Saturday, April 4, 2026

Slaughter of Aghasura - అఘాసురవధ

అఘాసురవధ

ఈ అఘుడనే రాక్షసుడు బకాసురునితమ్ముడు. అమరులైన దేవతలుకూడా ఈ రాక్షసుడంటే భయపడతారు. తన అన్నను శ్రీకృష్ణుడు చంపాడనే విషయం తెలుసుకొని కంసుడే పంపగా బృందావనానికి వచ్చాడు.

దేవతలు అమృతం సేవించి అమరులైనప్పటికి తమమీద తమకే నమ్మకంలేక ఏ అఘాసురుని మరణానికి ఎదురుచూస్తూ ఉంటారో అలాంటి అఘాసురుడు గర్వంతోను రోషంతోను రెచ్చిపోతూ

తన అన్న అయిన బకాసురుడు శ్రీకృష్ణునిచేతిలో మరణించాడనే విషయం తెలిసిన అఘాసురుడు కంసుడు పంపగా వచ్చి, ఈ గొల్ల బాలురందరితో కలిసి బకునికి శత్రువైన ఆ శ్రీకృష్ణుణ్జి చంపుతానంటూ అధికమైన కోపంతో

'గోపాలకులకందరికీ ప్రాణం ఈ బాలులిద్దరే. మా అన్న బకాసురుని ప్రాణాలు తీసినందుకు మారుగా శ్రీకృష్ణులరాములనే ఈ ఇద్దరు బాలుర్నీ చంపితే సరిపోతుంది. గోపాలకులందరూ మరణించినట్లే' అనుకొన్నాడు - అఘాసురుడు.

పై విధంగా నిశ్చయించుకున్న అఘాసురుడు ఓ భయంకరమైన కొండచిలువ రూపాన్ని పూనాడు. అదెంత ఘోరంగా ఉందంటే, పెద్ద కొండంత పొడవు, ఆమడవెడల్పు కలిగివుంది. కొండకొమ్ముల్లాంటి కోరలూ, ఆకాశమంతా నిండిన నల్లమబ్బులను మించిన పెదవులతో, గుహలకంటే అధికమైన పళ్లమధ్యసందులతో, దట్టమైన చీకటితో నిండిన నోటి లోపలి భాగంతో, కార్చిచ్చు మంటల్లా మండే కంటిచూపులో, వేడిసెగలు కక్కుతున్న నిట్టూర్పులతో, నేలంతా పరచుకొన్న నాలుకుతో భయంకరంగా ఉంది.

ఓ పరీక్షిన్మహారాజా! పాపకర్ముడైన ఆ అఘాసురుడు నేనింకేమాత్రం ఆలస్యంచేయకుండా ఇప్పుడే దూడలను, గోపాలురను, కృష్ణునితో కలిపి వాళ్ళు గిలగిలా కొట్టుకొంటూ ఉండగా మింగేస్తానంటూ, వారున్న దారిలో అడ్డంగా పడుకున్నాడు.

గొల్ల పిల్లలు దారికడ్డంగా వున్న ఆ కొండచిలువను చూచి ఇలా అంటున్నారు. ఏమర్రా! అడవికి సంబంధించిన ఓ పెద్ద కొండచిలువ కొండంత విస్తారమైన శరీరంతో, దావాగ్నిజ్వాలల్లా భయంకరమైన ఊర్పులతో, మండే నిప్పులాంటి నాలుకతో, మనందరినీ చంపాలని ఎదురుచూస్తూ మనముందు దారిలో పెద్దగా సాగి అడ్డంగా పడి ఉంది. చూశారా! అని (గొల్లబాలురు) ఒకరితో ఒకరు అనుకుంటున్నారు.

ఇలా అజగరాన్ని చూచి ఒకరు మరొకరికి చూపిస్తూ

గోపాలురందరూ ఆ పెద్ద కొండచిలువ అంత భయంకరంగా ఉన్నా సరే, భయంలేకుండా ఇలా అంటున్నారు. బకాసురుణ్ణి చంపిన శ్రీకృష్ణుడే మనతో ఉంటే ఇక మనకు పాము, గీము అంటూ భయం ఎందుకు! అలా కాకుండా ఒక వేళ ఆ పాము మనలను మింగితే - వెంటనే శ్రీకృష్ణుడు దాన్ని బకాసురుడివెంటే పంపిస్తాడు. అంటే చంపేస్తాడు. ఇలా అనుకొంటూ కృష్ణుణ్ణి చూస్తూ చాలా ఉత్సాహంతో ఒకరిచేయి మరొకరు పట్టుకుంటూ, ఏ అడ్దూలేకుండా రండి ఆ పామును దాటిపోదామంటూ ముందుకు సాగారు.

భయంకరంగా ఉండే పామును చూచి కూడా కృష్ణుడుండగా మనకేం భయం? అంటూ ముందుకు పోతున్న గోపబాలురను చూచి, కృష్ణుడు తన మనస్సులో-

అయ్యో! ఈ పాము మామూలుది కాదు. రాక్షసుడు అనే విషయం తెలియనివారై ఏ భయంలేకుండా నేనున్నానన్న ధైర్యంతో ఈ గొల్లబాలురందరూ దానికి ఎదురుగా పోయారు - అనుకొన్నాడు కృష్ణుడు. దాంతో కృష్ణునికి తీవ్రంగా కోపం కలిగింది. తానుకూడా వారి వెంటనే వెళ్తూ ఉండగా, మొత్తం ఆ గొల్లవారంతా తమదూడల గుంపులతోపాటు భరింపలేని క్రూరమైన ఆ పాముయొక్క పెద్ద బిలంలా ఉండే నోట్లోకి ప్రవేశించారు.

శ్రీకృష్ణునితో పాటు మొత్తం గోపబాలురంతా తమ దూడలతో ఆ కొండచిలువ నోట్లోకి ప్రవేశించిన సమయంలో

అప్పుడు అఘాసురుడు వారందరినీ మింగివేసే ఆవేశంతో నోరు ఒక్కసారిగా అప్పళించాడు. ప్రళయకాలంలో భగ్గున జ్వలించే భయంకర జ్వాలలవలె మంటలు మండుతున్న తననాలుకలతో వారినందరినీ నోటిలోనికి లాక్కుని మింగివేశాడు. దేవతలందరూ ఆ మహాసర్పం వారిని మింగివేయడం చూచి భయపడిపోయారు. ఆ గోపబాలకుల మనస్సులన్నీ ఎప్పుడూ కృష్ణుని చుట్టునే తిరుగుతూ ఉంటాయి. వారు శారీరకంగా బలవంతులు కారు, చిన్న పిల్లలు. తాము మోస్తున్న చిక్కములు కూడా వారికి బరువే! అయితే ఆ గోపకుమారులు కృష్ణునికి తమను తాము సమర్పించుకున్నారు. కనుక చాలా ధైర్యవంతులుగా ఉన్నారు.

ఇలా ఆ కొండచిలువచే మింగబడే తన చెలికాండ్రను చూసి శ్రీకృష్ణుడు

ఆ సమయంలో కృష్ణుడు ఇలా అనుకుంటున్నాడు. నేనొక్కణ్ణే గోకులానికి వెళితే గోపవనితలంతా వచ్చి, కృష్ణా! ఇంతవరకూ రోజూ మా గొల్లబాలురు లేగలతో కూడి నీతో వస్తూవుండేవారు కదా! ఈ రోజు ఎందుకు రాలేదు? అని అడిగితే నేనేం సమాధానం చెపుతాను. ఈ రోజు ఈ పిల్లలను ఆ పామునోటితో కలిపేలా దైవం ఎందుకిలా చేశాడు. అయినా, దైవం క్రూరమైన కార్యాన్ని ఏమాత్రం సంకోచించకుండా చేస్తాడు కదా!

కృష్ణుడు సర్వమూ చూడగలవాడు. అందరిచూపూ తానే అయినవాడు. తనను ఆశ్రయించిన వారి కష్టాలను తొలగించేవాడు. తామరరేకులవంటి కన్నులు గలవాడు. ఆ రాక్షసుడు మహాభయంకరుడు. దేవతలుకూడా అతడు చేసిన పనికి భయపడి మొరపెట్టుకుంటున్నారు. రాక్షసులందరూ గర్వంతో మిడిసిపడసాగారు. అటువంటి ఈ రాక్షసుడు కొండచిలువ రూపంతో బాలకులను, లేగదూడలను మింగుతూ ఉంటే కృష్ణుడుకూడా వారివెనుకనే లోపలికి ప్రవేశించాడు. ఆ కొండచిలువ నాలుకలతో అందరినీ చిందర వందరచేసి కొద్దికొద్దిగా మింగడానికి ప్రయత్నిస్తూ ఉంటే - కృష్ణుడు కంఠద్వారం దగ్గరచేరి, తన శరీరాన్ని విపరీతంగా పెంచి, దిమ్మిసకొట్టినట్లు అక్కడ ఉండిపోగా

కృష్ణుడెప్పుడైతే ఆ పాము గొంతుకడ్డంగా తన దేహాన్ని పెంచి ఊపిరాడకుండా చేశాడో, దాంతో దానికి శ్వాస పైకి రాకపోవడంతో కడుపుబ్బిపోయింది. లోపలి ప్రాణవాయువులు బైటికి వచ్చేమార్గం లేకపోవడంతో ఎంతో బాధపడి, చివరకు శిరస్సు ముక్కలయ్యేలా చేసి, పెద్ద ధ్వనిచేస్తూ బైటికి వచ్యాయి.

క్రూరసర్పమైన ఆ కొండచిలువ పెద్దకడుపులో ఉన్న గోపబాలకులను, ఆవుదూడలతోకూడా దయారూపమైన అమృతవృష్టి కురిపించి బతికించి కృష్ణుడు దూడలతో, గోపాలురతో, తానుకూడా పాము నోటిమార్గం గుండా బైటికి వచ్చాడు. అప్పటి కృష్ణుడు ఎలా ఉన్నాడంటే మబ్బులు వీడి, నక్షత్రసముదాయంతో ప్రకాశించే చంద్రునిలా ఉన్నాడు.

ఇంద్రాదిదేవతలకోసం బలిచక్రవర్తిని ధిక్కరించి, బ్రహ్మాండమంతా నిండిన వామనమూర్తి ఆనాడు విష్ణువు విక్రమించాడు. అలాంటిది గొల్లపిల్లలకోసం ఈనాడు క్రూరమైన, దుష్టమైన ఆ కొండచిలువ గొంతు మదాన్ని తగ్గించడానికి పెరగకుండా ఉంటాడా? అందుకే అలా పెరిగి గోపాలురను కాపాడాడు.

అప్పుడు ఆ కొండచిలువ దేహంనుండి ఆశ్చర్యం కలిగే విధంగా ఒక తేజస్సు దిక్కులన్నిటినీ ప్రకాశింపజేస్తూ బైటకు వచ్చింది. అది ఆకాశమార్గంలో ప్రకాశిస్తూ, అక్కడున్నదూడలూ, గోపబాలురూ, భయపడేలా వుంది. శ్రీకృష్ణమూర్తి ఆశ్చర్యం కలిగే విధంగా తనకడువులో చేరి ప్రాణాలు హరించినంతనే ఆ మహనీయునిస్పర్శతో శుద్ధసత్త్వరూపంతో ఆ రాక్షసుని తేజస్సు శ్రీకృష్ణమూర్తిదేహంలో కలిసిపోయింది.

ఎవరైనా తన రూపాన్ని ఒక్కసారైనా మనస్సులో భావిస్తే, వాడెంత పాపాత్ముడైనా తనలోకి తీసుకొని అనుగ్రహిస్తాడు శ్రీహరి. అటువంటి హరి తననే మింగిన రాక్షసుడైన అఘాసురుణ్ణి తనలోనికి తీసుకోకుండా ఉంటాడా! (తప్పక తీసుకొంటాడు)

భయంకరుడైన అఘాసురుణ్ణి చంపి, తనలోనే లీనం చేసుకున్న కృష్ణునిపై దేవతలు పుష్పవర్షం కురిపించారు. రంభాది అప్పరఃకాంతలు నాట్యం చేశారు. గంధర్వులు గానం చేశారు, మేఘాలు మృదంగధ్వనిలా గర్జించాయి. సిద్దులంతా విజయసూచకాలైన జయజయధ్వానాలు చేశారు. తరువాత

దేవతలలో పెద్దవాడైన బ్రహ్మదేవుడు దేవలోకంలో వినబడే ఆ వాద్యాలను, ఆ జయజయధ్వానాన్నీ, ఆ గానాలను, నృత్యాలను విని, చూచి సంతోషంతో భూలోకానికి వచ్చి, ఈ చిన్న పిల్లవాడు దూడలను, గొల్లపిల్లలను ఆ మహాసర్పం చంపేస్తూవుంటే ఎలా కాపాడా డనుకుంటూ, ఆశ్చర్యపోతూ, ఇది ఎంతో మెచ్చుకోవలసిన విషయమే అనుకున్నాడు.

కొన్నాళ్ళకు ఆ కొండచిలువచర్మం ఎండిపోవడంతో చాలా కాలందాకా గోపబాలురందరికీ అది ఆడుకునే గుహలాగా పనికొచ్చింది. ఇలా కృష్ణుడు 'కౌమార' వయస్సు అయిదో ఏట అఘాసురుణ్ణి వధించాడు. అయితే ఈ వృత్తాంతం 'పౌగండ' వయస్సులో అంటే ఆరు సంవత్సరాల వయస్సులో కావించిన పనిగా గోపబాలకులు భావించారని శుకమహర్షి చెప్పగా విని పరీక్షిన్మహారాజు శుకునితో ఇలా అన్నాడు.

పరీక్షిన్మహారాజు శుకమహర్షితో ఇలా అంటున్నాడు 'ఓ యోగీంద్రా! సాధారంణంగా ముందటి అయిదేండ్ల ప్రాయాన్ని కౌమారం అని, తరువాతి అయిదేండ్ల వయస్సును పౌగండమని అంటారు కదా!. మరి కౌమారప్రాయంలో శ్రీకృష్ణుడు చేసిన కార్యాలను పౌగండప్రాయంలో చేశాడని గోపాలురు ఎలా అనుకో గలుగుతున్నారు? నిరుడు చేసిన పనిని నేడు చేసింది అనవచ్చా? ఈ విషయాన్ని క్రమంగా నాకు తెలియజేయండి.' ఇలా అడిగిన పరీక్షిత్తుతో యోగీశ్వరుడైన శుకుడు తన యోగదృష్టితో చూచి, కొంత భావించి 'వినయంతో ఒప్పే ఓ రాజేంద్రా! నీ వడిగిన విషయం మిక్కిలి రహస్యమైందిగా పెద్దవాళ్ళు శిష్యబృందానికి చెపుతారు.' అన్నాడు.

తమకెంతో ఇష్టమైన స్త్రీలయొక్క మాటలు, చేతలు ప్రియులైనవారికి ఎలా ఎప్పుడూ ఇష్టంగా ఉంటాయో అలాగే భక్తజనానికి ఇష్టుడైన శ్రీకృష్ణునివృత్తాంతాలన్నీ, భక్తులైనవారికి ఎల్లవేళలా అన్నివిధాలా ప్రియంగానే వుంటాయి.

పై రీతిగా మళ్ళీ శుకయోగి పరీక్షిన్మహారాజుతో ఇలా అంటున్నాడు. అలా అఘాసురునినోటిలో చనిపోయిన దూడలను గోపాలకులను బతికించి, వాళ్ళతో కలిసి శ్రీకృష్ణుడుకూడా దూరం వెళ్ళి

ఆ గోపబాలురతో కలిసి శ్రీకృష్ణుడు వెళ్తూ అక్కడ ఒక సరస్సును చూశాడు. ఆ సరస్సు మంచినీళ్ళతో కూడి ఉంది. చాలా లోతుగా వుంది. అందులోని కమలాలలోని, ఎర్రకలువలలోని మకరందాన్ని గ్రోలడంచేత మత్తెక్కిన తుమ్మెదల జంటలు ఝంకారం చేస్తున్నాయి. పెద్దతీగలవంటి అలలగుంపులో విహరించే కలహంసల కల కల ధ్వనులతో నిండి వుంది. పిల్లగాలివల్ల రేగిన నీటితుంపురులు కలిగి ఉంది.

గోపాలబాలురు కృష్ణునితో గూడి చల్దు లారగించుట

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

పంచాంగం

No comments:

Post a Comment

Brahma "kidnapping" the cows and gopalas - బ్రహ్మ గోవత్సములను గోపబాలకులను నంతర్ధానంబుసేయుట

బ్రహ్మ గోవత్సములను గోపబాలకులను నంతర్ధానంబుసేయుట గోపబాలురతో నేను వెళ్ళి దూడలను తీసుకొని వస్తానని పలికి కృష్ణుడు గోపబాలురతో అలా చెప్పి, దూడలను...