Wednesday, April 1, 2026

The praise of Lord Krishna, who is in the womb of Devaki, by the gods Brahma, Shiva and other deities - బ్రహ్మాది దేవతలు దేవకీ గర్భస్థుండగు శ్రీకృష్ణుని స్తుతించుట

బ్రహ్మాది దేవతలు దేవకీ గర్భస్థుండగు శ్రీకృష్ణుని స్తుతించుట

సత్యాన్నే వ్రతంగా కలవాడివి. మోక్షప్రాప్తికి సాధనరూపమైనవాడివి. భూత భవిష్య ద్వర్తమానాలు మూడింటిలో ఉండేవాడివి, పంచభూతాలకు పుట్టుక స్థానమైనవాడివి, అయిదు భూతాలలో అంతర్యామిగా ఉండేవాడివి, అయిదుభూతాలు అంతరించిన తరువాత కూడా మిగిలి ఉండేవాడివి, సత్యాన్ని మాట్లాడేవాడివి, అన్నింటినీ, అందరినీ సమానంగా చూచేవాడివి ఇట్టి నిన్ను శరణు వేడుతున్నాం. నీ మాయాశక్తిచేత జ్ఞానశూన్యులైనవారు నిన్ను అనేకవిధాలుగా అనుకొంటున్నారు. కాని జ్ఞానులుమాత్రం ఏకచిత్తంతో అన్నీ నీవే అని అంటారు.

(సమదర్శనం - అన్నింటిని, అందరిని సృష్టించింది, అన్నింటిలో, అందరిలో ఉన్నది పరమాత్మే కనుక ఆయన అన్నింటిని, అందరిని సమానంగా చూస్తాడు. ఆయనది సదా సమదర్శనమే! పరమాత్మతత్త్వాన్ని సృష్టి తత్త్వాన్ని తెలుసుకొన్న జ్ఞానిదికూడా సమదర్శనమే!)

అంతేకాకుండా, ఇంకా మూలప్రకృతి పాదుగా, సుఖదుఃఖాలు రెండు ఫలాలుగాా; సత్త్వరజస్తమోగుణాలు మూడు వేళ్ళుగా, ధర్మార్థకామమోక్షాలుగా చెప్పబడే పురుషార్థాలు నాలుగు రసాలుగా, శబ్దస్పర్శరూపరసగంధాలను తెలుసుకొనే చెవి, చర్మం, కన్ను, నాలుక, ముక్కు - అయిదు ఇంద్రియాలుగా - జ్ఞానేంద్రియాలుగా, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలనే ఆరు స్వభావాలుగా, ఆకలి, దప్పిక, శోకం, మోహం, ముసలితనం, మరణం అనే ఆరు ఊర్ములుగా, రసం, రక్తం, మాంసం, మేదస్సు, అస్థి, మజ్జ, శుక్రం అనే ఏడుధాతువులు పైపొరలుగా, భూమి, నీరు, అగ్ని వాయువు, ఆకాశం అనే భూతాలు అయిదు, బుద్ధీ, మనస్ఫూ, అహంకారం అనేవి మూడు - మొత్తం ఎనిమిది కొమ్మలుగా, రెండుకళ్ళు, రెండుచెవులు, ముక్కురంధ్రాలు రెండు, నోరు, మలమూత్రద్వారాలు రెండు - మొత్తం తొమ్మిది రంధ్రాలు చెట్టుతొర్రలుగా, ప్రాణాపానవ్యానోదానసమానాలనే పంచప్రాణాలు, నాగ, కూర్మ, కృకర, దేవదత్త ధనంజయాలనే అయిదు ఉపప్రాణాలు మొత్తం పదిప్రాణాలు - ఆకులుగా, జీవుడు, ఈశ్వరుడు పక్షులజంటగా ఉండే సంసారవృక్షాన్ని - పుట్టించటానికీ, రక్షించటానికీ, నశింపచేయటానికీ ప్రభువవు నీ వొక్కడివే!

(సామాన్య దృష్టికి ఇంత అద్భుతమైన ఈ సంసారమహావృక్షాన్ని సృష్టించేది బ్రహ్మ అనీ, రక్షించేది విష్ణువనీ, లయం చేసేది శివుడనీ అనిపిస్తుంది. కాని, తాత్త్వికంగా / లోతుగా చూస్తే ఉన్నది ఒక్కపరమాత్మే - "ఏకం సత్‌" పరమాత్మ నామరూప గుణాలు లేనివాడు. ఆయన తనంత తానుగా గుణాత్మకుడు - త్రిగుణాత్మకుడు - అయినపుడు సృష్టి, స్థితి, లయాలు జరుగుతున్నాయి. అందుకే "సంసారవృక్షంబు గలుగంజేయం, గావ, నడంగింప రాజ వొక్కరుండ వీవ” అని చెప్పటం జరిగింది)

జ్ఞానులైనవారు ఏది సత్యమో, ఏది నిత్యమో తెలిసినవారు ఏ వైపునకు వెళ్ళకుండా, తమ దేహాన్ని మనస్సును నీయందే నిలిపి, సంసారమనే సముద్రాన్ని నీ పాదమనే నావ ఆధారంగా, ఆవుదూడ అడుగును దాటినంత సులభంగా దాటగలుగుతారు.

(మనస్సును అన్యమైన వానివైపు పోనీయకుండా, పరమాత్మయందే లగ్నం చేయుట - అనన్య భక్తి. సంసారసాగరాన్ని దాటటానికి, మోక్షాన్ని పొందటానికి ఈ అనన్యభక్తే అద్భుతసాధనం.)

నీవు సజ్జనులకు మేలు, దుర్జనులకు కీడు కలిగించే అనేకశరీరాలు ధరించి, అన్నివేళల్లో లోకానికి క్షేమాన్ని కలుగ చేస్తూనే ఉంటావు.

కొందరు తాము అన్నీ తెలిసినవాళ్ల మనుకొని, పనికిమాలిన విషయాలు తెలుసుకొని, నీ నామమాహాత్యం తెలిసికూడ నామసంకీర్తనం చెయ్యరు. అధోగతిపాలైనవారిమార్గంలోనే తామూ పరుగులు పెడతారు. (నీచజన్మ లెత్తి మహాదుఃఖాల పాలవుతారని భావం)

ప్రభూ! గొప్పవారు నీవారై, తమ హృదయాల్ని నీయందే నిలిపి, జననమరణ భయం లేనివాళ్లై, ఏ అడ్డంకులూ లేక, ఉన్నతోన్నత స్థానమైన పరమపదంలో వర్ధిల్లుతూ ఉంటారు.

ఓ విష్ణుమూర్తి! బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, సన్న్యాసులు అనే నాలుగుఆశ్రమాల ప్రజలు నిన్ను సేవిస్తుండగా, అన్నిలోకాల్లో సత్త్వమయం, పరిశుద్ధం, క్షేమంకరం అయిన దేహాన్ని నీవు పొందుతావు.

(హరి అంటే భక్తుల పాపాలను హరించువాడు. "హరి యను రెండక్షరములు, హరియించును పాతకంబు అని కదా కృష్ణశతక పద్యం చెపుతూ ఉంది!)

శ్రీహరీ! నీవు సత్త్వస్వరూపుడివి. అలా కాకుంటే నీ దేహం విజ్ఞానాన్ని కలిగించేది, అజ్ఞానాన్ని తొలగించేది ఎలా అవుతుంది? రజస్తమో గుణాల్లోకూడ నీవు ప్రకాశిస్తుంటావు. కాని, సత్త్వమయమైన నీ సహజస్వరూపాన్ని సేవిస్తేనే సాక్షివై నీవు సాక్ష్యాత్కరిస్తావు. మాటకు, మనస్సుకు అతీతమైన మార్గంలో- గుణాలు, జన్మలు, కర్మలు లేనట్టి నీ రూపాన్ని నీ నామాన్ని మహాత్ములు తెలుసుకొంటారు. నిన్ను భావించుకొంటూ, నిన్ను గూర్చి వింటూ, నిన్ను ధ్యానించుకొంటూ, నిన్ను స్తుతించుకొంటూ ప్రకాశించే వ్యక్తి జన్మరాహిత్యాన్ని పొందుతాడు. నీ పాదభక్తుడౌతాడు.

ఓ పురుషోత్తమా! ఓ ఈశ్వరా! నీవు జన్మించటంవల్ల భూభారం తొలగిపోయింది. నీ పాదపద్మాలు ఆదరువుగా నీ దయతో భూమ్యాకాశాలను పూర్తిగా చూడగలం.

(ద్వాపరం నాటికే దుష్టులసంఖ్య భూమిమీద పెరిగింది. భూదేవి వాళ్ళను భరించలేని స్థితి ఏర్పడింది. దుష్ట సంహరణారం శ్రీహరి అవతరణ జరగాలి. అప్పుడే భూభారం తగ్గుతుంది.)

పుట్టడం, పెరుగడం, మరణించడం, మొదలైన వికారాలు ఏవీ లేని నీవు పలుమార్లు పుట్టటం అంటే, అది కేవలం నీకు ఒక క్రీడేగాని, నిజంగా నీవు పుట్టటమా? పుట్టడం, పెరుగడం, మరణించడం మొదలైన దశలన్నీ మాయ. ఆ మాయ జీవులనన్నింటినీ ఆవరించి ఉంటుంది. కానీ, ఆ మాయ నిన్ను కూడా చుట్టుకొన్నట్లు నీ చెంతనే ఉన్నా, నిన్ను ఆవరించే శక్తి దానికి లేదు. సర్వేశ్వరా! ఆ మాయామయాలైన క్రియల్లో ఏ వ్యామోహం లేని- 'ఏకో నారాయణో హరిః' అన్నట్లు ఒంటరివాడవు నీవు మాత్రమే!

మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, హయగ్రీవ, పరశురామ, శ్రీరామావతారాలెత్తి, దుష్టులబారినుండి దయతో లోకాలను కాపాడిన నీకు మ్రొక్కుతాము. ఇప్పుడు భూభారాన్ని తొలగించు స్వామీ!

ముకుందా! దయలేని దుర్మార్గులు కంసాదులు విజృంభించి ఎల్లప్పుడు బాధించటంవల్ల లోకం దుఃఖంలో మునిగి ఉంది. ప్రీతితో దీన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. తల్లి కడుపునుండి వెడలిరా స్వామీ!

అని పలికిన తర్వాత దేవకీదేవిని చూస్తూ

అమ్మా! దేవకీదేవీ! నీ గర్భంలో ఆదిపురుషుడైన శ్రీమహావిష్ణువు ఉన్నాడు. రేపు జన్మిస్తాడు. కంసునివల్ల ఏ మాత్రం భయం లేదు. ఇది నిజం. ఇకముందు మా అందరికి శుభం కలుగుతుంది. యాదవులంతా సంతోషంతో పొంగిపోగా ఎల్లప్పుడు నీ కడుపు చల్లగా ఉండాలి (నీవు సుఖంగా ప్రసవించాలి - అని భావం)

అని ఈ విధంగా దేవతలు విష్ణుమూర్తిని స్తుతించి, దేవకీదేవిని దీవించి, శివుడు, బ్రహ్మ ముందు నడువగా తమ తమ స్థానాలకు వెళ్ళారు. తరువాత.




No comments:

Post a Comment

The incarnation of Lord Krishna - శ్రీ కృష్ణావతార ఘట్టము

శ్రీ కృష్ణావతార ఘట్టము దేవకీదేవి ప్రసవవేదన పడుతుండగా దుర్జనుల మనస్సుల్లో బాధ కలగటం, సజ్జనుల్లో బాధలు తొలగటం అగుపించింది. దేవకీదేవి దేవదేవుడై...