Tuesday, April 7, 2026

Kali's Preface - కాళియుని పూర్వకథ

కాళియుని పూర్వకథ

శుకునిమాటలు విన్న పరీక్షిన్మహారాజు 'కాళియుడు ఏ కారణంచేత పాములకు నివాసస్థానమయిన రమణక ద్వీపాన్ని విడిచిపెట్టి వచ్చాడు? అక్కడ ఇంకా ఎన్నో పాములు ఉంటూ ఉండగా కాళియుడొక్కడే గరుత్మంతునివిషయంలో ఏమి అపరాధం చేశాడు?' అని ప్రశ్నించాడు. అందుకు శుకుడు ఈవిధంగా సమాధానం చెప్పాడు.

పూర్వం పాములకు భయపడిన ప్రజలు, అవి తమజోలికి రాకుండా ఉండడంకోసం, రుచికరంగా ఉండే పదార్దాలు పాముల పుట్టలున్న చెట్ల మొదళ్లవద్ద, వాటికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉండేవారు. ఆ పాములు తమను చంపి తినే గరుత్మంతుడు తమజోలికి రాకుండా ఉండడంకోసం ఆ నైవేద్యంలో తలకొక కొంత గరుత్మంతునికి సమర్పిస్తూ ఉండేవి. కానీ కాళియుడుమాత్రం 'విషబలం అధికంగా ఉన్న తనను ఎవరు ఏమి చేయగలరులే' అనే పొగరు తలకెక్కి తనవంతులో కాంచెంకూడ గరుత్మంతునికి సమర్పించకుండా తానే తినేస్తూ ఉండేవాడు. అది తెలిసిన గరుత్మంతుడు కోపంతో వీణ్ణి పట్టుకొని, వీని పడగలు, శరీరం చీల్చి చెండాడి, ప్రాణాలు తీస్తానని బయలుదేరాడు.

గరుత్మంతుడు తన బంగారు రెక్కలను ఆడిస్తూ, కాళియుణ్ణి దండించడానికని బయలుదేరి వస్తూండగా, అతని రెక్షలనుండి వేగంగా బయలు వెడలిన గాలి తీవ్రతకు మహాపర్వతాలు కంపించిపోయాయి.

ఈ విధంగా వచ్చిన గరుత్మంతుణ్ణి చూచి, కాళియుడు తలవంచలేదు. సరికదా తన పెద్దపడగలను బాగా విస్తరింపజేశాడు. గరుత్మంతుని రాక చూచి, అప్పటికే తనలో ఉన్నదానికి తోడుగా కొత్తగా విషం ఊరింది. అది కనుకొనలనుండి బయటకు ప్రవహిస్తూ నిప్పురవ్వల్ని రాలుస్తోంది. కాళియుడు నాలుకలను తీవ్రంగా అల్లల్లాడిస్తున్నాడు. ముక్కులనుండి అగ్నిజ్వాలలు ఎగసిపడుతున్నాయి. తానే ముందుకు పరుగెత్తుకొని వెళ్లి, గరుత్మంతుణ్ణి గట్టిగా కాటువేశాడు.

కాళియుడు కాటు వేయడంతో గరుత్మంతుడు రెచ్చిపోయాడు. కాళియుణ్ణి తరుముకొని వెళ్లి, బంగారుచాయలు విరజిమ్మే తన ఎడమరెక్కతో అణగగొట్టాడు. దానితో కాళియుని కోరలు విరిగిపోయాయి. నోళ్లనుండి రక్తం కక్కుకొన్నాడు. పడగలు చీలికలు పేలికలు అయిపోయాయి.

ఈ విధంగా గరుత్మంతుని దెబ్బతిన్న కాళియుడు భయంతో పారిపోయివచ్చి, ఈ లోతైన మడుగులో దాగుకొన్నాడు. ఈ సందర్భంలో చెప్పవలసిన వృత్తాంతం మరొకటి ఉంది.

పూర్వం సౌభరి అనే ముని ఈ మడుగులో తపస్సు చేసికొంటూ ఉండేవాడు. ఒకనాడు గరుత్మంతుడు ఆకలితో వచ్చి, ఈ మడుగులో ఉన్న చేపలరాజును ఒడిసి పట్టుకొని, భక్షించాడు. అది చూచిన మిగిలిన చేపలన్నీ దుఃఖంతో ఉసూరుమంటూ ఉండడం చూచిన సౌభరికి దుఃఖం కలిగింది. వెంటనే కోపం వచ్చింది. 'ఇక మీదట ఎప్పుడయినా గరుత్మంతుడు ఈ మడుగులోకి వచ్చి, ఇందులో ఉన్న చేపలను తినాలని అనుకొన్నాడో, వెంటనే మరణిస్తాడు' అని శపించాడు. అందువల్ల కాళియుడు గరుడునిబాధ లేకుండా చేసుకొనడంకోసం ఈ మడుగులోనికి వచ్చి, దాగుకొన్నాడు. ముని శపించిన విషయం ఒక్క కాళియునికి మాత్రమే తెలుసు. మిగిలిన పాములకు తెలియదు. అందువల్లనే అవేవీ ఈ మడుగులోనికి రాలేదు.

సౌభరిముని ఇచ్చిన శాపంవల్ల గరుత్మంతుడు ఆ మడుగులోనికి రాలేడు అనే ధైర్యంచేత, కాళియుడు ఆ మడుగులోనికి ప్రవేశించాడు. అతని మూలంగా ఆవులకు, మనుష్యులకు ఉపద్రవం కలుగకుండా ఉండడంకోసం, శ్రీకృష్ణుడు అతణ్జి మడుగునుండి బయటకు వెళ్లగొట్టాడు. కాళియుడు సమర్పించిన దివ్యమైన గంధాలు, వస్త్రాలు, రత్నాభరణాలు ధరించిన శ్రీకృష్ణుడు మడుగులోనుండి బయటకు వచ్చాడు. పోయిన ప్రాణం తిరిగివస్తే ఇంద్రియాలకు చైతన్యం కలిగినట్లుగా, మరణించాడనుకొన్న శ్రీకృష్ణుడు తిరిగి రాగానే యశోద, రోహిణి మొదలయిన ఆడువారు, నందుడు, సునందుడు మొదలయిన మగవారు, తేరుకొని, తెప్పరిల్లి, పరమానందాన్ని పొందారు. బలరాముడు సంతోషంతో శ్రీకృష్ణుణ్ణి కౌగిలించుకొన్నాడు. అప్పుడు

శ్రీకృష్ణుడు తిరిగి రావడంతో ఆబోతులు గర్వంతో రంకెలు వేశాయి. లేగదూడలు అటూ ఇటూ చెంగుచెంగున దూకాయి. ఆవులు సంతోషంతో పొంగిపోయాయి. చెట్లు చిగురించాయి.

ఓ పరీక్షిన్మహారాజా! అప్పుడు బ్రాహ్మణదంపతులు నందుణ్ణి చూచి, 'నీ కొడుకు పామునుండి విడుదల పొందాడు, నీ భాగ్యం స్థిరమైంది. గొప్పది. దానికి తిరుగులేదు' అని ఆశీర్వదించారు.

యశోద కృష్ణుణ్ణి ఒడిలో కూర్చుండబెట్టుకొని, తలను ప్రేమతో నిమురుతూ, నాయనా! నిన్ను ఆ భయంకరమైన పాము కరచినపుడు నన్ను ఏమని పిలిచావో గదా! భయపడిపోలేదు గదా! రా నాయనా! అని ప్రేమతో కన్నీరు కారుస్తూ శ్రీకృష్ణుని శిరస్సును మూర్కొంటూ ప్రేమతో అతణ్ణి కౌగిలించుకొంది.

ఈ విధంగా జరిగినదానికి సంతోషించి ఆ సాయంకాలం గొల్లలంతా ఆ యమునానది ఒడ్డు మీదే ఉండిపోయారు. ఆకలిదప్పికలకు తట్టుకోలేక అలసి, సాలసి అక్కడే ఆలమందలతో పరుండిపోయారు. అర్ధరాత్రంలో కార్చిచ్చు పుట్టి విశాలమైన ఆ అడవిని అన్నివైపులా దహిస్తూ వచ్చింది. గొల్లల ఒళ్లు కాలాయి, దానితో ఉలిక్కిపడి, లేచి, వారు మాయా బాలకుడుగా అవతరించిన శ్రీకృష్ణుణ్ణి శరణువేడి ఈ విధంగా అర్ధించారు.

కమలాలవంటి కన్నులు గల కృష్ణా! మహాపరాక్రమా బలరామా! ఈ కార్చిచ్చు చుట్టుముట్టి మమ్మల్ని అందరినీ కాల్చివేయడానికి దూసుకొని వస్తోంది. పొగలతో, నిప్పురవ్వలతో, మంటలతో భయంకరంగా ఉంది. మాకు మీరు తప్ప వేరుదిక్కు లేదు. ఈ కార్చిచ్చును అణచి, మమ్మల్ని రక్షించండి.

ఓ కృష్ణా! నిన్ను నమ్మినవారికి ఆపదలు కలుగవు. భయంకరంగా అన్నివైపుల నుండి కమ్ముకొని వచ్చే ఈ కార్చిచ్చు మా జోలికి రాకుండా చెయ్యి.

ఈ విధంగా మొర పెట్టుకుంటున్న గొల్లలందరిమీద శ్రీకృష్ణుడు జాలి చూపించాడు. సర్వలోకాలకు ప్రభువయినవాడూ అనంతమైన సామర్థ్యం కలవాడూ, కనుక ఆ కార్చిచ్చును మంచినీళ్లప్రాయంగా తాగేశాడు. గొల్లలంతా పదిదిక్కులు పిక్కటిల్లేలాగ అతని గొప్పతనాన్ని వర్ణిస్తూ పాటలు పాడారు. పిమ్మట కృష్ణుడు ఆవులమందలతోను, బంధువులతోను కలిసి నెమ్మదిగా నడచుకొంటూ వ్రేపల్లెకు వెళ్లాడు. ఈ విధంగా బలరామకృష్ణులు మాయామానుషరూపంతో వినోదిస్తూ ఉండగా

గ్రీష్మర్తువర్ణనము

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

పంచాంగం

No comments:

Post a Comment

Kali's Preface - కాళియుని పూర్వకథ

కాళియుని పూర్వకథ శుకునిమాటలు విన్న పరీక్షిన్మహారాజు 'కాళియుడు ఏ కారణంచేత పాములకు నివాసస్థానమయిన రమణక ద్వీపాన్ని విడిచిపెట్టి వచ్చాడు? అక...