నిలిచివున్నాయి. వీని విస్తారం రెండువేల యోజనాలు. ఇవి తూర్పునుండి పడమర వరకు, ఉత్తరం నుండి దక్షిణానికి విస్తరించి ఉంటాయి. ఈ దృశ్యం చాల రమణీయం.
తూరుపు పడమరలలో ఉప్పునీటి సముద్రంవరకూ ఉన్న సరిహద్దు పర్వతాలలో నీలశ్వేత శృంగవత్పర్వతాలు క్రమంగా ఒకదానికంటె ఒకటి పది యోజనాల తక్కువ పొడవు కలిగి ఉంటాయి. ఈ మూడు పర్వతాల నడిమి ప్రదేశంలో రమ్యక, హిరణ్మయ, కురు నామాలుగల మూడువర్షాలు ఉన్నాయి. అవి ఒక్కొక్కటి తొమ్మిదివేల యోజనాల విస్తృతి కలిగి ఉన్నాయి. అవన్నీ సముద్రందాక వ్యాపించి ఉన్నాయి. ఆ మూడు వర్షాల పొడవు నీలశ్వేత శృంగవత్పర్వతాల పొడవుతో సమానంగా ఉంటుంది.
ఇలావృతవర్షానికి దక్షిణంగా మూడు సరిహద్దు పర్వతాలు ఉన్నాయి. అవే నిషధ పర్వతం, హేమకూట పర్వతం, హిమవత్పర్వతం. ఇవి తూర్పునుండి పడమటి వరకూ పొడవూ, ఉత్తరంనుండి దక్షిణం వరకూ వెడల్పూ కలిగి ఉన్నాయి. వీటి నిడివి నీలశ్వేత శృంగవత్ పర్వతాలతో సమానంగా ఉంటుంది. ఈ మూడు కొండల నడుమ మూడు భూప్రదేశాలున్నాయి. అవే హరివర్షం, కింపురుషం, భారతవర్షం అనేవి.
ఇలావృతవర్షానికి పశ్చిమంలో మాల్యవంతం. తూర్పున గంధమాదనం అనే సరిహద్దు పర్వతాలున్నాయి. అవి తూర్పు పడమరలకు పొడవూ, ఉత్తర దక్షిణాలకు వెడల్పూ కలిగి నీలపర్వత నిషధ పర్వతాలను ఆనుకొని ఉన్నాయి. వాటి విసృతి రెండువేల యోజనాలు. మాల్యవంతం, గంధమాదనం అనే ఈ రెండూ కేతుమాల భద్రాశ్వవర్షాలకు సరిహద్దు పర్వతాలుగా ఉన్నాయి. సుమేరు పర్వతానికి తూర్పున మందర పర్వతం, దక్షిణాన మేరుమందర పర్వతం, పడమట సుపార్శ్వపర్వతం, ఉత్తరాన కుముద పర్వతం ఉన్నాయి. ఈ నాలుగు పర్వతాలు పదివేల యోజనాల ఎత్తు కలిగి ఉన్నవి.
ఇన్నిటికీ నడుమ మేరుపర్వతం ఎత్తుగా పొడుగైన స్తంభం లాగా ఉంటే మిగిలిన పర్వతాలు నాలుగు పక్కల నాటిన పొట్టిగుంజలలాగున ఉన్నాయి.
ఈ నాలుగు పర్వత శిఖరాలమీద పతాకాల లాగున క్రమంగా పెద్ద పెద్ద మామిడిచెట్టు, నేరేడు చెట్లు, కడిమి చెట్లు, మర్రిచెట్లు ఉన్నాయి. ఈ వృక్షరాజాలు ఒక్కొక్కటీ పదకొండు వందల యోజనాల పొడవూ, నూరు యోజనాల వెడల్పు కలిగి ఉన్నాయి. ఇంతేగాక ఆ నాలుగు పర్వత శిఖరాల మీద శతయోజన విస్తీర్ణములయిన నాలుగు పెద్ద పెద్ద సరోవరాలు ఉన్నాయి. క్రమంగా వానిపేర్లు క్షీర సరస్సు, మధుసరస్సు, ఇక్షురస సరస్సు, నిర్మల జలసరస్సు. ఆ సరస్సులలో స్నానం చేసేవారికి స్వభావం చేతనే యోగనిష్ఠా, అణిమాదిసిద్దులూ సిద్ధిస్తాయి. ఇంకా ఆ పర్వత శిఖరాలపైన నందనం, చైత్రరథం, వైభ్రాజకం, సర్వతోభద్రం అనే దేవోద్యానాలు ఉన్నాయి. ఆ ఉద్యానవనాలలో దేవతలు దేవకాంతలతోకూడి గంధర్వుల ఆటపాటలను ఆలకిస్తూ ఆలోకిస్తూ ఆనందంగా విహరిస్తారు.
మందరపర్వతంమీద మామిడిచెట్లున్నాయి. ఆ చెట్లఫలాలు పర్వత శిఖరాలంత పెద్దవి. ఆ పండ్లరుచి అమృతంవలె ఉంటుంది. బాగా మాగిన పండ్లు చెట్లనుండి రాలుతాయి. ఆ పండ్లు పడి పగిలినపుడు ఆ పండ్లరసం అచ్చెరువు గొల్పేవిధంగా మహాప్రవాహమై 'అరుణోద' ము అనే పేరుతో ప్రవహిస్తుంది.
ఆ నదీరసాలు చాలా తియ్యనివి. సుగంధంతో కూడినవి. ఎర్రనిరంగు కలవి. ఆ నది మందరాచలం నుండి బయల్వెడలి తూర్పువైపుగా ఇలావృతవర్షాన్ని ఒరుసుకొంటూ సాగిపోతుంది. ఆ నదీతరంగాలు అందరినీ పవిత్రం చేస్తుంటాయి.
ఓ రాజా! ఆ నదీజలాలలో పార్వతీదేవి చెలికత్తెలు స్నానం చేస్తారు. వారి శరీరాలలోని సహజ దివ్యపరిమళాన్ని గ్రహించిన వాయువు పదివేల యోజనాల పర్యంతం సుగంధాలు వెదజల్లుతుంది.
మేరుమందరపర్వతాలమీద నేరేడు పండ్లున్నాయి. ఆ పండ్లు పెద్ద ఏనుగులంత పరిమాణంగలవి. చెట్లనుండి అవి రాలిపడి పగులగా ఆ పగిలిన పండ్లరసమే ప్రవాహంగా ఆ కొండమీద జాలువారుతున్నది.
ఆ నేరేడు పండ్లరసం నదిగా ప్రవహిస్తున్నది. ఆ నదిపేరు జంబూనది. ఆ నది సాటిలేనిది. ఆ నది ఇలావృత వర్షాన్ని తడుపుతూ భూభాగంమీద ప్రవహిస్తున్నది.
ఆ జాంబూనదీజలంతో బాగా నానిన మట్టి, గాలి, సూర్యకిరణాల సంపర్కంతో పరిపక్వమై బంగారంలా మారిపోతుంది. ఆ కారణంగా బంగారానికి జాంబూనదం అనే పేరు వచ్చింది. మంచివన్నెగల ఆ శుద్ధ సువర్ణంతో దేవతలు నగలు చేయించుకొని అలంకరించుకొంటారు.
(హాటకోత్పత్తి కథనం : బంగారు ఉత్పత్తి అయ్యే విధం పంచమస్మంధం - ద్వితీయాశ్వాసంలోనే రెందు విధాలుగా చెప్పబడింది. 1) 5-2-26 - జాంబూనదము = బంగారు
2) 5-2-111 - హాటకము = బంగారు
దేవతలు ధరించే బంగారం - జాంబూనదము. 'వితలం' (అధోలోకాలలో ఒకటి) లోని ప్రజలు ధరించే బంగారం హాటకము. మూలంలో ఏయే నగలుగా మార్చుకొంటారో, అలంకరించుకొంటారో వివరణ ఉంది. 'ముకుట, కటక, కటిసూత్ర ఆది ఆభరణ రూపేణ ఖలు ధారయన్తి' (16-21) కిరీటాలు, కంకణాలు, మొల నూలులాంటి నగలని గ్రహించవచ్చు.)
సుపార్శ్వమనే కొండ పైభాగంలో ఐదుప్రవాహాలు. ఒక్కొక్క ప్రవాహం ఐదుబారల వెడల్పు కలది. నదీరూపంగా కనిపించేది. అవి క్రిందికి ప్రవహిస్తూ ఇలావృత వర్షం పడమటిభాగాన్ని తడుపుతుంటాయి. ఆ ఐదు తేనెప్రవాహాలనూ ఆస్వాదించినవారి ముఖాలనుండి వెలువడిన పరిమళం నూరు యోజనాల పర్యంతం వ్యాపిస్తుంది.
(వ్యామము అంటే రెండు చేతులు చాస్తే వాని నడుమగల పరిమాణం. దాదాపు 8 అడుగులు. ఒక్కొక్కధార 40 అడుగుల వెడల్పు కలదని భావించాలి.)
ఓ రాజా! కుముద పర్వతం శిఖరంమీద దృఢమయిన మర్రిచెట్టు ఉన్నది. ఆ మర్రిమాను బోదెనుండి పాలు, పెరుగు, నేయి, తేనె, బెల్లం ఇంకా రకరకాల రుచులు కలిగిన ఆహారపదార్థాలు ఎప్పుడూ పుడుతూ ఉంటాయి. వస్త్రాలు, పాన్పులు, ఆసనాలు, నగలు మొదలయిన వస్తువులను ఆ వటవృక్షం ప్రసాదిస్తుంది. ఆ మర్రిమాను కోరిన కోరికలు తీరుస్తూ ఇలావృత వర్షంలో నివసించే ప్రజల కందరికి సమస్త విధములయిన సుఖసంపత్తిని ప్రసాదిస్తుంది. ఆ ఆహారపదార్థాలు వాడడం వల్లనూ ఆ ప్రదేశంలో అయాచితంగా దక్కే సుఖానుభోగంవల్లనూ అక్కడ ఎవరికీ ముసలితనం రాదు. చర్మం ముడుతలు పడదు. జుట్టు నెరిసిపోదు. శరీర దుర్గంధం ఉండదు. మరణభయం అసలుండదు. చలి, ఎండల బాధలసలు ఉండనే ఉండవు.
దేవతలు, రాక్షసులు, దివ్యమునీంద్రులు, గంధర్వులు మొదలయిన వారందరూ ఈ కుముద పర్వతాన్ని ఆశ్రయించి పట్టరాని సంతోషంతో విహరిస్తుంటారు.
(మూలంలో 'కుముదనిరూఢో యశ్శతవల్మోనామ వటః' 16-24 అని మర్రిచెట్టు పేరు 'శతవల్మము' గా చెప్పబడింది.
నరేంద్రా! మేరుపర్వతం తామరదుద్దు. దానిచుట్టూ కురంగం, కురరం, కుసుంభం, వైకంకతం, త్రికూటం, శిశిరం, పతంగం, రుచకం, నిషధం, శితివాసం, కపిలం, శంఖం మొదలయిన పర్వతాలు కేసరాలుగా ఉన్నాయి. ఆ మేరుపర్వతానికి తూర్పుభాగంలో జఠరగిరి, దేవకూటం అనే కొండలున్నాయి. పడమట పవనగిరి, పారియాత్రం అనే పర్వతాలున్నాయి. ఈ నాలుగు పర్వతాలు ఒక్కొక్కటి దక్షిణం నుంచి ఉత్తరం వరకు పద్దెనిమిది వేల యోజనాల పొడవూ, తూర్పునుండి పడమటివరకూ రెండువేల యోజనాల వెడల్పూ కలిగి ఉంటాయి. ఆ కొండల కావల దక్షిణంలో కైలాసం, కరవీరం అనే కొండలున్నాయి. ఆ కొండలు ఒక్కొక్కటీ తూర్పునుండి పడమటి దిక్కుదాక పద్దెనిమిది యోజనాల పొడవూ, దక్షిణం నుంచి ఉత్తరం దాకా రెండువేల యోజనాల వెడల్పూ కలిగి ఉంటాయి. మేరువు చుట్టూ ఉన్న ఎనిమిది కొండలు అగ్నిహోత్రునికి ప్రదక్షిణంగా పరిచిన దర్భల లాగున నిలిచి ఉన్నాయి. మేరుపర్వత శిఖరంలో 'బహ్మపురం' ఉన్నది. అది పదివేల యోజనాల పొడవూ, అంతే వెడల్పు కల ప్రదేశం. అదంతా సువర్ణభూమి. ఆ బ్రహ్మపురానికి ఎనిమిది దిక్కులలోనూ అష్టదిక్పాలకుల పట్టణాలున్నాయి.
(అష్టాగ్నులు - అగ్ని, జాతవేదుడు, సహోజుడు, అజరా ప్రభుడు, వైశ్వానరుడు, నర్యావసుడు, విస్ఫురుడు, పంక్తిరథుడు.
అష్టదిక్పాలకులు : ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరృతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు.
దిక్పాలుర పట్టణాలు : అమరావతి, తేజోవతి, సంయమని, కృష్ణాంగన, శ్రద్ధావతి, గంధవతి, అలక, యశోవతి.
అష్టదిక్కులు : తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైఋతి, పడమర, వాయవ్యం, ఉత్తరం, ఈశాన్యం.)
ఓ రాజా! బ్రహ్మపట్టణంలో నారాయణుడు త్రివిక్రమత్వాన్ని ప్రదర్శించాడు. అప్పుడాయన కాలిగోటి దెబ్బకు బ్రహ్మాండం పైభాగం బ్రద్దలయింది.
(మూలంలో 'బహ్మపురి' కి సంబంధించిన కొన్ని అంశాల వర్ణనలున్నాయి. మేరుపర్వత శిఖరంపై మధ్యలో బంగారంతో నిర్మించిన నగరం బ్రహ్మపురి. ఇది సమచతుర్భుజాకారం గలది. కోటియోజనాల నిడివి కలది. 'యజ్ఞలింగస్య విష్ణోర్విక్రమతో వామపాదాంగుష్ఠ నఖనిర్భిన్నోర్ధ్వాండ కటాహవివరేణ'(17-1) అని వర్ణన. యజ్ఞంనందు వామనాకృతి గలిగి మూడు అడుగులు వేయుచున్న విష్ణువు ఎడమకాలి బొటనవ్రేలియొక్క గోటిచే పగులగొట్టబడిన పైభాగంగల గంగాళంవంటి బ్రహ్మాండం యొక్క రంధ్రం అని వివరణ కనిపిస్తుంది.)
త్రివిక్రమావతారం ప్రదర్శించిన శ్రీమన్నారాయణుని వామ పాదాంగుష్ఠంచేత బ్రహ్మాండం పై కప్పు బద్దలుకాగా ఒక రంధ్రం ఏర్పడింది. అప్పుడు అంతవరకు వెలుపలివైపు ప్రవహిస్తున్న జలధార అంతర్వాహినియై త్రివిక్రమదేవుని పాదాన్ని స్పృశిస్తూ ప్రవహించింది. ఆ ప్రవాహమే 'భగవత్పాది' అనే పేరుతో సకల లోకాల పాపాలను పరిహరిస్తూ చాలకాలం స్వర్గంలో విహరించింది. ఉత్తానపాదుని కుమారుడూ, భాగవతులలో అగ్రేసరుడూ అయిన ధ్రువుడు తన ఇలువేల్పయిన శ్రీహరి పాదోదకాన్ని ప్రతిదినం నిమీలిత నేత్రుడై భక్తితో స్వీకరిస్తూ, ఆనందబాష్పాలతో, పులకించిన దేహంతో, ఎంతో ఆదరంతో నేటికీ తలపై చల్లుకొంటున్నాడు. ఆ ధ్రువునికి దిగువ భాగంలోనే మండలాధిపతులయిన సప్తర్షులున్నారు. వారు శ్రీమన్నారాయణుని పాదోదక ప్రభావం తెలుసుకొని ఆకాశగంగలో స్నానం చేయడమే తమ తపస్సిద్ధి అని భావిస్తారు. అలా స్నానం చేయడంవల్ల తమ జన్మ చరితార్థమవుతున్నట్టు విశ్వసిస్తారు. అఖిల జగత్తులో అంతర్యామిగా ఉన్న శ్రీమన్నారాయణుని పై భక్తి దృఢంగా నిలిపి, వేరే ప్రాపంచికమయిన వస్తువులపై అపేక్ష లేకుండా, మోక్షం కోరేవ్యక్తి, ముక్తిమార్గాన్ని గౌరవించినట్లు భక్తిగౌరవాలతో సప్తమహర్షులు ఆ ఆకాశగంగాజలాన్ని తమ జటాజూటాలలో ఈనాటికీ ధరిస్తుంటారు.
(ధ్రువమండలానికి విష్ణుపదం అని ప్రసిద్ది.)
వారాహే వామపాదం తు తదన్యేషు తు దక్షిణమ్ ।
పాదం కల్పేషు భగవాన్ ఉజ్జహార త్రివిక్రమః ॥
కుడిపాదంపై నిలిచి, ఎడమ పాదాన్ని విశ్వం యొక్క అంచువరకు చాచి వామనమూర్తి త్రివిక్రముడుగా ప్రసిద్ది చెందాడు.
సప్తర్షులు - ఆయామనువుల కాలంలో విభిన్న ఋషులు సప్తర్షులు. వైవస్వత మనువు కాలంలో వసిష్ఠ, అత్రి, గౌతమ, కశ్యప, భరద్వాజ, జమదగ్ని విశ్వామిత్రులు సప్తర్షులు.)
విష్ణుమూర్తి పాదాలనుండి వినిర్గతమైన ఆకాశగంగ లెక్కలేనన్ని దివ్యవిమానాలతో నిండి సువిశాలమయిన దేవమార్గం గుండావచ్చి చంద్రమండలాన్ని ఒరుసుకొంటూ మేరుపర్వత శిఖరాగ్రానికి చేరుకొంటుంది. అక్కడి ఆ బ్రహ్మపట్టణం నాలుగుద్వారాలగుండా సీత, చక్షువు, భద్ర, అలకనంద అనే నామములతో నాలుగు విధాలుగా ప్రవహించి చివరకు లవణ సముద్రంలో కలిసిపోతుంది. ఆ గంగాజలాలు తమను దర్శించేవారికీ, తమలో స్నానం చేసేవారికీ అమృతత్వం ప్రసాదిస్తూ ఉంటాయి.
సీత అనే పేరుతో ప్రఖ్యాతమయిన నదీప్రవాహం బ్రహ్మపురం తూర్పుద్వారం నుంచి ప్రవహించి కేసరగిరి శిఖరాలను తడుపుతూ గంధమాదన పర్వతం మీదుగా సాగి భద్రాశ్వవర్షాన్ని పవిత్రం చేస్తూ తూర్పువైపున లవణసముద్రంలో ప్రవేశిస్తుంది. బ్రహ్మపురం పడమటి ద్వారం నుండి వెలువడిన ప్రవాహం పేరు చక్షువు, ఆ ప్రవాహం మాల్యవంతమనే పర్వతాన్ని దాటి కేతుమాల వర్షాన్ని పవిత్రం చేస్తూ పడమటి సముద్రంలో సంగమిస్తుంది. బ్రహ్మపట్టణం ఉత్తరద్వారం గుండా వెలువడిన ప్రవాహం పేరు భద్ర. అది కుముదం, నీలం, శ్వేతం అనే పర్వత శిఖరాల మీదుగా ప్రవహిస్తూ, శృంగ నగం చేరుకొని, అక్కడనుండి మానసోత్తరాలైన కురుభూముల్ని పవిత్రం చేస్తూ ఉత్తరసముద్రంలో కలుస్తుంది.
బ్రహ్మనగరం దక్షిణ ద్వారం నుండి వెలువడే నది పేరు 'అలకనంద'. అది మిక్కిలి దుర్గమాలైన పర్వత పంక్తుల గుండా ప్రవహించి హేమకూటం, హిమకూటం అనే పర్వత ప్రాంతాలను దాటివచ్చి చాల ఉరవడితో కర్మ క్షేత్రమయిన భారతవర్షాన్ని పవిత్రం చేస్తుంది. ఆ తరువాత దక్షిణ సముద్రంలో కలిసిపోతుంది.
ఓ అధిపా! ప్రపంచంలో మేరువువంటి పర్వతాలు ఎన్నో ఉన్నాయి. వాటికి పుత్రికలేమో అన్నట్లుగా పుణ్యతీర్థాలున్నాయి. వాటిని లెక్కపెట్టడం వీలుకాని పని. అవి వేలసంఖ్యలో ఉన్నాయి. జంబూద్వీపంలో భారతవర్షం కర్మభూమి. తక్కిన వర్షాలు భోగభూములు, స్వర్గంనుండి భూమికి దిగివచ్చినవారు అక్కడ పుణ్యఫలాలు అనుభవిస్తుంటారు. భూలోక స్వర్గంవంటి ఆ వర్షాలలో జీవించేవారు పదివేల సంవత్సరాల ఆయుర్దాయం కలిగి ఉంటారు. పదివేల ఏనుగుల బలం కలిగి ఉంటారు. దేవతలతో సమానులుగా ఉంటారు. వజ్రదేహులై ఉంటారు. ఎంతో సంతోషంతో జీవిస్తారు. వారి ప్రవర్తనలో ఎటువంటి పొరపాట్లు ఉండవు. వారు పూజ్యులు. అంతేకాదు. పుణ్యాత్ములు.
ఈ ఎనిమిది వర్షాలలో ఉన్నవారు కామ సుఖానంద పరవశులై మోక్షాన్ని సైతం కోరరు. అక్కడి స్త్రీలు ఒక్క పర్యాయం మాత్రం బిడ్డలను కంటారు. అక్కడ ఎల్లప్పుడూ త్రేతాయుగం ప్రవర్తిస్తుంది. ఈ ఎనిమిది వర్షాలలోనూ దేవతలు తమ సేవకులు చేసే ఉపచారాలు గ్రహిస్తూ విహరిస్తుంటారు. అన్ని ఋతువులందూ చివుళ్ళతో పువ్వులతో ఫలాలతో నిండిన తీగెలు, వృక్షాలు గల వనాలు అక్కడే ఉంటాయి. సరోవరాలలో వికసించిన పద్మాలు ఉంటాయి. ఆ పద్మాల పరిమళం ఆఘ్రాణిస్తూ రాజహంసలు, కలహంసలు విహరిస్తుంటాయి. నీటికోళ్ళు, కొక్కెరలు, బెగ్గురుపక్షులు, జక్కవలు, కొలకులలో ఈదులాడుతుంటాయి. మత్తెక్కిన తుమ్మెదలు ఝంకారాలు చేస్తుంటాయి. అటువంటి వనాలలో, సరస్సులలో, కొండలలో, కోనలలో దేవతాస్త్రీలు విహరిస్తూ విలాసంగా ఆడుతూ పాడుతూ, పకపక నవ్వుతూ పక్కచూపులు చూస్తూ కామోద్రేకం కలిగిస్తూ సంచరిస్తుంటారు. వారి విలాస చేష్టలకు ఆకర్షితులయిన పురుషులు అక్కడ స్వేచ్చావిహారాలు చేస్తుంటారు.
ఈ తొమ్మిది వర్షాలలోనూ జీవులకు సరయిన జ్ఞానం అనుగ్రహించడానికి నారాయణుడు అనేకరీతుల తన లీలావిలాసాలను ప్రదర్శిస్తూ సంచరిస్తుంటాడు.
ఇలావృత వర్షానికి త్రిపురాసుర సంహారకుడయిన శివుడు అధిదేవత. ఆ ఇలావృతవర్షంలో పార్వతీదేవి విహరించే ఉద్యానవనం ఉంది. ఆ వనంలోనికి పురుషులు ఎవరయినా ప్రవేశిస్తే వారందరు స్త్రీలవుతారని జగజ్జనని శాపం. అక్కడ పార్వతీదేవి వేలకొలది చెలికత్తెలతో వచ్చి ప్రతినిత్యమూ పరమశివుని పరమభక్తితో సేవిస్తుంటుంది. ఆ ఇలావృత వర్షంలోని జనులు ఎంతో సంతోషంతో ఆయా మంత్రతంత్రాలతో పరమేశ్వరుని పూజించి సదా సంస్మరించి తరిస్తుంటారు.
భద్రాశ్వవర్షానికి భద్రశ్రవుడు అధిపతి. అతడు మేరుపర్వతం వంటి ధైర్యం కలవాడు. అతడు సముద్రాలు హద్దుగా కలిగిన భూమిని పరిపాలించాడు.
ఆ భద్రశ్రవునికి హయగ్రీవుడు ఇష్టదైవం. ఆ హయగ్రీవ మూర్తిని ధ్యానంతో, జపంతో, స్తుతులతో, అనుష్ఠానాలతో సత్పురుషులు పూజించి తరిస్తుంటారు.
ఆ హయగ్రీవ తత్త్వాన్ని ప్రకాశింపజేసే ప్రధాన మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాల మహిమతో ఆ వర్షంలోనివారు హయగ్రీవుని అర్చించి, స్తుతించి, ధ్యానించి ముక్తి పొందుతున్నారు.
ఓ రాజా! హరివర్షం వారికి నరసింహుడు ఇష్టదైవం. అక్కడున్న జనులు దైత్య, దానవ వంశాలలో ఉత్తములయినవారు. వారు ప్రహ్లాదుడు మొదలయిన పెద్దలతో కలిసి స్నానంచేసి శుచులై నరసింహుని సేవిస్తుంటారు. రమణీయాలైన పట్టుబట్టలు కట్టుకొని ఆ నరసింహతత్త్వాన్ని ప్రకాశింపజేసే మంత్రం జపిస్తూ, ఆ మంత్రానికి సంబంధించిన తంత్ర కార్యాలను నిర్వహిస్తూ, నరసింహుననికి ప్రీతిపాత్రమయిన ధ్యానం, జపాలు, తపాలు, స్తోత్రాలు చేస్తూ నిలుకడగల బుద్ధితో స్వామిని సేవిస్తుంటారు. ఆ స్వామి కరుణకు పాత్రులై ఇహపరసుఖాలను అనుభవిస్తుంటారు.
కేతుమాల వర్షంలో భగవంతుడు శ్రీదేవిని సంతోషపెట్టడంకోసం మన్మథరూపంలో సాక్షాత్కరిస్తాడు. ఆ కామదేవుని అనుగ్రహంవల్ల ధాత్రీదేవతల గర్భాలు సంవత్సరకాలం సంరక్షింపబడినప్పటికిని నిర్జీవాలై స్రవిస్తాయి. తన నడకల సొగసులతో, విలాస వీక్షణాలతో, అందమైన కనుబొమలతో, పద్మాలవంటి మనోహర ముఖకాంతులతో ఆ కామదేవుని రూపంలో ఉన్న శ్రీహరి రమాదేవిని సంతోషపెడతాడు. భగవంతుని మాయకు ప్రతిరూపమయిన ఆ శ్రీదేవికూడా ప్రజాపతి పుత్రికలూ, పుత్రులూ అయిన రాత్రులతో, పగళ్ళతో కలిసి కామదేవుని స్తుతిస్తూ పూజలు చేస్తూ ధ్యానిస్తూ ఆరాధిస్తూ ఉంటుంది.
ఓ రాజా! పరిశుద్ధమయిన మనసుతో శ్రద్ధగా విను. రమణీయమయిన రమ్యకమనే వర్షానికి మత్స్యరూపుడయిన హరియే అధిదేవత.
ఆ రమ్యక వర్షానికి మనువు అధిపతి. అతడు కొడుకులతో, మనుమలతో, మంత్రివరులతో మత్స్యరూపుడయిన శ్రీహరిని అనుపమానమయిన భక్తితో ఆరాధిస్తుంటాడు.
ఆ రమ్యక వర్షంలోనివారు అధిపతి అయిన మత్స్యమూర్తిని ప్రకాశింపజేసే మంత్రాలతో, స్తోత్రాలతో, అర్చిస్తూ ధర్మకార్యాలు నిర్వహిస్తూ, అగ్నికార్యాలు నెరవేరుస్తూ పుణ్యాత్ములై భుక్తిముక్తులను ఆనందంగా అనుభవిస్తారు.
అర్యముడు హిరణ్మయ వర్షంలోని జనులందరితోకూడా కలిసి కూర్మరూపుడయిన శ్రీహరిని మనసులో ధ్యానిస్తూ స్తోత్రాలతో సంస్తుతిస్తూ భుక్తిముక్తులందుకొంటారు.
మూలంలోని అర్యముని మంత్రం - ఓం నమో భగవతే అకూపారాయ సర్వ సత్త్వగుణ విశేషణాయానుప లక్షిత స్థానాయ, నమో వర్ష్మణే నమో భూమ్నే నమో నమోஉవస్థానాయ నమస్తే ॥
అర్యముడు హిరణ్మ్యయ వర్షంలోని జనులందరితోకూడి కూర్మరూపుడయిన శ్రీహరిని మనసులో ధ్యానిస్తూ స్తోత్రాలతో సంస్తుతిస్తూ భుక్తిముక్తులనందుకొంటాడు.
ఉత్తర కురు వర్షానికి వరాహదేవుడు అధిపతి. అక్కడ భూదేవి ఆ హరిని మనసులో నిలుపుకొని పూజలు చేస్తుంటుంది.
ఆ ఉత్తర కురువర్షంలోని ప్రజలు వరాహమూర్తిని అనుదినమూ సేవిస్తూ సంభావిస్తూ, సంస్తుతులు కావిస్తూ మోక్షాన్ని పొందుతారు.
పరీక్షిన్మహారాజా! కింపురుష వర్షానికి సీతాలక్షణసమేతుడయిన శ్రీరామభద్రుడు అధిదేవత.
ఆ కింపురుష వర్షంలో అంజనాదేవి కుమారుడయిన ఆంజనేయుడు కింపురుష గణాలతో కూడి శ్రీరామచంద్రుని ప్రత్యక్షం చేసే మంత్ర స్తోత్రాదులతో శ్రీరామచంద్రుని ఆరాధిస్తుంటారు.
భారత వర్షానికి బదరికాశ్రమవాసియైన నారాయణుడు అధిపతి. ఆ భారతవర్షంలోనివారు మహాత్ములయిన నారదాది మునుల సాంగత్యంతో సాంఖ్యయోగాన్ని ఉపదేశంగా పొంది తన జన్మలను సార్ధకం చేసుకొంటారు. నారాయణదేవుని ఆరాధించి ఆ దేవునికి ప్రియమయిన మంత్రస్తోత్రాదులతో పూజలు చేస్తారు. భక్తితో మొక్కి ముక్తిని దక్కించుకొంటారు.
ఓ రాజా! భారతవర్షంలో లెక్కలేనన్ని పుణ్యపర్వతాలున్నాయి. అంతేగాకుండా, లోతయిన నదీప్రవాహాలు కూడా ఉన్నాయి. వాటి విశేషాలను నేను వినిపిస్తాను.
భారతవర్షంలోని పుణ్యపర్వతాలలో మలయం, మంగళప్రస్థం, మైనాకం, త్రికూటం, ఋషభం, కూటరం, గోల్లం, సహ్యాద్రి, వేదాద్రి, ఋశ్యమూకం, శ్రీశైలం, వేంకటాద్రి, మహేంద్రగిరి, మేఘపర్వతం, వింధ్యపర్వతం, శుక్తిమంతం, ఋక్షగిరి, పారియాత్రం, ద్రోణగిరి, చిత్రకూటం, గోవర్ధనం, రైవతకం, కుకుంభం, నీలగిరి, కాకముఖం, ఇంద్రకీలాద్రి, రామగిరి మొదలయినవి ప్రసిద్ధ పర్వతాలు.
ఈ పర్వతాలకు పుత్రికలవంటివయిన చంద్రవట, తామ్రపర్ణి, అవటోద, కృతమాల, వైహాయసి, కావేరి, వేణి, పయస్విని, పయోద, శర్కరావర్త, తుంగభద్ర, కృష్ణవేణి, భీమరథి, గోదావరి, నిర్వింధ్య, పయోష్ణ, తాపి, రేవానది, శిలానది, సురస, చర్మణ్వతి, వేదస్మృతి, ఋషికుల్య, త్రిసమ, కౌశికి, మందాకిని, యమున, సరస్వతి, దృషద్వతి, గోమతి, సరయువు, భోగవతి, సుషమ, శతద్రువు, చంద్రభాగ, మరుద్వృధ, వితస్త, అసిక్ని, విశ్వ మొదలయినవి ప్రధానమైన నదులు. నర్మద, సింధు, శోణ అనునవి నదములు. ఇట్టి మహానదులు భారతవర్షంలో ఎన్నో ఉన్నాయి. వీటిలో స్నానం చేసిన మానవులకు ముక్తి కరతలామలకం.
ఈ భారతవర్షంలో పుట్టిన మానవులు మూడువిధాలైన కర్మలు చేస్తుంటారు. కొన్ని తెల్లనివి. కొన్ని ఎర్రనివి, కొన్ని నల్లనివి. తెల్లనివి సత్వగుణ ప్రధానమయిన కర్మలు. ఎర్రనివి రజోగుణ ప్రధానమయిన కర్మలు. నల్లనివి తమోగుణ ప్రధానమైన కర్మలు. ఇట్టి కర్మల కారణంగా భారతవర్షంలో పుట్టిన ప్రజలు క్రమంగా దేవలోకం, మానవలోకం, నరకలోకం చేరుకొంటారు.
రాగం, ద్వేషం మొదలైనవి లేనివాడూ, వాక్కులనుగాని, మనసునకుగాని అందనివాడూ, అన్నిటికీ తానే ఆధారమైనవాడూ అయిన శ్రీ వాసుదేవమూర్తి యందు హృదయం పదిలంగా నిలుపుకొని భక్తితో ఆరాధించేవారు ఉత్తమగతి తప్పక పొందుతారు. అటువంటి మహాత్ములు అజ్ఞానం రూపుమాసిపోగా పరమభాగవతులు పొందే పుణ్యలోకాలకు యోగ్యులవుతారు. అందువలన, మహాపురుషులు 'భారతవర్షం' ఉత్తమోత్తమమైనదిగా కొనియాడుతుంటారు. వారి ప్రస్తుతి ఈ రీతిగా ఉంటుంది.
భారతవర్షంలో పుట్టిన జీవుల అదృష్టమే అదృష్టం. ఈ భారతవర్షంలోనే శ్రీమన్నారాయణుడు ఎన్నో అవతారాలు ఎత్తాడు. ఇక్కడి మానవులకు తత్త్వం ఉపదేశించాడు. వారితో స్నేహం చేశాడు. ఆత్మబంధువులాగున జీవులు కష్టసుఖాలలో భాగం పంచుకొని వారిని కృతార్థులను చేశాడు.
ఓ రాజా! కృష్ణుని మహిమ లేమని వర్ణించేది. ఆయన తన అవతారాలను, లీలావిలాసాలను కొనియాడే వారికందరికి కోరిన వరాలను ప్రసాదిస్తాడు. అంతేకాదు, మోక్షం కూడా అనుగ్రహిస్తాడు.
భారతవర్షంలో పుట్టిన జనులకు సాధ్యం కానిదంటూ ఏది లేదు. శ్రీమన్నారాయణుని సంస్మరణం సమస్త పాపాలను పటాపంచలు చేస్తుంది. ఆ శ్రీమన్నారాయణుని స్మరణంలేని యజ్ఞాలు, తపస్సులు, దానాలు నిరర్థకాలు. వాటివల్ల పాపాలు పోవు. పునర్జన్మ మరల వస్తుందేమో అన్న భయంతో ఇతర ప్రదేశాలలో బ్రహ్మ కల్పం చివరిదాకా జీవించడంకంటె భారతవర్షంలో క్షణకాలం జీవించి సర్వసంగ పరిత్యాగం చేసినట్లయితే అటువంటి పురుషశ్రేష్ఠునికి శ్రీమన్నారాయణ పదప్రాప్తి చాల సులభంగా దక్కుతుంది. అందుచేత, అందరూ భారతవర్షంలో జన్మించాలని కోరుకొంటారు. అదీగాక ఏ స్థలంలో వైకుంఠనిలయుని పుణ్యకథలవాసన ఆవంతయినా ఉండదో, ఏ ప్రదేశంలో పుణ్యపురుషులయిన భాగవతోత్తములు ఉండరో, ఏ స్థలంలో యజ్ఞేశ్వరుని ఉత్సవాలు జరుగవో అటువంటి ప్రదేశం దేవేంద్రలోకమైనా ఆ చోట నివసింపరాదు. మానవజన్మ ఎత్తి జ్ఞానమూ, సదనుష్ఠానమూ, గ్రహసంపత్తి అన్నీ ఉండికూడా తపస్సుద్వారా ముక్తి అందుకోలేని మానవులు పశువులవలె తమకు తామే బంధనాల పాలవుతారు. భారతవర్షంలోని ప్రజలు శ్రద్ధతో యజ్ఞాలు నిర్వహించినట్లయితే, ఆ హోమాలలోని హవిస్సును అనేక నామాలతో ఆ పుండరీకాక్షుడు అందుకొని ప్రసన్నుడై వారికి తనమీది భక్తిని అతిశయింపజేస్తాడు. భారతవర్షంలోని ప్రజలమీద అపరిమితమయిన అనుగ్రహం ప్రకటిస్తూ ఆ భగవంతుడు ఇహలోక సౌఖ్యాన్ని పరలోక సౌఖ్యాన్ని వారికి ప్రసాదిస్తాడు. జంబూద్వీపంలోని సగరుని కుమారులు అపహరింపబడిన అశ్వమేధాశ్వాన్ని అన్వేషిస్తూ పలువైపులా భూమిని త్రవ్వినపుడు ఎనిమిది ఉపద్వీపాలు ఏర్పడ్డాయి. అవే స్వర్ణప్రస్థం, చంద్రశుక్లం, ఆవర్తనం, రమణకం, మందేహారుణం, పాంచజన్యం, సింహళం, లంక అనబడేవి.
రాజా! జంబూద్వీపం లక్షయోజనాల వైశాల్యం గలిగి ఉంది. దానిచుట్టూ అంతే ప్రమాణంగల లవణ సముద్రం ఉంది. ఆ తర్వాత ప్లక్షద్వీపం రెండులక్షల యోజనాల విస్తృతి కలిగి ఉంది.
ఆ ప్లక్ష ద్వీపం నట్టనడుమ ఒక పెద్ద జువ్వి చెట్టున్నది. ఆ కారణంగానే ఆ ద్వీపానికి ప్లక్ష ద్వీపమనే పేరు వచ్చింది. ఆ ద్వీపంలో నివసించే వారికి అగ్నిదేవుడు అధిదేవత. ఆ ద్వీపాన్ని ఇధ్మజిహ్వుడు పరిపాలిస్తున్నాడు. అతడు ప్రియవ్రతుని కుమారుడు.
పరీక్షిన్నరేంద్రా! ఇధ్మజిహ్వుడు ప్లక్షద్వీపాన్ని ఏడు వర్షాలుగా విభజించాడు. ఆ వర్షముల పేర్లుగల తన కుమారులు ఏడుగురిని శివుడు, యశస్యుడు, సుభద్రుడు, శాంతుడు, క్షేముడు, అభయుడు, అమృతుడు అనేవారిని ఆ ఏడు వర్షాలకు అధిపతులను చేశాడు. ఆ తరువాత ఇధ్మజిహ్వుడు నిస్సంగుడై తపస్సు చేసుకోవడానికోసం అడవికి వెళ్ళిపోయాడు. విభజింపబడిన ఒక్కొక్క వర్షంలో ఒక్కొక్క కులపర్వతమూ, ఒక్కొక్క మహానది ఉన్నాయి. ఆ విధంగా ఆ సప్తవర్షాలలో వరుసగా మణికూటం, వజ్రకూటం, ఇంద్రసేనం, జ్యోతిష్మంతం, ధూమ్రవర్ణం, హిరణ్యగ్రీవం, మేఘమాలం అనే ఏడు కులపర్వతాలు ఉన్నాయి. అరుణ, సృమణ, అంగిరస, సావిత్రి, సుప్రభాత, ఋతంభర, సత్యంభర అనే పేర్లుగల ఏడు మహానదులున్నాయి. ఆ నదులలో స్నానంచేసి నాలుగువర్ణాల వారును పాపం పోగొట్టుకొంటారు. ఆ నాలుగు వర్ణాలవారు హంసులు, పతంగులు, ఊర్ధ్వాయనులు, సత్యాంగులు అని వ్యవహరింపబడుతారు. ప్లక్షద్వీపంలో నివసించే పురుషుల ఆయుర్దాయం వేయి సంవత్సరాలు. వారు దేవతలతో సమానమయినవారు. కేవలం చూపుతోనే శ్రమ స్వేదాదులు లేని సంతానాన్ని అనుగ్రహింపగలవారు. వేదస్వరూపుడూ, స్వర్గానికి ద్వారమైనవాడూ, భగవంతుడూ అయిన సూర్యుని వారు ఋగ్యజుస్సామవేదమంత్రాలతో సేవిస్తుంటారు. ప్లక్షద్వీపం మొదలయిన ముందు చెప్పబడే ఐదు ద్వీపాలలోని పురుషులకూ ఆయుర్చలం. ఇంద్రియపటుత్వం, తేజోబలం పుట్టుకతోనే సంక్రమిస్తాయి.
ప్లక్ష ద్వీపంచుట్టూ రెండు లక్షల యోజనాల విస్తృతి గల చెరకు రససముద్రం ఉంది. దీనికి రెట్టింపు విస్తృతితో శాల్మలీ ద్వీపం ఉంది.
ఆ ద్వీపంలో ఉన్న శాల్మలీవృక్షంవల్లనే దీనికి శాల్మలీ ద్వీపమనే పేరు వచ్చింది. ఆ శాల్మలీవృక్షం(బూరుగుచెట్టు) కూడా ప్లక్షద్వీపంలోని జువ్వి చెట్టంత ఉంది. ఆ బూరుగుచెట్టు దిగువభాగంలో పక్షులకు రాజయిన గరుత్మంతుడు స్థిరనివాసం చేస్తుంటాడు. ఈ ద్వీపాన్ని పరిపాలించేవాడు ప్రియవ్రతుని పుత్రుడయిన యజ్ఞబాహువు. అతడు తాను పాలించే భూభాగాన్ని ఏడువర్షాలుగా విభజించాడు. ఒక్కొక్క వర్షంలో ఒక్కొక్క పర్వతమూ, ఒక్కొక్క నదీ ఉన్నాయి. ఆ వర్షాలకు తన ఏడుగురు కుమారులను అభిషిక్తులను చేశాడు. వారి పేర్లతోనే ఆ వర్షాలు వ్యవహరింపబడుతున్నాయి. వారి పేర్లు సురోచనుడు, సౌమనస్యుడు, రమణకుడు, దేవబర్హుడు, పారిబర్హుడు, ఆప్యాయనుడు, అభీజ్ఞాతుడు.
ఈ ఏడువర్షాలలో స్వరసం, శతశృంగం, వామదేవం, కుముదం, ముకుందం, పుష్పవర్షం, శతశ్రుతి అనే పర్వతాలున్నాయి. వరుసగా అనుమతి, సినీవాలి, సరస్వతి, కుహువు, రజని, నంద, రాక అనే ఏడు మహానదులున్నాయి.
ఆ వర్షంలోని పురుషులు శ్రుతధరులు, విద్యాధరులు, వసుంధరులు, ఇధ్మధరులు అని పిలువబడతారు. వారు భగవత్ స్వరూపుడూ, వేదమయుడూ, ఆత్మస్వరూపుడూ అయిన సోముణ్ణి వేదమంత్రాలతో ఆరాధిస్తారు. ఆ ద్వీపంచుట్టూ నాలుగు లక్షల యోజనాల విస్తృతి కలిగిన సురాసముద్రం ఉంది.
(సినీవాలి : ప్రాతఃకాలంలో చంద్రకళ కనబడే అమావాస్యను సినీవాలి అంటారు.)
ఓ రాజా! ఆ సురాసముద్రం ఆవల కుశద్వీపముంది. అది ఎనిమిదిలక్షల యోజనాల విస్తృతి కలిగింది. ఆ ద్వీపం మధ్య ఒక పెద్ద కుశస్తంభం(దర్భుదుబ్బు,) మొలిచి ఎత్తుగా పెరిగి ఉంది. అది దివ్యకాంతులతో జిగేలుమంటూ దిక్కులను వెలిగింప చేస్తుంది. ఈ కారణంవల్లనే దీనికి కుశద్వీపమనే పేరు కలిగింది. అలాంటి దీవికి అధిపతి ప్రియవ్రత తనయుడు హిరణ్యరేతసుడు. అతడు తన కుమారుల పేర్లతో భూభాగాలను ఏర్పాటు చేశాడు.
ఈ కుశద్వీపానికి ప్రియవ్రత కుమారుడైన హిరణ్యరేతసుడు అధిపతి. వసుదానుడు, దృఢరుచి, నాభిగుప్తుడు, సత్యవ్రతుడు, విప్రుడు, వామదేవుడు అనువారు హిరణ్యరేతసుని కుమారులు. తండ్రి అయిన హిరణ్యరేతసుడు తన తనయుల పేర్లతో విభజించిన కుశద్వీపంలోని ఏడు వర్షాలలో ఏడుగురు కుమారులను నియమించాడు. అనంతరం తపస్సు చేయడానికి అడవికి వెళ్ళాడు. ఆ కుశవర్షంలో బభ్రువు, చతుశ్శృంగం, కపిలం, చిత్రకూటం, దేవానీకం, ఊర్ధ్వరోమం, ద్రవిణం అనే పేర్లుగల ఏడు పర్వతాలున్నాయి. అలాగే రసకుల్య, మధుకుల్య, శ్రుతవింద, మిత్రవింద, దేవగర్భ, ఘృతచ్యుత, మంత్రమాల అనే పేర్లుగల మహానదులున్నాయి. కుశలులు, కోవిదులు, అభియుక్తులు, కులకులు అను పేర్లుగల నాలుగు వర్ణాలవారును ఆ పవిత్ర నదీజలాలలో స్నానంచేసి పవిత్రులై భగవంతుడయిన యజ్ఞపురుషుని ఆరాధిస్తుంటారు.
ఆ కుశద్వీపం చుట్టూ ఎనిమిదిలక్షల యోజనాల వైశాల్యం కలిగిన నేతికడలి ఉన్నది. ఆ నేతికడలి ఆవల పదునారు లక్షల యోజనాల విస్తృతి కలిగిన అందమయిన క్రౌంచద్వీపం ఉన్నది. ఆ ద్వీపం మధ్యభాగంలోనే క్రౌంచాద్రి ఉన్నది. ఆ పర్వతం మూలంగానే ఆ ద్వీపానికి ఆ పేరు వచ్చింది. ఒకసారి ఆరు మొగాలుగల కుమారస్వామి దివ్యశరం ప్రయోగించగా అది ఆ క్రౌాంచపర్వతానికి కన్నంవేస్తూ దూసుకుపోయింది. ఆ కన్నంగుండా పాలవెల్లి ప్రవాహం వెలువడినది. ఆ ప్రవాహమే ఆ క్రౌంచద్వీపాన్ని తడుపుతూ ఉంది. వరుణదేవుడు ఆ ప్రదేశాన్ని కాపాడుతూ ఏమాత్రం ఎవరికీ భయం లేకుండేటట్లు చూస్తుంటాడు.
నరేంద్రా! క్రౌంచ ద్వీపానికి అధిపతి ప్రియవ్రతుని కుమారుడైన ఘృతపృష్ఠుడు. అతనికి ఏడుగురు కొడుకులు. వారే ఆమోదుడు, మధువహుడు, మేఘపృష్ఠుడు, సుదాముడు, ఋషిజ్యుడు, లోహితార్ణుడు, వనస్పతి అనువారు. తన కుమారుల పేరుమీదుగా క్రౌంచ ద్వీపాన్ని ఘృతపృష్ఠుడు ఏడు వర్షాలుగా విభాగంచేసి ఒక్కొక్క భూమికి ఒక్కొక్క కుమారుని రాజుగా నియమించాడు. తాను మంగళగుణయుతుడయిన శ్రీహరి పాదపద్మాలను స్మరిస్తూ తపం చేయడానికి అడవులకు వెళ్లాడు. ఆ క్రౌంచద్వీపంలోని ఏడు వర్షాలలో శుక్లం, వర్ధమానం, భోజనం, ఉపబర్హణం, ఆనందం, నందనం, సర్వతోభద్రం అనే ఏడుకొండలు, వరుసగా అభయ, అమృతోఘ, ఆర్యక, తీర్థవతి, తృప్తి, పవిత్రవతి, శుక్ల అనే ఏడు నదులూ ఉన్నాయి. ఆ నదిజలాలలో స్నానంచేసి గురువులు, ఋషభులు, ద్రవిణకులు, దేవకులులు అనే నాలుగు వర్ణాలవారు జలాంజలులు సమర్పిస్తూ వరుణదేవుని సేవిస్తుంటారు.
పరీక్షిన్నరేంద్రా! విను. క్రౌంచద్వీపం చుట్టూ పదహారు వేల యోజనాల విస్తృతిలో పాలసముద్రం ఉంది. క్రౌంచద్వీపానికి ఆవల శాకద్వీపం ప్రసిద్ధి పొందిన ద్వీపం. ఆ ద్వీపం ముప్పదిరెండు లక్షల యోజనాల విస్తృతి కలిగింది. ఆ ద్వీపంలో ఒక పెద్ద శాకవృక్షం ఉన్నది. దాని సుగంధంవల్ల ఆ ద్వీపమంతా పరిమళవంతంగా ఉంటుంది. ఆ కారణంగానే ఆ ద్వీపానికి శాకద్వీపమని పేరు. ఆ ద్వీపానికి ప్రియవ్రత నందనుడయిన మేధాతిథి అధీశ్వరుడు.
మేధాతిథికి పురోజనుడు, మనోజనుడు, వేపమానుడు, ధూమ్రానీకుడు, చిత్రరథుడు, బహురూపుడు, విశ్వచారుడు అనే కొడుకులున్నారు. వారికి వారి పేర్లతో ప్రసిద్ధములయిన శాకద్వీపంలోని ఏడు భూభాగములు పంచియిచ్చి పట్టంగట్టి మేధాతిథి శ్రీహరి పాదసేవచేస్తూ తపోవనానికి వెళ్ళాడు. ఆ ఏడు వర్షాలలో క్రమంగా ఈశానం, ఉరుశృంగం, బలభద్రం, శతకేసరం, సహస్రస్రోతం, దేవపాలం, మహానసం అనే సరిహద్దు పర్వతాలు, అనఘ, ఆయుర్ద, ఉభయసృష్టి, అపరాజిత, పంచపరి, సహస్ర సృతి, నిజధృతి అనే ఏడునదులూ ఉన్నాయి. ఆ ద్వీపవాసులు ఆ నదీజలాలు సేవిస్తూ ప్రాణాయామం చేస్తూ రజోగుణ, తమోగుణాలను వశింపజేసుకొని సమాధి నిష్ఠులయి వాయురూపుడయిన భగవంతుని ఆరాధిస్తారు. అక్కడ ఋతవ్రతులు, సత్యవ్రతులు, దానవ్రతులు, సువ్రతులు అనే నాలుగు వర్ణాలవారున్నారు.
శాకద్వీపం చుట్టూ అంతే పరిమాణం కలిగిన దధి సముద్రం ఉంది. దాని తరువాత అరవై నాలుగు లక్షల యోజనాల విస్తారం కలిగిన పుష్కరద్వీపం ఉంది. ఆ మహాద్వీపంలో పదివేల బంగారు రేకులు కలిగి బ్రహ్మదేవుని ఆసనమయిన పద్మం ఉన్నది. ఈ ద్వీపం నడుమ మానసోత్తరమనే పెద్ద పర్వతం ఉంది. తూర్పు పడమరలలోగల వర్షాల రెండింటికి ఆ మానసోత్తరం సరిహద్దు కొండ.
ఈ విధంగా లోపల వెలుపల ఉన్న వర్షాలకు సరిహద్దుగా ఉన్న మానసోత్తర పర్వతం పదివేల యోజనాల విస్తీర్ణమూ. అంతే ఎత్తూ కలది. ఆ పర్వతానికి నాలుగు దిక్కులలోనూ నలుగురు లోకపాలకుల పట్టణాలున్నాయి. ఆ మానసోత్తర పర్వతశిఖరాన సంవత్సరాత్మకమయిన సూర్యరథచక్రం తిరుగుతూ రాత్రింబగళ్ళు మేరువునకు ప్రదక్షిణం చేస్తున్నది. ఆ పుష్కరద్వీపాధిపతి వీతిహోత్రుడు. అతనికి రమణకుడు, ధాతకుడు అనువారు కుమారులు. వీతిహోత్రుడు పుష్కరద్వీపాన్ని రెండు వర్షాలుగా విభజించి, ఆ భూభాగాలకు తన కొడుకులను రాజులను చేశాడు. తన అన్నల అడుగుజాడలలో వీతిహోత్రుడు భగవత్ప్రీతికరాలైన కర్మలు ఆచరిస్తూ తపోవనానికి వెళ్ళిపోయాడు.
ప్రజలకు రక్షకుడవయిన పరీక్షిన్నరేంద్రా! ఈ పుష్కరద్వీపంలో సంచరించేవారు వేదోక్తకర్మలను ఆచరిస్తూ చతుర్ముఖుణ్జి కొలుస్తుంటారు. వారు నిశ్చలమయిన బుద్ధిబలం, నియమనిష్ఠలు కలిగినవారు.
ధరణీనాథా! పుష్కరమనే ద్వీపంలో నాలుగువర్ణాల విభాగం లేదు. అక్కడి వారందరూ భేదభావం లేకుండా సమభావంతో కలసిమెలసి సంచరిస్తారు.
ఆ పుష్కర ద్వీపం అరవైనాలుగు లక్షల యోజనాల విస్తృతి కలిగి ఉంటుంది. దానిచుట్టూ అంతే విస్తీర్ణం కలిగి పరిశుద్ధమయిన జలంతో నిండిన సముద్రం ఉంది. ఆ సముద్రానికి ఆవల లోకాలోక పర్వతముంది. సముద్రానికీ, ఆ పర్వతానికీ మధ్యగల ప్రదేశం రెండుకోట్ల యోజనాల విస్తీర్ణం కలిగి ఉంటుంది. అక్కడ మానవ సంచారం లేదు. ఆ భూమి అద్దంలాగా స్వచ్చంగా నున్నగా ఉంటుంది. అది దేవతలు నివసించడానికి అనువయిన ప్రదేశం. ఆ భూమిలో పడవేసిన పదార్ధం మరల ఎంత ప్రయత్నించినా చేతికందదు. ఆపైన ఎనిమిది కోట్ల యోజనాల ప్రదేశం బంగారు భూమిలాగా ప్రకాశిస్తుంటుంది. సూర్యునినుండి ధ్రువతార వరకు వ్యాపించిన జ్యోతిర్గణం మధ్య ఉండడంవల్ల ఆ పర్వతానికి లోకాలోక పర్వతమనే పేరు సార్థకం అవుతున్నది. ఈ భూమండలమంతా యాభైకోట్ల యోజనాల విస్తృతి కలిగింది. అందులో నాల్గవవంతు లోకాలోక పర్వతం. ఆ పర్వతం మీద సకల లోకగురుడైన బ్రహ్మదేవుడు, ఋషభం, పుష్కర చూడం. వామనం, అపరాజితం అనే దిగ్గజాలను లోకరక్షణార్థం నిలిపి ఉంచాడు.
ఆ లోకాలోక పర్వతంమీద ఆదిదేవుడూ, జగద్గురుడూ, భగవంతుడూ అయిన శ్రీమన్నారాయణుడు లోకాలను రక్షించడంకోసం, యోగమాయాసహితుడై కల్పాంతంవరకూ ఉంటాడు. దేవతల సమూహమంతా శ్రీమన్నారాయణుని వైభవ స్వరూపమే, ఆ దేవతల తేజస్సు, పరాక్రమమూ విస్తరింపజేయడానికోసం విష్ణుభగవానుడు ధర్మం, జ్ఞనం, వైరాగ్యం అనే విభూతులతో ప్రకాశించే విష్వక్సేనుడు మొదలయిన పార్షదులతో కూడి చతుర్బాహువులలో శ్రేష్ఠయిన ఆయుధాలు ధరించి ఆ పర్వతంమీద ప్రకాశిస్తాడు.
(విష్వక్సేనుడు విష్ణుసేనాధిపతి. శైవంలో విఘ్నేశ్వరుని వంటివాడు. వైష్ణవులకు విఘ్ననివారకుడయిన స్వామి. ఆకారంలో ఏనుగు ముఖం కల్గి ఉంటాడు. సూత్రవతీదేవి విష్వక్సేనుని భార్య. 'సేన మొదలారి' అని వైష్ణవులు ఆయనను కీర్తిస్తారు. విష్వక్సేనుని ధ్యాన శ్లోకం-
శ్లో. యస్యద్విరద వక్రాద్యాః పారిషద్యాః పరశ్శతమ్ ।
విఘ్నం నిఘ్నంతి సతతం విష్వక్సేనం తమాశ్రయే ॥
ఆ లోకాలోక పర్వతంమీద భగవంతుడు వివిధ మంత్రాలను రహస్యంగా రక్షిస్తుంటాడు. ఆ భగవంతునికి తప్ప ఆ లోకాలోకపర్వతానికి ఆవల ఎవరికిగాని సంచరించడానికి శక్యంకాదు. బ్రహ్మాండానికి మధ్యభాగంలో సూర్యుడు ఉన్నాడు. ఆ సూర్యునికి ఇరువైపులా ఇరవైఅయిదు కోట్ల యోజనాలదూరంలో బ్రహ్మాండ కటాహం ఉంది. ఆ సూర్యభగవానుడే ఆకాశం, దిక్కులూ, స్వర్గనరకాలు, మోక్షం అనేవాటిని నిర్ధేశిస్తాడు. దేవతలకూ, మనుష్యులకూ, జంతువులకూ, సర్పాలకూ, పక్షులకూ, గడ్డిపోచలకూ, తీగెలకూ, పొదలకూ, సర్వజీవరాసులకూ సూర్యుడే ఆత్మ.
(లోకమంటే సూర్యకాంతిగల దేశం. అలోకం అంటే సూర్యకాంతి లేని దేశం.)
ఓ రాజా! నీవంటే నాకున్న ప్రీతి కారణంగా భూమండల నిర్మాణానికి సంబంధించిన విశేషాలన్నీ తెలియజేశాను. ఇంతేకాదు. ఇపుడు నీకు సృష్టి కొలతలను కూడా చెబుతాను. విను.
భగణ విషయము