శ్రీకృష్ణుడు చూచిన సరస్సు ఎంతో అందంగా వుంది. ఆ అందాన్ని మనసులో మెచ్చుకుంటూ, వేగంగా గాలి వీచడంతో కదిలే అలల నీటి తుంపురుల జల్లులకు దేహాలు గగుర్పాటు చెందగా, పార్శ్వములందు కాయలతో, పళ్ళతోకూడిన గెలల భారంతో వంగిన గట్టి చెట్ల సముదాయం, వాటి నీడలందు పెద్ద పెద్ద ఇసుక తిన్నెలు చూసి, ఎంతో ఉత్సాహంతో తన స్నేహితులైన గోపాలురతో ఇలా అన్నాడు శ్రీకృష్ణుడు.
కృష్ణుడు గోపబాలురతో ఇలా అంటున్నాడు. ఏమర్రా! పాపం ఎండలో మాడిపోయారు, ఆకలితో కూడా వున్నారు. మనం చల్ది తినడానికి ఇది ఎంతో అందంగా ఉన్నస్థలం. ఈ పక్కనే మనదూడలుకూడా చక్కగా నీరు తాగి, కసవు మేస్తూ గుంపుగా తిరుగుతుంటాయి. మనం ఎంతో ఆనందంగా చల్ది తిందామా?
శ్రీకృష్ణుడిలా అనగానే! ఓ అలాగే కానిద్దాం అంటూ గోపాలురందరూ దూడలు మంచి నీళ్ళు తాగేలా చేసి, కసవు ఏపుగా పెరిగివున్న పల్లపునేలల్లో వాటీని నిలిపి, తమ తమ చల్ది మూటలను కిందికి దించుకున్నారు.
తామరపువ్వులో మధ్య ఉన్న కర్ణికచుట్టూ వరుసలు వరుసలుగా రేకులు పరుచుకుని ఉంటాయి. అలాగే కృష్ణుడు కర్ణికలాగా మధ్యన కూర్చుని ఉండగా గోపబాలురందరూ చుట్టూ రేకుల్లాగా సర్దుకుని కూర్చున్నారు. అందరూ కృష్ణుణ్ణే చూస్తున్నారు. వారికి కంచాలు అంటూ వేరే ఏమీ లేవు. విశాలమైన రాతిపలకులు, లేత తామరఆకులు; వెడల్పైన గడ్డిపోచలతోను, తీగెలతోను, పొడుగాటి పొన్నపూలవంటి పూవులతోను అల్లిన చదరలు, తోడ తెచ్చుకున్న చిక్కాలు, చెట్ల ఆకులు - వీటినే కంచాలుగా ఉపయోగించుకొని గోపాలబాలకులు చక్కగా చల్దులు ఆరగించారు.
కృష్ణునిచుట్టూ వలయాకారంగా కూర్చున్న గోపాలకులంతా చల్దు లారగిస్తున్నప్పుడు వారు చేసే పలుచేష్టలను పోతన సహజంగా వర్ణిస్తున్నాడు, కాదు కళ్ళకు కట్టిస్తున్నాడు. ఒకడు మళ్ళీ మళ్ళీ వేలు మడిచి ఊరగాయలు తాను తింటూ, మిగిలిన వారిని ఊరిస్తున్నాడు. ఇంకొకడు పక్కవానికంచంలోని పదార్ధాన్ని తినేసి, వానితో చూడు నేనేమి తినలేదంటూ నోరు చూపిస్తున్నాడు. మరొకడు అయిదారుగురు తినే చల్దిని పందెం వేసి నేనొక్కడనే తింటానంటూ కుక్కుకుంటూ కుక్కుకుంటూ తింటున్నాడు. వేరొకడు పదార్థాలన్నిటినీ అందరికీ పంచి ఇస్తూ స్నేహమంటే ఇదేరా అంటూ బంతెనగుండులాట ఆడుతున్నాడు. ఇంకొకడు అదుగో కృష్ణుణ్ణి చూడమంటూ ఏమారించి ఇతరుల ముందున్న మంచి మంచి తినుబండారాలను మెక్కేస్తున్నాడు. ఒక్కడు నవ్వుతూ వుంటే, ఇంకొకడు నవ్విస్తున్నాడందరినీ. ముచ్చటలాడడం ఒకడు చేస్తే వాటిని చూచి, విని ఇంకొకడు మురిసిపోతున్నాడు.
ఇలా గోపాలురందరూ కృష్ణునిచుట్టూ కూర్చుని ఎంతో సరాదాగా చల్దులారగిస్తున్న సమయంలో
కృష్ణుడు నడుముచుట్టూ దట్టీ చుట్టుకొని అందులో తన వేణువునుంచి, కొమ్ముబూరాను, బెత్తం కర్రను జారిపోకుండా ఎడమచంకలో ఇరికించాడు. మీగడతో నిండిన పెరుగు కలిపిన చద్ది అన్నాన్ని ఎడమచేతిలో ఇమిడేటట్లు చేశాడు. అల్లరి పెట్టి, ఇంకా కావాలి ఇంకా కావాలి అంటూ కొసరి కొసరి తెచ్చిన ఊరగాయలను కుడిచేతివేళ్ళ మధ్యలో ఇరికించి, తన చెలికాండైన గోపాలకుల మధ్యలో కూర్చుని, ఛలోక్తులతో, హాస్యసంభాషణలతో నవ్విస్తూ, యజ్ఞాలలో నివేదించే హవిస్సు వంటి ప్రసాదాన్ని భుజించే శ్రీకృష్ణమూర్తి దేవతలందరూ ఆశ్చర్యపోయి చూస్తూ ఉండగా బాల్య లక్షణాలతో ప్రకాశిస్తూ చద్దిఅన్నం తిన్నాడు.
ఇలా శ్రీకృష్ణునితో కలిసి ఎంతో సంతోషంగా గోపాలురు చల్దులు తింటున్నారు. ఇంతలో దూడలు మేతకై పచ్చగడ్డి గుబురుగా పెరిగిన చోటుకు వెళ్ళి దొంగమేతలు మేస్తూ అలా అలా భయంకరమైన ఆ అడవిలో చాలా దూరం వెళ్ళిపోయాయి. గోపాలురకు దూడలు కనబడలేదు. దాంతో ఎంతో భయపడుతున్న వారితో పద్మాక్షుడైన శ్రీకృష్ణుడిలా అన్నాడు.
దూడలు ఎమై పోయాయో అని భయపడుతున్న గోపాలురను చూచి, శ్రీ కృష్ణుడిలా అన్నాడు. 'గోపబాలులారా! వినండి. మనదూడలు ఈ అడవిలో లేత పచ్చిక మేయాలనే ఉత్సాహంతో చాలా దూరం పోయినట్టున్నాయి. ఎక్కడికి పోయాయో! ఏమయ్యాయో! అడవిలోని పులులవంటి భయంకరజంతువులవల్ల ఏమి కీడు పొందాయో!, నేను వెళ్ళి చూచి తోలుకొని వస్తాను. మీరు చద్దిని పూర్తిగా తింటూ ఉండండి.
No comments:
Post a Comment