Monday, April 6, 2026

Lord Krishna performing Kaliyamardana - శ్రీకృష్ణుడు కాాళియమర్దనము గావించుట

శ్రీకృష్ణుడు కాాళియమర్దనము గావించుట

ఓ పరీక్షిన్మహారాజా! ఒకనాడు ఒక్క బలరాముడు తప్ప, శ్రీకృష్ణుడు మిగిలిన గొల్లపిల్లలు అందరు తన వెన్నంటి రాగా, ఆవులను తోలుకొని అడవికి వెళ్లాడు. ఎండలో తిరగడంచేత కొంత సమయం గడిచేటప్పటికి ఆవులకు గొల్లలకు దప్పిక కలిగింది. యమునానదికి వెళ్లి, నదిలోని విషం కలిగిన నీటిని తాగి, ప్రాణాలు పోగొట్టుకొన్నారు. వెంటనే కృష్ణుడు తన చూపులు అనే అమృతధారలను వారిపై కురిపించి, వారిని బ్రదికించాడు. అపుడు వారందరు శ్రీకృష్ణుని దయవల్లనే తాము బదికినట్లు తెలిసికొని, సంతోషంతో గొల్లపల్లెకు వెళ్లారు.

ఓ పరీక్షిన్మహారాజు! అపుడు శ్రీకృష్ణుడు కాళియసర్పవిషంచేత కలుషితమైన యమునానదిని స్వచ్చమైన దాన్ని చేయాలని సంకల్పించి ఆ కాళియుణ్జి ఆ నదినుండి దూరంగా తరిమివేశాడు.

అని శుకమహర్షి చెప్పగా విన్న పరీక్షిన్మహారాజు ఈ విధంగా ప్రశ్నించాడు. ఓ మునిశ్రేష్ఠా! చాలా లోతైన ఆ యమునానది మడుగులో ఉన్న పాముపొగరును శ్రీకృష్ణుడు ఏ విధంగా అణచాడు? ఎలా బయటకు వెళ్లగొట్టాడు? అక్కడే ఆ పాము చాలాకాలం ఉండడానికి కారణం ఏమిటి? అంతా వివరంగా తెలియజెప్పు.

ఓ శుకమహర్షీ! ఆవులను కాపాడిన శ్రీకృష్ణుని కథామృతాన్ని చెవులారా ఎంతవిన్నా అమాయకులకైనా కూడ తనివి తీరదంటే ఇంక మాబోటి భక్తుల విషయం చెప్పేదేమిటి? కావున మరింతగా విస్తరించి వినిపింపవయ్యా!

అని పరీక్షిన్మహారాజు పలుకగా శుకమహర్షి మళ్లీ ఈ విధంగా అన్నాడు.

ఓ పరీక్షిన్మహారాజా! యమునా నదిలో మిక్కిలి లోతైన పెద్దమడుగు ఉంది. అందులో కాళియుడు అనే పేరుగల పెద్ద పాము ఉంది. అది తన విషాగ్ని జ్వాలలతో, ఆ నదినీటిని మరుగుతూ ఉప్పాంగేలా చేస్తూ ఉంటుంది. ఆ మడుగుమీదుగా ఎగిరివెళ్లే పక్షులు ఆ వేడి సోకి అందులో పడి చచ్చిపోతూ ఉంటాయి. ఆ మడుగులోని కెరటాల మీదుగా వచ్చిన గాలి సోకిందంటే చాలు. ఎటువంటి బలం కల ప్రాణి అయినా సరే చచ్చిపోవలసిందే. దుష్టసంహారం చేయడంకోసం భూమిమీద అవతరించిన శ్రీకృష్ణుడు, సర్పవిషంతో కూడిన ఆ నదిలోని నీటిని, స్వచ్చమైన దాన్నిగా చేస్తాను అని సంకల్పించాడు.

ఈ విధంగా మనస్సులో నిశ్చయించుకొన్న వాడయి శ్రీకృష్ణుడు ఒడ్డున ఉన్న కడిమిచెట్టు మీదికి ఎక్కాడు. అది శ్రీకృష్ణుని అడుగుల స్పర్శను నోచుకోవడానికి తగినంత పుణ్యం గత జన్మలలో చేసికొని ఉంది. అది పెద్దవి చిన్నవి అయిన కొమ్మలతోను రెమ్మలతోను కూడుకొని ఉంది.

(ఈ మడుగు మీది విషపు గాలి తగిలి ఆకాశంలో ఎగిరిపోయే పక్షులే చచ్చిపోతున్నాయి కదా! అటువంటిది యమున ఒడ్డుమీద ఈ కడిమిచెట్టు ఎలా బతికి ఉంది అనే సందేహం కలుగవచ్చు. గత జన్మలో అది శ్రీకృష్ణుని అడుగులు సోకడానికి తగినంత పుణ్యం చేసుకుంది. పాదస్పర్శ జరగాలంటే అది జీవించి ఉండాలి. ఇంతకీ దాని పూర్వపుణ్యం కారణం. ఇదే కవి సమర్థనం.)

శ్రీకృష్ణుడు నడుముమీది బట్టను బిగించి కట్టుకొని, నెమిలి పింఛాన్ని జుట్టుముడితో బంధించి, ఉత్సాహంతో జబ్బలు చరుస్తూ, రెండు పాదాలు కూడతీసికొని, ఆ కడిమి చెట్టుకొమ్మ కొననుండి మడుగులోనికి దూకాడు. ఆ అదురుపాటుకు నాలుగు దిక్కులు పిక్కటిల్లాయి. మడుగులో గుభగుభ ధ్వనులు హెచ్చైపోయాయి.

మహాప్రతాపవంతుడైన శ్రీకృష్ణుడు దూకగానే, ఆ వేగానికి ఆ మడుగు కలతపడిపోయింది. విషమయమైన తరంగాలచేతను, కుతకుత ఉడికే నీటి బిందువులచేతను, నీటి బుడగలచేతను భయాన్ని కలిగిస్తూ కల్లోలమై పొంగుతూ నాల్గువందలమూరల మేర వ్యాపించింది.

పూర్వం మత్స్యావతారాన్ని ఎత్తి, సముద్రంలో బాగా ఈదిన అనుభవం ఉన్నవాడు కనుక శ్రీకృష్ణుడు ఆ మడుగులో పెద్ద పెద్ద అలలు పైకి లేచేటట్లు నదిని కలచివేస్తూ, అటూ ఇటూ భయంకరంగా ఈదాడు. దానితో కాళియుని మనస్సులో కోపాగ్ని జ్వాలలు ఎగదోసినట్లయింది.

ఆ సమయంలో, వీడు చిన్నపిల్లవాడు. పైగా ఒంటరివాడు. ఇటువంటివాడు అయివుండి, నా మడుగును క్షోభింపజేశాడు. నేను ఈ మడుగులోపల ఉన్నాననే సంగతి వీనికి తెలిసి ఉండదు. నాకు కోపం వచ్చిందంటే ఎంత తీవ్రంగా ఉంటుందో, లోకానికి తెలియజేయడానికి ఇదే అదను. నా క్రోధాగ్నిజ్వాలలతో ఇతణ్ణి బూడిద చేసి, వీనిప్రాణాలు తీస్తాను.

అని ఈ విధంగా అనుకొని, ఇంకా విజృంభిస్తూ, కాళియుడు సర్పసైన్యంతో కలిసి, విషాగ్ని జ్వాలలకాంతులు అంతట వ్యాపిస్తూ ఉండగా, వేగంగా వెళ్లి, శ్రీకృష్ణుణ్ణి కాటు వేశాడు. ఆ శ్రీకృష్ణుడు నీలమేఘంలా ఉన్నాడు. జంకు గొంకు లేకుండా ఆ మడుగునీళ్లలో స్వేచ్చగా విహరిస్తున్నాడు. ధైర్యగాంభీర్య గుణాలు కలిగి ఉన్నాడు. బంగారురంగు గల పట్టు వస్త్రాన్ని కట్టుకొని ఉన్నాడు.

సర్పరాజయిన కాళియుడు శ్రీ కృష్ణుణ్ణి కాటువేసి, అంతటితో ఊరుకోకుండా, తన నోటినుండి విషపుమంటలు వెలిగ్రక్కుతూ, జంకూ గొంకూ లేకుండా తన పొడవైన శరీరంతో శ్రీకృష్ణుణ్ణి వేగంగా బంధించివేశాడు.

ఈ రీతిగా శ్రీకృష్ణుడు కాళియసర్పంచేత బంధింపబడి, కాళ్లుచేతులు ఆడనందువల్ల కదలిక మెదలిక లేకుండా ఉండడం చూశారు గొల్లపిల్లలు. అతడు తమకు ప్రాణస్నేహితుడు. అతని మహిమలు వారికి తెలియవు. తమ సంపదలు, భార్యలు, కోరికలు మనస్సులు అన్నింటిని శ్రీకృష్ణునికి సమర్పించి, సర్వస్వం శ్రీకృష్ణుడే అని నమ్మినవారు కావున

అదిగో! ఆ పాము మన కృష్ణుణ్ణి కరచింది, అంతటితో వదలిపెట్టకుండా, పొగరుబోతు తనంతో అతని శరీరమంతా చుట్టుకొని కదలకుండా బంధించివేసింది. ఇంక ఇప్పుడేమి చేస్తాం? ఎక్కడికి వెళ్తాం? దీన్ని లొంగదీయగల సమర్థులెవరు? ఏమిటి ఉపాయం? అని గొల్లపిల్లలంతా శోకంతో బొబ్బలు పెడుతూ నేలమీద పడిపోయారు.

శ్రీకృష్ణుణ్ణి కాళియసర్పం కరవడంచూచిన ఆవులు, ఎద్దులు, దూడలు అన్నీ దుఃఖంతో మేత మేయడం మానేసి అరుస్తూ ఉండిపోయాయి.

ఓ రాజా! కాళియుడు శ్రీకృష్ణుణి కరచి చుట్టివేయడంతో, ఎన్నో ఉత్పాతాలు సంభవించాయి. భూమి కంపించింది. ఆకాశంనుండి నిప్పురవ్వలు రాలుతూ కనిపించాయి. గొల్లపల్లెలో ఉండే ఆడవారికి కుడికన్నులు, మగవారికి ఎడమ కన్నులు అశుభాన్ని సూచిస్తూ అదిరాయి.

గొల్లపల్లెలో ఉన్న నందుడు యశోద మొదలయిన గొల్లవారు ఆడవారు, మగవారు అందరు ఆ దుశ్శకునాలు చూచి, భయపడిపోయారు. శ్రీకృష్ణుని సామర్థ్యం తెలియక, గొల్లపిల్లలు ఆవులమందలతో కలిసి ఉన్న శ్రీకృష్ణుడు, ఎక్కడయినా ఆపదలో చిక్కుకొన్నాడేమో అని ఆరాటపడ్డారు. మిక్కిలి ప్రేమతో పిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరు పెద్దపెట్టున ఆక్రందన చేస్తూ గొల్లపల్లె నుండి బయలుదేరారు.

ఓ రాజా! ఈ విధంగా గొల్లపల్లెలోని వారంతా, శ్రీకృష్ణునిశక్తి తెలియక, అజ్ఞానంతో అతనిజాడ తెలుసుకొనడంకోసం వెడుతూ ఉంటే, అతనిశక్తి తెలిసినవాడైనా బలరాముడు వారిని ఆపు చెయ్యలేదు. పైగా పకపక నవ్వుకొంటూ, వారిని గమనిస్తూ ఊరుకున్నాడు.

బలరాముడు నందుడు మొదలయిన గొల్లలు అడవిదారిలో శ్రీకృష్ణుణ్ణి వెదుకుతూ వెళ్లుతున్నారు. ఆవులను కాచే గోపబాలుర అడుగుజాడలు, ఆవుల అడుగుజాడల నడుమ శ్రీకృష్ణుని అడుగుజాడలు కనబడుతున్నాయి. వాటి అడుగుల జాడలలో ఉత్తమ సాముద్రిక చిహ్నాలయిన యవరేఖ, అంకుశరేఖ, హలరేఖ, కమల రేఖ, కులిశరేఖ, చక్రరేఖ, చాపరేఖ, ధ్వజరేఖ మొదలయిన రేఖలు ఆ అడవిదారికి ఆభరణాలుగా అందంగా ఉన్నాయి. ఆ జాడల వెంబడి దారి తప్పకుండా వెళ్లి, కాళియుని భయంవల్ల అక్కడికి వెళ్లడానికి అందరూ భయపడే కాళిందీనది ఒడ్డుకు చేరారు. ఏటినడుమ ఎవరికీ లొంగని బలంకల కాళియుడు కరవడంచేత చేష్టలుడిగి, ఆ పాము శరీరంతో శరీరమంతా చుట్టుకొన్నందువల్ల, సొమ్మసిల్లిపడి ఉన్న శ్రీకృష్ణుణ్ణి చూచి, ఒడ్డున నిలబడి, దుఃఖం ఆపుకోలేక, కృష్ణా! కృష్ణా! అని గొంతెత్తి విలపిస్తూ తమ దురదృష్టాన్ని తిట్టుకొనే కృష్ణుని తోడివారయిన గొల్లకుఱ్ఱల్ని చూశారు. మేతలు మాని, రెప్ప వేయకుండా, దుఃఖంతో శ్రీకృష్ణుణ్ణే చూస్తూ ఉండే గోవుల్ని దూడల్ని చూశారు. (ఈ గొల్లపిల్లలు, ఆవులు ఆనాటి ఉదయమే శ్రీకృష్ణునితోబాటుగా, గొల్లపల్లినుండి అడవికి వచ్చినవారన్నమాట,) ఈ సన్నివేశం అంతా చూచిన గోపికలు యశోదను కౌగిలించుకొని, శ్రీ కృష్ణునిచేష్టలు తలచుకొని, ఈ విధంగా విలపిస్తున్నారు.

శ్రీకృష్ణా! మేము నీకు ఎదురుగా వస్తే నీవు మాకు ఎదురు వచ్చేవాడవు. ఈ వేళ మేము వచ్చినా నీవెందుకు ఎదురు రావడం లేదు? మేము నీకేసి చూస్తే చాలు. నీవు దయతో మా వైపునకు చూచేవాడవు. నేడు మేము నిన్ను చూస్తూ ఉన్నా నీవు మాకేసి చూడడం లేదు. మేము కృష్ణా! అని పిలిస్తే చాలు 'ఓ' అని వెంటనే గట్టిగా ఉత్సాహంతో బదులు పలికేవాడవు. నేడు మేము ఎంత పిలిచినా నీవు పలకడం లేదు. మేము నిన్ను తలచుకొంటే చాలు. మమ్మల్ని గురించి తలచేవాడవు. ఈనాడు ఆ ఆలోచనే నీకు రావడం లేదు అని గోపికలు భక్తితో పరవశించిన భక్తురాళ్లవలె పలికి ఒళ్లు మరచిపోయారు.

అప్పుడు నందుడు యశోద మొదలైన గొల్లవారంతా అధికమైన శోకంతో శ్రీకృష్ణుణ్ణి చూచి, ఈ విధంగా అన్నారు.

తామరపూలవంటి కన్నులు గల ఓ శ్రీకృష్ణా! విషాన్ని రొమ్ములలో దాచుకొని వచ్చిన దుష్టరాక్షసి పూతన ఇచ్చిన పాలు త్రాగి అరిగించుకొన్న అద్భుతమైన శక్తి కలిగినవాడివి గదా! అటువంటి నీకు ఈ పాము విషం ఎక్కిందంటే ఎంత ఆశ్చర్యకరమైన విషయమో కదా!

అయ్యో! బిడ్డా! భయంకరమైన ఆ సర్పం కోపంతో నిన్ను కరుస్తూ ఉంటే ఎంతగా వణికిపోయావో? నీ దౌర్భాగ్యాన్ని ఎంతగా తిట్టుకొన్నావో? మాకోసం ఎంతగా పలవరించిపోయావో గదా?

బిడ్డా! ఈ పాము మమ్మల్ని కరవకుండా నిన్నెందుకు కరచిందో కదా! నీవు క్షేమంగా ఉంటే మాకు ఏ ఆపదలూ రాకుండా కాపాడుతూ ఉంటావు. నాయనా! నీకు ఆపద కలిగితే నిన్ను మేము రక్షించలేము కదా!

ఓ కృష్ణా! ఈ వేళ ఎప్పటిలాగ మమ్మల్ని గౌరవంగా ఎందుకు చూడవు? స్నేహితులతో ఏకాంతంగా ఎందుకు మాటాడవు? చెవులకు ఇంపుగా కాళ్లగజ్జెలు మ్రోగేవిధంగా తల్లుల ఎదుటకు వచ్చి ఎందుకు నాట్యం చేయవు? గొల్ల పడుచులచో పరిహాస ప్రసంగాలు ఎందుకు చేయవు?

తండ్రీ! కృష్ణా! నీవు ఈ విధంగా పాముకు చిక్కిపోయావే! ఇంక మా చెవులు సఫలములయ్యేలా మాతో ఎవరు మాటాడుతారు? మా కాళ్లు చేతులు ధన్యములయ్యే విధంగా ఎత్తుకోమని మా పైకి ఎవరు ఎగబ్రాకుతారు? మా కళ్లు చల్లగా ఎవరు చిరునవ్వులు చిందిస్తారు? నోటికింపుగా మా చేత మంచి పాటలు ఎవరు పాడిస్తారు? ఇటుపైన మా ఆలనా పాలనా చూచే వారెవరు? నీ యందే మా మనస్సులు లగ్నమైపోయాయి. నిన్ను విడిచి వెళ్లలేము. ఇంక మాకు ఇళ్లు వాకిళ్లు అక్కరలేదు. నీవు ఎక్కడ ఉంటే అదే మా ప్రపంచం. నీవు లేని ఈ లోకం మాకెందులకు?

ఈ విధంగా నందాదులయిన గొల్లవారంతా ఒకరి నొకరు పట్టుకొని దుఃఖిస్తున్నారు. కృష్ణుణ్ణి విడిచి బ్రతుకలేక దుఃఖంతో కాలిపోతూ అతనితో బాటే మనంకూడా మడుగులోపడి ప్రాణాలు విడిచి పెట్టేద్దాం - అని మడుగులో దూకడానికి సిద్ధమయ్యారు. భగవంతుని అంశావతారమైనవాడు, శ్రీకృష్ణునిశక్తిసామర్థ్యాలు తెలిసినవాడు అయిన బలరాముడు వారిని ఆపు జేసి, ముందు ముందు ఏమి జరుగబోతోందో మీకు తెలియదు. కనుక ధైర్యం విడిచి పెట్టకండి. ఓర్చుకొని వేచిచూడండి అని చెప్పాడు.

గొల్లపల్లెలో ఉండే గొల్లలందరు, తమ ఆలుబిడ్డలతో వచ్చి, తనకోసం విలపించడం చూచి, శ్రీకృష్ణడు ఏమీ చేతకాని సామాన్య మానవునివలె రెండుగడియల సమయంమాత్రం ఊరుకున్నాడు.

అపుడు శ్రీకృష్ణుడు తన శరీరాన్ని బాగా పెంచాడు. కాళియుని చుట్టలు విడిపోయాయి. పాము శరీరం బాగా వేడెక్కి పోయింది. దానితో కరవడం మానేశాడు. అలసిపోయాడు. పెద్దగా నిట్టూరుస్తూ పడగలు పైకెత్తాడు. ముక్కులనుండి విషం చిమ్ముతూ, ఏమీ చెయ్యలేక, కృష్ణుణ్ణి విడిచి, దూరంగా నిలబడ్డాడు. పాగచూరిన కట్టెలాగ కాంతిని కోలుపోయాడు.

మహాపరాక్రమ వంతుడయిన ఆ శ్రీకృష్ణుడు, జంకుగొంకు లేకుండా, ఆ పాముపడగలమీద చేతితో ఒక్క చరపు చరిచాడు. గరుత్మంతునివలె ఆ పాము రెండుదౌడలు చిక్కబట్టి. కళ్లనుండి విషాగ్నులు బయటకు ప్రసరిస్తూ ఉండగా, దాన్ని పైకెత్తి గిరగిర త్రిప్పి విసరివేశాడు. దానితో ఆ భయంకరమైన సర్పం యొక్క గర్వం చాలా భాగం అణగిపోయింది.

ఈ విధంగా పామును విసరికొట్టి, రెట్టించిన వేగంతో జగదేక వీరుడయిన శ్రీకృష్ణుడు కదిలాడు.

శ్రీకృష్ణుడు అనే ప్రసిద్ధనర్తకుడు కాళియుని పెద్ద పెద్ద పడగలమీదికి ఎక్కి మిక్కిలి నేర్పుతో నాట్యం చేశాడు. ఆ సమయంలో ఆ పాము పడగలు, కెంపులు మొదలయిన రతనాలు పొదిగిన విశాలమయిన నాట్యమండపంలా ప్రకాశించాయి. యమునానదిలోని పెద్దపెద్ద కెరటాలచప్పుళ్లు, ఆ నాట్యానికి సహకారం అందించే మద్దెలచప్పుళ్లవలె ఉన్నాయి. ఆ బృందావనంలో తిరిగే తుమ్మెదలయొక్క ఝంకారం, వీనులవిందుగా ప్రక్కనున్న గాయకులు అందించే సహకారగానంలా ఉంది. ఆ నదిలోని రాజహంసలు, బెగ్గురు పక్షులుచేసే శ్రావ్యమైన ధ్వనులు, తాళాల మ్రోతలవలె ఉన్నాయి. ఆ రమణీయ సన్నివేశాన్ని ఆకాశంలో ఉన్న దేవతలు, గంధర్వులు సభలో సుఖంగా కూర్చుండి, నాట్యం చూస్తూవున్న ప్రేకకులవలె ఉన్నారు.

తన కడుపులో లోకాలన్నీ దాచుకొన్న గోపాలకృష్ణుడు రాక్షస సంహారం చెయ్యడంకోసం భూమిమీద అవతరించాడు. అతడు కాళియునిపడగలను రంగస్థలంగా చేసుకొని, తరగనిదర్పంతో నాట్యం చేశాడు. ఆడాడు, పాడాడు, కేకలు వేశాడు, కేరింతలు కొట్టాడు. ఆతనిఅడుగుల తాకిడికి కాళియునితలప్రాణం తోకకు వచ్చినట్లయింది.

సిద్దులు, సాధ్యులు, చారణులు, గంధర్వులు, దేవతలు, మునులు, మున్నగువారి భార్యలు ఆ పిల్లనగ్రోవులు మొదలైనవి సంతోషం కలిగించేలా ఊదుతూ నాట్యం చేస్తున్న శ్రీకృష్ణునిమీద పూలవానలు కురిపించారు.

ఈ విధంగా దుర్మార్గులను శిక్షించడంలో యమునివంటివాడయిన శ్రీకృష్ణుడు. వడిగలిగిన కాళియుని పడగలమీద తాండవం చేశాడు. కాళియుని చేవ చచ్చింది. వరుసగా ఉన్న పడగలనుండి రక్తమాంసాలు వెలిగ్రక్కాడు. కళ్లనుండి విషం కారిపోయింది. చొరవ తగ్గి నీరసించిపోయాడు. ప్రాణాలు పైపైకి రాగా తనలో ఈ విధంగా అనుకొన్నాడు.

దేవతలైనా సరే! నా విషాగ్ని జ్వాలలు తాకాయంటే చాలు, గిలగిల లాడుతూ ప్రాణాలు విడిచిపెట్టేస్తారే! ఈ వేళ ఈ పిల్లవాడు ఇదేమిటి? భయంకరమైన నా విషాగ్ని జ్వాలలను సహించడంమాత్రమే కాక తిరిగి నా నూరు పడగలను చితికి చెల్లా చెదరు చేస్తూ, నిర్భయంగా నాట్యం కూడ చేస్తున్నాడే? ఎంతటి ఆశ్చర్యం?

ఓ పరీక్షిన్మహారాజా! బాగా అలసిపోయిన కాళియునికి వివేకం కలిగింది. ఈతడు సామాన్యబాలుడు కాదు. సమస్త చరాచరప్రాణికోటికి ప్రభువు. భగవంతుడు. భక్తికి సంతోషించేవాడు అయిన శ్రీమహావిష్ణువే అయి ఉంటాడని భావిస్తూ భయంతో అతణ్ణి శరణు వేడినాడు.

కాళియుని భార్యలైన నాగాంగనలు శ్రీకృష్ణుని నుతించుట

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

పంచాంగం

No comments:

Post a Comment

Lord Krishna performing Kaliyamardana - శ్రీకృష్ణుడు కాాళియమర్దనము గావించుట

శ్రీకృష్ణుడు కాాళియమర్దనము గావించుట ఓ పరీక్షిన్మహారాజా! ఒకనాడు ఒక్క బలరాముడు తప్ప, శ్రీకృష్ణుడు మిగిలిన గొల్లపిల్లలు అందరు తన వెన్నంటి రాగా,...