Friday, April 3, 2026

Balakrishnudu (Baby Krishna) kicked and bucked a cart with his feet - బాలకృష్ణుడు శకటముం దన పాదమున గూల దన్నుట

బాలకృష్ణుడు శకటముం దన పాదమున గూల దన్నుట

యశోదాదేవి తన బిడ్డడు బాలకృష్ణుడు ఒత్తిగిలి బోర్లపడటం నేర్చుకొన్నాడని ఎంతో సంతోషించి, కొడుకు జన్మనక్షత్రాన ఒకరోజు వేడుకగా అతడికి స్నానం చేయించటానికి గోపికలను పేరంటానికి పిలిచింది. మంగళవాద్యాలు మ్రోగగా, గోపికలు పాటలుపాడగా, బ్రాహ్మణుల వేదమంత్రాలతో బిడ్డకు అభిషేకాదులు చేయించింది. ఆ వేదవిప్రుల ఆశీర్వచనాలు అందుకొని, వారికి ఆవుల నిచ్చింది. విందుభోజనం పెట్టింది. వస్త్రా లిచ్చింది. అడిగినవారికి అడిగినట్టుగ ఇచ్చింది. బాలకృష్ణుణ్ణి ప్రియమార పానుపుమీద పడుకోబెట్టి నిద్రపుచ్చింది. గోపాలురకు, గోపికలకు పూజలుచేస్తూ ఆమె బిడ్డ విషయం మరచింది.

చిన్ని కృష్ణుడు నిద్రపోయిన సంగతి మరచిన సమయంలో

నిద్రపోతున్న బాలకృష్ణుడు ఆకలి గొని, మేల్కొని, కాళ్ళుచేతులు ఆడిస్తూ, ఒడలు విరుచుకొంటూ, పాలకొరకు చన్నుకోరుకొని, అది దొరకకపోయే సరికి ఆగ్రహించి, చిగురుటాకువలె మృదువై, చక్రరేఖలు, ధనుస్సు రేఖలు మున్నగు సాముద్రిక లక్షణాలుండే తన పాదంతో ప్రక్కనున్న ఒక బండిని బలంగా తన్నాడు.

బాలకృష్ణుడు తన్నగానే ఆ బండి, గోపకులందరు చూస్తుండగా, ఆశ్చర్యకరంగా ఆకాశాని కెగిరింది. ఇరుసు బరువుకు దాని చక్రాలు ఆకారం మారినవై నేలమీద పడ్డాయి.

అప్పుడు యశోద, నందుడు మొదలైన ముఖ్యగోపికలు, గోపకులు ఆ బండిలో ఉన్నట్టి మధుర పదార్థాలన్నీ నేలపాలై నిరుపయోగాలు కావటంచూచి, ఆశ్చర్యచకితులై తాము చేస్తున్న పనులు వదలిపెట్టి, పండుగలు మాని, సంతోషాన్ని కోల్పోయి, భయాలు నిండిన మనస్సులతో

కారణం లేకుండా బండి ఆకాశానికి ఎగురదు కదా! పక్కమీద పడుకొని ఉన్న ఈ చిన్నిబిడ్దడు ఆ బండిని తన్నటానికి సమర్ధుడు కాడు. మరి ఏ విధంగా ఇది ఎగిరిందో! ఇది అలా ఎగరడమేమిటి?; దీనికి కారణం ఎలాంటిదో!

అని పై విధంగా చర్చించుకుంటున్న సమయంలో

బాలకృష్ణుడు ఆకలిగొని ఏడుస్తూ కాలు ఎత్తగా, ఆ కాలు తగిలి బండి ఆకాశాని కెగిరింది గాని, అది ఎగరటానికి ఇతర కారణ మేదీ లేదని, కృష్ణుని పాన్పుకు దగ్గరలో ఆడుకొంటున్న పిల్లలు చెప్పారు.

అని పై విధంగా చిన్న పిల్లలు పలికిన మాటలను విన్న తర్వాత

'ఈ పసిబాలుడేమిటి! ఇంత పెద్ద బండి ఏమిటి! ఇతడు దాన్ని తన్నటమేమిటి! అది ఆకాశాని కెగిరి ముక్కలు ముక్కలుగ విరగడమేమిటి! ఈ ఆడుకొనే పిల్లలు అబద్ధం చెప్పారు. ఇంత తెలివి తక్కువమాట ముల్లోకాల్లో ఎక్కడైనా చెప్పబడుతుందా? ఇదంతా ఏ విధంగా జరిగిందో' అని అనుకొంటూ, సందేహాలతో సతమతమౌతూ గోపాలురు, గోపికలు అందరూ, ఆశ్చర్య చకితులయ్యారు (వ్రే= గొల్లకులానికి చెందినవాడు, వ్రేలు= గోపాలురు (బహువచనరూపం)).

అప్పుడు ఆ చిన్ని కృష్ణుని ఏడ్పును విన్న యశోద పరుగెత్తుకొని వచ్చింది.

'అన్నా! అలసిపోయావు కదన్నా!; ఆకలితో ఉన్నావు కదన్నా!; మంచివాడివి కదన్నా!; ఏడుపు మానుమన్నా!; నా చనుబాలు త్రావుమన్నా!; సంతోషంగా ఉండుమన్నా!' - అంటూ యశోదాదేవి ఆ బాలకృష్ణునికి తన చనుబాలిచ్చింది.

ఆ తరువాత బాలకృష్ణునికి పిల్లలను పట్టి హింసించే చెడుగ్రహం ఏదో సోకిందని, గోపకులు చాలామంది ఆ గ్రహపీడ తొలగటానికి అనేక బలిదానాలు చేశారు. బ్రాహ్మణులు పెరుగుతో, దర్భలతో, అక్షతలతో అనేకహోమాలు చేశారు. ఋగ్వేద, యజుర్వేద, సామవేద మంత్రాలతో అభిషేకాలు చేయించి, శుభాన్ని పుణ్యాన్ని కలిగించే స్వస్తివాచనాలు, పుణ్యాహవాచనాలు చదివించి, కుమారుడికి మేలు జరగాలని నందుడు అలంకరించిన పాడిఆవులను పండితులకిచ్చి, వారి ఆశీర్వాదాలు పొంది, ఆనందించాడని చెప్పి, శుకుడు ఇంకా ఇలా అన్నాడు.

ఓ పరీక్షిన్మహారాజా! ఒకరోజు యశోదాదేవి కొడుకును తొడమీద కూర్చోపెట్టుకొని ముద్దాడి దేహాన్ని ప్రేమతో అలా నిమురుతూ ఉండగా, పెద్దకొండ శిఖరంవలె బాలకృష్ణుడు బరువెక్కిపోయాడు.

తృణావర్తుండను రాక్షసుండు సుడిగాలియై కృష్ణు నెత్తుకొని పోవుట

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

పంచాంగం

No comments:

Post a Comment

The story of Yashodamma catching and punishing Balakrishna for breaking butter pots - యశోద దధిభాండ వికలనాదులు సేసిన కృష్ణుని బట్టుకొనుట

యశోద దధిభాండ వికలనాదులు సేసిన కృష్ణుని బట్టుకొనుట యశోద శ్రీకృష్ణునిపై పాటలు పాడుతూ, పెరుగును చిలకడం ప్రారంభించింది. ఆమె గాన మాధుర్యానికి చెట...