బరువెక్కిన కొడుకును మోయలేక యశోదాదేవి బిడ్డను క్రిందికి దించి, ఇతడు భూమిని ఉద్ధరించటానికి పుట్టిన మహాపురుషుడేమో అని మనస్సులో అనుకొంది.
ఆ సమయంలో
కఠినాత్ముడైన కంసుడు ఆజ్ఞాపించగా, తృణావర్తుడనే రాక్షసుడు భూమిమీదికి వచ్చి, అకస్మాత్తుగా సుడిగాలిగా అయి, బిసబస అని శబ్దం చేస్తూ, అందరు ఇలాంటి గాలిని ముందెన్నడు చూడలేదని ఆశ్చర్యపడుతుండగా క్రమ్ముకొని వీచి, బాలకృష్ణుణ్ణి ఎత్తుకొనిపోయాడు.
ఓ పరీక్షిన్మహారాజా! ఎవరివల్లనూ తిరుగుడువడని శ్రీహరి (బాలకృష్ణుడు) ఇప్పుడు తిరుగుడు పడ్డాడు. సుడిగాలి రూపంలో వచ్చిన రాక్షసుడు విసరిన సుడిగాలివల్ల రేగిన దుమ్ము కళ్ళనిండా క్రమ్ముకోగా, గోపకులంతా భయపడి గుండ్రంగా తిరుగుతూ పడ్డారు.
అంతేకాక, ఆ సుడిగాలిరాక్షసుడు తృణావర్తుడు ప్రళయకాలవాయువువలె చెలరేగి, చుట్టుముట్టి, వీచిన సుడిగాలిలో పుట్టినదుమ్ము, పైకెగసి సూర్యుకిరణాలను కప్పివేసింది. భయంకరమై దట్టమైన చీకటి పదిదిక్కులను ఆవరించింది. వ్రేపల్లెమొత్తం కలవరపాటు నొందింది. ఒకరికొకరు అగుపడనిస్థితి ఏర్పడింది. దిక్కు తెలియనిస్థితిలో జనులంతా భయపడ్డారు. ఆ సుడిగాలి తిరిగే వేగానికి, భయంకరధ్వనికి దిక్కుల చివరలు చెవిటివయ్యాయి. ఒక ముహూర్తకాలం లోకాలకు భయంకరస్థితి ఏర్పడింది. అప్పుడు
యశోదకు బాలకృష్ణుడు అగుపడక పోయేసరికి, ఆపద కలిగినట్లుగా భావించి, కలతనొంది 'ఓ బిడ్డా! బాలభానునివంటి కాంతికలవాడా! బాలురందరిలో శ్రేష్ఠుడా! ఈ రోజు గాలిచేతిలో చిక్కువడితివా? అంటూ, బాలుణ్ణి పిలుస్తూ ఈ స్థితి కలిగించినందుకు దేవుణ్ణి దూషిస్తూ, దుఃఖంతో క్రుంగి కృశించి గట్టిగా కేకలు పెట్టుతూ.
'సుడిగాలి వచ్చి నిన్ను చుట్టుకొని ఆకాశానికి ఎత్తుకు పోయింది. ఆకాశంలో సుడితిరుగుతూ, భయపడుతున్న ఓ ముద్దుల కొడుకా! ఏమంటున్నావు? ఇది ఘోరం'- అని (దేవకీదేవి) అంటూ
'కుమారుణ్ణి ఇక్కడే కూర్చోపెట్టాను. వాడు ఇక్కడే ఆడుకొంటూ ఉన్నాడు. ఇంతలోనే ఈ మాయదారి సుడిగాలి ఎటునుండి వచ్చిందో? బిడ్డ ఏ త్రోవపట్టిపోయాడో? నేను ఎక్కడికని వెళ్ళివెదికేది' అంటూ యశోద, దూడను వదలిపెట్టి దుఃఖంతో నేలమీద కూలే ఆవులాగా నేలమీద పడిపోయింది.
బిడ్డకోసం ఈ విధంగా దుఃఖిస్తున్న యశోదాదేవిని చూచి గోపాలుర భార్యలందరు ఆర్తితో కలతపడి దుఃఖించగా వాళ్ళకళ్ళనిండా నీళ్ళునిండాయి.
అంతలోపల ఆ సుడిగాలి రాక్షసుడు తృణావర్తుడు మితిమీరిన అహంకారంతో బాలకృష్ణుణ్ణి ఆకాశానికి ఎత్తుకొని పోయాడు. కాని, ఆ బాలుడిబరువును మోయలేక గమనవేగం తగ్గి, కదలలేక 'ఇంతకుముందు ఇలాంటి బిడ్డను ఎక్కడా చూడనే లేదు. ఇక మీదట నా గతి ఏమౌతుందో' అని చింతింపసాగాడు.
అని పై విధంగా సుడిగాలి రాక్షసుడు చింతిస్తున సమయంలో
పరీక్షిన్మహారాజా! బాలకృష్ణుడు పిల్లఏనుగుల తొండాలవంటి తన రెండుచేతులతో తృణావర్తరాక్షసుని కుత్తుక నాళాన్ని బిగియపట్టి, ఒక కొండవలె బరువై వ్రేలాడాడు.
తన మెడను బిగియపట్టి ఒక కొండలా వ్రేలాడుతున్న బాలకృష్ణుని పట్టునుండి బయటపడలేక ఆ రాక్షసుడు, మెడకు ఉచ్చుబిగుసుకొన్న పక్షివలె భయపడసాగాడు.
దేవతల శత్రువైన కంసునిబంటు తృణావర్తుడు, విష్ణుస్వరూపుడైన శ్రీకృష్ణునిఅరచేతిరాపిడికి స్వాధీనం తప్పినవాడై, త్రిపురాంతకుడైన పరమశివుని బాణంతో కూలిపోయిన పురంవలె, అవయవాలన్నీ విరిగి రాళ్ళమీద పడ్డాడు.
అప్పుడు గోపకాంతలు జరిగిందంతా చూచి, ఏడ్పులు మాని, సంతోషంతో రాక్షసుని వక్షఃస్థలం మీద ఉల్లాసంగా, చూడముచ్చటగా, ఇది వరకటి బరువులేక వ్రేలాడుతున్న బాలకృష్ణుణ్ణి ఎత్తుకొనివచ్చి, చింతాక్రాంతురాలై ఉన్న యశోదాదేవి కిచ్చారు. తరువాత అందరు గోపకులు, గోపికలు తమలో తాము ఈ విధంగా అనుకొన్నారు.
సాధుశీలుడు సమబుద్ధి కలిగి ఉంటాడు కనుక రక్షణలేకపోయినా కష్టాలు కలిగినపుడు రక్షింపబడుతాడు. దుర్మార్గుడికి వెయ్యి రక్షణలున్నా అతడు పాపాత్ముడు కనుక తప్పక శిక్షింపబడుతాడు.
గత జన్మలలో ఏ యేనోములు నోచామో, ఏ యేయాగాలు చేశామో, ఏయే సత్పురుషులకు ఏమేమి దానా లిచ్చామో, ఏ యే మంచి విషయాలమీద మనస్సు నిలిపి కాలం గడిపామో, ఏ యే సత్యాలు పలికామో; ఏ యే పుణ్యక్షేత్రాలలో సంచరించామా! ఆ పుణ్యఫలంగా ఇప్పుడిక్కడ భయం లేని బాలకృష్ణుణ్ణి దర్శించగలిగాము.
అని పలికి గోపకుల మాటలు విన్న నందుడు, చాల ముందుగానే వసుదేవుడు తనతో తెలిపిన విషయాలకు ఆశ్చర్యపడుతూ ఉండినాడు. ఇంకా,
ఓ పరీక్షిన్మహారాజా! ఒక రోజు యశోద పాలిండ్లు చేపునకు రాగా, చిన్నారి ముద్దుల కృష్ణుణ్ణి దగ్గరికి తీసుకొని, తొడలమీద ఉంచుకొని, ముద్దుపెట్టుకొని చనుబాలు త్రావించింది. ప్రేమగా ముఖాన్ని నిమిరింది. అప్పుడు మెల్లగా నవ్వుతూ బాలుడు ఆవులించాడు. ఆ బాలకృష్ణునినోరు ఆమెకొక పెద్దగుహలాగా అగుపించింది. అందులో ఆమె సముద్రాలను, దిక్కులను, భూమిని, అడవులను, ద్వీపాలను, పర్వతాలను, నదులను, వాయువును, సూర్యచంద్రులను, అగ్నిని, ఆకాశాన్ని గ్రహనక్షత్రాలను, అఖిలలోకాలను, చరాచరాలైన భూతగణాలను దర్శించి, కన్నులు మూసుకొని, ఆశ్చర్యచకితురాలైంది.
(బాల్యంలోనే కృష్ణుడు ఆవులించి యశోదమ్మకు తననోట విశ్వరూపదర్శనభాగ్యమిచ్చాడు.)
తరువాత ఒకరోజు వసుదేవుని ఆజ్ఞమేరకు యాదవుల పురోహితుడైన గర్గమహాముని వ్రేపల్లెకురాగా, నందుడు ఆయనను చూచి లేచి నిలబడి నమస్కరించి,
ఉత్తమగుణాలు, నడవడులు, సత్పురుషులసాంగత్యం కలిగి, శివారాధకుడై, అరిషడ్వర్గాన్ని పారద్రోలి, నీచజనుల్ని దగ్గరకు రానీయనట్టి ఆ గర్గమహామునిని నందుడు అతిప్రీతితో సేవించాడు.
వచ్చిన గర్గమహామునికి తగిన సత్కారాలు చేసిన పిదప నందుడు ఇలా అన్నాడు.
మహాత్మా! ఓ గర్గమహామునీ! గొప్పవారు ఏ కారణం లేకుండా ఒక చోటికిగాని, ఒకరి దగ్గరికిగాని రారు. తక్కవవారిఇండ్ల దగ్గరికి వచ్చారంటే-వారి రాకలు శుభాలకు కారణాలు. ఇప్పటి మీ రాక మాకు శుభాన్ని సమకూరుస్తుంది. ఇది సత్యం.
ఓ గర్గమహామునీ! నీవు జ్యోతిశ్శాస్త్ర పండితులందరిలో శ్రేష్ఠుడివి. మిక్కిలి తేజోమూర్తివి. అన్నిదిక్కుల చివరలదాకా వ్యాపించి వెలిగే కీర్తి కలవాడివి. బ్రహ్మజ్ఞాన సంపన్నుడివి. నా మనవి విను. వేదజ్ఞుడైన బ్రాహ్మణ శ్రేష్ఠుడే మానవులకు నిర్ణయింపబడిన గురువని పెద్దలంటారు. నీవు నేర్పుగ ఈ కుమారులిద్దరికి నామకరణాదిసంస్కారాలు వేదోక్తంగా జరిపించు.
అని నందుడు చెప్పి బలరామకృష్ణులను చూపగా, ఆ గర్గమహాముని ఇదివరకు కంసునిచేత వ్రేటువడి ఆకాశానికి ఎగసిపోయిన యోగమాయ చెప్పినమాటలను నందునికి వివరించి, కృష్ణుడు దేవకీదేవికొడుకు అని కంసుడు తలచి, ప్రమాదం చేయవచ్చు కనుక, పిల్లలకు నామకరణాది సంస్కారాలు రహస్యంగా చేయటం మంచిదని సూచించాడు. నందుడు అందుకు సమ్మతించాడు. అప్పుడు ఆ మహాముని రోహిణికొడుకును గురించి
ఓ పరీక్షిన్నమారాజా! ప్రజలు ఆనందించేట్టు మెలిగే పద్ధతి కలవాడు కనుక రాముడనీ, ఒక గర్భంనుండి లాగబడి మరాక గర్భంలో ప్రవేశపెట్టబడినవాడు కావటంచేత సంకర్షణుడనీ, గొప్పబలం కలవాడు కావటంచేత బలుడనీ నామకరణం చేశాడు.
తరువాత గర్గమహాముని యశోదకొడుకును ఉద్దేశించి 'ఈ శిశువు పూర్వం తెలుపు, ఎరుపు, పసుపు రంగులలో ఉండేవాడు. ఇప్పుడు నల్లగా ఉన్నాడు కనుక కృష్ణుడని పిలవండి. ఇతడు ఒకానొక ప్రదేశంలో వసుదేవునికి జన్మించాడు కనుక వాసుదేవుడనికూడ ఇతణ్జి పిలువవచ్చు. ఈ బాలుడికి అనేకగుణాలు, రూపాలు, కర్మలు ఉండటంచేత ఇంకా ఎన్నో పేర్లు వస్తాయి. ఈ బీడ్డవల్ల మీరు అన్ని దుఃఖాలనుండీ గట్టెక్కుతారు. అంతేకాదు. ఈ బాలుడివల్ల దుష్టశిక్షణం, శిష్ట రక్షణం కూడా జరుగుతుంది. ఈ కుమారుడు శ్రీమహావిష్ణువుతో సమానమైనవాడు అని చెప్పి తన ఇంటికి వెళ్ళాడు. అది విని నందుడుకూడా పరమానంద భరితుడయ్యాడు. ఆ తర్వాత
No comments:
Post a Comment