చేలు దున్నుకొంటూ జీవించే రైతులకు ఆనందం కలిగిస్తూ వానాకాలం వచ్చింది. తూరుపు గాలులు ఎక్కువయ్యాయి. ఇంద్రధనుస్సు కనిపించింది. సూర్యునిచుట్టూ ఆవరించిన గాలి గుడి కట్టింది. ఉత్తరాన మెరుపులు మెరుస్తున్నాయి. మబ్బులు దక్షిణంగా సాగుతున్నాయి. నీటి చేరికచేత చేపలు మొదలయిన జలచరాలకు సంతోషం కలిగింది. వానకోయిలల దప్పిక తీరింది. కార్చిచ్చులు కనబడకుండా పోయాయి. ఎండాకాలంలో సూర్యుడు తన కిరణాలతో త్రాగిన నీటినంతా వానాకాలంలో తిరిగి ఇచ్చేస్తున్నాడు.
అడవులచివర చెట్టూ పుట్టా లేకుండా సమతలంగా ఉండే చేలను దున్ని రైతులు పంటలు పండిస్తూ ఉంటారు. ఆ చేలలోని నాగటిచాళ్లు, వర్షఋతువు అనే రసికుడు భూమి అనే పడతిమీద చేసిన కొత్త గోళ్లగీతలా! అన్నట్లుగా ఉన్నాయి.
ఓ పరీక్షిన్మహారాజా! వర్షాకాలమనే ప్రియుడు సమీపించడంచేత, పుడమిపడతికి కల్గిన గగురుపాటు అనునట్లుగా మొలచి తలలెత్తి పెరుగుచున్న పైరులు అందగించాయి.
ఆ వానాకాలంలో తీవ్రమయిన గాలుల తాకిడికి కదలివచ్చిన మబ్బులు ఆకాశం నిండా అలముకొన్నాయి. లెక్కకు మిక్కిలిగా వచ్చిన ఆ మబ్బులు రెక్కలుగల కాటుక కొండలా అన్నట్లు ఎడం లేకుండా దట్టంగా కమ్ముకొన్నాయి. సూర్యచంద్రుల కాంతుల్ని అడ్డుకొన్నాయి. వర్షఋతువు అనే ప్రియుడు మదించి భూకాంతవక్షస్థ్సలం మీద నేర్పుగా జల్లిన కర్పూరపు పలుకులా అన్నట్లు గా మబ్బులనుండి వడగళ్లు రాలిపడ్డాయి. ఆ వడగళ్ల వెంబడి నల్లత్రాచుల తీరున, ఇంద్రనీల హారాలవిధంగా ఎడతెరపిలేకుండా వర్షధారలు కురిశాయి. ఆ జలధారలతో తడిసినకొండలు మద జలధారలతో నిండుగా తడిసిన మత్తగజాలవలె కనబడుతున్నాయి. కొండకొమ్ములనుండి బండ రాళ్లమీద పడుతున్న సెలయేటి నీటిధారలు చెల్లాచెదురయిన నీటితుంపరలు నలుగడలా పడుతున్నాయి. ఆ తుంపరలకు చెమ్మగిలిన నేల చిత చితలాడుతూ అడుసు అయింది. అందులో నడిచేటప్పుడు చితుకు చితుకుమని చప్పుడవుతోంది. ఆ బురదల మీదుగా పారిన నీరు వరద గట్టింది. వాగులు వంకలు ఏకమై ప్రవహించాయి. గుంపుగట్టిన రెక్కల చేపలు ఆ వరదనీటికి ఎదురీదాయి. చేపలవంటి కన్నులుగల చెలువల నెమ్మేని తళుకుబెళుకులకు తాళలేక, కళవళపడి, వణుకుతూ పారిపోతున్నవా అన్నట్లుగా మెరుపులు మేఘాలమధ్య మెరసి మాయమై పోయాయి. మెరపులవలె చపలచిత్తలయిన చెలువలు పురుషులచెంత నిలుకడగా నిలువరు సుమా అని ప్రజలకు వినబడేలాగున బ్రహ్మదేవుడు ఎలుగెత్తి చాటుతున్నాడా అన్నట్లుగా ఉరుములు ఉరిమాయి. ఆ ఉరుముల చప్పుళ్లకు నెమళ్లు జంకులేక పురులు విప్పుకొని నాట్యం చేశాయి. కేకలు పెట్టాయి. భయంకరమైన ఆ కేకలకు తాళలేక ప్రణయకలహంవల్ల విరహంతో వేగుతున్న దంపతులు పట్టుదలలు మాని ఒకరికొకరు దాసులై దగ్గరయ్యారు. కారుమబ్బులు కమ్మినందువల్ల ఇదిరేయి; ఇదిపగలు అని గుర్తించడానికి వీలులేకుండా పోయింది. అయినప్పటికి జాజిపూలు పూసి సాయంసమయాన్ని తెలియజేశాయి. చీకటి పడేటప్పటికి మిణుగురుపురుగులు మినుకుమని మెరుస్తూ మింట తారట్లాడాయి. ఎడతెరిపిలేకుండా కురిసే జడివానలో చలికి వణుకుతూ, ఎప్పుడు సూర్యోదయం అవుతుందో అని ఎదురుచూస్తూ, వంటను వండుకొని తినే వీలులేక, ఖర్జూరపుపండ్లు నేరేడుపండ్లు తిని ఆటవికులు ఆకలి తీర్చుకున్నారు. విటులపొత్తు వీడని వేశ్యవిధంగా మిన్నాగు పాములపొత్తు వీడని మొగలిపూగుత్తులు ఆటవికులకు సంతోషం కలిగించాయి. అడవిదారులు విరబూచిన మొగలి కడిమి అడవిమొల్ల కొండమల్లె పూలతావులతో నిండిపోయాయి. గరుడపచ్చల కాంతులు వెలిగ్రక్కుతూ పచ్చిక అంతటా గుబురుగా పెరిగింది. ఆ పచ్చికలు మేసిన ఆవులు బలిసి మిసమిస లాడుతున్నాయి. పాలతో నిండిన పొదుగుల బరువు వల్ల ఇటూ అటూ తిరగలేక నిలబడి నెమరు వేస్తున్నాయి. వర్షఋతువు క్షీరసమృద్ధిగల ఆవుల మందలాగ జలసమృద్ధ మయ్యింది. జింకతో నిండుగా కనబడే శివునిచేతిలాగ వానకోయిలలతో నిండుగా కనబడింది. విష్ణువనే బాణానికి ఆసనం (విల్లు) అయిన మేరుపర్వతంలాగ ఇంద్రధనుస్సుతో ప్రకాశించింది. ఎడతెగకుండా హరినామాన్ని సంకీర్తించే విభీషణుని హృదయంలాగ కప్పల బెకబెకల ధ్వనులతో కూడుకొని ఉంది. ఇంద్రోపేంద్రాదులకుగూడా ఐశ్వర్యాన్ని అనుగ్రహించే శివపూజలాగ ఆరుద్రపురుగులతో అలరారింది. సీతాదేవి చరిత్రతో జనకచక్రవర్తియాగంలాగున నాగలిచాళ్లతో అందగించింది. బహుసంవత్సరాలు కలిగిన కృతయుగంలాగ అధికమైన వర్షలతో నిండిపోయింది.
ఎండక, నేలమీద వ్రాలిపోక, చీడపీడలు సోకక, బలుపునకు గుర్తుగా నల్లనిచారలు గలిగి, చక్కగా పైరులు పెరిగాయి. జనులకు కష్టాలు గట్టెక్కాయి.
ఓ పరీక్షిన్మహారాజా! ఎంత సంపదగలిగి ఉన్నప్పటికీ గొప్పవాడు గర్వంతో మిడిసి పడడు. ఆ తీరుగా నదులలోని నీరంతా వచ్చి తనలో చేరుతున్నా సముద్రుడు హద్దు మీరక అణగి ఉన్నాడు.
ఆ వర్షాకాలంలో శ్రీకృష్ణుడు అడవుల చివరలలో ఆవులను మేపుతూ, బలరామునితోను, గోపాలకులతోను గూడినవాడై కందమూలఫలాలు తింటూ, మడుగులగట్లమీద, రాతిచట్టులమీద కూర్చుండి ప్రీతిగా చలుదులు భుజించాడు.
అలాంటి వేళలో, బృందావనం అనే ఆకాశంలో శ్రీకృష్ణుడనే మేఘం అందగించింది. లోకాలకు మైమరపుకలిగించె పిల్లనగ్రోవి పాటయే ఆ మేఘానికి రసవంతమయిన గంభీరమైన ఉరుము అయ్యింది. చక్కనైన చిరునవ్వు కాంతియే మెరుపుతీగ అయింది. తలచుట్టు చక్కగా ఉన్న నెమలిపురి దండయే ఇంద్రధనుస్సు అయ్యింది. దయతోగూడిన కడకంటి చూపులనుండి వెల్లిగొనే అమృతవర్షమే జలధారల జడివాన అయింది. ఈ విధంగా భాసించిన శ్రీకృష్ణుడు అనే నీలమేఘం తన వెన్నంటివచ్చే గోపాలురు, మునులు అనే చాతకపక్షుల తాపాలు తొలగించింది.
ఓ రాజా! శ్రీకృష్ణుడు తాను లక్ష్మీదేవికి భర్తయగు విష్ణువే అయినా, లోకమర్యాదను అనుసరించి, ముందుగా ఆవులను, ఎద్దును, దూడలను పూజించి, తరువాత వర్షాకాలసంపదకు అధిదేవత అగు లక్ష్మీదేవిని పూజించాడు.
ఈ విధంగా శ్రీకృష్ణుడు వర్షాకాలానికి అనుగుణంగా ప్రవర్తిస్తూ కాలం గడిపాడు. అపుడు
శరదృతు వర్ణనము
శ్రీ మహా భాగవతము
శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము
శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము
శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము
శ్రీ మహా భాగవతము పంచమస్కంధము
శ్రీ మహా భాగవతము షష్టస్కంధము
శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము
శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము
శ్రీ మహా భాగవతము నవమస్కంధము
శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
పంచాంగం
శ్రీ మహా భాగవతము
శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము
శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము
శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము
శ్రీ మహా భాగవతము పంచమస్కంధము
శ్రీ మహా భాగవతము షష్టస్కంధము
శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము
శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము
శ్రీ మహా భాగవతము నవమస్కంధము
శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
పంచాంగం
No comments:
Post a Comment